ఎర్రచందనం సరిపోక తలనీలాలా?
posted on Mar 30, 2021 @ 4:50PM
తిరుమల శ్రీవారి భక్తుల తలనీలాలు చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. టీటీడీ పెద్దల డైరెక్షన్ లోనే స్మగ్లింగ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అడుగడుగునా సీసీ కెమెరాలు, అత్యంత భద్రత ఉండే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తలనీలాలను తీసుకెళ్లడం అసాధ్యమంటున్నారు. ఇంటిదొంగల సహకారంతోనే స్కాం జరుగుతుందని వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. తిరుపతి వెంకన్నకు భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటన్నారు. స్వామివారి డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు రఘురామ. ఇన్నిరోజులు ఎర్రచందనం, ఇప్పుడు తలనీలాలు దొంగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. రానున్న కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండనుందని.. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి కనీసం మాటకూడా మాట్లాడడం లేదన్నారు. మరో రోమ్ చక్రవర్తిని ఎన్నుకున్నామన్న భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని రఘురామ ఎద్దేవా చేశారు. రుణ ఆంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారే అవకాశాలు తొందరలో ఉన్నాయని నర్సాపురం ఎంపీ హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుందన్నారు.
బీజేపీ-జనసేన పొత్తుపైనా రఘురామ కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ను సీఎంగా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం చూస్తే, వైసీపీకి ప్రమాదమేమో అన్న అనుమానం కలుగుతుందని చెప్పారు. సీబీఐ అధికారులు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఎవరి ఒత్తిడి అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయమని త్వరలో లేఖ రాస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇన్ని రోజులయినా సీబీఐ చేధించకపోవడం బాధాకరమని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.