ఇసుక ట్రాక్టర్లను వదిలేయకపోతే ధర్నా చేస్తా.. ఎస్సైకి ఏపీ మంత్రి వార్నింగ్
posted on Sep 7, 2021 @ 9:40AM
ఆయనో మంత్రి. అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యతలో ఉన్న పెద్ద మనిషి. కాని హోదా మరిచారు. అక్రమ రవాణా కేసులో పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయాలంటూ స్థానిక ఎస్ఐని బెదిరించారు. తాను చెప్పినట్లు వినకపోతే మంత్రినని కూడా చూడకుండా పోలీస్ స్షేషన్ దగ్గర ధర్నా చేస్తానని హెచ్చరించాడు. ఎస్ఐని మంత్రి బెదిరిస్తున్న ఆడియో లీకైంది. వైరల్ గా మారింది. మంత్రి తీరుపై జనాలు తీవ్రంగా ఫైరవుతున్నారు.
కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సైని హెచ్చరిస్తూ ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పిరి మండల పరిధిలోని యాటకల్లుకు చెందిన దాదాపు 40 ట్రాక్టర్ల యజమానులు, కార్యకర్తలు ఆలూరులో ఇటీవల మంత్రిని కలిశారు. పోలీసులు తమ ట్రాక్టర్లను పట్టుకున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.దీంతో మంత్రి జయరాం నేరుగా ఆస్పరి ఎస్సైకి ఫోన్ చేసి, స్పీకర్ ఆన్ చేసి, వారి ముందే మాట్లాడారు. నాలుగు ఖాళీ ట్రాక్టర్లను పట్టుకున్నట్టు తెలిసిందని, వెంటనే వదిలేయాలని ఎస్సైతో మంత్రి అన్నారు. వదలకుంటే తాను మంత్రినన్న విషయాన్ని కూడా మర్చిపోయి ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించారు.
తనకు జనమే కావాలని, తాను ఇక్కడ ఇంకోసారి పోటీ చేయాలని పేర్కొన్న మంత్రి జయరామ్.. ట్రాక్టర్లను వదిలిపెడతారో, ధర్నాకు కూర్చునేలా చేస్తారో తేల్చుకోవాలని హెచ్చరించడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆదోని ట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక తోలుకుంటున్నాయని, ఆస్పరి వాళ్లను మాత్రం ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇసుక ఉంటే విలేకరులెవ్వరూ చూడకపోతే వదిలిపెట్టి ఏదో యవ్వారం చేసుకోవాలని ఎస్సైకి సూచించారు. అక్కడితో ఆగక మన తాలూకాలో ఎక్కడా బతకలేని పరిస్థితి అంటూ ఫోన్ పెట్టేశారు.
మంత్రి ఆడియో వైరల్ కావడంతో జనాలు ఆయనపై ఫైరవుతున్నారు. అక్రమార్కులకు వంతపాడిన అతనిని మంత్రిగా కొనసాగే అర్హత లేదంటున్నారు. వెంటనే జయరామ్ ను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మంత్రి స్పందించారు. తాను బీసీ వర్గానికి చెందిన వాడిని కావడంతో తనపై కావాలనే రెండు మీడియా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ ట్రాక్టర్లను స్టేషన్ కు తీసుకెళ్లారని గ్రామస్థులు చెప్పడంతో.. తాను ఎస్సైతో మాట్లాడానని మంత్రి చెప్పారు.