student

హెడ్మాస్టర్ని కొట్టిన టీచరమ్మ

  నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచరమ్మ. ఆమె స్కూల్లో చదివే పిల్లల్ని కొట్టడం తన జన్మహక్కులా భావిస్తూ వుంటుంది. ఆ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న ఓ బాలిక పలక మీద తనకు చెప్పిన పాఠాన్ని రాసి ఈ టీచరమ్మకి చూపించింది. నిన్ను నోట్ ‌బుక్‌లో రాయమంటే పలక మీద ఎందుకు రాశావంటూ గావు కేకలు వేసిన ఆ టీచరమ్మ విద్యార్థినిని చితకబాదింది. ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిసి స్కూలుకు వచ్చి టీచరమ్మని ఈ విషయమై ప్రశ్నించారు. టీచరమ్మ మెట్టు దిగకుండా ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో ఆ స్కూలు హెడ్ మాస్టర్ వచ్చి ఈ మొత్తం ఇష్యూలో టీచరమ్మదే తప్పని అంటూ విద్యార్థిని తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచాడు. అంతే టీచరమ్మ గారి ఆగ్రహం హెడ్ మాస్టర్ వైపు టర్న్ అయింది. ఆయన మీద గయ్యిమని విరుచుకుపడింది. తనకు కాకుండా విద్యార్థి తల్లిందండ్రులకు మద్దతు ఇస్తావేంటని ఆయన్ని తిట్టడం మొదలుపెట్టింది. అక్కడితో ఆగకుండా కాలి చెప్పు తీసి హెడ్ మాస్టర్ని కొట్టింది. ఈ టీచరమ్మ నిర్వాకం చూసి అందరూ ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. ఈమె వ్యవహార శైలి మీద హెడ్ మాస్టర్ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

ips Kiran Bedi turned emotional delhi elections

కిరణ్ బేడీ భావోద్వేగం... కంట తడి

  దేశంలో ప్రథమ ఐపీఎస్ ఆఫీసర్‌గా, ఎంతో మనోస్థైర్యం వున్న మహిళగా, ఎన్నో విపత్కర పరిస్థితులను చాకచక్యంగా డీల్ చేసిన మహిళగా పేరున్న కిరణ్ బేడీ కంట తడి పెట్టారు. కిరణ్ బేడీ లాంటి మహిళ కంట తడి పెట్టారంటే అదేదో చాలా కీలకమైన సందర్భమే అయి వుంటుంది. కిరణ్ బేడీ ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేస్తూ, భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేసులో వున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతూ వుండటంతో ఆమె ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమై వున్నారు. ఢిల్లీలోని గల్లీ గల్లీకి తిరుగుతున్న ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ సొంత ఆడపడుచు తమ దగ్గరకి వచ్చినట్టుగా ఆమెకు స్వాగతం పలుకుతూ ఆదరిస్తున్నారు. ఢిల్లీ ప్రజల నుంచి తనకు లభిస్తున్న ఆదరణ చూసి కిరణ్ బేడీ చలించిపోయారు. బుధవారం నాడు ఆమె ఎమోషనల్‌గా ఫీలై కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలా ఆదరిస్తున్న ఢిల్లీ ప్రజలు రేపు పోలింగ్ ‌రోజు కూడా ఇదే ఆదరణ ప్రదర్శిస్తారా అనేది అందరం వేచి చూడాలి.

jordan pilot  pilot

ఉగ్రవాదుల మీద ప్రతీకారం

  ఈమధ్యకాలంలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్ - ఇసిస్) ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తమకు దొరికిన వివిధ దేశాలకు చెందిన బందీల తలలు నరికి వాటిని ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళ వీరోచిత కార్యాలకు ఆకర్షితులవుతున్న అనేకమంది ఇందులో చేరడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ తీవ్రవాదులే జనాన్ని చంపుతూ వచ్చారు. తాజాగా జోర్డాన్ ప్రభుత్వం ఈ సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదుల్ని చంపేసింది. చంపడం అనేది తమకూ వచ్చని జోర్డాన్ ప్రభుత్వం ఈ ఘటన ద్వారా తీవ్రవాదులకు హెచ్చరికలు పంపింది. ఇసిస్ తీవ్రవాదులు 2013లో జోర్డాన్‌కి చెందిన మోజ్ అల్ కసస్ బెహ్ అనే పైలెట్‌ని బంధించి మంగళవారం నాడు దారుణంగా హత్య చేశారు. ఆ పైలెట్‌ని ఓ బోనులో పెట్టి మీద పెట్రోలు పోసి నిప్పు  అంటించారు. ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టారు. ఈ కేసులో పట్టుబడిన ఇద్దరు తీవ్రవాదులు జోర్డాన్ ప్రభుత్వం అధీనంలోనే వున్నారు. మంగళవారం నాడు వీళ్ళిద్దర్నీ జోర్డాన్ ప్రభుత్వం ఉరితీసి చంపింది. ఇకమీదట తమకు పట్టుబడిన ఏ తీవ్రవాదినైనా ఎలాంటి విచారణ లేకుండా ఉరి తీసి చంపేస్తామని జోర్డాన్ ప్రభుత్వం హెచ్చరించింది.

angry Elopements chittoor district Crowd Elephant Death krishnagiri

యాంగ్రీ ఏనుగులు

  చిత్తూరు - తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు ఈమధ్యకాలంలో అడవిలోంచి బయటకి వచ్చి గ్రామాల మీద పడి గందరగోళం చేస్తున్నాయి. ఏనుగుల ధాటికి జనం కకావికలు అయిపోతున్నారు. ఎవరూ ఏమీ చేయకుండానే ఏనుగులు రెచ్చిపోతూ వుంటాయి.. అలాంటిది వాటి మందలోని ఓ ఏనుగుకు ఏమైనా జరిగితే పరిస్థితి ఎలా వుంటుంది? ఏమవుతుందో ప్రత్యక్షంగా నిరూపించే ఘటన చిత్తూరు - తమిళనాడు సరిహద్దులో జరిగింది. కృష్ణగిరి - హోసూరు జాతీయ రహదారి మీద ఓ ఏనుగుల మంద రోడ్డును దాటుతోంది. రోడ్డుకు రెండు వైపులా వాహనాలు ఆగిపోయి ఏనుగులు వెళ్ళిపోయేవరకూ ఇంజన్లను కూడా ఆపుకుని వున్నాయి. అయితే ఇంతలో ఓ కారు వేగంగా వెళ్ళి మందలో వున్న ఒక ఏనుగును బలంగా ఢీకొంది. అంతే పాపం ఆ ఏనుగు అక్కడికక్కడే మరణించింది. తమ మందలోని సహచర ఏనుగు మరణించేసరికి మిగతా ఏనుగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఏనుగును ఢీకొట్టిన కారు మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేసేశాయి. కారులో వున్నవారికి భూమ్మీద నూకలుండి తప్పించుకున్నారు. కారును పూర్తిగా ధ్వంసం చేశాకగానీ ఏనుగుల ఆగ్రహం చల్లారలేదు. ఆ తర్వాత ఏనుగులు అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో ఏనుగుల దృష్టి రోడ్డుకు అటూ ఇటూ ఉన్న వాహనాల మీద పడి వుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించడానికే భయమేస్తోందని స్థానికులు అంటున్నారు.

patas mentioned scenes police complaint

‘పటాస్’ పోస్టర్లపై ఫిర్యాదు

  నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మీద, పోస్టర్ల మీద ఫిర్యాదు నమోదైంది. ‘పటాస్’ అనే టైటిల్‌లో ‘టా’ అనే అక్షరం మీద దేశం మొత్తం గౌరవించే మూడు సింహాల గుర్తును ఉపయోగించారని, అలాగే కొన్ని పోస్టర్లలో హీరోయిన్ అర్ధనగ్నంగా వుండి మూడు సింహాల గుర్తు మీద చెయ్యి వేసి నిల్చుని వుంటుందని ఇది నేరమని ఒక వ్యక్తి హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ సినిమాలో హీరో ధూమపానం చేసే దృశ్యాలు కూడా చాలా అభ్యంతరకరంగా వున్నాయని పేర్కొన్నారు. సినిమాలను ఆదర్శంగా తీసుకునే యువతరాన్ని తప్పుదోవ పట్టించే అంశాలు ఈ సినిమాలో అనేకం వున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్పందించి ‘పటాస్’ సినిమా మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.

rudramadevi audio leak

‘రుద్రమదేవి’ ఆడియో లీక్

  తెలుగు సినిమా రంగంలో గతంలో గోల్డెన్ ఏజ్ నడిచింది. ఇప్పుడు మిగతా అన్ని ఏజ్‌ దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ‘లీకేజ్’ నడుస్తోంది. తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియోలు లీక్ కావడం ఈమధ్యకాలంలో మామూలైపోయింది. మొన్నీమధ్యే ‘బాహుబలి’ సినిమాకి సంబంధించిన 13 నిమిషాల వీడియో లీక్ అయింది. సినిమాలోనే అతి కీలకమైన ఆ వీడియో ఫుటేజ్‌ని గ్రాఫిక్స్ సంస్థకి చెందిన మాజీ ఉద్యోగి ఒకరు లీక్ చేశారని బయటపడింది. ‘బాహుబలి’ వీడియో లీక్ అయిన వేడి ఇంకా చల్లారకముందే ఇప్పుడు మరో లీకేజ్ బయటపడింది. అనుష్క ప్రధాన పాత్రధారిగా నటిస్తుండగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రుద్రమదేవి’ ఆడియో లీక్ అయింది. ఈ సినిమా పాటలు ఆడియో విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ‘రుద్రమదేవి’ సంగీతం ఎవరిద్వారా ఇంటర్నెట్‌లో లీక్ అయిందో ఇంకా తెలియరాలేదు. ఇటీవల లీకేజ్ ప్రాబ్లమ్ ఎదుర్కొన్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’... ఈ రెండు సినిమాల్లోనూ అనుష్క హీరోయిన్ కావడం విశేషం.

Under Social Media PressureActor Mohanlal Offers To Return National Games Performance Fee

పాపం మోహన్‌లాల్

  మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈమధ్య కేరళలో జాతీయ క్రీడల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌లాల్ లాలిజమ్ పేరుతో ఒక సంగీత ప్రదర్శన ఇచ్చాడు. ఈ ప్రదర్శనకు మోహన్‌లాల్ అక్షరాలా కోటిన్నర పారితోషికం ప్రభుత్వం నుంచి పుచ్చుకున్నాడు. అయితే ఈ ప్రోగ్రాం చెత్తన్నర చెత్తగా వుందని మోహన్‌లాల్ టీమ్ ప్రదర్శన ఇచ్చినప్పుడే అందరూ పెదవి విరిచారు. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో మోహన్‌లాల్‌కి కష్టాలు మొదలయ్యాయి. ఒక చెత్త ప్రదర్శన ఇచ్చి మోహన్‌లాల్ అప్పనంగా కోటిన్నర కొట్టేశాడంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మోహన్‌లాల్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టారు. దాంతో మోహన్‌లాల్ వివరణ ఇచ్చాడు. ఈ ప్రోగ్రాం కోసం తమ టీమ్ చాలా కష్టపడిందని, ఆ కష్టాన్ని గుర్తించని వారిని తాను ఏమీ అనబోనని అన్నారు. అయితే కేరళ ప్రభుత్వం నుంచి తాను తీసుకున్న డబ్బు మొత్తాన్నీ తిరిగి ఇచ్చేస్తానని, ఇకనైనా సోషల్ మీడియాలో తనను తిట్టడం ఆపేయాలని వేడుకున్నాడు. పాపం మోహన్‌లాల్!

music director chakri

చక్రి ఫ్యామిలీ.. మరో గొడవ...

  సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి, చక్రి తరఫు బంధువుల మధ్య ఆస్తి గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మొన్నటి వరకు ఒకరి మీద మరొకరు ఆరోపణలు మాత్రమే చేసుకున్నారు. ఇప్పుడు వ్యవహారం దాడుల వరకు వెళ్ళినట్టు తెలుస్తోంది. చక్రి సోదరుడు మహిత్ నారాయణకు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో కార్యాలయం వుంది. తన కార్యాలయం మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మహిత్ మంగళవారం నాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి తన కార్యాలయం మీద దాడి జరిగిందని, గుర్తు తెలియని దుండగులు తన కార్యాలయం ఫర్నిచర్‌ని దగ్ధం చేశారని మహిత్ నారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా వుండగా చక్రి భార్య శ్రావణి కూడా మంగళవారం నాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. ఆమె మహిత్ నారాయణ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టు తెలుస్తోంది.

bollywood Arjun Rampal

హీరో గారికి నోటీసులు

  అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లీతో సంబంధాలున్నాయన్న ఆరోపణల మీద బాలీవుడ్ హీరో అర్జున్ రామ్‌పాల్‌కి ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. అరుణ్ గావ్లీ లాంటి అండర్ వరల్డ్ డాన్‌ని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అర్జున్ రామ్‌పాల్ ప్రస్తుతం ‘డాడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఒక డాన్ పాత్రలో కనిపిస్తారు. ఈ డాన్ పాత్రను అరుణ్ గావ్లీని పోలి వుంటుందని తెలుస్తోంది. ఈ పాత్రను రక్తికట్టంచడం కోసం అర్జున్ రామ్‌పాల్ డైరెక్టుగా అరుణ్ గావ్లీనే పరిశీలిస్తే ఓ పనైపోతుంది కదా అనుకున్నాడు. అరుణ్ గావ్లీ కమలాకర్ అనే కార్పొరేటన్ హత్య కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గత డిసెంబర్‌లో అనారోగ్యంతో కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలో అర్జున్ రామ్‌పాల్ అరుణ్ గావ్లీని కలిసి ఆయనతో మూడు గంటలపాటు చర్చించాడు. కేవలం పాత్ర పోషణకు మాత్రమే తాను అరుణ్ గావ్లీని కలిసినట్టు అర్జున్ రామ్‌పాల్ చెబుతున్నప్పటికీ ముంబై పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అర్జున్ రామ్‌పాల్‌కి అరుణ్ గావ్లీతో సన్నిహిత సంబంధాలు ఉండే అవకాశం వుందని భావిస్తున్నారు. అందుకే ఆయనకు నోటీసులు జారీ చేశారు.

GHMC

జి.హెచ్.యం.సి. ఎన్నికలు ఎప్పుడు? హైకోర్టు

  గత డిశంబరు 3తో జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసింది. కానీ ఇంతవరకు దానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతోందో తెలంగాణా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో, ఒక ప్రజా ప్రయోజన పిటిషన్ హైకోర్టులో దాఖలయింది. దానిపై కోర్టు స్పందిస్తూ తెలంగాణా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఎన్నికల షెడ్యుల్ తో సహా పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించవలసిందిగా ఆదేశించింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ నెలలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిద్దామనుకొన్నట్లు సమాచారం. కానీ ఇకపై ఏ మాత్రం ఆలశ్యం చేసేందుకు కోర్టు అనుమతించకపోవచ్చును గనుక వీలయినంత తొందరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. పెరిగిన జనాభాకి అనుగుణంగా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న150 వార్డులను పునర్విభజించి 170 వార్డులుగా మార్చడంలో జరుగుతున్న జాప్యం కారణంగానే ఎన్నికలు నిర్వహించలేకపోతునట్లు ప్రభుత్వం కోర్టుకి సంజాయిషీ ఇవ్వవచ్చును. కోర్టు కేవలం వారం రోజులే సమయం మాత్రమే ఇచ్చింది గనుక ఆరోజునే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయం కూడా స్పష్టం అయిపోవచ్చును.

TRS party

తెరాస విస్తృత స్థాయి సమావేశం నేడే

  తెరాస పార్టీ విస్తృత సమావేశం ఈరోజు హైదరాబాద్ కొంపల్లిలో జరగనుంది. రాష్ట్రం నలు మూలల నుండి దాదాపు 3,500 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ లక్ష్యాలను అందుకు పార్టీ నేతలు అనుసరించ వలసిన వ్యూహాలను నిర్దేశిస్తారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ అంతర్గత నిర్మాణం కోసం గ్రామ స్థాయి నుండి కమిటీల ఏర్పాటు, పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకొంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పార్టీ నేతలకి వివరించి వాటిని ప్రజలలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పవచ్చును. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నిర్వహిస్తున్న మొట్టమొదటి పార్టీ కార్యక్రమం ఇది. కనుక తెరాస నేతలు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

Andhra Pradesh

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు లేనట్లే

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. సుమారు రూ.7500 కోట్ల లోటును పూడ్చుకోనేందుకు కనీసం 10 శాతం విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించాలని ఈ.ఆర్.సి. చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు అందరూ నిర్ద్వందంగా తిరస్కరించారు. కనుక ఇక ఇప్పట్లో విద్యుత్ చార్జీల పెంపు లేనట్లే భావించవచ్చును.   ఇక ఈ సమావేశంలో మరొక ముఖ్యమయిన నిర్ణయం తీసుకొన్నారు. తెలంగాణా ప్రభుత్వం తమతో కలిసి రావడం లేదు కనుక ఎంసెట్ పరీక్షలు వేరుగా నిర్వహించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. కనుక ఈ వ్యవహారంపై ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గొడవ ముగిసినట్లే భావించవచ్చును. కాకినాడ జే.యాన్.టీ.యు.కి ఈ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించబడవచ్చును.   ఇక తుళ్ళూరులో రాజధాని నిర్మించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తరువాత రాజధాని ప్రాంతంలో రాత్రికి రాత్రి అనేక అక్రమ లే అవుట్లు వెలిసాయి. వాటన్నిటినీ రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సౌర విద్యుత్ పాలసీ మరియు సింగిల్ విండో పద్దతిలో పరిశ్రమలకు అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ‘స్వైన్ ఫ్లూ’ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించిన తరువాత అందుకు అవసరమయిన అన్ని చర్యలు తక్షణమే చెప్పట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Congress

అరవింద్ కేజ్రీవాల్ కి కోర్టు నోటీసులు!

  మరొక ఐదు రోజుల్లోడిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బొత్తిగా విజయావకాశాలు లేవని తెలిసినప్పటికీ ప్రయత్నా లోపం లేకుండా తనవంతు కృషి తను చేస్తోంది. ఆమాద్మీ పార్టీ యొక్క ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ వాలియా ఆయనపై హైకోర్టులో ఒక పిటిషను వేశారు.   ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పరిధిలో నివాసముంటున్న అరవింద్ కేజ్రీవాల్, డిల్లీలో బికె దత్ నగర్ లో శాశ్విత నివాసముంటున్నట్లుగా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, కనుక ఆయనను ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని ఆమె కోర్టును కోరారు. ఆమె పిటిషన్ పై స్పందించిన డిల్లీ హైకోర్టు బుధవారంలోగా ఈ ఆరోపణలపై కోర్టుకు సంజాయిషీ ఇవ్వలసిందిగా ఆదేశిస్తూ ఈరోజు నోటీసులు జారీ చేసింది.   అయితే అరవింద్ కేజ్రీవాల్ క్రిందటిసారి డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కూడా అదే తన శాశ్విత చిరునామాగా పేర్కొన్నారు. అది నిజం కాకపోయుంటే అప్పుడే ఆయనపై ఇటువంటి కేసు నమోదు అయ్యేది. కానీ కాలేదు. అంటే కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ వాలియా ఆయనపై బురద జల్లి ఆయన విజయావకాశాలు దెబ్బ తీసేందుకే కోర్టుకెక్కి ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో ఇటువంటి చవకబారు ఆలోచనలు చేయడం అలవాటే. అందుకే మళ్ళీ ఇటువంటి ఆలోచన చేసిందని సరిపెట్టుకోవాలి.

Sri Lanka

శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల భారత్ పర్యటన ఖరారు

  శ్రీలంక అధ్యక్షడు మైత్రీపాల్ సిరిసేన ఈనెల 16న భారత్ కి రానున్నారు. శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టిన తరువాత ఆయన మొట్టమొదటగా భారత్ పర్యటనకే మొగ్గు చూపడం, భారత్ పట్ల శ్రీలంక వైఖరిలో చాలా మార్పు వచ్చినట్లు స్పష్టమయిన సంకేతం ఇస్తోంది. ఆయన భారత్ లో రెండు రోజులు పర్యటిస్తారు. అనంతరం మార్చి 13 నుండి 15వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంకలో పర్యటిస్తారు. ఇంతకు ముందు మహేంద్ర రాజపక్స శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన భారత్ ని కాదని చైనాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఆ కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ ఇప్పుడు మైత్రీపాల శ్రీలంక ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన తరువాత ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మైత్రీపాల సిరిసేన భారత్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడంతో ఇరు దేశాలలో తమిళులు కూడా చాలా సంతోషిస్తున్నారు.

డిల్లీలో కాంగ్రెస్ పార్టీదే విజయం అట!

  డిల్లీ అసెంబ్లీకి ఈ నెల ఏడున ఎన్నికలు జరగనున్నాయి కనుక మూడు ప్రధాన రాజకీయపార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకొంది. కానీ ఈ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఇంతవరకు నిర్వహించిన సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. తాజా సర్వేలో కూడా పోటీ ప్రధానంగా బీజేపీ, ఆమాద్మీ పార్టీ ల మధ్యనే ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు వచ్చిన 8 సీట్లలో అతికష్టం మీద 3-4 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు తేల్చి చెప్పాయి. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తమదే విజయం అని చెప్పుకొంటోంది.   ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిల్లీలో నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొని మోడీని ప్రచారక్ అని అరవింద్ కేజ్రీవాల్ ధర్నాల మంత్రి అని విమర్శించారు. కనుక ప్రజలు తమ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తే సుస్థిరమయిన, సమర్ధమయిన పరిపాలన అందించగలమని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల తరువాత ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో వరుస పరాజయాలు పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో కనీసం గతంలో సాధించినన్ని సీట్లు కూడా గెలవలేదని సర్వేలన్నీ స్పష్టంగా చెపుతున్నప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకొని, తప్పులను సరిదిద్దుకొని, పార్టీని ప్రక్షాళన చేసి సరికొత్త నాయకులతో, విధానాలతో ప్రజల ముందుకు వెళ్ళవలసింది పోయి, ఈవిధంగా ఆత్మవిశ్వాసం ప్రదర్శించగలడం ఆశ్చర్యం కలిగిస్తున్నా ఆ పార్టీ దైర్యాన్ని మెచ్చుకోవలసిందే.

ఆంధ్ర, తెలంగాణా ప్రజల నెత్తిన రూ.1. 66 లక్షల కోట్ల రుణ భారం

  రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో సహా దేశ, విదేశాలలో పలు ఆర్ధిక సంస్థల నుండి తీసుకొన్న అప్పు మొత్తం రూ. 1.66 లక్షల కోట్లని కేంద్ర ఆర్ధిక శాఖ తేల్చి చెప్పింది. ఇప్పుడు అందులో వివాద రహితమయిన అప్పు రూ.1.48లక్షల కోట్లను ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంచి పెట్టగా అందులో ఆంద్ర వాటా రూ.86.34 వేల కోట్లుగా, తెలంగాణా రాష్ట్ర వాటాగా రూ.61.71 వేల కోట్ల అప్పులు తీర్చవలసి ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పింది.   మిగిలిన రూ.18.43 వేల కోట్లలో ఏ ప్రాంతంలో ఎంత మొత్తం దేనికోసం ఖర్చు పెట్టారనే విషయాన్ని అకౌంటంట్ జనరల్ స్వయంగా పరిశీలించి నిర్ణయించిన తరువాత దానిని కూడా ఇరు రాష్ట్రాలకు పంచుతారు. హైదరాబాద్ లేదా తెలంగాణా ప్రాంతాలలో చేప్పట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించిన సొమ్మును తెలంగాణా ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రాలో చేసిన ఖర్చులను ఆంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

ఈరోజు ఆంద్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

  ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా విద్యుత్ చార్జీల పెంపు, రాజధాని భూసేకరణ, తెలంగాణా ప్రభుత్వ ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తన వివిధ శాఖలలో ఉన్నత విద్యామండలికి చెందిన రూ.120 కోట్లను స్తంభింపజేయడం, పంట రుణాల రెండవ దశ రుణమాఫీ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి, అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మాణం, అక్కడికి హైదరాబాద్ నుండి ఉద్యోగుల తరలింపు, వారి అభ్యంతరాలు తదితర అంశాలపై చర్చ జరుగవచ్చును.   ముఖ్యంగా విద్యుత్ చార్జీల పెంపుపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. విద్యుత్ చార్జీలను పెంచకుండా యధాతధంగా ఉంచదలిస్తే ఏప్రిల్ నుండి మొదలయ్యే ఆర్ధిక సం.లో రూ.7716 కోట్లు లోటు ఏర్పడుతుందని దానిని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉంటుందని లేదా 10 నుండి 15శాతం వరకు విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వానికి తెలియజేసాయి. కనుక ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. బహుశః ఇంతకు ముందులాగే నెలకి వంద యూనిట్లు కంటే తక్కువ వాడుకొనేవారిపై ఈ అదనపు భారం మోపకుండా, ఆ పై తరగతుల వారికి ఆ భారం అంతా సర్దుబాటు చేయవచ్చును.

చంద్రబాబు వరంగల్ పర్యటన ఖరారు

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండో తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించ బోతున్నారు. ఆయనతో బాటు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా బయలుదేరే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఆరోజు ఉదయం పదకుండు గంటలకు వరంగల్ పట్టణం చేరుకొని అక్కడ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తరువాత పట్టణంలో వివిధ ప్రాంతాలు పర్యటించి ప్రజలతో మాట్లాడుతారు.   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత చంద్రబాబు నాయుడు మొట్ట మొదటి సారిగా తెలంగాణా జిల్లాలో పర్యటించబోతున్నారు. కనుక ఆయన పర్యటన విజయవంతం అయ్యేందుకు పార్టీ తెలంగాణా నేతలందరూ గట్టిగ కృషి చేస్తారని అందరికీ తెలుసు.  కానీ ఆయన తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకొంటామని బాధ్యతాయుతమయిన మంత్రి పదవిలో ఉన్న మహేంద్ర రెడ్డి ప్రకటించడం చాలా విస్మయం కలిగిస్తోంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు తెలంగాణా ప్రభుత్వం ప్రోటోకాల్ పద్దతులన్నీ విధిగా పాటించవలసి ఉంటుంది కనుక ఒకవేళ నిజంగా అడ్డుకొనే ప్రయత్నం చేస్తే దాని వలన ఆయనే న్యాయపరమయిన చిక్కులోపడే అవకాశం ఉంటుంది. కనుక కేవలం మాటల యుద్ధంతోనే సరిపెట్టవచ్చు లేదా తెరాస కార్యకర్తలు నల్ల జెండాల ప్రదర్శన చేయవచ్చును.   వరంగల్ యంపీ కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున ఆయన తన యంపీ పదవికి రాజీనామా చేసారు. కనుక ఆ స్థానానికి మళ్ళీ త్వరలో ఉపఎన్నిక జరుగబోతోంది. చంద్రబాబు నాయుడు తన వరంగల్ పర్యటనలో పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసి, ఉపఎన్నికలకు పార్టీ సమాయత్తపరచవచ్చును. పార్టీ అభ్యర్ధిగా మోత్కుపల్లి నరసింహులుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అనధికార సమాచారం. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇదే పని మీద వరంగల్లో పర్యటించే మాటయితే ఆయనను అడ్డుకొని తెరాస అనవసరంగా రభస చేయడం మంచిది కాదు.