ఈరోజు ఆంద్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా విద్యుత్ చార్జీల పెంపు, రాజధాని భూసేకరణ, తెలంగాణా ప్రభుత్వ ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తన వివిధ శాఖలలో ఉన్నత విద్యామండలికి చెందిన రూ.120 కోట్లను స్తంభింపజేయడం, పంట రుణాల రెండవ దశ రుణమాఫీ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి, అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మాణం, అక్కడికి హైదరాబాద్ నుండి ఉద్యోగుల తరలింపు, వారి అభ్యంతరాలు తదితర అంశాలపై చర్చ జరుగవచ్చును.
ముఖ్యంగా విద్యుత్ చార్జీల పెంపుపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. విద్యుత్ చార్జీలను పెంచకుండా యధాతధంగా ఉంచదలిస్తే ఏప్రిల్ నుండి మొదలయ్యే ఆర్ధిక సం.లో రూ.7716 కోట్లు లోటు ఏర్పడుతుందని దానిని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉంటుందని లేదా 10 నుండి 15శాతం వరకు విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వానికి తెలియజేసాయి. కనుక ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. బహుశః ఇంతకు ముందులాగే నెలకి వంద యూనిట్లు కంటే తక్కువ వాడుకొనేవారిపై ఈ అదనపు భారం మోపకుండా, ఆ పై తరగతుల వారికి ఆ భారం అంతా సర్దుబాటు చేయవచ్చును.