జి.హెచ్.యం.సి. ఎన్నికలు ఎప్పుడు? హైకోర్టు
posted on Feb 3, 2015 @ 10:34AM
గత డిశంబరు 3తో జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిసింది. కానీ ఇంతవరకు దానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతోందో తెలంగాణా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో, ఒక ప్రజా ప్రయోజన పిటిషన్ హైకోర్టులో దాఖలయింది. దానిపై కోర్టు స్పందిస్తూ తెలంగాణా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఎన్నికల షెడ్యుల్ తో సహా పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించవలసిందిగా ఆదేశించింది.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిద్దామనుకొన్నట్లు సమాచారం. కానీ ఇకపై ఏ మాత్రం ఆలశ్యం చేసేందుకు కోర్టు అనుమతించకపోవచ్చును గనుక వీలయినంత తొందరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. పెరిగిన జనాభాకి అనుగుణంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న150 వార్డులను పునర్విభజించి 170 వార్డులుగా మార్చడంలో జరుగుతున్న జాప్యం కారణంగానే ఎన్నికలు నిర్వహించలేకపోతునట్లు ప్రభుత్వం కోర్టుకి సంజాయిషీ ఇవ్వవచ్చును. కోర్టు కేవలం వారం రోజులే సమయం మాత్రమే ఇచ్చింది గనుక ఆరోజునే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయం కూడా స్పష్టం అయిపోవచ్చును.