చంద్రబాబు వరంగల్ పర్యటన ఖరారు

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండో తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించ బోతున్నారు. ఆయనతో బాటు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా బయలుదేరే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఆరోజు ఉదయం పదకుండు గంటలకు వరంగల్ పట్టణం చేరుకొని అక్కడ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తరువాత పట్టణంలో వివిధ ప్రాంతాలు పర్యటించి ప్రజలతో మాట్లాడుతారు.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత చంద్రబాబు నాయుడు మొట్ట మొదటి సారిగా తెలంగాణా జిల్లాలో పర్యటించబోతున్నారు. కనుక ఆయన పర్యటన విజయవంతం అయ్యేందుకు పార్టీ తెలంగాణా నేతలందరూ గట్టిగ కృషి చేస్తారని అందరికీ తెలుసు.  కానీ ఆయన తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకొంటామని బాధ్యతాయుతమయిన మంత్రి పదవిలో ఉన్న మహేంద్ర రెడ్డి ప్రకటించడం చాలా విస్మయం కలిగిస్తోంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు తెలంగాణా ప్రభుత్వం ప్రోటోకాల్ పద్దతులన్నీ విధిగా పాటించవలసి ఉంటుంది కనుక ఒకవేళ నిజంగా అడ్డుకొనే ప్రయత్నం చేస్తే దాని వలన ఆయనే న్యాయపరమయిన చిక్కులోపడే అవకాశం ఉంటుంది. కనుక కేవలం మాటల యుద్ధంతోనే సరిపెట్టవచ్చు లేదా తెరాస కార్యకర్తలు నల్ల జెండాల ప్రదర్శన చేయవచ్చును.

 

వరంగల్ యంపీ కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున ఆయన తన యంపీ పదవికి రాజీనామా చేసారు. కనుక ఆ స్థానానికి మళ్ళీ త్వరలో ఉపఎన్నిక జరుగబోతోంది. చంద్రబాబు నాయుడు తన వరంగల్ పర్యటనలో పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసి, ఉపఎన్నికలకు పార్టీ సమాయత్తపరచవచ్చును. పార్టీ అభ్యర్ధిగా మోత్కుపల్లి నరసింహులుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అనధికార సమాచారం. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇదే పని మీద వరంగల్లో పర్యటించే మాటయితే ఆయనను అడ్డుకొని తెరాస అనవసరంగా రభస చేయడం మంచిది కాదు.

Teluguone gnews banner