కాశ్మీర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డట్లే ఉంది
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, అందులో భాగస్వామిగా ఉన్న బీజేపీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మొదటిరోజు నుండే మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు.
“మా రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుపుకొనిచ్చినందుకు పాక్ ఉగ్రవాదులకు, కాశ్మీర్ వేర్పాటువాదులకు ధాంక్స్!” అని చెప్పడంతో మొదలుపెట్టిన డ్రామా, కేంద్రానికి చెప్పకుండా, దాని అనుమతి తీసుకోకుండా మసరత్ ఆలమ్ అనే కరడుగట్టిన వేర్పాటువాదిని బారాముల్లా జైలు నుండి విడుదల చేసి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చేసారు.
ఆయన చేసిన పనికి పార్లమెంటులో ప్రతిపక్షాలకు సంజాయిషీలు ఇచ్చుకోలేక ఎన్డీయే ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. “దేశభద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకొంటామని” ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో సభ్యులకు హామీ ఇవ్వవలసి వచ్చింది.
ఆ సంగతి తెలిసుకొన్న ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఓ కౌంటర్ ఇచ్చేరు వెంటనే. అది చూసి బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ముఫ్తీ మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పూర్తిగా రాజ్యాంగబద్దమయినదే. మసరత్ ఆలమ్ విడుదల వలన రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొంటాయి. అందుకే విడుదల చేసాము. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా మా నిర్ణయాన్ని వ్యతిరేకించరాదు. అది కూడా మాకు మద్దతు ఇవ్వాలి,” అని అన్నారు.
ఆయన దూకుడు చూస్తుంటే తన ప్రభుత్వం పడిపోయినా పరువాలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు, కాశ్మీర్ వేర్పాటువాదులు తనకు అండగా నిలబడితే చాలన్నట్లుంది ఆయన వైఖరి. వారికోసం ఎంతకయినా తెగించేందుకు సిద్దం అన్నట్లుగా ఉన్నాయి ఆయన మాటలు.
మరి అటువంటి ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తూ, ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే ఊహించుకావచ్చును. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ముఫ్తీ మొహమ్మద్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకొని బయటకు రావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ముఫ్తీ మొహమ్మద్ కూడా సిద్దంగానే ఉన్నట్లు కనబడుతున్నారు. భిన్న దృవాలవంటి తమ రెండు పార్టీల కలయిక చాలా అపూర్వమయినదని బీజేపీ, పీడీపీలు యుగళ గీతం పాడుకొని పట్టుమని పది రోజులు కాలేదు. మళ్ళీ ఇంతలోనే “టాటా...గుడ్ బై...వీడికోలు...”అంటూ మరో పాత పాటని కొత్తగా పాడుకొనే సమయం దగ్గర పడినట్లే ఉంది.
ఒకవేళ ఇప్పుడు ముఫ్తీ మొహమ్మద్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని, జైలు నుండి విడుదల చేసిన ఆ వేర్పాటువాదిని మళ్ళీ అరెస్ట్ చేయలేరు. చేస్తే వాళ్ళు ఆయనని కాల్చి పారేసినా ఆశ్చర్యం లేదు. ఒక సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా వేర్పాటువాదిని వదిలిపెడితే, దానితో తనకు సంబంధం లేదని కేంద్రం చేతులు దులుపుకోలేదు. ఈరోజు ఉపేక్షిస్తే ఆయన రేపు జైలులో ఉన్న తీవ్రవాదులందరినీ విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. కనుక కేంద్రం తక్షణమే చర్యలు చేప్పట్టక తప్పదు. అయితే అందుకు అంగీకరించబోమని ముఫ్తీ ముందే విస్పష్టంగా చెప్పారు. కనుక ఇక జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడినట్లే భావించవచ్చును.