NTR Statue

గోదావరి నది మధ్య యన్టీఆర్ విగ్రహం?

  తాజా సమాచారం ప్రకారం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రి వద్ద గోదావరి నది మధ్యలో మాజీ ముఖ్యమంత్రి మరియు తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి భారీ విగ్రహం స్థాపించబోతోంది. ఈ విగ్రహాన్ని గోదావరి పుష్కరాల సమయంలోనే ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన సన్నాహాలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ భారీ విగ్రహాన్ని యన్.డి. తేజ అనే శిల్పి పశ్చిమ గోదావరి జిల్లాలో తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది.   ఇదివరకు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ మధ్యలో గల జీబ్రాల్టార్ రాక్ మీద భారీ విగ్రహం స్థాపించారు. ఇప్పుడు ప్రతిష్టించబోయే యన్టీఆర్ విగ్రహం కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది, అక్కడిలాగే గోదావరి నదిలో కూడా విగ్రహం ప్రతిష్టించిన చోట ఒక మంచి పార్క్ నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది మధ్యలో త్వరలో నిర్మించబోయే రాజధాని నగరానికి అభిముఖంగా ఈ విగ్రహం ప్రతిష్టించాలని భావించినట్లు వార్తలు వచ్చేయి. స్వర్గీయ యన్టీఆర్ కి కృష్ణా జిల్లాకి అవినాబావ సంబంధం ఉంది కనుక అక్కడే ఆయన విగ్రహం ప్రతిష్టిస్తారని అందరూ భావిస్తుంటే అకస్మాత్తుగా ఈ వార్త వెలువడింది. కానీ దీనిని అధికారికంగా ఎవరూ దృవీకరించలేదు.

Land acquisition Bill

భూసేకరణ బిల్లు సవరణకు లోక్ సభ ఆమోదం

  ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి లోక్ సభ ఆమోదముద్ర వేసింది. గతేడాది యూపియే హయాంలో పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లులో ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా 11 సవరణలు చేసింది. అయితే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. లోక్ సభలో ఈ బిల్లుకి ఎన్డీయే భాగస్వాములయిన శివసేన, తెదేపా, అకాలీదళ్ పార్టీలు మద్దతు తెలుపగా కాంగ్రెస్, తెరాస మరియు బీజేడీ వ్యతిరేకిస్తూ సభ నుండి వాక్ అవుట్ చేసాయి. లోక్ సభలో ఎన్డీయే కూటమికి పూర్తి మెజార్టీ ఉంది కనుక అవలీలగా ఆమోదింప జేసుకోగలిగింది. కానీ రాజ్యసభలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలదే బలం గనుక రాజ్యసభలో ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీయే ప్రభుత్వం చాలా శ్రమ పడకతప్పదు.

 nagarjuna

మన్మధుడి ప్రశంసల వర్షం

  మన్మధుడు ఈ పేరువింటే మనకు వెంటనే గుర్తొచ్చేపేరు నాగార్జున. అలాంటి నాగార్జునే అందంగా ఉన్నారని పొడిగితే ఎలా ఉంటుంది. ఇంతకీ నాగార్జున పొగిడింది ఎవరిని అనుకుంటున్నారా. మరెవరినో కాదండీ తన సరసన పలు చిత్రాల్లో నటించి తన కంటూ ఒక స్టైల్ ను ఏర్పరుచుకున్న హీరోయిన్ రమ్యకృష్ణని. అసలు సంగతి ఏంటంటే నాగార్జున.. రమ్యకృష్ణ కాంబినేషన్ లో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 15 ఏళ్లు దాటినా ఆమె అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదని రమ్యకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించాడు.ఎంతైనా మన్మధుడు కదా.

ap mlcs notification

ఎమ్మెల్సీ స్థానాల నోటిఫికేషన్ విడుదుల

  కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల కోటాలో ఉన్న ఐదు ఎమ్మెల్యేల స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనమండలి సభ్యులుగా ఉన్న రుద్రరాజు, పద్మరాజు, సింగం బసవపున్నయ్య, తిప్పేస్వామి, నన్నపునేని రాజకుమారి పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుండడంతో ఆస్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే వీటితో పాటు ఖాళీగా ఉన్న మరో స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. మార్చి 17 నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణక చివరితేది మార్చి 20. 5 స్థానాలకు 18 నామినేషన్లు పరిశీలనలో ఉంటాయి. మార్చి 27వ తేదీ పోలింగ్ నిర్వహించి అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

worldcup 2015

పసికూనపై పవర్ చూపించిన భారత్

  మంగళవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 79 బంతులు మిగిలుండగా విజయకేతనం ఎగరవేసింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి గ్రూపు-బిలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రముఖలు టీం ఇండియాకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డంగ్ అన్ని విభాగాల్లోనూ రాణించి విజయం సొంతం చేసుకుందని, ఇలాగే విజయాల బాటలో పయనించాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అంతేకాక ప్రపంచ కప్ చరిత్రలో ధోనీసేన (2011 ఈవెంట్లో చివరి నాలుగు విజయాలు సహా) అత్యధిక విజయాల రికార్డు (9) సాధించింది.

chandrababu naidu

ఏడు జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ... చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం శాసనసభలో చర్చలు బాగానే జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... రాయలసీమ ఉత్తర ఆంధ్రాల్లోని ఏడు జిల్లాలకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఎన్నికల కంటే ముందే భాజపాతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. విశాఖ రైల్వేజోన్, రాజధానికి నిధులు, రెవెన్యూలోటు భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందనీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని, అంతేకాకుండా కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. 30 ఏళ్లు నుండి నీతి నిజాయితీగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఎవరెన్ని అవినీతి ఆరోపణలు చేసినా పట్టించుకోనని అన్నారు. అవినీతికి పాల్పడేవాళ్లే అలాంటి మాటలు మాట్లడతారని చెప్పారు.

chennai

ప్రియుడా..? కాలయముడా..?

  ఓ ప్రియుడు రాక్షసుడిలా మారి ప్రియురాల్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన సోమవారం చెన్నైలో జరిగింది. వివరాల ప్రకారం దినేశ్ కన్నప్పన్ (25) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనికి అదే బ్యాంకులో పనిచేస్తున్న అరుణ శ్రీనివాసన్ తో చాలా కాలంగా పరిచయం ఉంది. వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే దినేశ్ గత రాత్రి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి అయనవరంలోని అరుణ ఫ్లాట్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకొంది. దీంతో దినేశ్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయి అరుణని ఫ్లవర్ వాజ్ తో బలంగా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని దినేశ్ ఓ బెడ్ షిట్ లో చుట్టి లోయలో పడేశాడు. స్థానిక యువకుడు దినేశ్ చర్యలను అనుమానించి పోలీసులకు సమాచారం అందిచగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపు పరారయ్యాడు. అసలు అతను ఎందుకు హత్య చేశాడో తెలియదని అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తేకానీ వివరాలు తెలియవని పోలీసులు తెలిపారు.

telangana assembly

నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్...డీకే అరుణ

  తెలంగాణా అసెంబ్లీ సమావేశాలలో ఎవరికి వాళ్లు వాళ్ల నోటి పవర్ ను చూపించుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ మహబూబ్ నగర్ జిల్లా గుర్రంగడ్డ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆమె అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో అసలు గొడవ మొదలైంది. డీకే అరుణ మాట్లాడుతూ... టీఆర్ఎస్ సభ్యులను నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్.. మహిళలతో పద్ధతి ఇదేనా.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇలాగేనా... టీఆర్ఎస్ పార్టీలో ఎలాగూ మహిళలను నోరు మూపించేశారు మీరు అంటూ మండిపడ్డారు. ఈ మాటలకి ఐటీ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని మీ దాదాగిరి ఏదైనా ఉంటే మహబూబ్ నగర్ లో చూసుకోండి ఇక్కడ చూపించకండి అని అన్నారు.

telangana assembly

గందరగోళ సమావేశాలు...

  తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండోరోజు కూడా చాలా వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మంగళవారం కూడా సభ అలా మొదలయ్యిందో లేదో 15 నిమిషాలు వాయిదా పడింది. ఇవి అసెంబ్లీ సమావేశాల్లా కాకుండా గందరగోళ సమావేశాలుగా తయారయ్యాయి. సభలో చర్చలు కంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎక్కువైంది. సభలో అధికార పార్టీ తమ జులుంను బాగానే చూపిస్తుంది. దీనికి ఉదాహరణగా సోమవారం జరిగిన శాసనసభా సమావేశాల్లో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ గురికావడం చెప్పుకోవచ్చు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించడం, తీర్మానాన్ని సభ ఆమోదించడం క్షణాల్లో జరిగిపోయింది. మాల, మాదిగ, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయగా, మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని.. జాతీయ గీతాన్ని అవమానించిన సభ్యులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పది మంది సస్పెన్షన్ కోరుతున్నట్లు మంత్రి ప్రతిపాదించారు.

TTDP MLAs

గన్ పార్క్ వద్ద తెలంగాణా తెదేపా యం.యల్యే.ల నిరసన దీక్ష

  మంత్రి హరీష్ రావు ప్రతిపాదన మేరకు తెలంగాణా శాసనసభ నుండి మొత్తం పదిమంది తెదేపా యంయల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంతో అందుకు నిరసనగా వారు ఈరోజు హైదరాబాద్ లో గన్ పార్క్ వద్ద ఒక్కరోజు నిరసన దీక్ష చేప్పట్టబోతున్నారు. ఆ తరువాత వారు రేపటి నుండి మెహబూబ్ నగర్ లో పర్యటించి తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నిరంకుశ వైఖరి గురించి ప్రజలకు వివరించబోతున్నారు. ఇదివరకు కూడా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించింది. అప్పుడు కూడా వారు ఇదేవిధంగా నిరసన యాత్రలు చేప్పట్టారు.   దీని వలన ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళుతున్నాయి? అని ఆలోచించకుండా శాసనసభ సమావేశాలు జరుగుతున్నంత కాలం శాసన సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదని ముఖ్యమంత్రి చెప్పడం తెదేపా యం.యల్యేలు చేస్తున్న ఆరోపణలను దృవీకరిస్తున్నట్లున్నాయి. దాని వలన తెలంగాణా ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎటువంటి ఇబ్బంది, నష్టమూ కలగకపోవచ్చును. కానీ ఎన్నికల సమయంలో ఇటువంటి వన్నీ తప్పకుండా వాటి ప్రభావం చూపుతాయనే విషయం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.

 chandrababu naidu

100 కోట్లతో 100 సంవత్సరాలు పడుతుంది...చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై పరోక్షంగా విమర్సల వర్షం కురిపించారు. టీడీఎల్పీ కార్యలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం సాధారణ బడ్జెట్ లో ఏపీకీ ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. మొన్న నివేదికలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి నిధులు ఇచ్చారని, ప్రత్యేకంగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఐదేళ్ల తర్వాత ఏపీ రెవెన్యూ లోటు దారుణంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకూ కేంద్రం చేయూతనివ్వాలని తెలిపారు. రూ 100 కోట్లతో పోలవరం నిర్మించాలంటే 100 సంవత్సరాలు పడుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలోని నదులన్నిటినీ అనుసంధానం చేయాలన్నారు. 300 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోందని, పోలవరం పూర్తయ్యేలోపు గోదావరి జలాలు కృష్ణానదికి అనుసంధానం చేయాలని కోరారు. అలాచేయడం వల్ల గోదావరి జిల్లాల రైతులకు అన్యాయం జరగదని తెలిపారు.

ఆడవాళ్లపై ఆగని ఆకృత్యాలు...

  ఆడవాళ్లపై మగవాళ్ల ఆకృత్యాలకు అంతులేకుండా పోయింది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని యాప్స్ తీసుకొచ్చినా వారిపై జరిగే అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజేనే ఓ యువతిపై జరిగిన సామూహిక ఆత్యాచారం మగవాళ్ల కండకావారానికి తార్కాణం. పంజాబ్ లోని లూధియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ 23 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. పోలీసు కమిషనర్ ప్రమోద్ బాన్ తెలిపిన వివరాల ప్రకారం రాజ్ గురు నగర్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి స్నేహితురాలిని కలుసుకొని ఆదివారం రాత్రి తన నివాసానికి తిరిగి వస్తుండగా నిందితులు ఓ కారులో వేగంగా వచ్చి ఆమెను కారులో ఎక్కించుకున్నారు. కారులో డ్రైవర్ తో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ తర్వాత నడుస్తున్న కారులోనే ఆమెపై ఆ ఇద్దరు యువకులు పలుసార్లు అత్యాచారం జరిపారు. తరువాత ఆమెను అదే ప్రాంతంలో దింపి పారిపోయారు. బాధితురాలు వెంటనే సమీపంలోవున్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంఘటన గురించి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని కమిషనర్ తెలిపారు.

కాశ్మీర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డట్లే ఉంది

  జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, అందులో భాగస్వామిగా ఉన్న బీజేపీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మొదటిరోజు నుండే మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు.   “మా రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుపుకొనిచ్చినందుకు పాక్ ఉగ్రవాదులకు, కాశ్మీర్ వేర్పాటువాదులకు ధాంక్స్!” అని చెప్పడంతో మొదలుపెట్టిన డ్రామా, కేంద్రానికి చెప్పకుండా, దాని అనుమతి తీసుకోకుండా మసరత్ ఆలమ్ అనే కరడుగట్టిన వేర్పాటువాదిని బారాముల్లా జైలు నుండి విడుదల చేసి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చేసారు.   ఆయన చేసిన పనికి పార్లమెంటులో ప్రతిపక్షాలకు సంజాయిషీలు ఇచ్చుకోలేక ఎన్డీయే ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. “దేశభద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకొంటామని” ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో సభ్యులకు హామీ ఇవ్వవలసి వచ్చింది.   ఆ సంగతి తెలిసుకొన్న ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఓ కౌంటర్ ఇచ్చేరు వెంటనే. అది చూసి బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ముఫ్తీ మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పూర్తిగా రాజ్యాంగబద్దమయినదే. మసరత్ ఆలమ్ విడుదల వలన రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొంటాయి. అందుకే విడుదల చేసాము. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా మా నిర్ణయాన్ని వ్యతిరేకించరాదు. అది కూడా మాకు మద్దతు ఇవ్వాలి,” అని అన్నారు.   ఆయన దూకుడు చూస్తుంటే తన ప్రభుత్వం పడిపోయినా పరువాలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు, కాశ్మీర్ వేర్పాటువాదులు తనకు అండగా నిలబడితే చాలన్నట్లుంది ఆయన వైఖరి. వారికోసం ఎంతకయినా తెగించేందుకు సిద్దం అన్నట్లుగా ఉన్నాయి ఆయన మాటలు.   మరి అటువంటి ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తూ, ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే ఊహించుకావచ్చును. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ముఫ్తీ మొహమ్మద్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకొని బయటకు రావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ముఫ్తీ మొహమ్మద్ కూడా సిద్దంగానే ఉన్నట్లు కనబడుతున్నారు. భిన్న దృవాలవంటి తమ రెండు పార్టీల కలయిక చాలా అపూర్వమయినదని బీజేపీ, పీడీపీలు యుగళ గీతం పాడుకొని పట్టుమని పది రోజులు కాలేదు. మళ్ళీ ఇంతలోనే “టాటా...గుడ్ బై...వీడికోలు...”అంటూ మరో పాత పాటని కొత్తగా పాడుకొనే సమయం దగ్గర పడినట్లే ఉంది.   ఒకవేళ ఇప్పుడు ముఫ్తీ మొహమ్మద్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని, జైలు నుండి విడుదల చేసిన ఆ వేర్పాటువాదిని మళ్ళీ అరెస్ట్ చేయలేరు. చేస్తే వాళ్ళు ఆయనని కాల్చి పారేసినా ఆశ్చర్యం లేదు. ఒక సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా వేర్పాటువాదిని వదిలిపెడితే, దానితో తనకు సంబంధం లేదని కేంద్రం చేతులు దులుపుకోలేదు. ఈరోజు ఉపేక్షిస్తే ఆయన రేపు జైలులో ఉన్న తీవ్రవాదులందరినీ విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. కనుక కేంద్రం తక్షణమే చర్యలు చేప్పట్టక తప్పదు. అయితే అందుకు అంగీకరించబోమని ముఫ్తీ ముందే విస్పష్టంగా చెప్పారు. కనుక ఇక జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడినట్లే భావించవచ్చును.

"బ్లడ్" డీ సండే

  "బ్లడీ సండే" ఇలాంటి సండే కూడా ఉంటుందా అని అనుకుంటున్నారా. ఉంటుందండీ. అమెరికా వాళ్లు తలచుకుంటే ఏ డే అయినా ఉంటుంది. అసలు విషయం ఏటంటే 1965లో ప్రజలు ఓటు హక్కు కోసం పోరాటం చేస్తూ సెల్మా నుంచి ఎడ్మండ్ బ్రిడ్జ్ మీదుగా మౌంట్ గోమరీ ప్రాంతం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారిపై ఎడ్మండ్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు లాఠీ ఛార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు జరిపారు. ఆనాటి రక్తపాతానికి గుర్తుగా అమెరికాలోని ఎడ్మండ్ బ్రిడ్జ్ వద్ద ఆదివారం రోజు వేల సంఖ్యలో స్థానికులు ఒక్కచోట చేరి, ఈ బ్లడీ సండే సంఘటన జరిగి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. వారు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ, ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు.