karunakaran

‘ఐ’ హీరోయిన్ అమీ జాక్సన్‌కి ప్రమాదం

  ఇటీవల విడుదలై భారీ చిత్రం ‘ఐ’లో హీరోయిన్‌గా నటించిన అమీ జాక్సన్ ప్రమాదానికి గురైంది. ప్రాణాపాయ స్థితి వరకూ వెళ్ళి బయటపడింది. ‘ఐ’ సినిమాలో నటించిన తర్వాత అమీ జాక్సన్‌కి తమిళ సినిమాలలో మార్కెట్ పెరిగింది. ఆమె అక్కడ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా తిరుకుమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక చిత్రంలో అమీ జాక్సన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఒక కొండ మీద షూటింగ్ జరుగుతున్న సమయంలో అమీ జాక్సన్ ఎక్కిన బైక్ అదుపు తప్పి పడిపోయింది. దాని మీద వున్న అమీ జాక్సన్ లోయలో పడిపోబోయింది. అయితే అదే సినిమాలో నటిస్తున్న కరుణాకరన్ అనే హాస్య నటుడు సమయానికి స్పందించి అమీ జాక్సన్‌ని కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది.

YSRCP

వైకాపా నేతపై సీబీఐ కేసు

  ఆవు చేలో పడి మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అవుదామని ఆయన కలలుగంటుంటే, ఆయన జైలుకి తిరిగి వెళ్ళేరోజు ఎంతో దూరం లేదని తెదేపా నేతలు బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఆయనపై ఉన్న సీబీఐ కేసులు ఎప్పుడు తెలుతాయో ఎవరికీ తెలియదు గానీ, కొత్తగా మరో సీబీఐ కేసు ఆయన పార్టీకే చెందిన మాజీ యంపి కొత్తపల్లి సుబ్బారాయుడిపై నమోదు అయ్యింది.   పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో నకిలీ పత్రాలు సమర్పించి రూ 5.73 కోట్లు తీసుకొని తమను మోసగించారంటూ బ్యాంక్ అధికారులు ఆయనపై పిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. ఆయనతో బాటు ఆయనకు సహకరించిన బ్యాంక్ చీఫ్ మేనేజర్, ముగ్గురు ఫీల్డ్ ఆఫీసర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన 2011-2013 సం.ల మధ్య కాలంలో బ్యాంక్ కి నకిలీ దృవపత్రాలను సమర్పించి రూ 5.73 కోట్లు అప్పుగా తీసుకొని 22 చేపల చెరువులు నిర్మించుకొన్నారని బ్యాంక్ అధికారుల ఆరోపణ.

bbc nirbhaya documentary indias daughter

బీబీసీ కాదు.. ఛీఛీఛీ...

  బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (బీబీసీ) మాట తప్పింది. నిర్భయ ఘటన మీద రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయబోమని భారత ప్రభుత్వానికి ఇచ్చిన మాట తప్పింది. ఇండియాలో వెల్లువెత్తిన నిరసనను, ప్రసారం చేయవద్దన్న ప్రభుత్వ అభ్యర్థనను పక్కనపెట్టి నిర్భయ ఘటన మీద రూపొందించిన డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయడం పట్ల భారత ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. బీబీసీ వార్తా సంస్థ బుధవారం రాత్రి తమ దేశంలో ‘ఇండియాస్ డాటర్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అనంతరం యూట్యూబ్‌లో వుంచింది. భారత ప్రభుత్వం దీనిమీద తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోను వెంటనే యూ ట్యూబ్ నుంచి తొలగించాలని కోరింది. ఇది చాలా సున్నితమైన అంశం కావడం వల్ల వెంటనే ఈ వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం యూట్యూబ్ సంస్థను కూడా కోరినట్టు తెలుస్తోంది. అయితే భారత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని, సమాచారం అందిన వెంటనే సదరు వీడియోను తొలగిస్తామని యూట్యూబ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు బీబీసీకి నోటీసులు జారీ చేశారు. నిర్భయ ఘటన డాక్యుమెంటరీ విషయంలో ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడినందుకు బీబీసీ వార్తాసంస్థకు నోటీసులు జారీ చేశామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బీబీసీ వార్తాసంస్థకు నోటీసులు జారీ చేసింది.

 chandrababu naidu ap capital

ప్రజల కోసమే రాజధాని... చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు అవసరమా అన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు పరోక్షంగా తప్పుబట్టారు. రాజధానిని ఎన్ని ఎకరాల్లోనైనా నిర్మించుకోవచ్చని, రాజధాని అంటే నాలుగు బిల్డింగ్ లు కాదని అన్నారు. వారి నుండి మేము కావాలని భూములు లాక్కోవడం లేదని, రైతులు తమ ఇష్ట్తంతోనే భూములు ఇస్తున్నారని, ప్రజల భవిష్యత్ కోసమే ఈ రాజధాని నిర్మాణమని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలకు పది ఎకరాలు కావాలి కానీ, అదే రాజధాని నిర్యాణానికి వేల ఎకరాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదని చెప్పారు.

 chandrababu naidu japan

పెట్టుబడులకు సాదర స్వాగతం.. బాబు..

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని జపాన్ పారిశ్రామికవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో జపాన్ పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వ అధికారులు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్య్రక్రమంలో 30 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు అనేక సదుపాయాలు, రవాణా, పెట్టుబడులు, రహదారులు, ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పరిచిన సింగిల్ డెస్క్ ద్వారా అనుమతులన్నింటిని నేరుగా ఆ అధికారే ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. ఆంధ్రపదేశ్, జపాన్ ల మధ్య సాంస్కృతికంగా చాలా సారూప్యం ఉందన్నారు. రెండు నెలల్లో తాను జపాన్లో మరోసారి పర్యటించి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరనున్నట్లు చెప్పారు.

crime police software arrest

వీడెక్కడి మొగుడండీ బాబు...

ఓ శాడిస్ట్ మొగుడు తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అసత్య ప్రచారం చేస్తుండగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం సైదాబాద్ కు చెందిన ఎస్.ప్రవీణ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అమెరికాలో స్థిరపడ్డాడు. అతనికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ కి అతని భార్యకి భేదాభిప్రాయాలు రావడంతో రెండేళ్ల నుండి వారికి దూరంగా ఉంటున్నాడు. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఆమె విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న ప్రవీణ్ ఆమెకు వివాహేతర సంబంధం ఉందని బంధువులు, కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్ లు, మెయిల్స్ పంపాడు. దీంతో ప్రవీణ్ పై అతని భార్య ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

pawan kalyan ap capital tour undavalli

రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత గ్రామాల్లో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం నాడు పర్యటన ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో ఉండవల్లికి వచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్‌తో రైతులు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ సమస్యలను పవన్ కళ్యాణ్‌కి వివరించారు. రాజధానికి భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమని, రోడ్ల కోసం అయితే భూములు ఇస్తామని ఈ సందర్భంగా కొందరు రైతులు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రైతుల సమస్యలను మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. రైతుల చేత కన్నీళ్ళు పెట్టించరాదని, భూ సేకరణను ఆపాలని పవన్ కళ్యాణ్ అన్నట్టుగా తెలుస్తోంది.

VHP leader balika saraswati

పాక్‌ని పొగిడేవాళ్ళని చెప్పుచ్చుక్కొట్టాలి...

  భారతదేశంలో వుంటూ పాకిస్థాన్‌ని పొగిడేవాళ్ళని చెప్పుచ్చుకుని కొట్టాలని విశ్వహిందూ పరిషత్ నాయకురాలు బాలికా సరస్వతి అన్నారు. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడేవారిని పాకిస్థాన్‌కే తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. అలాంటి వారిని ఎంతమాత్రం సహించరాదు.. ఉపేక్షించరాదు అని ఆమె అన్నారు. ఈ దేశంలో వుంటూ ఇక్కడి తిండి తింటూ పరాయిదేశం పాకిస్థాన్‌ని పొగిడేవారిని చెప్పుతో కొట్టాలి. వారిని ఎంతమాత్రం సహించరాదు.. దెబ్బకు దెబ్బ తీయాలి అని అన్నారామె. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌‌లో కూడా రామమందిరం నిర్మించాలని, మనం అక్కడకి వెళ్ళి పూజలు చేయాలని ఆమె వ్యాఖ్యానించారు. భారతీయులందరూ ఆయుధాలు పట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

killing

అన్నా హజారేని చంపేస్తాం...

  శాంతి దూత గాంధీజీ హత్యకు గురయ్యారు. అదే బాటలో ఆయన శిష్యుడు అన్నా హజారే కూడా హత్యకు గురి కాబోతున్నారా? తాజా పరిణామాలు ఈ భయాన్ని కలిగిస్తున్నాయి. అన్నా హజారేని చంపేస్తానని ఒక ప్రవాస భారతీయుడు ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టాడు. ‘అన్నా హజారే టైమ్ అయిపోయింది. ఆయన్ని చంపే టైమ్ వచ్చింది. కాబోయే నాథూరామ్ గాడ్సేని నేనే’’ అని కెనడాకు చెందిన ఒక ఎన్నారై గగన్ విధు తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్టు పెట్టాడు. దాంతో అన్నా హజారే మద్దతుదారులు బెదిరిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏనాటి నుంచో అలుపెరుగని ఉద్యమాలు చేస్తున్న అన్నా హజారే జన లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన 1100 కిలోమీటర్ల పాదయాత్రను కూడా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను చంపుతానని ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌లో పేర్కొనడం హజారే మద్దతుదారులకు ఆందోళన కలిగిస్తోంది. అన్నా మద్దతుదారుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు గగన్ విధు మీద, అతనికి సహకరించిన నీల్ అనే వ్యక్తి మీద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఇదిలా వుంటే, తన మీద ఎఫ్.ఐ.ఆర్. నమోదు కావడం పట్ల గగన్ విధు ఫేస్‌బుక్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

 girl suicide train

పెళ్లి కాలేదని యువతి...

తనను ఎవరూ వివాహం చేసుకోరేమోననే బాధతో ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం మద్దివంచకు చెందిన శిరీష పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఎంతసేవటికీ శిరీష ఇంటికి రాకపోవడంతో తన సోదరుడు ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. తన సోదరుడు కంగారుపడుతుండగా ఇంతలో 'అన్నయ్యా.. అమ్మను బాగా చూసుకో.. నాన్న జాగ్రత్త.. ఇక నేను ఎప్పటికీ మీకు కనపడను. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కుటుంబంలోనే పుట్టాలని ఆ దేవుణ్నికోరుకుంటా' అని మెసేజ్ పెట్టింది. తర్వాత సెల్ ఫోన్ స్విఛాఫ్ చేసిన శిరీష రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

app kejriwal yogendra yadav prashanth bhushan

‘ఆప్’ నుంచి తరిమేశారు...

  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన మనశ్శాంతిగా మాత్రం లేరు. ఎందుకంటే ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. వీటి పుణ్యమా అని పార్టీ పదవుల మీద విరక్తి పుట్టుకొచ్చిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్గవర్గ సమావేశం బుధవారం జరిగింది. పార్టీలో కుమ్ములాటలకు కారణమైన యోగేంద్ యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ చేసిన రాజీనామాను కూడా పార్టీ జాతీయ కార్యవర్గం తిరస్కరించింది.

andhra pradesh cabinet meeting

ఏపీ ఉగాది వేడుకలు ఎక్కడంటే...

  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంత గ్రామమైన తుళ్ళూరులో ఈసారి ఉగాది వేడుకలను వైభవంగా జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమై దాదాపు ఏడు గంటలపాటు సాగింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు జరపడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలా లేక కొంతకాలం వేచి చూడాలా ఈ నేపథ్యంలో ప్రధానిని కలవాలా అనే అంశాల మీద ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.   ఉగాది వేడుకలను కొత్త రాజధాని గ్రామం తుళ్ళూరులో జరపాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఉగాది సందర్భంగా తుళ్ళూరులో రైతుల అభినందన సభ జరపాలని కూడా నిర్ణయించారు. పశుగ్రాసం కిలో మూడు రూపాయలకే అందించాలని, ఎస్సీ, ఎస్టీయేతర రైతులకు తుంపర, బిందుసేద్యం పరికరాలపై రాయితీని 2 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల మీద అసంతృప్తి విషయాన్ని గురువారం మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించారు.   బుధవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖల వారీగా మంత్రులతో సమీక్ష జరిపారు. ఈనెల 6న ఆయన మంత్రులతో మరోసారి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 6న సమావేశంలో శాసనసభ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించనున్నారు. రెండోదశ రుణ మాఫీ ఈ నెలలో పూర్తి చేసే విషయం మంత్రివర్గం చర్చించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగుల సమ్మెకాలాన్ని ప్రత్యేక కాజువల్ లీవుగా పరిగణించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయితీల్లో వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు 40 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి రేషన్ బియ్యం కోటాను ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఇళయరాజా ఆగ్రహం...

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఎఫ్ ఎం రేడియోస్టేషన్లు, టీవీల మీద కోపం వచ్చినట్టుంది. నేను స్వరపరిచిన పాటలన్నింటిపైనా హక్కులు నావే కావాలంటే రైట్స్ కొనుక్కోండంటూ కొరడా ఝళిపించారు. ఇక ముందు తన పాటలు ప్రసారం చేయాలంటే తన నుంచి గానీ, తన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి గానీ అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇలా వచ్చిన మొత్తంలో నిర్మాతలకు కూడా కొంత భాగాన్ని ఇస్తానని చెప్పారు. తన అనుమతి లేకుండా పాటలు ప్రసారం చేయడం చట్ట విరుద్ధమన్నారు. అదేవిధంగా మేధో సంపత్తి హక్కు మీద విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నేను సాగుచేశాను... నా పంటను అమ్ముకున్నాను. అంతమాత్రాన నేను నాటిన చెట్టును కూడా తీసుకుంటానంటే ఎలా అంటూ ఇళయరాజా ప్రశ్నిస్తున్నారు. పాపం ఇక నుండి టీవీలు, రేడియో స్టేషన్లలో ఇళయరాజా పాటలు ప్రసారం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.

పొలాల్లో దిగిన విమానం

  22 సంవత్సరాల క్రితం... అంటే నవంబర్ 15, 1993లో ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరి సమీపంలో ఒక విమానం పొలాల్లో దిగిన విషయం గుర్తుండే వుంటుంది. ఆ విమానంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, రామానాయుడు, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు నేపాల్‌లో అలాంటి ఘటనే జరిగింది. టర్కీ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఒక విమానం గాల్లో వుండగా, నేపాల్ ప్రాంతానికి వచ్చేసరికి విపరీతమైన పొగమంచులోకి ప్రవేశించింది. విమానం పైలెట్‌కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో పైలెట్ విమానాన్ని ఖాట్మండూ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్ చేసేశాడు. ఎయిర్‌పోర్టులో లాండ్ అయిన విమానం రన్ వే మీద ఆగకుండా అలాగే ముందుకు వెళ్ళిపోయింది. ఆ పరిస్థితి చూసి విమానం పేలిపోవడం ఖాయమని విమానంలోని ప్రయాణికులతో సహా అందరూ అనుకున్నారు. అయితే ప్రయాణికుల అదృష్టం బాగుండి రన్ వే దాటిన తర్వాత వున్న పొలాల్లోకి విమానం దూసుకుపోయింది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న 227 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్వ గాయాలు అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నిజంగా మిరకిల్ అని, ఈ విమానంలోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారంటే వారికి ఇంకా ఈ భూమ్మీద నూకలు ఉన్నందువల్లనే అని ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఖాట్మండూ విమానాశ్రయ అధికారులు అంటున్నారు.