డిల్లీలో కాంగ్రెస్ పార్టీదే విజయం అట!

 

డిల్లీ అసెంబ్లీకి ఈ నెల ఏడున ఎన్నికలు జరగనున్నాయి కనుక మూడు ప్రధాన రాజకీయపార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకొంది. కానీ ఈ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఇంతవరకు నిర్వహించిన సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. తాజా సర్వేలో కూడా పోటీ ప్రధానంగా బీజేపీ, ఆమాద్మీ పార్టీ ల మధ్యనే ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు వచ్చిన 8 సీట్లలో అతికష్టం మీద 3-4 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు తేల్చి చెప్పాయి. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తమదే విజయం అని చెప్పుకొంటోంది.

 

ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిల్లీలో నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొని మోడీని ప్రచారక్ అని అరవింద్ కేజ్రీవాల్ ధర్నాల మంత్రి అని విమర్శించారు. కనుక ప్రజలు తమ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తే సుస్థిరమయిన, సమర్ధమయిన పరిపాలన అందించగలమని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల తరువాత ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో వరుస పరాజయాలు పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో కనీసం గతంలో సాధించినన్ని సీట్లు కూడా గెలవలేదని సర్వేలన్నీ స్పష్టంగా చెపుతున్నప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకొని, తప్పులను సరిదిద్దుకొని, పార్టీని ప్రక్షాళన చేసి సరికొత్త నాయకులతో, విధానాలతో ప్రజల ముందుకు వెళ్ళవలసింది పోయి, ఈవిధంగా ఆత్మవిశ్వాసం ప్రదర్శించగలడం ఆశ్చర్యం కలిగిస్తున్నా ఆ పార్టీ దైర్యాన్ని మెచ్చుకోవలసిందే.

Teluguone gnews banner