వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

  వాట్సాప్.. ఈరోజుల్లో దీనిగురించి తెలియనివాళ్ళు జీవితంలో చాలా వెనుకబడిపోయినట్టే లెక్క. ప్రపంచ వ్యాప్తంగా విరివిగా ఉపయోగించే మెసేజ్ సర్వీస్‌గా వాట్సాప్ దూసుకుపోతుంది. గత సెప్టెంబర్ నాటికి వాట్సాప్‌ని వినియోగించేవారి సంఖ్య 9 వందల మిలియన్లకు చేరింది. ఈరెండు నెలల్లో వెయ్యి మిలియన్లకు చేరే వుంటుందని అంచనా. అయితే ఇంత ఆదరణ వున్న ఈ యాప్‌లో స్కైప్, హ్యాంగ్ ఔట్‌ తరహాలో వీడియో కాలింగ్ సదుపాయం లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ త్వరలో వాట్సాప్‌లో వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఇది పరీక్ష దశలో వుందట. త్వరలో విడుదల చేయబోతున్న ఐఓఎస్ వెర్షన్‌లో ఈ వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఇమడ్చాలని వాట్సాప్ సంస్థ ఆలోచిస్తున్నట్టు సమాచారం.  

మునిగిన పడవ.. 10 మంది మృతి

  గ్రీస్ సమీపంలో ఏజియన్ సముద్రంలో జరిగిన పడవ ప్రయాణంలో ఐదుగురు చిన్నపిల్లలతో సహా మొత్తం 10 మంది మరణించారు. ఏజియన్ సముద్రం ద్వారా గ్రీస్ ద్వీపం ఫార్మాకొనిస్సీకి వలస వెళ్తున్నవారి పడవ మునిగిపోవడంతో ఈ దారుణం జరిగింది. పడవ మునిగిపోయిన సమయంలో అటుగా వచ్చిన తీరప్రాంత రక్షక దళ అధికారులు 13 మందిని కాపాడారు. మంగళవారం నాడు టర్కీ సమీపంలో పడవ మునిగిపోయి ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం 11 మంది మరణించారు. ఇంతలోనే మరో దారుణం జరిగింది. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద దాడులు, అంతర్యుద్ధాల కారణంగా లక్షలాదిమంది యూరోపియన్ దేశాలకు సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఈ సందర్బంగా పడవలు మునిగిపోయి ఈ ఏడాదిలోనే దాదాపు ఏడు వందల మందికి పైగా మరణించారు.  

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ నేతలు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఆర్టికల్ 179 (సి) ప్రకారం అవిశ్వాస నోటీసులు అందించారు. ఈనెల 18 న జరిగిన ప్రొసిడింగ్ వీడియో ఫూటేజ్ ను అందించాలని వైసీపీ నేతలు అసెంబ్లీ కార్యదర్శిని కోరినట్టు తెలుస్తోంది. శాసన సభలో రోజాకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి..రోజాకు చెందిన వీడియోలు బయటకు ఎలా వచ్చాయని అసెంబ్లీ కార్యదర్శిని అడిగి ఆరా తీసినట్టు తెలుస్తోంది.సభాపతి అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. తొలి సమావేశం నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందుకే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇస్తున్నామని తెలిపారు.

అప్పుడు తప్పనిపించలేదు.. ఇప్పుడు తప్పనిపిస్తుందా.. రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణకు గాను స్పీకర్ కోడెల ఆమెను సంవత్సరంపాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అటు అధికార పార్టీకి.. ప్రతిపక్ష పార్టీకి మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజా కూడా తనపై చేస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ అధికార పార్టీపై ప్రశ్నలు కురిపించింది. అధికార పార్టీ తనపై..తాను వాడుతున్న భాషపై అనవసరంగా విమర్శలు చేస్తుందని.. తాను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇదే బాషను ఉపయోగించా.. ఇప్పుడు అదే బాషను ఉపయోగించా.. అప్పుడు తప్పనిపించనిది.. ఇప్పుడు ఎలా తప్పనిపిస్తుంది అని ప్రశ్నించారు. అంతేకాదు కాల్ మనీ గురించి కూడా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రుణాలు ఇవ్వకపోవడం వల్లే ప్రజలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని.. ఇదే అదనుగా చూసుకొని వారు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

దావూద్ కారు దహనం చేస్తాం.. అందుకే కారు కొన్నాం.. స్వామి చక్రపాణి

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కారు.. హోటల్ ను వేలం వేసిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో దావూద్ కారును హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఆయన దావూద్ కారును అందరూ చూస్తుండగానే దహనం చేస్తామని..ఈరోజు మద్యాహ్నం 1 నుంచి 2 గంటల సమయంలో దావూద్ కారును దహనం చేస్తున్నానని తెలిపారు. కిరాతకుడు దావూద్ ఇబ్రహీం, అతని ముఠా పాల్పడిన తీవ్రవాద కార్యకలాపాలకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే తాము ఈ కారును వేలంలో కొనుగోలుచేశామని, అందుకే దహనం చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే మొదట ఈ కారును అంబులెన్స్ లా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం కానీ.. తమకు దావూద్ అనుచరుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో వారికి తగిన బుద్ది చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు. మరోవైపు ఈరోజు కారును దహనం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ ఆయుత చండీయాగం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్ లో కేసీఆర్ తలపెట్టిన యాగం.. గురుప్రార్ధనలతో ప్రారంభమైంది. తొలుత రుత్విజులతో కలిసి సీఎం కేసీఆర్‌ దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొత్తం యాగం కోసం దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి రెండు వేల మంది రుత్విజులు వచ్చినట్టు తెలుస్తోంది. ఐదు రోజులు జరిగే ఈ చండీయాగంలో కోటి సవార్ణ మంత్రాలు, ఉదయం పూట సప్తశతి మంత్రజపాలు.. సాయంత్రం పూట సవార్ణ మంత్ర జపాలు జరుగుతాయి. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలల్లో రాజశ్యామల, మహారుద్ర, అయుత మహా చండీయాగం జరగుతుంది. అయుత మహా చండీయాగంలో భాగంగా మొదటిరోజైన ఈరోజు వెయ్యి చండీ పారాయణాలు, 40లక్షల నవార్ణమంత్ర జపాలు చేస్తారు. చండీయాగం ప్రారంభోత్స సందర్భంగా తొలిరోజున జరిగే క్రతువులో కేసీఆర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. మరోవైపు యాగశాల చుట్టూ 5కిలో మీటర్ల మేర సీసీ కెమెరాలు ఏర్పాటు..3,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. చివరిరోజున పలు అంశాలపై చర్చించారు. తెలుగుదేశం శాసనసభ్యురాలు అనితపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను సభ తీవ్రంగా ఖండించింది. చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే అనిత కంటతడి పెట్టారు. అనంతరం బాక్సైట్ తవ్వకాలు, ఇసుక విధానంపై సభలో చర్చించారు. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఐదురోజులపాటు జరిగిన ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో మొత్తం 18 గంటల 34 నిమిషాలపాటు సభా సమయాన్ని అధికార, ప్రతిపక్షాలు వినియోగించుకున్నాయి. ఇందులో అధికార తెలుగుదేశం పార్టీ 14 గంటల 42 నిమిషాల సమయాన్ని, ప్రతిపక్షం వైసీపీ 2 గంటల 14 నిమిషాల సమయాన్ని, బీజేపీ గంటన్నర సమయాన్ని వినియోగించుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 గంటల 19 నిమిషాలు మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ 16 నిమిషాలు, బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు 15 నిమిషాలు మాట్లాడారు.

స్పీకర్ మీద వైసీపీ అవిశ్వాసం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. విధిలేని పరిస్థితుల్లోనే స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టాలని తీర్మానించామని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడానికి, అవిశ్వాస తీర్మానానికి సంబంధం లేదని ఆయన అన్నారు. బుధవారం నాడు అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిన అంశం మీద న్యాయపోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.  

సినీ రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత

  సినిమా రచయిత, నటుడు కాశీ విశ్వనాథ్ (69) మంగళవారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణానికి రైలులో ప్రయాణిస్తూ వుండగా ఖమ్మం సమీపంలో గుండెపోటుకు గురై మరణించారు. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. ఖమ్మం రైల్వే పోలీసులు కాశీ విశ్వనాథ్ భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్ష అనంతరం ఆయన కుమారుడు శ్రీధర్‌కి అప్పగించారు. కాశీ విశ్వనాథ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. కథ, నవల, సినిమా మాటల రచయిత, రంగస్థల దర్శకుడు, నటుడుగా ప్రశంసనీయమైన కృషి చేశారు. ఆయన 122 కథలు, 28 నవలలు, 43 నాటికలు రాశారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగమహారాజు’ తదితర చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. ‘కాశీపట్నం చూడరబాబు’ అనే కాలమ్ కూడా రాశారు.

నిర్భయ నా కూతురైతే.. కాల్చేసేవాడిని.. ఎంపీ

నిర్భయ కేసులో జువైనల్ గా శిక్షపొందుతున్న నిందితుడు విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఒబ్రెయిన్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాసభలో జువైనల్ చట్టసవరణ బిల్లుపై చర్చ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు నిర్భయ స్థానంలో ఒకవేళ తన కూతురు కనుక ఉండి ఉంటే.. నిందితులను అప్పుడే కాల్చి చంపేవాడినని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సమస్యపై రాజకీయం చేస్తున్నాయని.. జువెనైల్ చట్ట సవరణ బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపుతోందని చెప్పారు. ఈ బిల్లును దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని.. ఎంపీలందరూ ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని అన్నారు. జువెనైల్ జస్టిస్ బిల్లును మరింత పటిష్టం చేసేందుకు అందరూ ఒక్కటికావాలన్నారు. బాల నేరస్థుల శిక్ష కాలాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

కేసీఆర్ యాగానికి చంద్రబాబు..! ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగానికి అంకురార్పణం చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యాగానికి వస్తారా.. లేదా ఆని. అయితే కేసీఆర్ స్వయంగా విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆహ్వానించడం.. తన యాగానికి తప్పకుండా వస్తానని చెప్పడంతో రేపు జరగబోయే యాగానికి చంద్రబాబు తప్పకుండా వస్తారని అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ యాగానికి వెళ్లడం పట్ల టీ టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీ టీడీపీ నేతలు కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు కనుక యాగానికి వస్తే అది పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు వేరే సిగ్న‌ల్స్ ఇచ్చిన‌ట్టు ఉంటుద‌ని.. కేసీఆర్ ను.. కాని ఆపార్టీ నేతలను విమర్శించడం ఎలా తలలుపట్టుకొనే పరిస్థితి వచ్చిపడింది. అయితే అందరి సంగతి ఎలా ఉన్నా టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం అవేమి పట్టించుకోకుండా కేసీఆర్ ను ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూనే ఉన్నారు. మరోవైపు కేసీఆర్ కూడా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్ల ఓట్ల కోసమే చంద్రబాబుతో మంచిగా ఉంటున్నారని అంటున్నారు. అందుకే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు ప్రచారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. నేతలను ఎలా దిశా నిర్దేశికం చేస్తారో చూడాలని కొంతమంది టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు ఎంత ముఖ్యమో అలాగే తెలంగాణ ఓట్లు కూడా కావాలి. అందుకే ఈ యాగానికి వెళ్లే తెలంగాణ ప్రజలకు తనపై నమ్మకం కలుగుతుందనే భావనతో చంద్రబాబు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఈ యాగానికి వెళ్లడం వల్ల చంద్రబాబుకి ఎంత ప్రయోజనం ఉంటుంది.. తన ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

కేజ్రీవాస్ సరి-బేసి విధానం.. అతిక్రమిస్తే 2వేలు ఫైన్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలోని కాలుష్యాన్ని నివారించడానికి గాను ఓ కొత్త పద్దతికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి ఎక్కువైపోతోందని దీని కారణం డీజిల్ వాహనాలే కారణమని ప్రభుత్వం గుర్తించి దానిని తగ్గించే దిశలో సరి-బేసి విధానాన్ని ప్రవేశపట్టింది. అంతేకాదు ఈ విధానాన్ని అందరూ ఖచ్చితంగా పాటించి తీరాలని.. అలా కాకుండా ఈ పద్దతిని అతిక్రమిస్తే వారికి రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. అయితే ఈ విధానంలో కొన్ని మార్పులు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ చూస్తున్నట్టు తెలుస్తోంది. నలుగురు ప్రయాణికులు కలిగిన కార్లు మహిళా డ్రైవర్లు మహిళా ప్రయాణికులు గల కార్లకు వీటి నుంచి మినహాయింపు నివ్వాలని ఆలోచిస్తోంది. అంతేకాదు ఈ విధానం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి జనవరి 1 నుండి అమలయ్యే ఈ విధానం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

రోజాపై చర్యలు తీసుకోండి.. రెండు రోజులు బయటకు రాలేదు.. ఎమ్మెల్యే అనిత

వైకాపా ఎమ్మెల్యే రోజాపై మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా గతంలో నా మీద కూడా ఇలానే జుగుప్సాకరంగా మాట్లాడారు.. ఇప్పుడు ఎమ్మెల్యే అనితపై కూడా అలాగే నోరు పారేసుకున్నారని.. ఒక ఎమ్మెల్యేగా తను ఇలా మాట్లాడటం సరికాదని.. రోజాకు ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరుతున్నానని అన్నారు. రోజా ఒక మహిళ అనే విషయాన్ని మరిచిపోయి తను ఇష్టం వచ్చినట్టు ఒక రౌడీలా మాట్లాడుతుందని.. సభలకు వచ్చేది ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవడానికి కానీ.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోవడానికి కాదని అన్నారు. అంబేడ్కర్ వల్లే తమ వంటి దళితులం అసెంబ్లీలో అడుగు పెట్టామని, అలాంటి తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రోజాను జగన్ వెనకేసుకురావడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు గాను తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యాయనని.. రెండు రోజులపాటు ఇంటిలోనుండి బయటకు రాలేక పోయానని తీవ్ర మనోవేధనకు గురయ్యానని ఎమ్మెల్యే అనిత అన్నారు. దళిత మహిళనైన తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా పైన సరైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అనిత విజ్ఞప్తి చేశారు.

కేజ్రీవాల్ పై అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసు..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకూ పెరిపోతుంది. డీడీసీఏ (ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌) వ్యవహారంలో ప్రస్తుతం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనపై లేనిపోని ఆరోపణలు చేసి తనతోపాటు కుటుంబ పరువు తీసారని జైట్లీ పది కోట్లకు.. కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. దీనికి కేజ్రీవాల్ స్పందించి.. ఇలాంటి కేసులతో తనను భయపెట్టలేరని.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము.. డీడీసీఏ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు జైట్లీ హాజరై  ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. జైట్లీ వేసిన కేసును ప్రముఖ న్యాయవాది రామ్‌ జెత్మలానీ కేజ్రీవాల్ తరుపున వాదించనున్నారు. మరోవైపు ఆప్ నేతలు కూడా జైట్లీపై  ఫోర్జరీ, ప్రజాధనం దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని కేసు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.