హంద్వారాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఆందోళ‌న‌ల‌ మధ్యే ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

  కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని హంద్వారా పట్టణంలో ఓ అమ్మాయిని జవాన్ వేధించాడంటూ స్థానికులకు, జవాన్లకు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఆర్మీ పికెట్ పై దాడి చేసి, నిప్పు  పెట్టేందుకు ప్రయత్నించగా.. జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేయగా.. ఇప్పుడు శ్రీనగర్ తో పాటూ సున్నితమైన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.     మరోవైపు ఆందోళ‌న‌ల‌తో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న అక్క‌డి కుప్వారా జిల్లాలో నేడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పర్యటించనున్నారు. దీంతో ముఖ్యమంత్రి ప‌ర్య‌ట‌న అనంత‌రం నాలుగు రోజులుగా వేడెక్కిన అక్క‌డి వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డుతుంద‌ని భావిస్తున్నారు.

ప్రైవేటు రంగానికి రిజర్వేషన్లు కల్పించాలి.. వీహెచ్ దీక్ష

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దీక్ష పూనారు. ప్రభుత్వ రంగానికి ఉన్న రిజర్వేషన్లను ప్రైవేటు రంగానికి కూడా కల్పించాలని ఆయన దీక్షకు దిగారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఈరోజు ఉదయం నుండి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న వెనకబాటుదనాన్ని పారద్రోలాలంటే ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ల అవసరముందన్నారు. దీనికి ప్రేవేటు సంస్థలు సహకరించాలని కోరారు. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం కనుక అలా చేస్తే దానికి మద్దతు తెలుపుతామని ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీహెచ్ దీక్షా శిబిరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతోంది.

ఎదురుగా వస్తున్న రైలుతో సెల్పీ.. ఇద్దరు మృతి

  సెల్ఫీ తీసుకోవడం మామూలే.. కానీ ఎంత వెరైటీగా సెల్ఫీ తీసుకున్నామా అన్నది ముఖ్యం అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే ఎంతో మంది సెల్ఫీ తీసుకుంటూ తమ ప్రాణాలు కోల్పోయారు. ఏనుగుతో సెల్ఫీ తీసుకుంటుండగా.. అది తొండంతో కొట్టి ఓ యువకుడు చనిపోయిన ఘటన రెండు రోజుల క్రితమే జరిగింది. అది మరిచిపోకముందే.. ఇప్పుడు ఈ సెల్ఫీ మోజుకు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రైలుకి ఎదురుగా వెళ్లి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువకులు వేగంగా వచ్చే రైలు ముందు నిల్చొని సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారు. సెల్ఫీ తీసుకుంటూ రైలు దగ్గరకొచ్చే క్రమంలో వెళ్లిపోవచ్చనుకున్నారు కానీ.. జరగాల్సింది జరిగిపోయింది. రైలు ఢీ కొట్టి ఇద్దరూ మృతి చెందారు. సెల్ఫీల వల్లే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. ఇలాంటి ఘటనలు చూసినా ఇంకా రోజు రోజుకి ఎక్కువవుతుందే తప్ప తగ్గేలా కనిపించడంలేదు.

వైసీపీ తూ.గో జిల్లా అధ్యక్షుడిగా కన్నబాబు నియామకం..

వైసీపీ పార్టీ నుండి జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాను వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ను తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జ్యోతుల నెహ్రూ పార్టీ వీడుతున్నారన్న వార్తలు రాగానే జగన్ పార్టీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ప్రసన్నకుమార్ ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం మరో నిర్ణయం తీసుకుంది.

సుజయకృష్ణ టీడీపీ ఎంట్రీ వాయిదా.. చంద్రబాబు పుట్టినరోజున..

  వైసీపీ బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయకృష్ణ రంగారావు టీడీపీ లో చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరికను ప్రస్తుతం వాయిదా వేసి చంద్రబాబు పుట్టినరోజు అంటే ఈ నెల 20 వ తేదీకు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్యలో తన సోదరుడు బేబినాయనతో కలిసి సుజయ్‌ విజయవాడలో టీడీపీలో చేరుతారు. ప్రస్తుతానికి సుజయ్‌ ఒక్కరే టీడీపీలో చేరుతున్నారు. భవిష్యతలో మరికొందరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లే ఆస్కారం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.   మరోవైపు సుజనా ఎంట్రీ వల్ల కొంతమంది టీడీపీ నేతల్లో ఆసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సుజయ్‌కు మంత్రి పదవితోపాటు సోదరుడు బేబీనాయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు బేరం కుదిరింది. దీంతో బొబ్బిలిరాజులు పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ నియోజక వర్గంలో ఇంత వరకు రాజులకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గర్భగుడిలోకి మహిళలకు ఎంట్రీ.. కానీ..!

  మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరాలయం గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతి దొరికింది. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకూ ఒక గంటపాటు పురుషులు స్త్రీలు గర్బగుడిలోకి ప్రవేశించవచ్చని ట్రస్ట్ సభ్యులు అనుమతిచ్చారు. అయితే అనుమతి ఇవ్వడానికైతే ఇచ్చారు కానీ..  కేవలం తడిదుస్తులతో మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశించాలని.. అలాగు కాటన్ లేదా సిల్కు వస్త్రాలు మాత్రమే ధరించాలని మహిళలకు కొన్ని షరతులు పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ షరతులపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ట్రస్టు సభ్యులు కావాలనే ఇలాంటి నిబంధనలు పెట్టారని.. తడి దుస్తులతో గర్భగుడిలోకి ఎలా ప్రవేశిస్తామని.. మహిళలు స్వచ్ఛందంగా తమకు తామే గర్భగుడిలోకి వెళ్లకుండా చేసేందుకే ఇలాంటి నియమాలు పెట్టారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆలయ ట్రస్టు సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరి ట్రస్ట్ సభ్యులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

కేసీఆర్ చెప్పేది అబద్దం.. కలిపే ప్రసక్తే లేదు.. దేవినేని ఉమ

  రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు మండలాలను ఏపీలో కలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ మండలాల్లోని కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణకు బదాయిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు దీనిపై ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పందించి.. పోలవరం ముంపు గ్రామాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణకు బదలాయించేదిలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పే మాటల్లో వాస్తవం లేదని.. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నుంచి కానీ.. ఏపీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. ఇంకా.. ఎగువరాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు ఎంతో నష్టపోయామని.. దీనికోసం రెండు రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాలని అన్నారు.

నిఖిల్ రెడ్డి హైట్ ఆపరేషన్.. కూర్చోలేని పరిస్థితిలో నిఖిల్

  పొడుగు పెరగడం కోసం నిఖిల్ రెడ్డి అనే యువకుడు గ్లోబల్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. వాళ్ల తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా చేయించుకున్న ఈ ఆపరేషన్ చాలా వివాదాస్పదమైంది కూడా. అయితే ఆపరేషన్ తరువాత తను పొడుగు పెరగడం సంగతి పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అంటున్నాడు నిఖిల్ రెడ్డి. సరిగా కూర్చోలేక పోతున్నాడు.. అంతేకాదు.. రెండు రోజుల నుండి కాళ్లలో వాపు, మంటలు, నొప్పి మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా ఆపరేషన్ తరువాత వారం రోజులకే డిశ్చార్జి చేస్తామని.. పదిరోజులు దాటినా ఇంకా ఆస్పత్రిలోనే ఉంచారని అంటున్నారు. ఇంజనీరింగ్ చదివేప్పుడు క్లాసులో అందరూ పొడవుగా ఉండేవారు.. ముగ్గురమే కొంచం పొడవు తక్కువగా ఉండేవాళ్లం.. అందుకే ఆపరేషన్ చేయించుకున్నాను.. మా అమ్మనాన్నలకు చెబితే ఒప్పుకోరని.. అందుకే వారికి చెప్పకుండా చేయించుకున్నానని చెప్పాడు.

భయపడకండి.. పాతవారి తర్వాతే కొత్తవారికి ప్రాధాన్యం.. చంద్రబాబు

  వైసీపీ పార్టీ నుండి దాదాపు పదిమందికి పైగా ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇంకా కొంత మంది నేతలు చేరడానికి సిద్దంగా ఉన్నారు కూడా. అయితే వైసీపీ నేతలు టీడీపీలో చేరడం వరకూ బాగానే ఉన్నా.. వీరి చేరికతో కొంత మంది టీడీపీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న తమ పరిస్థితి ఏమిటన్న భయం టీడీపీ నేతల్లో ఉందట. ఈనేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈరోజు ఉదయం విజయవాడ నుంచి పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. కొత్తవారు పార్టీలోకి రావడం వల్ల పాత వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారంట. పాత వారికి ప్రాధాన్యం కల్పించిన తర్వాతే కొత్త వారికి అవకాశం కల్పిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారంట.

సుజనా చౌదరి కొడుకుపై కేసు నమోదు..

  ఇప్పటికే కేంద్రమంత్రి సుజనా చౌదరి మారిషన్ బ్యాంకు వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దానికి తోడు మరో చిక్కుల్లో పడ్డారు కేంద్రమంత్రి. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆయన కొడుకు కార్తీక్ పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. నిన్న రాత్రి కార్తీక్, అతని ఫ్రెండ్స్ కలిసి జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ నుండి పంజాగుట్టవైపు దాదాపు 100 నుండి 150 కిలో మీటర్ల వేగంతో కారు రేసింగులకు దిగారు. నడిరోడ్డుపై ఇంత స్పీడుతో వెళుతున్న కార్లను చూసి భయపడిన జనాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేసి కార్తీక్ సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్తీక్ పై ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణ కింద కేసు నమోదు చేశారు.

తెలంగాణ మావోయిస్టుల దుశ్చర్య.. వాహనానికి నిప్పు

  తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల దుశ్చర్యలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత అటు ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ఇటు తెలంగాణలోని వరంగల్ జిల్లాలోనూ మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూపోతున్నారు. తాజాగా తెలంగాణలో మావోయిస్టులు మరో దుశ్చర్యానికి పాల్పడ్డారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా తాడ్వాయి మండల పరిధిలో నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాతం అటవీ శాఖ కార్యాలయంపై దాడి చేసి ఆ శాఖ వాహనానికి నిప్పు పెట్టారు. అంతేకాదు ఈ చర్యకు పాల్పడింది తామేనని కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరిట మావోయిస్టులు అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు.

విజయ్ మాల్యా.. నాన్ బెయిలబుల్ వారెంట్లపై విచారణ..

  విజయ్ మాల్యాపై ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి ఎంచక్కా లండన్ వెళ్లిన విజయ్ మాల్యాకు చిన్న చిన్నగా ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు విచారణకు హాజరుకావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకావాలని ఆదేశించినా.. హాజరుకాకుండా పదే పదే గడువు కావాలని కోరడంతో ఈడీ మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయమని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో కేంద్రం కూడా వెంటనే స్పందించి నాలుగు వారాల పాటు మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది. అంతేకాకుండా వారంలోగా ఈ సస్పెన్షన్ పై మాల్యా స్పందించకుంటే పాస్ పోర్టును పూర్తిగా రద్దు చేస్తామని కూడా ఆ శాఖ హెచ్చరించింది. దీంతో ఈడీ మరో అడుగు ముందుకేసి తమ నోటీసులకు స్పందించని మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు నేడు తన నిర్ణయాన్ని వెలువరించనుంది.

విశాఖపట్నమే కావాలంటున్న ధోనీ అండ్ కో..!

  మహారాష్ట్రలో కరువు కారణంగా, అక్కడి ఐపిఎల్ మ్యాచ్ లను ఆడకూడదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మహారాష్ట్రలో హోమ్ గ్రౌండ్స్ ఉన్న ముంబై, పుణే జట్లకు ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగు వెన్యూలను ఆప్షన్లుగా ఇచ్చింది. రాయ్ పూర్, జైపూర్, విశాఖపట్నం, కాన్పూర్ లలో ఒకటి ఎంచుకోమని రెండు టీం లకు కౌన్సిల్ ఆప్షన్స్ ఇచ్చింది. విశాఖపట్నం ధోనికి చాలా ఇష్టమైన గ్రౌండ్. అందుకే మరో మాట లేకుండా వెంటనే విశాఖపట్నానికి ధోనీ టీం పుణే ఓటేసింది. ముంబై మాత్రం తమకు మరికొంత సమయం కావాలని తెలిపింది. ఎక్కువశాతం పుణే హోం మ్యాచ్ లన్నీ వైజాగ్ లో జరగడానికే ఆస్కారం ఉంది. దీంతో ఇన్నాళ్లూ ఐపిఎల్ ను అప్పుడప్పుడు మాత్రమే చూసే భాగ్యం కలిగిన వైజాగ్ వాసులు, ఇక నుంచీ ఐపిఎల్ సందడిని ఆస్వాదించచ్చన్నమాట. మరోవైపు ముంబైలో జరగనున్న ఐపిఎల్ ఫైనల్ ను బెంగళూరుకు షిఫ్ట్ చేసే ఆలోచన ఐపిఎల్ కౌన్సిల్ చేస్తోంది. కౌన్సిల్ ఆమోదిస్తేనే ఇవన్నీ సాధ్యపడే అవకాశం ఉంది.

సరి-బేసి విధానం.. 5 గంటల్లోనే 500 వాహనాలకు ఫైన్..

  ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి-బేసి పద్దతిని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుండి సరి-బేసి విధానం మలి దశను అమలుపరిచారు. అయితే అలా అమలుపరిచారో లేదో ఐదు గంటల వ్యవధిలో 500 పైగా వాహనాలకు జరిమానా కట్టవలసి వచ్చింది. నిబంధనల ప్రకారం.. ఈరోజు బేసి సంఖ్య ఉన్న కార్లు మాత్రమే వీధుల్లోకి రావాల్సి ఉంది. కానీ సరి సంఖ్య ఉన్న వాహనాలు కూడా రోడ్లపైకి వచ్చాయి. దీంతో తొలి ఐదు గంటల వ్యవధిలో 500కు పైగా వాహనాలు సరిసంఖ్య నంబరు గల వాహనాలు రోడ్లపైకి రావడంతో వీటిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఒక్కో కారుకు రూ. 2 వేల జరిమానా విధించామని, దీన్ని చెల్లించేందుకు పక్షం రోజుల వ్యవధి ఇచ్చామని తెలిపారు.

మహారాష్ట్ర సీఎంకి ప్రత్యూష బెనర్జీ తల్లి లేఖ..

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన కూతురి ఆత్మహత్యకు రాహుల్ రాజ్ సింగే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రత్యూష తల్లి సోమా బెనర్జీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కి లేఖ రాశారు. తన కూతురి ఆత్మహత్యకు రాహుల్ రాజ్ సింగే కారణమని.. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు అతని వల్ల ఇంకా చాలా మంది అమ్మాయిలు మోసపోయారని.. తమను, సాక్షులను బెదిరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు.. రాష్ట్ర హోంమంత్రి, ముంబయి పోలీస్‌ కమిషనర్‌లకు కూడా ఆమె లేఖ రాశారు.

మోడీ రావడం చాలా పెద్ద రిలీఫ్.. ఊమెన్ చాందీ

  కేరళ కొల్లం పుట్టంగల్ దేవి ఆలయంలో బాణసంచా పేలి వందమందికి పైగా ప్రాణాలు పోయి.. వందల మందికి గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన రోజే ఘటనా స్థలికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి పరామర్సించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ప్రధాని రాకపై ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్పందించి మోడీని ప్రశంసించారు. ఘటన జరిగిన రోజునే మోడీ రావడం తమకు ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు. అప్పటికే సహాయక చర్యల్లో అలసిపోయిన పోలీసులకు వీవీఐపీల బాధ్యత మరింత భారమైందని.. అందుకు మోడీ ఒకరోజు ఆలస్యంగా వస్తే బావుంటుందని అన్నారని.. కానీ మోడీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఘటన జరిగిన రోజే రావడం గొప్ప విషయమని.. జాతీయ స్థాయి నాయకుడు కేరళకు రావడం చాలా పెద్ద రిలీఫ్ అని.. జరిగిన ఘటనపై మోడీ స్పందించిన తీరు గొప్పదని అన్నారు.