Read more!

ధర్మబలం లేకపోతే జరిగేదేమిటి?

 

ధర్మబలం లేకపోతే జరిగేదేమిటి?

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధమపుడు దుర్యోధనుడు కౌరవులకు సైన్యాధ్యక్షుడుగా భీష్ముడు ఉన్నా, భీష్ముని బలపరాక్రమాలు ఎంతటివో తెలిసిన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి ఇలా చెబుతాడు. "గురుదేవా!!  మన సేనలు అపరిమితమైనవి. పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి. పాండవుల సైన్యములు పరిమితములు. కాని అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి" అని చెప్పాడు.

కౌరవుల సేనలు 11 అక్షౌహిణీలు. పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యచెప్పుకుంటున్నాడు. అదీ కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు. అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యము. అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు, పాండవ సేనలు భీమునిచేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనానాయకుడు ధృష్టద్యుమ్నుడు, భీముడు ఒక మహారథి. కాని భీముని గురించి, ఆ భీముని బలపరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది. తన తొడలు విరగగొడతాననీ, దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతాననీ, గాంధారేయులను నూరు మందిని తానే చంపుతాననీ భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది. అందుకే పాండవ సేనలు భీమునిచేత రక్షింపబడుతున్నాయి అని కాస్తంత అధైర్యపడ్డా, అయినా పర్వాలేదు మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. 

అదీకాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు. ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదుకదా అనే శంక కూడా దుర్యోధనుని మనసులో ఏదో ఒకమూల బాధిస్తూ ఉన్నట్టుంది. ఇక్కడ భీష్ముని దగ్గర భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు. తమకు ధనుర్విద్యను నేర్పిన గురువుగారు ద్రోణాచార్యుల వారితో ఇలా అన్నాడు దుర్యోధనుడు. "ఆచార్యా! భీష్ముల వారి రక్షణలో ఉన్న మన సైన్యం గొప్పదే కాని భీముని చేత రక్షింపబడుతున్న పాండవుల సైన్యం ముందు చాలదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ధర్మం, ధర్మానికి ప్రతిరూపము అయిన శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు. మనం గెలుస్తామంటారా?" అనే సందేహం వెలిబుచ్చాడు.

అంటే దుర్యోధనుడి లోలోపల తమ విజయం మీద ఉన్న నమ్మకం దెబ్బతిన్నది అని అర్ధం.

ఈకాలంలో కూడా ధనము, ఆస్తులు, పదవులు, చుట్టు జనం ఉన్నా, చాలామందికి మానసిక స్థైర్యము ఉండదు. తాను చేసిన, చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు, ఆధర్మాలకు ఒళ్లు మండి, ఎవడొచ్చి చంపుతాడో అని తమ చుట్టు గన్ మెన్లను పెట్టుకొని తిరుగుతుంటారు. కొందరు ధర్మం తమ పక్షానుంటే ఎటువంటి అంగబలం అర్థబలం అక్కరలేదు అని నమ్ముతారు. ధర్మబలం లేని నాడు ఎంత అర్థబలం, అంగ బలం ఉన్నా వృధా. అంటే అంగబలం, అర్థబలం కన్నా ధర్మబలం గొప్పది. ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో వారికే విజయం లభిస్తుంది అన్న మూలసూత్రం దుర్యోధనుడి మనసులో ఏదో ఒక మూల తలెత్తి, ఒక విధమైన అపనమ్మకం కలిగిస్తూ ఉంది. అదే ధర్మబలం లేకపోవడం వల్ల జరిగేది.

  ◆వెంకటేష్ పువ్వాడ.