కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ

  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఆర్డీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడో సారి ఈ రోజు ముగిసిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. గతంలో పాతిక బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ ఈ సారి 50 బేసిస్ పాయిట్లను తగ్గించింది. ఈ తాజా తగ్గింపుతో రెపో రేటు 6 నుంచి 5.50 శాతానికి దిగివచ్చింది. ఈ తగ్గింపు వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 3.7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.  మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ఈ రోజు ముగిసింది.  
కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ Publish Date: Jun 6, 2025 12:35PM

మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్

ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఉత్కంఘగా  ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేర‌కు "AP DSC 2025 ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు!" అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  ఇక‌, ఈ రోజు (జూన్ 6, 2025) ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17  మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ  ఫైలు మీదే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. 
మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్ Publish Date: Jun 6, 2025 12:27PM

అంగరంగ వైభవంగా అఖిల్ జనాబ్ వివాహం

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేనిఅఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున మూడు గంటలకు అఖిల్ జనాబ్ మెడలో తాళి కట్టారు. ఈ వివాహ వేడుకకు  మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్  సహా  టాలీవుడ్ తారలంతా కదిలి వచ్చారు.   గురువారం (జూన్ 5) రాత్రి నుంచే వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి.  వెకేషన్ లో ఉన్న అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత దంపతులు కూడా వెకేషన్ ను ముగించుకుని వివాహానికి హాజరయ్యారు. ఇక ఆదివారం (జూన్ 8)న అఖిల్ జనాబ్ ల పెళ్లి రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ హాజరౌతారని తెలుస్తోంది. అలాగే పలువురు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలూ కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది.  ఆదివారం (జూన్ 8) వివాహ రిసెప్షన్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ తెలిపింది.  
అంగరంగ వైభవంగా అఖిల్ జనాబ్ వివాహం Publish Date: Jun 6, 2025 11:18AM

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం (జూన్ 6) హాజరు కానున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు  ఆర్థిక, విధాన నిర్ణయాలు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్​ కేబినెట్​లో ఈటల రాజేందర్​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై ఆయనను కమిషన్​ ప్రశ్నించనుంది.   ఇక మాజీ మంత్రి హరీష్ రావు  సోమవారం (జూన్ 9) కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ ఎదుట ఈ నెల 11న హాజరు కానున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఈ  నెల5నే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విజ్ణప్తి మేరకు కమిషన్ విచారణకు 11కు వాయిదా వేసింది.   అసలు కేసీఆర్, ఈటల, హరీష్ రావులను విచారించకుండానే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని ముందుగా భావించినప్పటికీ  ఆ తరువాత వీరిని కూడా విచారించాలని నిర్ణయం తీసుకుంది.  విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్​ ఈఎన్​సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేట్​ వ్యక్తుల నుంచి స్టేట్​మెంట్లను తీసుకున్న కమిషన్, వారి స్టేట్ మెంట్ల ఆధారంగా  తుది నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది.  ఇప్పుడు కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ వాంగ్మూలాలనూ నమోదు చేయాలని కమిషన్ వారికి నోటీసులు పంపింది. 
కాళేశ్వరం కమిషన్  ఎదుటకు ఈటల Publish Date: Jun 6, 2025 11:05AM

వైసీపీ నిరసనలు తుస్సు.. పార్టీ భవిష్యత్ పై క్యాడర్ లో ఆందోళన!?

వైసీపీ ప్రభుత్వ  అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కూటమి సర్కార్ వ్యూహా త్మకంగా ప్రజలలో ప్రచారం చేస్తున్నది. జగన్ దుష్టపాలనను జనం మరచిపోయే అవకాశం లేకుండా వాటి ప్రభావంతో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతింది. ప్రజా ప్రయోజనాలకు ఎలా భంగం వాటిల్లింది వంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ.. ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జగన్ నవరత్నాలు అంటూ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో మరీ ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలలో ఇప్పటికీ ఒకింత సానుకూలత ఉందన్న అంచనాల నేపథ్యంలో  ఆ సానుకూలతను రూపుమాపి, అంటే జగన్ సంక్షేమ పథకాలను జనం మరిచిపోయేలా మరింత సంక్షేమం, దానితో పాటే అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలాలు జనానికి అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ కూటమి సర్కార్ అడుగులు వేస్తున్నది. అదే సమయంలో సంక్షేమ పథకాల పేరిట జగన్ జనానికి చేసిన దగాను సమర్థవంతంగా, ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తున్నది.    ముఖ్యంగా రేషన్ పంపిణీ విషయంలో జగన్ ఇంటింటికీ రేషన్ అంటూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా అనే కార్యక్రమాన్ని జగన్ అప్పట్లో చేపట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ అంటూ వాహనాలను రద్దు చేసింది.  ఈ విషయంలో తొలుత ఒకింత వ్యతిరేకత వ్యక్తమైనట్లు కనిపించినా.. ఒకటి రెండు రోజులలోనూ ఆ వ్యతిరేకత మటుమాయమైంది. అంత పకడ్బందీగా దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ అన్నది ఒక మాయావస్త్రంగా మారిందనీ, వాహనం ఇంటి ముందుకు వచ్చి రేషన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవనీ, ఎక్కడో    కూడలిలో రేషన్ పంపిణీ వాహనం అందితే అక్కడకు పరుగులు పెట్టాల్సి వచ్చేదని లబ్ధిదారులు బాహాటంగా చెబుతున్నారు. దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ వల్ల తాము తాపీగా వెళ్లి తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడిందని అంటున్నారు.  ఇక పరామర్శల పేర జగన్ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ లకు మద్దతుగా నిలుస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో కూడా కూటమి సర్కార్ విజయం సాధించిందనే చెప్పాలి. ముఖ్యంగా తెనాలి ఐతానగర్ సంఘటనలో జగన్ పరామర్శ బూమరాంగ్ అయ్యింది. దళిత సంఘాలలో జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది. పోలీసులు బహిరంగంగా ఐతానగర్ లో రౌడీషీటర్లకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను జనం హర్షించారు. అటువంటి రౌడీ షీటర్లకు జగన్ అండగా నిలవడమేంటన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలాగే జనవరి 4 వెన్నుపోటు దినం అంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి.. జగన్ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోడాన్ని వైసీపీ క్యాడరే జీర్ణించుకోలేకపోతోంది. అధినాయకుడు నిరసనలలో పాల్గొననప్పుడు తాము మాత్రం ఎందుకు అన్నట్లుగా చాలా ప్రాంతాలలో వెన్నపోటు దినం నిరసనలకు వైసీపీ క్యాడర్ దూరంగా ఉంది. దీంతో వైసీపీ నేతలు ఆ నిరసన కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ఆ కారణంగా అవి జనానికి పట్టని నిరసనలుగా మిగిలిపోయాయి. అదే సమయంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు నిర్వహించిన సంబరాలు ఆర్భాటంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. జనం కూడా ఆ వేడుకలలో స్వచ్ఛందంగా పాలుపంచుకున్న పరిస్థితి కనిపించింది.  దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ పై ఆ పార్టీ వర్గాలలోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 
వైసీపీ నిరసనలు తుస్సు.. పార్టీ భవిష్యత్ పై క్యాడర్ లో ఆందోళన!? Publish Date: Jun 6, 2025 10:00AM

నానబెట్టిన ఖర్జూరం తింటే కలిగే లాభాలేంటో తెలుసా?

ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక  భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.  ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో  ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు.. ఫైబర్.. నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.  పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనర్జీ.. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది.  ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్కిన్.. చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం.  ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె.. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.   ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది. ఎముకలు.. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం,  విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి.  ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. మధుమేహం.. ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి. రక్తహీనత.. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు.  ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒత్తిడి.. ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది. తల్లిపాలు.. పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.                                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నానబెట్టిన ఖర్జూరం తింటే కలిగే లాభాలేంటో తెలుసా? Publish Date: Jun 6, 2025 9:30AM

మనిషికి తృప్తి కావాలంటే ఇలా జీవించాలి..

ప్రతి మనిషి తన జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే కోరుకున్నంత సులభంగా అలాంటి జీవితం లభించదు. నిజానికి ప్రశాంతమైన జీవితం వేరు, సుఖాల మయమైన జీవితం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ప్రశాంతమయమైన జీవితం కావాలి అంటే…  ప్రతి నిముషంలోని ఆనందాన్నీ, సంతృప్తినీ వెలికి తీయగల గని కార్మికుడి లాగా పని చేయాలి. మనం ఎంత సాధించినా, ఎంత డబ్బునూ, ఆస్తుల్నీ సంపాదించినా చివరికి మన వెనకున్న ఎవరికో ఒకరికి సర్వం సమర్పించి అంతా వదలి వెళ్ళాలన్న సాధారణ సత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నిజంగా మనం సంతృప్తికరంగా జీవించగలమా అంటే అవును  జీవించగలం.  కొంతమంది ఏమి చేస్తారంటే… ఎదుటి వాళ్ళు కార్లు, బంగాళాలు కొంటూ విలాసవంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు అని అంటారు. కానీ ఎలాంటి గొడవలు, చింతలు లేకుండా హాయిగా ఉన్నవారే నిజమైన గొప్ప జీవితం కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గ్రహించాలి.  మరికొందరు గొప్పగా బ్రతకడం అంటే అది అదృష్టం వలన లభించేది అని అనుకుంటారు. కానీ అది అదృష్టం వల్ల దొరికేది కాదు. అది మనకు మనంగా ఎంచుకొనే తెలివైన ఎంపిక.  ఇలాంటి ఎంపిక ఎలా సాధ్యం అని ప్రశ్నించుకుంటే.. మనం ఆలోచించడం మొదలు పెట్టాలి ముందు.  ఈ రోజున మనకు తెల్సిన పరిస్థితుల మధ్య, మనం అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య, మనం సిద్ధంగా ఉన్న అవకాశం లభించినప్పుడు ఆనందంగా గడపగలమో..... లేక మనకు తెలియని రేపటి పరిస్థితుల మధ్య, మనం చూడలేని పరిస్థితులలో ఆనందంగా గడపగలమో నిర్ణయించుకోవాలి.   భవిష్యత్తు అనేది కేవలం మనం మన ఊహల్లో నిర్మించుకొనే ఒక సామ్రాజ్యం. ఈ వాస్తవమైన ఈ రోజుని ఆనందంగా జీవించలేనపుడు.. రేపటి రోజున ఎలా ఆనందంగా జీవించగలం? కాలం మన మృత్యువునీ ఎన్నటికీ వాయిదా వెయ్యదు, అది దానికి సమయం వచ్చినప్పుడు అట్లా మనల్ని తీసుకుని వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మన ఆనందపు సమయాన్ని మాత్రం మనం ఎందుకు వాయిదా వెయ్యడం. మనకు దొరికిన గొప్పవరం ఏదైనా ఉందంటే అది ఈరోజే.., ఇది మళ్ళీరాని అవకాశం, ఈ రోజున మనం అనుభవించిన సంతోషాలూ, గడిపిన క్షణాలు మళ్ళీ అదే విధంగా మరో రోజు ఉండకపోవచ్చు.   ఒక వేళ మన ఆయుష్షు లక్ష రోజులైతే... అది ఖచ్చితంగా ప్రతి రోజూ ఓ విలక్షణమైన పుస్తకం లాంటింది.  ఏ పుస్తకమూ మరో పుస్తకంలా ఉండదు. అలాగే  మన అద్భుతమైన రోజు భవిష్యత్తులో మరో రోజు పునరావృతం కాదు. ప్రతి రోజు ఓ సరిక్రొత్త అనుభవం. అందుకే ఏ సరిక్రొత్త అనుభవాన్ని వదులుకోకూడదు. బోటన వ్రేలి గుర్తులు ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవో అలాగే మన జీవితకాలంలోని ఏ రెండు రోజులూ ఒకేలా వుండవు. సరిక్రొత్త విశేష విజయాలను, అవకాశాలను ఈ రోజే సృష్టించుకోవాలి.  మరో రోజును వేరొక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం గతంలో జరిగిన సంఘటనలనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచనలతో, నిన్నటినీ, రేపటినీ కలిపి ఈ రోజు జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. నిన్నటి పాత జీవితాన్ని మళ్ళీ నేడు బ్రతకడం ఎందుకు, వస్తుందో రాదో తెలియని రేపటిని ఈ రోజే జీవించాలన్న తపన ఎందుకు కేవలం నేటిని ప్రశాంతంగా జీవిస్తేచాలాదా!                                     ◆నిశ్శబ్ద.
మనిషికి తృప్తి కావాలంటే ఇలా జీవించాలి.. Publish Date: Jun 6, 2025 9:30AM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు విచారణకు డుమ్మా.. ఇప్పుడేం జరుగుతుంది?

ట్యాపింగ్ కేసులో ఏ1 ముద్దాయి.. విచారణకు డుమ్మా కొట్టారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీ మేరకు ఆయన గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాలి. అలా హాజరౌతానని స్పష్టమైన హామీ ఇచ్చే సుప్రీం కోర్టు ద్వారా పాస్ పోర్టు సంపాదించుకున్నారు. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒక సారి ఉపయోగించుకునే వన్ టైమ్ పాస్ పోర్టు ఆయనకు అందింది కూడా. దీంతో ఆయన స్వయంగా సుప్రీం కోర్టుకు చెప్పిన విధంగా మూడు రోజుల్లో అంటే  జూన్ 5న విచారణకు హాజరౌతారనే అంతా భావించారు. కానీ ఆయన విచారణకు రాలేదు.  దీంతో న్యాయనిపుణులు ప్రభాకరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని అంటున్నారు.  అయితే ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారనీ రెండు రోజుల్లో వచ్చి విచారణకు హాజరౌతారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.   అయితే ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు అందుబాటులోకి రాకుండా తప్పించుకుంటున్నారన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. తొలుత ఆరు నెలల్లో వస్తానన్నారు. అంతా నిజమేనని నమ్మారు. ఆ తరువాత అమెరికా నుంచి ఇక తిరిగి వచ్చేది లేదని చాటుతున్న విధంగా గ్రీన్ కార్డు తీసుకున్నారు.  దీంతో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ కావడంతో గత్యంతరం లేక సుప్రీంను ఆశ్రయించి పాస్ పోర్టు ఇప్పిస్తే విచారణకు హాజరౌతానని అన్నారు.  ఆయన విజ్ణప్తిపై సుప్రీం సానుకూలంగా స్పందించింది. ఆయనకు పాస్ పోర్టు అందింది. అయితే చెప్పినట్లుగా.. విచారణకు రాకుండా ప్రభాకరరావు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన తీరు పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన గైర్హాజరీ కోర్టు ధిక్కరణేనని అంటున్నారు. ఆయన సన్నిహితులు మాత్రం ప్రభాకరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడే సాహసం చేయరనీ, రెండు లేదా మూడు రోజులలో విచారణకు హాజరౌతారనీ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు విచారణకు డుమ్మా.. ఇప్పుడేం జరుగుతుంది? Publish Date: Jun 6, 2025 9:29AM

భటింగే తో కటింగే.. నినాదం కాదు, నిజం!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి వరసగా మూడవసారి ప్రజా పట్టాభిషేకం జరిగి సంవత్సరం పూర్తయింది. అవును.. గత సంవత్సరం జూన్ 4,5 తేదీలలో  2004 లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఎ విజయ కేతనం ఎగరేసింది. మోదీ సర్కార్ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టింది. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడవ సారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోదీ చరిత్రలో స్థానం  సంపాదించుకున్నారు. అంతవరకు బాగుంది..  అయితే  ఈ ఎన్నికల్లో ప్రజలు అంతకు మించిన సందేశమే ఇచ్చారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ  ప్రజలు వరసగా మూడవ సారి  ప్రధాని మోదీ పాలన పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అయితే అది సంపూర్ణమా అంటే కాదు. ఎన్డీయేకి అధికారాన్నిఅయితే అప్పగించారు కానీ.. ఎన్డీఎకు ఆశించిన మెజారిటీ రాలేదు. అలాగే..  ఎన్డీఎ కూటమికి సారధ్యం వహిస్తున్న బీజేపీకి కూడా ఆశించిన ఫలితాలు రాలేదు.  కమల దళం కలలు కన్న 400 ప్లస్  (చార్ సౌ పార్) నెంబర్ కు ఆమడల దూరంలోనే బీజేపీ స్కోర్ ఆగిపోయింది. ఆశించిన నెంబర్ రాక పోవడమే కాదు.. సిట్టింగ్ స్థానాలకే పెద్ద ఎత్తున గండి పడింది.  బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది.  అంతే కాదు వరసగా రెండు ఎన్నికల్లో (2014,2019), సోంతంగానే మెజారిటీ సొంతం చేసుకున్న బీజేపీ మూడవ సారి మాత్రం ఆ మెజారిటీ సాధించలేకపోయింది.  బీజేపీ ఎంపీల సంఖ్య సింపుల్ మెజారిటీకి 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయినా..  ఎన్డీఎ కూటమి 293 సీట్లు గెలవడంతో అధికారం నిలబడింది. ముఖ్యంగా తెలుగుదేశం (16), జనతదళ్(యు)(11) మద్దతుతో మోదీ ముచ్చటగా మూడవ సారి ప్రధాని అయ్యారు.  మోదీ ప్రధాని అయ్యారు కానీ..  మోదీ 3.0 ప్రభుత్వం ముందులా కీలక నిర్ణయాలు తీసుకోగల్గుతుందా?  మోదీ  సుస్థిర పాలన కొనసాగించ గలరా? అనే అనుమానాలు  రాజకీయ వర్గాల్లో సర్వత్రా వ్యక్తమయ్యాయి. మరో వంక.. సంకీర్ణ కట్టుబాట్లు  జాతీయవాద ఎజెండాకు బ్రేకులు వేస్తాయా?  అనే సందేహాలు సంఘ్ పరివార్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి.  అయితే.. ఇటు చంద్రబాబు, అటు నితీష్ కుమార్ మోదీకి అండగా నిలవడంతో ఆనాటి అనుమానాలు అన్నీ తొలగి పోయాయి. మోదీ సర్కార్   ప్రయాణం సజావుగా సాగుతోంది.  ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు  ముఖ్యంగా.. టీడీపీ అధినేత,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజనీతిజ్ఞతతో   పార్టీలు వేరైనా  అంతరంగం ఒకటే అన్నట్లుగా సుస్థిర అభివృద్దే లక్ష్యంగా ఒకటిగా సాగుతున్నారు. అందుకే.. మోదీ ప్రభుత్వం పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా  సుస్థిరంగా సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. చివరకు,  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా  మోదీ 3.0 ప్రభుత్వం  ముందు కంటే మరింత స్థిరంగా ముందుకు సాగుతోందనీ, శషబిషలు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. మరోవంక.. 2024 ఎన్నికల ఫలితాలు  ప్రతిపక్ష ఇండియా కూటమి, ముఖ్యమంగా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలకు అవకాశం కల్పించాయి.  వరసగా రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని  కాంగ్రస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదాను ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష  నాయకుడయ్యారు.  అదొకటి అయితే..  2024 ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును, విశ్లేషించుకుంటే, అటు బీజేపీకి అయినా ఇటు కాంగ్రెస్ కు అయినా  మిత్ర పక్షాల చేదోడు అవసరమని స్పష్టం చేశాయి. మిత్రపక్షాల సహకారం లేకుండా  అధికారమే కాదు.. ప్రతిపక్ష హోదా కూడా అసాధ్యమనే వాస్తవాన్ని 2024 ఎన్నికల ఫలితాలు విశదీకరించాయి.   నిజానికి.. 2024 ఎన్నికల ఫలితాలే కాదు, ఈసంవత్సర కాలంలో జరిగిన వివిధ రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అందుకే, బీజేపీ  ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ (కలిసి ఉంటే కలదు సుఖం,విడిపోతే పడిపోతాం) అనే  నినాదాన్ని ఉభయ తారకంగా ఉపయోగించుకుని  లోక్ సభ ఎన్నికల నష్టాన్ని  మహరాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పూడ్చుకుంది. ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడంమే కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జమ్మూ కశ్మీర్, ఝారఖండ్  తదితర రాష్ట్రల్లోనూ  ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందగలిగింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ  పరిస్థతి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. దేశ రాజధానిలో వరసగా అరవ సారి జీరో’ గా మిగిలింది.  సో...   ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ నినాదం కాదు నిజం అంటున్నారు.
భటింగే తో కటింగే.. నినాదం కాదు, నిజం! Publish Date: Jun 6, 2025 9:08AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కోనసాగుతున్నది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వెలుపలి వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా  సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 67 వేల 284 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 253 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.   
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Publish Date: Jun 6, 2025 8:50AM

48 గంటల అబ్జర్వేషన్‌లో మాగంటి.. దేవుడి దయతో కోలుకోవాలి : హరీశ్ రావు

  జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ దేవుడి దయతో  కోలుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన గోపీనాథ్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. నిపుణులైన వైద్యలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంటారని హారీశ్‌రావు తెలిపారు. మాగంటి త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారని ఆశిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతు గోపీనాథ్‌ కోలుకుంటున్నారని గోపీనాథ్‌ వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. ఇటీవల బోరబండకు చెందిన బీఆర్‌ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్‌ సర్దార్‌ ఆత్మహత్య ఘటనతో మాగంటి ఒత్తిడికి గురయ్యారన్నారు.  48గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని వివరించారు. మాగంటి గోపీనాథ్‌కు సీనియర్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారని, క్షేమంగా బయటికొస్తారనే విశ్వాసం ఉందన్నారు. 48 గంటల తర్వాత వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తారని తెలిపారు. అయితే ఆయన వెంటీలేటర్ పై చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన బంధువులు పేర్కొన్నారు. ఆయన అనారోగ్యంపై వస్తున్న వందతులను కొట్టిపారేశారు. గోపీనాథ్ కు ఐసీయూలో 48 గంటల అబ్జర్వేషన్ కొనసాగుతోందని, ఆయన చనిపోయారంటూ వస్తున్న వార్తలు అసత్యం అన్నారు.దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరారు. మరోవైపు గోపీనాథ్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.     
48 గంటల అబ్జర్వేషన్‌లో మాగంటి.. దేవుడి దయతో  కోలుకోవాలి : హరీశ్ రావు Publish Date: Jun 5, 2025 9:39PM

టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మాగంటి గోపీనాథ్

  జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు భారాస నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని గోపీనాథ్‌ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని హరీశ్‌రావు తెలిపారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాజకీయ ఓనమాలు నేర్చుకుంది టీడీపీలోనే. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన 26 ఏళ్ల వయస్సులో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 1985 నుంచి 1992 వరకు  పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్‌గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, హైదరాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఇలా వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు.గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ  నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన పరిణామాలతో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గులాబీ టికెట్‌పై పోటీ చేసి రెండు సారి విజయం సాధించారు. ఆయన 2018లో శాసనసభలో పీఈసీ సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికల్లో మూడో బీఆర్ఎస్ టికెట్‌తో పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ అయిన గోపీనాథ్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మాగంటి గోపీనాథ్ Publish Date: Jun 5, 2025 8:15PM

విశాఖ రైల్వే జోన్‌కు ముందడుగు..తొలి జీఎంగా సందీప్ మాథుర్

  విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ మేనేజర్ నియామకం ఆనందంగా ఉంది. ఇది కేవలం పరిపాలనాపరమైన చర్య కాదు. ఈ జోన్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలో ఒక మైలురాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో మన ప్రాంత వాగ్దానాలు నెరవేరుతున్నాయి' అని కేంద్రమంత్రి రామ్మోహన్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది.విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. అయితే గత పదేళ్లుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా జోన్‌ వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటీవల కూటమి సర్కార్ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వేజోన్‌పై కదలిక వచ్చింది.    
విశాఖ రైల్వే జోన్‌కు ముందడుగు..తొలి జీఎంగా సందీప్ మాథుర్ Publish Date: Jun 5, 2025 7:18PM

సొంత పార్టీ ఎంపీపై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

  నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షీ నటరాజన్‌కి ఫిర్యాదు చేశారు..పెండింగ్ బిల్లులను ఇప్పించి వారి నుంచి 10 శాతం కమిషన్ వసూలు చేసుకుని తన సొంత లాభానికి పాల్పడ్డాడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల బిల్లులు క్లియర్ చేయకుండా బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలంపూర్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే  విజయుడుని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.ఇలాంటి చర్యలతో పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉందని.. వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సొంత పార్టీ ఎంపీపై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు Publish Date: Jun 5, 2025 6:27PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమం

    జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు.. మాగంటి గోపీనాథ్‌ను గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.గతంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అస్వస్థతకు గురియ్యారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు, ప‌లువురు నాయ‌కులు ఏఐజీ ఆస్ప‌త్రికి వెళ్లారు. మరోవైపు మాగంటి  ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులను  మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం గోపీనాథ్ వెంటీలేటర్ మీద చికిత్స పొందుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్టు మాజీమంత్రి తెలిపారు
 బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమం Publish Date: Jun 5, 2025 5:59PM

కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు వాయిదా.. కవిత ధర్నా వృధా !?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద బుధవారం (జూన్ 4) చేపట్టిన ధర్నా వృధా అయ్యింది. అత్యంత వ్యూహాత్మకంగా కవిత చేపట్టిన ఈ ధర్నాకు  ఎలాంటి మైలేజీ రాకుండా, ఆమె తండ్రి, అన్న కుట్రపన్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  కేసీఆర్ గురువారం (జూన్ 5) కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతారని కవిత అంతకు ఒక రోజు ముందే ధర్నాకు పిలుపునిచ్చారు. అందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్న తరువాత చివరి నిముషంలో కేసీఆర్ విచారణకు మరో రోజు హాజరౌతానంటూ కమిషన్ కు లేఖ రాయడం, అందుకు కమిషన్ అంగీకరించి 11వ తేదీన విచారణకు రావాల్సిందిగా చెప్పడం జరిగిపోయాయి. దీంతో కవిత ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నా ప్రాధాన్యత కోల్పోయింది. ధర్నాలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుపై  కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డం వెనుక‌.. ఆయ‌న‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయాల‌న్న ఉద్దేశం ఉంద‌ని ఆరోపించారు. కొన్ని పంచ్ డైలాగులతో ప్రసంగాన్ని రక్తి కట్టించారు. కానీ కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కావడం వాయిదా పడటంతో కవిత ధర్నా వృధాగా మారిపోయింది. కవిత ధర్నాకు ఎటువంటి మైలేజీ, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉండొద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్ విచారణకు మరో రోజు వస్తానంటూ కాళేశ్వరం కమిషన్ కు లేఖ రాసి వాయిదా తీసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.    దీంతో కేసీఆర్ ఫొటో పెట్టుకుని కూడా బీఆర్ఎస్ ను పూర్తిగా విస్మరించి కవిత బిగ్ పొటికల్ స్టెప్ వేయడానికి నాందిగా ఇందిరా పార్క్ వద్ద చేసిన ధర్నా అనుకున్నప్రయోజనాన్ని సాధించలేకపోయారు.  ఇక కవిత ధర్నాలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. సరే జాగృతి బ్యానర్ పై ఆమె ధర్నా చేశారు కనుక బీఆర్ఎస్ జెండాలు లేవని అనుకుందాం.. కానీ ఈ ధర్నాలో ఎక్కడా మచ్చుకి కూడా బీఆర్ఎస్ నాయకులు కనిపించలేదు. కేసీఆర్ ఫొటోతో, కేసీఆర్ కు మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు లేకపోవడాన్ని బట్టి చూస్తుంటే.. కవితను బీఆర్ఎస్ పూర్తిగా బాయ్ కాట్ చేసిందని భావించక తప్పదు.  వాస్తవానికి కవిత బీఆర్ఎస్ ను ధిక్కరించినా.. ఆమె ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపడడానికి పోరాడుతున్న యోధురాలిగానే కవితను బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. ఎందుకంటే ఆమె తన ప్రసంగాలలో కాంగ్రెస్, బీజేపీలపై సమానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ తన దేవుడని చెబుతున్నారు. అటువంటప్పుడు ఇటువంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ డిస్ ఓన్ చేసుకోవడం ఎందుకన్న బాధ బీఆర్ఎస్ క్యాడర్ లో కనిపిస్తోంది.  
కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు వాయిదా.. కవిత ధర్నా వృధా !?  Publish Date: Jun 5, 2025 5:53PM

మావోయిస్టులకు ఎదురుదెబ్బ..మరో అగ్రనేత మృతి

  మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు టెంతు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్, ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని జాతీయ పార్క్ వద్ద జరిగిన  ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఆయన తలపై రూ.50 లక్షల రివార్డు ఉంది. గత 40 ఏళ్లుగా మవోయిస్టు ఉద్యమంలో ఉన్న సింహాచలం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో శాంతిచర్చల్లో కీలకంగా వ్యవరించారు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. ఆపరేషన్‌ కగార్‌, ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ల నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను  ఇటీవల  పోలీసులు అరెస్ట్‌ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.  
మావోయిస్టులకు ఎదురుదెబ్బ..మరో అగ్రనేత మృతి Publish Date: Jun 5, 2025 4:40PM

తొక్కిసలాట ఘటనపై మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం

  బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో  మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం ప్రకటించింది. రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో వారి సహాయార్థం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.  ఈ దురదృష్టకర ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి  స్పందిస్తూ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ తమ సొంత మైదానంలో నిర్వహించే కార్యక్రమాల్లో తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఐపీఎల్ ఫైనల్ ముగిసి, బహుమతుల ప్రదానోత్సవం పూర్తయిన తర్వాత ఫ్రాంచైజీ తమ హోమ్ గ్రౌండ్‌లో ఏం చేస్తుందనే దానితో బీసీసీఐకి ఎలాంటి సంబంధం ఉండదు అని స్పష్టం చేశారు . (ఆర్సీబీ) మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా బీసీసీఐకి లేదు" అని ఆయన స్పష్టం చేశారు.బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ లేదా వేడుకలు ప్లాన్ చేసినట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరు దీనిని నిర్వహించారో, అంతమంది అభిమానులు ఎలా అక్కడికి వచ్చారో మాకు తెలియదు" అని సైకియా తెలిపారు.నిన్న  చిన్నస్వామి స్టేడియం ఈ ఘటనలో 11  మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా సంగతి తెలిసిందే
 తొక్కిసలాట ఘటనపై మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం Publish Date: Jun 5, 2025 4:13PM

పర్యావరణ పరిరక్షణకు..ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి : మంత్రి పొన్నం

  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని లేకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మంత్రి  మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని సూచించారు. చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయి. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఢిల్లీ పొల్యూషన్ అయిపోయింది.అక్కడ నుండి ప్రజలు వేరే రాష్ట్రాలకు వలస పోతున్నారు. వాహనాలు నడిపించే పరిస్థితి లేదన్నారు. కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోకపోవడం అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని చెప్పారు. మనకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే చెట్లు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.  
పర్యావరణ పరిరక్షణకు..ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి : మంత్రి పొన్నం Publish Date: Jun 5, 2025 3:29PM

మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్

  వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 3న విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి కేసులో వాదోపవాదాలు విన్న మెజిస్ట్రేట్ విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఇదే కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది.  ఏ4గా ఉన్న కాకాణిని బెంగుళూరులో ఓ రిసార్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేథార్ నాథ్‌ను స్పెషల్ పీపీగా బాధ్యతలు ఇచ్చి నెల్లూరుకు పంపింది ప్రభుత్వం. నేడు కేథార్ నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొసీక్యూషన్ రాజేంద్ర ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్సీ ఎస్టీ 5వ అదనపు ప్రత్యేక న్యాయస్థానానికి రాజేంద్రప్రసాద్ చేరుకుని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
 మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్ Publish Date: Jun 5, 2025 3:28PM

అంబటి రాంబాబు.. కోరి కేసులో ఇరుక్కున్నది అందుకేనా?

వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుల కారణంగా కేసుల బారిన పడుతున్నారు. అయితే అరెస్టులు, కేసుల ద్వారా ప్రజలలో సింపతీని గెయిన్ చేయవచ్చన్న భావనతతో కేసులకు ఎదురెడుతున్నారా అన్న అనుమానం కలగక మానదు అంబటి రాంబాబు వంటి వారి తీరు చూస్తుంటే.  ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నదని, కేసులు పెట్టి అరెస్టు చేస్తు న్నదనీ ప్రజలను నమ్మించడానికి కోరి మరీ కేసులకు ఎదురెడుతున్నారా అనిపించక మానదు బుధవారం (జూన్ 4)  జరిగిన అంబటి ఎపిసోడ్ గమనిస్తే.    గుంటూరు పట్టాభిపురంలో  వెన్నుపోటు ర్యాలీ చేస్తాం అని అంబటి రాంబాబు తమ పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరారు.  ఆ ర్యాలీలో పాల్గొనేందుకు కొంతమంది వైసీపీ క్యాడర్  వచ్చిన తీరు చూసి ఇలాంటి సందర్భంలో ర్యాలీలు చేస్తే శాంతి భద్రతల  సమస్య వస్తుందని, ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు పోలీసులు.  దీంతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై తన జులుం ప్రదర్శించారు. పోలీస్ అధికారిపై ఇష్టారీతిగా రెచ్చిపోయారు.   నా ర్యాలీనే అడ్డుకుంటావా?  నీకు అంత దమ్ముందా? ఏది ఆపు చూద్దాం అంటూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కేకలు వేస్తూ  పోలీసు అధికారికి వేలు చూపించి బెదరిస్తూ. మీ సంగతి తెలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అంబటి రాంబాబు చేసిన హడావిడితో, సామాన్య జనంతో పాటు, పోలీసు అధికారులు , చివరికి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కయ్యారు. ర్యాలీకి పర్మిషన్ లేదు కదా పోలీసులు చెప్పినట్లుగా విని వెళ్లిపోతే బాగుంటుంది లేదంటే అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అని వైసీపీ క్యాడర్ భయపడ్డారు. అంబటి రాంబాబు రెచ్చిపోవడం చూసి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ క్యాడర్ చాలా వరకూ జారుకుంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకున్నారు.  అయితే అంబటి రాంబాబు మాత్రం  గతంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలను, పోలీసులు ను ఎలా అయితే ఓ ఆట ఆడుకున్నారో..  ఇప్పుడు కూడా అదే తరహా ఆలోచనతో పోలీసులపైనే దౌర్జన్యానికి దిగడంతో అంబటి పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు పోలీస్ అధికారులు. దీంతో గుంటూరు పట్టాభిపురం లో అంబటి రాంబాబు పై  సు నమోదు అయ్యింది.   యితే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనా, అంబటి పై పోలీసులు చర్యలు లేవు. మరి ఇప్పుడు పోలీసులపైనే తిరగబడిన అంబటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
 అంబటి రాంబాబు.. కోరి కేసులో ఇరుక్కున్నది అందుకేనా? Publish Date: Jun 5, 2025 3:27PM

అమరావతిలో లా వర్సిటీ

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలి వస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మ విద్య సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది.  అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం లా యూనివర్శిటీ ఏర్పాటు కానుంది.  బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో  ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ను ఇక్కడ ఏర్పాటు కానుంది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి  ప్రతిభాదేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యూనివర్సిటీ న్యాయ విద్యకు, పరిశోధనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లా యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు బీసీఐ ట్రస్ట్‌ ముందుకొచ్చింది. బీసీఐ అధ్యక్షుడితో పాటు ఇతర కీలక సభ్యులు గవర్నర్‌ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడితో ఇప్పటికే వేరువేరుగా సమావేశమయ్యారు. అమరావతిలో బీసీఐ ఏర్పాటు చేయనున్న ఈ న్యాయ వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా ఈ వర్సీటీ ఏర్పాటు  న్యాయ, అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యావకాశాల కల్పనకు, స్కిల్స్‌ పెంచుకునేందుకు ఎంతగానో దోహదపడనుంది. బీసీఐ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో 1986లో నేషనల్ లా స్కూల్‌ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ,  గోవాలో ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఉన్నాయి. ఇప్పుడు అదే బీసీఐ అమరావతిలో  మూడో లా  యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది.   
అమరావతిలో లా వర్సిటీ Publish Date: Jun 5, 2025 2:52PM

మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్

  వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 3న విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి కేసులో వాదోపవాదాలు విన్న మెజిస్ట్రేట్ విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఇదే కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది.  ఏ4గా ఉన్న కాకాణిని బెంగుళూరులో ఓ రిసార్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేథార్ నాథ్‌ను స్పెషల్ పీపీగా బాధ్యతలు ఇచ్చి నెల్లూరుకు పంపింది ప్రభుత్వం. నేడు కేథార్ నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొసీక్యూషన్ రాజేంద్ర ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్సీ ఎస్టీ 5వ అదనపు ప్రత్యేక న్యాయస్థానానికి రాజేంద్రప్రసాద్ చేరుకుని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
 మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్ Publish Date: Jun 5, 2025 2:41PM

లాసెట్ పరీక్ష రాసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి,  పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు న్యాయశాస్త్ర ప్రవేశ పరీక్ష (లాసెట్)కు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఆయన లాసెట్ పరీక్ష రాశారు.    వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిండి, అనేక తప్పుడు అభియోగాలతో పాటు అక్రమంగా సస్పెన్షన్లు విధించిన సంగతి తెలిసిందే.  రెండు విడతలుగా ఆయన సస్పెన్షన్‌లో కొనసాగాల్సి వచ్చింది. మొదటిసారి 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు, రెండోసారి 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30వ తేదీ వరకు ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. మొత్తంగా దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన విధులకు దూరంగా ఉన్నారు. అయితే మొక్కవోని పట్టుదలతో న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. తన పదవీ విరమణ చేసే చివరి రోజున చివరిగా ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ గా బాధ్యతలు చేపట్టి అదే హోదాలో రిటైర్ అయ్యారు. కాగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావుపై గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్ల సస్పెన్షన్‌ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఏసీబీ కేసును హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఆయన తాజాగా జగన్ బాధితుల తరఫున పోరాటం చేస్తానంటూ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లాసెట్ పరీక్ష రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ హయాంలో బాధితులైన వారి తరఫున న్యాయపోరాటం చేయడానికే ఆయన లా చదవాలని నిర్ణయించుకున్నారా అన్న చర్చ మొదలైంది. 
లాసెట్ పరీక్ష రాసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ Publish Date: Jun 5, 2025 2:36PM

తుడా లో కోట్ల రూపాయల అవినీతి.. చెవిరెడ్డికి విజిలెన్స్ నోటీసులు!

జగన్ కోటరీలో  అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి విజిలెన్స్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. వైసీపీ హయాం అనేమిటి.. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కరరెడ్డే తుడా చైర్మన్.  ఇక తుడా చైర్మన్ గా చెవిరెడ్డి అక్రమాలకు కొదవే లేదన్నఆరోపణలూ మెండుగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తుడా చైర్మన్ గా  ఆ సంస్థ ఆదాయాన్ని సొంత అవసరాలకు విచ్చలవిడిగా వాడుకున్నారన్నఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. తన సొంత గ్రామంలో పనులు చేయించడానికి.. వ్యక్తిగత పనులు, ప్రయాణాలకు కూడా తుడా నిధుల్ని ఇష్టారీతిగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  మొత్తం తుడా నిధుల్లో 90 శాతం నిధులను చెవిరెడ్డి సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో పనులు చేయించడానికే వాడుకున్నారనీ,  తుడా నిధులతో చేసిన పనులకు కూడా ఏదో తన సొంత సొమ్ము ఖర్చు చేసి చేయించినట్లుగా తన పేరే వేయించుకున్నారనీ విమర్శలు ఉన్నాయి.  అంతే కాకుండా ఆ పనుల చేసే కాంట్రాక్టును తన సొంత కంపెనీకే కట్టబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనీ ఆరోపణలు ఉన్నాయి.   ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ హయాంలో అంటే 2019-24 మధ్య కాలంలో తుడాలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జనవరిలో విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దగి దర్యాప్తు చేపట్టారు. తాజాగా చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. మొత్తం 37 ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు జారీ చేసిన విజిలెన్స్ అధికారులు ఈ నెల 9లోగా  సమాధానం చెప్పాలని ఆదేశించారు. చెవిరెడ్డితో పాటు మరో 15 మందికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.   తుడా సంధించిన ప్రశ్నలకు చెవిరెడ్డి ఇచ్చే సమాధానాల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 
తుడా లో కోట్ల రూపాయల అవినీతి.. చెవిరెడ్డికి విజిలెన్స్ నోటీసులు! Publish Date: Jun 5, 2025 1:52PM

తొక్కిస‌లాట‌ల త‌ప్పెవ‌రిది?

తొక్కిస‌లాట‌తో త‌ప్పెవ‌రిది? జ‌నం ఇంత‌గా ఎగ‌బ‌డుతున్నారేంటి? పుష్ప  2 రిలీజ్ సంద‌ర్బంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిస‌లాట జ‌రిగి ఒక మ‌హిళ మృతి చెంద‌గా... ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్ప‌టికీ కోలుకోలేదు. ఇక వైకుంఠ ఏకాద‌శి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగి టీటీడీ చ‌రిత్ర‌లోనే అతి భారీ ప్రాణ న‌ష్టం సంభవించింది. ఆరుగురు ఏకంగా వైకుంఠం చేరుకున్నారు. ఇక మ‌హా కుంభ‌మేళాలో కూడా స‌రిగ్గా ఇలాంటి తొక్కిసలాటల్లోనే ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోయాయి. ఇప్పుడు చూస్తే ఆర్సీబీ గెలిచింద‌న్న సంతోషంలో బెంగ‌ళూరు చిన్న‌సామి  స్టేడియంలో  విజయోత్సవాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిస‌లాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మంది వ‌ర‌కూ గాయ ప‌డ్డారు. ఈ ఏడాది ఐపీఎల్ విన్న‌ర్ల‌కు ప్ర‌భుత్వం స‌న్మాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది. ఇది కేవ‌లం 30 న‌ల‌భై వేల మంది మాత్ర‌మే ప‌ట్టేంత చిన్న స్టేడియం. ల‌క్ష‌లాది మంది రావ‌డంతో అంతా ర‌సాబాస  అయిపోయింది. చిన్న‌బిడ్డ న‌లిగిపోవ‌డంతో పాటు ఒక‌రికి క‌త్తిపోట్లంటే ప‌రిస్థితేంటో ఊహించుకోవ‌చ్చు.  ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జరుగుతూ  ప్రాణాలు కోల్పోవడం ఆందోళ‌న‌క‌రం. ఎందుకంటే ఇప్పుడు అంత‌గా ఎగ‌బ‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు.  నిజానికి ఐపీఎల్ అన్న‌ది చాలా చాలా  చిన్న విష‌యం. ఎందుకంటే అది ఏం పెద్ద ట్రోఫీ కాదు. కాకుంటే ఇక్క‌డ క‌న్న‌డ జ‌నం ఎన్నో ఎదురు చూపుల త‌ర్వాత వ‌చ్చిన క‌ప్పు కావ‌డం.. కోహ్లీ ఫ్యాన్స్ కి ఇదొక పండ‌గ రోజే కాద‌న‌డం లేదు.  కానీ ఇలాంటి ప్రాతాల‌కు వెళ్ల‌డంలో ప్ర‌జ‌ల‌దే త‌ప్ప‌నుకోవాలి. గ‌తంలో త‌మ అభిమాన నాయ‌కుడ్ని కావ‌చ్చు, క్రికెట‌ర్ని కావ‌చ్చు ద‌గ్గ‌ర్నుంచి చూసే ఛాన్స్ ఉండ‌క పోయేది. అదే ఇప్పుడు ఎల్ఈడీ స్క్రీన్లు వ‌చ్చేశాయ్. ఇంట్లో కూడా పెద్ద ఎత్తున బుల్లి తెర‌లు పెట్టుకుని. డైరెక్ట్ లైవ్ ఎక్స్ పీరియ‌న్స్ ట్రై చేయొచ్చు. పుష్ప 2 విష‌య‌మే తీసుకుంటే ఇప్పుడున్న పైర‌సీ ఓటీటీ మానియాలో అంత‌గా సినిమా చూడ్డానికి ఎగ‌బ‌డ్డ‌మేంటి? అది కూడా ప్రీమియ‌ర్ షో చూడ్డానికి పోటీప‌డ్డం ముమ్మాటికీ త‌ప్పే. ఇందులో ఆ కుటుంబం త‌ప్పే ఎక్కువ‌ అని భావించాల్సి ఉంటుంది.  ఇక తిరుమ‌ల‌లో ఇదే వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నానికి ప‌ది  రోజుల పాటు అవ‌కాశ‌ముంటుంది. ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ జ‌నం ఎగ‌బ‌డ్డంతో  అక్కడా పరిస్థితి అదుపుతప్పింది. ఇప్పుడు టీటీడీ ఎన్నేసి ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా ఇచ్చినా.. పోయిన వారి ప్రాణాలు తిరిగొస్తాయా? అయిన వారిని పోగొట్టుకున్న కుటుంబాల వెత తీరుతుందా?  ఇక కుంభ‌మేళా ప‌రిస్థితి కూడా అంతే.. అదే ప‌నిగా ప‌ర్వ‌దినాల‌పుడు వెళ్ల‌డం స‌రి  కాదు. కానీ జ‌నం ఎగ‌బ‌డి భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. గ‌తంలో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. ఢిల్లీ రైల్వే స్టేష‌న్లో కూడా తోపులాట జ‌రిగి జ‌నం మృతి చెందారంటే ప‌రిస్థితి   ఊహించుకోవ‌చ్చు. అంత పిచ్చి చాద‌స్త‌మేంటి? మ‌హా కుంభ‌మేళాకు వెళ్ల‌ని వాళ్లు బ‌తికి ఉంటే వెళ్లిన వాళ్లు చ‌నిపోవ‌డాన్ని ఏమ‌ని అర్ధం చేసుకోవాలి??? ఇప్పుడు చూస్తే చిన్న‌స్వామి స్టేడియం విష‌యం. అంత‌గా ఎగ‌బ‌డ్డంలో ప‌బ్లిక్ దే త‌ప్పుగా భావించాలి. ఇప్ప‌టి  రోజుల్లో ప‌ది మంది గుమిగూడే చోట‌కు వెళ్ల‌డంలో వారి వారిదే త‌ప్పు అవుతుంది. అంత‌గా ఎగ‌బ‌డాల్సిన అవ‌స‌రం ఏముంది? ఇప్పుడా 11 మంది మృతుల్లో ఎంద‌రు త‌ల్లిదండ్రుల ఆశాజ్యోతులైన కుర్రాళ్లుంటారు? వారిని కోల్పోయిన ఆ పేరెంట్స్ క‌డుపుకోత ఎంతిచ్చి రుణం తీర్చుకోగ‌లం. ఇలాంటి మాన‌సిక స్థితి పూర్తిగా  త‌ప్పు. ఇదే కోహ్లీ త‌న‌ను చూడ్డానికి జ‌నం  రావాల‌నుకుంటాడు, కానీ ఇలా ఎవ‌ర్నో చూడ్డానికి ఎగ‌బ‌డడు. కోహ్లీని  చూస్తే ఏమొస్తుంది? త‌న కోసం జ‌నం చ‌చ్చేంత‌గా ఎగ‌బ‌డ్డాడ‌ని అత‌డ‌నుకోవ‌డం మిన‌హా మ‌రేదైనా లాభం ఉంటుందా? అత‌డి సంగ‌తి అలా ఉంచితే ఇపుడా త‌ల్లిదండ్రులు కుటుంబ స‌భ్యుల క‌డుపుకోత తీర్చేవారెవ‌రు? ఈ దిశ‌గా వీరంతా ఎందుకు ఆలోచించ‌డం లేదు!!! ఒక్కోసారి క్రౌడ్ ఎగ‌బ‌డితే అక్క‌డున్న పోలీస్ స‌పోర్ట్ కూడా స‌రిపోదు. ఇక్క‌డే కాదు ఎక్క‌డైనా స‌రే పోలీసు సిబ్బంది ఎంత మంది జనం ఉన్నారో అంత మందికి స‌రిప‌డా ఉండ‌రు. ఇలా ఎగ‌బ‌డితే వాళ్లు కూడా చేతులెత్తేయ‌డం ఖాయం. నిజానికి బెంగ‌ళూరు పోలీసులు చాలా చాలా స్ట్రిక్ట్. స్పీడ్ లిమిట్ పెరిగితే వేగంగా దూసుకెళ్తున్న బండ్ల మీద లాఠీలు విసురుతారు. అలాంటి పోలీసుల వ‌ల్ల కూడా ఈ తొక్కిస‌లాట కంట్రోల్ కాలేదంటే పరిస్థితి ఊహించుకోవ‌చ్చు. ఇప్పుడు కోహ్లీని చూడ్డానికి ఎగ‌బ‌డ్డారు స‌రే. మ‌రి ఆయ‌న్ను చూడ్డానికే వీరు లేరు. అలాంటి ప‌రిస్థితి తెచ్చుకోవ‌డం  త‌ప్పు.. కోహ్లీ కావ‌చ్చు అత‌డి టీమ్ మేనేజ్మెంట్ కావ‌చ్చు టీమ్ మెంబ‌ర్స్ కావ‌చ్చు.. పోలీసుల త‌ప్పు కూడా ఉండ‌క పోవ‌చ్చు. అంత‌గా ఎగ‌బ‌డ్డ జ‌నానిదే అవుతుంద‌ని అంటారు సామాజిక‌వేత్త‌లు.
తొక్కిస‌లాట‌ల త‌ప్పెవ‌రిది? Publish Date: Jun 5, 2025 1:12PM

అంబటి రాంబాబుపై కేసు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదైంది. ఇష్టారీతిగా నోరు పారేసుకోవడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పట్టభిపురం పోలీసులు స్టేషన్ లో కేసు నమోదైంది. వైసీపీ పిలుపు మేరకు బుధవారం (జూన్ 4) జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు పట్టాభిపురంలో కార్యక్రమంలో అంబటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై అనుచిత భాషలో రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బుధవారం (జూన్‌ 4) వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా  నిరసనలు, ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారుజ అందులో భాగంగా  మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో గుంటూరులో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు.   ర్యాలీలకు అనుమతుల్లేవని పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఆ సందర్భంగా  పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. ఒక దశలో రెచ్చిపోయి పోలీసులపై అనుచిత భాష ప్రయోగించారు.  పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. దమ్ముంటే ర్యాలీ ఆపు అంటూ అంబటి రాంబాబు సీఐపై రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. 
అంబటి రాంబాబుపై కేసు Publish Date: Jun 5, 2025 12:56PM

మొక్కలు నాటే బృహత్కార్యక్రమానికి చంద్రబాబు పిలుపు

పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అగ్ర ప్రాథాన్యత ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన ట్వీట్ లో ప్రకృతి ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు.  పర్యావరణ పరిరక్షణ అన్నది ప్రతి ఒక్కరి గురుతర బాధ్య అని పేర్కొన్నారు.  పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం  పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్రమం చేప‌ట్టిందని పేర్కొన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా  గురువారం (జూన్ 5) ఒక్క‌ రోజే  కోటి మొక్క‌లు నాటే బృహత్కార్యక్రమాన్ని చేపట్టామనీ, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనీ చంద్రబాబు పిలుపునిచ్చారు.   మంచి ప‌రిస‌రాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుందన్న చంద్రబాబు ఆ కారణంతోనే  స్వ‌చ్ఛ భార‌త్‌లో భాగంగా  తమ ప్రభుత్వం స్వ‌ఛ్చాంధ్ర కార్య‌క్ర‌మం చేప‌ట్టిందన్నారు. ఈ ఏడాది ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వంలో ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూల‌న అంశాన్ని థీమ్‌గా తీసుకున్నామనీ, ప్లాస్టిక్ కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి మ‌న వంతు బాధ్య‌త‌గా ప‌ని చేద్దామనీ పేర్కొన్నారు.  సీఎం చంద్ర‌బాబు, ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్  వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
మొక్కలు నాటే బృహత్కార్యక్రమానికి చంద్రబాబు పిలుపు Publish Date: Jun 5, 2025 12:38PM

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో సిట్ దర్యాప్తు వేగం.. నెక్ట్స్ నోటీసులు ఎవరికి?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం  పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ ప్రసాదం లో వినియోగించే నెయ్యి కలుషితం అంశంపై  సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  అలిపిరి సమీపంలో  కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మరీ సిట్  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్నది.  ఈ విచారణలో  భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దాదాపు 15 మందిని సిట్ అదుపులోనికి తీసుకుని పలు దఫాలు విచారించింది.  లడ్డూ కల్తీ విషయం లో గతంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి కి పీఎస్ గా ఉన్న అప్పన్న ను తాజాగా అదుపులోనికి తీసుకుంది. అప్పన్న ద్వారా లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో పలు రకాల వ్యవహారాలు జరిగాయని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కల్తీ వ్యవహారంలో అప్పన్న పాత్ర ఏమిటి?  అప్పన్నతో పాటు ఈ వ్యవహరాంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న కోణంలో గత మూడు రోజులుగా సిట్ అధికారులు అప్పన్నను విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా అప్పన్న ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా త్వరలో టీటీడీ మాజీ చైర్మన్లు  వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డి కి, అప్పటి టీటీడీ జేఈవోలు, ఇతర అధికారులకు సిట్ నోటీసులు ఇచ్చి వాచారించే అవకాశాలున్నాయని అంటున్నారు.  అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసుకు సంబంధించి త్వరలో మరి కొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  ఈ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు వేగంతో రానున్న రోజులలో ఎవరెవరికి నోటీసులు అందుతాయి, ఇంకెతంత మంది అరెస్టౌతారు, అసలీ కల్తీ వ్యవహారంలో కీలక పాత్రధాలు, సూత్రధారులు ఎవరు అన్నది త్వరలో తేలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో సిట్ దర్యాప్తు వేగం.. నెక్ట్స్  నోటీసులు ఎవరికి? Publish Date: Jun 5, 2025 10:53AM

చదువుతో పాటు విజ్ణానం.. విద్యార్థుల కోసం ఆ గురువు ఏం చేశాడో తెలుసా?

సెలవు దినాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ కుటుంబం తో గడపాలని, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని చూస్తారు. కానీ ఈ గవర్నమెంట్  టీచర్  రూటే సెపరేటు. గురువుగా తన విద్యార్థులకు విజ్ణాన బోధతో పాటు వినోదం, విహారలతో విషయపరిజ్ణానం అందించాలని భావిస్తారు. అందుకే సెలవులలో విద్యార్థులను తన సొంత ఖర్చులతో  విజ్ణాన యాత్ర కు తీసుకెళ్లారు. ఈ అనుభవం ఆ విద్యార్థుల కు జీవితం కాలం గుర్తుండిపోయేలా ఉంటుందని ఆయన చెప్పారు. ఒక అపురూప జ్ణాపకంగానే కాకుండా.. విజ్ణానాన్ని అందించి, వారిలో అవహాగన, ఆలోచనా పెంపొందడానికి కూడా దోహదపడేలా ఆ యాత్రను మలిచారు. వివరాల్లోకి వెడితే..  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాటిమీదిగూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుడు గోపినాథ్ నిర్వహించారు. వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థులకు ప్రత్యేక వికాసాన్ని అందించే లక్ష్యంతో గూడూరు మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వారిని తీసుకువెళ్లి అక్కడ నిర్వహించే కార్యకలాపాల గురించి వివిరంచి అవగాహన కల్పించారు. విద్యార్థులను క్షేత్ర సందర్శనలో భాగస్వామ్యులను చేయడం వలన వారి ఆలోచనా విధానం మారడానికీ, తద్వారా వారిలో   విషయ పరిజ్ఞానం పెంపొందేకు  దోహపడుతుందనే ఆలోచనతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలీపారు.  క్షేత్ర సందర్శనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి, బ్యాంకులు, మీసేవా కేంద్రాలు, పోలీస్‌స్టేషన్‌లు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యార్థులను తన స్వంత ప్రయాణ ఖర్చులతో  తీసుకువెళ్లినట్లు గోపినాథ్ తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందే సేవల గురించి, 108 ఉపయోగం గురించి, మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవల విదానం గురించి, ప్రజల రక్షణ కొరకు అమలులో ఉన్న చట్టల గురించీ ఈ క్షేత్ర సందర్శనలో వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
చదువుతో పాటు విజ్ణానం.. విద్యార్థుల కోసం ఆ గురువు ఏం చేశాడో తెలుసా? Publish Date: Jun 5, 2025 10:34AM