మొక్కలు నాటే బృహత్కార్యక్రమానికి చంద్రబాబు పిలుపు
posted on Jun 5, 2025 12:38PM

పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అగ్ర ప్రాథాన్యత ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన ట్వీట్ లో ప్రకృతి ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. పర్యావరణ పరిరక్షణ అన్నది ప్రతి ఒక్కరి గురుతర బాధ్య అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం (జూన్ 5) ఒక్క రోజే కోటి మొక్కలు నాటే బృహత్కార్యక్రమాన్ని చేపట్టామనీ, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనీ చంద్రబాబు పిలుపునిచ్చారు.
మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుందన్న చంద్రబాబు ఆ కారణంతోనే స్వచ్ఛ భారత్లో భాగంగా తమ ప్రభుత్వం స్వఛ్చాంధ్ర కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలన అంశాన్ని థీమ్గా తీసుకున్నామనీ, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా పని చేద్దామనీ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.