టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మాగంటి గోపీనాథ్

 

జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు భారాస నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని గోపీనాథ్‌ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని హరీశ్‌రావు తెలిపారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాజకీయ ఓనమాలు నేర్చుకుంది టీడీపీలోనే. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన

తన 26 ఏళ్ల వయస్సులో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 1985 నుంచి 1992 వరకు  పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్‌గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, హైదరాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఇలా వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు.గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ  నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన పరిణామాలతో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గులాబీ టికెట్‌పై పోటీ చేసి రెండు సారి విజయం సాధించారు. ఆయన 2018లో శాసనసభలో పీఈసీ సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికల్లో మూడో బీఆర్ఎస్ టికెట్‌తో పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ అయిన గోపీనాథ్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.