ఆ ఒక్క సినిమా మూవీ మొఘల్ జీవితాన్ని మార్చేసింది!
on Jun 6, 2025
(జూన్ 6 మూవీమొఘల్ డా.డి.రామానాయుడు జయంతి సందర్భంగా..)
సినిమా అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కొందరు నటీనటులుగా రాణించడానికి ఇష్టపడతారు, మరికొందరు సాంకేతిక నిపుణులుగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు. మరికొందరు మంచి సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాంటి ఓ బలమైన కోరికతో సినిమా రంగానికి వచ్చారు మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు. తను ఏ పనిచేసినా నెంబర్ వన్గా ఉండాలని ఇష్టపడే రామానాయుడు.. సినీ రంగానికి రాకముందు కొన్ని వ్యాపారాలు చేశారు. అందులోనూ నెంబర్వన్ అనిపించుకొని నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి సినిమా రంగంలోనూ నెంబర్వన్గా నిలిచారు డి.రామానాయుడు.
1936 జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడులోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు దగ్గుబాటి రామానాయుడు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. రామానాయుడు మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత పిల్లలను తండ్రి వెంకటేశ్వర్లు పెంచి పెద్ద చేశారు. మద్రాస్లోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు రామానాయుడు. ఆ తర్వాత కారంచేడు వచ్చి రైస్మిల్లు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేశారు. ఆ సమయంలోనే నమ్మినబంటు షూటింగ్ కారంచేడులో చేశారు. ఆ సినిమాలో రామానాయుడు ఒక చిన్న పాత్ర కూడా చేశారు. ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించడంతో సినిమాల్లోకి రమ్మని అక్కినేని నాగేశ్వరరావు ఆహ్వానించారు. అలా సినిమా రంగంవైపు అడుగులు వేశారు రామానాయుడు.
1962లో కొందరు భాగస్వాములతో కలిసి ‘అనురాగం’ చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు. అయితే ఆ సినిమాకి పెట్టుబడి పెట్టినా నిర్మాతగా ఆయన పేరు వెయ్యడం కుదరదని చెప్పారు. అయితే షూటింగ్కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతానని ఆ దర్శకనిర్మాతలకు చెప్పారు రామానాయుడు. అలా ఆ సినిమాను పూర్తి చేసి 1962 జూన్లో రిలీజ్ చేశారు. అది మంచి సినిమా అని పేరొచ్చినప్పటికీ డబ్బు రాలేదు. దాంతో అదే సంవత్సరం తన పెద్ద కుమారుడు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా ఎన్.టి.రామారావుతో ‘రాముడు భీముడు’ చిత్రాన్ని తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించారు. తెలుగులో వచ్చిన తొలి డూయల్ రోల్ సినిమా ఇదే. 1964 మే 21న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.
‘రాముడు భీముడు’ తర్వాత కాంతారావుతో ‘ప్రతిజ్ఞాపాలన’ చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు. ఆ సినిమా కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్.టి.రామారావుతో ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ, ఆశించినంత విజయం సాధించలేదు. 1970లో జగ్గయ్య హీరోగా ‘ద్రోహి’ చిత్రం చేశారు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని అందించింది. దాంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు రామానాయుడు. అదే సమయంలో ‘ప్రేమనగర్’ చిత్రం చేసేందుకు సిద్ధపడ్డారు. ఆరోజుల్లోనే 15 లక్షలతో ఈ చిత్రాన్ని ఎంతో భారీగా నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే సినిమా రంగాన్ని వదిలేసి వ్యవసాయం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. 1971 సెప్టెంబర్ 24న ‘ప్రేమనగర్’ రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంత వర్షంలోనూ రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అయింది ‘ప్రేమనగర్’. తిరుగులేని విజయం సాధించిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.
ఆ మరుసటి సంవత్సరమే శివాజీగణేశన్తో ‘వసంత మాళిగై’ పేరుతో ప్రేమనగర్ను తమిళ్లో రీమేక్ చేశారు రామానాయుడు. అక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రాజేష్ఖన్నాతో ‘ప్రేమ్నగర్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఇలా ప్రేమనగర్ సాధించిన విజయంతో నిర్మాతగా స్థిరపడిపోయారు రామానాయుడు. ఆ తర్వాత వరసగా జీవనతరంగాలు, సోగ్గాడు, చక్రవాకం, దేవత, ముందడుగు, మండే గుండెలు, అహనా పెళ్ళంట, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా.. ఇలా టాలీవుడ్లోని టాప్ హీరోలు, చిన్న హీరోలతో ఒకదాని వెంట ఒకటి సూపర్హిట్ సినిమాలు చేస్తూ వెళ్ళారు. అలాగే హిందీలో కూడా చాలా హిట్ సినిమాలు నిర్మించారు. 13 భాషల్లో 150 సినిమాలు నిర్మించి రికార్డు సృష్టించారు రామానాయుడు.
వ్యక్తిగత విషయాలకు వస్తే.. రామానాయుడు వివాహం 1958 నవంబర్ 13న రాజేశ్వరితో జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. పెద్దవాడైన సురేష్బాబు చిత్ర నిర్మాణంలో ఉండగా, చిన్నవాడు వెంకటేష్ని 1986లో ‘కలియుగ పాండవులు’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు రామానాయుడు. ఆ తర్వాత తమ సొంత బేనర్లోనే వెంకటేష్తో ఎన్నో సూపర్హిట్ సినిమాలు నిర్మించారు. 1999లో తెలుగు దేశం పార్టీ తరఫున బాపట్ల లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు రామానాయుడు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో అదే స్థానంలో ఓటమి పాలయ్యారు. 2006లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. ఆ తర్వాత శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ను అందించింది. 2009లో కేంద్ర ప్రభుత్వం రామానాయుడికి దాదా సాహెబ్ ఫాల్కే, 2012లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. వివిధ భాషల్లో నిర్మించిన సినిమాలకు జాతీయ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ అవార్డులు అనేకం అందుకున్నారు రామానాయుడు.
2014 జనవరిలో జరిపిన వైద్య పరీక్షల్లో రామానాయుడుకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత ఏడాది పాటు ఆ వ్యాధితో బాధపడిన ఆయన 2015 ఫిబ్రవరి 18న 78 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్ర సీమలో మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న వారిలో రామానాయుడు ముందు వరసలో ఉంటారు. ఆయన ఎంతో మంది కొత్త నిర్మాతలకు ఆదర్శంగా నిలిచారు. చిత్ర పరిశ్రమలో ఎదగాలి అనే పట్టుదలతో కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని రామానాయుడు సినీ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
