తొక్కిసలాటల తప్పెవరిది?
posted on Jun 5, 2025 1:12PM

తొక్కిసలాటతో తప్పెవరిది? జనం ఇంతగా ఎగబడుతున్నారేంటి? పుష్ప 2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందగా... ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోలుకోలేదు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగి టీటీడీ చరిత్రలోనే అతి భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఆరుగురు ఏకంగా వైకుంఠం చేరుకున్నారు. ఇక మహా కుంభమేళాలో కూడా సరిగ్గా ఇలాంటి తొక్కిసలాటల్లోనే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి.
ఇప్పుడు చూస్తే ఆర్సీబీ గెలిచిందన్న సంతోషంలో బెంగళూరు చిన్నసామి స్టేడియంలో విజయోత్సవాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మంది వరకూ గాయ పడ్డారు. ఈ ఏడాది ఐపీఎల్ విన్నర్లకు ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇది కేవలం 30 నలభై వేల మంది మాత్రమే పట్టేంత చిన్న స్టేడియం. లక్షలాది మంది రావడంతో అంతా రసాబాస అయిపోయింది. చిన్నబిడ్డ నలిగిపోవడంతో పాటు ఒకరికి కత్తిపోట్లంటే పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరం. ఎందుకంటే ఇప్పుడు అంతగా ఎగబడాల్సిన అవసరమే లేదు. నిజానికి ఐపీఎల్ అన్నది చాలా చాలా చిన్న విషయం. ఎందుకంటే అది ఏం పెద్ద ట్రోఫీ కాదు. కాకుంటే ఇక్కడ కన్నడ జనం ఎన్నో ఎదురు చూపుల తర్వాత వచ్చిన కప్పు కావడం.. కోహ్లీ ఫ్యాన్స్ కి ఇదొక పండగ రోజే కాదనడం లేదు.
కానీ ఇలాంటి ప్రాతాలకు వెళ్లడంలో ప్రజలదే తప్పనుకోవాలి. గతంలో తమ అభిమాన నాయకుడ్ని కావచ్చు, క్రికెటర్ని కావచ్చు దగ్గర్నుంచి చూసే ఛాన్స్ ఉండక పోయేది. అదే ఇప్పుడు ఎల్ఈడీ స్క్రీన్లు వచ్చేశాయ్. ఇంట్లో కూడా పెద్ద ఎత్తున బుల్లి తెరలు పెట్టుకుని. డైరెక్ట్ లైవ్ ఎక్స్ పీరియన్స్ ట్రై చేయొచ్చు. పుష్ప 2 విషయమే తీసుకుంటే ఇప్పుడున్న పైరసీ ఓటీటీ మానియాలో అంతగా సినిమా చూడ్డానికి ఎగబడ్డమేంటి? అది కూడా ప్రీమియర్ షో చూడ్డానికి పోటీపడ్డం ముమ్మాటికీ తప్పే. ఇందులో ఆ కుటుంబం తప్పే ఎక్కువ అని భావించాల్సి ఉంటుంది.
ఇక తిరుమలలో ఇదే వైకుంఠ ద్వారా దర్శనానికి పది రోజుల పాటు అవకాశముంటుంది. ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ జనం ఎగబడ్డంతో అక్కడా పరిస్థితి అదుపుతప్పింది. ఇప్పుడు టీటీడీ ఎన్నేసి లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చినా.. పోయిన వారి ప్రాణాలు తిరిగొస్తాయా? అయిన వారిని పోగొట్టుకున్న కుటుంబాల వెత తీరుతుందా? ఇక కుంభమేళా పరిస్థితి కూడా అంతే.. అదే పనిగా పర్వదినాలపుడు వెళ్లడం సరి కాదు. కానీ జనం ఎగబడి భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో.. ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా తోపులాట జరిగి జనం మృతి చెందారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. అంత పిచ్చి చాదస్తమేంటి? మహా కుంభమేళాకు వెళ్లని వాళ్లు బతికి ఉంటే వెళ్లిన వాళ్లు చనిపోవడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలి???
ఇప్పుడు చూస్తే చిన్నస్వామి స్టేడియం విషయం. అంతగా ఎగబడ్డంలో పబ్లిక్ దే తప్పుగా భావించాలి. ఇప్పటి రోజుల్లో పది మంది గుమిగూడే చోటకు వెళ్లడంలో వారి వారిదే తప్పు అవుతుంది. అంతగా ఎగబడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడా 11 మంది మృతుల్లో ఎందరు తల్లిదండ్రుల ఆశాజ్యోతులైన కుర్రాళ్లుంటారు? వారిని కోల్పోయిన ఆ పేరెంట్స్ కడుపుకోత ఎంతిచ్చి రుణం తీర్చుకోగలం.
ఇలాంటి మానసిక స్థితి పూర్తిగా తప్పు. ఇదే కోహ్లీ తనను చూడ్డానికి జనం రావాలనుకుంటాడు, కానీ ఇలా ఎవర్నో చూడ్డానికి ఎగబడడు. కోహ్లీని చూస్తే ఏమొస్తుంది? తన కోసం జనం చచ్చేంతగా ఎగబడ్డాడని అతడనుకోవడం మినహా మరేదైనా లాభం ఉంటుందా? అతడి సంగతి అలా ఉంచితే ఇపుడా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల కడుపుకోత తీర్చేవారెవరు? ఈ దిశగా వీరంతా ఎందుకు ఆలోచించడం లేదు!!!
ఒక్కోసారి క్రౌడ్ ఎగబడితే అక్కడున్న పోలీస్ సపోర్ట్ కూడా సరిపోదు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే పోలీసు సిబ్బంది ఎంత మంది జనం ఉన్నారో అంత మందికి సరిపడా ఉండరు. ఇలా ఎగబడితే వాళ్లు కూడా చేతులెత్తేయడం ఖాయం. నిజానికి బెంగళూరు పోలీసులు చాలా చాలా స్ట్రిక్ట్. స్పీడ్ లిమిట్ పెరిగితే వేగంగా దూసుకెళ్తున్న బండ్ల మీద లాఠీలు విసురుతారు. అలాంటి పోలీసుల వల్ల కూడా ఈ తొక్కిసలాట కంట్రోల్ కాలేదంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇప్పుడు కోహ్లీని చూడ్డానికి ఎగబడ్డారు సరే. మరి ఆయన్ను చూడ్డానికే వీరు లేరు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం తప్పు.. కోహ్లీ కావచ్చు అతడి టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు టీమ్ మెంబర్స్ కావచ్చు.. పోలీసుల తప్పు కూడా ఉండక పోవచ్చు. అంతగా ఎగబడ్డ జనానిదే అవుతుందని అంటారు సామాజికవేత్తలు.