అమరావతిలో లా వర్సిటీ
posted on Jun 5, 2025 2:52PM

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలి వస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మ విద్య సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం లా యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ను ఇక్కడ ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యూనివర్సిటీ న్యాయ విద్యకు, పరిశోధనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లా యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు బీసీఐ ట్రస్ట్ ముందుకొచ్చింది. బీసీఐ అధ్యక్షుడితో పాటు ఇతర కీలక సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడితో ఇప్పటికే వేరువేరుగా సమావేశమయ్యారు.
అమరావతిలో బీసీఐ ఏర్పాటు చేయనున్న ఈ న్యాయ వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా ఈ వర్సీటీ ఏర్పాటు న్యాయ, అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యావకాశాల కల్పనకు, స్కిల్స్ పెంచుకునేందుకు ఎంతగానో దోహదపడనుంది. బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ , గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఉన్నాయి. ఇప్పుడు అదే బీసీఐ అమరావతిలో మూడో లా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది.