48 గంటల అబ్జర్వేషన్‌లో మాగంటి.. దేవుడి దయతో కోలుకోవాలి : హరీశ్ రావు

 

జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ దేవుడి దయతో  కోలుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన గోపీనాథ్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. నిపుణులైన వైద్యలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంటారని హారీశ్‌రావు తెలిపారు. మాగంటి త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారని ఆశిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతు గోపీనాథ్‌ కోలుకుంటున్నారని గోపీనాథ్‌ వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. ఇటీవల బోరబండకు చెందిన బీఆర్‌ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్‌ సర్దార్‌ ఆత్మహత్య ఘటనతో మాగంటి ఒత్తిడికి గురయ్యారన్నారు. 

48గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని వివరించారు. మాగంటి గోపీనాథ్‌కు సీనియర్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారని, క్షేమంగా బయటికొస్తారనే విశ్వాసం ఉందన్నారు. 48 గంటల తర్వాత వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తారని తెలిపారు. అయితే ఆయన వెంటీలేటర్ పై చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన బంధువులు పేర్కొన్నారు. ఆయన అనారోగ్యంపై వస్తున్న వందతులను కొట్టిపారేశారు. గోపీనాథ్ కు ఐసీయూలో 48 గంటల అబ్జర్వేషన్ కొనసాగుతోందని, ఆయన చనిపోయారంటూ వస్తున్న వార్తలు అసత్యం అన్నారు.దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరారు. మరోవైపు గోపీనాథ్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.