మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్

ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఉత్కంఘగా  ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేర‌కు "AP DSC 2025 ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు!" అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  ఇక‌, ఈ రోజు (జూన్ 6, 2025) ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17  మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు.

కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ  ఫైలు మీదే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే.