భటింగే తో కటింగే.. నినాదం కాదు, నిజం!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి వరసగా మూడవసారి ప్రజా పట్టాభిషేకం జరిగి సంవత్సరం పూర్తయింది. అవును.. గత సంవత్సరం జూన్ 4,5 తేదీలలో  2004 లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఎ విజయ కేతనం ఎగరేసింది. మోదీ సర్కార్ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టింది. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడవ సారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోదీ చరిత్రలో స్థానం  సంపాదించుకున్నారు. అంతవరకు బాగుంది..  అయితే  ఈ ఎన్నికల్లో ప్రజలు అంతకు మించిన సందేశమే ఇచ్చారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ  ప్రజలు వరసగా మూడవ సారి  ప్రధాని మోదీ పాలన పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అయితే అది సంపూర్ణమా అంటే కాదు. ఎన్డీయేకి అధికారాన్నిఅయితే అప్పగించారు కానీ.. ఎన్డీఎకు ఆశించిన మెజారిటీ రాలేదు. అలాగే..  ఎన్డీఎ కూటమికి సారధ్యం వహిస్తున్న బీజేపీకి కూడా ఆశించిన ఫలితాలు రాలేదు.  కమల దళం కలలు కన్న 400 ప్లస్  (చార్ సౌ పార్) నెంబర్ కు ఆమడల దూరంలోనే బీజేపీ స్కోర్ ఆగిపోయింది. ఆశించిన నెంబర్ రాక పోవడమే కాదు.. సిట్టింగ్ స్థానాలకే పెద్ద ఎత్తున గండి పడింది.  బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది.  అంతే కాదు వరసగా రెండు ఎన్నికల్లో (2014,2019), సోంతంగానే మెజారిటీ సొంతం చేసుకున్న బీజేపీ మూడవ సారి మాత్రం ఆ మెజారిటీ సాధించలేకపోయింది.  బీజేపీ ఎంపీల సంఖ్య సింపుల్ మెజారిటీకి 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయినా..  ఎన్డీఎ కూటమి 293 సీట్లు గెలవడంతో అధికారం నిలబడింది. ముఖ్యంగా తెలుగుదేశం (16), జనతదళ్(యు)(11) మద్దతుతో మోదీ ముచ్చటగా మూడవ సారి ప్రధాని అయ్యారు. 

మోదీ ప్రధాని అయ్యారు కానీ..  మోదీ 3.0 ప్రభుత్వం ముందులా కీలక నిర్ణయాలు తీసుకోగల్గుతుందా?  మోదీ  సుస్థిర పాలన కొనసాగించ గలరా? అనే అనుమానాలు  రాజకీయ వర్గాల్లో సర్వత్రా వ్యక్తమయ్యాయి. మరో వంక.. సంకీర్ణ కట్టుబాట్లు  జాతీయవాద ఎజెండాకు బ్రేకులు వేస్తాయా?  అనే సందేహాలు సంఘ్ పరివార్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. 

అయితే.. ఇటు చంద్రబాబు, అటు నితీష్ కుమార్ మోదీకి అండగా నిలవడంతో ఆనాటి అనుమానాలు అన్నీ తొలగి పోయాయి. మోదీ సర్కార్   ప్రయాణం సజావుగా సాగుతోంది.  ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు  ముఖ్యంగా.. టీడీపీ అధినేత,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజనీతిజ్ఞతతో   పార్టీలు వేరైనా  అంతరంగం ఒకటే అన్నట్లుగా సుస్థిర అభివృద్దే లక్ష్యంగా ఒకటిగా సాగుతున్నారు. అందుకే.. మోదీ ప్రభుత్వం పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా  సుస్థిరంగా సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. చివరకు,  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా  మోదీ 3.0 ప్రభుత్వం  ముందు కంటే మరింత స్థిరంగా ముందుకు సాగుతోందనీ, శషబిషలు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.

మరోవంక.. 2024 ఎన్నికల ఫలితాలు  ప్రతిపక్ష ఇండియా కూటమి, ముఖ్యమంగా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలకు అవకాశం కల్పించాయి.  వరసగా రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని  కాంగ్రస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదాను ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష  నాయకుడయ్యారు.  అదొకటి అయితే..  2024 ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును, విశ్లేషించుకుంటే, అటు బీజేపీకి అయినా ఇటు కాంగ్రెస్ కు అయినా  మిత్ర పక్షాల చేదోడు అవసరమని స్పష్టం చేశాయి. మిత్రపక్షాల సహకారం లేకుండా  అధికారమే కాదు.. ప్రతిపక్ష హోదా కూడా అసాధ్యమనే వాస్తవాన్ని 2024 ఎన్నికల ఫలితాలు విశదీకరించాయి.  

నిజానికి.. 2024 ఎన్నికల ఫలితాలే కాదు, ఈసంవత్సర కాలంలో జరిగిన వివిధ రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అందుకే, బీజేపీ  ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ (కలిసి ఉంటే కలదు సుఖం,విడిపోతే పడిపోతాం) అనే  నినాదాన్ని ఉభయ తారకంగా ఉపయోగించుకుని  లోక్ సభ ఎన్నికల నష్టాన్ని  మహరాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పూడ్చుకుంది. ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడంమే కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జమ్మూ కశ్మీర్, ఝారఖండ్  తదితర రాష్ట్రల్లోనూ  ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందగలిగింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ  పరిస్థతి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. దేశ రాజధానిలో వరసగా అరవ సారి జీరో’ గా మిగిలింది.  సో...   ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ నినాదం కాదు నిజం అంటున్నారు.