ముందే ముగిసిన వానా కాలం.. జపాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉష్ణోగ్రతలు

జపాన్ లో వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగి జనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఆ దేశంలో 1875లో ఉష్ణోగ్రతల సమోదు ఆరంభమైనప్పటి నుంచి నేటి వరకూ అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఈ ఏడాది జూన్ రికార్డు సృష్టించింది. సాధారణంగా జూన్ నెల జపాన్ లో వానా కాలం. ఈ ఏడాది ఆ దేశంలో వర్షాకాలం దాదాపు 26 రోజులు ముందే ముగిసి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. దీంతో వడ దెబ్బ తగిలి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాతావరణ మార్పునకు, హీట్ వేవ్ కు భూ తాపమే కారణమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. 

వచ్చేది నేనే.. కబడ్దార్.. తప్పు చేసిన అధికారుల తుప్పు వదలగొడతా.. బాబు

తప్పుడు అధికారుల తుప్పు వదలగొడతా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేననీ.. ఇప్పుడు తప్పులు చేసిన అధికారులెవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. సీబీ సీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ వరకూ వెళ్లిపోయిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోందని దుయ్యబట్టారు. సుప్రీం నిబంధనల తోసి రాజని మరీ సీబీసీఐడీ వ్యవహరిస్తోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని సీబీసీఐడీ చేస్తున్న అరెస్టులను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును సీబీసీఐడీ అధికారులు డీల్ చేసిన విధానంపై జగన్ సర్కార్ ఎన్నో విమర్శలను ఎదుర్కొందని గుర్తు చేసిన చంద్రబాబు.. సామాజిక మాధ్యమంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడతారా అని నిలదీశారు.   కొద్ది మంది కళంకిత అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సామాజి క మాధ్యమంలో చురుకుగా ఉండే వెంకటేశ్, సాంబశివరావు వంటి వారి విషయంలో సీబీసీఐడీ వ్యవహరించిన తీరు అమానుషంగా ఉందన్నారు. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశందే అన్న చంద్రబాబునాయుడు కళంకిత అధికారులను వదిలే ప్రశక్తే లేదని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదేనన్న చంద్రబాబు. కార్యకర్తలనే కాదు.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని చెప్పారు.    

సీఈసీ సీక్రెట్ విజిట్.. ఎందుకీ రహస్యం?

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ కుమార్, రెండు రోజులుగా హైదరాబాద్’లో ఉన్నారు. మరో రోజు కూడా ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం మేరకు, ఆయన శుక్రవారం (జులై 1) హైదరాబాద్ వచ్చారు. జూలై 3 వ తేదీ (ఆదివారం)వరకు  హైదరాబాద్’లోనే ఉంటారు. సీఈసీ హైదరబాద్ రావడం విశేషం కాదు, కానీ, వచ్చిన సమయ సందర్భాల విషయంలో, అదే విధంగా సీఈసీ పర్యటన గురించి, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మీడియాకు అంతగా సమాచారం లేక పోవడం విషయంలో రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.  సహజంగా సీఈసీ లేదా కేంద్ర ఎన్నికల సంఘం  సీనియర్ అధికాలు రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం, మీడియాకు సమాచారం అందిస్తుంది. అయితే, ప్రస్తుత పర్యటనకు సంబందించి, సరైన సమాచారం లేదని, ఏంపిక చేసిన మీడియా సంస్థలకు మాత్రమే సమాచారం, అది  కూడా  అరకొరగా మాత్రమే అందించారని అంటున్నారు. అందుకే, ఎందుకీ, గోప్యత అంటూ ఇటు మీడియా వర్గాలు, అటు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అలాగే, మీడియాకు అందుబాటులో  లేకుండా సీఈసీ గోల్కొండ రిసార్ట్ లో బస చేయడం గురించి కూడా అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అలాగని సీఈసీ పర్యటనకు ప్రాధాన్యత లేదా అంటే లేక పోలేదు, ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం) తయారుచేసే ఈసీఐఎల్ ను సందర్శిస్తున్నారు.  ఈవీఎంలకు సంబందించిన వివిధ అంశాలపై అధికారాలతో చర్చలు జరుపుతున్నారు, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర  ఎన్నికల సంఘం ప్రధాన అధికారి  వికాస్ రాజ్, ఇతర అధికారులతో, ఎన్నికలకు సంబందించిన వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. నిజానికి ఈవీఎంల విషయంలో  రాజకీయ పార్టీలకు ఎప్పటినుంచో అనుమనాలు న్నాయి. కాంగ్రెస్ సహా కొన్ని ప్రధాన పార్టీల నుంచి మళ్ళీ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ వినవస్తోంది. మరో వంక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించిన ఉహాగానాలు  వినవస్తున్నాయి. ఈ నేపధ్యంలో, సీఈసీ  రాష్ట్ర పర్యటనకు చాల ప్రాధన్యత ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే, సీఈసీ గుట్టు చప్పుడు కాకుండా, ఎందుకు వచ్చారు? ఏమి  చేశారు? అనే విషయంలో అధికారిక సమాచారం లేక పోవడంతో అనుమానాలు బలపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఈసీ పర్యటను రాష్ట్ర  ఎన్నికల సంఘం ఎందుకు గోప్యంగా ఉంచింది అనే విషయంలో రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.

ఆ ఇంటి మీద కాకి.. ఈ ఇంటి మీద వాలకూడదు.. యశ్వంత్ పర్యటనపై రేవంత్

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల ఐక్యత మూడడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. పేరుకు బీజేపీ యేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినా యశ్వంత్ సిన్హాకు ఒరిగిందేమీ లేదు. ఒక పార్టీ వారిని కలిస్తే మరో పార్టీ వారికి కోపం అన్నట్లుగానే ఆయన ప్రచార సరళి సాగుతోంది.  ఈ నేపథ్యంలోనే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఆయనకు ఘన స్వాగతం ఏర్పాటు చేసింది.   ఉదయం 11గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో జలవిహార్ కు చేరుకున్నారు. జలవిహార్ లో సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను యశ్వంత్ సిన్హా కోరారు. ఆ తరువాత 3.30 గంటల సమయంలో ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అవుతారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ కూడా బలపరుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ వస్తున్న క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ నేతలు మాత్రం ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. దీంతో యశ్వంత్ సిన్హా తన పర్యటనలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలను కలవడానికే పరిమితమౌతున్నారు. తొలుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ భేటీ కావాలని యశ్వంత్ సిన్హా భావించినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్   నేతలు మాత్రం అందుకు విముకత వ్యక్తం చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ నేతలను కలవడానికి వస్తున్న నేపథ్యంలో తాము కలిసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై రేవంత్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటి గడప తొక్కితే.. ఈ ఇంటి గడప తొక్కనివ్వం అన్న రేవంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కాకుండా రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆయన్ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హా కార్యాలయానికి సమాచారం అందించారు.

మమతా దీదీ మాస్టర్ స్ట్రోక్ ..

ఆవిడ అంతే .. ఆవిడ గారి స్టైలే వేరు. అలా ఉన్నటుండి ఒక్కసారిగా, ఎక్కడివాళ్లు అక్కడ బిక్కచచ్చిపోయేలా,పిడుగులాంటి తూటా ఒకటి పెలుస్తారు. అందుకే ఆమె మమతా దీదీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబందించి అందరికంటే ముందుగా. మమతా దీదీనే ప్రతిపక్ష పార్టీలకు గంట కొట్టారు. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. ప్రతిపక్ష పార్టీల తొలి సమావేశానికి  దీదీనే పెద్దరికం వహించారు. ముచ్చటగా ముగ్గురు (శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ) పేర్లను కూడా  ఆమే ప్రతిపాదించారు. ఆ ముగ్గురు చేతులేత్తేసిన తర్వాత, చంకల్లో పిల్లడు, తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా పేరును ...దీదీనే  ప్రపోజ్ చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ సహా  20 వరకు పార్టీలు సిన్హాను ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో దించాయి.  అయితే, ఇప్పడు అదే మమతా  బెనర్జీ, పిడుగులాంటి ప్రకటన చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి  యశ్వంత్ సిన్హా ఓడి పోతారని అనలేదు, కానీ, అధికార  బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపది ముర్మూకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అసలు బీజేపీ ముందే అడిగి ఉంటే.. ఆమెకే విపక్షాలు కూడా మద్దతు ఇచ్చి ఉండేవని అన్నారు .అలాగే, మహా రాష్ట్ర పరిణామాలను అడ్డుపెట్టుకుని ఆమె ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా, యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ ఆహ్వానించి, హడావిడి చేస్తున్న, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు ఝలక్ ఇచ్చేందుకే, యశ్వంత్ సిన్హాను చులకనచేసే విధంగా ప్రకటన చేశారని హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్’లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ప్రకటన ద్వారా పరోక్షంగానే అయినా, యశ్వంత్ సిన్హా ఆశలు వదులుకుంటే మంచిదని, ప్రచారం ఆపేస్తే ఇంకా మంచిదని చెప్పకనే డీడీ చెప్పకనే చెప్పారని, ఓ సలహా  లాంటింది ఇచ్చారని, రాజకీయ పండితులు అంటున్నారు.  మరోవంక మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. "ఆమె మోదీతో రహస్య ఒప్పందం చేసుకుని.. మరోసారి అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని మమతనే ఎంపిక చేశారు. మేము మద్దతు ఇచ్చాం. దీదీ ఇప్పుడు బీజేపీ ఏజెంట్లా ప్రవర్తిస్తున్నారు. గెలిచేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉందని నిర్ధరించుకున్నాకే బీజేపీ  ద్రౌపది ముర్మూను అభ్యర్థిగా చేసుకుని ఎన్నికల బరిలో దిగింది. ద్రౌపది గెలుస్తారనడం.. ఏదో కొత్తగా కనుగొన్న విషయం కాదు" అని అన్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి.  నిజానికి, బీజేపీ /ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్మునా, మరోకరా  అనే విషయాన్ని పక్కన పెడితే,, అధికార కూటమి అభ్యర్ధి గెలుపుకు ముందు నుంచి కూడా డోకా లేదు. ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ /ఎన్డీఎ కూటమికి ఇంచుమించుగా 50 శాతం ఓట్లున్నాయి. ఒక శాతామో రెండు శాతమో తక్కువ ఉన్నా, వైసీపే వంటి,కేంద్రానికి జీహుజూర్’ అనే పార్టీలు ఎటూ ఉండనే ఉన్నాయి. సో ... అభ్యర్ధి  ఎంపికకు ముందే, ఎన్డీఎ అభ్యర్ధి గెలుపు ఖరారైంది. ఇక ఆ తర్వాత ఆదివాసి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును బీజేపీ /ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, ఇక అధికార  కూటమికి  ఎదురులేకుండా పోయింది. ఏ కూటమిలోనూ భాగస్వాములు కానీ  బిజూ జనతదాల్, వైసేపీ, బీఎస్పీ వంటి పార్టీలే కాదు, కాంగ్రెస్  కూటమిలోని జేడీఎస్, జేఎంఎం వంటి పార్టీలు కూడా ముర్ముకు మద్దతు ప్రకటించాయి. మరోవంక మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు బీజేపీ /ఎన్డీఏ కే మద్దతి ఇస్తారు.  సో.. ఇప్పడు ఆమె  భారీ మెజారిటీతో గెలవడం ఇంచు మించుగా ఖారారై పోయింది. ఆ దృష్ట్యానే మమతా దీదీ  మనసు మార్చుకున్నారని అనుకున్నా,  దీదీ వ్యూహత్మకంగానే, ప్రతిపక్షాలో టం పెద్దరికాన్ని నిలుపుకునేందుకు, సమయం సందర్భం చూసుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని, ఏదైనా మమతా దీదీ అంతే .. ఆమె స్టైలే అంత అంటున్నారు.  అదలా ఉంటే,  హైదరాబాద్’లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలుప్రారంభమవుతున్న రోజనే యశ్వంత్ సిన్హాను హైదరాబాద్’ కు ఆహ్వానించి, రాజకీయ మైలేజి పొందేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్న రోజునే, దీదీ, రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలపై భవిష్య వాణి వినిపించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. నిజానికి సిన్హా ఓటమి గురించి ఎవరికీ అనుమనాలు లేవు.. అలాంటప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పెద్ద పర్సు’ తో యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం, కేవలం  బీజేపీ  జాతీయ కార్యవర్గ  సమావేశాల నుంచి  ప్రజల దృష్టిని, ముఖ్యంగా మీడియా దృష్టిని  మరల్చడం కోసమే అంటున్నారు.

వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ఱంరాజు హాజరౌతారహో!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రధాని నరేంద్ర మోడీ భీమ వరం పర్యటనలో పాల్గొంటున్నారు. ఇది కన్ఫర్మ్. సొంత పార్టీయే ఆయన ఈ పర్యటనకు రాకుండా అడ్డుకునేందుకు శతధా ప్రయత్నించింది. ఎన్నో అడ్డంకులు సృష్టించింది. వాటన్నిటినీ అధిగమించి, న్యాయపోరాటం చేసి మరీ ఆయన భీమవరం పర్యటనకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ నెల 3,4 తేదీలలో తాను తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో పర్యటించనున్నట్లు కోర్టుకు తెలిపిన ఆయన తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను స్వరాష్ట్రంలో అడుగుపెడితే అరెస్టు చేస్తారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలోనూ అలాగే జరిగిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు రక్షణ కల్పించాలని ఏపీ సర్కార్ కు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.  ఆయనపై ఇప్పటి వరకూ నమోదైన కేసులకు సంబంధించి ఆయన నర్సాపురంలో పర్యటించే సమయంలో అంటే 3,4 తేదీలలో అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది. ఇవి కాకుండా కొత్తగా ఏవైనా కేసులు నమోదు చేస్తే వాటి విషయంలో కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప వెంటనే అరెస్టు చేయడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వైసీపీ రెబల్ ఎంపీ భీమవరం పర్యటన ఖరారైంది.  స్థానిక ఎంపీగా ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం ప్రధానితో వేదిక పంచుకునే చాన్స్ ఉంటుంది. విగ్రహావిష్కరణ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కనుక ప్రొటో కాల్ కూడా కేంద్రమో చూసుకుంటుంది. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీని పక్కన పెట్టే వీలు ఏ మాత్రం ఉండదు. అంటే భీమవరంలో మోడీ కార్యక్రమంలో రఘురామ కృష్ణం రాజు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రఘురామకృష్ణం రాజును దూరం పెట్టడానికి ఏపీలోని జగన్ సర్కార్ చేయని  ప్రయత్నం లేదు. ఆఖరికి అల్లూరి విగ్రహావిష్కరణ శిలా ఫలకంపై ఆయన పేరు కూడా లేకుండా చేయడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖపై ఒత్తిడి కూడా తీసుకువచ్చింది. దీనికి గమనించిన రఘురామకృష్ణం రాజు.. తానా కార్యక్రమానికి హాజరు కానున్నాననీ, ప్రొటోకాల్ ప్రకారం తన పేరు శిలాఫలకంపై ఉండాల్సిందేననీ, ఎవరి ఒత్తిడికీ లొంగవద్దనీ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అసలుజగన్ హాజరౌతారా అన్నది అనుమానంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణం రాజు భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు రాకుండా నిరోధించాలని అన్ని ప్రయత్నాలూ చేసినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు తానే డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న జగన్ షెడ్యూల్ ప్రకారం రేపు అంటే ఆదివారం తిరిగి రావాల్సి ఉంది. అయితే కోర్టు విస్పష్ట ఆదేశాలతో రఘురామకృష్ణం రాజు రాకను ఆపడం సాధ్యం కాదని తేలిపోవడంతో.. తానే తన పర్యటనను వాతావరణ ప్రతి కూలతో, ఫ్లైట్ జాప్యం సాకుతోనో డుమ్మా కొడతారని వైసీపీ వర్గీయులలోనే ఒక చర్చ  జరుగుతోంది. ఏం జరుగుతుందన్నది రేపు తేలిపోనుంది. 

ఎమ్మెల్యేలు సుచరిత, ఆళ్లకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా కోవిడ్ వ్యాప్తి నెమ్మది నెమ్మదిగా తన కోరాలు చాస్తోంది. అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా కరోనా బారిన పడ్డారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో ఇరువురూ ఇసోసేషన్ లోకి వెళ్లి పోయారు. ఇటీవలి కాలంలో తమతో బేటీ అయిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్న ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సర్కార్  కరోనా ప్రొటోకాల్ పాటించడం తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలనీ, మాస్కులు తప్పని సరిగా ధరించాలని పేర్కొంది. అలాగే లక్షణాలున్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు.. హోం ఇసోలేషన్ లో ఉండాలని స్పష్టం చేస్తున్నది.   తెలంగాణలో గడిచిన 24 గంటల్లో  దాదాపు 500 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 27,130 మందికి   కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఏపీలో కూడా కరోనా కోరలు చాస్తోందని ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకడంతో స్పష్టమౌతున్నది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కూడా అప్రమత్తమైంది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచింది.

హైదరాబాద్ ధమ్ బిర్యానీ రుచి చూడండి.. మోడీకి కేటీఆర్ బహారంగ లేఖ

తెరాస, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని బీజేపీ ఆరోపణలను గుప్పిస్తుంటే.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని మోడీ సర్కార్ ఇసుమంతైనా చేయూత నివ్వడం లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. తెలంగాణ ఆకాంక్షలను తెరాస కాలరాస్తున్నదని కమల నాథులు విరుచుకుపడుతుంటే.. బీజేపీ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసి అధికారాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోందంటూ గులాబి దళం విమర్శలు గుప్పిస్తోంది. ఈ పరస్పర విమర్శల పర్వంలో తెరాస వైపు నుంచి కేసీఆర్ తరువాత గట్టిగా ఘాటుగా విమర్శలు చేసే దెవరంటే కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆరే. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా మోడీ ప్రధాని హోదాలో తెలంగాణకు వస్తున్నారు. ఆయనతో కానీ, ఆయన పార్టీతో కానీ సత్సంబంధాలు లేకపోయినా, రాజకీయంగా ఒకరితో ఒకరు ఢీ కొనే పరిస్థితులు ఉన్నా.. కేటీఆర్ మోడీ తెలంగాణ రుచులను పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. అందుకే అడగకపోయినా మోడీ గారికి హైదరాబాద్ ధమ్ బిర్యానీ గురించి లేఖ రాశారు. తెలంగాణ వచ్చి హైదరాబాద్ ధమ్ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లకండని ఆ లేఖలో కోరారు. మోడీ పూర్తిగా శాఖాహారి కనుక ధమ్ బిర్యానీ అంటే అదేదో చికెన్, మటన్ కు సంబంధించిందని అనుకుంటారేమోనని, వెజిటెబుల్ ధమ్ బిరియానీ కూడా ఉంటుంది. అడిగి చేయించుకుని తప్పని సరిగా రుచి చూడండని ఆ లేఖలో కేటీఆర్ మోడీకి సూచించారు. అక్కడితో ఆగి ఉంటే కేటీఆర్ పొలిటీషియన్ ఎందుకు అవుతారు. హైదరాబాదీల ఆతిథ్యం మహ గొప్పగా ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఫ్లెక్సీల వార్ ఆ ఆతిథ్యంలోకి రాదని ఆయన ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించలేదు.   నగరంలో మోడీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లను చూస్తే మోడీకి అర్ధం అవుతుందనుకున్నారో ఏమో. ఇక ఇరానీ చాయ్ హైదరాబాద్ స్పెషల్ అని పేర్కొని, గతంలో చాయ్ వాలాగా మీరు సర్వ్ చేసిన చాయ్ కంటే ఇది మహా గొప్ప రుచిగా ఉంటుందని సెలవిచ్చారు. ఆ చాయ్ తాగుతూ అంతరాలు లేని సమసమాజం గురించి మంచి ఆలోచనలు చేయాలని సలహా కూడా ఇచ్చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న మోడీకి కేటీఆర్ రాసిన ఈ బహిరంగ లేఖ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా.. సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.   సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు పొడిచిన వెన్నుపోటును ఇక్కడి యువత మర్చిపోదని కేటీఆర్ సుతి మెత్తటి హెచ్చరికా చేశారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామన్న మీ  రాజకీయాలకు టీఆర్ఎస్ సర్కార్ తమ పనితీరుతోనే సమాధానం చెప్పామన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులను మూడు రెట్లు పెంచి రూ. 1.83 లక్షల కోట్లకు చేర్చినట్టు చెప్పారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ధ హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకుండా వంచించిన చరిత్ర మీది అని కేటీఆర్ ఆ లేఖలో గుర్తు చేశారు. 

రూ.18,500ల‌కే ఇల్లు!

టీవీల్లో రియ‌ల్ ఎస్టేట్‌వారు యాడ్స్‌తో ఊద‌ర‌గొట్టేస్తుంటారు. ఇన్ని ల‌క్ష‌లు, మ‌రెంతో సౌక‌ర్యాల‌తో  టూ బెడ్‌రూమ్‌, త్రీ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ అని, విల్లాల‌నీ.. మ‌నిషికి సౌక‌ర్యాల‌తో క‌లిగిన ఇల్లు కావాలిగాని కోట్లు ఖ‌రీదు చేసేది కాదు. అస‌లు ఇంటి కంటే హంగులూ ఆర్భాటాల‌కే మ‌న‌కు తెలీకుంా ఎక్కువ డ‌బ్బు త‌గ‌లేస్తుంటాం. బెంగుళూరుకి చెందిన మ‌హేష్ కృష్ణ‌న్ కేవ‌లం 18,500 రూపాయ‌ల‌తో ఇల్లు  క‌ట్టేసుకున్నా డు, అదీ 125 రోజుల్లో!   ఇళ్ల నిర్మాణం గురించి ఒక్క‌సారి చ‌రిత్ర‌లోకి వెళితే  మ‌న దేశంలో చాలాకాలంనుంచి మ‌ట్టి  ఇళ్ల నిర్మాణం వుంది. పూర్వం అవే ఇళ్లు ద‌ర్శ‌న‌మిచ్చేవి. కాల‌క్ర‌మంలో కాంక్రీట్ హ‌డావుడి ఎక్కువ‌యింది. కానీ ఇప్ప‌టికీ  ఒరిస్సాలో చాలా గ్రామాల్లో మ‌ట్టి ఇళ్లు క‌ట్టుకుంటున్నారు.  కృష్ణ‌న్ సుమారు 19 సంవ‌త్స‌రాలు లె మెరిడి య‌న్‌, తాజ్ గేట్‌వే వంటి పెద్ద పెద్ద హోట‌ళ్ల‌లో ప‌ని చేశా రు. అంటే తానేదో అంద‌మైన, విశాల‌మైన ఇళ్ల‌లో వుండ‌వ‌చ్చున‌నుకునేరు. ఆయ‌న‌ త‌న వుద్యోగానికి రాజీ నామా చేసి  స‌హ‌జ వ్య‌వ‌సాయం, స‌హ‌జ భ‌వ‌న నిర్మాణం ప‌ట్ల  ఆస‌క్తితో వాటిలో శిక్ష‌ణ  పొందారు. మట్టి, పేడ, రాళ్లు, పొట్టు, తాటి ఆకులు మొదలైన సహజ  వస్తువులతో ఇంటిని ఎలా  నిర్మించాలో  నేర్చుకు న్నారు. బెంగళూరులోని చామరాజనగర్‌లో ఉన్న 300 చదరపు అడుగుల ఇంటిని    కృష్ణన్  నిర్మించారు. అతను అడోబ్, వాటిల్ అండ్‌ డౌబ్ గోడలతో  స్థలాన్ని తయారు చేయడానికి  స్థానిక పదార్థాలను ఉపయో గించాడు. ఇలాంటి ఇళ్లను నిర్మించాలనే ఆసక్తి ఉన్న పలువురు సందర్శకులు  ఈ  ఇంటికి తరచుగా వస్తుంటారు. మట్టి ఇంటి కోసం విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నది మహేశ్ కృష్ణన్  ఒక్కరే కాదు. బెంగళూరు జంట  వాణి కన్నన్,  భర్త బాలాజీ  గత 28 సంవత్సరాలుగా ఇంగ్లాండ్‌లో  నివసించిన  తర్వా త 2018లో భారతదేశానికి వచ్చారు. వారు పర్యావరణ అనుకూలమైన స్థిరమైన ఇంటిని నిర్మించాలని నిర్ణ యించుకున్నారు.   బెంగుళూరులో 2020లో వారు మంచి ఇంటి కోసం వెతికి వేసారారు. అన్నీ అపార్ట్‌మెం ట్లలోనూ ల‌క్ష‌ల్లో పెట్ట‌వ‌ల‌సి వ‌స్తోంది. అప్పుడు వారికి బెంగుళూరుకి చెందిన మ‌హీజా సంస్థ గురించి తెలి సింది. వారు ఎంతో ప‌టిష్ట‌మైన‌, ప‌దికాలాలు వుండే ఇళ్లు వీల‌యినంత త‌క్కువ ఖ‌ర్చులోనే నిర్మిస్తార‌ని తెలుసుకున్నా రు. వెంట‌నే వాణిక‌న్న‌న్ తమ  2,400 చ‌.అ  స్థ‌లంలో మ‌హీజావారి చేత  వారికి  ఇష్ట‌మైన డిజైన్‌లో మంచి విశాల‌మైన ఇల్లు క‌ట్టించుకున్నారు.  ఇలా మ‌ట్టి ఇళ్ల నిర్మాణం ఇప్ప‌టికీ ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో వున్న‌ది. అక్క‌డి గ్రామాల్లో  అక్క‌డి మ‌ట్టితోనే కొంద‌రు క‌లిసి చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుంటున్నారు. 

కదిలింది కమల దళం.. నగరం కాషాయమయం

సుమారు రెండు దశాబ్దాల తర్వాత, భాగ్యనగరం (హైదరాబాద్)  భారతీయ జనత పార్టీ ( బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదిక అయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో దేశ రాజకీయ ముఖ చిత్రం ఎంతాగానో మారిపోయింది.అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్, ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వుంది. అప్పుడు బీజేపీ మిత్ర పక్షం తెలుగు దేశం అధికారంలో వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ  జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ నేతలకు ఆతిధ్యమిచ్చారు. ఇప్పుడు... రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, బీజేపీ సంబంధాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంట మంచిది.  రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి.  అదలా ఉంటే, గడచినా ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2024 ఎన్నికలో ముచ్చటగా మూడవసారి అధికారం కైవసం చేసుకోవడం లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఎన్నికలు, పార్టీ విస్తరణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన గురించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం ప్రధానాంశాలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు  శనివారం (జులై2) హైదరాబాద్‌లో ప్రారంభ మవుతున్నాయి.   జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి.. అయితే, కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా మొగ్గుబడి తంతుగానే, జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు.భారీ స్థాయిలో జరగలేదు.మరోవంక నెక్స్ట్ ఇయర్  పలు కీలక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల  కసరత్తులో నాయకత్వమంతా బిజీగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు, ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశాల్లో, రాజకీయ అంశాలు, ముఖ్యంగా దక్షినాదిలో పార్టీ విస్తరణతో పాటుగా సంస్థాగత అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. కాగా, జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు సహా బీజేపీ అగ్రనాయకులంతా హైదరాబాద్‌ చేరుకుంటున్నారు.  ఇప్పటికే, పార్టీ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హైదరాబద్ చేరుకున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీ తదితరులు ఈరోజు (శనివారం) హైదరాబద్ చేరుకుంటారు.  కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ (కాకతీయ) ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. అదలా ఉంటే, హైదరాబాద్;లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడానికి ప్రత్యేక కారణముందని పార్టీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ద్రుష్టి కేంద్రేకరించిందని పార్టీ నాయకులు చెపుతున్నారు. మరోవంక, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్’ లో నిర్వహించడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి కొంత మౌనగా ఉన్నప్పటికీ, మంత్రి కేటీఆర్, చాల ఆపేద్ద ఎత్తున ‘బీజేపీ’ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారు. అలాగే, రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు... కమలంపై కాలు దువ్వుతున్నారు. అయితే, పార్టీలో కొందరు సీనియర్ నాయకులు మాత్రం, కేటీఆర్ గీత దాతుతున్నారని, కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు. అదే విధంగా రాజకీయ విశ్లేషకులు కూడా  కాంగ్రెస్’తో వ్యవహరించినట్లు బీజేపీతో వ్యవహరిస్తే ఏమవుతుందో చెప్పేందుకు మహారాష్ట్ర పరిణామాలే నిదర్శనమని అంటున్నారు.  అదలా ఉంటే బీజేపీ రాష్ట్రంపై దండయాత్రాను ప్రకటించిండా అన్న విధంగా గతంలో ఎన్నడూ లేనట్లుగా, కార్యవర్గ సమావేశాలకంటే ముందుగానే  ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనాయకులు రాష్ట్రంలో దిగిపోయారు. జిల్లాల్లో పర్యటించి పార్టీకి అనుకూలమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. ఎన్నికలు, పార్టీ విస్తరణ కీలక ఎజెండాగా ఉంటుందని, దేశవ్యాప్తంగా 75 వేల బూత్‌ల స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేయడంతో పాటు కార్యకర్తలను మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించిందని, దీనిపై కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో లోతుగా చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. తెలంగాణలో తెరాసకు తామే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయాన్ని కల్పించగలిగామని, ఆదివారం జరిగే భారీ బహిరంగ సభ తర్వాత ప్రజల్లో తమ పట్ల మరింత నమ్మకం పెరుగుతుందన్న ఆశాభావాన్ని తెలంగాణ బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

ఉడుతకు పోస్టు మార్టం.. హెన్షన్ వైర్లను అదే కొరికేసిందని నిరూపించే యత్నం

  ఉడుతా ఉడుతా ఉచ్.. ఎక్కడి కెడతా ఉచ్ కొమ్మమీద జాంపండు కోసుకొస్తావా అంటూ చిన్న పిల్లలు చిన్నప్పుడు పాడుకునే పాట. అయితే ఇప్పుడు ఏపీలో ఉడుతలు జాంపడ్లు కొరకడం మానేశాయి. అవి హైటెన్షన్ విద్యుత్ విద్యుత్ వైర్లు కొరికే పనిలో బిజిగా ఉన్నాయి. ఔను నిజమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అదే చెబుతోంది. అదే నమ్మి తీరాలంటోంది. నమ్మకపోతే మీ ఖర్మ. కావాలంటే హైటెన్షన్ విద్యుత్ వైర్లు కొరికి చనిపోయిన ఉడుత పోస్టు మార్టం రిపోర్టు చూడండంటోది. ఏపీలో ప్రభుత్వం ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇంత కంటే మరో ఉదాహరణ ఉండదు. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడిన సంఘటనలో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. అయితే ఆ హైనెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని జనాలను నమ్మించడం ఇప్పుడు ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన విషయం అయిపోయింది. లేకపోతే.. విద్యుత్ శాఖకు కనీసం మెయింటెయినెన్స్ కు కూడా నిధులు కేటాయించని ప్రభుత్వాన్ని జనం నిలదీస్తారు. అందుకే ఆ వైర్లు తెగిపడటానికి కారణం ఉడేతేనని జనాన్ని నమ్మించడానికి మించిన ముఖ్యమైన పనేం లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. విద్యుత్ అధికారులు ఉడుత కొరికేయడం వల్లే హై టెన్షన్ వైర్లు తెగిపడ్డాయని చెప్పారు. అక్కడితో ఊరుకోకుండా కరెంట్ స్తంభంపై చచ్చి పడున్న ఉడుతకు పోస్టు మార్టం చేయడానికి సిద్ధమైపోయారు. అసలు ఉడుత కొరికితే తెగిపడేంత బలహీనంగా హైనెన్షన్ విద్యుత్ వైర్లు ఉంటాయా? ఒక వేళ ఉడుత వాటిని కొరికి షాక్ కొట్టి చచ్చి ఉంటే.. అది కరెంట్ స్తంభంపై ఎందుకు ఉంటుంది. కాలి బూడిదై ఉండదా? ఇంత చిన్న విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది? సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఉడుతకు పోస్టుమార్టం నిర్వహించి, విద్యుత్ వైర్లను అదే కొరికేసిందని రిపోర్టు ఇవ్వడానికి ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ శాఖ సిద్ధమైపోయింది. తామేం చెబితే అదే రైటు.. జనం నమ్మి తీరాలి అన్నతీరులో ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఉన్నాయి. అందుకే అంటారు యథా రాజా తథా అధికారులూ అని. జగన్ హయాంలో ఏం జరిగినా, ప్రభుత్వాధికారులు ఎన్ని వింత వింత పోకడలకు పోయినా అంతా జగన్మాయ అని సరిపెట్టుకోవాల్సిందే. 

నేటి నుంచి మూడు రోజులు హైదరాబాద్ లోనే మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ శనివారం (ఈ రోజు) హైదరాబాద్ రానున్నారు. నగరంలో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే మోడీ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హెచ్ఐసీసీ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఇక ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. హైదరాబాద్ లో మోడీ పర్యటించే ప్రాంతాలన్నిటినీ ఇప్పటికే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ తమ అధీనంలోకి తీసుకుంది. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆదివారం (రేపు) సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం 2.55 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సోమవారం ఉధయం వరకు మోదీ ఇక్కడే ఉంటారు. శని, ఆది వారాల్లో రాత్రి హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్ రానుండటంతో నగరంలో పటిష్ఠ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. మోదీ పర్యటించే ప్రాంతాలను ఎస్పీజీ బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.  ఇక ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. ఈ సభలో  వేదికపై మోడీతో పాటు ఆరుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఈ సభా వేదికపై మోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంటుంది.   

నా సస్సెన్షన్ సరే.. జగన్, శ్రీలక్ష్మి సంగతేంటి?.. ఏబీవీ

తనను మళ్లీ సస్పెండ్ చేయడంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. తనపై ఒక్క చార్జిషీట్ కూడా లేదని చెప్పిన ఆయన ముఖ్యమంత్రి జగన్ పై 12 సీబీఐ కేసులు ఉన్నాయనీ, ఆరు ఈడీ కేసుల్లో   చార్జ్ షీట్లు ఉన్నాయనీ ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కూడా కేసులు, చార్జిషీట్లు ఉన్నాయని చెప్పారు.  వారు పదవుల్లో, కొలువుల్లో కొనసాగుతుంటే.. ఒక్క చార్జి షీట్ కూడా లేని తనను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. తన సంతకాలను ఫోర్జరీ చేశారని సీఎస్ కు మూడు సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే ఇజ్రాయెల్ కంపెనీ అంటుంటారని… అదేమైనా సూట్ కేస్ కంపెనీనా లేక కోల్ కత్తా కంపెనీనా అని ఏబీవీ ప్రశ్నించారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి, వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్నదని అన్నారు. సీఎంకు కానీ, సీఎస్ కు కానీ, డీజీపీకి కానీ కొన్ని పరిమితులు ఉంటాయని.. పరిమితులు దాటి ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ కోర్టులో నిలవదని ధీమా వ్యక్తం చేశారు.తనపై జగన్ సర్కార్ కక్ష కట్టడానికి కారణం కోడి కత్తి సంఘటనేనని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు. విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి ఘటన సాకుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని అనుకున్నారనీ, అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తాను అడ్డుకున్నాననీ వివరించారు.   రిటైర్ అయ్యేంత వరకు ఖాకీ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తామని మరో ప్రజాప్రతినిధి  తనను బెదిరించారని ఏబీవీ అన్నారు. ప్రస్తుతం తాను చేయగలిగింది న్యాయ పోరాటం, ధర్మ పోరాటం మాత్రమేనని చెప్పారు.  

జన సేన గూటికి గంటా..?

గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యేయే అయినా ఇటీవలి కాలంలో తెలుగుదేశం కార్యక్రమాలలో ఎక్కడా కనిపించడం లేదు. ఆయన రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించిన సందర్భాలు ఈ మూడేళ్లలో ఎక్కడా కనిపించలేదు. అయితే హఠాత్తుగా ఇటీవల విశాఖలో జనసేన నేత జన్మదిన వేడుకలకు హాజరై ఒక్క సారి అందర్నీ ఆశ్చర్య పరిచారు. జనసేన నాయకుడు బోడేపల్లి జన్మదిన వేడుకల్లో గంటా సందడి చేశారు. దీంతో ఆయన తెలగుదేశం వీడి జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ఊగాహానాలు వెల్లువెత్తుతున్నాయి. అ కార్యక్రమానికి గంటాయే కాకుండా వైసీపీ   మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ ప్రసాద్ కూడా హాజరయ్యారు. ఇటీవలి కాలంలో ఇరువురూ కూడా తమ తమ సొంత పార్టీలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ పరంగా జరిగిన ఏ కార్యక్రమాలకూ వీరు హాజరు కావడం లేదు.  అటువంటి వీరిరువురూ జనసేన నేత జన్మదిన వేడుకలకు హాజరు కావడం  రాజకీయ ఊహాగానాలకు తావిచ్చింది. మల్ల విజయప్రసాద్ వైసీపీని వీడి జనసేన తీర్ఫం పుచ్చుకోనున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీలో ఆయనకు ఇసుమంతైనా గుర్తింపు లేకపోవడం, ఆయనను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తప్పించడంతో వైసీపీలో ఆయనను పక్కన పెట్టారన్నది నిర్ధారణ అయ్యింది. దీంతో ఇటీవల కొంత కాలం నుంచీ మౌనంగా ఉన్న మల్ల విజయ ప్రసాద్ జనసేన వైపు చూస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా విషయం వేరు. గత మూడేళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఆయనను పక్కన పెట్టారు. పార్టీలో ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదు.  పార్టీ పరంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ కూడా గంటా పాలు పంచుకోలేదు. దీంతో ఆయన తెలుగుదేశంలో ఉన్నా లేనట్టే అన్నట్లుగా ఆయన పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో ఆయన జనసేన వైపు చూపు సారిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

జనం సొమ్ముతో జగనన్న విలాసాలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సతీసమేతంగా ప్యారిస్ వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగత పర్యటన. జగన్ రెడ్డి దంపతుల పెద్ద కుమార్తె హర్ష ప్యారిస్ లోని అత్య్తంత ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్  గ్రాడ్యుయేషన్ (ఎంబీఎ) పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ రెడ్డి సతీ సమేతంగా ప్యారిస్ వెళ్లారు. ముఖ్యమంత్రి అయినా ఒక  బిడ్డకు తండ్రిగా, కుమార్తె పట్టా పుచ్చుకునే వేడుకను చూడాలనుకోవడంలో  తప్పు లేదు. అయితే, ఈ నాలుగు రోజుల వ్యక్క్టిగత పర్యటనకు ప్రజల సొమ్ము ఖర్చు చేయడం, ఎంతవరకు సమంజసం అనేదే ఇప్పడు  అందరి ముందున్న ప్రశ్న.  ప్యారిస్ ప్రయాణం. అదికూడా మాములు ఫ్లైట్ లో కాదు  లగ్జరీ ఫ్లైట్ లో ప్రయాణం. విమాన ఖర్చులే రానూ పోనూ రూ. 10 కోట్ల వరకు ఉంటాయని అంటున్నారు. రూ. 10  కొట్లంటే, కుబేర సంతతికి పెద్ద మొత్తం కాకపోవచ్చును. కానీ, పైసలు లేక అప్పులు అయినా పుట్టే పరిస్థితి లేక సంక్షేమ  పథకాలకు కోతలు ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనకు, రూ. 10 కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే ప్రశ్న చుట్టూ ఏపీ ప్రజానీకంలో జోరుగా చర్చ జరుగుతోంది.   నిజమే, ఇప్పడు, వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనాన్ని కూడా ఉపుయోగించని, దివంగత  మాజీ ప్రధాని  లాల్ బహదూర్ శాస్త్రి వంటి నేతల నిజాయతీని, నేటి తరం నాయకుల నుంచి ఆశించలేము. ఇక, అక్రమాస్తుల కేసుల్లో ఎ-1 నిందితుడుగా ఉన్న జగన్ రెడ్డి వంటి ‘నీతి’ పరుల నుంచి అయితే అసలే ఆశించలేము. కానీ, ఇలా కొట్లలో ప్రజ ధనాన్ని వ్యక్తిగత విలాసాలకు ఖర్చు చేయడం తప్పు మాత్రమే కాదు, ప్రజాకోర్టులో శిక్షార్హమైన నేరం కూడా అవుతుందని. సామాజిక కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు. సర్కార్ ఖజానాలో పైసలు లేవని ‘దుల్హన్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపి వేస్తుంది. పేద విధ్యార్దులకు ఇస్తామన్న లాప్టాప్’ల ధర పెరిగిందని, వాటికీ మంగళ పాడేస్తారు.. ఇలా చెప్పుకుంటూ పొతే జగన్ రెడ్డి  సర్కార్ కోతలు పెట్టుకుంటూ పోతున్న పథకాల  సంఖ్య పదుల్లో తేలుతుంది.  ఈ నేపధ్యంలోనే, ముఖ్యమంత్రి ఫ్యామిలీ వ్యక్తిగత విదేశీ పర్యటనలకు ప్రజల సొమ్ము ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం. నిజానికి, ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనలకు ప్రజ ధనాన్ని ఉపయోగించరు. కానీ సీఎం జగన్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. విదేశీ పర్యటనలకే  కాదు, ఇతరత్రా అనేక ఖర్చులు కూడా ఖజానాలో కలిపేస్తున్నారు అనే ఆరోపణలున్నాయి అందుకే జగన్ వ్యక్తిగత పర్యటనలకు కూడా ప్రజాధనమే వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు వింటుందని ఆశించడం అవివేకమే అవుతుందని, ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అయితే ఏదో రోజున, పబ్లిక్ మ్యూజిక్ వినక తప్పదని, ఏపీ విషయంలో అది మరింత ఖాయంగా కనిపిస్తోంది విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ - తెరాస వార్.. వ్యూహాల నడుమ యుద్ధం

రాజకీయాలలో ఎవరి వ్యూహాలు వారికుంటాయి. అందులో తప్పులేదు. నిజమే . భారతీయ జనతా పార్టీ, జూలై 2-3 తేదీలలో హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం కూడా, ఒక వ్యూహం ప్రకారం తీసుకున్న నిర్ణయమే. అందులో అనుమానం లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక విజయంతో వచ్చిన ఉత్సాహంతో తెలంగాణపై దృష్టిని కేంద్రీక రించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆ దిశగా పావులు కదుపుతూ వస్తోంది. ప్రధాని సహా పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు ఇతర కీలక నేతలు రాష్ట్రంలో తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు .రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా, ముందస్తు ఎన్నికల ఉహాగానాల నడుమ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబద్ లో ఏర్పాటు చేశారు. మరోవంక  అదే సమయంలో  హుజురాబాద్ లో ఎదురైన చేదు అనుభవంతో ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారు. నిజానికి, హుజురాబాద్ ఓటమి ముఖ్యంత్రి శక్తి యుక్తులను సగానికి సగం మింగేసింది. మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర రెడ్డి మాటల్లో చెప్పాలంటే, హుజురాబాద్ ఓటమితో, రేపటి అసెంబ్లీ ఎన్నికలో తెరాస ‘సగం’ ఒటమి ఖరారై పోయింది. ఇంతవరకు,  కేసీఆర్ ఏ ఎన్నికకు ఇవ్వని ప్రాధాన్యత హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇచ్చారు. ఈటల మళ్ళీ అసెంబ్లీలో ఆడుగు పెట్టకూడదనే ఒకే ఒక్క లక్ష్యంతో, అస్త్రశస్త్రాలు అన్నిటినీ ప్రయోగించారు. అయినా, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, చివరకు ముఖ్యమత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టినా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోయింది. ఇక అక్కడి నుంచి  అధికార తెరాసలో నిర్వేదమనాలో, నిస్తేజమే అనాలో కానీ, ఒక విధమైన ఆందోళన అయితే మొదలైంది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది , అన్నది చరిత్ర. ముందస్తు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ముఖ్యమత్రి కేసీఆర్ సమయానుకూలంగా తమ వ్యూహాలను మార్చుకుంటూ, అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు గల్లీనుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారు. పనిలో పనిగా జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టారు. ఫ్రంట్ మొదలు సొంత పార్టీ వరకు చాలా ఆలోచనలు చేశారు. రాష్ట్రాలు తిరిగారు, నేతలను కలిశారు. కోట్లు కుమ్మరించి జాతీయ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఇంకా చాలా చేశారు. అయితే, ఈ యుద్ధంలో ఇంతవరకు ఏమి సాధించారు, ఎక్కడ విఫల మయ్యారు అనేది పక్కన పెడితే, బీజేపీ జాతీయ  కార్యవర్గ సమావేశాలు నేపధ్యంగా అటు నుంచి బీజేపీ, ఇటు నుంచి తెరాస యుద్ధ క్రీడను పతాక స్థాయికి తీసుకుపోయాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ముందుగానే, కార్యవర్గ సభ్యులు, కేంద్ర మంత్రులు, వివధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలను రాష్ట్రానికి చేరుకొని, నియోజక వర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందో, ఎన్ని నిధులు ఇచ్చిందో వివరిస్తూ, అదే సమయంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్’ సర్కార్ ( కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం) అవసరమని ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో వంక పది లక్షల మందితో భారీ  బహిరంగ సభకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ప్రతిగా తెరాస నేతలు జిల్లాలో పర్యటిస్తూ  కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ళలో రాష్ట్రానికి  చేసినట్లు చాలా కలంగా చెపుతున్న  అన్యాయాలను మరోమారు ఏకరువు పెడుతున్నారు.  అంతవరకు అయితే అదో రకం కానీ,  ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరో ముందడుగు వేసింది. ఫ్లెక్సీల యుద్ధంగా, ప్రచార యుద్ధంగా మారింది. బీజీపీ, సాలు దొర అంటే తెరాస సంపొద్దు మోడీ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక ఫ్లెక్సీలు, హోర్డింగుల విషయంగా రెండు పార్టీలు హద్దులు దాటి వికార పోకడలు పోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే విధంగా వ్యవహరిస్తున్నారు.  అదలా ఉంటే, రేపు (శనివారం) బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.. అయితే, సరిగ్గా ప్రధాని హైదరాబాద్‌కు వస్తున్న రోజునే.. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్నయశ్వంత్‌ సిన్హాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అంతేకాదు, గతంలో ప్రధాని రాష్ట్రానికి వచ్చిన  ఒకటి రెండు సంధర్భాలలో స్వాగతం పలికేందుకు వెళ్ళని ముఖ్యమంత్రి కేసీఆర్, రేపు శనివారం  ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తున్న యశ్వంత్‌ సిన్హాకు స్వయంగా స్వాగతం పలుకుతున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా జలవిహార్‌కు చేరుకొని టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశ మవుతారు.  అయితే, ఈ సమావేసం  యశ్వత్ సిన్హా పేరున జరుగుతున్నా, సమావేశం అసలు ఉద్దేశం అదికాదు, అదే వేదిక నుంచి బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు కేసీఆర్‌ సిద్ధమైనట్లు చెబుతున్నారు. అయితే, హుజురాబాద్ ఓటమితో మొదలైన ఈ యుద్ధం .. అంతిమంగా.. ఎప్పుడు ఎక్కడ.. ఎలా ముగుస్తుంది అనేది.. ప్రస్తుతానికి ఉహకు అందని విషయంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి  కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను హైర్ చేసుకోవడం మొదలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను భగ్నం చేసందుకు వందల కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి, నగరంలోని మెట్రో పిల్లర్లు మొత్తానికి మొత్తంగా, ఆక్రమించుకోవడం, చివరకు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి పర్యటనను అందుకోసం ఉపయోగించుకోవడం.. కేసీఆర్ లో గూడుకట్టుకున్న భయాన్ని బయట పెడుతోందని అంటున్నారు. నిజానికి, కేసీఆర్ ఎలాంటి తప్పులైన చేస్తారు కానీ, రాజకీయ తప్పులు మాత్రం చేయరు, కానీ, ఎందుకనో ఆయన గత కొంత కాలంగా ఒకదానివెంట ఒకటిగా రాజకీయ తప్పిదాలే చేస్తున్నారని, వాటిలొ ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను భగ్నం చేసేందుకు సాగిస్తున్న ప్రయత్నాలు  అందుకు పరాకాష్టగా ఉన్నాయని తెరాస నాయకులే అంటున్నారు. ఒక విధంగా కేసీఆర్ వ్యుహత్మక  తప్పిదం చేస్తున్నారనే అభిప్రాయానికి బలాన్ని చేకురుస్తోందని అంటున్నారు.

ఏపీలో మ‌ళ్లీ బ‌స్ ఛార్జీల వ‌డ్డింపుః మండిప‌డుతున్న ప్రయాణీకులు

ఏపీలో క్ర‌మేపీ బ‌స్ ప్ర‌యాణాలు క‌డు భార‌మ‌వుతున్నాయి. ఏదో ఒక సాకుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లను ఇబ్బందిపెడుతోంద‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మిగ‌తా విష‌యాల కంటే  ఆర్టీసీ బ‌స్సు ఛార్జీలు మ‌రీ రెండున్న‌ర నెల‌ల వ్య‌వ‌ధిలోనే పెంచ‌డం దారుణ‌మ‌ని అంటున్నారు.  ప్ర‌భుత్వోద్యోగులు,  చిన్న వ్యాపారులు,  వేరే ప్రాంతాల్లో ప‌నుల‌కు వెళ్ల‌వారంతా ఎక్కువ‌గా బ‌స్సు ల‌పైనే ఆధార‌ప‌డుతున్నారు.  పైగా  క‌రోనా భ‌యం వీడి  ఇపుడిపుడే  తిరుగుతున్నారు. ఈ స‌మ‌యంలో  ప్ర‌భుత్వం ఈ  అనాలోచిత నిర్ణ‌యం అమ‌లుకు కంక‌ణం క‌ట్టుకోవ‌డం మీద ప్ర‌జ‌లు  మండిప‌డుతున్నారు.  ఏపీఎస్ఆర్టీసీ రెండున్నర నెలల వ్యవధిలో మళ్లీ ఛార్జీలు పెంచింది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులపై ఏటా 500 కోట్ల రూపాయల భారం పడనుంది. డీజిల్ సెస్ పేరిట గత ఏప్రిల్ 14న ఛార్జీలు పెంచేసిన ఏపీఎస్సా ర్టీసీ యాజమాన్యం అదే సాకుతో మరోసారి టికెట్ ఛార్జీలు పెంచడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవు తోంది. జులై ఒక‌టి,  శుక్రవారం నుంచే పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.   గురువారం ఏపీ ఆర్టీసీ చైర్మ‌న్ ఎ. మ‌ల్లికార్జున రెడ్డి,  ఎం.డి. సిహెచ్‌. ద్వార‌కా తిరుమ‌ల రావు విలేక రుల‌తో మాట్లాడుతూ  టికెట్ పై డీజిల్ సెస్ పెంచ‌డం ముడిచ‌మురు ధ‌ర‌లు ఆకాశాన్నంట‌డంతో చేప‌డు తున్నట్టు తెలిపారు. ఏపీఎస్సార్టీసీ ప్రయాణికులపై గరిష్టంగా దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సు ఛార్జీని 90 రూపాయలు, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో 120 రూపాయలు, ఏసీ బస్సుల్లో 140 రూపాయలు పెంచేసింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సు సర్వీసుల్లో గరిష్టంగా 20 నుంచి 25 రూపాయల వరకు ఛార్జీలు పెంచింది.  గుడ్డిలో మెల్లలా  విజయవాడ, విశాఖ నగరాల్లో సిటీ బస్సులకు మాత్రం డీజిల్ సెస్ బాదుడు నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం.  ఒక్కో టికెట్‌పై డీజిల్ సెస్ పెంపును శ్లాబ్ విధానంలో అమలు చేయనున్నారు. వాస్తవానికి, ఏప్రిల్ 13న ఆర్టీసీ డీజిల్ సెస్‌ను స్వల్పంగా పెంచింది. పెంపును సమర్థిస్తూ ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ, డిసెం బర్ 11, 2019 న బస్సు ఛార్జీని సవరించినప్పుడు, లీటరు డీజిల్ ధర రూ. 67 , ఆ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 13న చివరిసారిగా సవరించిన ఛార్జీలు రూ. 107, అంటే లీటరుకు రూ. 40 పెరిగింది. జూన్ 29 నాటి కి డీజిల్ (బల్క్) ధర లీటర్‌కు రూ.131కి పెరగడంతో, డీజిల్ సెస్‌ను స్వల్పంగా పెంచాలని ఆర్టీసీ నిర్ణ యించింది. డీజిల్ ధర పెంపుతో ఆర్టీసీకి రోజుకు రూ.2.5 కోట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.     అంతేకాకుండా, విడిభాగాల ధరలు, లూబ్రికెంట్లు, ఇతర ఖర్చులు కూడా పెరిగాయి, యాజమా న్యం సెస్‌ను పెంచవలసి వచ్చింది, వారు  ఈ భయంకరమైన  పరిస్థితిని  అర్థం చేసుకుని  ఆర్టీసీకి సహక రించాలని వారు కోరారు. డీజిల్ సెస్ పెంపుతో రోడ్డు రవాణా సంస్థకు రూ.1500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే, డీజిల్‌ సెస్‌ను పెంచినా, ఆర్టీసీ బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకోలేకపోయిందని వారు తెలిపారు.

క్యా సీన్ హై..!

అత్యంత అరుదైన ఫొటో ఇది.. ఈ ఫోటోలో ఉన్న ముగ్గురిలో ఒకరు మాజీ రాష్ట్రపతి, మిగిలిన ఇద్దరూ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో ప్రత్యర్థులు.  కాగా ఈ ఫొటో ఇప్పటిది కాదు. 2016 నాటిది. అప్పటి  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వినోబా భావే యూనివర్సిటీ 7వ స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఆ సందర్బంగా యశ్వంత్ సిన్హాకు గౌరవ డీ లిట్ ప్రదానం చేశారు. అప్పటి జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఈ చిత్రంలో ఉన్నారు.  ప్రస్తుతానికి వస్తే నాడు అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ డీలిట్ పట్టా అందుకున్న యశ్వంత్ సిన్హా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి.. అప్పటి జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఇప్పుడు  రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి.

ఒత్తిళ్ళకి లొంగద్దు.. ప్రొటోకాల్ ను విస్మరించొద్దు : రఘురామ

రఘురామకృష్ణం రాజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పేరుకు వైసీపీ ఎంపీయే అయినా నిత్యం సొంత పార్టీపై, ఆ పార్టీ అధినేతపై విమర్శలతో చెలరేగుతుంటారు. రచ్చబండలో తమ పార్టీ, ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతుంటారు. అలా అని పార్టీ నుంచి ఆయనను బహిష్కరించే ధైర్యం, సాహసం జగన్ చేయడం లేదు. అలాగనీ మనవాడే కదా.. ఏదో మాట్లాడుతున్నారు పోనీలే అని వదిలేయడమూ లేదు. ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను చెవినిల్లు కట్టుకుని మరీ కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రిని విమర్శించడం, సొంత పార్టీ విధానాలలో తప్పులను ఎత్తి చూపడం అనర్హత కిందకు రాదని లోక్ సభ కార్యదర్శి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి పడలేక గింజుకుంటున్నారు. కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారఘురామరాజు బెదరడం లేదు. అరెస్టు చేసి భౌతికంగా హింసించినా మరింత రాటు దేలారు కానీ దారికి రాలేదు. అలాంటి రఘురామ రాజుకు ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో ఆవిష్కరిస్తున్న అల్లూరి సీతారామరాజు విగ్రహం ఫలకంపై తన పేరు లేకుండా చేయడానికి  సొంత పార్టీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని సహించ లేకపోతున్నారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగానే తన నియోజకవర్గంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహవిష్కరణ ఫలకంపై తన పేరు లేకుండా చేయడం ఎంత మాత్రం తగదని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 4న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఫలకంపై తన పేరు ఉండి తీరాలనీ, బీమవరం ఎంపీగా తన పేరు ఫలకంపై ఉండటం ప్రాటోకాల్ ప్రకారం తప్పని సరి అని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తన ఉనికిని లేకుండా చేయడానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తన సొంత నియోజకవర్గ కేంద్రం  భీమవరంలో ప్రధాని నరేంద్రమోడీ  ఈ నెల 4న ఆవిష్కరించనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఫలకంపై తన పేరు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని రఘురామకృష్ణం రాజు ఆ లేఖలో పేర్కొన్నారు. తాను ఈ కార్యక్రమానికి హాజరౌతున్నట్లు ఆయనా లేఖలో పేర్కొన్నారు. ప్రొటోకాల్ నింబంధనల ప్రకారం ఫలకంపై తన పేరు ఉండాలనీ, ఎవరి ఒత్తిడులకూ  లొంగి ఫలకంపై తన పేరు లేకుండా చేయవద్దని ఆయనా లేఖలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.