ప్రధాని మోడీతో తమిళిసై భేటీ.. కారణమదేనా?

పెళ్లికి వ‌చ్చిన‌వారంతా స‌ర‌దాగానే గ‌డిపి వెళిపోతారు. మంచిమాట‌లు, మంచి అభిప్రాయాల‌తో మంచి జ్ఞాప‌కాల‌నూ వెంట తీసికెళ‌తారు. నిన్న మొన్న‌టి బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చి కేసీఆర్ ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి ఇచ్చిన ఆర్ధిక స‌హ‌కారం గురించి ఎంతో  చెప్పారు. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి కేంద్రం సాయం చేయ‌డం లేద‌న్న‌ది శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని  ఆయ‌న మాట‌ల్లోనే ప్ర‌ధాని తెలంగాణా ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేశారు. అంతవ‌ర‌కూ బాగానే వుంది. కానీ వెళుతూ ఓ క్ష‌ణం    గ‌వర్న ర్‌తో మోడీ భేటీయే   గులాబి దండులో ఆందోళ‌న నింపింది. పోతూ పోతూఈ  పెద్దాయ‌న గవర్నర్ తో ఏం మాట్లాడి వుంటారు, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తమ ప్రభుత్వంపై,  ముఖ్యమంత్రిపై ఏం ఫిర్యాదులు చేసి ఉంటారు అన్న  చ‌ర్చ‌లు ఆరంభ‌మ‌య్యాయి.  అస‌లే ఇటివ‌ల కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ఏది ప‌డినా భ‌గ్గుమ‌ంటున్న‌ది. మ‌రి ప్ర‌ధాని ఏకంగా ఆమెతో చర్చకు సమయం కేటాయించారంటే ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే అంశమే ఆమె నుంచి ఆయనకు చేరి ఉంటుందని గులాబి దళం ఆందోళన పడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ పరేడ్ గ్రౌండ్స్ లో సభ అనంతరం రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడే బస చేశారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ రాజ్ భవన్ లో ఆయనతో గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. ఇరువురూ దాదాపు 40 నిముషాల సేపు భేటీ అయ్యారు. ఇది పూర్తిగా ముఖాముఖీ భేటీ. అధికారులు కానీ, పార్టీ నేతలు కానీ లేరు. ఇక్కడే వారిరువురి మధ్యా భేటీలో చర్చకు వచ్చిన అంశాలేమిటన్నదానిపై రాజకీయ వర్గాలలో మరీ ముఖ్యంగా గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వారిరువురి భేటీలో పూర్తిగా తెలంగాణ అంశాలే చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా కేసీఆర్ పాలన, రాష్ట్రంలో శాంతి భద్రతలు, కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై కొన్ని నివేదకలను మోడీకి అందించినట్లు చెబుతున్నారు. దీంతో వీరురువురి మధ్యా జరిగిన చర్చలపై తెరాసలో ఉత్కంఠ పీక్స్ కు వెళ్లింది. ఇటీవలి కాలంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగిన నేపథ్యంలో మోడీతో భేటీలో గవర్నర్ తమిళసై కేసీఆర్  సర్కార్ పై మోడీకి ఫిర్యాదు చేయడమే కాకుండా.. కీలక అంశాలపై నివేదికలు కూడా సమర్పించి ఉంటారన్న భావన అయితే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది.   మామూలుగా అయితే  ప్రధాని, గవర్నర్ భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉండదు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై- మోడీ భేటీ మాత్రం ఎనలేని రాజకీయ ప్రధాన్యత  సంతరించుకుంది. అందుకు కారణం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితే కాకుండా.. గవర్నర్- ప్రభుత్వం మధ్య ఉన్న రిఫ్ట్ కూడా ఒక కారణం. గతంలో తమిళిసై ఢిల్లీ వెళ్లి మరీ కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ప్రధాని, హెంమంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. గవర్నర్ పర్యటనలలో మంత్రులు, అధికారులూ ప్రొటోకాల్ పాటించకపోవడం దగ్గర నుంచి.. అడిగిన సమాచారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదన్న వరకూ తమిళసై కేంద్రానికి నివేదించారు. ఇక ప్రస్తుతం కేంద్రం, తెరాస సర్కార్ మధ్య రాజకీయం వేడెక్కిన తరుణంలో తమిళిసైతో మోడీ భేటీకి ప్రాధాన్యత పెరిగింది.  జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన కేసీఆర్ ఇటీవలి  ప్రయత్నాలు విఫలమైనా   జాతీయ ప్రత్యామ్నాయ ప్రణాళిక ఆలోచనలతో మోడీపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో.. మోడీ ప్రత్యేకంగా గవర్నర్ తమిళపైతో  40 నిముషాల పాటు ముఖాముఖి చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళసై చెప్పిన అంశాలు, అందించిన నివేదికలను ఆయన కూలంకషంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా తమిళిసైతో మోడీ భేటీలో ఆమె కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి అవసరమై సమాచారాన్ని అందించి ఉంటారని రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది.

మహా ‘పరీక్షలో షిండే విజయం.. మధ్యంతర ఎన్నికలపై పవార్ జోస్యం

నాటకీయ పరిణామాల నడుమ జూన్ 30న మహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన, శివసేన తిరుగుబాటు నాయకుడు, ఏక్నాథ్ షిండే ఈ రోజు ( సోమవారం) రాష్ట్ర శాసన సభలో సభలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. 164 మంది ఎమ్మెల్యేలు షిండే’కు మద్దతుగా నిలిచారు. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే  20 ఎక్కువ ఓట్లు సాధించారు. ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. దీంతో షిండే తిరుగుబాటుతో  మొదలైన మహా సంక్షోభం షిండే విజయంతో, ముగింపు కొచ్చింది. మరోవైపు, శివసేన చీఫ్ విప్గా సునీల్ ప్రభును తొలగించి.. భరత్ గోగావలేను నియమించిన నేపథ్యంలో ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ జూలై 11 న విచారణకు వస్తుంది. అయితే, కోర్టు తీర్పు ఎటు వచ్చినా, షిండే సర్కార్’ కు తక్షణ ముప్పు వచ్చే ప్రమాదం లేదని, న్యాయ కోవిదులు పేర్కొంటున్నారు.  కాగా, ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియను మొదలుపెట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి  షిండే అనుకూలంగా 164 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మరో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. షిండే  వర్గంలోకి చేరారు.  అయితే షిండే ప్రభుత్వం  అట్టేకాలం ఉండదని, ఎన్సీపీ అధినేత సరద పవార్ జోస్యం చెప్పారు. మహా అయితే ఆరు నెలలు, కాదంటే ఇంకా ముందుగానే షిండే సర్కార్ ‘కూలి పోతుందని, పవార్  జోస్యం చెప్పారు. "మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, అందుకే మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. షిండేకు మద్దతు ఇస్తున్న నేతలు ఎవరూ సంతోషంగా లేరు. మంత్రివర్గ విస్తరణ సమయంలో మనస్పర్థలు వస్తాయి. అప్పుడు కచ్చితంగా షిండే ప్రభుత్వం పతనమవుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ మా దగ్గరికే వస్తారు" అని పవార్‌ తెలిపారు. కేవలం ఆరు నెలలే సమయం ఉందని, ఎన్సీపీ శాసనసభ్యులు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు. అలాగే, శివసేన ఠాక్రే, వర్గం ఎంపీ సంజయ్ రౌత్ కూడా షిండే సర్కార్ ‘ కు మద్దతు ఇస్తున్న  శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అసలైన శివసేన నేతలు కాదని, అలా అని వారు చెప్పుకోలేరని అన్నారు. శివసేన గుర్తు పై గెలిచిన షిండే వర్గం ఎమ్మెల్యేలు, రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పడు తిరుగుబాటు చేయడం  ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మేము కోర్టులోనే తేల్చుకుంటాం, అని అన్నారు. అయితే రేపు ఏమి జరుగుతుంది, నేది పక్కన పెడితే, ఇప్పటికైతే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బల పరీక్షలో నెగ్గారు.  జో జీతేగా ఓయి సికిందర్’

తండ్రికి ర‌మ్ ఇచ్చి చివ‌రి ఆనందాన్ని పంచుకున్న ఆన్‌

పొలానికి వెళ్లే రైతుకి కూతురు ముద్దిచ్చి పంపింది. హెడ్‌మాస్టర్‌కి ఆయ‌న మ‌న‌వ‌డు ముద్దిచ్చే బ‌డికి పంపేడు. మ‌ర‌ణానికి మ‌రింత ద‌గ్గ‌ర్లో వున్న తండ్రికి ర‌మ్ ఇచ్చి ఆనంద‌ప‌రిచింది పెన్నెలోప్‌ ఆన్‌!  చిన్న ప్ప‌టి నుంచి బిస్కెట్లూ, చాక్లెట్లు ఇచ్చి బ‌డికి పంపిన తండ్రి పెదాల మీద చివ‌రి చిర్న‌వ్వు  కోసం ఆన్ త‌న‌కు బొత్తిగా ఇష్టంలేని రమ్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.  కొన్ని అంతే.. ఇష్టంగా అయిష్ట‌మైన ప‌ని చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. ఆన్ తండ్రి చ‌క్క‌గా రోజూ తాగేవాడు. ఆయ నకు బండ్‌బెర్గ్ ర‌మ్ అంటే మ‌హా పిచ్చి. ఆన్ కి తండ్రి తాగ‌డం పెద్ద‌గా న‌చ్చేది కాదు.  ఆయ‌నకు  శ్వాస సంబంధ ఇబ్బందిని ఇంట్లో వారు గ‌మ‌నించి ఆస్ప‌త్రికి తీసికెళ్లారు.  పెన్నెలోప్  తండ్రికి  క్రానిక్ అబ్స్ట్ర క్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఈ పరిస్థితి శ్వాసను ప్రభా వితం చేస్తుంది. చాలాకాలం నుంచి ఈ జ‌బ్బుతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు.  చాలారోజులు ఆస్ప‌త్రిలోనే వుండాల్సి వ‌చ్చింది. జ‌బ్బు ముదిరి ప్రాణాపాయ స్థితికి వ‌చ్చింది.  ఆన్ తండ్రిని కోల్పోయే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. డాక్ట‌ర్లు  ఆ సంగ‌తి ఆమెకు చెప్ప‌క త‌ప్ప‌లేదు. ఆమె బాధ‌ప‌డింది ..లోలోప‌ల‌.  తండ్రితో వున్న అనుబంధంతో  ఆయ‌న ప‌డ‌క ద‌గ్గ‌ర ఏడ‌వ‌లేదు. చుట్టూ అంతా ఆనందంగా ప్ర‌శాంతంగానే వుండాల‌నుకుంది. నిత్యం జోక్స్ వేస్తూ స‌ర‌దా వాతావ‌ర‌ణాన్నే క‌ల్పించింది.  చివ‌ర్రోజు.. ఆన్  ఆస్ప‌త్రిలో తండ్రి ద‌గ్గ‌ర‌కి మందులు తీసికెళ్లింది. ఆయ‌న న‌వ్వాడు. ద‌గ్గ‌రికి పిలిచి అబ్బే ఇవి కాదు నాకు బాగా ఇష్ట‌మైన నా మందు కావాల‌ని కోరాడు. ఆన్‌కి ఈసారి కోపం రాలేదు, విసుక్కోలేదు.. గ‌ట్టిగా న‌వ్వింది. ప‌రుగున వెళ్లి ఆయ‌న అమితంగా ఇష్ట‌ప‌డి తాగే బండ్‌బ‌ర్గ్ ర‌మ్ చిన్న బాటిల్ తెచ్చింది. దాన్ని డాక్ట‌ర్ల అనుమ‌తితో  సిరంజ్ ద్వారా ఎక్కించింది. ఆయ‌న‌కు ఎంత స‌ర‌దానో.. రోజూ తిట్టే కూతురు స్వ‌యంగా త‌న‌కు ఆ మ‌త్తెక్కించేందుకు డాక్ట‌ర్‌కి సాయ‌ప‌డుతోంద‌ని. కొద్ది గంట‌ల త‌ర్వాత ఆన్ తండ్రి ప్ర‌శాంతంగా వెళిపోయారు.  ఆన్ మాత్రం ఆకాశంలోకి చూస్తూ ఈ లోకం లో నాతో చివ‌రి క్ష‌ణాలు ఆనందంగా గ‌డ‌ప‌డానికి ఆయ‌న చివ‌రి కోరిక తీర్చ‌డంలో వుండే ఆనందం ఆమె మ‌న‌సు నిండా నిండిపోయింది. ఆమెకు జీవితాంతం ఇది గొప్ప జ్ఞాప‌కంగా వుంటుంది ఇక‌!

ప్రజాకాంక్షలను విస్మరించడంలో కాషాయ దళం.. గులాబి దండు.. దొందూ దొందే..

 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్బంగా రెండు రోజుల పాటు ఇటు బీజేపీ, అటు తెరాస హైదరాబాద్ వేదికగా రాజకీయ సర్కర్ చేశాయి. ప్రజలతో సంబంధం లేని విన్యాసాలెన్నో చేశాయి. ప్లెక్సీల యుద్ధం నుంచీ కేంద్రం సహాయం వరకూ ఇరు పార్టీలూ పరస్పర విమర్శలలో పోటీ పడ్డాయి.  కాషాయ దళం మొత్తం రావడం చుస్తే  గులాబి కోటని ఆక్రమించుకోవడానికి రాజు తన బలం తో సైన్యం తో వచ్చి తన బలం ఏమిటో చూపించి  నట్టు వుంది. ఆదివారం  హైదరాబాద్ లో  జరిగిన భారతియ జనతా పార్టీ విజయ సంకల్పసభ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి మాటలమయజాలం తో అందర్నీమాయలో పడేసారు .మిణుగురు పురుగులు రాత్రి ఎగురుతూ  సూర్యుడిని కమ్మేసాం  అని ఆనంద పడతాయి, కానీ వాటికీ తెలియనిది ఏమిటంటే అవి సుర్యుని ముందు నిలబడలేవని అన్నటు సాగింది మోడీ ప్రసంగం, ఎవర్ని విమర్శించకుండా కేవలం  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న,చేసిన,చేయబోయే  అభివృద్ధిపైనే మాట్లాడి తన మార్కు చతురత చూపించారు. తనపై ఎ న్ని విమర్శలు చేసినా ప్రధాని స్పందించకుండా తన దృష్టిలో కేసీఆర్ స్థాయి ఏమిలో చెప్పకనే చెప్పారు.   ఆదివారం  జరిగిన సభ మొత్తం లో కూడా ఎ క్కడా కేసీఆర్ గురించిగాని, గులాబి పార్టీ గురించి గాని   మాట్లాడకుండా,విమర్శలు చేయకుండా   తన ప్రసంగాన్ని ముగించారు.  సబ్ కా సాత్,సబ్ క వికాస్ నినాదం తో తెలంగాణా అభివృధి చేస్తాం అన్నారు. ఎనిమిదేళ్ల  పాలనలో అందరి సంక్షే మం కోసం కృషి చేస్తున్నాం,అభివృధి దేశం నలుమూలలా అందాలని చూస్తున్నాం.తెలంగాణాని అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ అన్ని  విధాలా కృషి చేస్తోందన్నారు. డైనమిక్ తెలంగాణ అభివృద్ధికిక సదా కేంద్రం చేయూత ఉందని, ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, నీటి పారుదల ప్రాజెక్టులలో కేంద్రం సహాయం, సహకారం ఉందని స్పష్టం చేశారు.  హైదరాబాద్ మహానగరం లో 1500 కోట్లతో 6  లేన్ల రహదార్లు  నాలుగు నిర్మిస్తున్నామని మోడీ చెప్పారు.  అలాగే ట్రాఫిక్ ఇబ్బందిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 350 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ నిర్మింనుందన్నారు.  .తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని ,అలా ఐతే నే వేగంగ అభివృధి జరుగుతుందని చెప్పారు. ఐతే  ఎంతసేపు ఏం చేస్తామో చెప్పారు. ఇంత వరకూ బానే ఉంది కానీ,   ప్రస్తుతం దేశం లో వున్న పరిస్థితులపై ఆయన మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల పెరుగుదల, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదల నడ్డి విరిగేలా  ఇందనం దరలు,గ్యాస్ సిలండర్, నిత్యావసర వస్తువల ధరల  బాదుడుపై మోడీ పన్నెత్తి మాట్లాడలేదు. దీనిపై గులాబి శ్రేణులే కాకుండా సామాన్య జనం కూడా విమర్శిస్తున్నారు.  ఇదిలా ఉంచితే.. మోడీ ప్రసంగం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంప పెట్టుగా ఉందని, తనను తాను అతిగా ఊహించుకుని ఆకాసంలో విహరిస్తున్న కేసీఆర్ ను నేల మీదకు దింపి వాస్తవాన్ని ఎరుకపరిచిందని కాషాయదళం సంబర పడుతోంది. ఏకంగా ప్రధానికే ప్రసంగ అజెండా నిర్దేశించానంటూ తన భుజాలు తానే చరుచుకుని విర్రవీగిన సీఎం.. ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయాన్ని, సహకారాన్ని అంగీకరించక తప్పని పరిస్థితుల్లో పడ్డారని కాషాయ శ్రేణులు అంటున్నాయి. మరో వైపు మోడీ ప్రసంగం పలాయన వారి సంధి మంత్రంగా ఉందని గులాబి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. కే సీ ఆర్ ప్రశ్నలకి సమధానం చెప్పలేక పోవడం వల్లే.. కాదు కాదు కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేనందువల్లే ఆయన తన ప్రసంగంలో వాటి గురించి ప్రస్తావించలేదని  గులాబి శ్రేణులు అంటున్నాయి.  దేశం లో తెలంగాణా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా  ఉంది కనుకనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదిక చేసుకున్న కమల నాథుుల రాష్ట్రంలో శాంతి భద్రతలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నాయి.  దేశ  ప్రధాని మోడీ కాదు మోళీ అని తెరాస శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.  మొత్తం మీద బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో  బీజేపీ ఆడంబరం, టీఆర్ఎస్ దూకుడు రెండూ కూడా  కూడా ప్రజాకాంక్షలను ప్రతిబింబించడంలో విఫలమయ్యాయి. మొత్తం వ్యవహారాన్నంతా ఆధిపత్య ప్రదర్శనా పోరుగా మార్చేశాయి. సందట్లో సడేమియాలా కాంగ్రెస్ ఈ మొత్తం వివాదానికి దూరంగా మౌనంగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతుండటం జనం బీజేపీ, తెరాసలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.   

మొబైల్ లేకుండా వుండ‌లేమా?

పూర్వం ఫోన్ వుంటే మ‌హాగొప్ప‌. తెలిసిన‌వారెవ‌రికైనా ఫోన్ కాల్ వ‌స్తే ఆ యింటికి ప‌రిగెట్టాలి.  కొన్నాళ్ల‌కు  దాదాపు ప్ర‌తీ ఇంట్లో పోన్ వ‌చ్చేసింది. కాల‌క్ర‌మంలో మొబైల్ ఫోన్ వ‌చ్చి అంద‌రికీ ఆత్మీయం అయి కూర్చుంది. చేతిలో మొబైల్ వుంటే లోక‌మంతా అర‌చేతిలో వున్న‌ట్టే అంటూ యాడ్స్ తో యువ‌త‌ను  విప రీతంగా ఆక‌ట్టుకోవ‌డంలో మొబైల్ కంపెనీలు లాభార్జ‌న బాట‌లో వున్నాయి. ఇపుడు రోజుకో కొత్త ర‌కం  ఐ ఫోన్‌లు చూస్తున్నాం. ఆట‌లు, పాట‌లు, సినిమాలు, సీరియ‌ళ్లు ఒక‌టేమిటి అంతా దానితోనే సాగిపోతోంది.   ఇహ ఇప్పుడు లోక‌మంతా ఐఫోన్ మ‌యం. అది క్షణం లేకుండా బ‌త‌క‌డ‌మే క‌ష్ట‌త‌ర‌మ‌యింది. యువ‌త దానికి దాసోహం అంటున్నారు. కానీ మొబైల్‌ను క‌నుగొన్న మార్టిన్ కూప‌ర్ మాత్రం మొబైల్‌ను ఎంత త‌క్కువ వాడితే జీవితంలో అంత ఆనందం పొంద‌వ‌చ్చ‌నే అంటున్నారు.  ప్ర‌స్తుతం 93 ఏళ్ల మార్టిన్ 1973లో మోటోరోలా డైనా టిఎసి 8000 ఎక్స్ అనే వైర్‌లెస్ సెల్యూల‌ర్ డివైజ్‌ను క‌నుగొన్నారు. త‌ర్వాత కాల‌క్ర‌మంలో అదే మొబైల్ ఫోన్‌, ప్ర‌స్తుతం ఐ ఫోన్ గా అనేక పేర్ల‌తో, అనేక కంపె నీలో త‌యారుచేస్తున్నాయి. చూడ్డానికి చేతిలో ఇమిడిపోయేంత బుజ్జి ఫోన్‌. కానీ అందులో లోకంలో ఏది కావాల న్నా సినిమాలు, వెబ్‌సీరీస్‌లు, షోలో, ఆట‌పాట‌లు.. అన్నీ చూడ‌గ‌ల్గుతున్నాం.  ప్ర‌స్తుతం చేతిలో మొబైల్ లేకుండా ఒక్క ప‌నీ కావ‌డం లేద‌న్న‌ది ఎంతో నిజం. కానీ దానితో వుండే సౌక‌ర్యం బాగానే వుండ వ‌చ్చు గాని దాని వ‌ల్ల జీవితంలో కొంత ఆనందాన్ని కూడా కోల్పోతున్నామ‌ని మార్టిన్ కూప‌ర్ అంటు న్నా రు. నిజానికి ఆయ‌న క‌నుగొన్న స‌మ‌యంలో ఇంత‌టి విప‌రీతాన్ని ఆయ‌న వూహించి వుండ‌క పోవ‌చ్చు.  టెన్త్ క్లాస్ విద్యార్ధి కూడా ఐఫోన్ వాడ‌కం గ‌మ‌నిస్తున్నాం. అంత ఖ‌రీద‌యిన ఫోన్‌తో  విద్యార్ధులు కాలం వృధా చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు అంద‌రి నుంచి విన‌వ‌స్తున్నాయి. సాంకేతిక అభ‌వృద్ధితో లాభ‌న‌ష్టాలు బేరీజు వేయ‌డం మొబైల్ రాక‌తో మ‌రీ ఎక్కువ‌యింది. కాలంతో పాటు ముంద‌డుగు వేయాలంటే ఇలాంటి ప‌రిక‌రాల‌ను అందుకోవాల్సిందేన‌ని యువ‌త అభిప్రాయం. కానీ ఇంటి ప‌నులు, ఆఫీసు ప‌నులు, ఇతర త్రా ముఖ్య‌మ‌యిన ప‌నుల‌న్నీ మొబైల్ రాక‌తో వెన‌క‌డిపోయాయనే విమ‌ర్శా వుంది. రోజులో అత్యధిక స‌మయం మొబైల్‌తోనే గ‌డుస్తున్న‌ది. ఈ ర‌క‌మైన విప‌రీత వాడ‌కం క్ర‌మేపీ పిల్ల‌ల్లో ముఖ్యంగా విద్యార్ధుల్లో  చ‌దువు మీద ఆస‌క్తి త‌గ్గుతోంద‌ని, స‌హ‌జ జ్ఞాప‌క‌శ‌క్తి దెబ్బ‌తింటోంద‌ని విద్యావేత్త‌ల అభిప్రాయం.  మొబైల్ వాడ‌కం త‌గ్గించుకుంటే జీవితం సుఖంగా వుంటుంద‌ని అంటారు మొబైల్ సృష్టిక‌ర్త  93 ఏళ్ల మార్టిన్ కూప‌ర్‌. ఆయ‌న మాట‌ను కాస్తంత ప‌ట్టించుకుందామా?  నెల‌లో దాదాపు 140 గంట‌లు మొబైల్‌తోనే జ‌నం గ‌డిపేస్తున్నార‌ని ఒక అంత‌ర్జాతీయ నివేదిక వెల్ల‌డించింది.  ఇక నుంచి మొబైల్  ఆచీ తూచీ వాడ టం అల‌వ‌ర్చుకుందాం. మొబైల్‌ను కేవ‌లం ఒక  ప‌రిక‌రంగానే చూడాలి, దాన్ని మూడో చేయిగా భావించి, దాని మీదే స‌మ‌స్తం ఆధార‌ప‌డి వుంద‌నే భావ‌న‌కు లోన‌యి జీవితంలో ప్ర‌శాంత‌త‌ను కొంత కోల్పోతున్నా మన్న మాట‌ల్ని నిజం చేయ‌వ‌ద్దు.  మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి  కొంత స‌మ‌యం వీల‌యినంత స‌మ‌యం  గ‌డ‌ప‌డానికి మ‌ళ్లీ ప్ర‌య‌త్నించండి   అని మార్టిన్ అంటున్నారు.

వైసీపీలో రగులుతున్న కులం కుంపట్లు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సజ్జల రామ కృష్ణా రెడ్డి, ఇంకో కీలక  పదవిలో ఇంకొక రెడ్డి .. ఇలా పార్టీలో , ప్రభుత్వంలో అంతటా, ఆ రెండు అక్షరాలదే హవా... ఈమాటలు అన్నది, అంటున్నదీ ఎవరో కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో క్రియాశీలంగా మెలుగుతూ, పార్టీ గెలుపు కోసం శక్తీ వంచన లేకుండా, అహర్నిశలు శ్రమించిన అన్య ‘కుల’ కార్యకర్తలు నాయకులు. ఇందులో ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. ఓసీ లున్నారు. బీసీలు, మైనారిటీలున్నారు. అందరిలోనూ అసంతృప్తి వుంది. అయినా, ముఖ్యమంత్రి  జగన్ రెడీ మాత్రం, అదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పడు, అన్య సామాజిక వర్గాల నాయకులు, కార్యకర్తలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.  ఈ మధ్యనే, వైసీపీ పార్టీకి అనుబంధ సంఘాల ప్రకటించారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విభాగాలకు మాత్రం ఆయా వర్గాలకు ఇచ్చారు. ఇతర సంఘాలు అన్నింటినీ ఆ ‘రెండు’ అక్షరాల సామాజిక వర్గానికే కట్ట బెట్టారు. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను ప్రకటించారు. అందులో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనే ఆరోపణలు పార్టీలో బలగా వినిపిస్తున్నాయి. కాగా, అనుబంధ సంఘాల బాధ్యులుగా  నియమితులైన వారిలో ...  ‘బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నాగిరెడ్డి, పూనూరు గౌతంరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కల్పలతా రెడ్డి, మేడపాటి వెంకట్ రెడ్డి, సునీల్ పోశింరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి ఇలా, అందరి పేరు ఆ రెండు అక్షరాలతోనే ముగుస్తుంది. ఇందులో ఐటీ, సోషల్ మీడియా, పార్టీ ఆఫీస్, యూత్ వింగ్, రైతు విభాగం ఇలా అన్నీ ఉన్నాయి. అయితే ఎందుకనో ఏమో కానీ, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, బీసీ, ఎస్టీ, ఎస్టీల సంఘాలకు  మాత్రం ఆయా సామజిక వర్గాలకే  బాధ్యతలు ఇచ్చారు.  ఇలా ఒకే ఒక్క సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం పై  విమర్శలు వస్తున్నా, పార్టీ మాత్రం, అవేమీ పట్టించుకోవడంలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలానే కాదు, ఓసీలకు జగన్ రెడ్డి మొండి చేయి చుపారని, అయన దృష్టిలో ఒక్క రెడ్లు వినా, ఓసీలు, ఇతర సామాజిక వర్గాలు కనిపించవు అనే విమర్శలు వినవస్తున్నాయి.అయితే, ఇప్పడు ఇతర సామాజిక వర్గాలు వైసీపెలో తమకు జరుగతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాయి. మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. సామజిక న్యాయం పేరిట, పొరుగు రాష్ట్రానికి చెందిన బీసీ సంఘం నాయకుడు ఆర్ . కృష్ణయ్యకు ఏకంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన జగన్ రెడ్డి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న బీసీలు, ఇతర సమాజిక వర్గాలను మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, తిరుబాటు తప్పదని, పార్టీ  నేతలు హెచ్చరిస్తున్నారు.

కేసీఆర్ కోన్ కిస్కా.. బండి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. మోడీ ప్రసంగించిన ఆ సభకు జనసమీకరణలో రాష్ట్ర బీజేపీ విజయవంతమైంది. ప్రధాని మోడీ కూడా సభకు హాజరైన జనసందోహాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. సభా నిర్వహణ భేష్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి మరీ అభినందించారు. అదీ సభా వేదికపైనే. ఇది బండికి అనుకోని కానుక. అగ్రనేత, అందునా ప్రధాని మోడీ నుంచి భుజం తట్టి అభినందన అందుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. సరే అదంతా అయిపోయింది. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం వద్ద మోడీకి వీడ్కోలు పలికిన తరువాత బండి తనను తాను మరచిపోయి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. కోన్ కిస్కా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభ విజయవంతమైన ఆనందం ఆయనలో పట్టలేనంతగా ఉండొచ్చు తప్పు లేదు. ఆ ఆనందాన్ని పార్టీ సహచరులతో పంచుకోవచ్చు. మరింత ఉత్సాహంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయవచ్చు. కానీ బండి ఆ ఆప్షన్లు ఎంచుకోలేదు. ముఖ్యమంత్రిపై పరుష వ్యాఖ్యలతో రెచ్చి పోయారు. సీఎం కేసీఆర్ ఎవరు కోన్ కిస్కా.. ప్రధాని మోడీ ఆయనకు సమాధానం చెప్పడమేమిటి, మోడీ చెప్పాల్సిందేదో తెలంగాణ ప్రజానీకానికే చెప్పారంటూ వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగం తరువాత కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఇంత కాలం ఊదరగొట్టిన కేసీఆరే తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా ఇంత కాలం కేంద్రం నిధులతో షోకు చేసిన కేసీఆర్ బండారం మోడీ ప్రసంగంతో బట్టబయలైందని విమర్శించారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎంత ఘాటుగానైనా ఉండొచ్చు కానీ బాధ్యతాయుతమైన నేత ఎవరూ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయరు. ఇష్టారీతిన చేసే వ్యాఖ్యల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కోన్ కిస్కా అని బండి చులకన చేయడం పట్ల బీజేపీ శ్రేణుల్లోనే అభ్యంతరం వ్యక్తం అవుతోంది. 

కుక్క మెరిగిందన్న కోపంతో ఏం చేశాడంటే..?

అత్తమీద కోపం దుత్త మీద చూపించాడన్నది సామెత. కానీ ఢిల్లీకి చెందిన ధరమ్ వీర్ దహియా కుక్క మీద కోపం ఆ కుక్క యజమానుల మీద చూపించాడు. అలాగని కుక్కనూ వదిలేయలేదు. దానిమీదా దాడి చేసి తన కోపం తీర్చుకున్నాడు. మనిషిలోని పశుత్వానికి పరాకాష్టగా నిలిచే ఈ సంఘటనకు ఢిల్లీ వేదిక అయ్యింది. ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో నివసించే ధరమ్ వీర్ దహియా ఉదయాన్నే వాకింగ్ కు వెళుతుంటే.. పొరుగింటి వారి కుక్క అతడిని చూసి మొరిగింది. కుక్క నన్ను చూసి మెరగడమేమిటి? నేనేమైనా దొంగ అనుకుంటోందా? అని కోపం వచ్చింది. కోపగించుకుని ఊరుకోకుండా ఆ కుక్క తోక పట్టుకుని ఈడ్చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ కుక్క అతడిని కరిచింది. దీంతో కోపంతో ఊగిపోయిన ధరమ్ వీర్ దహియా రాడ్ తీసుకుని దానిపై దాడి చేయబోయాడు. వద్దంటూ అడ్డు వచ్చిన ఆ కుక్క యజమానిపై రాడ్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడితో ఊరుకోకుండా అడ్డొచ్చిన మరో వ్యక్తినీ, ఆ ఇంట్లోని మహిళనూ కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఇప్పుడు పోలీసు స్టేషన్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఎందుకంటే అతడు చేసిన దాడి మొత్తం అక్కడి సీసీ కెమేరాలో రికార్డైంది. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా మూగజీవాలపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.  

డామిట్ ..కథ అడ్డం తిరిగింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు గత కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన వచ్చింది మొదలు, ప్రతి అడుగులో అవరోధాలు,అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల జాతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. జాతీయ పార్టీ, జాతీయ ప్రత్యామ్నియ ప్రణాళిక ఆలోచనలు ఎక్కడవేసిన గొంగళి  అక్కడే అన్నట్లు ఫార్మ్ హౌస్  గడప దాట లేదు. మరోవంక  వరితో మొదలైన కేంద్రం పై యుద్ధం ఆశించిన ఫలితం సాధించలేక పోయింది.  ఇక ఇప్పడు తాజాగా, రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం జరిగిన మరు క్షణం నుంచి, కేసీఆర్, కేటీఆర్ బీజేపీని  బద్నాం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతూ వచ్చారు. అయితే చివరాఖరుకు, కథ అడ్డం తిరిగింది. బీజేపీని, ప్రధాని మోడీని బద్నాం చేసేందుకు, ఫ్లెక్సీల యుద్ధం చేసినా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్బ్యర్ది యశ్వంత్ సిన్హా తీసుకొచ్చి హడావిడి చేసినా, అదే అదనుగా ప్రధాని మోడీ పై  ‘’సేల్స్ మ్యాన్’ వంటి విమర్శలు చేసినా, జాతీయ, అంతర్జాతీయ విషయాలు అన్నింటినీ కలబోసి ప్రశ్నలు సంధించినా, చివరకు, వృధా ప్రయాసే మిగిలిందని, తెరాస నేతలే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం ఇస్తారని ఆశించారు. ఆయనకు ఆయనే, ముందుగానే మోడీ, తనను టార్గెట్  చేస్తారని ప్రకటించుకున్నారు. అయితే, కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా, ఏర్పాటు చసిన విజయ సంకల్ప సభలో,ప్రధాని మోడీ 30 నిముషాలకు పైగా చేసిన ప్రసంగంలో కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అసలు కేసేఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో ఏమి చేసిందో, ముందు ముందు ఏమి చేస్తుందో, నేరుగా ప్రజలకే చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని తేల్చేశారు. దీంతో కేసేఆర్ కు మోడీనుంచి తిట్లదండకం  ఆశించిన తెరాస నేతలకు మరో మారు ఆశాభంగం ఎదురైంది. ముఖ్యమత్రి కేసీఆర్  ప్రశ్నలకు సమధానం చెప్పక పోగా అసలు, ఆయన ప్రస్తావనే చేయక పోవడం, ప్రధాని మోడి, ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ను  పూచిక పుల్లకంటే హీనంగా పక్కన పెట్టడం, అవమానంగా భావిస్తున్నారు. సరే, అంత మాత్రం చేత, తెరాస ఇక  చేతులు ముడుచుకుని కుర్చుంటుందని  కాదు.  కానీ, కేంద్రంపై యుద్ధం పేరుతో బీజేపీని టార్గెట్ చేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేయక తప్పదని, ఎదంటే అది అనేస్తే కుదరదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే విధంగా  తెరాస ఎన్నికల వ్యూహాన్ని సవరించుకోవలసి ఉంటుదని అంటున్నారు.  అదలా ఉంటే విజయసంకల్ప సభ  ఎవరూ ఉహించని విధంగా సక్సెస్ అయింది. నిజానికి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం బహిరంగ సభ ఏర్పాటు ప్రతిపాదన చేసినప్పుడు, పార్టీ జాతీయ నాయకత్వం తటపటాయించింది, సక్సెస్ కాకపోతే, అభాసు పాలవుతామని, ఒకటికి పదిసార్లు అలోచించి, సమాలోచనలు జరిపి చివరకు ఓకే చెప్పింది. అయినా, వ్యూహాత్మకంగా, ఉభయతారకంగా, రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు, కేంద్ర మంత్రులు, వివిదః రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర కీలక నేతలను ఇంచార్జిలుగా నియమించి, మూడు నాలుగు రోజుల ముందునుంచి జనసంపర్క యాత్రలు నిర్వహించింది. ఆ విధంగా సభ సక్సెస్ కావడమే కాకుండా, రాష్ట్రం’ పై బీజేపీ ఫోకస్ ఎంత బలంగా  వుందో, జతేఅయ్ స్థాయిలో  బీజేపీ శక్తీ సామర్ధ్యాలు ఏమిటో  చెప్పకనే చెప్పినట్లయింది.అంతే కాదు, కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి ప్రసంగించిన మోడీ, ఇది వన్ టైం ఎఫైర్ కాదు, ఈ దండ యాత్ర ఇలా కొనసాగుతూనే ఉండాలని సూచించారు. సో.. ఇలాంటి యాత్రలు, దండయాత్రలు ఇలా కొనసాగుతూనే  ఉంటాయి, అనే సంకేతం అయితే వచ్చింది.  ఓవరాల్’’గా చూస్తే, బీజేపీ, తెరాసల మధ్య సాగుతున్న వ్యూహాత్మక యుద్దంలో ప్రస్తుతానికి అయితే బీజేపీ పై చేయి సాధించింది. అయితే, ఇక్కడితో కథ ముగిసినట్లు కాదని, వ్యూహాలు మార్చుకునేందుకు తెరాసకు ఇంకా సమయం ఉందని, పరిశీలకులు అంటున్నారు. అయితే, కేంద్రంపై యుద్ధం విషయంలో ఇప్పటికే చాలా దూరం వెళ్ళిన కేసీఆర్, వెనకడుగు వేస్తారా,  అంటే రాజకీయ పరిశీలకులు మాత్రం అనుమానమే అంటున్నారు.

బీజేపీ, జనసేన కటీఫేనా..? మోడీ సభకు పవన్ దూరం అందుకేనా?

బీజేపీ. జనసేనల మధ్య దూరం పెరిగిందా? ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు, ఆయన పాల్గొనే భారీ బహిరంగ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ కు అందుకే ఆహ్వానం అందలేదా? అన్న ప్రశ్నలకు రాజకీయ పండితులు ఔననే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి కిప్పుడు ఆ రెండు పార్టీలూ కూడా తమ మధ్య మైత్రి చెడిందని బహిరంగంగా ప్రకటించకపోయినా.. జనసేన, బీజేపీల మధ్య సంబంధాలు బెడిసాయనడంలో ఎటువంటి సందేహం లేదని వారు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నా..జనసేనాని పవన్ కల్యాణ్ ఆ ఛాయలకు కూడా వెళ్లకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా వారు చూపుతున్నారు. తాను భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లలేకపోవడానికి బిజీ షెడ్యూల్ కారణమని పవన్ కల్యాణ్ చెబుతున్నా.. ఇరు పార్టీల మధ్యా సఖ్యత ఉండి ఉంటే షెడ్యూల్ మార్చుకునైనా పవన్ కల్యాణ్ హాజరై ఉండేవారని వారు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ హాజరౌతారనీ, మోడీతో వేదిక పంచుకుంటారనీ మొదటి నుంచీ జనసేన వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ, జనసేనల మధ్య జరిగిన మాటల యుద్ధంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యత చెడింది. ఆ తరువాతే పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు. పొత్తుల సంగతి ఎత్తకుండా తన పని తాను సుకుపోతున్నారు. మళ్లీ గతంలోలా ఓట్ల కోసం పుట్టిన పార్టీ జనసేన కాదనే పల్లవి అందుకున్నారు. ఇక మోడీతో వేదిక పంచుకోలేకపోవడానికి కారణాలు చెబుతన్నా.. ఆజాదీ కా అమృతోత్సవల్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ గొప్ప కార్యక్రమం అంటూ వీడియో విడుదల చేసినా.. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం కచ్చితంగా బీజేపీ జనసేనల మధ్య చెడిన సంబంధాలనే ఎత్తి చూపుతున్నాయని సామాన్య ప్రజలు సైతం భావిస్తున్నారు. అయితే రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ, ఆ తరువాత జరిగే మోడీ బహిరంగ సభకూ తెలుగుదేశం పార్టీ తరఫున  ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయడు, మంతెన శివరామరాజు మాజరు కానున్నారు.   ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక షెడ్యూల్ లో వీరిరువురి పేర్లూ ఉన్నాయి. అయితే జనసేన నేతల ప్రస్తావనే లేదు.  మరో వైపు ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ తో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హాజరౌతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని ఆహ్వానించి... రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఇంకా చెప్పాలంటే.. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ కు ఆహ్మానం పంపకపోవడాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నారు.   ఇక కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నా.. అంతా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టారాజ్యంగానే ఆహ్వినితుల జాబితాను రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రొటోకాల్ ప్రకారం తన సొంత నియోజకవర్గానికి వస్తున్న మోడీకి ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. కానీ ప్రధాని పర్యటనకు హాజరయ్యే వారి జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఆయన పేరు జాబితాలో లేకపోవడానికి ఆయన రాక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం జగన్ కు ఇష్టం లేకపోవడమే కారణమన్నది జగద్వితితమే. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబితే అది మాత్రమే చేసిందనడానికి ప్రొటోకాల్ ను సైతం పక్కన పెట్టేయడమే నిదర్శనమని విమర్శలు వినవస్తున్నాయి.

వ‌చ్చారు.. త‌ప్పులో కాలేసారు!

అంతా త‌ర‌లివ‌చ్చారు. యుద్ధానికి సిద్ధ‌ప‌డేందుకు శిబిరాల్లో సేద‌దీరారు. ఆన‌క విప‌క్షాల‌వారిని, కొలువు దీరిన ప్రాంతీయుల‌ను త‌మ ఆధిప‌త్య స‌త్తాను త్వ‌ర‌లో మ‌రింత చ‌విచూపిస్తామ‌ని చిన్న‌పాటి హెచ్చ‌రి క‌లు చేసి వెళ్లారు. ఇంతే జ‌రిగింది బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశం హ‌డావుడి మొత్తం.  తెలంగాణాలో పాగా వేయ‌డానికి అనేక మార్గాలు, ఆలోచ‌న‌లు చేసిన బిజెపి కేంద్ర నాయ‌కులు తెలంగాణా రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే త‌మ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించి ఇక్క‌డే అస‌లు సంగ‌తి తేల్చుకుందామ‌ని భావించారు. ప్ర‌చారం నుంచి స‌మావేశం జ‌రిగినంత వ‌ర‌కూ బిజెపి వ‌ర్గీయులు నానా హ‌డావుడీ చేసేరు. ప్ర‌ధాని మోదీ, పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అమిత్ షా త‌దిత‌రులు, బిజెపి పాలిత రాష్ట్రా ల ముఖ్య‌మంత్రుల‌తో స‌హా హైద‌రాబాద్‌లో మ‌కాం వేసి ఇక్క‌డి టిఆర్ ఎస్ శ్రేణుల‌కు వెన్నులో వొణుకు పుట్టేలా చేద్దామ‌నుకున్నారు. అయితే టిఆర్ ఎస్ ప్ర‌చారంలోనే ఎదురుదాడికి దిగి వారిని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న పెద్ద సంకేత‌మే ఇచ్చింది.  బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ సైతం తెలంగాణాకు ఎంతో చేశామ‌ని, ఎంతో ఇచ్చా మ‌ని గొంతు చించుకున్నారు. కానీ అవ‌న్నీ అవాస్త‌వాలేన‌న్న‌ది వారికి తెలిసేలా టిఆర్ ఎస్ నాయ‌కులు టీ వీ చర్చ‌ల్లో ఘాటుగా విమ‌ర్శించారు. ప్ర‌ధాని మాట్లాడుతున్నంతసేపూ, ఈయన ప్ర‌ధానేనా, ఇంత అబద్ధా ల కోరేమిటా అని నోరెళ్ల‌బ‌డుతున్నారు. తెలంగాణాలో టిఆర్ ఎస్ చెప్పుకుంటూన్న అభివృద్ధి  అంతా త‌మ ఆర్ధిక మ‌ద్ద‌తుతోనే సాధ్య‌ప‌డింద‌ని అది టిఆర్ ఎస్ నేత‌ల‌కు చెప్పుకోవ‌డానికి ఇబ్బందిగా  మారిం ద‌నే విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము న‌గరాభివృద్ధికి, ముఖ్యంగా రోడ్లు, ఫ్లైఓవ‌ర్ల నిర్మాణానికి వేల కోట్లు ఇచ్చామ‌ని మైకులు బ‌ద్ద‌ల‌య్యేలా అరిచి మ‌రీ చెప్పారు.  కానీ ప్ర‌ధాని చెప్పినంత మాత్రాన  అది నిజ‌మై పోతుందా అన్న ప్ర‌శ్న టిఆర్ ఎస్ శ్రేణులు సంధిస్తున్నారు.  ప్ర‌ధాని మోదీ, కేంద్ర నాయ‌కులు ఎవ‌ర‌యి నా స‌రే తెలంగాణా గురించి చెప్పిన‌వ‌న్నీ అవాస్త‌వాలేన‌ని  తెలంగాణా ప్ర‌భుత్వం మండిప‌డుతోంది.  ఎవ‌రు ఎవ‌రిని ప్ర‌శ్నిస్తున్నారు, ఎవ‌ర్ని హెచ్చ‌రిస్తున్నార‌న్న‌ది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. తెలంగాణావా దులు కేంద్రం నిస్సిగ్గుగా అబ‌ద్ధాలాడ‌టం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌ప‌డుతోంది. ఏ ప్రాజెక్టుకీ, రోడ్డు ప‌నుల‌కీ కేంద్రం వీస‌మెత్త సాయం చేయ‌లేదు, ఇవ్వాల్సిన‌వాటి సంగ‌తి దేవుడెరుగు అంటున్నారు. కేవ‌లం పెద్ద నోరు వేసుకుని అమాంతం ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో మైకుల్లో మాట్లాడ‌గానే అన్నీ అంద‌రూ న‌మ్మ‌రు.  ప్ర‌ధాని స్థాయి మ‌నిషి మ‌రీ ఇంత అనాలోచితంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏ పాటి న్యాయ‌మ‌న్న‌ది టి ఆర్ ఎస్ వ‌ర్గీయుల ప్ర‌శ్న‌. వాస్త‌వానికి తెలంగాణాకు సంబంధించి రావాల్సిన ఆర్దిక మ‌ద్ద‌తు గురించి అడిగినవి  నిర్ల‌క్ష్యం చేసి త‌మ‌కు తోచిన అంకెల‌తో తోచిన విధంగా ప్ర‌చారం చేసుకోవ‌డంలో బిజెపివారీ మాన‌సిక బ‌ల‌హీన‌తే బ‌య‌ట‌ప‌డుతోంది.  మొత్తానికి బిజెపి యావ‌త్ సైన్యం వ‌చ్చి చేసిన త‌ప్పుడు ప్ర‌చారాలు, ఊక‌దంపు ప్ర‌సంగాల వ‌ల్ల తెలంగా ణాకు, టిఆర్ ఎస్‌కు వ‌చ్చే న‌ష్టం శూన్యం.  ప్ర‌తిగా బిజెపీ వ‌ర్గాలే న‌ష్ట‌పోయే అవ‌కాశాలున్నాయి. తెలం గాణా ఏర్పాట‌యిన‌ప్ప‌టి నుంచి కేంద్రం పెద్ద‌గా స‌హ‌క‌రించిందేమీ లేద‌ని, ఇపుడు మ‌రింత రాజ‌కీయ వైఫల్యాన్ని బిజెపీ స్వ‌యంగా ఇంత దూరం వ‌చ్చి తెలంగాణాలో బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల అంతా న‌వ్వుకుం టున్నారు. తెలంగాణాకు చెంద కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌ర బిజెపీ హేమాహేమీలు  మోదీని, అమిత్ షాను, ఇత‌ర కాషాయ హేమాహేమీల‌తో  వ‌చ్చి రెండు రోజ‌ల్లో ప్ర‌జ‌ల్ని ముఖ్యంగా ఓట‌ర్లను త‌మ జండా నీడ‌లోకీ తెచ్చేసుకోవాల‌న్న ఆతృత విజ‌య‌వంతం అయితే కాలేదు. ఢిల్లీలో పెట్టుకుని త‌మ పార్టీ వారు భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాలు నిర్ణ‌యించుకుంటే అయిపోయేదానికి ఇక్క‌డికి వ‌చ్చి ఇక్కడ శిబిరాలు వేసు కుని, ఇక్క‌డ తిండి తిన‌గానే తెలంగాణా వాదులు అయిపోతారా ?  ఇలాంటి ట్రిక్కులు, జిమ్మిక్కులు  తెలంగాణా ప్ర‌జ‌లు అంత‌గా ప‌ట్టించుకోరు. బిజెపీ ఆట‌పాట‌లు, హ‌డావుడీ అంతా బీహార్‌, పంజాబ్‌, రాజ స్థాన్ ల‌లో చెల్లుతుందేమోగాని తెలంగాణా వాదులను క‌దిలించ‌లేదు.  బిజెపి పాలిత రాష్ట్రాల‌తో పోలుస్తూ తెలంగాణా కూడా త‌మ నీడ‌లోకి తెచ్చేసుకోవ‌డానికి ఇంక ఆట్టే కాలం ప‌ట్ట‌దు, రెడీగా వుండ‌డ‌ని ఎవ‌రికి హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు?  తెలంగాణా పోరు, రాష్ట్రావ‌త‌ర‌ణ వెనుక అనేక శ‌తాబ్దాల వెత‌లు వున్నాయి. ఈ ప్ర‌జ‌లు ఇత‌ర రాష్ట్రాల్లో వ‌లె అంత త్వ‌ర‌గా కాషాయం వారి జాతీయ భావ‌న, అతి దేశ భ‌క్తి  ఓవ‌రాక్ష‌న్‌ల‌కు ప‌డ‌రు. టిఆర్ ఎస్ ప్ర‌స్తుతం బిజెపి దృష్టిలో త‌క్కువ స్థాయిలో క‌న ప‌డుతోందేమోగాని టిఆర్ ఎస్‌కి రాష్ట్రంలో ప్ర‌జ‌ల్లో ఏమాత్రం గౌర‌వం, న‌మ్మ‌కం స‌డ‌ల‌లేదు.  క‌ట్ట‌గ‌ట్టుకుని వ‌చ్చాం, భ‌య‌పెట్టి పోయామ‌ని బిజెపి వ‌ర్గాలు అనుకుంటే త‌ప్ప‌కుండా త‌ప్పులో కాలేసిన‌ట్టే!

భీమవరం సభలో రాజుగారికి చోటు లేదు!

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని  మోడీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగే సభలో స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చోటు లేదని తేలిపోయింది. ఈ సభలో వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. వారిలో  రఘురామకృష్ణం రాజు పేరు లేదు. ప్రధాని సభలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి అవకాశం ఉండాలి. అయితే అందుకు భిన్నంగా సభలో ప్రధానితో పాటు వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లలో రఘురామకృష్ణం రాజు పేరు లేదు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్న సంగతి విదితమే. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం పెదఅమీరంలో   బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ సభలో ప్రధాని మోదీ తో పాటు  వేదికపై మరో  11 మంది పేర్లు ఖరారు చేశారు. గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ, వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు, మంతెన వెంకట రామరాజు, పేరిచర్ల రాజు వేదికపై కూర్చోనున్నారు. సభ కోసం దాదాపు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ గేర్

తెరాస పార్టీకి ఇప్పుడు సొంత గడ్డ తెలంగాణలోనే ఎదురుగాలి వీస్తున్నదా అన్న ప్రశ్నకు పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం ఇవ్వాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు, ఆ తరువాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట రాష్ట్రంలో విపక్షాలను ఖాళీ చేయడానికి అనుసరించిన వ్యూహమే ఇప్పుడు బూమరాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నదంటున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నేతలు ఒక్కరొక్కరుగా తిరిగి సొంతగూటికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఒక మేయర్ ఏకంగా అధికార టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారంటే అధికార పార్టీకి ఇది నిజంగా ఎదురు దెబ్బే. మేయర్ ఒటరిగా కాక ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వారిని పార్టీలోనే కొనసాగేలా చేయడానికి సాక్షాత్తూ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత రంగంలోనికి దిగి శతధా ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు.   బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఇప్పటికే  తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. బడంగ్ పేట్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం చేశానని పేర్కొన్న  పారిజాత నరసింహారెడ్డి.. ఆ సేవలకు గుర్తింపు లేకపోగా  టీఆర్ఎస్ లో తనకు, తన వర్గం వారికి అడుగడుగునా అవమానాలూ, పరాభవాలే ఎదురౌతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక   తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.  కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగ సొంత గూటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సీనియర్ నేతల నుంచి అడ్డంకులు ఎదురౌతున్నా, వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ ను వీడి తెరాస గూటికి చేరిన మాజీలతో టచ్ లోకి  వెళ్లి వారిని సొంత గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయనీ అందుకే నాటి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ నిర్మాణంలోని లోపాల కారణంగానే కాంగ్రెస్ మాజీలు సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారిని వెనక్కు రప్పించే విషయంలో రేవంత్ కృషిని తక్కువ చేసి చూపడం సాధ్యం కాదని కాంగ్రెస్ శ్రేణులే అంటున్నారు. టీఆర్ఎస్ చీఫ్ గా గతంలో ఎవరూ చేయని విధంగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ మాజీలను ఒప్పించి తిరిగి పార్టీలోనికి తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అవుతుండటంతో అధిష్థానం కూడా ఆయనను రాష్ట్రంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినా ఎవరికీ కూడా కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర వ్యవహారాలలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదనీ, ఇన్నాళ్లకు మళ్లీ అటువంటి స్వేచ్ఛ రేవంత్ కు ఇచ్చారనీ పరిశీలకులు కూడా ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే ముందు ముందు  టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు సైతం హోం కమింగ్ అంటూ కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్య పోవలసిన పని లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అడుగడుగునా అడ్డంకులు.. రైల్లోనూ వెంటాడిన నిఘా.. హైదరాబాద్ లోనే రైలు దిగేసిన రఘురామకృష్ణంరాజు

కోర్టులు ఆదేశించినా, ఏకంగా పీఎంవో నుంచే అవరోధాలు సృష్టించవద్దంటూ ఆదేశాలు వచ్చినా జగన్ సర్కార్ నర్సాపురం ఎంపీ రఘురామరాజును వదలడం లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాకుండా చేయాలని ‘ఔట్ ఆఫ్ ది వే’ ప్రయత్నాలను ఆపడం లేదు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరౌతున్నారు. ప్రొటో కాల్ ప్రకారం స్థానిక ఎంపీ ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అందుకు ఎంపి రఘురామకృష్ణం రాజు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి.. కోర్టు నుంచి కూడా లైన్ క్లియర్ చేసుకున్నారు. కోర్టు ఎంపీని అరెస్టు చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆయన భీమవరం వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను భీమవరం కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకోవాలనే నిర్ణయించింది. దీంతో కోర్టు తీర్పును లెక్క చేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు ప్రభుత్వం ఆదేశాలతో తవ్వేశారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపించింది. ఎంపీ ని వేధించడానికే రోడ్డు తవ్వేశారన్న ప్రచారం జరిగింది. దానితో స్పందించిన రఘురామ కృష్ణంరాజు.. తవ్వేసిన రోడ్డు ఫోటోలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దానితో  స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం, వెంటనే దానిని సీఎంవో కు పంపటంతో రోడ్డును క్లియర్ చేశారు. దీన్నిబట్టి కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ రఘురామకృష్ణం రాజును మోడీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తోందని అవగతమౌతోంది.   ఇలా ఉండగా   ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు రాకుండా, ఓ కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు  ప్రచారం జరుగుతోంది. రాజు సభకు వస్తే.. ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని, ఫలితంగా భీమవరానికి చెడ్డ పేరు వస్తుందంటూ సదరు కేంద్ర మంత్రి, స్థానిక నేతలతో చెప్పినట్లు సమాచారం.  వీటి వేటినీ లెక్క చేయకుండా భీమవరం వెళ్లడానికే నిర్ణయించుకున్న రఘురామ కృష్ణం రాజును నిఘా బృందాలు వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. నిఘా బృందాలు అనుసరిస్తున్నట్లు గుర్తించడంతో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భీమవరం బయలుదేరిన రఘురామకృష్ణం రాజు బేగంపేట రైల్వే స్టేషన్ లోనే దిగిపోయి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయనతో పాటు బయలు దేరిన ఆయన బృందం కూడా బేగంపేట రైల్వే స్టేషన్ లోనే దిగిపోయారు. అయితే అప్పటికే రఘురామ రాజును సమర్ధిస్తూ ఆయనకు అండగా నిలుస్తున్న కొందరు నేతలపై కేసులు పెట్టారు. అలాగే భీమవరంగా రఘురామకృష్ణం రాజుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

వెల్లంపల్లి గోడ దూకేస్తారా?.. జోగి మాటల మర్మమేమిటి?

వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తున్నది. ముఖ్యంగా వైసీపీ ప్లీనరీకి ముందు జిల్లాలలో జరుగుతున్న సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ఆ సమావేశాలలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాల గుట్టు రట్టు చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనే ఆయన వైసీపీ నేతలకు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజు వైసీపీలోనే ఉన్నా ముందు ముందు ఉంటారన్న నమ్మకం లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు.  మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యలతో వేదికపై ఉన్నవారితో పాటు కార్యకర్తలు ఖంగుతిన్నారు. జోగి రమేష్ ఒక్కరే కాదు మంత్రి బొత్స సత్యనారాయణ సైతం తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పార్టీ సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీ నుంచి క్యాడర్ జారిపోతోంది.. జాగ్రత్త పడకుంటే కష్టం అన్న రీతిలో మాట్లాడారు. నెల్లూరు జిల్లా నేతలైతే తమ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. మంత్రి బాలినేని విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆయన పలు సందర్భాలలో బహిరంగంగా చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అయితే గన్నవరం, బందర్ నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించేసి ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఉన్న గ్రూపు తగాదాలకు అజ్యం పోశారు. ఇలా ఇక్కడ ప్రస్తావించిన జిల్లాలలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీలో గ్రూపు తగాదాలు శృతి మించి రాగానపడ్డాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. దీనికి కారణం విజయసాయి, సజ్జలలే కారణమని పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  తాడేపల్లి ఫ్యాలెస్‌లోకి  విజయసాయి రీ ఎంట్రీ  తర్వాతే  జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న గ్రూప్ తగాదాల   రచ్చ పెచ్చరిల్లిందని అంటున్నారు.  వైయస్ జగన్ ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు విజయసాయిరెడ్డి  పాత్ర పార్టీలో అత్యంత కీలకం.. నాడు ఆయన ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక లగాయతు.. జగన్ తొలి కేబినెట్ కూర్పు  జరిగింది.  ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైజాగ్ వెళ్లిపోయారు.. ఆ తర్వాల అంతా  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలోని పదవులు రాని కీలక నేతలంతా ఆయన చుట్టూ  చేరారు. అక్కడ నుంచి ఏ జిల్లాలో జిల్లాల్లో ఎక్కడ ఏ నాయకుల మద్య అసంతృప్తి జ్వాలలు  ఎగిసినా   సజ్జల రామకృష్ణరెడ్డి  డైరెక్ట్‌గా రంగంలోకి దిగి.. సముదాయించడం జరుగుతూ వస్తోంది.   అయితే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి.. జిల్లా అధ్యక్షులు, సమన్వయ కర్తల బాధ్యతలు అప్పగించడంతో జిల్లాల్లో రచ్చకు అంకురార్పణ జరిగిందని అంటున్నారు. సజ్జల, విజయసాయి రెండు అధికార కేంద్రాలుగా మారడంతో జిల్లాల్లో పార్టీ నేతలు, క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.. సజ్జల, విజయసాయి మధ్య విడిపోయిన జిల్లాల నేతల పంచాయితీ ఇప్పుడు వారు కూడా తీర్చలేని స్థితికి చేరుకుందనీ, దీంతో ఇవన్నీ   జగన్ వద్దకు చేరుతున్నాయనీ పార్టీ కేడర్ చెబుతున్నారు.   అదే సమయంలో జనంలో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతుంటే.. మరోవైపు తెలుగుదేశం, జనసేనలు బలోపేతం అవుతున్నాయి. ఆ రెండు పార్టీలు బలోపేతం అవుతున్నాయనడానికి జనసేన సభ, తెలుగుదేశం మహానాడుల సక్సెసే తార్కాణమని వైసీపీ క్యాడరే బహిరంగంగా చెబుతోంది. కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేన సభ సక్సెస్ అయ్యింది.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. మరి   151 ఎమ్మెల్యేలు ఉండి, అధికారంలో ఉన్న వైసీపీ ప్లీనరీ ఎంత బ్రహ్మాండంగా జరగాలి అని జగన్ అంటుంటే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని వైసీపీ క్యాడర్ అంటున్నారు.  

పంజాబ్ కేబినెట్ విస్తరణ.. కొత్తగా ఐదుగురికి చాన్స్

పంజాబ్ లో తొలి సారిగా అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన మూడు నెలలలోనే కేబినెట్ విస్తరణకు ఉపక్రమించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కొత్తగా ఐదుగురిని తన కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. రెండు రోజుల కిందట హస్తిన వెళ్లిన మాన్ అక్కడ ఆఫ్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అప్పట్లోనే మాన్ కేబినెట్ విస్తరణపై ఆయనతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని మాన్ అప్పుడు ఖండించారు. పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా పంజాబ్ లోనే తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే కేబినెట్ విస్తరణకు ఉపక్రమించారు. ఇంత హఠాత్తుగా అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే కేబినెట్ విస్తరణకు పూనుకోవడానికి ఇటీవల పంజాబ్ లోని సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. అధికారం చేపట్టిన మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో జరిగిన ఒక ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి పరాజయం పాలు కావడంతో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష జరుపుకోవలసిన అవసరాన్ని గుర్తించిన మాన్.. కేబినెట్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావించారు. అందుకే కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టారు. కొత్తగా ఐదుగురిని కేబినెట్ లోకి తీసుకోనుండడంతో పంజాబ్ లో సీఎం సహా  మంత్రుల సంఖ్య 15కు పెరుగుతుంది. సోమవారం సాయంత్రం పంజాబ్ రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

టెర్రరిస్టులను జనమే పట్టుకున్నారు.. రివార్డులు అందుకున్నారు!

జమ్మూ కాశ్మీర్ లో  పరిస్థితులు మారుతున్నాయి. గతంలో టెర్రరిస్టులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించే వారు అక్కడి ప్రజలు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారుతున్నాయనడానికి తాజా ఉదాహరణ గ్రామస్తులే టెర్రరిస్టులను పట్టించిన సంఘటన. ఇప్పటి వరకూ కేంద్రం, భద్రతా బలగాలూ కూడా గ్రామాల్లో టెర్రరిస్టులకు షెల్టర్ లభిస్తోందనీ, అక్కడ నుంచి వారు సైన్యం, పోలీసులు, ప్రజలు లక్ష్యంగా దాడులకు పాల్పడి.. గ్రామ స్థుల రక్షణతో సులభంగా తప్పించుకు పారిపోతున్నారనీ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడా పరిస్థితి మారుతోంది. గ్రామాలలో టెర్రరిస్టులకు షెల్టర్ దొరకడం లేదు.  తాజాగా ఆదివారం   రియాసి జిల్లా తుక్సాన్ గ్రామ ప్రజలు ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి  రెండు ఏకే రైఫిళ్లు, 7 గ్రానెడ్లు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాదులను ఫైజల్ అహ్మద్ దార్, తాలిబ్ హుస్సేన్‌లుగా గుర్తించారు. ఇటీవల కాలంలో చినాబ్ లోయ, రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించడానికి ఎల్ఈటీ తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గమనించామని.. ఇందులో భాగంగానే కొంతమందిని తీవ్రవాదులుగా చేర్చుకుని రెండు టెర్రర్ మాడ్యుళ్లను ఏర్పాటు చేసుకున్నారని  పోలీసులు వెల్లడించారు. ఇందులో మొదటి మాడ్యుల్ నెల క్రితం ఉదంపూర్ లో జరిగిన బాంబు పేలుడుతో, రెండవది పదిరోజుల క్రితం రాజౌరిలో జరిగిన పేలుడుతో సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి ప్రధాన ఉగ్రవాది తాలిబ్ హుస్సెన్ పరారీలో ఉన్నారని.. తాజాగా ఈ రోజు గ్రామస్తుల సాయంతో పట్టుకున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులకు ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామస్తుల ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తుక్సాన్ గ్రామ ప్రజలకు రూ. 5 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఇదే విధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల తరుపున డీజీపీ మరో రెండు లక్షలు  రివార్డు ప్రకటించారు.

మోడీ చతురత ముందు కేసీఆర్ వ్యూహాలన్నీ తుస్సు..!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచీ, ప్రదాని మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మూడు రోజులు భాగ్యనగరంలో బస చేస్తారని ఖరారైన క్షణం నుంచీ కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలను, ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ ప్రసంగాన్నీ కూడా బీజేపీ వర్సెస్ తెరాసగా మార్చేందుకు శతథా ప్రయత్నించారు. ప్లెక్సీల వార్ నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే.. మోడీ హైదరాబాద్ వచ్చే రోజే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఆహ్వానించి రాజకీయ వేడి రగిల్చే ప్రయత్నం చేశారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపడం సంగతి అటుంచితే.. ఆయనను హైదరాబాద్ ఆహ్వానించి.. ఆ సందర్భాన్ని మోడీపై విమర్శల వర్షం కురిపించేందుకు అనువుగా వాడుకున్నారు. అంతే కాకుండా.. ఆ మరుసటి రోజు విజయ సంకల్ప్ సభలో మోడీ ప్రసంగం ఎజెండాను కూడా తానే నిర్ణయించేశారా అనేలా కేసీఆర్ యశ్వంత్ తో సమావేశంలో ప్రసంగించారు. ఇన్ని చేసినా ఆయన వ్యూహాలు పలించలేదు. కేసీఆర్ ను మించిన చతురతను మోడీ ప్రదర్శించారు. మోడీ ఏం ప్రసంగించాలో చెప్పేశానని సంబరపడిన కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్ సభలో మోడీ ప్రసంగం తరువాత డిఫెన్స్ లో పడ్డారు. తన సవాళ్లుకు మోడీ జవాబిచ్చుకునే పరిస్థితి కల్పించానని సంబరపడిన కేసీఆర్ ఇప్పుడు మోడీ ప్రసంగం అనంతరం ఆయన ఆ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలపై  తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితిలో పడ్డారు. ఇంతకీ యశ్వంత్ సిన్హా కోసం కేసీఆర్ జల విహార్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్ సభలో తనపై విమర్శల వర్షం కురిపిస్తారు అంటూ జోస్యం చెప్పేశారు. కానీ మోడీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు కాదు కదా..అసలు కేసీఆర్ ప్రస్తావనే తీసుకురాలేదు. అసలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్న విషయాన్నే గుర్తించనట్లుగా ఆయన ప్రసంగం సాగింది.  తెరాస ప్రభుత్వంపై ఒక్క విమర్శ లేదు. రాష్ట్రంలో అవినీతి పాలన అన్న మాటే లేదు. కుటుంబ పాలన గురించి అసలు మాట్లాడనే లేదు. అలా అని ఆయన రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా ఉందన్న విధంగా మాట్లాడారా అంటే అదీ లేదు. కేంద్రం నుంచి ఇసుమంతైనా సాయం అందడం లేదంటూ ఊదరగొట్టేస్తున్న తెరాస ప్రభుత్వం విమర్శలన్నీ అవాస్తవాలని ప్రజలకు అర్ధమయ్యేలా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయాన్నీ,  తెలంగాణ ప్రజలకు అందుతున్న కేంద్ర పథకాల గురించి  వివరించారు. తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని చెప్పారు. భవిష్యత్ లో  తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తథ్యం అని నొక్కి వక్కాణించారు. మోదీ ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావన లేకపోవడం, అదే సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదంటూ చేస్తున్న తెరాస సర్కార్ ప్రచారమంతా అబద్ధమని తేల్చేసేలా మోడీ ప్రసంగం సాగడం తెరాస శ్రేణులను డిఫెన్స్ లో పడేసింది. సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం, హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కేంద్రం నిధులు అంటూ ఆయన చేసిన ప్రసంగంతో ఇప్పుడు తెరాస సర్కారే మోడీ ప్రసంగంలోని అంశాలకు స్పందించాల్సిన పరిస్థితిలో పడింది. అదే సమయంలో దేశ్ కీ నేతా అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలతో చేసుకున్న ప్రచారం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందం అయిపోయింది. దేశ్ కీ నేతాగా కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణకీ నేతాగా కూడా మోడీ గుర్తించడం లేదని తన ప్రసంగంతో మోడీ తేల్చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా   పోటీగా పోస్టర్లు.. ఫ్లెక్సీలతో సొంత ప్రచారం,   బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకోవడం వంటి రెచ్చగొట్టే వ్యూహాలను అమలు చేసినా  మోడీ వాటిని వేటినీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. మోడీ నోట తనపై విమర్శల వర్షం కురిస్తే అది తనకు దేశ వ్యాప్త ప్రచారంగా ఉపకరిస్తుందని ఆశించిన కేసీఆర్ కు ఆశాభంగం కలిగించేలా మోడీ ప్రసంగం ఉంది. అన్నిటికీ మించి తెలంగాణ గడ్డపై ముఖ్యమంత్రి పేరును కూడా ప్రస్తావించకుండా మోడీ చేసిన ప్రసంగం.. వచ్చే ఎన్నికలలో తెరాస అసలు పోటీలోనే ఉండదన్న సందేశాన్ని బీజేపీ శ్రేణులకు ఇచ్చినట్లు పరిశీలకులు వివ్లేషిస్తున్నారు. మోదీ కేసీఆర్ ను పట్టించుకోకుండా, ఆయనపై విమర్శలు చేయకుండా చేసిన ప్రసంగంతో తెరా శ్రేణులే నిరాశకు గురయ్యాయని చెప్పాలి. కేసీఆర్ పై మోడీ విమర్శలు గుప్పిస్తే.. దేశవ్యాప్తంగా మోడీకి దీటైన నేత కేసీఆరే అన్న ఫోకస్ వస్తుందని తెరాస నేతలు ఆశించారు.  అయితే అసలు కేసీఆర్ ను గుర్తించని విధంగా మోడీ ప్రసంగం సాగడంతో కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ ఫ్లాప్ అయ్యాయన్న వ్యాఖ్యలు తెరాస శ్రేణుల నుంచే వినవస్తున్నాయి. 

మోడీ భీవవరం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి.. భారీ బందోబస్తు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సోమవారం భీమవరం రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోడీ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణం దాదాపు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయిందా అన్నట్లు ఏర్పాట్లు ఉన్నాయి. రేవుకాళ్ల మండలం నుంచి భీమవరం వైపు ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదు. సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుంచి బయలు దేరి 10.10 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో 10.55 గంటలకు భీమవరం చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభలో జాతి నుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 12.30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.