రాజుగారి ఇంటి ముందు రోడ్డు తవ్వేశారు.. అందుకేనా?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన సొంత నియోజకవర్గ పరిధిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరౌతారా? ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ లతో ఒకే వేదిక పంచుకుంటారా? ఆయన వద్దామనుకున్నా.. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా చేయాలన్న జగన్ సర్కార్ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఓ కేంద్ర మంత్రి రాఘురామకృష్ణం రాజును ఏపీకి వెళ్లొద్దని సూచించిన మాట నిజమేనా? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. సీఎం జగన్ పై తిరుగుబావుటా ఎగురవేసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేధింపులను ఎదుర్కొంటున్న రఘురామ కృష్ణం రాజును గతంలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి భౌతికంగా హింసించిన సంగతి విదితమే. ఇప్పుడు ఆయన ఏపీ వస్తే అరెస్టు చేయించి తమ ప్రతాపం చూపాలన్న ప్రభుత్వ ప్రణాళికలకు హైకోర్టు తీర్పు గండి కొట్టింది.  దీంతో ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భీమవరంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రఘురామకృష్ణం రాజు రావడానికి లైన్ క్లియర్ అయ్యిందనే అంతా భావించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ప్రొటో కాల్ ప్రకారం స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజు రావాల్సి ఉంటుంది. రఘురామకృష్ణం రాజు కూడా ఈ సభకు ఎలాగైనా రావాలన్న పట్టుదలనే ప్రదర్శిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొంటారు.ఇక్కడే రఘురామ కృష్ణం రాజును ఈ కార్యక్రమానికి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. జగన్ కు రఘురామకృష్ణం రాజుతో వేదిక పంచుకోవడం ఇష్టం ఉండదు. రఘురామకృష్ణం రాజు సభకు వస్తే జగన్ ఏం చేస్తారు. కార్యక్రమానికి గైర్హాజరు అవుతారా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. ప్రధాని మోడీ హాజరుకానున్న అల్లూరి విగ్రహావిష్కరణకు తాను హాజరుకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేసే కుట్రలు చేస్తోందంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు, గత వారం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రధాన మంత్రి కార్యాలయం తోపాటు, కేంద్ర హోమ్ , పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శులకు లేఖలు కూడా రాశారు. అక్కడ నుండి తగిన స్పందన లేకపోవడంతో,  హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురాం కృష్ణంరాజు ను అరెస్టు చేయవద్దని ..అవసరమైతే కేసులు పెట్టుకోవచ్చు తప్ప, అప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది . ఈ పరిణామాలతో ఎంపీ రాజు భీమవరం టూర్ కు , రూట్ క్లియర్ అయింది. కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు ప్రభుత్వం ఆదేశాలతో తవ్వేశారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపించింది. ఎంపీ ని వేధించడానికే రోడ్డు తవ్వేశారన్న ప్రచారం జరిగింది. దానితో స్పందించిన రఘురామ కృష్ణంరాజు.. రోడ్డు ఫోటోలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దానితో ఆగమేఘాలపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం, వెంటనే దానిని సీఎంవో కు పంపటం.. ఆ తరువాత రోడ్డును క్లియర్ చేయడం ..చక చకా జరిగిపోయాయి. దీన్నిబట్టి కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ రఘురామకృష్ణం రాజును మోడీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తోందని అవగతమౌతోంది.    ఇలా ఉండగా   ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు రాకుండా, ఓ కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు  ప్రచారం జరుగుతోంది. రాజు సభకు వస్తే.. ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని, ఫలితంగా భీమవరానికి చెడ్డ పేరు వస్తుందంటూ సదరు కేంద్ర మంత్రి, స్థానిక నేతలతో చెప్పినట్లు సమాచారం.    

బడంగ్ పేట్ మేయర్ టీఆర్ఎస్ కు గుడ్ బై

తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బడంగ్ పేట్ మేయర్ పార్టీకి రాజీనామా చేశారు. నిన్న కాక మొన్న బీజేపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాస గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి బడంగ్ పేట మేయర్ రాజీనామా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. బడంగ్ పేట్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం చేశానని ఆ లేఖలో పారిజాత నరసింహారెడ్డి పేర్కొన్నారు. కాగా తన రాజీనామా విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మీడియాకు తెలిపిన పారిజాత నర్సింహారెడ్డి పార్టీకి అంకిత భావంతో సేవలందించినా, ఇటీవలి కాలంలో పార్టీలో గుర్తింపు కరవైందనీ, అవమానాలు ఎదురౌతున్నాయనీ పేర్కొన్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.  ఒక తెలంగాణ బిడ్డగా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. పార్టీలో సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు.

శివసేన కార్యాలయం మూత

మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయం మూతపడింది. థాకరే నేతృత్వంలోని వర్గం, షిండే నేతృత్వంలోని వర్గం కూడా అసలైన శివసేన తమదంటే తమదని చెపుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలోని శివసేన కార్యాలయానికి ఆదివారం సీల్ వేశారు. సీల్ వేసిన కార్యాలయం బయట శివసేన లెజిస్లేటివ్ పార్టీ ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేసినట్లు నోటీసు అతికించారు. సలైన శివసేన తమదేనంటూ ఇటు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన వర్గం, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెండో వర్గం క్లెయిమ్ చేస్తుండటంతో మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి ఆదివారంనాడు సీల్ వేశారు. కార్యాలయం వెలుపల నోటీసు అంటించారు. ''శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేశాం'' అని ఆ నోటీసు ;పెట్టారు.   కాగా   షిండే వర్గం నేతలు తాము శివసేనను విడిచి పెట్టలేదని, మెజారిటీ సభ్యులు తమవైపే ఉన్నందున తమదే అసలైన శివసేన అని చెబుతుంటే.. షిండే వర్గం వాదన చెల్లదని, పార్టీ లోగో, గుర్తింపు పొందిన ధనుస్సు, బాణం గుర్తు వారికి ఎంతమాత్రం చెందదని ఉద్ధవ్ థాక్రే వర్గం వాదిస్తోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కిషోర్ తివారి సహా పలువురు పార్టీ నేతలు ఇదే విషయంపై ఢంకా బజాయిస్తున్నారు. ఎవరుపడితే వారు వెళ్లిపోవడం, పార్టీని తన్నుకుపోవడం అంత సులభం కాదని, చాలా లీగల్ అంశాలు కూడా ముడిపడి ఉంటాయని  అంటున్నారు. ఇరు వర్గాల మధ్యా వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలోని శివసేన కార్యాలయానికి సీలు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

కేటీఆర్ దూకుడు.. నేతల్లో వణుకు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? తెరాస అధ్యక్షుడు ఎవరు? గత కొద్ది రోజులగా ఇక్కడా అక్కడ వినిపిస్తున్న ఈ  ప్రశ్న, ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా  తెరాస వర్గాల్లోనే వినిపించడం విశేషం. అవును, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైన వరకు దూరంగా ఉంటున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో గానీ, ఇటు ప్రభుత్వ వ్యవహార్ల్లో అయినా చుట్టపు చూపుగా పాల్గొంటున్నారే తప్ప మునుపటిలా మనసు పెట్టడం లేదని తెరాస నాయకులు, కార్యకర్తలు కొంత బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందులా క్రియాశీలంగా వ్యవహరించడం లేదని, పరిపాలనను పెద్దగా పట్టించుకోవడం లేదని అధికార వర్గాల్లోనూ చాల కాలంగా చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారులు కూడా ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయవలసి వస్తోందని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎక్కువకాలం ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడం, రోజులు, వారాల తరబడి అధికారులు ఎవరికి అందుబాటులో  లేకపోవడంతో కీలక నిర్ణయాలను కూడా వాయిదా వేసుకోవలసి వస్తోందని మాట అధికార వర్గాల్లో వినవస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాజకీయాలు మునుపటిలా రుచించడం లేదనే మాట  అంతటా వినిపిస్తోంది.  మరోవంక, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జోరు పెంచారు.ఇటు ప్రభుత్వ వ్యవహరాలలో అటు, పార్టీ కార్యక్రమాల్లో అయన సర్వం తానే అన్నట్లుగా దూసుకు పోతున్నారు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలలో కేసీఆర్ ను పక్కన పెట్టి తానే స్వయంగా చక్రంతిప్పుతున్నారని,అంతరంగిక వర్గాల సమాచారంగా తెలుస్తోందని అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి పేరున వెలువడుతున్న నిర్ణయాలు అన్నీ ఆయన స్వీయ  నిర్ణయాలు కాకపోవచ్చని, కేటీఆర్ నిర్ణయాలు కేసీఆర్ పేరున వెలువడుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.   ఇందుకు సంబంధించి, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు,నిర్ణయాలు కేటీఆర్  తీసుకుంటారు, కేసీఆర్, మమ అంటారు అంటూ మర్మగర్భంగా వ్యంగ బాణాలు సంధించారు. అలాగే,  ఒక విధంగా చూస్తే, కర్తగా కేసీఆర్ ను పెట్టి కార్యం కేటీఆర్ కానిస్తున్నట్లుగా ఉందని పార్టీలోని మరి  కొందరు నాయకులు అంటున్నారు.  ప్రతిపక్షాల రాష్ట్రపతి  అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపే విషయంలోనూ, కేసీఆర్  కు తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదని, అయితే, కేటీఆర్ పట్టు పట్టుపట్టి, స్వయంగా సిన్హా నామినేషన్ కార్యక్రమాలో పాల్గొన్నారని అంటున్నారు. నిజానికి, అదే నిర్ణయం స్వయంగా కేసీఆర్ తీసుకుని ఉంటే స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్లి సిన్హా నామినేషన్ కార్యక్రంలో పాల్గొనే వారని, అయన వెళ్ళ లేదంటే అది అయన తీసుకున్న నిర్ణయం కాదని, అంటున్నారు. నిజానికి, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన మహిల ద్రౌపతి ముర్ము పేరును ప్రకటించిన నేపధ్యంలో, కేసీఆర్ తటస్థ వైఖరి తీసుకోవాలని అనుకున్నారని, పోలింగ్ కు ముందు వరకు మౌనంగా ఉండి చివర్లో ‘ఆత్మ ప్రభోదం’ మేరకు ఓటు వేయాలని, నిర్ణయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వదిలేయాలని, తద్వారా దళితులు, గిరిజనులకు తెరాస వ్యతిరేకం కాదనే సందేశం ఇవ్వాలని కేసేఅర్ ఆలోచన చేశారు. అందుకే, యశ్వంత్ సిన్హా పర్యటన సందర్భంగానూ, ఆయన చెప్పవలసింది అంతా చెప్పి చివరకు, మనసులో ఉన్న. ఆత్మ ప్రభోదం మంత్రాన్నే బయట పెట్టారని, తెరాస నాయకుల సమాచారంగా ఉందని అంటున్నారు.  ఇదలా ఉంటే, మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తమ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ కూల్చివేస్తుందనే భయం మొదలైందని అంటున్నారు. అందుకే యశ్వంత్ సిన్హా ప్రచార సభలో కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని కూల్చివేస్తే, తాము కేంద్ర సర్కార్ ను పడగొడతామని  హెచ్చరించారని  అంటున్నారు.అంటే, మహారాష్ట్ర పరిణామాలు తెలంగాణాలోనూ సంభవించే ప్రమాదం లేక పోలేదని, కేసేఆర్, అనుకుంటున్నారా? అనుమానిస్తున్నారా?  పార్టీలో చీలికకు అవకాశం ఉందనే అనుమానం ఏదైనా వుందా? అందుకే ఈ హెచ్చరిక చేశారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి, కేటీఆర్  దూకుడుకు కళ్ళెం వేసేందుకు అవసరం అయితే తిరుగుబాటు చేసేందుకు కూడా ఒకవర్గం సిద్ధంగా ఉందని అంటున్నారు. మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో,  కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వలన రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ  కూడా నష్టపోవలసి ఉంటుందని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు భయపడుతున్నారు. అవునన్నా కాదన్నా, మనకు ఇష్టం ఉన్న లేకున్నా బీజేపీ జాతీయ పార్టీ,, కేంద్రంలో. సగానికి పైగా రాష్ట్రాల్లో ,అధికారంలో ఉన్న పార్టీ, అన్నిటినీ మించి బీజేపీ  ప్రస్తుత నాయకత్వం, మోడీ, షా జోడీ ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో పాత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టి ముందుకు దూసుకు పోతోంది. ఆ ఇద్దరి కన్ను పడితే, ఇక అంతే సంగతులు ... అనే భయం పార్టీలో కొందరు ముఖ్య నేతలు వ్యక్త పరుస్తున్నారు. తెలంగాణపై మోడీ, షా కన్ను పడింది అనే విషయంలో సందేహం లేదు.. ఇప్పటికే ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు మొదలయ్యాయి. అంతేకాదు, ఓ వంక  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపధ్యంగా బీజేపీ, తెరాసల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న సమయంలోనే  లోక్ సభలో తెరాస పక్ష నేత నామ నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్ కంపెనీఆస్తులు రూ.92 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది. కేటీఆర్ బీజేపీ జాతీయ నాయకుల్ని ఇలాగే  రెచ్చ గోడితే అటు నుంచి  ఇలాంటి దాడులు, జప్తులు  ఇంకా చాలా జరగుతాయని, దీనికి తెరాస ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తి తోడైతే, తెరాసను చీల్చడం పెద్ద పని కాకపోవచ్చని అంటునారు. అందుకే కేటీఆర్ దూకుడు తగ్గించుకోవడం మంచిందని, లేదంటే  అందుకు మూల్యం చెల్లించక తప్పదని, అంటున్నారు.

బీజేపీ విజయ సంకల్ప సభకు వరుణ గండం

బీజేపీ విజయ సంకల్ప సభకు వరుణ గండం పొంచి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించతలపెట్టిన ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అంతే ఇంత భారీగా నిర్వహించతలపెట్టిన సభకు వరుణ గండం పొంచి ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన, టెన్షన్ నెలకొంది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసిన మోడీ కటౌట్ కూలిపోవడంతో సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వరకూ ట్రాఫిక్ ను నిలిపివేశారు. వాతావరణ శాఖ హైదరాబాద్ లో ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యలో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.  ప్ర‌ధాని మోడీతో పాటు కేంద్ర కేబినెట్.. ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం ఈసభకు హాజరవుతుండడంతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా తమ బలాన్ని ప్రధానమంత్రి ముందు ఈ సభ ద్వారా ప్రదర్శించేందుకు ప్రయత్నం చేసిన‌, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సభపై ఆందోళన ఏర్పడింది. ఇక బీజేపీ విజయ సంకల్ప సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.   పలు రూట్లలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. హెచ్ఐసీసీ  మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ – పరేడ్ గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ చుట్టు పక్కల రోడ్లలో ప్రయాణించడం నివారించారు. అలాగే టివోలి క్రాస్ రోడ్ నుండి ప్లాజా క్లాస్ రోడ్ మధ్య రహదారి మూసివేశారు. అలాగే  చిలకలగూడ  క్రాస్ రోడ్,  అలుగడ్డబాయి క్రాస్ రోడ్,   సంగీత్ క్రాస్ రోడ్,  వైఎంసీఏ క్రాస్ రోడ్,  ప్యాట్నీ క్రాస్ రోడ్, ఎస్బీహెచ్ క్రాస్ రోడ్,  ప్లాజా,  సీటీవో జంక్షన్,   బ్రూక్‌బాండ్ జంక్షన్,  టివోలి జంక్షన్,  స్వీకార్‌ఉప్‌కార్ జంక్షన్,  సికింద్రాబాద్ క్లబ్,   తిరుమలగిరి క్రాస్ రోడ్,  తాడ్‌బండ్ క్రాస్ రోడ్  సెంటర్ పాయింట్,  డైమండ్ పాయింట్  బోయినపల్లి క్రాస్ రోడ్,  రసూల్‌పురా, బేగంపేట్   ప్యారడైజ్ మార్గాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకూ ప్రయాణాలు వద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.  

భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన యోగి.. పాతబస్తీలో టెన్షన్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పాత బస్తీలో టెన్షన్ వాతావరణానికి కారణమయ్యాయి. ఔను నిజమే. హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరిగే బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఉదయం పాత బస్తీ చార్మినార్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకు కారణం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన కోసం అక్కడకు రావడమే ఈ టెన్షన్ కు కారణం. భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన కోసం యోగి ఆదిత్యనాథ్ రావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పలు ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. యోగి ఆలయ సందర్శన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకున్న యోగి ఆదిత్యనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా    చార్మినార్, మక్కా మసీద్, గుల్జర్ హౌస్, లాడ్ బజార్, హుసేనీ అలం, మొఘల్‌పుర, సర్దార్ మహల్ రోడ్, చౌమహల్ కిల్వట్ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుతోపాటు ప్లాటూన్ టీమ్స్‌ను మోహరించారు. సౌత్ జోన్ డీసీపీ భద్రతను పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్, 3 ప్లాటూన్ మహిళా పోలీస్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

బెజవాడ కనక దుర్మమ్మకు తెలంగాణ బంగారు బోనం

తెలుగు రాష్ట్రాల అవినాభావ సంబంధానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయానికి నిదర్శనం ఏటా బెజవాడ కనకదుర్గమ్మ  అందుకునే తెలంగాణ బంగారు బోనం. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే అనడానికి రాష్ట్ర విభజన తరువాత కూడా ఈ సంప్రదాయం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుండటమే నిదర్శనం. హైదరాబాద్ లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున బెజవాడ కనకదుర్గమ్మకు ఈ రోజు బంగారు బోనం అందింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తెలంగాణలో ఘనంగా బోనాల పండుగ జరుగుతుంది. ఆ పండుగ సందడి ఏపీలో కూడా ప్రతిఫలిస్తుంది. అందులో భాగమే తెలంగాణలో తొలి బోనం సమర్పించే రోజునే బెజవాడ కనకదుర్గమ్మకూ బోనం సమర్పించడం. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతి ఏటా ఆషాఢమాసంలో విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడు కూడా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించినట్లు మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ తెలిపారుజ.  అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికిపైగా కళాకారులు విజయవాడకు చేరుకుని ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించి  బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మేళతాళాలు, తీన్‌మార్‌ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  

కేసీఆర్ భయానికి ఇదే నిదర్శనం.. ఖుష్బూ

తెలుగు సినిమాలలో నటించిన ఖుష్బు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ నాయకురాలిగా ఆమె తెలుగువారికి కొత్తే. రాజకీయవేత్తగా మారిన ఖుష్బు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఆమె బీజేపీకి కీలక నేత. హైదరాబాద్ లో జరగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆమె కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు వారితో తనకు ఉన్న అనుబంధం కారణంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా కొన్ని ఘాటు విమర్శలూ చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా చేస్తున్న అతిని ఆమె కేసీఆర్ లోని భయానికి దర్పణం పడుతోందని పేర్కొన్నారు. నగరంలో బీజేపీ ఫ్లెక్సీలకు చోటు దొరకనంతగా టీఆర్ఎస్ ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఆమె ఎత్తి చూపారు. మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడమే మోడీ అంటే, బీజేపీ అంటే కేసీఆర్ ఎంతగా భయపడుతున్నారో తెలియజేస్తోందని ఖుష్బూ అన్నారు. ఇక రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ రాకపోవడం ఆయన ఆలోచనా ధోరణికి, లెక్కలేని తనానికీ, ఫెడరల్ విధానం పట్ల విముఖతకు నిదర్శనంగా ఖుష్బూ పేర్కొన్నారు.

ప్లీనరీ ముంగిట వైసీపీలో గ్రూపుల రచ్చ

ఎప్పుడో 2017లో వైసీపీ  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ప్లీనరీ... మళ్లీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత జరగ బోతోంది.  ప్లీనరీ బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని ఇప్పటికే సీఎం జగన్  పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు  ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలు ప్లీనరీ సన్నాహాలు ప్రారంభించేశారు. స్థల పరిశీలన చేశారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హడావుడి అయితే పడుతున్నారు కానీ  ప్లీనరీకి ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. అలాంటి సమయంలో వివిధ జిల్లాల్లో నేతల మధ్య గ్రూప్ తగాదాలు .. రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వ్యవహారం రచ్చకెక్కింది. హఠాత్తుగా ఇరువురు నేతలూ   ఎందుకు బరస్ట్ అయ్యారన్న చర్చ పార్టీలో ఓ రేంజ్ లో జరుగుతోంది. గతంలో కూడా జిల్లాల్లో నేతల మధ్య గ్రూప్ తగదాలు ఉన్నా అవి ఇలా రచ్చకెక్కిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు  మాత్రం అవి వీధి తగాదాలుగా మారిపోయాయి. మీడియా ముందు, టీవీ డిబెట్లలో కూడా కోటం రెడ్డి, బాలినేని రచ్చ ఓ రేంజ్ లో సాగుతోంది. విజయసాయిరెడ్డే బాలినేని, కోటంరెడ్డిల మధ్య చిచ్చుకు సూత్రధారి అన్న చర్చ వైసీపీ కేడర్ లో జోరుగా సాగుతోంది. వారిద్దరి మధ్యే కాదు.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైసీపీలో గ్రూపుల తగాదాలు పరిధిమీరి రచ్చకెక్కుతున్న పరిస్థితి ఉంది.  తాడేపల్లి ఫ్యాలెస్‌లోకి  విజయసాయి రీ ఎంట్రీ  తర్వాతే  జిల్లాల్లోని నేతల మధ్య ఉన్న గ్రూప్ తగాదాల   రచ్చ పెచ్చరిల్లిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.    వైయస్ జగన్ ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు విజయసాయిరెడ్డి  పాత్ర పార్టీలో అత్యంత కీలకం.. నాడు ఆయన ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక లగాయతు.. జగన్ తొలి కేబినెట్ కూర్పు  జరిగింది.  ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైజాగ్ వెళ్లిపోయారు.. ఆ తర్వాల అంతా  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలోని పదవులు రాని కీలక నేతలంతా ఆయన చుట్టూ  చేరారు. అక్కడ నుంచి ఏ జిల్లాలో జిల్లాల్లో ఎక్కడ ఏ నాయకుల మద్య అసంతృప్తి జ్వాలలు  ఎగిసినా   సజ్జల రామకృష్ణరెడ్డి  డైరెక్ట్‌గా రంగంలోకి దిగి.. సముదాయించడం జరుగుతూ వస్తోంది.  అయితే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి.. జిల్లా అధ్యక్షులు, సమన్వయ కర్తల బాధ్యతలు అప్పగించడం రచ్చకు కారణమైందని అంటున్నారు. సజ్జల, విజయసాయి రెండు అధికార కేంద్రాలుగా మారడంతో జిల్లాల్లో పార్టీ నేతలు, క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.. సజ్జల, విజయసాయి మధ్య విడిపోయిన జిల్లాల నేతల పంచాయితీ ఇప్పుడు వారు కూడా తీర్చలేని స్థితికి చేరుకుందనీ, దీంతో ఇవన్నీ   జగన్ వద్దకు చేరుతున్నాయనీ పార్టీ కేడర్ చెబుతున్నారు.  అదే సమయంలో జనంలో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతుంటే..  మరోవైపు తెలుగుదేశం, జనసేనలు బలోపేతం అవుతున్నాయి. ఆ రెండు పార్టీలు బలోపేతం అవుతున్నాయనడానికి జనసేన సభ, తెలుగుదేశం మహానాడుల సక్సెసే తార్కాణమని వైసీపీ క్యాడరే బహిరంగంగా చెబుతోంది. కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేన సభ సక్సెస్ అయ్యింది.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. మరి   151 ఎమ్మెల్యేలు ఉండి, అధికారంలో ఉన్న వైసీపీ ప్లీనరీ ఎంత బ్రహ్మాండంగా జరగాలి అని జగన్ అంటుంటే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదని వైసీపీ క్యాడర్ అంటున్నారు.  

నడ్డా పాతపాటే.. మోడీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించడమే!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాత పాటనే వినిపించారు. ప్రధాని మోడీనీ, బీజేపీని వ్యతిరేకించడమంటే దేశాన్ని వ్యతిరేకించడమేనని సూత్రీకరించారు. మోడీ హయాంలో దేశం అన్ని రంగాలలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి 6 శాతం ఉంటే మనదేశ ఆర్థిక వృద్ధి 8.7 శాతం ఉందని చెప్పుకొచ్చారు.  బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అధ్యక్షోపన్యాసం చేసిన ఆయన విపక్షాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని వ్యతిరేకిస్తున్నామంటూ విపక్షాలు దేశాన్ని వ్యతిరేకిస్తున్నాయని మండి పడ్డారు.  సర్జికల్ స్ట్రైక్స్, రఫెల్ విమానాల కొనుగోలుపై విపక్షాల ఆరోపణలను ఆయన ఇందుకు ఉదాహరణగా చూపారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ పాలనపై, అవినీతిపై విమర్శలు గుప్పించారు. ఎస్టీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడమే నిదర్శనమని చెప్పారు.  దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 352 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో నడ్డా దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై, పార్టీ బలోపేతంపై మాట్లాడారు.  మోదీ ఎనిమిదేళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని.. జన్‌ధన్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం కిసాన్‌ వంటి పథకాలు పేదల సాధికారత కోసం ఉద్దేశించినవేనన్నారు. పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లే యూపీ, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు రాంపూర్‌, అజాంగఢ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు.ఇక పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికిగాను ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నామనీ, దేశ వ్యాప్తంగా  ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 200 మంది క్రియాశీల కార్యకర్తలను గుర్తించి, వారితో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే   30 కోట్ల మంది లబ్ధిదారులతో పార్టీ కేడర్‌ సమావేశమై, పథకాల వారీగా వారి అభిప్రాయాలు తీసుకుంటుందన్నారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కమిటీలను పటిష్ఠం చేయాల్సిన ఆవశ్యకతను పార్టీ గుర్తించిందన్నారు.  

వైసీపీ ప్లీనరీ వేదికపై విజయమ్మ కనిపించేనా?

అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జూలై 8, 9 తేదీల్లో జరగనుంది. అందుకు సన్నాహాలు మొదలైనాయి. అయితే ఈ ప్లీనరీని సక్సెస్ చేసేందుకు పార్టీలోని కీలక నేతలంతా రంగంలోకి దిగారు. భారీగా నిర్వహించే ఈ ప్లీనరీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజరవుతారా? ఆమె ఆ పదవిలోనే కొనసాగుతారా? లేక ఆ పదవికి రాజీనామా చేసి.. మళ్లీ కుమార్తె వైయస్ షర్మిల వద్దకు వెళ్లిపోతారా? అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో హాట్‌హాట్‌గా నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌కి ఆయన తల్లితో చెల్లితో బాగా గ్యాప్ పెరిగింది. ఇందుకు తార్కానమే షర్మిల  వైయస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం, తల్లి విజయమ్మ ఆమెతోనే ఉండటం. వైఎస్సార్టీపీ  అధ్యక్షరాలిగా   షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  పాదయాత్ర చేస్తున్నారు. ఆమె పాదయాత్ర ఇటీవలే వంద రోజులు సైతం పూర్తి చేసుకొంది. అయితే తెలంగాణలో పార్టీ వద్దన్నా వినకుండా  పార్టీ పెట్టడంపై సీఎం జగన్ .. రగిలిపోతున్నారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  వైఎస్సార్ టీపీ కారణంగానే  జగన్‌కు  విజయమ్మ, షర్మిలలతో సంబంధాలు చెడ్డాయని కూడా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.   ఈ పరిస్థితుల్లో  ఈనెల 8,9 తేదీలలో జరగనున్న వైసీపీ ప్లీనరీకి  వైయస్ విజయమ్మ అయినా హజరవుతారా?అన్న సందేహాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి.  2017లో నాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు.. అదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే.. జగన్ పరిపాలన ముచ్చటగా మూడేళ్లు నిండిన తర్వాత నిర్వహిస్తున్నది.   విపక్ష నేతగా జగన్   ఎప్పుడు దీక్షలు చేసినా.. ఎప్పుడు సభలు, సమావేశాలు నిర్వహించినా..   విజయమ్మ.. షర్మిల జగన్ కు అండగా నిలిచారు. ముగ్గురూ ఒకే వేదికపై కూర్చుని ముచ్చట్లాడుకునే వారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  ముందు ముందు కూడా ఉంటుందన్న నమ్మకం లేదు.   అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్న సమయంలో.. జగనన్న వదిలిన బాణాన్నంటూ  షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారు. అలాగే రాజన్న రాజ్యం కోసం.. తన బిడ్డకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ.. ఎన్నికల ప్రచారంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా  విజయమ్మ కోరారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కూడా వైసీపీతో కానీ, అధినేత జగన్ తో కానీ కనీసం కలవడానికి ఇష్టపడటం లేదు. జగన్ తో తల్లీ, సోదరిల విభేదాలు పార్టీకి ఒక విధంగా పెద్ద దెబ్బేనని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  

ఈటలకు హై కోర్టులో ఊరట.. జమునా హేచరీస్ భూముల్లో జోక్యం వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు

ఈటలకు హైకోర్టులో ఊరట లభించింది.   మెదక్‌ జిల్లా   అచ్చంపేటలోని సర్వే నంబరు 130లో జమునా హేచరీ్‌సకు ఉన్న మూడు ఎకరాల భూమి విషయంలో వచ్చే నెల   1 వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.   ఇటీవల భూములు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెదక్‌ కలెక్టర్‌, స్థానిక ఆర్డీవో, మాసాయిపేట తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీచేసింది.  ఈ మూడెకరాలు ప్రభుత్వ భూములని, వాటిని ఆక్రమించడంపై వివరణ ఇవ్వాలంటూ గత నెల 25న మాసాయిపేట తహసీల్దార్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ జమునా హేచరీస్‌, ఆ సంస్థ డైరెక్టర్‌ ఈటల నితిన్‌రెడ్డి, ఈటల జమున   హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. గతంలో కలెక్టర్‌ ప్రాథమిక సర్వే పూర్తిచేశారని, పూర్తిస్థాయి సర్వే కొనసాగుతోందని వివరించారు. సర్వే పూర్తికాకముందే.. భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందని ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ వాదనతో విభేదించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఆగస్టు 1 వరకు ఆ భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. కాగా రైతులకు ప్రభుత్వం కేటాయించిన అస్సెన్డ్ భూములను కబ్జా చేసి ఈటల ఆ భూములలో జమునా హేచరీస్ నడుపుతున్నారన్న ఆరోపణలపై గత కొంత కాలంగా ప్రభుత్వం, ఈటల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి విదితమే. ఆ ఆరోపణలపైనే ఈటలను టీఆర్ఎస్ పక్కన పెట్టింది. కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది. దీంతో ఈటల తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ గూటికి చేరి..తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే భూముల విషయంలో మాత్రం తన న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.  

అన్నదాతకు సంకెళ్లా.. తెలంగాణలో రైతు సంక్షేమం ఇదేనా?

దేశానికి అన్నం పెట్టేది రైతు. ఆరుగాలం కష్టపడి తన శ్రమకు ఫలితం దక్కకపోయినా తాను పస్తులుండి కూడా ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టాలనేది రైతు నైజం. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతకు ఆత్మగౌరం లేకుండా పోతోంది. వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుల కోసం తాము తమకు బదుకు దెరువు చూపే భూములను ఇచ్చిన రైతులు పరిహారం కోసం ఏళ్లుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి. పోరాడినా న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదు. నిరన తెలిపినందుకు, కడుపు మండి రోడ్డు ఎక్కినందుకు చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. చివరకు సంకెళ్లు వేసుకుని ఉగ్రవాదుల్లా కోర్టు మెట్లు ఎక్కాల్సి దుస్థితి నెలకొంది. రైతు, రైతుబాంధవుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రైతుల బతుకులు బాగవుతున్నాయని ప్రచారం చేసుకునే అధికార పార్టీ నేతలు, మంత్రులు, రూ.50 వేల కోట్లు రైతు బంధు ఇచ్చామని యాసంగిలో సంబరాలు చేసుకున్న నేతలు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు వేసిన బేడీలపై నోరు మెదపడం లేదు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను.. నేరస్థులు, టెర్రరిస్టులను తీసుకువచ్చినట్టు సంకెళ్లతో కోర్టులో హాజరుపరిచారు. పరిహారం కోసం జూన్‌ 14న హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు గుడాటిపల్లికి చెందిన 17 మంది నిర్వాసిత రైతులపై కేసులు పెట్టారు. వీరిలో నలుగురిని అదేరోజు అరెస్టు చేయగా.. మిగిలిన వారు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు. నలుగురిని అదే రోజు రిమాండ్‌చేసిన పోలీసులు, 14 రోజుల తర్వాత గురువారం హుస్నాబాద్‌ కోర్టుకు తీసుకొచ్చారు. తమ వారిని సంకెళ్లతో చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. 2017 ఏప్రిల్‌లో ఖమ్మంలోనూ మద్దతు ధర కోసం ఆందోళన చేసిన పది మంది రైతులను ఇలాగే సంకెళ్లతో కోర్టుకు తీసుకురావడం అప్పట్లో దుమారం రేపింది. తాజాగా మరోసారి రైతులకు సంకెళ్లు వేయడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఓమైనర్‌ బాలికపై అధికార పార్టీకి చెందిన నేతల కొడుకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో సాక్షాధారాలు బయటకు వచ్చే వరకు కూడా పోలీసులు నేతల కొడుకులు లేరని చెప్పుకొచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన రెండు రోజులకు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. చివరకు అరెస్ట్‌ చేసిన తర్వాత కూడా నిందితులకు పోలీసులు రాచమర్యాదలు చేయడం, ఇళ్ల నుంచి, హోటళ్ల నుంచి బిచార్యనీలు తెప్పించి ఇచ్చారు. పరిహారం అడిగిన పాపానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు మాత్రం ఇలా సంకెళ్లు వేశారు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిపాటు పంజాబ్‌ రైతులు డిల్లీలో ఉద్యమించారు. ఈ పోరాటంలో పంజాబ్‌కు చెందిన రైతులు చనిపోయారు. రైతు ఉద్యమంతో ప్రధాని నరేంద్రమోదీ దిగివచ్చారు. చట్టాలను ఉపసంహరించుకుని దేశ రైతులకు క్షమాపణలు చెప్పారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ రైతు బాంధవుడని రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల పంజాబ్‌కు వెళ్లి మరీ పరిహారం అందించారు. సొంత రాష్ట్రంలో రైతులు అన్నమో రామచంద్రా అని అంగలారుస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. కడుపు మండి పోరాటం చేస్తే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిస్తున్నాడు సదరు రైతు బాంధవుడు. ఇదేనా బంగారు తెలంగాణ అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత ఎండమావే!

తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత అన్నది ఎండమావిలాగే తయారైంది. అన్ని వర్గాలూ గ్రూపు విభేదాలు మరచి కలిసి పని చేస్తున్నట్లు కనిపించినా.. వేటికవి గానే కాలుదువ్వుతుంటాయి. తాజాగా కాంగ్రెస్ లో విభేదాల తుట్టె కదిలింది. అందుకు రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి  య శ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక కారణమైంది. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు విషయంలో ఎటువంటి రెండో అభిప్రాయం లేకపోయినా.. ఆయన ముందుగా టీఆర్ఎస్ ఎంపీలను కలవడం, ఆ తరువాత తమను కలుస్తాననడం కాంగ్రెస్ కు రుచించలేదు. అందుకే కేసీఆర్ ఆధ్వర్యంలో యశ్వంత్ సిన్హాతో ఏర్పాటు చేసిన భేటీకి, అలాగే ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేశామన్నారు. ఒకటి రెండు రోజుల తరువాత హస్తినలో యశ్వంత్ సిన్హాను కలిసి మద్దతు తెలుపుతామని రేవంత్ చెప్పారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి యశ్వంత్ సిన్హాను కలవడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. అందులోనూ కేసీఆర్ సమక్షంలోనే వీహెచ్ యశ్వంత్ సిన్హాకు బొకే ఇచ్చి అభినందనలు తెలపడం పుండుమీద కారం చల్లినట్లైంది. దీనిపై రేవంత్ ఫైర్ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదనీ గోడకేసి కొడతామని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా యశ్వంత్ సిన్హాను పార్టీ తరఫున ఎవరూ కలవలేదనీ, వ్యక్తిగతంగా ఎవరైనా కలిసి ఉంటే అది తమకు సంబంధం లేదని రేవంత్ అన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వీహెచ్ పై రేవంత్ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడానికి రేవంత్ ఎవరంటూ రెచ్చిపోయారు.  గోడకేసి కొడతామన్న వ్యాఖ్యలను రేవంత్ వెనక్కు తీసుకుని కాంగ్రెస్ కు, వీహెచ్ కు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. యశ్వంత్‌ను వీహెచ్‌ కలిసింది కేసీఆర్‌ ఇంటి వద్ద కాదని, ఎయిర్‌పోర్టులో అని పేర్కొన్నారు. రాజకీయంగా కాంగ్రె్‌సకు ప్రధాన శత్రువు బీజేపీ అని, ఆ తరువాతే టీఆర్‌ఎస్‌ అని జగ్గారెడ్డి చెప్పారు.   పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌ అసలు పనికిరాడన్నారు. కాగా, రేవంత్‌పై జగ్గారెడ్డి బహిరంగ విమర్శలు క్రమశిక్షణా రాహిత్యమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అధిష్ఠానం వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకే రేవంత్‌రెడ్డి మాట్లాడారని తెలిపారు. రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఇరువురు పార్టీకి రెండు కళ్లలా పని చేస్తున్నారన్నారు.  

భాగ్య‌న‌గ‌రంలో కాషాయం, గులాబీల క‌ద‌న కుతూహ‌లం

ఒక‌రికి మించి ఒక‌రు వాగ్ధాటితో త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శించుకోవ‌డంలో త‌గ్గే ప‌రిస్థితుల్లో లేరు. ఒక‌రిది  ఆధి ప‌త్యంలోకి  రావాల‌న్న ఉత్స‌హం, మ‌రొక‌రికి అందుకు అస్స‌లు అవ‌కాశ‌మీయ‌కూడ‌ద‌న్న కుతూ హ‌లం. ఇద్ద‌రి మ‌ధ్య పూర్వపు స్నేహ‌ఛాయ‌లు పోయి క‌ద‌నానికి కాల్దువ్వుతున్న స‌మ‌యం ఇది.  దీనికి  వేదిక హైద‌రాబాద్‌, ఆ రెండు.. బిజెపి, టిఆర్ ఎస్‌! తెలంగాణాలో   వేళ్లూనుకున్న టిఆర్ ఎస్ పార్టీకి వారి స్థాయిని తెలియ‌జేయాల‌న్న క‌మ‌ల‌ద‌ళ ప‌తుల ఆతృత‌.  త‌న ఇలాకాలోకి  వ‌చ్చి త‌న‌నే అధికారంలోంచి దించేందుకు సాహ‌సించే ద‌మ్ము ధైర్యం ఎక్క‌డిద‌ని నిల‌దీస్తున్న టిఆర్ ఎస్‌. ఒక‌వంక  బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి హైద‌రాబాద్ వేదిక కాగా, మ‌రో వంక హైద‌రాబాద్ టిఆర్ ఎస్ వారి భారీ ర్యాలీకి  కాషాయ‌ధారుల‌ను హెచ్చ‌రించ‌డానికి పూను కున్న క‌ద‌న కుతూహ‌లం! కదన వ్యూహం తో వచ్చిన కాషాయ దళం, గులాబీ  కోటని డీ కొడుతుందా, ఇంతకాలం విమర్శలు  ప్రతి విమర్శలతో సాగిన కాషాయ గులాభీ యుద్ధం ఇంక ప్రత్యక్యం గా జరుగుతుందా. కేంద్ర ప్రభుత్వ  విధి విధానాలను విమర్శించే  గులాబీదళానికి  చెక్ పెట్టేందుకు కాషాయదళం కదిలి వచ్చింది . తెలంగాణా లో పాగా వేయడం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే చెప్పాలి. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలు, 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలే ప్రధాన  అజెండా గా సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అత్యధిక రాష్ట్రాలలో అధికారం లో వున్న కమలం పార్టీ ఈసారి తెలంగాణా లో  పాగా వేయడానికి చాల తీవ్రంగా కృషి చేస్తోంది. తెలంగాణాలో అధికారం లో వున్న టి ఆర్ ఎస్ పార్టీ   బిజేపి ని చాలా తీవ్రం గా వ్యతిరేకిస్తోంది.అందువల్ల బి జే పి పార్టీ నాయకత్వం మరింత దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రజలలో తె రా సా కి ప్రత్యామ్న్యాయం బి జే పి అనే నమ్మకాన్ని కల్పించగలిగామని, ఆదివారం జరిగే బహిరంగ సభ తరవాత ప్రజలలో నమ్మకం మరింత  కలుగుతుందని తెలంగాణా బిజెపి నాయకుల  విశ్వాసం. ఐతే  మా ములుగానే బిజేపి మీద  విమర్శలు చేసే టిఆర్ఎస్‌ నాయకులు హైదరాబాద్ లో నిర్వహించే సభలో ప్రధాన అజండా  విద్వేషాలు లేపడం అని, అసమర్దాపాలన చేస్తున్న ప్రధాని అని, విమర్శలు చేస్తున్నా రు. టిఆర్ ఎస్‌ పాలనలో ప్రజలు ఎవరు కూడా సుఖంగా సంతోషంగా లేరు అని, బి జే పి నాయకులూ ఆరోపిస్తున్నారు.  ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతివిమర్శ‌లు చేసుకోవ‌డం  తప్ప ప్రజలకి చేసింది ఏమి లేదని ప్రజల అభిప్రాయం.కేంద్రం లో బా జ ప చేస్తుంటే రాష్ట్రం లో తె రాసా ప్రజలకి అన్యాయం చేస్తోంది. సామాన్య ప్రజల బ్రతుకులు దినదిన గండం నురేల్ల ఆయుషు ల వుంది.నిత్యావసర వస్తువులు గాని,పెట్రోల్ డీసెల్ గాని, గ్యాస్  ఏ వస్తువులు ఐనా కోనే పరిస్థితుల్లో  ప్రజలు లేరు. కేంద్రం ఏం సహాయం  చేయకపోయీనా మేము యంతో ప్రగతి సాదించం అని రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ పధకాలకి పేర్లు మార్చి మా పధకాలు అని చెప్పుకుంటున్నారని బిజెపి  శ్రేణులు ఇలా చెప్పుకోవడం తప్ప ఒరిగింది ఏమి లేదు.  రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా లక్షం ఒకటే అధికారం.అధికారం లోకి రావడం కోసం ప్రజలకి ఎన్నో హామీ లు  ఇవ్వడం తప్ప హమిలని నిలబెట్టుకోవడం ఏ పార్టీ కి కూడా చేతకాదు.కే సీ ఆర్ కి  బాయ్ చెప్ప డానికి ప్రజలు సిద్దం గా వున్నారని  అని, వచ్చే ఎన్నికలలో తమదే విజయమని బిజెపీ  శ్రేణులు అంటున్నాయి. కేంద్రం లో బిజెపి కి ప్రత్యామ్నయం కోసం కే సీ ఆర్ చేసిన ప్రయత్నాలు తెలియనివి కాదు. నేరుగా మంత్రి మీదే  విమర్శలు చేస్తున్న గులాభీ బాస్. హైదరాబాద్ లో సమావేశం లో ప్రసంగమే కాకుండా ప్రశ్నలకి  కూడా  సమాధానం చెప్పాలి  అని చెప్తున్నారు,

ప్రధానిపై విమర్శల వర్షం.. ప్రశ్నల శర పరంపర..స్వరం పెంచిన కేసీఆర్

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ గడ్డపై బస చేసి ఉన్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వరం పెంచారు. మోడీ లక్ష్యంగా విమర్శల దాడికి పదును పెట్టారు. ఒక వైపు హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ కేసీఆర్ వ్యూహాత్మకంగా రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ ఆహ్వానించి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జల విహార్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఆ మావేశం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించడానికి ఒక రోజు ముందే కేసీఆర్ తనదైన శైలిలో మోడీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక రకంగా మోడీకి  ఆయన ఆదివారం (రేపటి) ప్రసంగం ఎజెండా ఏమిటన్నది కేసీఆర్ ఇచ్చేశారు. తన విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని మోడీకి కల్పించారని చెప్పవచ్చు. దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. తన ప్రసంగం మొత్తం యశ్వంత్ కు మద్దతు ప్రకటనకు కాకుండా మోడీపై విమర్శల పరంపరకే ఉపయోగించుకున్నారు. తెలంగాణ గడ్డపై రెండు రోజులు బస చేయనున్న మోడీ ముందుగా తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అలాగే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అదికారంలో ఉన్నమోడీ సర్కార్ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా అమలు చేసిందా చెప్పాలన్నారు. చెసినట్లైతే అవేమిటో వివరించాలన్నారు. ఈ ప్రశ్న తన ఒక్కడిదే కాదని యావత్ ప్రజానీకానిదనీ అన్నారు. రైతులు అడుగుతున్నది మద్దతు ధర మాత్రమేననీ, బంగారం కాదనీ అన్న కేసీఆర్.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోడీ, అది చేయకపోగా వారి వ్యయాన్ని రెట్టింపు చేశారని అన్నారు. అన్యాయమైన రైతు చట్టాలు తీసుకువచ్చి రైతుల బతుకులను ఆగంఆగం చేశారని దుమ్మెత్తి పోశారు. చివరికి రైతుల ఆందోళనలకు దిగి వచ్చి వారికి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు మేం సాయం చేస్తే అవహేళన చేస్తున్నారన్నారు. కేంద్రం చేయాల్సిన పనిని మేం చేశామని, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోన్నందుకు తాము గర్వ పడుతున్నామని, ఆ పని చేయలేకపోయినందుకు మోడీ సిగ్గుపడాలని కేసీఆర్ ఆన్నారు. మోడీ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, అల్పాదాయ వర్గాల ప్రజలు ఇలా ఏ వర్గమూ సంతోషంగా లేదని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థను మోడీ దుర్వినియోగం చేశారని దుమ్మెత్తి పోశారు. మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందన్నారు. పెద్ద కంపెనీలన్నీ దేశం వదిలి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ అస్తవ్యస్థ పాలనను చూస్తూ టీఆర్ఎస్ మౌనంగా ఉండజాలదన్నారు. అలాగే ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో మోడీ ఏం మాట్లాడబోతున్నారో కేసీఆర్ చెప్పేశారు. మోడీ హైదరాబాద్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో తనను విమర్శించడం వినా మరో మాట ఉండదన్నారు. వ్యక్తిగతంగా మోడీతో తనకు విభేదాలు లేవన్న కేసీఆర్ మోడీ నిజాయితీగా తన ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణ గడ్డ వీడాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ఎంపీ నామా ఆస్తులు జప్తు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీకి చెందిన ఆస్తులను ఈడీ శనివారం జప్తు చేసింది. హైదరాబాద్ లో ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మరో వైపు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతుగా టీఆర్ఎస్ సభ జరుగుతోంది. సందడ్లో సడేమియా అన్నట్లుగా ఈడీ అధికార టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ ఆస్తులను జప్తు చేసింది. బీజేపీ తెరాసల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితి ఉన్న నేపథ్యంలో నామా ఆస్తుల జప్తు రాజకీయంగా మరింత వేడి పుట్టంచే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం, కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ తన విమర్శల దాడిని పెంచడం, యశ్వంత్ సిన్హాను సరిగ్గా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే టీఆర్ఎస్ హైదరాబాద్ కు ఆహ్వానించడం వంటి సంఘటనల నేపథ్యంలో నామా ఆస్తుల జప్తునకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులను ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులతో వేధిస్తున్నదన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. కాగా నామా కంపెనీ విషయానికి వస్తే మధుకాన్ ప్రాజెక్ట్స్ పేర నామా నాగేశ్వరరావు ఆయన రాజకీయాలలోకి రావడానికి మందే ఓ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ పలు రంగాలకు విస్తరించి మధుకాన్ గ్రూప్ అయ్యింది. నిర్మాణ రంగంలో ఉన్న నామా కంపెనీ రాంచీలో గతంలో నిర్మించిన ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై ఈడీ 2002లో కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించే ఇప్పుడు ఈడీ కంపెనీ ఆస్తులతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన రూ.92.21 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. నామా నాగేశ్వరరావు హైదరాబాద్ లో రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోసం జలవిహార్ లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఆయన ఆ సభలో ఉన్న సమయంలోనే ఈడీ ఆయన కంపెనీకి సంబంధించిన ఆస్తులను జప్తు చేయడం గమనార్హం

పిల్లాడి మార్కులు 6..  తండ్రి కొట్టిన‌వి...!

ఒక‌రోజు  చైనా  ఝాన్‌ఝూలో  ఓ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడ‌ని అడ‌గ‌డానికి ద‌గ్గ‌రికి వెళితే భ‌య‌ప‌డ్డాడు, కార‌ణం మ‌ళ్లీ వాళ్ల నాన్న క్ర‌రెత్తేడే మోన‌ని!  చూస్తే  వాడి  వీపు మీద ఎర్ర‌టి చార‌లు తేలి వున్నాయి.  వాడేమీ  టెన్త్  విద్యార్ధీ కాదు. బ‌హుశా 8వ త‌ర‌గ‌తి విద్యార్ధి అయి వుంటాడు.  వాళ్ల నాన్న హస‌న్ వాడిని చ‌చ్చేట్టు కొట్ట‌డానికి కార‌ణ‌మేమంటే వాడికి లెక్క‌ల్లో వంద‌కి ఆరు మార్కులు వ‌చ్చాయ‌ని! మామూలుగానే లెక్క‌లంటే ఆ త‌ర‌గ‌తుల్లో వారికి నూటికి 90 శాతం మంది భ‌య‌మే వుంటుంది. కార‌ణం టీచ‌ర్ల భ‌యం, కూడిక‌లు, తీసివేతల్లో క‌న్‌ఫ్యూజ‌న్‌!  ఏమైప్ప‌టికీ  హ‌స‌న్ కొడుకు మాత్రం మిగ‌తా స‌బ్జెక్టుల్లో  బాగానే వున్న‌ప్ప‌టికీ లెక్క‌ల్లో దారుణంగా వుండ‌డానికి కార‌ణం హ‌స‌న్ స‌రిగా క‌నుక్కోలేదు. స్కూలుకి వెళ్ల లేదు. పిల్ల‌డికి మంచి మార్క‌లు వ‌చ్చితీరాల‌న్న ప‌ట్టుద‌ల త‌ప్ప‌. అందుకు వాడికి ఏకంగా ట్యూష‌న్ టీచ‌ర్‌ని పెట్టాడు. కానీ అంకెలు వాడికి ఏమాత్రం మ‌న‌సుకి ఎక్క‌లేదు. తండ్రి, ట్యూష‌న్ టీచ‌ర్ వేగంగా ఏదో చెప్ప‌డం త‌ప్ప వాడికి అర్ధ‌మ‌య్యేలా చెప్ప‌లేక‌పోయారు. టీచ‌ర్ అంత అవ‌కాశ‌మీయ‌దు. క్లాసులో వాడిని ఒక్క‌డినే ప‌ట్టించుకునే తీరిక వుండ‌దు. అన్నీ వెర‌సి వాడి వీపు విమానం మోత మోగిచాయంటే న‌మ్మండి! అక్ష‌రాల కంటే అంకెలంటే ఇలానే భ‌యం ఏర్ప‌డి పెద్ద‌య్యాక కూడా కాస్తంత ఇబ్బంది పెడుతూనే వుం టాయి. ఏమైనా దానికో స్పెష‌ల్ టాలెంట్ వుండాల్రా అబ్బాయ్ అనే టీచ‌ర్లు వుంటారు. లెక్క‌ల్లో రాణించ డం అంత సులువు కాదు.  వ‌స్తే వాడు సూప‌ర్ మ్యాన్‌. రాకుంటూ ఎవ‌రికి వారే!  మిగ‌తా స‌బ్జెక్టుల కంటే మాథ్స్ చెప్ప‌డంలో ప్ర‌త్యేక నైపుణ్యం వుండాలి. ఈ స‌బ్జెక్టు చెప్పేవారు చాలా ప్ర‌శాంతంగా వుండాలి, చెప్పాలి. అపుడే విద్యార్ధులు ఇట్టే అర్ధంచేసుకుంటారు. కాక‌పోయినా టీచ‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి డౌట్స్ క్లియ‌ర్ చేసుకోగ‌ల్గుతారు. అలాగాకండా, కుర్చీ ప‌క్క‌నే బెత్తం గ‌ద‌లా ఆనించి పెట్టుకుంటే విద్యార్ధుల‌కు అంకెలు అర్ధం కావు, బుర్ర‌లోకి ఏదీ ఎక్క‌దు, వొణుకు భ‌యం వాడి ప్రాణాల్ని తోడేస్తుంటాయి. హ‌స‌న్ కొడుకు ప‌రిస్థితీ అదే. అందుకే వాడికి మాథ్స్‌లో వంద‌కి ఆరు మార్కులే వ‌చ్చాయి.  ఇది చిత్రమో విచిత్ర‌మో అనుకోవ‌ద్దు. చాలా చాల‌మంది బాల్యంలో అనుభ‌వైక‌్కమె. పెద్ద‌య్యాక  8, 9, 10 త‌ర‌గ‌తుల్లో ఆ టీచ‌ర్ను దాటి ఎలా రాగ‌లిగానా అని ఆలోచిస్తే నిజంగానే ఆశ్చ‌ర్యంగానే వుంటుంది.  కొస‌మెరుపేమంటే.. హ‌నన్ కు త‌న కొడుకును కొట్టినందుకు ప‌శ్చాత్తాపం లేదు. వాడికి ట్యూష‌న్ పెట్టించ డం, వెంట వుండి చ‌దివించ‌డంలో ఎంతో న‌ష్టపోయాన‌ని బాధ‌ప‌డుతున్నాడ‌ట‌!

వందేళ్ల నాటి కబ్జా.. చివరికి సొంత దారులకు దక్కిన బీచ్

కబ్జాల పర్వం ఇండియాకే కాదు అగ్రరాజ్యానికి ఒక జాడ్యంగా ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆ కబ్జాలన్నీ జాతి వివక్ష కారణంగా నల్లజాతీయుల ఆస్తుల కబ్జా అధికంగా జరిగేది. జాతి వివక్ష నిర్మూళన దిశగా అగ్రరాజ్యం వేగంగా అడుగులు వేడయం ప్రారంభించడంతో నాడు కబ్జా చేసిన నల్లజాతీయుల ఆస్తులను వారికో వారి వారసులతో అప్పగించడం అక్కడ ఇప్పుడిప్పుడే మొదలౌతోంది. ఆ కోవలోనే ఎప్పుడో వందేళ్ల కిందట నల్లజాతీయుల నుంచి లాక్కొన్న భూమిని ప్రభుత్వం వారి వారసులకు అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. ఎప్పుడో 1912లో నల్లజాతీయుల కసం చార్ల్స్ బ్రూస్, విల్లా బ్రూస్ లు కాలిఫోర్నియాలో ఒక బీచ్ ను కొనుగోలు చేశారు. అయితే  ఆ బీచ్ ను స్థానిక ప్రభుత్వం 1924లొ బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దానిపై ఇంత కాలంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్న బ్రూస్ వారసులు ఎట్టకేలకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. అప్పుడు ఆ బీచ్ ను జాతి వివక్షతోనే అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కౌంటీ కమిటీ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు గత మంగళవారం వెలువడింది. 1912లో బ్రూస్ సోదరులు ఆ బీచ్ కొన్నప్పుడు దాని విలువ 1225 డాలర్లు. ఇప్పుడు దాని మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లు..భారత కరెన్సీలో దాని విలువ చెప్పాలంటే అక్షరాలా 158 కోట్ల రూపాయలు.