ఇంకా మిల్లుకు చేరని పంటలు! ఆహార కొరత త‌ప్ప‌దా!

లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తే… ప్రస్తుతం వలస కూలీలే కాదు… మధ్య తరగతీ తిండి కోసం తిప్పలు తప్పని పరిస్థితి.  మూతబడిన మిల్లులు, కార్మికులు, కూలీలు విధులకు హాజరుకాలేకపోవడం, పంటలు ఇంకా వ్యవసాయ క్షేత్రాల్లోనే నిలిచిపోవటంతో ధాన్యం, పప్పులు ఇంకా మిల్లులకు చేరని పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 4000 రైస్‌ మిల్లులు మూతపడగా… కనీసం 4 లక్షల మంది కార్మికులు ఇళ్లల్లో మగ్గిపోతున్నారు. రబీ సీజన్‌ పంటలు ఈపాటికే మిల్లులకు చేరుకోవాల్సి ఉండగా లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయ కూలీలు, కార్మికుల కొరత తీవ్రం కావడంతో 75 శాతం మిల్లులు పనిచేయడంలేదు. దేశవ్యాప్తంగా ఏడాదికి 22 మిలియన్‌ టన్నుల గోధుమపిండి, మైదాను మిల్లులు సప్లై చేస్తుంటాయని, కరోనా కారణంగా గోధు మలు, కార్మికుల లభ్యత క్షీణించి 40 నుంచి 50 శాతం పిండి మాత్రమే ఉత్పత్తి అవుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  అలాగే వంట నూనెల తయారీ 40 శాతం తగ్గింది.   ఆంధ్రప్రదేశ్‌లో ఈ రబీ సీజన్‌లో 30 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరా శాఖకు సుమారు రూ. 25 వేలకోట్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1280 పీపీసీలను ప్రారంభించింది. పొలం నుంచి ధాన్యం గింజలను పీపీసీలకు తరలించే అవకాశమే లేదు. లాక్‌డౌన్‌ సందర్భంగా గ్రామాల్లో రైతులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వటం లేదు. కనీసం పొలంలో వరి కోతలకు కూలీలనూ బయటకు రానివ్వటం లేదు.  తెలంగాణాలో 37 లక్షల టన్నుల ధాన్యం చేతికి వస్తుందని అంచనా. ఎఫ్‌సీఐ ముతక రకం బియ్యాన్ని సేకరిస్తుంది. సామాన్య జనం సైతం వినియోగించే సోనా మసూరీ, సాంబ మసూరీ, తెల్లమసూరీ, గిద్ద మసూరీ, విజయ మసూరీ, బీపీటీ, జీలకర్ర సన్నాలు, మొలగొలుకులకే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని వినియోగించే పరిస్థితి లేదు. మిల్లుల్లో మర ఆడక పోవటంతో బియ్యం కొరత వేధించనుంది.  రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు మిల్లులకు నేరుగా చేరుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఆహార కొరత ఏర్పడకుండా ఉండగలదన్న ఆశాభావాన్ని మిల్లర్లు, వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు.

బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం కొరత!  లాక్‌డౌన్‌తో వెళ్లలేకపోతున్న దాతలు!

లాక్‌ డౌన్‌కు ముందు రక్త దానం చేయడానికి ఒక్కో బ్ల‌డ్‌బ్యాంక్‌కు రోజుకు 50-60 మంది వచ్చేవారు. ఇప్పుడు ఎవరూ రావడంలేదు. రక్త దాతలతో మాట్లాడితే.. తమకు కూడా రావాలని వుందని, అనుమతి కావాలని కోరుతున్నారు. దాతలు ఎవరూ లేకపోవడం వల్ల సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. రక్తం అవసరాలు పెరుగుతున్నాయి. సాధారణ సమయాల్లో ప్రతి బ్లడ్‌ బ్యాంకులో 100 నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. అత్యవసరమై వచ్చేవారికి వాటిని అందిస్తుంటారు. రక్తం తీసుకునేవారు ప్రతిగా వారి కుటుంబ సభ్యుల ద్వారానో, మిత్రుల ద్వారానో రక్తం ఇస్తుంటారు. ఇది కాకుండా రక్తదాన శిబిరాల ద్వారా బ్లడ్‌ బ్యాంకులకు రక్తం సమకూరుతుంది. విద్యా సంస్థలు, నేవీ, కొన్ని ప్రైవేటు సంస్థలు తరచూ శిబిరాలు నిర్వహించి రక్తం ఇస్తుంటాయి. పేరొందిన ప్రజాప్రతినిధులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శిబిరాలు నిర్వహించి, రక్తం సేకరించి ఇస్తుంటారు.  ప్ర‌స్తుతం ఆపదలో వచ్చిన వారికి రక్తాన్ని అందజేయలేక పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడేవారికి ప్రతి నెలా తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ వ్యాధిగ్రస్థులు తమకు అందుబాటులో ఉన్న బ్లడ్‌బ్యాంకులో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రతి బ్యాంకులోనూ ఇలాంటి వారి సంఖ్య 50 నుంచి 100 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్థులకు, అత్యవసరమైన డెలివరీ కేసులకు మాత్రమే ఇస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా రక్త సేకరణ శిబిరా లు జరగడంలేదు. దీంతో రక్తం అవసరమయ్యే రోగుల కోసం రక్తదాతలు ముందుకు రావాలని ఐపిఎం(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటి న్ మెడిసిన్) ప్రకటించింది. రక్తం ఇవ్వాలనుకునే దాతలు నేరుగా ఐపిఎంకి రావాలని డైరెక్ట ర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నారాయణగూడలో ఉన్న ఈ కేంద్రంలో ప్రతి రోజు సగటున 100 నుంచి 115యూనిట్లు సేకరిస్తున్నామని, వీటి ని మరింత విస్త‌రించి వేర్వేరు కాంపొనెంట్లగా కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే రక్తదాతలందరూ సులభంగా కేంద్రానికి చేరేందుకు ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ జిల్లా డిఎంహెచ్‌ఒ డా. వెంకటి 8497958597ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ప్రయివేట్ వైద్యుల లాక్ డౌన్ దేనికి సంకేతం? 

యుద్ధం వచ్చినప్పుడు సైనికుడు చనిపోవచ్చు. అది సహజం. యుద్ధ లక్ష్యం శత్రుసైన్య వినాశం, విచ్చిన్నం. అలాంటి సమయంలో మన సైనికులకు ప్రభుత్వం సరైన ఆయుధాలు ఇవ్వలేదు అని మాట్లాడం. అలా మాట్లాడితే దేశద్రోహం అవుతుంది. ఇప్పుడు కరోనా అలాంటి పరిస్థితినే తెచ్చింది. ఇది వైద్య యుద్ధం. ఈ యుద్ధంలో సైనికులకు (వైద్యులకు) ఎలాంటి ఆయుధాలు సమకూర్చాం అన్నది ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదు. ఈ యుద్ధంలో ఎందరు సైనికులు చనిపోతున్నారు అన్నది కూడా మాట్లాడవలసిన అంశం కాదు. అయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ విషయాలు యధేచ్చగా మాట్లాడేస్తున్నారు. ఇది ఊహించని యుద్ధం. అంచనా వేయలేని శతృవు (వైరస్) కళ్ళముందు కనిపిస్తుంటే శతృవును ఎదుర్కొనే ఆయుధాలు చేతిలో లేకుండానే యుద్ధం చేయాల్సి వస్తోంది. యుద్ధరంగంలో సైనికులు ఉన్నసమయంలో ఆయుధాల తయారీ మొదలైన సందర్భం ఇది. ఈ వాస్తవాలను వదిలేసి రాజకీయాలు మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే చెల్లింది. ఇలాంటి రాజకీయాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ వినిపించడం లేదు. ఇక ఈ యుద్దాన్ని ప్రభుత్వ వైద్య బృందాలు మాత్రమే చేస్తుండడం, ప్రైవేటు వైద్యులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిత్యం వందలమంది పేషంట్లతో కళకళ్ళాడుతూ ఉండే ప్రవేటు ఆస్పత్రులు ఇప్పుడు మూతపడ్డాయి. ఒక్క ప్రైవేటు ఆస్పత్రి, ఒక్క ప్రవేటు వైద్యుడు ఈ యుద్ధంలో భాగస్వామి కాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు "ఐసోలేషన్" కేంద్రాలకోసం, "క్వారంటైన్" కేంద్రాలకోసం వెతుకులాడుతుంటే, ప్రవేటు ఆస్పత్రులు "లాక్ డౌన్" ప్రకటించి తలుపులేసుకున్నాయి. మాస్కులకోసం, గ్లవుజులకోసం ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతుంటే ప్రైవేటు వైద్యులు చోద్యం చూస్తున్నారు. మాస్కులు, గ్లవుజులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలానే ఉంటాయి. అవి మాత్రమే సరిపోతాయని కాదు. కానీ అవికూడా బయటకు తీస్తే మంచిది కదా! వేలు, లక్షలు, కోట్లు గడిస్తున్న ఈ ఆస్పత్రులు, వైద్యులు కనీస సామాజిక బాధ్యతగా ముందుకు రాకపోవడం, బాధ్యత మొత్తం ప్రభుత్వ వైద్యుల భుజస్కందాలపై వేసి చేతులు దులిపేసుకోవడం సామాజిక బాధ్యత అవుతుందా? ఏ ప్రజలనుండి అయితే ఇన్నేళ్ళుగా డబ్బులు పోగేసుకున్నారో ఆ ప్రజలు ఇప్పుడు కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నపుడు, ఆ ప్రజల ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు ప్రైవేటు వైద్యులు కానీ, ప్రైవేటు ఆస్పత్రులు కానీ ముందుకు రాకపోవడం సామాజిక ద్రోహం అవుతుంది. యుద్ధం సైనికుడి బాధ్యత మాత్రమే కాదు. యావత్ ప్రజల భాగస్వామ్యం అవసరం. ఇప్పుడు కరోనపై యుద్ధం కూడా ప్రభుత్వ వైద్య బృందాల బాధ్యత మాత్రమే కాదు. దేశంలోని యావత్ వైద్య రంగం ప్రజలకోసం పనిచేయాల్సిన సమయం. ఈ క్లిష్ట సమయంలో ప్రైవేటు వైద్యరంగం లాక్ డౌన్ ప్రకటించడం ద్రోహం అవుతుందనేది సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్న జనాభిప్రాయం.

మాజీ సీఈసీ రమేశ్ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించే అవకాశం!

తన పదవీ కాలం ఇంకా ఉండగానే ప్రత్యేక ఆర్డినెన్స్‌తో చట్టంలో మార్పుచేసి మరీ తనను పదవి నుంచి తొలగించిన ఏపీ సర్కార్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. నేడు, రేపు కోర్టుకు సెలువులు రోజులు కావడంతో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సీఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ జగన్‌ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు నిన్న గవర్నర్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని ఆధారం చేసుకుని పదవీ కాలం ముగిసిందన్న సాకుతో ప్రభుత్వం ఆగమేఘాల మీద నిమ్మగడ్డను తొలగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి కనగరాజును నియమించిన విషయం తెలిసిందే.

క‌రోనా మరణాల్లోనూ ఓటు బ్యాంక్ రాజకీయాలా?

హిందువుల మనోభావాలతో తెలంగాణా ప్ర‌భుత్వం చెలగాటం ఆడితే ప‌రిణామాలు తీవ్రంగా వుంటాయ‌ని బిజెపి హెచ్చ‌రించింది. క‌రోనా మృత‌దేహాల ప‌ట్ల ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ జీవో 169ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని బిజెపి డిమాండ్ చేస్తోంది. కోవిడ్19 వ్యాధితో చనిపోయిన మృతదేహాలను ఖననం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 169లో మార్గదర్శకాలు, హిందువుల మనోభావాలను, సాంప్రదాయాలను పట్టించుకోలేధని, వాటికి పూర్తి విరుద్దంగా ఉన్నాయని , హిందువుల మనోభావలతో చెలగాటం ఆడితే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రపంచం అంతా కరోనా కట్టడికి కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ప్రజలకు సహకరిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మతం పేరుతో జీవో లు విడుదల చేసి ప్రజల మధ్య వైషమ్యాలు స్పృష్టించడం తగదని, ఇది సీఎం కేసీఆర్ కు తెలిసి విడుదలయ్యిందా లేదా అనే విషయం ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ-169లో ఉన్న మార్గదర్శకాలు, కేవలం ఒక వర్గాన్నిసంతృప్తి పర్చటం కోసం రూపొందించినట్లుగా ఉన్నాయి, ఇది ఎంతవరకు సమంజసం అని బండి ప్ర‌శ్నించారు.   కోవిడ్19 వ్యాధి మరణాల విషయం లో కూడా మత పరంగా ఈ వివక్షత ఎందుకు? ఈ సమయంలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు అవసరమా అంటూ ఆయ‌న‌ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.  తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా విడుదల చేసిన జీవో 169లో ఖననం వేళ కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించటం, హిందూ మత, ఆచార వ్యవహారాలకు ఇబ్బందికరం అని సామాజిక దూరం పాటించేలా , సంప్రదాయలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిగేలా చూస్తూ పుణ్య కార్యక్రమాలకు కావాల్సిన వారిని అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనుమాస్పద మృతులను, హిందూసంప్రదాయాల ప్రకారం ఖననం చేయడంపై ప్రభుత్వం పునరాలచోన చెయ్యాలని బండి సంజయ్ కోరారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ తో ఎక్కువగా ముస్లిం మతానికి చెందినవారు మరణించారు. వీరి ఖననంకు సంభందించిన ఆదేశాలను జీఓ-169లో పొందుపర్చకపోవటంలో ఆంతర్యం ఏమిటి? కోవిడ్19 వ్యాధితో చనిపోయిన ముస్లిం మతస్థులకు సంబంధించిన  మార్గదర్శకాలను వెంటనే జారీ చెయ్యాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు..  సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ జీవో విడుదల జరిగితే వెంటనే రద్దు చేయాలని. లేదంటే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని... కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

అప్పట్లో శేషన్ ..... ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ !

1993లో సినిమా స్టార్ లను మించిన ప్రజాభిమానం పొందిన టి ఎన్ శేషన్ అనే ఎన్నికల అధికారికి అప్పటి ప్రభుత్వం తోక కత్తిరించింది. 2018లో ఎపిలో అప్పటి ప్రభుత్వం సిబిఐకి తలుపులు మూసేసింది. 2019లో ఎపి ప్రభుత్వం ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముందు ధర్నా చేసింది. 2020లో కేంద్రప్రభుత్వం రాత్రికి రాత్రే ఢిల్లీ న్యాయమూర్తిని బదిలీ చేసింది. 2020లో ఇప్పటి ఎపి ప్రభుత్వం రాష్టృ ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని తగ్గించింది. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు కూడా విచక్షణాధికారం ఉంటుందనే అంశానికి సంబంధించి ఇవన్నీ ఉదాహరణాలన్న మాట. అసలు ఎలెక్షన్ కమిషన్ అనే వ్యవస్థకు ఇంత గ్లామర్, గ్రామర్ ఉంటుందని నిరూపించిన టి ఎన్ శేషన్ గురించి ఈ రోజు నిజంగా గుర్తు చేసుకోవలసిన సందర్భం... ప్రజాస్వామ్యం లో  ‘ఓటు’ను మించిన ఆయుధం మరొకటి లేదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో గతంతో పోలిస్తే ఓటర్లలో చాలావరకు చైతన్యం వచ్చిందనే చెప్పాలి. అయితే ఇందుకోసం కొందరు చేసిన కృషి ఎంతో అపూర్వం. అలాంటి వారిలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్ టి.ఎన్.శేషన్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైర్ బ్రాండ్ అధికారిగా గుర్తింపు పొందిన ఆయన...దేశంలో ఎన్నికల నిర్వహణ అంశంలో ఎవరూ ఊహించని సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల నిర్వహణను ప్రత్యక్షంగా చూసిన వారంతా అంగీకరిస్తారు.     1990-96 మధ్య కాలంలో కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు టి.ఎన్. శేషన్. ఈయన పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. 1955 తమిళనాడు కేడర్‌కు చెందిన శేషన్... రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. 1989లో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం... కేంద్ర ఎన్నికల సంఘం 10వ చీఫ్ కమిషనర్‌గా శేషన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సారధిగా ఆయన తీసుకున్న పలు విప్లవాత్మకమైన చర్యలు... ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్ని విశేష అధికారులు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పిన తొలి వ్యక్తి కూడా శేషనే అని చెప్పకతప్పదు. ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిగా టి.ఎన్. శేషన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఇష్టానుసారంగా ఉల్లంఘించిన చాలామంది... ఆయన కేంద్రఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా వ్యవహరించిన సమయంలో మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘంచేందుకు సాహించలేకపోయారు.      కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా ఉన్న సమయంలో శేషన్ పలు కీలక నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ అన్నది సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అనేక చర్యలు చెపట్టారు. ఎన్నికల నియమావళిని అధికారులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించేలా చేశారు. అర్హత ఉన్న వారందరికీ ఓటర్ ఐడీ కార్డు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి పరిధులను ఫిక్స్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరును మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను సాధ్యమైనంతవరకు వినియోగించుకున్నారు.     ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు అడ్డుకట్ట వేయడంలో గణనీయమైన స్థాయిలో మంచి ఫలితాలు సాధించగలిచారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాలను అభ్యర్థుల ప్రచారానికి వాడుకోవడాన్ని నిషేధించారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దనే నియమాన్ని గట్టిగా అమలు చేశారు. అన్నిటికీ మించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే నాయకుల పాలిట సింహ స్వప్నమయ్యారు. ఇంకో విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఎంతో కొంత, శేషన్ స్థాయిలో తన విధులను నిర్వర్తించే క్రమంలో నికార్సైన రీతిలో నిలబడ్డారు. ఈ సంఘటనల నుంచి, ప్రజాస్వామ్య పిపాసులు తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి.

క‌రోనాపై అవగాహన గీతాల సి.డి. ఆవిష్క‌ర‌ణ‌!

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కరోనా మహమ్మారి నియంత్రణ మరియు అవగాహన పై ప్ర‌త్యేక పాట‌ల‌తో సి.డి. రూపొందించారు. రాత్రి లేదు.. పగలు లేదు... కంటి మీద కునుకులేదు...మన కోసం.. అనే ప్రత్యేక అవగాహన గీతాల్ని ర‌చించి పాడారు. ఈ అవగాహన గీతాలను రచించిన రచయితలను, గాయకులను ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. జాగో.. జాగోరే తెలంగాణ పాటను యశ్ పాల్ రచించగా సంతోష్ పాడారు. కరోనా మహమ్మారి పై అభినయ శ్రీనివాస్ రచించిన పాటకు మెడికొండ ప్రసాద్ పాడారు. కమ్ము కొచ్చే కరోనా అనే పాటను కోదాడ శ్రీనివాస్ రచించిన పాటకు వీణ పాడారు. అమ్మలారా అలకించండి అనే పాటను జలజ రచించిన పాటకు మెడికొండ ప్రసాద్ గారు పాడిన అవగాహన గీతాలను ఇప్పటికే విడుదల చేసారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు కష్టకాలంలో కరోనా మహమ్మారి నియంత్రణ కు అత్యవసర సేవలు అందిస్తున్న డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు అందిస్తున్న సేవలకు నీరాజనం గా ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించిన‌ట్లు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి శ్రమిస్తున్నవైద్య‌సిబ్బందే నిజ‌మైన హీరోలు! రాహుల్‌గాంధీ!

ఇంతటి తీవ్రమైన సంక్షోభ సమయంలో ఈ దేశానికి సేవలు చేస్తున్న మా సమాజ కార్యకర్తలు నిజమైన దేశభక్తులు, ఈ సంక్షోభ పరిస్థితులలో సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి శ్రమిస్తున్న వారు మా హీరోలు. భారతదేశం అంతటా ప్రమాదకరంగా కోవిడ్ వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ఆశా వర్కర్లు (ASHA ), సహాయక నర్సు మరియు ANM లు, అంగన్వాడీ కార్మికులు వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ అంకితభావంతో మరియు ధైర్యంతో పని చేస్తున్నారు. COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వారంతా ముందు వరుసలో ఉండి పని చేస్తున్నారు. ఇంతటి తీవ్రమైన సంక్షోభ సమయంలో ఈ దేశానికి సేవలు చేస్తున్న మా సమాజ కార్యకర్తలు నిజమైన దేశభక్తులు, ఈ సంక్షోభ పరిస్థితులలో సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి శ్రమిస్తున్న వారు మా హీరోలు. పెద్ద ప్రమాదం కలిగించే ఈ వాతావరణంలో వైరస్ కంటే భయాంకరమైనది తప్పుడు సమాచారం. COVID-19 యొక్క ప్రమాదాల గురించి మరియు అది ప్రసారం చేసే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో కమ్యూనిటీ కార్మికులకు కీలక పాత్ర ఉంది. ఒక దేశంగా వారికి మరియు వారి కుటుంబాలకు వారు చేస్తున్న అపారమైన వ్యక్తి గత త్యాగాలకు కృతజ్ఞతలు. ఈ సంక్షోభం ముగిసినప్పుడు వారి ఆదర్శప్రాయమైన సేవ, వారి పని, మార్పుకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ దేశానికి సేవ చేసిన ప్రతి సమాజ కార్యకర్తకు నేను వందనం చేస్తున్నాను. వారు మరియు వారి కుటుంబాలు ఈ మహమ్మారి ద్వారా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనక రాజు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనకరాజును ప్రభుత్వం నియమించింది. ఈయన మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కనగరాజు వ్యవహరించారు. కాగా.. స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన్ను తొలగించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఇప్పటిదాకా రిటైర్డ్‌ ఐఏఎస్‌లకు అప్పగిస్తున్న ఆ పదవిలో.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలను నియమించేలా మరో మార్పు తీసుకొచ్చింది.  శుక్రవారం ఆన్‌లైన్‌లో రాష్ట్ర మంత్రులతో కేబినెట్‌ సమావేశం నిర్వహించి.. ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర పొందింది. ఆ వెంటనే దీనిని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపింది. గవర్నర్‌ కూడా దీనిని ఆమోదించారు. ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆమోద ముద్ర పడగానే.. చకచకా మూడు జీవోలు వెలువడ్డాయి. పంచాయతీరాజ్‌  శాఖ, న్యాయశాఖల్లో గ్రామీణ ఎన్నికలకు సంబంధించి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్డినెన్స్‌ను అమలులోకి తెస్తూ ఒక జీవో జారీ చేశారు. ఆ తర్వాత... ఆర్డినెన్స్‌కు అనుగుణంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ జీవో నెంబరు 617 జారీ చేయడం జరిగింది  

వేడితో పాటు క‌రోనా సెగ కూడా పెరుగుతుంది!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కోవిడ్‌పై ప్రభావం చూప‌డం లేదు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా రూపాంతరం చెంది మ‌రింత బ‌ల‌ప‌డుతోందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కోవిడ్‌కు.. ఉష్ణోగ్రతలకు అసలు సంబంధమే లేదు. మ్యూటేటెడ్‌ వైరస్‌ అయిన కరోనా ఎలాంటి కాలంలోనైనా తట్టుకుని బతికే అవకాశాలున్నాయని కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎండలు తీవ్రమైన కొద్దీ వైరస్‌ తన శక్తిని కోల్పోతుందనే విశ్లేష‌ణ స‌రైన‌ది కాద‌ని, రానున్న కొద్దిరోజులు ప్రజలు మరింత అప్రమత్తంగాఉండాలని ఆయన హెచ్చ‌రించారు. రాష్ట్రంలో మరో రెండువారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగించ‌డం చాలా అవ‌స‌ర‌మేని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణలో వైరస్‌ థర్డ్‌స్టేజీకి చేరలేదన్నారు. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ చైన్ లింక్‌ను విజయవంతంగా విడగొట్టామన్నారు.

కణాల్లోకి చొర‌బ‌డిన‌ కరోనా విధ్వంసం సృష్టిస్తుంద‌ట‌!

కనబడని సూక్ష్మ జీవి, కనిపిస్తున్న ప్రతి దానిపైనా దాడి చేస్తోంది. ఎప్పటికప్పుడు బలం పెంచుకొని కలవరపెడుతోంది. దాన్ని ఎదుర్కోవడానికి మరింత అప్రమత్తత అవసరం అని హెచ్చ‌రిస్తోంది. ఈ ప్రపంచాన్ని ఊపిరితీసుకోనివ్వకుండా చేస్తున్న వైరస్‌..! ఆ వైరస్ రూపం ఎలా ఉంటుందో మనకు తెలుసుగానీ.. అది మన కణాల్లోకి ఎలా చొరబడుతుంది.. చొరబడిన తర్వాత ఏం చేస్తుంది..? మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది? దీనిపై బ్రెజిల్‌కు చెందిన పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు. బ్రెజిల్‌లోని ఒస్వాల్డో క్రూజ్‌ ఫౌండేషన్‌ కు చెందిన నిపుణులు దీనిపై పరిశోధనలు జరిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా అత్యధిక తీక్షణత కలిగన ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ సాయంతో కరోనా వైరస్ మహమ్మారి ఫొటోలు తీశారు. ఈ మైక్రోస్కోప్‌ సాయంతో ఏదైనా కణాన్ని ఉన్న పరిమాణం కన్నా దాదాపు 20 లక్షల రెట్లు పెద్దగా చూడొచ్చునట. శరీరంలోకి వెళ్లిన వైరస్‌ కణాలు మొట్టమొదటగా.. మన దేహంలోని సెల్స్‌ను (క‌ణాల‌ను) టార్గెట్‌గా చేసుకుని కదులుతాయి. ఆ తర్వాత క‌ణాల్లోకి ప్రవేశిస్తుంది. కణంలోకి ఇలా ప్రవేశించగానే.. కణంలోని కేంద్రక పొర‌ల‌ వద్దకు వేగంగా చేరుకుంటుంది. అంటే ఈ సమయంలోనే మనం ఈ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడతాం. ఆ తర్వాత కణంలో ఉన్న పొర‌లో ద్రవ్యం వైరస్‌ వృద్ధి చెందడం మొదలవుతుంది. ఈ కణ ద్రవ్యంలోనే వైరస్‌ తన జన్యువులను అభివృద్ధి చేసుకుంటూ.. వేరే కణాలకు సోకుతూ వెళ్తోంది. ఇలా రోజులు గడిచే కొద్దీ ఈ వైరస్ ప్రభావం పెరుగుతూ ఉంటుందని ప‌రిశోధ‌కులు విశ్లేషించారు.

లాక్‌డౌన్‌పై నేడే ప్ర‌ధాని మోడీ కీలక ప్రకటన..?

కరోనా వైరస్ చెలరేగిపోతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తారా.. లేదా అన్న సస్పెన్స్‌ కు నేటితో తెరపడనుంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో దీనిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ రోజు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చిస్తారు. అనంతరం అనంత‌రం ప్ర‌ధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. లాక్‌డౌన్‌ను కనుక పొడిగిస్తే ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొంతమేర సవరించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో కొన్ని రంగాలను లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తారని సమాచారం. అయితే వాటిపై పలు ఆంక్షలను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మరోపక్క అన్ని లాక్‌డౌన్ ను పొడిగించాలని ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరారు.

ఇదే స్ఫూర్తితో ప‌నిచేయండి! సీఎం చర్యలు బాగున్నాయన్న ఉప రాష్ట్రపతి!

రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలిన తదనంతర పరిస్థితులపై భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు ఫోన్ చేసిన ఉప రాష్ట్రపతి రాష్ట్రంలోని రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పేద ప్రజలు, వలస కార్మికులకు ప్రభుత్వపరంగా, దాతలను ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండటం, అవసరమైన చోట భోజన వసతి కల్పిస్తున్న విషయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి వినోద్ కుమార్ తీసుకొచ్చారు. కరోనా వైరస్ మరింతగా ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని వినోద్ కుమార్ ఉప రాష్ట్రపతి కి వివరించారు. లాక్ డౌన్ ను కూడా పక్కాగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు బాగానే ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వినోద్ కుమార్ కు తెలిపారు. కరోనా వైరస్ ను తుదముట్టించే దాకా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉప రాష్ట్రపతి సూచించారు.

తెలంగాణాలో ఘోరం! రోడ్డుపైనే క‌రోనా ల‌క్ష‌ణాల‌తో నేపాలీ వృద్ధుడి మరణం!

త‌న ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ఆ వృద్ధుడు ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతూనే క‌నీస వైద్యం అంద‌కుండా రోడ్డు పైనే దారుణంగా త‌నువు చాలించాడు. ఇట‌లీని త‌ల‌పించేలా జ‌రిగిన ఈ ఘోరం ప్ర‌భుత్వానికి స‌వాల్ విసురుతోంది. లాలాపేట ఆసుప‌త్రి, గాంధీ ఆసుప‌త్రి, కింగ్ కోఠి ఆసుప‌త్రి ఎవ‌రూ అడ్మిట్ చేసుకోలేదు. అంద‌రూ క‌రోనా లక్ష‌ణాలు వున్నాయ‌ని నిర్ధారించారు కానీ పేషంట్‌ను జాగ్ర‌త్త‌గా డీల్ చేయ‌లేదు. కరోనా లక్షణాలతో నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు రోడ్డుపైనే ప్రాణాలు వ‌దిలాడు. హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వస్తూ నారాయణగూడ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద పడిపోయి ప్రాణాలు వ‌దిలాడు. నేపాల్‌కు చెందిన ఈ 70 ఏళ్ల బహదూర్ లాలాపేటలోని ఓ బార్‌లో పని చేస్తాడు. జలుబు, దగ్గు కారణంగా లాలాపేట హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా అనే అనుమానంతో గాంధీ హాస్పిటల్‌కి వెళ్లాలని సూచించారు. జలుబు, దగ్గుతో బాధపడుతూనే బహదూర్ గాంధీ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ అతడ్ని కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లమని వైద్యులు సూచించారు. అక్కడి నుంచి కింగ్ కోఠీకి వెళ్ళాడు. కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా లక్షణాలు ఉన్నాయని, హాస్పిటల్‌లో చేర్చుకోలేమని అక్క‌డి వైద్యులు స్పష్టం చేశారు. అంబులెన్స్ సమకూరుస్తామని చెప్పడంతో చాలా సేపటి వరకు ఆయన అక్కడే నిరీక్షించాడు. ఎంతకీ అంబులెన్స్ రాలేదు. మళ్లీ నడుచుకుంటూ గాంధీ హాస్పిటల్‌కు తిరిగి బయల్దేరాడు. గాంధీకి తిరిగొస్తూ మార్గం మధ్యలో నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద కుప్పకూలి పోయాడు. అక్క‌డే రోడ్డుపైన ప్రాణాలు వ‌దిలాడు. గురువారం రాత్రంతా మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. శుక్ర‌వారం తెల్ల‌వారుఝామున రోడ్డుపై అటుగా వెళ్తున్న వారు రోడ్డుపై ఓ వ్యక్తి పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం దగ్గర కింగ్ కోఠీ హాస్పిటల్ పత్రాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు అతడు హాస్పిటల్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు. మృతదేహం నుంచి శాంపిళ్లను సేకరించిన వైద్య సిబ్బంది పరీక్షలకు పంపారు. ఈ వృధ్ధుడి మృతికి ఎవ‌రిది నిర్ల‌క్ష్యం. ఇత‌ని ద్వారా ఎంత మందికి క‌రోనా వ్యాపించి వుండ‌వ‌చ్చు. తెలంగాణా ప్ర‌భుత్వం దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంటుందా?

ఆయన 'సెంట్రల్' పవర్ చూపించారు మరి...

* చెప్పా పెట్టకుండా, ఏ. పి . సరిహద్దులు దాటిన సిపిడిసిఎల్  సి.ఎం.డి. పద్మా జనార్దన్ రెడ్డి  * విస్మయం వ్యక్తం చేసిన సచివాలయం వర్గాలు  అందరికీ ఒక రూలు...అయ్యవారికో రూలు అన్నట్టుంది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ( సి పి డి సి ఎల్ ) చైర్మన్ ఎండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సి ఎం డి) జె పద్మా జనార్దన్ రెడ్డి చెప్పా పెట్టకుండా, రాష్ట్ర సరిహద్దులు దాటేశారని ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయిస్ సంఘాలు చెవులు కోరుకుంటున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార వాహనంలో నిన్న ( గురువారం) మధ్యాహ్నం 3నుండి4గంటల మద్యలో గరికపాడు దగ్గర, ఆంద్రప్రదేశ్ బోర్డర్ దాటి తెలంగాణ కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం లాక్ డౌన్లో విధులు నిర్వహించవలసిన సి. యమ్. డి విధులకు గైరు హాజరవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  ఒక పక్క ఐ ఏ ఎస్ లు, ఐ పి ఎస్ లు, ఇంకా గ్రూప్ వన్ అధికారులందరూ ఎక్కడిక్కడ కరోనా అత్యవసర విధుల్లో ఉంటె, ఎవరి అండ చూసుకుని సి ఎం డి పద్మా జనార్దన్ రెడ్డి ఇలా రాష్ట్ర సరిహద్దులు దాటారని సచివాలయం అధికారులు కూడా అనుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పద్మా జనార్దన్ రెడ్డి ,  స్థానిక విద్యుత్ శాఖ ఉద్యోగుల సహకారం తో లోకల్ పోలీసులను మేనేజ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటారని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కొందరు సి పి డి సి ఎల్ అధికారులు ఈ విషయం తీసుకెళ్లారని కూడా విద్యుత్ సంఘాల నాయకులు అంటున్నారు.

ఏపీలో ఒక్కరోజే 16 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా మరో 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ కోవిడ్-19 నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 381 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 7 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 5 కరోనా కేసులు, కర్నూలు జిల్లాలో 2 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా వల్ల ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 10 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 365 మందికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతపురం 15, చిత్తూరు 20, తూ.గో. 17, గుంటూరు 58, కడప 29, కృష్ణా 35, కర్నూలు 77, నెల్లూరు 48, ప్రకాశం 40, విశాఖ 20, ప.గో. జిల్లాలో 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

గవర్నర్ కు నాయుడు ఈ-మెయిల్ 

* ఏమిటీ ఆర్డినెన్స్, తక్షణం ఆపేయండి  ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ని తొలగించడం సరికాదని పేర్కొంటూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు నాయుడు, ఈ సమయంలో ఆడ్డదారిన ఎస్‌ఈసీని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అర్ధాంతరంగా కమిషనర్‌ను మార్చడం అనైతికం, చట్టవిరుద్ధమన్నారు. ఏ నిబంధన అయినా పదవీకాలం ముగిసిన తర్వాతే అమలు చేయాలి. తాజా ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఈ-మెయిల్‌ ద్వారా గవర్నర్‌కు పంపిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

సిద్దప్పా.... అన్నీ మనకు తెలియాలని లేదు....

* మనకు తెలిసిందల్లా జ్ఞానమూ కాదు ....  * అప్పుడప్పుడూ ఎనస్తీష్టుల మాటలూ వినాలి మరి! ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదని ఒక సామెత అచ్చు గుద్దినట్టు సరిపోతుంది ఆ జర్నలిస్టుకు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనమిది. మనకు తెలీని సబ్జెక్టు లో వేలుపెడితే, దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందనే విషయం ఇప్పుడు ఆయనకు బోధపడింది. వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రితం పేరు మోసిన ఒక టీ వీ ప్రెజెంటర్ తన డిబేట్ లో -ఎనస్తీష్ట్ ల గురించి, తనకున్న విజ్ఞానాన్ని ఆడియెన్స్ కు పంచడం, వైద్య, ఆరోగ్య రంగ ప్రముఖులకు కావలసినంత వినోదం పంచింది.  ఆ జర్నలిస్ట్  ఒక అనస్థీసియా డాక్టరుతో మాట్లాడుతూ,  ఆపరేషన్ థియేటర్లలో మత్తు మందు ఇచ్చే మీకు మాస్కుల అవసరం ఎందుకని అడగటం వారిని విస్మయపరిచింది. అంతకుమించి ఏ పని చేయని మీకు మాస్కులు అవసరమే లేదు అనే తీరుగా మాట్లాడుతున్నాడు. పైగా మీరు ఆపరేషన్ థియేటర్ లో ఏం చేస్తారు ?. అని అడగటం కూడా మొదలు పెట్టాడు. వాళ్ళిద్దరికీ జన్మవైరం ఏదైనా ఉంటే ఉండనీ గానీ‌, అనెస్థీషియా ఇచ్చే డాక్టరుకు ఏమీ పనే ఉండదు అనేలా మాట్లాడిన ఆయనకు అనెస్థీషియా అంటే ఏమిటో ఆ డాక్టర్లు ఏమి చేస్తారో అణువంత కూడా అవగాహన లేదని స్పష్టమైందని డాక్టర్లు అన్నారు.  ఏదో మత్తుమందు ఒక సూదిలో ఇచ్చి పక్కన కూర్చోవడం కాదు అనెస్థీషియా అంటే. ఒక పేషంట్ కి ఆపరేషన్ చేయాలి అని సర్జన్ డిసైడ్ చేసిన మరుక్షణమే అనెస్థెటిస్ట్ పని మొదలౌతుంది. అసలు ప్రతీ ఆపరేషన్ చేయబోయే పేషంట్ నీ అనెస్థీటిస్ట్ చెక్ చేయడం ఉంటుంది. దాన్ని PAC అంటారు. Pre anesthetic consultation. అంటే అసలు ఆ పేషంట్ ఆపరేషన్ చేసేందుకు ఆరోగ్య పరంగా అర్హుడేనా అనేది చూస్తారు. శరీరంలోని గుండే ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి అన్ని రకాల వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుని అవసరం అనుకుంటే, సంబంధిత వైద్యుని ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అంతా బాగుందనుకుంటేనే సర్జరీ చేసుకోవచ్చని fit for surgery అని రాస్తాడు అనెస్థెటిస్ట్. అంటే సర్జరీ జరగాలంటే ముందు అనెస్థీషియా డాక్టరు ఒప్పుకోవాల్సిందే. అంతేకాకుండా ఆ పేషంట్ కి ఎలాంటి మత్తు మందు ఇవ్వాలి ఏ విధానంలో ఇవ్వాలి ఎంత డోసులో ఇవ్వాలి ఇత్యాదివన్నీ చూసేది అనెస్థెటిస్ట్. ఆపరేషన్ చేసేటపుడు పేషంట్ బీపీ పల్స్ ఆక్సిజన్ శాతం అన్నీ కూడా మానిటర్ చేసేది అనెస్థెటిస్ట్. ప్రతీ నిముష నిముషం బీపీని చెక్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేస్తున్నపుడు పేషంట్ బీపీ పడిపోతున్నా, పల్స్ పడిపోతున్నా ఎప్పటికప్పుడు అలర్ట్ అయి వాటిని తిరిగి కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ సకల ఎమర్జెన్సీ మందులతో రెడీగా ఉంటూ సర్జరీ సక్సెస్ కావడానికి దోహదపడతాడు. సర్జన్ నిరంతరాయంగా సర్జరీ చేయాలంటే అనెస్థెటిస్ట్ పక్కన ప్రతీ విషయాన్నీ సక్రమంగా మానిటర్ చేస్తూ నడపాల్సి ఉంటుంది. సర్జరీ చేసేటపుడు పేషంట్ కార్డియాక్ అరెస్ట్ ఐతే...సెకన్లలో అతడి ప్రాణాలను కాపాడగలిగేవాడే అనెస్థెటిస్ట్. అంతే కాకుండా ఏ పేషంట్ కి సీరియస్ గా ఉన్నా మొదట చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ABCs అంటారు. Airway , Breathing, circulation. అంటే ఇపుడు అకస్మాత్తుగా ఒక పేషంట్ నిలబడుకున్నవాడు నిలబడుకున్నట్లే కుప్పకూలాడనుకుందాం. అతడిని బతికించాలంటే మన ఊపిరితిత్తుల లోకి గాలి పోవాలి‌, అతడి రక్త సరఫరా ఆగకూడదు. ఈ రెంటినీ సెకన్లలో అమర్చగలిగే వాడు అనెస్థెటిస్ట్. ఊపిరితిత్తుల లోకి డైరెక్ట్ గా గాలి పోవాలంటే గొంతు ద్వారా గొట్టం వేయాల్సి ఉంటుంది..endotracheal tube అంటారు. మామూలుగా డాక్టర్లు ఈ ట్యూబ్ వేయడంలో కష్ట పడవలసి ఉంటుంది. గొంతు చిన్నగా లావుగా ఉన్న వ్యక్తులలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఎంత కష్టమైతే అంత లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతే అంత బతికే అవకాశాలు తగ్గిపోతాయి. అటువంటి సమయాల్లో ప్రతీ ఒక్క క్షణమూ విలువైనదే. మామూలుగా డాక్టర్లు ముప్పై సెకన్లనుంచి ఒక నిమిషం లోపల గొట్టం వేయగలిగితే ఒక అనెస్థెటిస్ట్ పది సెకన్ల లోపలే వేయగలడు. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ తరువాత దానిని వెంటిలేటర్ కి అనుసంధానం చేసి ఏయే పేషంట్ కి ఏ రకమైన వెంటిలేటర్ సెట్టింగులు పెట్టాలి అనేది కూడా అనెస్థెటిస్టే నిర్ణయించి ఆ సెట్టింగులను అమరుస్తాడు. అనెస్థెటిస్ట్ లు కొంత కోపంగా దురుసుగా ఉన్నట్టు అరుస్తూ ఉన్నట్టు కనబడతారు. కానీ వాళ్ళు పర్ఫెక్షనిస్టులు. ముఖ్యంగా పేషంట్ ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వాళ్ళ దురుసుతనమే వాళ్ళ వేగాన్ని పర్ఫెక్షన్ ని తెలుపుతుంది. ఆసుపత్రులలో ఎవరైనా ఒక పేషంట్ సడన్ గా కొలాప్స్ ఐతే ఒక టీం ఆఫ్ డాక్టర్లు పరిగెత్తుతూ వస్తుంటారు. ఒక అనెస్థెటిస్ట్ ఒక పల్మోనాలజిస్టు‌, ఒక కార్డియాలజిస్టు, ఒక ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరూ, ఓ ఇద్దరు ముగ్గురు సిస్టర్లూ మొదలైనవారు. ఆ సమయంలో పేషంట్ ని కాపాడటానికి అవసరమైన అన్ని మందులూ‌ వెంటిలేటర్లూ మానిటర్లూ డీఫిబ్రిలేటర్లూ అన్నీ క్షణాల్లో అక్కడికి వచ్చేస్తాయి. కానీ ఇంత టీంని లీడ్ చేసేది మాత్రం అనెస్థెటిస్ట్. ఎవరి పనులను వాళ్ళకు పురమాయిస్తూ తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. గొంతులోకీ గొట్టం వేయడం ద్వారా AIRWAY ని, గొంతు రక్తనాళాల్లోకి పైపు వేయడం ద్వారా BLOOD CIRCULATION ని డాక్టర్ల గ్రిప్ లోకి తెచ్చుకోవడం మొదటి మెట్టు. దానిని మొట్టమొదట సెకన్ల వ్యవధిలో సాధించగలిగేవాడే అనెస్థెటిస్ట్. ఇంత ప్రాసెస్ లో ఒక టీం లీడర్ గా అప్పటికప్పుడు ఆ వాతావరణాన్ని మొత్తం గ్రిప్ లో పెట్టుకుంటాడు. ఇదంతా స్పాంటేనియస్ గా సహజంగా చేయగలగటమే అతడి ప్రతిభ. అతడు అలర్ట్గా పర్ఫెక్ట్ గా ఉండటమే కాక చుట్టూ ఉన్నవారిలో కూడా అంతే అలర్ట్ నీ పర్ఫెక్షన్ నీ డిమాండ్ చేస్తాడు. బయటివాళ్ళకు అది అరోగాన్సీ లాగా కనిపిస్తుంది. కానీ తోటి డాక్టర్లకు అది పర్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ చుట్టు ఉన్న స్టాఫ్ లో ఈ పర్ఫెక్షన్ కనపడకపోతే తిట్టడం కోపగించుకోవడమూ ఉంటుంది. ఐతే అది వ్యక్తి మీద కోపం కాదు...పేషంట్ ని బతికించుకోవడంలోని ఆత్రుత. ఆ సమయంలో అనెస్థెటిస్ట్ అక్కడ ఉండటం ఆ పేషంట్ చేసుకున్న అదృష్టంగా కూడా మారుతుంటుంది ఒక్కోసారి. కోవిడ్ వంటి జబ్బు తీవ్ర దశకు చేరేకొద్దీ వెంటిలేటర్స్ మీద పేషంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతి ఎక్కువగా వైరస్ లు ఒక వ్యక్తినుంచి మరొక వ్యక్తికి పాకేది ఇలా గొంతులోకి గొట్టం వేస్తున్నపుడే. పేషంట్ oral cavity లోకి డైరెక్ట్ గా ముఖం పెట్టాల్సి ఉంటుంది అనెస్థెటిస్ట్. కాబట్టి హాస్పిటల్ లో అడ్మిట్ ఐన పేషంట్లనుంచి డాక్టర్లకు వైరస్ పాకేది ఉంటే అతి ఎక్కువ రిస్క్ ఉన్నది అనెస్థెటిస్ట్ లకే. ఏ హాస్పిటల్ పర్ఫెక్ట్ గా నడవాలన్నా ఇరవైనాలుగు గంటలు అనెస్థెటిస్ట్ సర్వీసులు అవసరం. అనెస్థెటిస్ట్ లేని హాస్పిటల్ లలో ఎమర్జెన్సీ కేసులు తీసుకునే అవకాశమే ఉండదు. అలా వైద్య రంగానికి పిల్లర్ వంటి ఒక అనెస్థెటిస్ట్ ని అవమానిస్తూ...నీకేమి పని ఉండదు అనే అర్థం వచ్చేలా ఒక జర్నలిస్ట్ మాట్లాడటం అంటే అది ఆ ఒక వ్యక్తినే కాదు అనెస్థీషియా అనే గొప్ప వైద్య విధానాన్నే అవమానించినట్టు. దానికి క్షమాపణ చెప్పాలని మనం కోరుకోవడంలో అర్థం కూడా ఉండదు...!. కానీ ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో అనెస్థెటిస్ట్ లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరెందరి జీవితాల్నో బాగు చెస్తున్నారు. వాళ్ళందరి సేవలూ ఆ జర్నలిస్ట్ కు తెలియకపోయినా పెద్ద నష్టమేమీ లేదనీ,  కానీ సామాన్యులకు ఇవన్నీ తెలియాలనీ  డాక్టర్ విరించి విరివింటి తన సోషల్ మీడియా లో చేసిన పోస్టింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.