కరోనా మరణాల్లోనూ ఓటు బ్యాంక్ రాజకీయాలా?
posted on Apr 11, 2020 @ 12:49PM
హిందువుల మనోభావాలతో తెలంగాణా ప్రభుత్వం చెలగాటం ఆడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని బిజెపి హెచ్చరించింది. కరోనా మృతదేహాల పట్ల ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల జీవో 169ను వెంటనే రద్దు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
కోవిడ్19 వ్యాధితో చనిపోయిన మృతదేహాలను ఖననం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 169లో మార్గదర్శకాలు, హిందువుల మనోభావాలను, సాంప్రదాయాలను పట్టించుకోలేధని, వాటికి పూర్తి విరుద్దంగా ఉన్నాయని , హిందువుల మనోభావలతో చెలగాటం ఆడితే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
ప్రపంచం అంతా కరోనా కట్టడికి కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ప్రజలకు సహకరిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మతం పేరుతో జీవో లు విడుదల చేసి ప్రజల మధ్య వైషమ్యాలు స్పృష్టించడం తగదని, ఇది సీఎం కేసీఆర్ కు తెలిసి విడుదలయ్యిందా లేదా అనే విషయం ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ-169లో ఉన్న మార్గదర్శకాలు, కేవలం ఒక వర్గాన్నిసంతృప్తి పర్చటం కోసం రూపొందించినట్లుగా ఉన్నాయి, ఇది ఎంతవరకు సమంజసం అని బండి ప్రశ్నించారు.
కోవిడ్19 వ్యాధి మరణాల విషయం లో కూడా మత పరంగా ఈ వివక్షత ఎందుకు? ఈ సమయంలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు అవసరమా అంటూ ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా విడుదల చేసిన జీవో 169లో ఖననం వేళ కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించటం, హిందూ మత, ఆచార వ్యవహారాలకు ఇబ్బందికరం అని సామాజిక దూరం పాటించేలా , సంప్రదాయలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిగేలా చూస్తూ పుణ్య కార్యక్రమాలకు కావాల్సిన వారిని అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనుమాస్పద మృతులను, హిందూసంప్రదాయాల ప్రకారం ఖననం చేయడంపై ప్రభుత్వం పునరాలచోన చెయ్యాలని బండి సంజయ్ కోరారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ తో ఎక్కువగా ముస్లిం మతానికి చెందినవారు మరణించారు. వీరి ఖననంకు సంభందించిన ఆదేశాలను జీఓ-169లో పొందుపర్చకపోవటంలో ఆంతర్యం ఏమిటి? కోవిడ్19 వ్యాధితో చనిపోయిన ముస్లిం మతస్థులకు సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే జారీ చెయ్యాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ జీవో విడుదల జరిగితే వెంటనే రద్దు చేయాలని. లేదంటే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని... కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.