కరోనాపై అవగాహన గీతాల సి.డి. ఆవిష్కరణ!
posted on Apr 11, 2020 @ 11:40AM
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కరోనా మహమ్మారి నియంత్రణ మరియు అవగాహన పై ప్రత్యేక పాటలతో సి.డి. రూపొందించారు. రాత్రి లేదు.. పగలు లేదు... కంటి మీద కునుకులేదు...మన కోసం.. అనే ప్రత్యేక అవగాహన గీతాల్ని రచించి పాడారు. ఈ అవగాహన గీతాలను రచించిన రచయితలను, గాయకులను ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
జాగో.. జాగోరే తెలంగాణ పాటను యశ్ పాల్ రచించగా సంతోష్ పాడారు. కరోనా మహమ్మారి పై అభినయ శ్రీనివాస్ రచించిన పాటకు మెడికొండ ప్రసాద్ పాడారు. కమ్ము కొచ్చే కరోనా అనే పాటను కోదాడ శ్రీనివాస్ రచించిన పాటకు వీణ పాడారు. అమ్మలారా అలకించండి అనే పాటను జలజ రచించిన పాటకు మెడికొండ ప్రసాద్ గారు పాడిన అవగాహన గీతాలను ఇప్పటికే విడుదల చేసారు.
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు కష్టకాలంలో కరోనా మహమ్మారి నియంత్రణ కు అత్యవసర సేవలు అందిస్తున్న డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు అందిస్తున్న సేవలకు నీరాజనం గా ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.