కణాల్లోకి చొరబడిన కరోనా విధ్వంసం సృష్టిస్తుందట!
posted on Apr 11, 2020 @ 9:55AM
కనబడని సూక్ష్మ జీవి, కనిపిస్తున్న ప్రతి దానిపైనా దాడి చేస్తోంది. ఎప్పటికప్పుడు బలం పెంచుకొని కలవరపెడుతోంది. దాన్ని ఎదుర్కోవడానికి మరింత అప్రమత్తత అవసరం అని హెచ్చరిస్తోంది. ఈ ప్రపంచాన్ని ఊపిరితీసుకోనివ్వకుండా చేస్తున్న వైరస్..! ఆ వైరస్ రూపం ఎలా ఉంటుందో మనకు తెలుసుగానీ.. అది మన కణాల్లోకి ఎలా చొరబడుతుంది.. చొరబడిన తర్వాత ఏం చేస్తుంది..? మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది? దీనిపై బ్రెజిల్కు చెందిన పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు.
బ్రెజిల్లోని ఒస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ కు చెందిన నిపుణులు దీనిపై పరిశోధనలు జరిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా అత్యధిక తీక్షణత కలిగన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సాయంతో కరోనా వైరస్ మహమ్మారి ఫొటోలు తీశారు. ఈ మైక్రోస్కోప్ సాయంతో ఏదైనా కణాన్ని ఉన్న పరిమాణం కన్నా దాదాపు 20 లక్షల రెట్లు పెద్దగా చూడొచ్చునట. శరీరంలోకి వెళ్లిన వైరస్ కణాలు మొట్టమొదటగా.. మన దేహంలోని సెల్స్ను (కణాలను) టార్గెట్గా చేసుకుని కదులుతాయి. ఆ తర్వాత కణాల్లోకి ప్రవేశిస్తుంది. కణంలోకి ఇలా ప్రవేశించగానే.. కణంలోని కేంద్రక పొరల వద్దకు వేగంగా చేరుకుంటుంది. అంటే ఈ సమయంలోనే మనం ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడతాం. ఆ తర్వాత కణంలో ఉన్న పొరలో ద్రవ్యం వైరస్ వృద్ధి చెందడం మొదలవుతుంది. ఈ కణ ద్రవ్యంలోనే వైరస్ తన జన్యువులను అభివృద్ధి చేసుకుంటూ.. వేరే కణాలకు సోకుతూ వెళ్తోంది. ఇలా రోజులు గడిచే కొద్దీ ఈ వైరస్ ప్రభావం పెరుగుతూ ఉంటుందని పరిశోధకులు విశ్లేషించారు.