ఫ్లైట్ లో వచ్చి దోపీడి చేస్తున్న హైటెక్ దొంగలు...
ఏటీఎం వద్ద ఎన్నొ రాకాల మోసాలు జరుగుతుండటం మనం సహజంగా చూస్తుంటాం.ఏటీఎం వద్ద ఓ వృద్ధుడిని మోసం చేసి డబ్బు కాజేశారు అగాంతకులు. ఈ ఫిర్యాదుని నెల్లూరు జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. చిన్న కేసులో తీగ లాగితే డొంకలు కదిలాయ్ మారుమూల కుగ్రామం నుంచి హరియాణ వరకు సాగుతున్న బాగోతాలు వెలుగు చూశాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మన దేశంలోని పదహారు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డ హర్యానా ఘరానా దొంగల ముఠాను పట్టు కున్నారు.హర్యానా రాష్ట్రం భవాని జిల్లా భవానీకేడ తాలూకా బార్సి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, మంజిత్, జగ్జీత్ లు ముఠాగా ఏర్పడ్డారు వీరంతా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండేళ్ల వయసు ఉండేవారు. ముందుగా ఓ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటారు విమానాల్లో అక్కడికి చేరుకుని విలాసవంతమైన హోటల్లో దిగుతారు. డ్రైవర్ లేని కారు అద్దెకు తీసుకొని మరి వేటకి బయలుదేరుతారు. ఏటీఎంల వద్ద నిరక్షరాస్యులు, వృద్ధులు, చిన్నపిల్లలే వీరిని టార్గెట్ గా చూసుకుంటారు. వారికి సహాయం చేసినట్టు నటిస్తూ ఏటీఎం పిన్ గమనిస్తారు. మాయ మాటలు చెబుతూ ఏటీఎం తీసుకుని వారికి నకిలీ ఏటీఎం కార్డు ఇస్తారు. అనంతరం తమ వద్ద ఉండే స్వైప్ మిషన్ తో స్వైపింగ్ చేస్తారు. ఏటీఎంలో ఉన్న సమయంలోనే బ్లూటూత్ ద్వారా మొబైల్ కు కనెక్ట్ చేసి వారి ఫోన్ లో డేటా ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు. ఏటీఎం కార్డు డేటాని స్కిమ్మింగ్ మిషన్ ద్వారా క్లోనింగ్ చేస్తారు. వేరే ఏటీఎం కార్డుకి డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకుని ముందుగా గుర్తించిన పిన్ నెంబర్ సహాయంతో బాధితుల అకౌంట్ లో డబ్బులు మొత్తం కొల్లగొడతారు. ఇలా ఇప్పటి వరకూ ఈ ఘరానా దొంగల ముఠా మన దేశంలోని అస్సాం, బీహార్ ,ఢిల్లీ ,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒరిస్సా ,పంజాబ్ ,రాజస్థాన్, తమిళనాడు ,ఉత్తర ప్రదేశ్, హర్యానా ,ఏపి, తెలంగాణ ఇలా పదహారు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నేరాలకు పాల్ప డింది.
అయిదు వేల రూపాయల దగ్గర నుంచి లక్షల రూపాయల చొప్పున కోట్లల్లో దోచేసింది. ఐదు వేలు, పది వేలు పోగొట్టుకున్న బాధితులు చాలా మంది పోలీసు స్టేషన్ ల వరకు రారనే నమ్మకం వీరిది. వాస్తవంగా కూడా చాలా మంది బాధితులు పోతే పోనీలే ఆ డబ్బు కోసం ఎక్కడ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతామని మిన్నకుండిపోయారు. బాధితుల్లో ముప్పై శాతం మంది మాత్రమే పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. హర్యానా నుంచి ఓసారి చెన్నైకి విమానంలో వచ్చారు ఆపై డ్రైవర్ లేని కారు అద్దెకు తీసుకొని వేటకు బయలుదేరారు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నుంచి కలిగిరికి చేరుకున్నారు. మొదట అక్కడే మోసానికి పాల్పడ్డారు. వింజమూరులోని ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేశారు కలికిరి నుంచి నెల్లూరు జిల్లా పోలీసులు ఆరా మొదలుపెట్టారు .టాస్క్ ఫోర్స్, సిసిఎస్, దర్గామిట్ట, చిన్నబజారు పోలీసు టీంలు తొమ్మిది నెలల పాటు ఈ ముఠాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, సూళ్లూరుపేట, కలిగిరి, వింజమూరులతో పాటు కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విచారణ కొనసాగించారు. హర్యాణ నుంచి ముఠా బయలుదేరి వైజాగ్ వచ్చిన సమయంలో అరెస్టు చేసేందుకు ప్రయత్నించి ఓసారి విఫలమయ్యారు. మరోమారు వారి కదలికలు గమనిస్తూ నెల్లూరులోనే అరెస్టు చేశారు.వీరి నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించిన పదహారు కేసులు శ్రీకాకుళం, వైజాగ్, అనంతపురం ,గుంటూరు, కర్నూలు ,ప్రకాశం, వనపర్తి, హైదరాబాద్ ప్రాంతాల్లోని పలు కేసులకు సంబంధించి ఏడు లక్షల రూపాయలు, స్కిమ్మింగ్ మిషన్, ఏటీఎంకార్డులు, కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా పెద్ద ఎత్తున డబ్బు దోచేందుకు ఇలాంటి ముఠాలు తయారయ్యాయి .బహుమతులు ఇచ్చాయని లాటరీలు తగిలాయంటూ లక్షల రూపాయలు డిపాజిట్ చేయించుకోవటం బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం మీ ఏటీఎం కార్డు నెంబరు పిన్ నెంబరు చెప్పండి అంటూ మోసాలు చేయడం ఏటీఎంల వద్ద నుంచి వ్యక్తులూ అమాయకుల్లా నటిస్తూ నగదు కొల్లకొట్టటం రివాజుగా మారింది. ఏటీఎంకార్డు నెంబర్ లు పిన్ నెంబర్ లు ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని నగదు డ్రా చేయడం తెలియకుంటే ఇంట్లో వారిని వెంటబెట్టుకొని వెళ్లాలంటూ పెద్దఎత్తున ప్రచారం సాగిస్తున్న చాలా మంది ఇప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు ఫలితంగా కష్టపడి కూలీనాలీ పనులు చేసుకునే సంపాదించిన డబ్బుని ఇలాంటి మాయగాళ్లు నిలువునా కొల్లగొడుతున్నారు.ఇలాంటి హైటెక్ దొంగల వల్ల ప్రజలు భయభ్రాంతులవుతున్నారు.