రాజధాని తరలింపు ప్రక్రియ జోరందుకుందా?

వాస్తవానికి ఉగాదినాడే విశాఖ‌ నుంచి పాలనకు శ్రీకారం చుట్టాలని ముఖ్య‌మంత్రి భావించారు. కానీ హైకోర్టు అభ్యంతరాలు, కరోనా పరిస్థితులతో అది నిలిచిపోయింది. అయినప్పటికీ రాజధాని విషయంలో పట్టుదలతోనే వుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఎలాగైనా విశాఖకు రాజధాని తరలించాలనే ధ్యేయంతో ఉంది. ఇందుకు సంబంధించి మే 28వ తేదీ ఉదయం 8గంటలకు ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది.అయితే ముందుగా భావించినట్టు సచివాలయం మిలీనియం టవర్స్ లో కాకుండా వేరేచోటకు తరలించనున్నారు. 20 లారీలలో ఫర్నిచర్ తరలిస్తున్నారు. సచివాలయం గ్రేహౌండ్ కంపౌండ్ లోని ఇండియా బుల్స్ -విజ్ఞాన్ సమీపంలో ఉండనుందని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గుట్టుగా పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఉద్యోగులను బదిలీ చేయకుండా ఆన్ డ్యూటీపై విశాఖ నుంచి పనిచేయించాలని భావిస్తున్నార‌ట‌. అయితే, ఈ విషయంపై అధికారులు ఎవరూ నోరు మెదపడంలేదు. అందరూ చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందో అని సైలెంటుగా ఉంటున్నారు. ప్రభుత్వం ఆన్ డ్యూటీ ఇచ్చి మరీ కొందరు కీలక శాఖల ఉద్యోగులను విశాఖ పంపాలని పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగసంఘాలకు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై వారు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆన్ డ్యూటీపై ఉద్యోగులను పంపితే న్యాయపరమయిన చిక్కులు ఉండవంటున్నారు అధికారులు. ఆన్ డ్యూటీపై పంపొద్దని చెప్పడానికి నిబంధనలు ఏవీ లేవని, ఈ అవకాశాన్ని వాడుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద విశాఖకు సచివాలయం తరలింపు విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

డాక్టర్లు, నర్సులకు గ్రీన్ కార్డు!అమెరికా కాంగ్రెస్ బిల్లు

కరోనా కారణంగా అమెరికా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ డెడ్లీ వైర‌స్ తో ప్ర‌పంచవ్యాప్తంగా 2,80,000 మంది చనిపోతే అమెరికాలోనే 80 వేల మరణాలు ఉన్నాయి. 13 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. కరోనా గజగజ వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశ పెట్టారు. డాక్టర్లు, నర్సులకు తక్షణమే గ్రీన్ కార్డు ల‌భించేలా అమెరికా కాంగ్రెస్ బిల్లును తీసుకు వచ్చింది. అమెరికాలో స్థిరపడటానికి ఈ బిల్లు ద్వారా డాక్టర్లు, నర్సులకు అవ‌కాశం ల‌భించింది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే 25,000 మంది నర్సులు, 15,000 మంది డాక్టర్లకు గ్రీన్ కార్డులు లభిస్తాయి. అక్కడే ఉండాలనుకునే H1B, J2 వీసాలపై ఉన్న ఇండియన్ డాక్టర్స్, నర్సులకు ఇది ప్రయోజనం. అమెరికాలో వివిధ కంపెనీలలో పని చేసేందుకు H1B వీసాలను మంజూరు చేస్తుంది అమెరికా. చైనా, భారత్ నుండి ఈ వీసా దరఖాస్తులు ఎక్కువగా వస్తాయి. అమెరికాలో ఇప్పుడు డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ది హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ రీసైలెన్స్ యాక్ట్ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న గ్రీన్ కార్డులకు అనుమతిచ్చే అధికారం కాంగ్రెస్‌కు ఉంది. కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు శాశ్వత నివాసం పొందవచ్చు. గ్రీన్ కార్డు అంటే శాశ్వత నివాస ధృవీకరణ పత్రం. గతంలోనే కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ జారీ కానీ గ్రీన్ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.

నాటుకోళ్లను తినొద్దు! నెల రోజుల వరకు పాలు తాగవద్దు?

స్టెరీన్ గ్యాస్ ను పీల్చిన గేదెల నుంచి తీసే పాలను నెల రోజుల వరకు తాగవద్దని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ప‌శువులు ఆ గాలి పీల్చడంతో కడుపులో ఇంకా పాలిమర్ నిక్షేపాలు ఉంటాయి. అందుకే వాటి పాలు అసలు తాగవద్దని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో వున్న గేదె, ఆవు పాలు  తాగితే ఊపిరితిత్తులు, చర్మం పై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, ఆయాసం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.  పశువులకు అక్కడి గడ్డిని సైతం మేతగా వేయవద్దంటున్నారు ప‌శు వైద్యులు. అక్కడ పెంచుకునే నాటుకోళ్లను తినొద్దట. వాటి శరీరంలోకి విషవాయువు వెళుతుందని..వాటి మాంసం తినడం వల్ల దుష్పప్రభావాలు వస్తాయని చెబుతున్నారు బయో సెంటిస్టులు. మేక, పొట్టేలు వంటి వాటి మాంసాన్ని తినరాదు. ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఇబ్బంది పడక తప్పదు. పశువులకు అక్కడ పంట పొలాల్లో పైరుగా వేసిన జొన్న లేక చొప్ప. పిల్లి పెసర, మొక్కజొన్న వంటి గడ్డి జాతిని గానీ ఎండుగడ్డిని గానీ మేతగా వేయవద్దంటున్నారు పశువుల డాక్టర్లు.  వాతావరణం అంతా పూర్తిగా కలుషితమైంది. పాలిమర్ రూపంలో స్టెరీన్ నిక్షేపాలు సూక్ష్మ ధాతువులుగా ఉండిపోయాయి. మరికొద్ది రోజుల వరకు దాని ప్రభావం ఉంటోంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని స్టెరిలైజ్ చేస్తే తప్ప యధాతథ స్థితికి రాదు. ఇళ్ల పై పెద్ద మొత్తంలో నీరు చల్లడంతో పాటు రసాయానాలతో ఇళ్లను శుద్ది చేస్తేనే అక్కడకు వెళ్లే వీలుంది. అప్పటి వరకు శిబిరాల్లోనే ప్రజలు ఉండాలి.  హడావుడిగా శిబిరాల నుంచి వారిని ఇళ్లకు పంపితే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

7వేల 992 కోట్ల రూపాయ‌ల డ‌బ్బు ఏమైంది? టిపిసిసి

క‌రోనా ముసుగులో కేసీఆర్ ప్ర‌భుత్వం దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని  తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కోట్ల రూపాయ‌లు దోచుకుతింటున్నారంటూ టిపిసిసి అధికార ప్ర‌తినిధి ఇందిరాశోభ‌న్ తెలంగాణా ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. క‌రోనా నిధుల గుల్‌మాల్ పై గుట్టువిప్పుతానంటున్నారు.   కేంద్ర ప్ర‌భుత్వం కరోనా నిర్మూలనకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 6082 కోట్లు ఇచ్చింది. పైగా విరాళాల రూపంలో మ‌రో 500 కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల జీతాల కోత పెట్టి 4000 కోట్ల రూపాయ‌లు మిగుల్చుకుంది. మొత్తం 10వేల 582 కోట్ల రూపాయ‌లు. ఒక్క కరోనా రోగికి కోలుకోవడానికి అయ్యే ఖర్చు రూ. 3.5 లక్షలు. అయితే తెలంగాణాలో వున్న  మొత్తం 1100 రోగులకు అయ్యే ఖర్చు 39 కోట్ల రూపాయ‌లు.  ఇప్పటి వరకు జరిగిన మొత్తం కరోనా అనుమానితుల పరీక్షలు 20000 మందికి. ఒక్కొక్కరికి రూ. 4500 ఖర్చు. మొత్తం కరొనా పరీక్షలకు ఖర్చు రూ. 9 కోట్లు. క్వారంటైన్ లో ఉన్న ఒక్కరికి ఒక రోజు ఖర్చు 500 రూపాయ‌లు. మొత్తం 30000 మందికి 28 రోజుల క్వారంటైన్ ఖర్చు 42 కోట్ల రూపాయ‌లు. ఆస్పత్రుల ఏర్పాటుకు 100 కోట్ల రూపాయ‌లు. రాష్ట్రం పేదలకు‌ ఇస్తున్న ఒక్కొక్క‌రికి  రూ.1500 లు చొప్పున  రూ. 1200 కోట్లు. 12 కిలోల బియ్యం విలువ : రూ.1000  కోట్లు. (రాష్ట్రం ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న 12 కిలోల బియ్యం లో.. కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యం కూడా ఉన్నవి. ఆ ఐదు కిలోల లెక్క త‌గ్గిస్తే వెయ్యి కోట్లు కాదు ఇంకా త‌గ్గుతుంది.) ఉద్యోగుల బోనస్: రూ. 100 కోట్లు. ఇతరములు : రూ. 100 కోట్లు. ఇలా మొత్తం  ఖర్చు సుమారుగా   2 వేల 590 కోట్లు మాత్రమే. అయితే మిగిలిన 7 వేల 992 కోట్ల రూపాయ‌ల డ‌బ్బు ఏక్కడికి పోయిందని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ప్ర‌శ్నిస్తోంది.

24 గంటల్లో 4,213 మంది! భారత్‌లో కరోనా విల‌య‌తాండ‌వం! 

భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఏ రోజూ నమోదుకానన్ని అత్యధిక కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 4,213 మందికి కొత్తగా కరోనా సోకింది. గత 24 గంటల్లో భారత్‌లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,206కి చేరింది.  దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 67,152కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,917  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 44,029 మంది చికిత్స పొందుతున్నారు.

కజిరంగా పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి!

అసోం రాష్ట్రంలోని కజిరంగా జాతీయ వనంలో అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ కళేబరం వెలుగుచూసింది. కజిరంగా జాతీయ వనంలోని బగోరి రేంజ్ లో పులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పులి కళేబరానికి పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పులి ఏడు రోజుల క్రితం మరణించి ఉంటుందని పశువైద్యులు తేల్చారు.  ఈ ఏడాది కజిరంగా జాతీయ వనంలో ఒక పులి మరణించింది. మళ్లీ రెండో పులి మరణించింది. ఈ పులి కళేబరం వద్ద ఏకే 47 రైఫిల్ తూటాలు లభించాయి. దీంతో వేటగాళ్లు ఈ పులిని చంపి ఉంటారని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ జాతీయ వనంలో 121 రాయల్ బెంగాల్ పులులున్నాయి. వీటితోపాటు కొమ్ములున్న ఖడ్గమృగాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో పులులు, ఖడ్గమృగాలకు మధ్య దాడులు కొనసాగుతుంటాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కజిరంగా జాతీయ వనంలో సందర్శకులను నిలిపివేశారు.

జులైలో కరోనా తారస్థాయికి చేరుకుంటుంది! ప్రపంచ ఆరోగ్యసంస్థ

భార‌త్‌లో కరోనా వైరస్‌ జూలై నెల‌లో తారస్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డేవిడ్‌ నబరే విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల్లో తమిళనాడు గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఆయన ఏమన్నారంటే.... భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడయ్యేందుకు ముందు జూలైలో ఉచ్చస్థితికి చేరుకుంటుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతాయ‌ని ఆయ‌న త‌న నివేదిక‌లో తెలిపారు. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ 2,167 మందిని బాధితులుగా మార్చింది. పొరుగు జిల్లాల నుంచి వచ్చే హోల్‌సేల్, రిటైల్‌ కూరగాయల వ్యాపారులు భౌతికదూరం పాటించడంలో నిర్లక్ష్యాన్ని చూపడం శాపంగా మారింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌ కేసులు పెరిగినా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా ఉంటుంది. భారత్‌ అత్యంత వేగంగా కట్టుబాటు చర్యలను అమల్లోకి తెచ్చినందున వైరస్‌ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగారు. జనాభా అత్యధికంగా ఉండే భారత్‌లో వైరస్‌ కట్టడి చేయడం ఎంతో కష్టం. భారత్‌లో లాక్‌డౌన్‌ చర్య ఎంతో మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డేవిడ్‌ నబరే అభిప్రాయ‌ప‌డ్డారు.

స్టైరీన్‌ ప్రభావిత గ్రామాల్లో బస చేయండి! మంత్రుల‌కు సి.ఎం. ఆదేశం!

మంత్రులు, అధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. గ్యాస్‌ ప్రమాద బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులు మెరుగుపరచాలన్నారు. ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయట పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయాలని సూచించారు. రసాయన అవశేషాలు లేకుండా శానిటైజేషన్‌ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సోమవారం సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో రాత్రి బస చేయాలని చెప్పారు. వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్నారు. సోమవారం ఉదయం మంత్రులు, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేయాలని పేర్కొన్నారు. పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. ఆర్థిక సాయం అందలేదని బాధితులెవరూ విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. స్టైరీన్‌ రసాయనం విశాఖలో ఉంచడానికి వీల్లేదని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. గ్యాస్‌ లీక్‌ ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని సీఎంకు అధికారులు వివరించారు.

బస్తాకు రూ.70వరకూ పెరిగిన సిమెంటు ధర!

సిమెంటు ధర మండిపోతోంది. బస్తాకు ఏకంగా రూ.70 వరకూ పెరగడంతో నిర్మాణరంగం పరిస్థితి నిప్పుల కొలిమిలో పడినట్లయింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా నిర్మాణాలు ప్రారంభిద్దాం అనుకునేసరికి సిమెంటు ధర ఆకాశాన్నంటుతోంది. కంపెనీని బట్టి ఒక్కో బస్తా రేటు రేటు రూ.70వరకు పెరిగింది. గతంలో రూ.250 ఉన్నది ఇప్పుడు రూ.320కి, గతంలో రూ.300 ఉన్న బ్యాగ్‌ ఇప్పుడు రూ.370 అయింది. దూరాభారాన్ని బట్టి దాదాపు రూ.400కు కూడా చేరుతోంది. ఏపీలో నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 20 వృత్తుల వారు దాదాపు 40లక్షల మంది ఉన్నారని అంచనా. ఇంతమందికి ఉపాధి కల్పించాల్సిన నిర్మాణదారులు బేలచూపులు చూస్తున్నారు. మోయలేనంత భారంగా ఉన్నా ప్రాజెక్టులు పూర్తిచేద్దామని అనుకున్నవారు.... ధరల పెరుగుదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. కరోనా కారణంగా సుమారు 50రోజులు సిమెంటు అమ్మకాలే లేవు. నిర్మాణ రంగం మొత్తం స్తంభించిపోయింది. క‌రోనాకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకు ధర పెట్టడం, ఇసుక కొరతతో పెరిగిన ధరలు, మూడు రాజధానుల నిర్ణయంతో ఎక్కడికక్కడ అమ్మకాలు నిలిచిపోవడంతో నిర్మాణ దారులు కుదేలయ్యారు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అప్పులు చేయాల్సి రావడం, వాటికి పెరుగుతున్న వడ్డీలు.. ఇవన్నీ పడలేక కొందరు హైదరాబాద్‌కు తరలిపోయారు. మరికొందరు అసలు ఈ రంగమే వదిలేశారు. అన్ని రకాలుగా ఇబ్బందుల్లో చిక్కుకున్న నిర్మాణదారులను ఆదుకోవడానికి రాయితీలు ఇవ్వడం, వీలైతే ధరలు తగ్గేలా ప్రభుత్వం చూడాల్సి ఉంది. కానీ దీనికి రివర్స్‌లో ధరలు పెరగడంతో నిర్మాణదారులు హతాశులవుతున్నారు.

దీర్ఘకాలం ప్రభావం చూపనున్న విశాఖ విషవాయువు..!

విశాఖలో తలెత్తిన విపత్కర పరిణామాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. పండించే పంట నుండి భూగర్బంలోనిండి వచ్చే నీటి బిందువు వరకూ కలిషితమైపోయినట్టు నిపుణులు నిర్ధారిస్తున్నారు. పీల్చే గాలి కూడా కలిషితం అయిపోయిట్టు, అవన్ని సామన్యస్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో పచ్చదనం అన్న పదమే లేదు . ఇప్పటివరకు పండించిన పంట అంతా నాశనం అయిపోయింది . బావుల్లో నీరు తాగడానికి కాదు కదా కనీసం వాడేందుకు కూడా పనికిరాకుండా పోయాయి. ఇక మనిషి శరీరంలో ఉన్న స్టైరీన్ పాలీమర్ గా మారి విషవాయువుని ఉత్పత్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ నుండి వెలువడిన గ్యాస్ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు ఉన్న ప్రకృతిని నాశనం చేసింది. 12 మంది ప్రాణాలు వదలగా కొన్ని వందలమంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . ఈ గ్యాస్ పీల్చిన వారు కాకుండా ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడిన వారిలో కూడా దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి అని వైద్యులు మరియు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో పుట్టబోయే చాలామంది అంగవైకల్యం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయట. ఎల్జీ పాలిమర్స్ వెదజల్లిన విషవాయువు వల్ల ప్రకృతి అందించే ఫలాలను కూడా తినకూడని పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతిలో దొరికే ఎన్నో త్రాగే, ఆహారాలను విషవాయువు వినాశనం చేసింది. ఈ విషవాయువు వల్ల మొత్తం ప్రకృతే కాకుండా ప్రకృతి మీద ఆధారపడిన జీవకోటి మనుగడకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పంట పొలాలు కలుషితమై పండిన పంటలు తినేందుకు ప‌నికిరావ‌ట‌. పంటపొలాల్లో ఉండే బావుల్లో నీటి పరిస్థితి కూడా ఎంతొ ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తోంది. తాగడానికి, వాడకానికి అస్సలు పనికి రావని తెలుస్తోంది. పెద్ద ఎత్తున వర్షం వచ్చి నీరు కొట్టుకు పోవడం గానీ, ఆ నీరు ఎండిపోవడం గానీ జరిగితే పాలిమర్ ప్రభావం తగ్గుతుంది తప్ప అప్పటివరకూ విషప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఈ వాయువు తీవ్ర దుష్ప్రభావాని చూపుతుందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన నిపుణులు అక్కడ అంతా విషపూరితం అయిపోయింది అని తేల్చి చెప్పారు . త్రాగు నీరు, ఆహారం , భూమి, ఆకాశం లోని వాయువు అన్నీ కలుషితం అయినట్లు తెలిసిన వారు మరికొన్ని సంవత్సరాలు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. చుట్టూ ఉన్న గ్రామస్తులంతా ఆ ప‌రిశ్ర‌మ‌ను ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పచ్చని చెట్లతో, సముద్రపు అలల గలగలలతో సస్యశ్యామలంగా, ప్రకృతి శోభతో విరాజిల్లే విశాఖ పట్టణం ఇప్పుడు కలుషిత పట్టణంగా మారిపోయింది.

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేర‌నుందా?

భారత్‌లో వచ్చే 30 రోజుల్లో కొవిడ్‌-19 బారిన పడే వారి సంఖ్యను అంచనా వేసేందుకు గువాహటి ఐఐటీ, సింగపూర్‌ డూక్‌-నుజ్‌ మెడికల్‌ స్కూల్‌ల సంయుక్త బృందం సరికొత్త నమూనా రూపొందించింది. దీని ప్రకారం దేశంలో వచ్చే నెల రోజుల్లో వైరస్‌ వ్యాప్తి మధ్యస్తంగా ఉంటే మొత్తం కేసులు 1.5 లక్షలకు చేరుతాయి. అదే విషమంగా వ్యాపిస్తే 5.5 లక్షలకు చేరతాయ‌ట‌. రాష్ట్రాల వారీగా కేసుల పెరుగుదల రేటు, రోజువారీ కేసుల నమోదు ప్రకారం ఈ లెక్కలు కట్టారు. ఇందులో రాష్ట్రాలను మూడు విభాగాలుగా గుర్తించారు. గత రెండు వారాలుగా రోజువారీ కేసుల్లో తగ్గుదల లేని రాష్ట్రాలను విషమ విభాగంగా పరిగణించారు. క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతున్నా గత రెండు వారాలుగా రోజువారీ కేసులు తగ్గుతున్న వాటిని మధ్యస్త విభాగంలోకి తీసుకున్నారు. మొత్తం క్రియాశీల కేసులతో పాటు రోజువారీగా నమోదయ్యే కేసులూ తగ్గుతుంటే నియంత్రణ విభాగంగా పరిగణించారు. ‘వచ్చే నెల రోజుల్లో కేసుల అంచనా కోసం దేశం మొత్తాన్ని ఒకే తరహాలో చూస్తే సరైన లెక్క రాదు. కొత్త కేసుల పెరుగుదల రేటు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు తీసుకొనే నివారణ చర్యలు భిన్నంగా ఉంటాయి. అందుకే ప్రతి రాష్ట్రాన్ని విడిగా పరిగణించాలి. అప్పుడే అందుబాటులో ఉన్న పరిమిత వనరులను సమర్థంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వాలకు వీలవుతుంది.’ అని బృందం పేర్కొంది.

మ‌ళ్ళీ విజృంభిస్తున్న క‌రోనా! లాక్‌డౌన్ సడలిస్తున్న దేశాలకు షాక్!

లాక్‌డౌన్ సడలిస్తున్న దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సడలింపుతో ఊపిరి పీల్చుకుని రోడ్ల మీదకు వస్తున్న జనం కారణంగా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దక్షిణ కొరియాలో గత 24 గంటల్లో 34 మంది కరోనా బారినపడ్డారు. ఒకే రోజు ఇంతమంది వైరస్ బారినపడడం గత నెల రోజుల్లో ఇదే తొలిసారి. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వైరస్ తగ్గుముఖం పట్టింది. దీంతో ఆంక్షలను సడలించిన ప్రభుత్వం బార్లు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడీ నిర్ణయమే వైరస్ తిరిగి విజృంభించేందుకు కారణమైంది. బార్లు, నైట్‌క్లబ్‌లలో జనం భౌతిక దూరాన్ని గాలికి వదిలేయడంతో వైరస్ తిరిగి సంక్రమిస్తోంది. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ఎక్కువ మంది ఇటువంటి కేంద్రాలను సందర్శించిన వారే కావడం గమనార్హం. వైరస్ మళ్లీ చెలరేగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం 2,100 నైట్‌క్లబ్‌లు, బార్లు, డిస్కోలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. జర్మనీలోనూ కొత్తగా 667 కేసులు నమోదయ్యాయి. ఓ జంతువధ శాలలో 180 మంది కరోనా బారినపడ్డారు. మరోవైపు, నిబంధనలు సడలించాలంటూ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాక్షికంగా సడలిస్తూ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నిర్ణయం తీసుకున్నారు. ఇంకోవైపు, ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫ్రాన్స్‌లో తాజాగా 80 మంది మరణించారు. గత నెల రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రష్యాలో పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ 11,012 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది.

ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేస్తారా? లోకేష్‌

కోటిస్తాం.. చావడానికి మీరు సిద్ధమా? అంటూ వైసీపీ నేతలకు లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే అదే కోటి మీకిస్తాం… చావడానికి సిద్ధమా? అని ముఖ్యమంత్రి జగన్‌ను, మంత్రులను విశాఖ వాసులు, ఎల్జీ పాలిమర్స్ బాధితులు ప్రశ్నిస్తున్నారని లోకేష్ అన్నారు. విష వాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ మాకొద్దని ప్రజలు రోడ్డెక్కితే వారిని అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. ప్రజల చావుకు కారణమైన కంపెనీ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేసి మాట్లాడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. పైగా అదో గొప్ప కంపెనీ అని కితాబు ఇచ్చారని.. కానీ ప్రశ్నించిన ప్రజలను మాత్రం అణిచివేస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. పైగా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారంటూ మంత్రులు మదంతో మాట్లాడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కంపెనీని అక్కడి నుంచి తరలించాలని లోకేష్ డిమాండ్ చేశారు. గ్యాస్ లీకేజీ నష్ట తీవ్రతను జగన్ దాచే ప్రయత్నం చేయడం తగదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విష వాయువుల విడుదల వల్ల జరిగే అనర్థాలకు వాస్తవాలే సాక్ష్యాలంటూ ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు చంద్రబాబు. స్థానికుల ఆరోగ్యంపై విష వాయువులు చూపే ప్రభావం సహించలేనిదంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

కోటి రూపాయ‌లు ఇస్తే.. ఈ ఘటనను మరిచిపోవాలా? సి.ఎం.‌పై మండిపడ్డ స్థానికుడు

నగరంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ జరిగిన ఘటనలో ముఖ్యమంతి జగన్మోహన్ రెడ్డి తీరుపై విశాఖకు చెందిన శ్రీనివాస్ పాత్రుడు అనే యువకుడు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన ఆరోజు మధ్యాహ్నం 2 గంటలపాటు ఫ్యాక్టరీ వద్ద ఉండి సమీక్షించామని చెప్పారు. ఆ రెండు గంటల సమయంలో స్టైరిన్ గ్యాస్ పీల్చుకోకుండా N-95 మాస్క్ కూడా ఆపలేపోయిందన్నారు. ఒక్క 2 గంటలకే అలాగుంటే.. అక్కడ 24 విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మీడియా సిబ్బందికి కనీసం మాస్క్‌లు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో విశాఖ వచ్చిన జగన్ ముందు ప్రజల వద్దకు వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం వద్దకు వెళ్లారని పాత్రుడు విమర్శించారు. ఆప్పత్రిలో బాధితులను పరామర్శించిన జగన్.. ఆయా గ్రామాలను పరిశీలించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ స్టైరిన్ ఇళ్లల్లో చిక్కుకుని అలాగే ఉందని, ఒక్కసారి చూడాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇస్తే.. అందరూ ఈ ఘటనను మరిచిపోతారనే ఉద్దేశంతో ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా? అని అన్నారు.  ముఖ్యమంత్రి మధ్యాహ్నం వచ్చి.. సాయంత్రం వెళ్లిపోయారు, బాధితులు, గ్రామాలు కోలుకునేవరకు విశాఖలో ఉండలేకపోయారని.. ఇది ఎంతవరకు న్యాయమని శ్రీనివాస్ పాత్రుడు ప్రశ్నించారు.

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 27 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. అన్ని జిల్లాల నాన్‌కేడర్ జేసీలను ఆసరా, వెల్ఫేర్‌ జేసీలుగా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అనంతపురం జేసీ ఢిల్లీ రావును జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  అధికారుల బదిలీ అయిన స్థానాలు.. ► శ్రీకాకుళం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా సుమిత్‌కుమార్ ► శ్రీకాకుళం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కె.శ్రీనివాసులు ► విజయనగరం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి. క్రిస్ట్ కిషోర్‌కుమార్ ► విజయనగరం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా మహేష్‌ కుమార్ రావిరాల ► విశాఖపట్నం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.వేణుగోపాల్‌రెడ్డి ► విశాఖపట్నం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి. అరుణ్‌బాబు ►  తూర్పు గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి.లక్ష్మీషా ► తూర్పు గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కీర్తి చేకూరి ► పశ్చిమ గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.వెంకటరమణారెడ్డి ► పశ్చిమ గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా హిమాన్షు శుక్లా ► కృష్ణా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.మాధవీలత ► కృష్ణా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా శివశంకర్‌ లోతేటి ► గుంటూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఏఎస్‌ దినేష్‌కుమార్ ► గుంటూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి.ప్రశాంతి ► ప్రకాశం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జె.వెంకటమురళీ ► ప్రకాశం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా టీఎస్ చేతన్ ► నెల్లూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా వి.వినోద్‌కుమార్ ► నెల్లూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎన్. ప్రభాకర్‌రెడ్డి ► చిత్తూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా డి. మార్కండేయులు ► చిత్తూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా వీరబ్రహ్మయ్య ► వైఎస్సార్‌ జిల్లా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.గౌతమి ► వైఎస్సార్‌ జిల్లా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా సాయికాంత్ వర్మ ► అనంతపురం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా నిషాంత్‌కుమార్ ► అనంతపురం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా లావణ్య వేణి ► కర్నూలు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా రవిసుభాష్ ► కర్నూలు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎస్.రామసుందర్‌రెడ్డి

లాక్‌డౌన్-4 వుంటుందా? మ‌ళ్లీ సీఎంలతో ప్ర‌ధాని కాన్ఫరెన్స్‌!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌-3 కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ అమలుపై చర్చిస్తారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరుపుతారు. ఈ నెల 17న లాక్‌డౌన్-3 ముగియనున్న తరుణంలో మోదీ సీఎంలతో జరిపే వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నాం 3 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ మంత్రి, వైద్య శాఖ కార్యదర్శి, హోం మంత్రి హోంశాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు. రాష్ట్రాల వారిగా కోవిడ్‌ నివారణకు చేపడుతున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు, సలహాలు కూడా మోదీ ఇవ్వనున్నారు.  కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వనరులు పూర్తిగా మూసుకుపోవడంతో ప్రత్యక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

నిబంధనలకు వ్యతిరేకంగా ఎల్‌జీ పాలిమర్స్‌కు అనుమతిచ్చింది చంద్ర‌బాబే! మంత్రి క‌న్నాబాబు

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై తమ ప్రభుత్వమేమి తప్పించుకోవడంలేదని మంత్రి కురసాల కన్నాబాబు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే సీఎం నుంచి కింది స్థాయి వరకు అంతా వేగంగా స్పందించామని గుర్తుచేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘1998 లో మీరు సీఎం(చంద్రబాబు)గా ఉన్నప్పుడు ఎల్‌జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగితే అప్పుడు మీరేం చేశారు?. నిబంధనలకి విరుద్దంగా ఎల్‌జీ పాలిమర్స్‌కు మీ హయాం(2015)లో విస్తరణకు ఎలా అనుమతులిచ్చారు?. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా 2023 వరకు ఎల్‌జీ పాలిమర్స్‌కు అనుమతులిచ్చింది మీరు కాదా?. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే మానం ఆంజనేయులు లేఖ రాస్తే ఎందుకు స్పందించలేదు? నిబంధనలకు విరుద్దంగా అనుమతులివ్వడంపై ప్రశ్నిస్తున్న మాజీ ఐఏఎస్‌ అధికారి శర్మకి ముందుగా సమాధానం చెప్పండి.  నిబంధనలను పట్టించుకోకుండా సింహాచలం దేవస్థానానికి చెందిన వందల ఎకరాలని డీ నోటిఫై చేసి మరీ ఎల్‌జీ పాలిమర్స్‌కు మీరు అప్పగించలేదా? జీవిఎంసీ పరిధిని ఎల్‌జీ పాలిమర్స్‌ వరకు పెంచినప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీ వల్ల ప్రజలకి ఇబ్బంది అని తెలీదా?  ఐఏఎస్‌ కమిటీలను ఎలా విమర్శిస్తారు? :  ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించింది. ఐఏఎస్‌లతో కూడిన ఈ కమిటీలను చంద్రబాబు ఎలా విమర్శిస్తారు. వారికేం తెలుసని అడగడం విడ్డూరంగా ఉంది.  చంద్రబాబు నియమించిన టీడీపీ కమిటీలో ఉన్న అచ్చెన్నాయుడు, చిన్నరాజప్ప, రామానాయుడు రసాయన శాస్త్రవేత్తలా? నగరంలో గెయిల్‌ ప్రమాదం జరిగితే చంద్రబాబు ఎలాంటి నష్టపరిహారం ఇచ్చారో అందరికీ తెలుసు. పుష్కరాల తొక్కిసలాట వల్ల చనిపోయిన కుటుంబాలను ఎలా ఆదుకున్నారో ప్రజలందరికీ గుర్తుంది. సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు’ అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

ఎక్కడున్నా పోలీసుల వలకు చిక్కక తప్పదు!

సోషల్‌ మీడియా ఫేక్‌ గ్యాంగ్‌లకు ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరిక   విజయవాడ : సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ర్పచారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఫేక్‌గ్యాంగ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్‌ చేసుకునే వాళ్లు సైతం సైబర్‌ క్రైమ్‌ చట్టం కిద్ద శిక్షార్హులేనని చెప్పారు. అలాంటి వారు ప్రపంచంలో ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వలకు చిక్కక తప్పదన్నారు. కాబట్టి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య, ఫేక్‌ పోస్టులు పెట్టే వారితో పాటు వాటిని అత్యుత్సాహంతో సర్క్యులేట్ చేసే వారిని కూడా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విడిచి పెట్టరని హెచ్చరించారు.

ఢిల్లీలో మరోసారి భూకంపం: రిక్టర్ స్కేల్ పై 3.4 తీవ్రత

ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లో భూకంప కేంద్రం లాక్ డౌన్ ప్రకటించాక ఢిల్లీ ప్రాంతంలో మూడోసారి భూకంపం దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు ఈ మధ్య తరచుగా భూకంపాలకు గురవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.4గా నమోదైంది. నష్టం వివరాలు తెలియరాలేదు.  కాగా, భూకంప కేంద్రం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ మధ్యాహ్నం భూమిలోపల ఐదు కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించిందని వాతావరణ విభాగం తెలిపింది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఢిల్లీ ప్రాంతంలో భూకంపం సంభవించడం ఇది మూడోసారి. గతంలో సంభవిం చిన రెండు భూకంపాల కేంద్రం ఒకే ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది.