parakala prabhakar comments on Nirmala Sitharaman

నిర్మలాపై పరకాల ఎఫెక్ట్... కేంద్రంలో కలకలం రేపుతోన్న కామెంట్స్

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధికమంత్రి... పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనామిస్ట్... ఇద్దరూ భార్యాభర్తలు... ఒకరు దేశ ఆర్ధిక వ్యవహారాలను చూస్తుంటే.... మరొకరు ఆ ఆర్ధిక విధానాల్లో మంచిచెడ్డలను విశ్లేషిస్తుంటారు. అయితే, దేశ ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా... ఎన్డీఏ ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ పరకాల చేసిన కామెంట్స్... కలకలం రేపుతున్నాయి. నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్ధిక విధానాలకు బాటలు చూపిన పీవీ, మన్మోహన్ నమూనాలను అనుసరించాలన్న పరకాల.... పీవీ, మన్మోహన్ ఆర్ధిక విధానాలు ఇఫ్పటికీ సవాలు చేయలేనివిధంగా ఉన్నాయంటూ పొగడటంపై దేశమంతా చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ భార్య కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉండగా, పరకాల ప్రభాకర్ ఈ కామెంట్స్ చేయడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించకపోయినా, మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటరిచ్చారు. యూపీఏ హయాంలో... కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేయడంతోనే కొంతమందికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారని, దాని ఫలితమే ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంక్షోభమని నిర్మల ఆరోపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై పరకాల ప్రభాకర్ విమర్శలు... కౌంటర్ గా నిర్మలా సీతారామన్ కామెంట్... కలకలం రేపుతున్నాయి. అయితే, పరకాల ప్రభాకర్ కాకుండా, ఇంకెవరైనా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసుంటే... ఇంత చర్చ, రగడ జరిగేది కాదు... కానీ భార్య ఆర్ధికమంత్రిగా ఉండగా, భర్త విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో, పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ డైలాగ్ వార్ దేశమంతా ఆసక్తి రేపుతోంది. అయితే, భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు, వాదనలు కామనే అయినా, ఏకంగా దేశ ఆర్ధిక పరిస్థితిపై వాదులాడుకోవడం మాత్రం సంచలనంగా మారింది.

Telangana RTC strike

ఆర్టీసీ సమ్మె ఇంత తీవ్రంగా మారడానికి మంత్రుల మాట వైఖరే కారణమా?

ఆర్టీసీ సమ్మె సందర్భంగా కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది అధికార టీఆర్ఎస్ ముఖ్య నేతలు పరిస్థితి. నిజానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది.పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించే విషయంలో మెజారిటీ ఎమ్మెల్యేలు తప్పించుకు తిరుగుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. సమ్మెకు ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతున్నందున అనవసరంగా తిట్లు తినడం దేనికన్న భావనతో నేతలు నోరుతెరవడంలేదంటూ ఆరోపణలు వెల్లువడుతున్నాయి. చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియాకు దూరంగా ఉంటున్నారని, మీడియా ప్రతి నిధులు మాట్లాడించాలని చూసినా సమ్మె విషయం తప్ప ఏదైనా అడగాలని జవాబు ఇస్తూ అసలు విషయాన్ని దాటేస్తున్నారు . దాదాపు మెజారిటీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే వైఖరిని అవలంబిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దసరా సెలవుల్లో సమ్మె చేస్తుండడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉండదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సమ్మెను తీవ్రంగా పరిగణిస్తూ కార్మికులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రకటించారు సీఎం. సీఎం ఆగ్రహంగా ఉండటంతో రవాణా శాఖ మంత్రి అజయ్ ఇతర మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి వంటి వారు మరింతగా రెచ్చిపోయారు.ముఖ్యమంత్రి మన్ననలనూ పొందాలనుకున్నారేమో గాని వాళ్లు సమ్మె విషయంలో మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా కార్మికులను బెదిరించడం ఏమిటనే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ పరిణామం ప్రజల్లో ఆర్టీసీ కార్మికుల పట్ల సానుభూతిని పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొనని వారికి మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా వారితో సమ్మెలో ఉన్న కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారన్న అంశం గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలంగా వెళ్తోంది. మరీ ముఖ్యంగా తలసాని, ఎర్రబెల్లి, అజయ్ ,మల్లారెడ్డి లాంటి వాళ్లు తమ తమ ప్రాంతాల్లో బలమైన నాయకులైన వీరిని తెలంగాణ సమాజం ఉద్యమకారులుగా గుర్తించే పరిస్థితి లేదు. పదవుల కోసమే వీరు టీఆర్ఎస్ లో చేరారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ క్రమంలో సమ్మె విషయంలో వీరి స్పందన ప్రభుత్వ అంచనాను పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతూ వస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితి టీఆర్ఎస్ కు శరాఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నిజానికి సమ్మె ప్రారంభంలో అతిగా స్పందించి మంత్రులు మరోసారి సెంటిమెంట్ ను తట్టిలేపారు మీరు మాట్లాడిన తర్వాత తాము మాట్లాడుకుంటే కేసీఆర్  ఏమనుకుంటారో అన్న భావనతో మిగతా మంత్రులు స్పందించారు.ఇందులో కొత్తగా మంత్రైన గంగుల కమలాకర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయినా ఇంకా పలువురు మంత్రులు సమ్మె విషయంలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.ఏదో మాట వరుసకు సమ్మె వెనుక విపక్షాలు ఉన్నాయని ఆరోపించటం మినహా స్ట్రైక్ ను మాత్రం పూర్తిగా తప్పుబట్టడం లేదు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏం మాట్లాడినా అనవసరంగా తలనొప్పి ఎదురయ్యే అవకాశముందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరికొందరు హుజూర్ నగర్ ప్రచారమంటు అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం.

Chandrababu Naidu comments on Chintamaneni Arrest

కేసు మీద కేసు... రిమాండ్ మీద రిమాండ్... చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తాడా?

చింతమనేనిపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 11న అరెస్టయిన చింతమనేనిపై ఒకదాని తర్వా మరొకటి బయటికి తీస్తూ దాదాపు నెలన్నరగా జైలుకే పరిమితం చేశారు పోలీసులు. ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసులో జైలుపాలవుతున్నాడు. ప్రస్తుతం ఐదు కేసుల్లో అక్టోబర్ 9తో రిమాండ్ పూర్తవడంతో, చింతమనేని బెయిల్ పై బయటకు వస్తారని కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు ఆశించారు. కానీ పీటీ వారెంట్ పై జైల్లోనే మరోసారి అరెస్ట్ చేయడంతో అక్టోబర్ 23వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇలా, ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేస్తుండటంతో చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చింతమనేని దాదాపు 60 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం 22 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చింతమనేనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్టు చేస్తూ... జైలుకే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, టీడీపీ హయాంలో ఒక్క ఇంచు కూడా ముందుకు కదలకుండా, మరుగునపడిపోయిన కేసులన్నీ తెరపైకి రావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులున్నా, చంద్రబాబు హయాంలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ, తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించిన చింతమనేనికి... జగన్ సర్కారులో మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. చింతమనేనిపై నమోదైన కేసులన్నీ ఇప్పుడు బయటికి వస్తుండటంతో ప్రభాకర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అయితే, చింతమనేనిపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తూనే ఉన్నా, కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలంటుంటే, కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, కటకటాల వెనుకున్న చింతమనేనిని, ఈ జైలు బాధలోనూ మరో బాధ మరింతగా బాధపెడుతోందట. కష్ట సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నుంచి తనకు ఆశించినంత మద్దతు దొరకడం లేదని, తనను పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్నాడట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ, దూరం జరిగినట్టు అనిపిస్తోందని అనుచరులతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. దాంతో, ఇలా కోర్టు, జైలు చుట్టూ తిరుగుతుండటంతో అసలు చింతమనేని బయటి వస్తాడా అనే అనుమానాలు అనుచరులకు కలుగుతున్నాయట. మరి, కేసు మీద కేసు, రిమాండ్‌ మీద రిమాండ్‌తో జైలుకే పరిమితమవుతున్న చింతమనేని, ఎప్పడు రిలీజ్ అవుతారో చూడాలి.

janasena followers unhappy with rapaka varaprasad

జనసేనానికి పెద్ద తలనొప్పిగా మారిన ఉన్న ఒక్క ఎమ్మెల్యే!!

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతాలు సృష్టించకపోయినా, ఎంతోకొంత ప్రభావం చూపుతుందని భావించారంతా. కానీ, జనసేన ఊహించని ఫలితాలు మూట గట్టుకొని చతికిల పడింది. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో.. జనసైనికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు, ఫ్యాన్ గాలి బలంగా వీచినా, అధినేత పవన్ ఓడిపోయినా.. రాపాక వరప్రసాద్ మాత్రం రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. జనసేన తరపున ఎన్నికైన తొలి ఎమ్మెల్యేగా జనసైనికుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే రాపాక చర్యలు మాత్రం అటు జనసేనానిని, ఇటు జనసైనికుల్ని కలవరపెడుతున్నాయి. జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో.. అధినేత పవన్ తర్వాత రాపాకపైనే అందరి దృష్టి ఉంటుంది. కావున ఆయన జనసేన గొంతుని అసెంబ్లీలో బలంగా వినిపించడమే కాకుండా.. బయటకుండా తన చర్యలతో పార్టీకి లాభం చేకుర్చాలి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం.. ఆయన చర్యలతో అధికార పార్టీ వైసీపీకి లాభం చేకూరుతోంది. దీంతో జనసేనాని మరియు జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. ఆ మధ్య బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ దేవుడంటూ ఆకాశానికి ఎత్తేసారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు  జగనన్న అని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ మాటలు విని అధికార పార్టీలో ఉత్సాహం పెరిగితే.. జనసైనికులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే తాజాగా రాపాక చేసిన మరో పని కూడా జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు 'వైఎస్ఆర్ వాహనమిత్ర' పేరుతో జగన్ సర్కార్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని జగన్ ఇటీవల ఏలూరులో ప్రారంభించారు. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి రాజోలులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి రాపాక పాల్గొన్నారు. అంతేకాదు మంత్రితో కలిసి జగన్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ ఘటన రాజీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జనసైనికుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పాలాభిషేకం ఎపిసోడ్ తో రాపాక వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే రాపాక మాత్రం అబ్బే అలాంటిదేం లేదని ఖండించారు. నిజానికి రాపాక వైసీపీలో చేరుతారనే ప్రచారం ఎన్నికల ఫలితాల తరువాత నుంచే మొదలైంది. అయితే రాపాక మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను వైసీపీలో చేరితే తన నెంబర్.. 152 అవుతుందని, అదే జనసేనలో ఉంటే తను నెంబర్ 1 గా ఉంటానని లాజిక్ చెప్పారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కాస్త తగ్గినా.. ఆయన చర్యలు మాత్రం ప్రచారానికి ఊపిరి పోస్తున్నాయి.  విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా.. అధికార పార్టీ చేస్తున్న పనులను ప్రశంసించడంలో తప్పులేదు. కానీ మరీ అధికార పార్టీ కార్యకర్తలాగా.. సీఎంని దేవుడుతో పోల్చడం, సీఎం ఫోటోకి పాలాభిషేకం చేయడమే అసలు సమస్య. ఆయన చర్యలతో అటు జనసేనాని, ఇటు జనసైనికులు తలలు పట్టుకునేలా చేస్తున్నారు. మరి రాపాక ఇకనైనా తన తీరు మార్చుకుంటారో లేక కండువానే మార్చుకొని షాకిస్తారో చూడాలి.

IRCTC Buddhist Circuit Special Train Starts

ప్రారంభమైన బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు...

  ప్రపంచానికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధునికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించుకొనాలనే పర్యాటకుల కోసం భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో నడిచే రైలు ఈరోజు ప్రారంభమైంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు పేరుతో ఐ.ఆర్.సీ.టీ.సీ నడిపే ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఎనిమిది రోజుల పాటు బుద్ధుడు నడయాడిన పలు ప్రదేశాలు సహా వివిధ ప్రసిద్ధ ప్రాంతాలను వీక్షించేలా పర్యాటకుల కోసం ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్, నేపాల్ లోని గౌతమ బుద్ధునికి సంబంధించిన పర్యాటక ప్రాంతాల కోసం భారతీయ రైల్వే నడిపే ప్రత్యేక బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ స్టేషన్ నుంచి ఈరోజు ప్రారంభమైంది. నేపాల్ లోని బుద్ధుడి జన్మస్థలం లుంబిని సహా భారత్ లోని బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధ్ గయ తొలిసారి ధర్మోపదేశం చేసిన సారానాథ్ నిర్యాణం చెందిన కుషీనగర్ వంటి పలు సందర్శనీయ బౌద్ధ క్షేత్రాలను సందర్శించేలా ఈ రైలు పర్యాటక ప్యాకేజీని రూపొందించారు. ఎనిమిది రోజులు ఏడు రాత్రుల పాటు ఉండే ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక యాత్రలో పర్యాటకులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రైలు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత బీహార్ లోని గయ, రాజగిరి, నలందా అక్కడి నుంచి వారణాసి, సారనాథ్ చేరుకుంటుంది. తర్వాత నేపాల్ లోని లుంబినీ అక్కడి నుంచి కుషినగర్ శ్రావస్తి మీదుగా ఎనిమిదవ రోజు ఆగ్రా కు చేరుకోనుంది. ఎనిమిది కోచ్ లతో కూడిన ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలులో ఫస్టుక్లాసు లో తొంభై ఆరు, సెకండ్ క్లాస్ లో అరవై ఏసీ బెర్తులు అందుబాటులో ఉంటాయి. రెండు కోచ్ లలో పూర్తిగా రెస్టారెంట్, డైనింగ్ హాల్ ఉండగా మరో కోచ్ లో వంటగది ఉంది. తేజస్ రైలులో ఉన్న విధంగా పూర్తి సౌకర్యాలతో బెర్తులు ఉన్నాయి, విలాసవంతమైన హోటళ్లను తలపించేలా కంపార్టుమెంట్ లు ఉంటాయి. ఎనిమిది రోజుల యాత్రకు ఒక్కొక్కరికీ ఫస్ట్ క్లాస్ లో లక్షా ఇరవై మూడు వేల రూపాయలు, సెకండ్ క్లాస్ లో లక్ష రూపాయల వరకు చార్జీలుగా వసూలు చేస్తారు. బౌద్ధ మతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాల సందర్శన కోసం ఎక్కువగా తూర్పు, దక్షిణ, ఈశాన్య, ఆసియా దేశాల నుంచి పర్యాటకులు వస్తారని అధికారులు తెలిపారు. రైలులో ఉన్న రెస్టారెంట్ లో పర్యాటకుల అభిరుచిని బట్టి వంటకాలను వడ్డిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్, చైనీస్, థాయ్ సహా పలు రకాల వంటకాలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. వంటగదిలో మంటలు రాకుండా కేవలం ఐరన్ ప్లేట్ లను వేడి చేయడం ద్వారా అత్యాధునికంగా వంట చేసే విధానాన్ని అవలంబిస్తున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలును ఏడాదికి పన్నెండు ట్రిప్పులను నడపాలని ఐ.ఆర్.సీ.టీ.సీ భావిస్తోంది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఏడు నెలల్లో ఈ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి కోచ్ కు ఓ భద్రతా సిబ్బంది ఉంటారు, యాత్రలో కాలక్షేపం కోసం బుద్ధుని జీవిత విశేషాలతో కూడిన ఓ చిన్న గ్రంథాలయం, పాదాలకు మసాజర్ వంటి సౌకర్యాలను సైతం అందుబాటులో ఉంచారు.

valmiki caste warning to ycp leaders

వైసీపీ నాయకులకు బోయ కులస్తుల హెచ్చరిక...

  అనంతపురం జిల్లాలో వాల్మీకి కులస్తులు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కాల్వ శ్రీనివాసులు, జడ్పీ మాజీ ఛైర్మన్ పూల నాగరాజు ఈ సామాజికవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసిపెట్టేవారు. అంతే కాకుండా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సైతం గట్టిగా డిమాండ్ చేశారు. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఆగ్రహించిన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గత ఎన్నికల్లో గంపగుత్తుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. వాల్మీకి కులస్తుడైనప్పటికీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు రాయదుర్గంలో ఓటమి పాలవడం, జడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు గుమ్మగట్ట మండలంలో ఐదు వేలకు పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు జేసీ కుటుంబాన్ని కాదని ఒక సామాన్య అధికారైన తలారి రంగయ్యను అనంతపురం ఎంపీగా గెలిపించారంటే బోయ కులస్థుల ఓటు పవర్ ఏ పరిధిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతల ఒక గ్రూప్ గా అదే పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన నేతలు మరో గ్రూపుగా విడిపోయారు. జగన్ క్యాబినెట్ లో పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు మంత్రిగా అవకాశం లభించటంతో అధికారం రుచి చూడాలని ఆశించిన అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు అసంతృప్తికి గురయ్యారు. మంత్రికి అండగా అనంతపురం పార్లమెంటు సభ్యులు రంగయ్య నిలవడంతో వార్ వన్ సైడ్ కాకుండా ఆయన అడ్డు తగులుతున్నారని రెడ్డి సామాజికవర్గ నేతలు భావిస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గం అధికంగా ఉండే అనంతపురం పార్లమెంటు పరిధిలో తమను ఎదగనీయకుండా కొందరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతారంటూ ఎంపి రంగయ్య వద్ద బోయలు వాపోతున్నట్టు వినిపిస్తుంది.దీంతో గత మూడు నెలలుగా తమ ఆవేదనను దిగమింగుతూ వచ్చిన ఎంపి రంగయ్య వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా అధికార పక్షంలో కొంత మందిని ఓ ఆటాడుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు గుమ్మనూరు జయరాం, శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ ముందే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. చంపేవాడు చచ్చేవాడు బోయవాడు, బోయవాడికి బోయవాడికి మధ్య గొడవెందుకు, ఎవడైతే బోయలను ఉసిగొల్పుతాడో వాడి తల తీస్తే తన్నుకు చేయవలసిన అవసరం రాదు అంటూ అనంత ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యానించారు. సౌమ్యుడిగా పేరొందిన రంగయ్య నోటి నుంచి తూటాల్లాంటి మాటలు రావటంతో సభలో ఉన్నవారంత నిర్ఘాంతపోయారు.  ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంగయ్య వ్యాఖ్యలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనే ఇలాంటి మాటలు అన్నారంటే ఎంపీలు ఎంతటి ఆవేదన గూడుకట్టుకుని ఉందో అర్థం చేసుకోవాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. స్వపక్షంలోనే మరో సామాజిక వర్గం వారు మాత్రం ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే బోయలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ తరుణంలో రంగయ్య మాట్లాడుతూ ఈ డిమాండ్ నెరవేర్చటానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలకు మంత్రి శంకరనారాయణ చీఫ్ విప్ కాపురామచంద్రరెడ్డి వంత పాడారు. మరో మంత్రి జయరాం మాట్లాడుతూ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాల్మీకి సామాజికవర్గ పెద్దలు కూడా ఇదే పాట పాడారు. రాయలసీమలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించామని ఎస్టీ జాబితాలో కనుక తమను చేర్చకపోతే ప్రస్తుత అధికార పక్షాన్ని కూడా సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

chinna jeeyar swamy trust

పలు కంపెనీల ఉద్యోగుల్ని ఆకర్షిస్తున్న చిన్న జియర్ స్వామి...

  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి పలు రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ సేవలను మెచ్చిన పలు కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్ లు స్వామి వారికి ఆకర్షితులవుతున్నారు. స్వామీజీ చేస్తున్న సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కంపెనీల సెక్రటరీలు కోరారు. ట్రస్టు పేరుతో మారుమూల ప్రాంతాల్లో సైతం చినజీయర్ స్వామి చేసిన సేవలను పలు కంపెనీల ప్రతి నిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. హైదరాబాద్ మాదాపూర్ లో వికాస తరంగిణి పేరుతో పలు కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్ లు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయనే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చినజీయర్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఇలాంటి సేవలలో భాగస్వాములు కావాలనుకుంటున్నామని కంపెనీల సెక్రటరీలు, చార్టెడ్ ఎకౌంటెంట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యంతో పాటు తాగు నీరు అందించడంలో జీయర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచటానికి జీయర్ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కంపెనీల సెక్రటరీలు చార్టర్డ్ అకౌంటెంట్ లు అభిప్రాయపడ్డారు.ఇలా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ వైఖరిని గొప్పగా మార్చుకోవాలని,తాము తమ జీవితాల్లో పది మందికి సాయం చేస్తూ మంచిగా బ్రతికాలని పలు కంపెనీ నేతలు ఆదేశిస్తున్నారు.

IT raids on Kalki Bhagwan properties

కల్కి ఆశ్రమంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు... రూ.500 కోట్ల అక్రమాస్తులు!!

  చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం వద్ద ఉన్న కల్కి ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వెల్లస్ కోర్సుల పేరుతో కల్కి ఆశ్రమంలో భారీగా విరాళాలు సేకరించినట్టుగా అధికారులు గుర్తించారు. తాత్విక,ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎరవేశారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ 43.9 కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.అందులో పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన యూఎస్ డాలర్లు,ఇరవై ఆరు కోట్ల విలువైన ఎనభై ఎనిమిది కిలోల బంగారం,ఐదు కోట్ల విలువైన వజ్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా, అమెరికా,యూఏఈ,సింగపూర్ లో నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు అధికారులు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం,చెన్నై, హైదరాబాద్,బెంగళూరులో నలభై ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి.ఆంధ్రా,తమిళనాడులో భారీగా భూములు కొన్నట్టుగా అధికారులు గుర్తించారు.నలభై చోట్ల ఇప్పటికే సోదాలు నిర్వహించినటువంటి ఐటీ బృందాలు పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటూ ఆశ్రమంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే పసిగట్టిన పరిస్థితి కనిపిస్తోంది.ఈ నేపథ్యం లోనే దాదాపుగా ఇన్కం ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి యాక్ట్ కి సంబంధించినటువంటి దాడులు కొనసాగుతున్నాయని నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటన ప్రకారమే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల మేర అక్రమంగానే ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు.పెద్ద ఎత్తున తాత్విక,ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీయుల్ని ఆకర్షించడం,పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడం, విరాళాలు సేకరించడం లాంటి పనులు చేశారని అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ విరాళాలను అక్రమ మార్గంలో ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్టుగా స్పష్టంగానే ఇప్పటికే ఐటి శాఖ బృందాలు తేల్చి చెప్పాయి.మరోవైపు నాలుగో రోజు సోదాల్లో ప్రధానంగా  రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్ విభాగాల్లో పెద్ద ఎత్తున విదేశాల్లో కూడా పెట్టుబడులు ఆశ్రమ నిధులు అక్కడ పెట్టినట్లుగా గుర్తించిన అధికారులు వీటి లెక్కలను బయట పెట్టనున్నట్లు తెలియజేశారు.ఏ రకంగా నిధులను తప్పుదోవ మళ్ళించారన్న దానిపైనా కల్కి ఆశ్రమ నిర్వాహకులను అధికారులు  ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.

Cold War Between NGOs and GOs in Telangana

నిన్నటివరకు కలిసి ఉన్నవారు ఇప్పుడు తలో దారిన పడుతున్నారా..?

  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉద్యోగ సంఘాల జేఏసీ లో చిచ్చుపెట్టినట్లు కన్పిస్తోంది. నిన్న మొన్నటి వరకు కలిసి అడుగులు వేసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఇప్పుడు తలో దారిన నడిచేందుకు సిద్ధమవుతున్నారట. టీఎన్జీవో కార్యవర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తీర్మానం చేసిన తర్వాత జేఏసీ లోని కొన్ని సంఘాలు మద్దతుపై పునరాలోచనలో పడ్డాయని సమాచారం.  నిజానికి ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడంతో సమ్మెకు మద్దతు తెలపాలంటూ ఇతర ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర సంఘాల నాయకత్వం మీద ఆయా సంఘాల కింది స్థాయి ఉద్యోగులు ఒత్తిడి పెంచారు. ఈ నేపధ్యంలో టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతివ్వాలని నేతలంతా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని టీఎన్జీవోలు తప్పు పట్టారు. టీ.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. తాము సైతం ఉద్యమించడానికి ఇదే సరైన సమయమని ఆర్టీసీ సమ్మెను అవసరమైతే సకల ఉద్యోగుల సమ్మెగా మార్చాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇదే విషయాన్ని సమావేశానంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.  ఇంత వరకు బాగానే ఉంది.. అయితే గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం వాయిదా పడుతోంది. ఎవరికి వారుగా ఉద్యోగ సంఘాలు సమావేశాలు పెట్టుకొని తీర్మానాలు చేసుకున్నారు కానీ, జెఎసి సమావేశం మాత్రం పదేపదే వాయిదా పడటంతో అందులో నేతల మధ్య అంతర్గత విభేదాలు బయట పడుతున్నాయి. ఆర్టీసి ఉద్యోగులకు మద్దతు తెలపడం సకల ఉద్యోగుల సమ్మెకు సిద్ధమంటూ రవీందర్ రెడ్డి ప్రకటించడంతో జేఏసీ లోని మరో సంఘం టీజీవోలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఆ సంఘానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌరవాధ్యక్షుడిగా ఉండటం వల్లే వారు ఆలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆ సంఘానికి చెందిన ఓ ముఖ్య నేత గచ్చిబౌలిలో నిబంధలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేస్తున్నారని అది కూడా ఓ కారణమని చెప్తున్నారు. ఈ పరిస్థితుల వల్లే టీజీవోలు గత రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  మరోవైపు టీజీవోల వ్యవహారంపై టీఎన్జీవోలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె తరువాత వ్యవహరించిన తీరుతో ఇప్పటికే కొంత అప్రతిష్ట పాలయ్యామని, ఉద్యోగుల్లో సైతం సంఘం పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే వారికి మద్దతు ఇవ్వాల్సిందేనని టీఎన్జీఓలు నిర్ణయించారు. ఇక తమ సమస్యల మీద పోరాటానికి కూడా ఇదే సరైన సమయమని టీఎన్జీవోలు భావిస్తున్నారు. అందుకే మొదట సీఎస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత ఫలితం లేకపోతే సమ్మెకు వెళ్లడానికి సిద్ధం కావాలని కార్యవర్గ సమావేశంలో నేతలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యం లోనే ఆ సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సకల ఉద్యోగుల సమ్మెకు సమాయత్తం అవుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విషయంలో టీజీవో లు గ్రూప్-1 అధికార సంఘం కొంత గందరగోళంలో ఉన్నట్టు ఉద్యోగ జేఏసీలో చర్చ జరుగుతోంది. ఇక టీఎన్జీఓలు మాత్రం ఈ పరిణామాన్ని ముందే అంచనా వేశారట, టీజీవోలు కలిసి రాకపోయినా సమ్మెకు సిధ్ధం కావాలని తమ కేంద్ర నాయకత్వాన్ని టీఎన్జీఓలు గట్టిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒక లక్షా ఎనభై వేల సభ్యత్వంతో రాష్ట్రంలో తమదే అతిపెద్ద ఉద్యోగ సంఘంగా ఉందని కేవలం ఐదు వేల మంది ఉన్న టీజీవోల మాట విని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవద్దని టీఎన్జీఓ జిల్లాల బాధ్యులు డిమాండ్ చేస్తున్నారట. ఆ సంఘాలు జేఏసీ నుంచి బయటకు వెళ్లినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారట. ఉపాధ్యాయులు నాలుగో తరగతి ఉద్యోగులు సహా కలిసి వచ్చే అన్ని సంఘాలతో సమ్మెకు వెళ్లాలని గట్టిగా కోరుతున్నారట. అన్ని జిల్లాల నాయకుల నుంచి ఒకే అభిప్రాయం వ్యక్తమవడంతో టీఎన్జీఓ కేంద్ర నాయకత్వం కూడా అందుకు సన్నద్ధం అయినట్లు ఆ సంఘం నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగ జేఏసీ సమావేశానికి అడ్డంకులు సృష్టించిన టీజీఓలు సీఎస్ తో సమావేశానికి హాజరయ్యారు. వివిధ ఉద్యోగ సంఘాలు తమ కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాలతో వినతి పత్రాన్ని తయారు చేసి నేతలంతా కలిసి సిఎస్ కు అందజేశారు. తర్వాత మీడియా సమావేశంలో ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ టీఎన్జీఓ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్దమని ప్రకటించారు. ఇక టీజీఓ అధ్యక్షురాలు మమత మాత్రం ఆ స్థాయిలో మాట్లాడక పోవడం వారి వైఖరిని తెలియజేస్తోందన్న వాదనలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత సీఎం మాట ఇచ్చినట్టుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే టీజీఓలు కలిసొచ్చినా, రాకపోయినా తాము మాత్రం సమ్మెకు వెళ్లాలని టీఎన్జీఓలు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.

Rohit Sharma breaks world record

టెస్టుల్లోనూ మొదలైన రికార్డుల వేట.. రోహిత్ ఖాతాలో అద్భుతమైన రికార్డు

  టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ టాలెంట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిగతా స్టార్ బ్యాట్స్ మెన్ వన్డేల్లో సెంచరీలు చేసినంత ఈజీగా రోహిత్ డబుల్ సెంచరీలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే ఇప్పుడు రోహిత్ టెస్టుల్లో కూడా అదరగొడుతున్నాడు. మొన్నటి వరకు టెస్ట్ టీంలో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్.. ఇప్పుడు టెస్టుల్లో ఓపెనర్ గా తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా.. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి.. సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన.. శనివారం మొదలైన మూడో టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది. అయితే ఈ సిరీస్ కి అనూహ్యంగా ఓపెనర్ గా ఎంపికైన రోహిత్.. వన్డేల్లో లాగానే అదరగొడుతున్నాడు. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు చేసి ఆకట్టుకున్న రోహిత్.. మూడో మ్యాచ్ లో కూడా సెంచరీ చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌ కిది మూడో సెంచరీ కాగా.. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ కిది 6వది. ఈ క్రమంలో ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ సమం చేశాడు. ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా.. రోహిత్ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు. ఇక, దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ తన కెరీర్‌లో ఒక సిరీస్‌లో మూడు అంతకంటే సెంచరీలను మూడు సందర్భాల్లో సాధించాడు. గవాస్కర్‌ తర్వాత ఒకే సిరీస్ లో మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. అదేవిధంగా సిక్సుల్లోనూ రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ సిరీస్ లో రోహిత్ 17 సిక్సులు కొట్టాడు. దీంతో గతంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్‌మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన సిరీస్ లో కొట్టిన 15సిక్సుల రికార్డును బద్దలు కొట్టేసాడు. దీన్నిబట్టి చూస్తుంటే వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ రోహిత్ రికార్డుల వేట మొదలైందని చెప్పాలి.

Road Accident in Suryapet Dist

కచ్చులూరు ప్రమాదాన్ని తలపిస్తున్న కారు ప్రమాదం.......

  సూర్యాపేట జిల్లాలోని చాకిరాల దగ్గర కాల్వలో పడిన కారు ప్రమాదం కూడా అచ్చం కచ్చులూరు బోటు పరిస్థితిని తలపిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సికింద్రాబాద్ కు చెందిన అబ్దుల్ రాజేష్, జాన్సెన్, సంతోష్ కుమార్, నరేష్, పవన్ కుమార్ లు ఉన్నారు. వీరంతా అంకుర ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. చాకిరాలలో స్నేహితుడు విమలకొండ మహేష్ పెళ్లి వేడుకలకు హాజరై తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే స్నేహితులంతా రెండు కార్లలో సూర్యాపేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూడా రెండు కార్లల్లో తిరుగు ప్రయాణమైయ్యారు. మరొక కారు రావడం లేదన్న విషయాన్ని గమనించి వెతికిన వాళ్లకి కాలువలో కొట్టుకు పోయిన కారు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఈ విషయం తెలిసిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  కాల్వలో పడిన కారును ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాటర్ కెమెరాలతో కారు ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. కచ్చులూరు వద్ద గజ ఈతగాళ్లు కిందకు వెళ్లి రోప్ ను బోటుకు కడితే కానీ వెలికి తీసే పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఇక్కడ కారును వెలికి తీసేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. గజ ఈతగాళ్లు కిందకు వెళ్లి రోప్ ని కారుకు కట్టాలి,అప్పుడే కారును బయటకు తీయగలుగుతారు . దీంతో అధికారులకు గజ ఈతగాళ్లను రప్పించి వారి సహాయం కోసం కారును వెలికి తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో చాకిరాల వద్ద పడిపోయినటువంటి కారుని వెలికితీత ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఆరు గంటలుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్ ను వెలికి తీసేందుకు ప్రయత్నాలైతే ముమ్మరం చేస్తున్నారు. కానీ వారు ప్రయత్నాలైతే విఫలమవుతున్నట్టు కనిపిస్తుంది.దీంతో స్థానిక గజ ఈతగాళ్లు కూడా తమ ప్రయత్నాన్ని కొనసాగించేందుకు పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ముగ్గురు యువకులు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సాయంగా వారితో పాటూ దిగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కారును గుర్తించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ రోప్ ని కారుకు కట్టే ప్రయత్నంలో అనేకసార్లు విఫలం అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.ముఖ్యంగా నీటి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతోటి కారుకి రోప్ ని కట్టే సమయంలో లాక్ కి కొక్కెం వేయటంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ నుంచి ఐదు వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ ఘటన తర్వాత రెండు వేల ఐదు వందల క్యూసెక్ ల నీటి ప్రవాహం తగ్గించినప్పటి కూడా ఇంకా వరద ఉధృతి అలానే ఉంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఈ రిస్క్యూ ఆపరేషన్ మాత్రం కొంత కష్టదాయకంగా కొనసాగుతోంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మ్మీద ఈ రిస్క్యూ ఆపరేషన్ చూసేందుకు పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది వస్తున్నారు. సాగర్ ఎడమ కాలువ చుట్టూ ఉండే జనం కూడా ఇక్కడకు వచ్చి చేరుకుంటున్న పరిస్థితి చోటు చేసుకుంది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరొక రెండు గంటల్లో ఈ కారును వెలికి తీసి ఆ మృతదేహాలను మాత్రం బంధువులకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఎండీఆర్ఎఫ్ బృందం ప్రయత్నం చేస్తున్న ఈ రిస్క్యూ ఆపరేషన్ మొత్తం మీద మరొక అర్ధగంట, గంట సేపు  పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది అది సఫలమవుతుందో లేదో వేచి చూడాలి.  

zp chairman vs collector issue in adilabad district

జెడ్పీ ఛైర్మన్‌ వర్సెస్ కలెక్టర్... టీఆర్ఎస్ లో కలకలం రేపుతోన్న కొత్త వివాదం 

  ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్, కలెక్టర్ దివ్య దేవరాజన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ‌ఎలాంటి పనులూ కావడం లేదని, దీనికి‌ కలెక్టర్ దివ్యదేవరాజన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై తిరుగుబాటు చేయాలని జెడ్పీటీసీలకు ఛైర్మన్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలూ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు జెడ్పీ ఛైర్మన్. జిల్లా పాలన మొత్తం, కలెక్టర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. కనీసం పట్టా పాస్ ఇప్పించలేకపోతున్నామని వాపోయారు. పనులు చేయలేని పదవులు మాకెందుకన్న జనార్ధన్, ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనమేంటని మండిపడ్డారు. కనీసం, విరాసత్, పట్టాపాస్ ఇవ్వడాన్నీ కలెక్టర్ పట్టించుకోవడంలేదని వాగ్భాణాలు సంధించారు. కలెక్టర్‌పై తిరుగుబాటు చేయాలని జెడ్పీ ఛైర్మన్‌ ఏకంగా పిలుపునిచ్చారు. అయితే భయపడేది లేదంటోన్న కలెక్టరమ్మ దేనికైరా రెడీ అంటున్నారు. దాంతో ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ వర్సెస్ జడ్పీ చైర్మన్‌ కోల్డ్‌ వార్, రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏజెన్సీ చట్టాలను‌ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇది జెడ్పీ ఛైర్మన్ కు నచ్చడం‌ లేదట. అదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందట. ఆదివాసీల భూములను, ఒక సామాజికవర్గ నేతలు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. రికార్డులన్నీ ఆదివాసీల పేరిట ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఒక సామాజికవర్గానికి‌ పట్టాలు కట్టబెట్టడానికి ప్రయత్నించారని, విపక్షాల నుంచీ విమర్శలున్నాయి. అయితే, చట్ట ప్రకారం నడుచుకోవాలని, నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే జెడ్పీ ఛైర్మన్‌కు నచ్చక, ఎదురుదాడికి దిగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారన్నది జడ్పీ ఛైర్మన్‌ అభ్యంతరం. ఇటీవల నియమాకాలు జరిగిన ఫారెస్ట్ అండ్ జూనియర్‌ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలను అర్హులైనవారికి వచ్చేలా ‌కలెక్టర్  చర్యలు తీసుకున్నారు. దాంతో భోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. చట్టాలు అమలు చేయడం, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో నిబంధనలు పాటించడమే కలెక్టర్‌ తప్పయినట్టుగా వీరంతా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందట. అయితే ఎవరికి ఉద్యోగాలు, ఏజెన్సీ సర్టిపికెట్లు దక్కలేదో వారి కోసం కలెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ అట్టుడికిన సమయంలో పాలనా వ్యవహారాలను చక్కదిద్దారని మంచి గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్‌పై, అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కలెక్టర్‌పై... జడ్పీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఈసడించుకుంటున్నారు. రహస్య అజెండాతోనే ఛైర్మన్, ఆయన బృందం బహిరంగ వ్యాఖ్యలు చేస్తోందని, విపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టం ప్రకారం నడుచుకుంటున్న కలెక్టర్‌ను అభినందించాల్సిందిపోయి, తమకు అనుకూలంగా నడుచుకోవడం లేదన్న అక్కసుతో నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఫైరవుతున్నారు. అవినీతి, అక్రమాలకు మడుగులొత్తాలని భావించడం సరికాదంటున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా, కలెక్టర్‌ చట్టం ప్రకారమే నడుచుకోవాలని, ఎవరికీ బెదరాల్సిన అవసరంలేదని ప్రజాస్వామ్యవాదులంటున్నారు.

pm modi about kartarpur corridor

కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణంతో సిక్కుల డెబ్భై ఏళ్ల కల నిజమవుతుంది: మోదీ

  హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కీలక సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. సిర్సా, రేవరీ తదితర సభల్లో ప్రసంగించారు, విపక్షాలు ఇప్పటికే ఓటమిని అంగీకరించాయని అన్నారు. కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణంతో సిక్కుల డెబ్భై ఏళ్ల కల నిజమవుతుందని అన్నారు మోదీ. సిక్కుల ముఖంలో ఆనందం కనిపిస్తోందన్నారు. గురునానక్ దేవ్, కర్తార్ పూర్ సాహెబ్ ల మధ్య దూరం తగ్గిపోయిందన్నారు. ఈ జాతీయ రహదారికి గురునానక్ దేవ్ జీ మార్గంగా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్థాన్ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్లు తెలిపారు మోదీ. ఉగ్రవాదంతో పాటు భారత యువతలకు డ్రగ్స్ కు బానిసలు చేసేందుకు పాక్ కుట్ర చేస్తోందని కానీ, ఆ కుట్రను తిప్పికొట్టినట్టు చెప్పారు ప్రధాని. పుల్వామా  దాడుల తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య తొలి సారిగా చర్చలు జరిగాయి, అయితే ఆ చర్చలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు సంబంధించినది కాదు, భారత్-పాక్ మధ్య శాంతికి నాంది పలుకుతుందని భావిస్తున్న కర్తార్ పూర్ కారిడార్ గురించి. భారతీయ సిక్కులు ఎన్నో దశాబ్దాల కల ఈ కర్తార్ పూర్ కారిడార్. దీని నిర్మాణం పూర్తయితే నేరుగా పాకిస్థాన్ కు వెళ్లి తమ గురుద్వార్ ను దర్శించుకోవచ్చని భారతీయ సిక్కులు భావిస్తున్నారు. సిక్కు మతస్థుల అత్యంత పవిత్రంగా భావించే స్థలాల్లో కర్తార్ పూర్ దర్బార్ సాహెబ్ గురుద్వార్ ఒకటి. ఇది పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ గ్రామంలో ఉంది, దీన్ని 500 ఏళ్ల క్రితం గురునానక్ హయాంలోనే నిర్మించారని సిక్కులు చెబుతారు. వారి విశ్వాసాల ప్రకారం సిక్కు మతానికి ఆధ్యుడైన గురునానక్ ఇక్కడే మొదటి మత సమావేశం నిర్వహించారు. పధ్ధెనిమిది ఏళ్లకు పైగా ఇక్కడే ఉన్న గురునానక్ చివరికి ఈ ప్రాంతంలోనే కన్నుమూశారు. అప్పట్నుంచీ ఇది సిక్కులకు అత్యంత పవిత్ర స్థలంగా మారింది కానీ, పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయాక ఈ కర్తార్ పూర్ పాకిస్థాన్ భూభాగంలో కలిసిపోయింది. కర్తార్ పూర్ గురుద్వార్ భారత సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో రావి నది ఒడ్డున ఉంది. అదే నదికి ఇవతలి వైపున భారతీయ భూభాగంలో మరో ప్రసిద్ధ డేరా బాబా నానక్ గురుద్వారా కూడా ఉంది. దేశ విభజన తరువాత భారతీయ సిక్కులు ఆ రావి నది పైన ఉన్న వంతెన పై నుంచే అనధికారికంగా వెళ్లి కర్తార్ పూర్ గురుద్వారను దర్శించుకునే వారని చెబుతారు. కాని పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాక్ యుద్ధం తరువాత ఆ వంతెన ధ్వంసమైంది. దాంతో సిక్కుల రాకపోకలు నిలిచిపోయాయి, అప్పట్నుంచీ రెండు గురుద్వారాలను అనుసంధానం చేస్తూ మార్గం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ లు పెరిగాయి. భారత భూభాగం నుంచే కర్తార్ పూర్ గురుద్వారా కనిపిస్తుంది, అది మరింత స్పష్టంగా కనిపించేందుకు పాక్ అధికారులు తరచూ మధ్యలో దట్టంగా పెరిగిపోయే గడ్డిని కత్తిరిస్తుంటారు. అయితే ఈ ఇబ్బందులేవీ లేకుండా నేరుగా రెండు గురుద్వారాల మద్య మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న అధికారిక ప్రతిపాదన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముందుకు కదిలింది. తొలిసారి ఢిల్లీ నుంచి లాహోర్ కు బస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఆ బస్సులో నాటి ప్రధాని వాజ్ పై ప్రయాణించారు. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందుకు ఆయనే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, ఆ తరువాత పాకిస్తాన్ కూడా గురుద్వారాను పునరుద్ధరించి భారత్ నుంచే దాన్ని చూసేందుకు అనువైన ఏర్పాట్లు చేసింది. ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ ఆ కారిడార్ నిర్మాణం ముందుకు కదిలింది, ఇటీవలే ఇటు భారత్ లో అటు పాకిస్తాన్ లో కూడా కారిడర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రతిపాదనల ప్రకారం డేరా బాబా నానక్ గురుద్వారా నుంచి సరిహద్దు వరకు మార్గాన్ని భారత్ నిర్మిస్తే, అటు కర్తార్ పూర్ నుంచి సరిహద్దు వరకు మార్గాన్ని పాకిస్థాన్ నిర్మిస్తుంది. ఇది పూర్తయితే ఎలాంటి వీసా, పాస్ పోర్టు అవసరం లేకుండా భక్తులు ఒకే రోజులో భారత్ నుంచి కర్తార్ పూర్ గురుద్వారాకు వెళ్లి వచ్చేలా ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. గురునానక్ ఐదు వందల యాభైవ జయంతి నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ కల్లా ఈ కారిడార్ ను పూర్తి చేయాలని ఇటు భారత్ తో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భావించింది. ఈ నిర్మాణం పూర్తయిన తరువాత భారత్-పాక్ ల మధ్య బంధం ఎలా కొనసాగుతుందో చూడాలి.

Party Symbols Tension For TRS In Huzurnagar By Election

హుజూర్ బైపోరులో టీఆర్ఎస్ కి కొత్త భయం... టెన్షన్ పెడుతోన్న రోడ్ రోలర్, ట్రాక్టర్

  ఒకవైపు ఆర్టీసీ సమ్మె, ఇంకోవైపు కేసీఆర్‌ సభ వర్షార్పణం కావడంతో, టెన్షన్‌ పట్టుకున్న టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, మరో ఇద్దరు తెగ టెన్షన్‌ పెడుతున్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచే అయినప్పటికీ... ఓట్ల చీలికతో బీజేపీ, టీడీపీ కూడా ఎంతోకొంత టెన్షన్ పెడుతున్నాయి. అయితే, ప్రధాన పార్టీలే కాకుండా, ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి గుండెల్లో గుబులురేపుతున్నారు. అసలు, వారిద్దరూ అసలు పోటీ కాకపోయినా, వారి గుర్తులు మాత్రం తెగ టెన్షన్ పెట్టిస్తున్నాయి. రోడ్ రోలర్, ట్రాక్టర్... ఈ రెండు గుర్తులూ దాదాపు టీఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉంటాయి. ఈ రెండు గుర్తులే ఇప్పుడు టీఆర్ఎస్‌ను తెగ టెన్షన్‌ పెడుతున్నాయి. హుజూర్‌ నగర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయింది ఎన్నికల సంఘం. అదీ కూడా జాబితాలో టీఆర్ఎస్‌ కారు గుర్తు తర్వాత అవే ఉండటం, అధికారపక్ష అభ్యర్థిలో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయామని, నిరక్షరాస్యులు, వృద్ధులు పొరపడి ట్రక్కు గుర్తుకు ఓటేయడంతో... పదివేల ఓట్లు పడ్డాయని, అందువల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని  అంటున్నారు. ఇప్పుడు హుజూర్ ‌నగర్‌ బైపోరులోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థికి అలాంటి దిగులే పట్టుకుందట. హుజూర్ ‌నగర్‌ బైపోల్ బరిలో మొత్తం 28మంది అభ్యర్థులున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, నాలుగో నెంబర్‌ అలాట్ చేశారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ కి... ట్రాక్టర్‌ నడిపే రైతు సింబల్‌ను... అలాగే ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున పోటీ చేస్తున్న నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డురోలర్‌ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో, తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనని టెన్షన్‌ పడుతున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా, లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు. దీంతో అధికారపక్షాన్ని గుర్తుల భయం వెంటాడుతోంది. ఇక గతంలోనూ టీడీపీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు, ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును ఎన్నికల్లో నిషేధించింది టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. పాలేరు..నకిరేకల్, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మళ్లీ ట్రాక్టర్, రోడ్‌ రోలర్‌ గుర్తుల రూపంలో బిక్కుబిక్కుమంటున్నాడు టీఆర్ఎస్‌ అభ్యర్థి. అయితే, గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జనంలో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు, గుర్తులపై అవగాహన కల్పిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. కారుకు రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, హుజూర్ నగర్ లో ఇంటింటికి  వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రతీ ఓటూ అత్యంత కీలకంగా మారిన హుజూర్ నగర్ ఉపపోరులో... మరి, రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు... టీఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో చూడాలి.

8 year old girl dies after stuck in lift in hyderabad

లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన ఎనిమిదేళ్ల చిన్నారి...

  హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. చలాకీగా తిరుగుతూ సందడి చేసే చిన్నారి ప్రాణాలు అమాంతంగా గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే  లిఫ్ట్ లో ఇరుక్కొని ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఎల్బీనగర్ హస్తినాపురం పరిధిలో పిండి పుల్లారెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలో చంద్రశేఖర దంపతులు ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ కూతురు ఎనిమిదేళ్ల లాస్య స్కూలుకు సెలవులు కావటంతో శుక్రవారం సాయంత్రం ఆ చిన్నారి పొరుగింటి పిల్లలతో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. పిల్లలతో కలిసి ఆడుకుంటున్న లాస్య లిఫ్ట్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్ తలుపులు మూసుకు పోవటంతో అందులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది.లిఫ్ట్ పై ఫ్లోర్ లో చిన్నారి తల కింద కాళ్ళు ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించింది. తోటిపిల్లలు గట్టిగా అరవటంతో లాస్య తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చిన్నారి మృతి తో స్థానికంగా విషాదం ఛాయలు అలుముకున్నాయి.  లిఫ్టులో పడి ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోవడం పట్ల బాలల హక్కుల సంఘం తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది. కొందరు భవన నిర్మాణదారులు నాసిరకం లిఫ్టులు పెట్టడంతో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతరావు ఆరోపించారు.అపార్టుమెంట్ ల్లో నాణ్యమైన లిఫ్టులు సమకూర్చుకోవాలంటూ సూచించారు. లిఫ్ట్ నాణ్యతపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి ఆమోదించిన తర్వాతే బిగించేలా చర్యలు చేపట్టాలంటూ ఆయన సూచించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.  హైదరాబాద్ లో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో ఎక్కువ మంది చిన్నారులే ప్రాణాలు తమ ప్రాణాలు కోల్పొతున్నారు. చాలా తక్కువ సంఖ్యలో చిన్నారులు ప్రాణాలతో బయటపడుతున్నారు. దిల్ సుఖ్ నగర్ సార్ కిడ్స్ ప్రైవేటు పాఠశాలలో జహాన అనే చిన్నారి లిప్టు గ్యాప్ లో ఇరుక్కు పోవటంతో ప్రాణాలు విడిచింది. ముసారంబాగ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జైనబ్ అనే నాలుగేళ్ల పాప లిఫ్టులో ఇరుక్కుని ప్రాణాలు వదిలింది. దీంతో పాటు రాజేంద్ర నగర్, చందా నగర్ లోనూ ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి.రోజువారీ జీవితంలో లిఫ్టు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు ఎక్కటం తప్పనిసరైపోయింది. అపార్ట్ మెంట్లు, ఆఫీస్లు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ లో ఇలా ఎక్కడికి వెళ్లినా లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. అసలు లిఫ్టు ప్రమాదాలూ ఎందుకు జరుగుతున్నాయి, అపార్ట్ మెంట్ నిర్మాణ సమయంలో నాణ్యమైన లిఫ్టు బిల్డర్లు వాడకపోవటమే కారణమా, లిఫ్టు నాణ్యతపై మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించిన తరువాతే వాటిని బిగిస్తున్నారా లేదా అనే అంశాలపై అధికారులు పరిశోదించాల్సి ఉంటుంది. ఇటువంటి విషయాల పై విచారణ జరపాలని బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తప్పు ఎవరిదైనా ఒక నిండు ప్రాణం మాత్రం బలైపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారుతున్న తెలంగాణ బంద్... 

  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామునే ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలు డిపో ఎదుట ధర్నాలకు దిగారు. మరో వైపు ప్రభుత్వం కూడా పోలీసుల బందోబస్తుతో బస్సుల్ని నడుపుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎస్కార్టుతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటోంది. డిపోలు, బస్టాండ్ దగ్గర భారీగా పోలీసులను మొహరించారు.  ఖమ్మం, కొత్తగూడెంలోనూ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. తెల్లవారు జామునే అఖిల పక్షం, ఆర్టీసీ జెఎసి కార్మికులు డిపోల దగ్గరకు చేరుకొని బంద్ లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ముందుగానే జాగ్రత్తగా అఖిల పక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు.  ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో డిపో ఎదుట ఆందోళనకు దిగిన అఖిల పక్షం, కార్మిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బందోబస్తు మధ్య కొన్ని బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యయి. ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుటనే ఆందోళన నిర్వహిస్తూ బయటకు రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఈ బంద్ లో పాల్గొన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్, మందరి, గోదావరిఖని డిపోలో బస్సుల రాకపోకలను అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆర్టీసి బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా డిపోల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మంచిర్యాల డిపో నుండి ఆర్టీసీ బస్సులను బస్టాండ్ కు తరలించే క్రమంలో పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మరొపక్క ఆర్టీసీ కార్మికులు రోడ్డు పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసి బంద్ కొనసాగుతోంది. డిపోలు బస్టాండ్ ల వద్ద విపక్ష నేతలు, ఆర్టీసీ కార్మికులు, ప్రజా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. బోధన్ మండలం ఆచన్ పల్లి, మాక్లూర్ మండలం ముబారక్ నగర్ వద్ద కూడా నిరసనకారులు బస్సుల పైకి రాళ్లు రువ్వారు. రెండు బస్సుల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యయి. వామపక్ష, ప్రజా సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులనూ పోలీసులు అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్ పూర్తిగా కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హై కోర్ట్ ఆదేశాలిచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇక బంద్ మరింత ఉధృక్తి  కాకముందే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.

అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ శుభవార్త...

  ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఇచ్చిన హామీలలో మరో ముందడుగు పడింది. అగ్రి గోల్డ్ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరపాలని,మొదటగా పదివేల లోపు డిపాజిటర్ లకు పేమెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఈ మేరకు మూడు లక్షల అరవై తొమ్మిది వేల మందికి రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. హై కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా లీగల్ సెల్ ద్వారా నగదు అందజేయనుంది. మరోవైపు ఇరవై వేల రూపాయల లోపు డిపాజిటర్లకి కూడా చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. కోర్టు సూచనల మేరకు చెల్లించబోతోంది నగదు రూపంలో చెల్లించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.  అగ్రి గోల్డ్ బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తం నుంచి బాధితులకు డబ్బులు ఇవ్వబోతోంది ప్రభుత్వం. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రతి జిల్లాలో అగ్రి గోల్డ్ బాధితులు సీఎం జగన్ ను కలిసినప్పుడు వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకునే వారు సహా వేలాది మంది మధ్య తరగతి జనం అగ్రి గోల్డ్ లో తమ డబ్బు డిపాజిట్ చేశారు.మోసపోయిన బాధితులు తమకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలని పాదయాత్రలో జగన్ ను కోరారు.  పది వేల రూపాయల లోపు డిపాజిటర్ లకు కలెక్టర్ల ద్వారా నగదు అందించబోతోంది ప్రభుత్వం. జిల్లాల వారీగా బాధితులు వారికి అందే మొత్తాన్ని పరిశీలిస్తే.. గుంటూరు జిల్లాలో పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క మందికి పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు, చిత్తూరు జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు మందికి ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు మందికి పదకొండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇరవై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు, విజయనగరం జిల్లాలో యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి ముప్పై ఆరు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం జిల్లాలో నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మందికి ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు, కర్నూలు జిల్లాలో పదిహేను వేల ఏడు వందల ఐదు మందికీ పదకొండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మందికి పదహారు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి పదిహేను కోట్ల నాలుగు లక్షల రూపాయలు, అనంతపురం జిల్లాలో ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి ఇరవై కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు, కడప జిల్లాలో పధ్ధెనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మందికి పదమూడు కోట్ల పధ్ధెనిమిది లక్షల రూపాయలు, ప్రకాశం జిల్లాలో ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరు మందికి పంతొమ్మిది కోట్ల పదకొండు లక్షల రూపాయలు, విశాఖపట్నంలో యాభై రెండు వేల ఐదు మందికీ నలభై ఐదు కోట్ల పది లక్షల రూపాయలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇవి నిజంగా ప్రజలకు చేరి వారికి తగిన న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.  

విశాఖ జూలో వస్తుమార్పిడి విధానం అమలు చేస్తున్న అధికారులు...

  వస్తుమార్పిడి విధానం గురించి వినే ఉంటారు. పూర్వకాలంలో డబ్బులు లేని రోజుల్లో మన దగ్గరున్న వస్తువులిచ్చి వాళ్ళ నుండి మనకు కావలసిన వస్తువులు తీసుకునే వాళ్లం. అయితే ఇప్పుడు ఈ విధానం జంతువులకు అమలు చేస్తున్నారు విశాఖ జూ అధికారులు. సరికొత్తగా జంతు మార్పిడి విధానం తీసుకొచ్చారు, దేశంలో అతిపెద్ద జూలలో విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్ ఒకటి. ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల్లో కొండల నడుమ సహజసిద్ధంగా ఉండే ఈ జూ ని సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ జూలో ఉండే జంతువులు, పక్షులకు ఏడాదికి ఆహారం ఖర్చు చాలా ఎక్కువ. వీటిలో టైగర్స్, లెపర్డ్, జాగ్వర్, ఏనుగు, హిప్పోపొటమస్ జంతువులకు మరింత ఖర్చవుతుంది. వచ్చే ఆదాయంతో పోల్చితే వీటికి వెచ్చించే ఖర్చు ఎక్కువగా ఉండటంతో జంతు ప్రేమికులకు ఒక అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జంతువులు, పక్షులను దత్తత ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రేటు ఉంది. రోజుల నుంచి ఏళ్ల వరకూ ఎన్నాళ్లు దత్తత తీసుకుంటే అన్నాళ్లూ వాటి ఆహారం ఖర్చు భరించాలి. ఇలా దత్తత తీసుకున్న వారి కుటుంబాలకు మూడు సార్లు జూలో ఎంట్రీ ఉచితం. ఆన్ లైన్ లోనూ దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జూ క్యూరేటర్ యశోదబాయి. ఇప్పటికీ విశాఖ జూలో ఉన్న కొన్ని జంతువులను వివిధ ప్రాంతాల నుంచి జంతు మార్పిడి ద్వారా తీసుకువచ్చారు. వైల్డ్ డాగ్స్, వైట్ టైగర్స్ సంతతి పెరగడంతో వాటిని ఇతర జూలకు ఇచ్చి అక్కడి నుంచి వేరే జంతువులను తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే మలేషియా జూ నుంచి జిరాఫీ, ఇజ్రాయిల్ నుంచి చింపాంజీ తీసుకువచ్చారు, కలకత్తా నుంచి జీబ్రా తీసుకురానున్నారు. జూ సహజసిద్ధంగా ఉందని జంతువులు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు ఉందంటున్నారు పర్యాటకులు. అయితే జూ విస్తీర్ణానికి తగిన జంతువులు ఉండి ఉంటే బాగుండేదంటున్నారు మరికొందరు, సౌకర్యాలు కూడా పెంచాలని కోరుతున్నారు. జూని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని నైట్ సఫారీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తానికి వస్తు మార్పిడిలా జంతు మార్పిడి విధానం బాగుందంటున్నారు పర్యాటకులు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరకు సకలం బంద్ గా మారిందా..?

ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరకు సకలం బంద్ గా మారింది. ఆర్టీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ తో తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభావితం చేస్తోంది. ఈ బంద్ కు ఓలా, ఉబర్ లాంటి ప్రైవేటు టాక్సీ యూనియన్లు కూడా సంఘీభావం ప్రకటించాయి. ఎక్కడికక్కడ బస్సులు బయటకు రాకుండా ఆర్టీసీ యూనియన్ లు అడ్డుకుంటున్నాయి. హై కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ కార్మిక సంఘాలు అనుకూలంగా తీసుకుని సమ్మెను ఉధృతం చేసేందుకు సిద్ధమైతే, మరోవైపు ప్రభుత్వం బంద్ ఎఫెక్ట్ లేకుండా చర్యలు తీసుకుంటోంది. అన్ని డిపోల దగ్గర 144 సెక్షన్ విధించింది, భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవరు అడ్డుకున్నా ప్రజా రవాణా ముఖ్యమని ఖచ్చితంగా బస్సులు నడిపి తీరాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. సమ్మెపై సమీక్షించిన ఆయన విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని సూచించారు. కఠిన చర్యలతో అయినా సరే బస్సులు నడపాలన్నారు, ఇక ఆర్టీసీ జేఏసీ తో చర్చలు జరుగుతాయా అన్న సందిగ్ధానికి మరోసారి ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం. ఆయన జరిపిన సమీక్షలో అసలు చర్చల ఊసే లేకుండా ఆసాంతం ప్రత్యామ్నాయాల పైనే ఫోకస్ పెట్టారు. బంద్ నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశంతో కొన్ని చోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది, హైదరాబాద్ లోని జేబీఎస్ దగ్గర అఖిల పక్షం నేతలు కోదండ రామ్, ఎల్ రమణ, రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎంజీబీఎస్ దగ్గర ధర్నాలకు దిగిన సీపీఐ ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. సీపీఐ పార్టీ నేత కూనంనేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఓయూ విద్యార్థులు సంఘీభావం తెలపడంతో అక్కడ కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు బస్ భవన్ ముట్టడి చేపట్టే అవకాశం ఉండడంతో పోలీసు పహారా కొనసాగుతోంది.