పవన్ కు షాక్ మీద షాకిస్తోన్న నేతలు... అసలు జనసేనలో ఏం జరుగుతోంది?
కారణాలు ఏవైనా, పవన్ స్టార్ డమ్ పై ఆధారపడి జనసేనలోకి వచ్చిన నేతలంతా ఒక్కొకరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికలకు ముందే జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ పార్టీకి గుడ్ బై చెప్పగా, ఎన్నికల తర్వాత జనసేన కోశాధికారి, పవన్ కు అత్యంత సన్నిహితుడైన మారంశెట్టి రాఘవయ్య, రావెల కిశోర్ బాబు పార్టీకి రిజైన్ చేశారు. అలాగే కృష్ణాజిల్లా జనసేన కన్వీనర్ డేవిడ్ రాజు, మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన చింతల పార్థసారథి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇక, కావలి, పెదకూరపాడు, తణుకు నుంచి ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన పసుపులేటి సుధాకర్, దండమూడి సామ్రాజ్యం, పసుపులేటి వెంకటరామారావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, పవన్ కళ్యాణ్ తీరును నిరసిస్తూ పార్టీని వీడారు. అయితే రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సైతం రాజీనామా చేయడంతో, జనసేనలో అసలేం జరుగుతోందన్న చర్చ హీటెక్కిస్తోంది. అయితే, పార్టీలో అయోమయం, సీనియర్లకు తగిన గౌరవం లేకపోవడం వల్లే, ఆకుల రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోంది.
వీళ్ల బాటలోనే మరికొంతమంది సీనియర్ నాయకులు పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా జరగుతోంది. వీరిలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ముత్తంశెట్టి కృష్ణారావు పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలై నాలుగు నెలలు కూడా గడవక ముందే పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి నాయకులు వలస వెళ్లిపోతుండటంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, పలువురు నేతలు పార్టీని వీడటానికి, పవన్ వ్యవహార శైలే కారణమంటున్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో పవన్ పూర్తిగా వైఫల్యం చెందాడని భావిస్తుండం ఒక కారణమైతే, ఇంకా చంద్రబాబు పార్టనర్గానే మెలుగుతున్నారని అనుమానిస్తున్నారట. నిర్మాణాత్మక ప్రతిపక్షం గా వ్యవహరించలేకపోవడం... పార్టీ కోసం కష్టపడినవాళ్లను కాకుండా డమ్మీలను వెంటబెట్టుకుని తరగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారట. అంతేకాదు పవన్ కొంతమందితో కోటరీ ఏర్పాటు చేసుకుని, వారు చెప్పిన మాటలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని, అందుకే పలువురు పార్టీని వీడుతున్నారనే మాట వినిపిస్తోంది.