Kanna Fires on Chandrababu Naidu

బీజేపీ విషయంలో బాబుపై మండిపడ్డ కన్నా...

తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్రంగా ఎదగాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని టీడీపీకి డోర్లు మూసివేశామని అమిత్ షా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించేందుకు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ కర్నూల్ వచ్చారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి విషయానికొస్తే ,తమకు రాష్ట్ర అభివృద్ది చేస్తారన్న ఆశ అయితే కలగట్లేదని , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళతో ముందుకెళ్తాయన్న భావన కనిపించటం లేదుని కన్నా తెలియజేశారు.అభివృద్ధి అనేది కలలాగే మిగిలిపోయేటువంటి పరిస్థితి కనపడుతుందని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవకాశవాది అని, ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి ఉందని ఆయన వెల్లడించారు. టీడీపీ నేత చంద్రబాబు తొంభై తొమ్మిదిలో వాజపేయి గారి ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కాళ్లు గడ్డాలు పట్టుకుని భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకుని,ఆ పార్టీని సమాధి చేసారని కన్నా తెలియజేశారు.అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మోదీగారి ప్రతిభని దృష్టిలో పెట్టుకొని, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని శాశ్వతంగా పార్టీని దూరం చేయాలని చూశారని, ఆ పార్టీ బలపడకూడదు అనేటువంటిది తన ప్రధాన లక్ష్యంగా బాబు పెట్టుకున్నారని కన్నా వెల్లడించారు.ఇవాళ మళ్లీ భారతీయ జనతా పార్టీ చిగురిస్తున్న సమయంలో మళ్లీ  కొత్త ఎత్తుగడ వేసి భారతీయ జనతా పార్టీని  ఎదగనీయకుండా చేయాలనే లక్షంతో బాబు వైఖరి ఉందని కన్నా పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ రెండు సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకుని తీవ్రంగా నష్టపోయిందన్నారు.అమిత్ షా  నరసరావుపేట విచ్చేసినప్పుడు  భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా చంద్రబాబు నాయుడికి తలుపులు మూసేసింది అని షా స్పష్టంగా తెలియజేశారని కన్నా వెల్లడించారు.ప్రతిసారి మోసపోవటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదని కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.

Chandrababu Fires On Jagan

మరో బీహార్‌గా ఆంధ్రప్రదేశ్... జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలన టెర్రరిజాన్ని తలపిస్తోందన్న చంద్రబాబు... దాడులు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ గా మార్చేశారని మండిపడ్డారు. జగన్ ప్రకటించినవి నవరత్నాలు కాదని... నవ గ్రహాలంటూ బాబు విమర్శించారు. జగన్ ప్రభుత్వ విధానాలు అరాచకానికి పరాకాష్టగా మారాయన్న చంద్రబాబు... రివర్స్ టెండరింగ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసలు పోలవరం ప్రాజెక్టు పనులను 5 నెలలపాటు ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వి మూర్కపు ఆలోచనలన్న చంద్రబాబు... అందుకే ప్రజావేదికను కూల్చి అరాచక పాలన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అయినా, ప్రత్యేక హోదా గురించి జగన్‌ ఎందుకు మాట్లాడరని బాబు ప్రశ్నించారు. ఏపీ ఖజానా దివాళా తీసే పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని బాబు విమర్శించారు. నరేగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వ డబ్బును వైసీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇక, వైసీపీ నేతలు... ఇసుక స్మగ్లింగ్‌ చేస్తూ సామాన్యుల్ని రోడ్లపైకి తెస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో కసి కక్షగా మారుతుందని అన్నారు.

Cell phone chori in TTD

టీటీడీలో మరోసారి లోపించిన భద్రత

కలియుగ దైవం శ్రీనివాసుడ్ని దర్శంచుకోవాలంటే అనేక తనికీలు నిర్వహిస్తారు భద్రత సిబ్బంది. కానీ తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఓ భక్తుడు ఏకంగా శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా, విధుల్లో ఉన్న టిటిడి సిబ్బంది అడ్డుకుని విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. తాను విదేశీ భక్తున్నని విజిలెన్స్ సిబ్బందికి చెప్పడంతో భద్రతాధికారులు ప్రశ్నించి వదిలేశారు. ఆలయంలోని సివిల్ ఏఆర్, టిటిడి విజిలెన్స్, ప్రైవేట్ సెక్యూరిటీ హోమ్ గార్డులతో పాటు ఆక్టోపస్ బలగాలు తిరుమల భక్తులను పర్యవేక్షిస్తున్న కూడా భద్రతా వైఫల్యాలు తరచూ బయటపడుతున్నాయి. శ్రీ వారి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే ముందు మూడు సార్లు భద్రతా సిబ్బంది భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. అయినా కొంత మంది భక్తులు మాత్రం నిషేధిత వస్తువులను శ్రీ వారి ఆలయంలోకి తీసుకువెళ్లడం పరిపాటిగా మారింది. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో ఓ విదేశీ భక్తుడు భద్రతా సిబ్బంది తనిఖీలను తప్పించుకుని సెల్ ఫోన్ లో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. సెల్ ఫోన్తో ఆలయంలో కి ప్రవేశించిన భక్తుడు ఆలయంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా అక్కడే విధుల్లో ఉన్న టీటీడీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే భక్తుని పట్టుకొని విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. భక్తుని ప్రశ్నించగా విజిలెన్స్ అధికారులు తాను విదేశీ భక్తున్నని ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకురావడం నిషిద్ధమని తనకు తెలియదని చెప్పడంతో విజిలెన్స్ సిబ్బంది భక్తుడి వద్ద వివరణ తీసుకుని వదిలేశారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో టిటిడి సిబ్బంది పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు .ఇక పై అయినా టీటీడీ బృందం ఇలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా ఉండేలా చూసుకోవాలని టీటీడీ ఉన్నత అధికారులు అదేశాలు జారీ చేశారు.

Pawan Kalyan Comments on YSR Rythu Bharosa

18,500 ఇవ్వాలి...లేదంటే రైతులను మోసం చేసినట్లే... జగన్ పై జనసేనాని ఫైర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. మేనిఫెస్టో తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమంటూ చెప్పే జగన్... ఇచ్చిన మాట తప్పారంటూ మండిపడ్డారు. రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్ యోజన స్కీమ్ తో ముడిపెట్టి అమలు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12వేల 500 ఇస్తామంటూ నవరత్నాల్లోనూ, వైసీపీ మేనిఫెస్టోలోనూ, ఎన్నికల సభల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడెందుకు కేంద్రం ఇస్తున్న 6వేలతో కలిపి ఇస్తున్నారని నిలదీశారు. ఇచ్చిన మాట మేరకు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండానే, వెయ్యి రూపాయలు పెంచామంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పీఎం కిసాన్ యోజన పథకంతో రైతు భరోసాను ముడిపెట్టడంతో జగన్ తన ఎన్నిక వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేకపోయారని పవన్ విమర్శించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు... కేంద్రం సాయంతో కలిపి రైతు భరోసా అమలు చేస్తామని జగన్ ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగానే తన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ఉంటే, కేంద్రం ఇస్తున్న 6వేలతోపాటు తాను ప్రకటించిన 12వేల 500 కలిపి... మొత్తం 18వేల 500 రూపాయలు ఇవ్వాలన్నారు. ఒకవేళ ఎన్నికల హామీని జగన్ నెరవేర్చలేకపోతే, అందుకు కారణాలు వివరించి, రైతులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

Governor Tamilisai Meets PM Modi

తెలంగాణలో అసలేం జరుగుతోంది? గవర్నర్‌ను ఆరా తీసిన మోడీ-అమిత్ షా.!

గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనా, పోలీసుల దమనకాండపైనా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేసిన తర్వాతి రోజే... గవర్నర్ ఢిల్లీ వెళ్లడం... ఒకేరోజు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం... టీఆర్ఎస్ లో కూడా అలజడి సృష్టించింది. అయితే, ఆర్టీసీ సమ్మె... కార్మికుల ఆత్మహత్యలు... రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పుతున్న టైమ్ లో... కేంద్ర ప్రభుత్వాధినేతలను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీతో దాదాపు అరగంటపాటు సమావేశమైన తమిళిసై... తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన గవర్నర్.... ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలు, శాంతిభద్రతలపై చర్చించారు. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నివేదిక అందజేశారు. అయితే, ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణలో అసలేం జరుగుతోందంటూ అమిత్ షా అడిగినట్లు తెలుస్తోంది. దాంతో ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ తీరుతో.... తెలంగాణలో పరిస్థితి చేయి దాటిపోతోందని గవర్నర్ వివరించినట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీసుల దమనకాండపై ఆర్టీసీ కార్మికులు ఫిర్యాదుచేసిన తర్వాతి రోజే.... గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లి... కేంద్ర పెద్దలను కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అంతేకాదు షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న గవర్నర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినప్పటికీ, ముందుగానే తమిళిసైని ఢిల్లీకి రప్పించుకుని తెలంగాణలో పరిస్థితుల గురించి మోడీ-అమిత్ షా చర్చించడం సంచలనంగా మారింది.

TNGO Support RTC Strike

ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవో మద్దతు... విలీనం చేయాల్సిందేనంటూ అల్టిమేటం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటించగా, టీఎన్జీవో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వకపోతే ప్రజల్లో చులకనవుతామంటూ టీఎన్జీవో జిల్లా యూనియన్ల నుంచి రాష్ట్ర కార్యవర్గంపై ఒత్తిడి పెరగడంతో... ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమైన కార్యవర్గం... మొత్తం నాలుగు తీర్మానాలు చేసింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వడంతోపాటు కార్మికుల తరపున చర్చలకు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ దగ్గరకు పంపాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతోపాటు రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తమను తీవ్రంగా బాధించాయన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... కిందిస్థాయి ఉద్యోగుల ఒత్తిడి మేరకు సమ్మెకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించామన్న రవీందర్ రెడ్డి... అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిచి... సీఎస్‌ను కలుస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేసిన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... ప్రభుత్వం దిగిరాకపోతే.... మరో సకల జనుల సమ్మెకు సిద్ధంకావాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు ప్రకటించడంపై అశ్వద్ధామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు అత్యంత కీలక పాత్ర పోషించారన్న అశ్వద్ధామరెడ్డి... తమకు మద్దతిచ్చిన టీజీవోలు, టీఎన్జీవోలకు రుణపడి ఉంటామన్నారు.

high court serious on telangana govt over rtc strike

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. ప్రజల సమస్యలు పట్టవా మీకు?

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అటు ఆర్టీసీ జేఏసీకి, ఇటు ప్రభుత్వానికి హైకోర్టు చురకలు వేసింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు నలుగిపోతున్నారని, నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం కావొచ్చు.. కానీ పండుగ సమయంలో రవాణా నిలిపేస్తే ఎలా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఇబ్బందులను కార్మిక సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది. వెంటనే చర్చలు ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ప్రజలపై సమ్మె ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యా సంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని కోర్టు ప్రశ్నించింది. దాదాపు 4 వేల బస్సులు నడవడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వానికి ముందు చూపు లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీని విలీనం చేయలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పొరేషన్లు.. ముందుకు వస్తాయన్నారు. అయితే ప్రజల ఇబ్బందులను మాత్రమే తమ దృష్టికి తేవాలన్న హైకోర్టు సూచించింది. ప్రస్తుతం 75 శాతం బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు తెలిపింది. కొద్ది రోజుల్లో మిగతావాటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పింది. ఈ సందర్భంగా 4000 బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను ఎలా తెస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపాయి. ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆరోపించాయి. చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లినట్లు కోర్టుకి వివరణ ఇచ్చాయి. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ లేరని, ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని, చాలా కాలంగా సమస్యలు అలానే ఉన్నాయని కార్మిక సంఘాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. సమస్య ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య మాత్రమే కాదని.. ఆది ప్రజల సమస్యగా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, యూనియన్ల పట్టుదలతో మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవా అని కోర్టు ప్రశ్నించింది. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదో తెలిపాలని ప్రశ్నించింది. కార్మికుల్లో విశ్వాసం పెంచేందుకు తక్షణం ఆర్టీసీ ఎండీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Lalitha Jewellery robbery main accused murugan plastic surgery

ప్లాస్టిక్ సర్జరీతో ఇరకాటంలో పడ్డ ఇరు రాష్ట్రాల పోలీసులు...

  ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖారవిందం కోసం చేసుకునే ఈ సర్జరీలు దొంగలకు కలిసొస్తున్నాయి. ప్లాస్టిక్ సర్జరీలతో ముఖం మార్చుకోవచ్చన్న టెక్నిక్ ను దొంగలు ఫాలో అవుతున్నారు. ఇటీవల అలాంటి చిన్నపాటి సర్జరీని చేయించుకున్న మురుగన్ కు బాగానే కలిసొచ్చింది. మొత్తానికీ ముఖాన్ని మార్చుకునేయత్నం చేయక పోయినా పోల్చుకో లేకుండా మారిపోవడం అతనికి బాగా కలిసి రావడమే కాక పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దొంగతనం చేసింది అతనే అని తెలిసినా పట్టుకోలేక పోయారు. దాంతో ఈ మధ్య కాలంలో తనకు అనువుగా మార్చుకున్న ఈ దొంగ ఏకంగా కోర్టులో లొంగిపోయి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. డబ్బులు ఊరికే రావు, చాలా కష్టపడాలి, దొంగతనము అంతే అదంత ఈజీ కాదని ఈ మురుగన్ చూపించాడు. కొట్టేసిన సొమ్మును పక్కా ప్లాన్ ప్రకారం మార్చేశాడు. చోరీ అయిన మొత్తం బంగారంలో అయిదు కిలోల వరకు పట్టుకున్నా ఇంకా చాలా వరకూ బంగారాన్ని మురుగన్ చేతులు మార్చినట్లు అనుమనిస్తున్నారు. ఇప్పుడు ఆ గోల్డ్ ను రికవరీ చేయడం చెన్నై పోలీసులకు కష్టతరంగా మారింది.  ప్లాస్టిక్ సర్జరీ కారణంగా అతన్ని పట్టుకోవడంలో ఆలస్యం జరిగింది.ఈ లోపే దొంగతనం చేసిన బంగారాన్ని మొత్తం సర్దేశాడు మురుగన్. ఒకప్పటి పాత ఫొటో ఇప్పటి సర్జరీ ఫోటోను చూస్తే ముఖంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అప్పుడు బక్కపలచగా అందవిహీనంగా ఉంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ సర్జరీతో స్మార్ట్ గా తయారయ్యాడు మురుగన్. అదే అతనికి ప్లస్ అయితే పోలీసలుకు మైనస్ అయ్యింది. ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ పోయే మురుగన్ చెన్నైలోని లలిత జూలరీలో దొంగతనం చేశాక అనూహ్యంగా మాయమయ్యాడు. తన అనుచరుడు ఒకడు పట్టుబడటంతో ఐదు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. మిగితా సొత్తును స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు ముందుకు సాగుతుండగానే మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగిపోవడం సంచలనంగా మారింది. మరో దొంగ సురేష్ తిరువణ్ణామలై జిల్లా చెంగం కోర్టులో లొంగిపోయాడు. ఇప్పుడు మురుగన్ లొంగుబాటు కూడా ఓ వివాదంగా మారింది. అతనిని నుంచి పది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదంటే తమదంటూ కుస్తీపడుతున్నారు. కర్ణాటక పోలీసులు తమ రాష్ట్రాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించిన గోల్డ్ గా చెబుతుండగా చెన్నై పోలీసులు లేదు లేదు అది ముమ్మాటికీ లలితా జ్యువెలరీ కేసు సొత్తేనని వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా గోల్డ్ వారు నెలకొంది. తిరుచ్చి జిల్లాలోని తిరువెంబూర్ లో మురుగన్ ఉండే అద్దె ఇంటి సమీపంలో కూడా పోలీసులు అతని ఫోటో పట్టుకొని ఆరా తీశారు. అయినా అక్కడ వారు గుర్తించలేకపోయారు. దీంతో కంగుతిన్న పోలీసులు అసలు విషయం ఆరా తీయగా అతను కొద్దిగా ప్లాస్టిక్ సర్జరీ డెంటల్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు. అంతకుముందు అనారోగ్యంతో ఉన్న అతని ఫోటోకు ఇప్పటి ఫొటోకు చాలా వ్యత్యాసం ఉండడంతో పోలీసులు మొదట గుర్తించలేకపోయారు. చేతి వాటం చూపడంలో మురుగన్ ది అందెవేసిన చెయ్యి. అందుకే అతన్ని పట్టుకోవడం కొన్ని సందర్భాల్లో పోలీసులకు సవాలుగా మారుతూ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కూడా మరో కారణం ఉందని ప్రచారం ఉంది. అతనికి ఎయిడ్స్ ఉందని, ఆ అనారోగ్యం విషయం బయటివారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  సినిమాలపై కూడా మురుగన్ కు బాగానే మోజుంది. గతంలో అనేక దొంగతనాలకు పాల్పడిన సొత్తుతో మూడు నాలుగు సినిమాలు కూడా తీశాడు. ఓ హీరోయిన్ తో విదేశాలలో తిరిగాడని అప్పట్లో ప్రచారం సాగింది. ఈ పదిహేనేళ్ల కాలంలో మురుగన్ సంపాదించిన ఆస్తి వంద కోట్ల వరకు ఉంటుందని పోలీసులు లెక్కలే చెబుతున్నాయి. దొంగతనం చేసిన సొత్తులో మెజార్టీ డబ్బును సినిమాల నిర్మాణం కోసమే మురుగన్ ఖర్చు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు కొంత మంది పేర్లతో బినామీ ఆస్తుల్ని కూడా దాచిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతనితో  సన్నిహిత్యంగా ఉన్న వారిపైన నిఘా పెట్టారు పోలీసులు. సినిమాలపై మోజుతో తెలుగులోనూ చిన్న చిన్న చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు.  రెండు వేల పదిహేనులో బెంగుళూరులో ఓ వ్యాపార వేత్త ఇంట్లో దొంగతనం చేశాక 3.16 కోట్ల ఆస్తిని రికవరీ చేసేందుకు అక్కడి పోలీసులకు తొంభై రోజుల సమయం పట్టింది. ఆ తరువాతనే మురుగన్ తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కొత్త లుక్ తో దొంగతనాలకు తెగబడుతున్నట్లు అర్ధమవుతోంది. మురుగన్ చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీతో పోలీసులు బోల్తాపడ్డారు. మురుగన్ ఎపిసోడ్ తో చోరీ తతంగం కాసింత పక్కకు వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. అసలు ప్లాస్టిక్ సర్జరీతో మొత్తం మొహాన్ని మార్చుకోవడం సాధ్యమవుతుందా సినిమాల్లో చూపించినట్టు జరుగుతుందా ఒకవేళ సాధ్యమైతే ఎన్ని సర్జరీలు చేసుకోవాలి.ఏదేమైనా మున్ముందు సర్జరీలు అంటూ వచ్చే వారి అవసరం ఎంత ఉన్నా వారి వివరాలు ఏంటన్న దానిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే సమాజానికి చెడు చేసే దుర్మార్గులకు ఇలాంటి సర్జరీలు కలిసి వచ్చేలా మారుతుండటం మరింత ఇబ్బందికర పరిణామాలకు దారితీసే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈ సర్జరీ కారణంగా పోలీసులను ముప్ప తిప్పలు పడుతున్నారనే విషయం వెల్లడవుతోంది.

BJP MP Sujana Chowdary Participated in Gandhi Sankalp Yatra

'గాంధీ సంకల్ప' యాత్రను ప్రారంభించిన సుజనా...

  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 'గాంధీ సంకల్ప' యాత్రలో ఎంపీ సుజనా చౌదరి పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు సుజనా మరియు ఇతర నేతలు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సాయంత్రం వరకు పాద యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ.. ఈ యాత్రను ప్రారంభంచడం తనకు గర్వకారణమని వెల్లడించారు.ప్రతి ఏటా అక్టోబర్ రెండున అనేక సంవత్సరాల నుంచి మనం గాంధీ జయంతిని జరుపుకుంటున్నాం అని అయితే ఈ సారి నరేంద్ర మోడీ గారు గాంధీ సంకల్ప యాత్రగా పెట్టటానికి కారణం నూట యాభైవ సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రతి ఒక్క ప్రజానాయకుని ఒక నూట యాభై కిలో మీటర్లు పాద యాత్ర చేసి ప్రజల యొక్క కష్టనష్టాలు తెలుసుకోమని ఆయన ఆదేశించడం కోసమే ఈ యాత్రను మొదలుపెట్టినట్లు సుజనా వ్యాఖ్యానించారు.  ఇరవైవ శతాబ్దంలో గాంధీ గారి యొక్క అహింసావాదం, సత్యాగ్రహంతో ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం అంటే ఏమిటని తెలియపరిచారు. ఇరవై ఒకటవ సంవత్సంలో తమ  ప్రియతమ నాయకుడు అయిన నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలన్నిటికీ ప్రపంచ నాయకుడై ఈ మధ్య అమెరికా హ్యూస్టన్ నగరంలో జరిగిన మీటింగ్ సందర్భంగా అందరికీ తెలియడం కూడా జరిగింది. అయితే ఈ రోజు గాంధీగారు అనేకమైనవి చెప్పారు, ముఖ్యంగా అన్ని జన్మలోకన్నా మానవ జన్మ ఎంత గొప్ప జన్మ, మానవ జన్మగా పుట్టినందుకు మానవత్వాన్ని మరిచిపోకండి.  అందరు మానవులను కూడా సమానంగా చూడండి. తన, మన, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా, సెక్యులర్ భావాలతో ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా జీవించాలని ఆయన కోరిక. భారతదేశంలో ముఖ్యంగా అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ అంటే పంచాయతీ వ్యవస్థలోకి అధికారాలివ్వాలని చెప్పి ఆయన ముఖ్య ఉద్దేశం. అట్లాగే ప్లాస్టిక్ ను వాడకూడదని ఆరోజుల్లోనే ఆయన చెప్పారు. ఇప్పుడు డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్లీ అదే విషయం మాట్లాడతా ఉన్నాము. అది కాకుండా గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల్లోనే ప్రతి ఒక్కరిని కూడా వృత్తిధర్మంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎంపీ సుజనా చౌదరి తెలియజేశారు.  

TSRTC employees approach High Court for Septemeber salaries

ఆర్టీసీ కార్మికుల కేసును రేపటికి వాయిదా వేసిన హైకోర్ట్...

  తెలంగాణలో ఎటు చూసిన ఆర్టీసీ సమ్మె పై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి.ఈ సమ్మె పై అనేక విచారణలు కూడా చేపడుతున్నారు నేతలు.అటు ప్రభుత్వ మొండి వైఖరి ఒక రకంగా ఉంటే ఇటు ఆర్టీసీ నేతల చర్యలు కూడా అలానే తగ్గేది లేదు అన్నట్లు తయారవుతోంది.ఇందు మూలంగా ఆర్టీసీ నేతలు ఇప్పటికి తమ నెల జీతాలను అందుకోలేదు. ఈ చర్యల కారణంగానే ఆర్టీసీ కార్మీకులు కోర్టులో కేసు వేశారు.ఆర్టీసీ కార్మికుల జీతాలకు సంబంధించిన విచారణ రేపటికి వాయిదా పడింది. ఒక వైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె ఒక వైపు కొనసాగుతుంది. మరొకవైపు కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొంత ఆందోళన కలిగిస్తుంది. సెప్టెంబరు నెల మొత్తం జీతం ఇప్పటికి వారికి రాకపోవడం పట్ల ఆందోళనకు లోనవుతున్నారు ఆర్టీసీ కార్మికులు.  నెల రోజులు పని చేసిన తర్వాత కూడా జీతం రాకపోవడం సంబంధించి కార్మికులు హైకోర్టును ఈ రోజు ఆశ్రయించడం జరిగింది. ఇవాళ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఒక పిటీషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న పిటీషన్ వేసారు ఆర్టీసీ కార్మికులు. ముఖ్యంగా ఆర్టీసిలో సెప్టెంబర్ నెలలో పని చేసిన డబ్బులను అక్టోబర్ ఫస్ట్ కు చెల్లించాల్సిన జీతము ఇప్పటి వరకు కూడా చెల్లించనందు వలన ఈ రోజు కేసు వేయడం జరిగింది. ఈ రోజు జడ్జి గారి దగ్గరికి వాదనకు వెళ్లగా జడ్జి గారు ఈ కేసును రేపటికి వాయిదా వేశారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారమే చేసిన పనికి వెంటనే జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీతాలు ఆపటం అనేది చట్ట విరుద్ధం కాబట్టి ఈ విధానంపై హైకోర్టులో ఈ రోజు కేసు వేయగా జడ్జ్ ఈ కేసును రేపటికి వాయిదా వేశారు.జీతాల విషయంలో తమకు న్యాయం జరిగేలా చేయ్యాలని ఆందోళనను చేపడుతున్నారు కార్మికులు.

Telangana Governor Tamilisai To Meet With PM Modi and Amit Shah Over TSRTC Strike

ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రానుందా,చర్చలు సఫలం కానున్నాయా?

  ఆర్టీసీ సమ్మె అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి దాకా కార్మిక సంఘాల కార్యాచరణ, ప్రతిపక్ష పార్టీల మద్దతు, విద్యార్థి, ప్రజా సంఘాల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ సమ్మె ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఆరా తీయడంతో కథ మరో మలుపు తిరిగింది. ఆర్టీసీ జేఏసీ నేతలు నిన్న గవర్నర్ తమిళ సాయిని కలిసి సమ్మెకు సంబంధించిన వివరాలు అందజేశారు. వెంటనే ఢిల్లీ నుంచి గవర్నర్ కు పిలుపందింది. సమ్మె వివరాలతో వెంటనే ఢిల్లీకి రావాలంటూ కేంద్ర హోంశాఖ గవర్నర్ కి సందేశాన్ని పంపించింది. దీంతో గవర్నర్ తమిళ సాయి ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని మోదీ, సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో గవర్నర్ సమావేశం అవుతారు. ఆర్టీసీ సమ్మె, ఆత్మహత్యలూ రాష్ట్రంలోని పరిస్థితుల్నే గవర్నర్ కేంద్రానికి వివరించే అవకాశం కనిపిస్తోంది.  ఇటు ఆర్టీసీ సమ్మె సమస్యను పరిష్కరిస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆయన ఇవాళ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేకే ప్రగతి భవన్ కు బయల్దేరి వెళ్లనున్నారు. సమ్మెకు సంబంధించిన విషయాలపైనా ఆయన కేసీఆర్ తో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాను సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని తెలియజేశారు కేకే. ఇటు ఆర్టీసీ జేఏసీ కూడా కేకే మధ్యవర్తిత్వాన్ని అహ్వానించారు. దీంతో సీఎంతో భేటీ తర్వాత కేకే ఆర్టీసీ జేఏసీ నేతలతో కూడా మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్ట్, ఇటు ఆర్టీసీ సంఘాలు కూడా ఆత్మహత్యలపై కోర్టుకు నివేదిక ఇవ్వనున్నాయి .ఇటు సమ్మె, ప్రజల సమస్యల పై ఇవాళ మరో పిటిషన్ కూడా హై కోర్టులో దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.అసలు ఈ సమ్మే పై చర్చ సఫలం కానుందా లేదా అనేది వేచి చూడాలి.

Chandrayaan 2 Journey To Moon Show At Birla Planetarium

అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటున్న బిర్లా ప్లానిటోరియం...

  బిర్లా ప్లానిటోరియం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంత కాలం ఇమేజ్ షోస్ తో సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించి ఆకట్టుకున్న బిర్లా సైన్స్ సెంటర్ డిజిటలైజేషన్ లోకి మారిపోయింది. పరిశోధనాత్మక పద్ధతులో దూసుకుపోతోంది. భారత్ ను ప్రపంచ దేశాల సరసన నిలిపిన ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని గ్రాఫిక్ పద్ధతిలో ప్రదర్శించింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ ఆధునిక పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఆకాశం, నక్షత్రాలు, రోదసీ, గ్రహణాలపై సైంటిఫిక్ కోణంలో విశ్లేషిస్తూ భావిభారత తరాలకు విజ్ఞానాన్ని పంచుతుంది బిర్లా ప్లానిటోరియం. ఖగోళంలో జరిగే మార్పుల్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ అన్ని వయసుల వారికి సైన్స్ పై ఆసక్తి పెంచుతోంది. వివిధ భాషల్లో వివరిస్తూ చూపించే విజువల్స్ బిర్లా ప్లానిటోరియంకి దేశ వ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక ముందు చంద్రయాన్ లాంటి ఉపగ్రహ ప్రయోగాల్ని డిజిటల్ రూపంలో మరింత నూతనంగా అదిస్తోంది బిర్లా ప్లానిటోరియం. గతంలో కేవలం ఫొటోల సాయంతో చూపించి సైన్స్ పై ఆసక్తిని పెంచేది, ఇప్పుడు విజువలైజేషన్ లో వచ్చిన మార్పుల్ని అందిపుచ్చుకుంది ప్లానిటోరియం. పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ ఆధునిక పద్ధతిలో డిజిటలైజేషన్ ను ఇవన్ సన్ సదరన్ లాండ్స్ యూయస్ఏ నిర్మించిన పవర్ ఫుల్ డిజిటల్ సిస్టమ్ ను బిర్లా ప్లానిటోరియం నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. విక్రమ్ లాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుత క్షణాలని డిజిటలైజేషన్ ద్వారా ప్రదర్శించాయి, చంద్రయాన్-2 ప్రయోగం తొలి నుంచి చంద్రుడిపై దిగే చివరి దృశ్యం హోవరింగ్ స్టేజ్ అని అంతిమ దశ వరకు ఇందులో పొందుపర్చారు. నలభై ఐదు నిమిషాల పరిశోధనాత్మక డిజిటలైజేషన్ చంద్రయాన్-2 షోను తెలంగాణ గవర్నర్ తమిళ సాయి సౌందర్ రాజన్ ప్రారంభించారు. చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి డిజిటల్ ప్రోగ్రాం కళ్లకు కట్టినట్టుగా చూపించారని గవర్నర్ ప్రశంసించారు. పదిహేనేళ్లుగా తాము చేస్తున్న ఆలోచనలు ఈనాటికి కార్యరూపం దాల్చాయని బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ సిద్దార్థ తెలిపారు. ఇకపై రాబోయే రోజుల్లో డిజిటలైజేషన్ కు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారాయన. మొత్తం మీద ఇవాన్ సన్ సదరన్ లాండ్స్ యు.ఎస్.ఎ నిర్మించిన ఈ పవర్ ఫుల్ డిజిటల్ సిస్టమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్ని వయసుల వారినీ ఆకట్టుకునేలా నలభై ఐదు నిమిషాల షోను ప్రదర్శించారు.

software engineer commits suicide in hyderabad

బైపోలార్ డిజార్డర్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య...

  బైపోలార్ డిజార్డర్ అంటే మానసిక రుగ్మత. ఇది లక్షలు సంపాదించే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మతిస్థిమితం తప్పేలా చేసింది ఫలితం ఆత్మహత్య. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. గచ్చిబౌలి లోని అపార్ట్ మెంట్స్ నుంచి దూకి చనిపోయాడు రఘురామ్. విజయవాడ సత్యనారాయణ పురానికి చెందిన రఘురామ్ కొంత కాలం క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఇన్ఫోసిస్ లో టీమ్ లీడర్ గా మంచి స్థాయిలో ఉన్నాడు, అదే కంపెనీలో పని చేస్తున్న మరో టెక్కి శ్రీదేవితో ఎనిమిదేళ్ల క్రితం అతనికి పెళ్లయింది, ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. కొంత కాలంగా రఘురాం మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. బైపోలార్ డిజార్డర్ తో అతను బాధపడుతున్నాడనీ, అదే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని చెబుతున్నారు. భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సుమారు పది గంటలు సమయంలో మంత్రి సెలెస్టా బిల్డింగ్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు భార్య ఇచ్చిన సమాచారం ఏంటంటే.. పెళ్లి జరిగక ముందు నుంచే ఇతను బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నాడని, ఆ డిజార్డర్ కి ఆశా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలియజేసింది. అనేకసార్లు కూడా తాను ఆత్మహత్య చేసుకుంటానని అంటే ఆమె కూడా అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి చికిత్స కొనసాగుతున్నది అని ఆత్మహత్యకు ముందు రోజు తాను చనిపోతానని చెప్తే భార్య బాగా ఏడవటం జరిగిందని, ఏడుస్తుంటే లేదు ఊరికే అన్నాను అని అన్నాడని, ఆ క్రమం లో నిన్న ఇద్దరు ఉద్యోగానికి వచ్చిన తర్వాత పనిలో ఉండగా 10 గంటల సమయంలో భార్య ఫోన్ చేస్తే తాను బయటకెళ్ళి టీ తాగి వస్తా అని చెప్పాడని కానీ, అలా బయటకు వచ్చి పక్కన ఉన్నటువంటి మంత్రి సెలెస్టా బిల్డింగ్స్ లోని పై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి దూకి చనిపోయాడు అని పోలీసులకు రఘురాం భార్య తెలిపింది.

5 killed after bus falls into gorge in Andhra Pradesh

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం...

  తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటక బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో వాల్మీకి కొండ వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాదు నుంచి భద్రాచలం మీదుగా వాళ్ళందరూ కూడా మారేడుమిల్లి విహార యాత్రకు వెళ్తున్నారు. విహారయాత్రకు వెళ్తుండగా చింతూరు దగ్గర నుంచి ఘాట్ రోడ్ లో వస్తూ మలుపు తిప్పుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడం జరిగింది. లోయలో పడిపోయిన ఘటనలో ఇప్పటివరకూ ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు మరియు ఇరవై మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్ళందరినీ కూడా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకా బస్సులో ఎవరైనా ఉన్నారా అనేది వివరాలు తెలియాల్సి ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఘటనా స్థలానికి చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. రంపచోడవరం నుంచి ఘటనా స్థలానికి చేరుకోవటానికి మొత్తం సుమారు గంటన్నర సమయం పట్టవచ్చు, అయితే ఐటిడీఐ వారందరూ కూడా అడ్డతీగల ప్రాంతంలో ఈరోజు రైతు భరోసా కార్యక్రమంలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు వారందరూ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  బస్సుని బయటకి తీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఆ బస్సులో కాని బస్సు కింద గాని ఎవరైనా ఉన్నారా అని ప్రయాణికులు ఎంతమంది ప్రయాణించారు అనేది తెలియాల్సి ఉంది.  

Man eating tiger in Karnataka forest traced and captured

'ఆపరేషన్ బిగ్ టైగర్' సఫలం... సంతోషంలో గ్రామ ప్రజలు

  872 కిలో మీటర్లు విస్తరించి ఉన్న బందిపూర్ టైగర్ రిజర్వులో పెద్దపులి టెర్రర్ సృష్టించింది.ప్రజలను నిద్ర లేకుండా చేసి ఊరంత భయబ్రాంతులకు గురి చేసింది.ఎట్టకేలకు ఆపరేషన్ బిగ్ టైగర్ సక్సెస్ అయింది. ఇద్దరు గ్రామస్థులను  పధ్ధెనిమిది పశువులను పొట్టబెట్టుకున్న రాక్షస పులిని ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు బంధించారు. కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.  కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో హడలెత్తించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. ఇద్దరు గ్రామస్థులతో పాటు పధ్ధెనిమిది పశువుల్ని పొట్టనబెటుకున్న ఈ పెద్దపులి కోసం ఫారెస్టు అధికారులు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టారు. స్థానిక గిరిజనుల సహకారంతో ఈ పులిని ఎట్టకేలకూ బందించారు. అధికారులు పులిని పట్టుకోడానికి ఏకంగా ఆరు ఏనుగుల్ని ఓ వేటకుక్కను ఉపయోగించారు. మనుషులు పశువుల రక్తాన్ని రుచిమరిగిన ఈ రాక్షస పెద్దపులిని బందించటానికి గత ఐదు రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. ఓ పొదలో నక్కిన పులిని వేటకుక్కతో పాటు రెండు ఏనుగులు గుర్తించాయి.  మనిషి రక్తం రుచిమరిగిన పులిని చంపేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఫారెస్టు అధికారులు వారికి నచ్చజెప్పారు. మత్తుమందు ప్రయోగించి పెద్దపులిని బందించారు. మత్తుమందుకి కూడా తొలుత పెద్దపులి లొంగలేదు. ఇంకో పొదలోకి వెళ్లింది. అయితే పులినక్కిన పొదలను స్థానిక స్థులిజ గిరిజనులు గుర్తించి వలలో బంధించారు. ఆ తరువాత పెద్ద పులిని మైసూర్ జూ కు తరలించారు.  చివరకు దాన్ని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపులి జాడను గుర్తించడానికి అటవీ శాఖాధికారులు డ్రోన్ లు కూడా ఉపయోగించారు. డ్రోన్ కెమెరాలు పులి కదలికల్ని పసిగట్టాయి. వందలాది మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. చివరకు ఆపరేషన్ సక్సెస్ కావడంతో స్థానికులు, గిరిజనులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

'విదేశాలల్లో తక్కువ ఖర్చుతో విద్య' అనే పేరుతో మోసాలకు పాల్పడుతున్న కొన్ని సంస్థలు...

  చదువులు రోజురోజుకు వ్యాపారమవుతున్నాయి. తమ పిల్లల భవిష్యత్తు కోసం పొట్ట కట్టుకుని మరి తల్లి దండ్రులు పిల్లలకు చదువులు చెప్పిస్తుంటారు.కానీ చదువుల పేరుతో రోజురోజుకు మోసాలు జరుతున్న సంఖ్య కూడా ఎక్కువగా మారుతోంది అనడంలో ఆశ్చర్యంలేదు. "మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా అయితే మీరు సరైన చోటే ఉన్నారు. విదేశాల్లో తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య పూర్తి చేయిస్తాం" అంటూ వచ్చే వాణిజ్య ప్రకటనల్లో రోజురోజుకు మోసాలు ఎక్కువవుతున్నాయి. కొన్ని సంస్థలు విద్యార్థులను ఆకర్షించేందుకు కలర్ ఫుల్ కరపత్రాలతో మార్కెట్ లోకి దూసుకెళ్తున్న వైనంగా మారింది. మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టు కొన్ని సంస్థలు చేస్తున్న ప్రకటనలు నిజమో కాదో తెలుసుకోకుండానే విద్యార్థులూ వారి తల్లిదండ్రులూ మోసపోతున్నారు. తాజాగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు సీట్లు ఇప్పిస్తామని చెప్పి ఓ సంస్థ భారీగా డబ్బులు దండుకొని మొహం చాటేసిన సంఘటన విశాఖలో చోటుచేసుకుంది.స్థానిక రాంనగర్ లో ఆక్యురేట్ సిల్వర్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అసెట్ పేరుతో ఓ సంస్థ నిర్వహిస్తూన్నారు. ఎంబిబియస్, ఇంజనీరింగ్ చదివేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్ధులకు ప్రకటనలతో ఎరవేసినా అసెట్ సంస్థ మాయ మాటలతో విద్యార్ధులను ట్రాప్ చేస్తోంది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్, చైనాలో ఎంబీబీఎస్ అంటూ ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేసింది. విశాఖకు చెందిన ఆర్ఎన్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కోసం లక్షన్నర, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మరో విద్యార్థి ఎంబీబీఎస్ సీటు కోసం మూడు లక్షలు చెల్లించారు.  ఫీజులు తీసుకోని అడ్మిషన్ ఖరారైందని నమ్మించిన అసెట్ సంస్థ వీరిని సెప్టెంబర్ ఇరవై ఒకటిన విదేశాలకూ ప్రయాణం అని చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే ఇవాళ రేపు అంటూ అసెట్ సంస్థ ప్రతినిధులు ఆలస్యం చేయడంతో విద్యార్థులు వారిని నిలదీశారు. చివరకు షెల్టర్ తీసుకున్న హోటల్ కు సంస్థ ప్రతినిధులు బిల్లు చెల్లించక పోవడంతో అక్కడే ఇరుక్కుపోయారు. విద్యార్ధులకు ఏం చేయాలో తోచక ఏపీ భవన్ కు ఫోన్ లో సంప్రదించారు. వారి సహకారంతో ఎలాగోలా బయట పడిన విద్యార్థులు వాట్సప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అసెట్ నిర్వహకురాలు సూర్యకుమారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సర్టిఫికెట్ లతో పాటు తాము చెల్లించిన మొత్తాన్ని తమకు ఇప్పించాలని బాధిత విద్యార్థులూ వారి తల్లిదండ్రులూ కోరుతున్నారు. తమ లాగా మరెవరూ మోసపోకుండా చూడాలని తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.  

ఆర్టీసీ సమ్మె చివరకి ఇంత ఉద్రిక్తంగా మారడానికి కారణం ఏమిటి?

తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఉడుం పట్టుతో ఉన్నారు. తమను దిక్కరించి చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తారా, ప్రజలు నలిగిపోతున్నారని అంటూ ప్రభుత్వం మండిపడుతోంది.ఆర్టీసిలో ఈ స్థాయి పరిస్థితి రావటానికి చాలా కారణాలే ఉన్నాయి. సమస్యలను మొదటి నుంచి సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఆర్టీసీ, ప్రభుత్వం ఎవరికి వారే తమ లాభం చూసుకోవటం తప్ప దీర్ఘకాల ప్రణాళికలు లేకపోవటంతోనే పరిస్థితి ఇంత వరకూ వచ్చింది. ఆర్టీసీకి మూడు వేల కోట్ల అప్పు, యాభై వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. మరి ఈ సమస్య పరిష్కారం అసాధ్యమా లేక  సమ్మె కొనసాగుతుందా ఏం జరుగుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది . డిమాండ్ లు నెరవేర్చే వరకు వెనక్కు తగ్గేది లేదంటున్నాయి కార్మిక సంఘాలు. ఏం చేయాలి ఏం చేస్తే సమస్య పరిష్కారమవుతుంది, బాకీలు ఎలా తీరుతాయి అన్న విషయాల పై దృష్టి పెట్టకుండా కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అంటోంది ప్రభుత్వం.దీనితో పోరాటం ఉధృతమవుతోంది.  దీనంతటికి కారణం ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య ఆర్థిక క్రమశిక్షణ లోపించటమే. రాయితీలు ఇస్తూ వాటినీ అలాగే వాయిదా పెట్టుకుంటూ డీజిల్ పై వ్యాట్ ను బాదుతూ ఇలా ఎక్కడికక్కడ లోటు పెరుగుతోంది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నట్లు ఆర్టీసీ సమస్యలకు అన్నే కారణాలున్నాయి. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థనే అయిన ఆర్థిక క్రమశిక్షణ లేక పోవడం కొత్తగా ఆలోచించక పోవటంతోనే సమస్యలు పెరిగాయి. ఆర్టీసీ సేవలను వాడుకుంటున్న ప్రభుత్వం ఆ స్థాయిలో తిరిగి చెల్లింపులు చేయకపోవడం ఈ స్థాయి కష్టాలకు కారణం. నిజానికి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఆర్టీసీ మంచి లాభాల్లోకి వెళుతుంది. ఆర్టీసీకి ఇప్పుడున్న లెక్కల ప్రకారం మూడు వేల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అయితే అదే ఆర్టీసీకి యాభై వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆ స్థాయి సంస్థకు ప్రభుత్వం తలచుకుంటే మూడు వేల కోట్ల అప్పు ఒక లెక్క కూడా కాదు. సమ్మెకు వెళ్లడమంటే ధిక్కారమే అని ప్రభుత్వం అనుకుంటోంది. జీతాలు కాదు, సంస్థ మనుగడ కోసమే ఇరవై ఆరు డిమాండ్ లు పెట్టామంటున్నారు కార్మికులు. ఆర్టీసీకి ఐదు వందల కోట్ల బస్ భవన్ ఉంది. తొంభై ఏడు బస్ డిపోలు ఉన్నాయి. మొత్తం మూడు వందల అరవై నాలుగు బస్ స్టేషన్ లు పది వేల బస్సులు ఉన్నాయి. పధ్నాలుగు దవాఖానాలు, రెండు జోనల్ వర్క్ షాప్ లు, ఒక బస్ బిల్డింగ్ యూనిట్, రెండు టైర్ రీట్రేడింగ్ సెంటర్ లు, ఒక ప్రింటింగ్ ప్రెస్ లేక ఆర్టీసీ బస్సుల తిరుగుతున్నాయా అన్న కోణంలో పరిశీలిస్తే ఒక ప్రింటింగ్ ప్రెస్, ఒక ట్రాన్స్ పోర్ట్ అకాడమీ ఉంది. ఒక్కో డిపో సుమారు పది ఎకరాల విశాల స్థలంలో ఉంటుంది. బస్ స్టేషన్ లు రెండు నుంచి నాలుగు ఎకరాల్లో ఉంటాయి. సుమారు ఐదు వందల కోట్ల విలువ చేసే బస్ భవన్, అంతే విలువ చేసే ఎండి ఆఫీస్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ముషీరాబాద్ లో ఉన్నాయి. ముషీరాబాద్ ఒకటి, రెండు, మూడు డిపోలతో పాటు ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు పదెకరాల విస్తీర్ణంలో ఉంటాయి. అంటే కేవలం ఒక్కచోటే ఆర్టీసీకి పదిహేను వందల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. వీటికి దగ్గర్లోని రెండెకరాల్లో ఆర్టీసీ కళ్యాణ మండపం కూడా ఉంది. తార్నాకలో విశాలమైన కార్పొరేట్ తరహా హాస్పిటల్ ఉంది. విశాలమైన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ లో గోషా మహల్ డోమ్ ఆర్టీసీ విలువైన స్థలాలలో ముఖ్యమైనవి. వీటితో పాటు కరీంనగర్, వరంగల్ పలు జిల్లాల్లో కీలకమైన ప్రాంతాల్లో అన్నీ కలిపి యాభై వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయి. రాష్ట్రంలో రోజూ దాదాపుగా కోటి మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో రెండు వేల వరకు అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఇవన్నీ లాభాల్లోనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులే నష్టాల్లో ఉన్నాయి. లాభాలు వచ్చే మార్గాల్లో అద్దె బస్సుల తిరుగుతున్నాయా లేక ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయా అన్న కోణంలో పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. అయితే పల్లె వెలుగు బస్సులలో అంతగా లాభాలు రాకపోయినా అన్ని ప్రాంతాలకు బస్సులు తిప్పాలన్న ఉద్దేశంతో ఈ ట్రిప్పులు కొనసాగుతున్నాయి, వాటితోనూ నష్టాలు వస్తున్నాయి. ఆర్టీసీ అప్పులు మూడు వేల రెండు వందల కోట్లు ఉంది. పేరుకు పోయిన నష్టాలు మరో మూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లు ఉన్నట్లు తేలింది. ఇంత భారీ ఎత్తున ఆస్తులున్న సంస్థకు అప్పు పది శాతం లోపే, ఆర్టీసీలో ఏటా ఐదు నుంచి పది శాతం బస్సులకూ కాలం తీరిపోతుంది. ఆర్టీసీని లాభాల్లోకి తేవాలంటే చాలా మార్గాలున్నాయి అంటున్నాయి కార్మిక సంఘాలు కానీ వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ అప్పులపై వడ్డీ, జీతాల చెల్లింపు కొత్త బస్సుల కొనుగోలు భారంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీలో ప్రైవేట్ కు పార్ట్ నర్ షిప్ కల్పిస్తేనే లాభముంటుందని వాదిస్తుంది. ఈ వ్యాపారం అంతా అక్కడికి తరలి పోయి, అది కొత్త వాణిజ్య కేంద్రంగా మారుతోంది. ఇంతటి కమర్షియల్ యాక్టివిటీకి కేంద్రంగా ఉన్న బస్టాండ్ ల ఆస్తి విలువ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆర్టీసీ యాజమాన్యం ఈ విషయాన్ని గుర్తించి కొన్ని బస్టాండ్ లను కమర్షియల్ అవసరాలకు తగ్గట్లు అద్దెలు వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేశాయి. టెండర్ల ద్వారా ఈ షాపులను వ్యాపారులకు కేటాయిస్తున్నారు. చెప్పాలంటే ఆర్టీసీకి ఇప్పుడు ఉన్నది పెద్ద సమస్యనే కాదు, పరిష్కరించుకునే విషయాన్ని పక్కన పెట్టి దేనికైనా రెడీ అంటూ ఉండటమే సమస్యను పెంచుతుంది. నిజానికి ఈ నెల ఐదు నుంచి సమ్మె జరగడానికి ముందు ప్రభుత్వం రవాణా శాఖ మంత్రితో చర్చలకు ఆహ్వానించిన, హామీ ఇచ్చినా వెనక్కు తగ్గే పరిస్థితి ఉండేదంటున్నారు కార్మికులు. కానీ అధికారుల కమిటీ చర్చలతో ఏదీ జరగదని నిర్ధారించుకున్నాకే సమ్మెకు వెళ్లామని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు .ఇప్పుడు ఈ సమ్మే ఆర్టీసీ వారి జీవితాలపై ఎలాంటి మార్పులు చేబడుతోందో వేచి చూడాలి.

రైతు భరోసా కార్యక్రమంలో మాట్లాడిన జగన్...

నేటి నుంచి రైతు భరోసా పథకం అమలు, ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రైతు భరోసాను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పది సంవత్సరాల తరువాత సోమసిల నీటితో కళకళలాడుతుందని, జగన్ ఒక రైతు బిడ్డగా నెల్లూరుకి వచ్చానని అన్నారు. దేశంలోనే రైతులకు అత్యధికంగా సాయం అందించే పథకం రైతు భరోసా పథకం అని తెలిపారు. కాసేపట్లోనే రైతు భరోసా సొమ్ము కౌలు రైతుల ఖాతాలో జమ అవుతుందని అన్నారు. ఈ పథకం రైతులకు అందించటం తన అదృష్టంగా భావిస్తున్నా అని సిఎం జగన్ అన్నారు. ఎన్నికల ముందు తన పాదయాత్ర సమయంలో గ్రామ గ్రామాన రైతుల ఆవేదనను చూశానని, వర్షాలు లేక రైతులు అల్లాడిన రోజులు చూశానని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నా అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఎనిమిది నెలల ముందే రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తున్నామని సగర్వంగా తెలియజేశామని రైతు భరోసా కార్యక్రమంలో సిఎం జగన్ పేర్కొన్నారు. ఎంత మంది రైతులు ఉన్నారో వారందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో దాదపు యాభై ఒక్క లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం అని తెలిపారు. ప్రస్తుతానికి తొమ్మిది వేల రూపాయలు అకౌంట్లో పడతాయని సంక్రాంతి సమయానికి రెండు వేల రూపాయలు ఖాతాలో పడతాయని జగన్ అన్నారు.

తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు... మేఘాలో ఐటీకి దొరికిన ఆధారాలు...!

  మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో అనేక రహస్యాలు బట్టబయలవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యనేత కోసం ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో మేఘా జరిపిన ఆర్ధిక లావాదేవీల గుట్టురట్టవగా, ఇప్పుడు మరో సంచలన రహస్యం బయటికొచ్చింది. ప్రైవేటీకరణ కాకుండా ఆర్టీసీని కాపాడుకోవడానికే సమ్మె దిగామంటోన్న కార్మికుల మాటలను నిజం చేస్తూ ఆధారాలు దొరికాయి. మేఘా కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రణాళికల వివరాలు దొరికినట్లు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాల మేరకు, ఇప్పటికే టీఎస్ ఆర్టీసీలో కొంత భాగం మేఘా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఇంగ్లీష్ డైలీ విశ్లేషించింది. మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో గోల్డ్ స్టోన్ అండ్ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్ తయారీ కంపెనీకి సంబంధించిన పత్రాలు దొరికాయి. ప్రస్తుతం ఓలెక్ట్రాలో యాభై శాతం వాటా మేఘా కృష్ణారెడ్డికి, 38 శాతం గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు... మిగతాది పబ్లిక్ చేతుల్లో ఉంది. మేఘా కృష్ణారెడ్డి, గోల్డ్ స్టోన్ ప్రసాద్... కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు. ఇక, ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు... మియాపూర్ భూకుంభకోణంలో మారుమోగిపోయింది. ఇలాంటి బ్యాక్ గ్రౌండున్న ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ... 40 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తెలంగాణ ఆర్టీసీకి సరఫరా చేసింది. అయితే, ఈ ఒక్కో బస్సు ఖరీదు రెండు కోట్లు కాగా, ఇందులో ఒక కోటి రూపాయలను టీఎస్-ఆర్టీసీకి కేంద్రం సబ్సిడీ రూపంలో ఇచ్చింది. అయితే, ఈ సబ్సిడీ అమౌంట్ మొత్తం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి చేరాయి. బస్సులను అద్దెకిచ్చి కిరాయి వసూలు చేస్తోన్న... ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీ మనీ చేరినట్లు ఐటీకి ఆధారాలు లభించాయి. అయితే, త్వరలో 334 ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టును మేఘా కృష్ణారెడ్డి దక్కించుకోబోతున్నారు. అంటే ఈ 334 బస్సుల సబ్సిడీ అంటే 334 కోట్ల రూపాయలు కూడా ఒలెక్ట్రా  కంపెనీ ఖాతాలో పడనున్నాయి. వీటికి సంబంధించిన డాక్యుమెంటన్నీ ఐటీ అధికారుల చేతికి చిక్కాయి. దాంతో ఈ ఐటీ రైడ్స్ వ్యవహారం చివరికి ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోందని ఆ ఇంగ్లీష్ డైలీ కథనం ఇవ్వడం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.