పెట్టుబడిదారుల చేతుల్లోకి ఆర్టీసీ.! టీఎస్-ఆర్టీసీకి పొంచివున్న ప్రమాదం
posted on Oct 7, 2019 @ 12:01PM
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరింది. సర్కార్ మెట్టు దిగకపోవడం... కార్మికులు పట్టు డకపోవడంతో సమ్మె యధావిధిగా జరుగుతోంది. సర్కార్ హెచ్చరికలను కార్మికులు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో మూడోరోజు కూడా బస్సులు రోడ్డెక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
ఇక, ఇవాళ్టి నుంచి ఆందోళనలను ఉధృతం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరాహారదీక్షలకు యూనియన్ నేతలు సిద్ధమవుతున్నారు. అయితే, ఇందిరాపార్క్ ధర్నా దగ్గర ఎలాంటి దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు అక్కడ ఎలాంటి ఆందోళనలు చేపట్టినా అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా కుటుంబాలతో కలిసి నిరాహార దీక్షలు చేపట్టి తీరుతామని ఆర్టీసీ యూనియన్ నేతలు అంటున్నారు. అలాగే, అన్ని డిపోల ముందు కుటుంబాలతో కలిసి నిరసన తెలుపుతామని జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి తెలిపారు. అలాగే, అద్దె బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని... ప్రజారవాణాను కాపాడుకోవడానికే సమ్మె చేస్తున్నామన్న అశ్వద్ధామరెడ్డి అన్నారు.