ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేస్తారా? కేసీఆర్ తన వాళ్లకు కట్టబెడతారా?

 

కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం దోచుకోవాలని ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాల జేఏసీ ఆరోపించింది. కార్మికుల డిమాండ్లపై చిన్నచూపు చూస్తూ ప్రభుత్వం కావాలనే... ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాలు, అఖిలపక్ష నేతలు.... కేసీఆర్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఆర్టీసీని మూసివేసేందుకు సర్కారు కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. 

ఇక, ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకు అన్ని విపక్షాల నుంచి మద్దతు లభించింది. ఆర్టీసీని ప్రైవేటుపరంచేసి తనకు కావాల్సిన వాళ్లకు అప్పగించేందుకు చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆర్టీసీ కార్మిక సంఘాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న భట్టివిక్రమార్క... వాళ్ల న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిందేనన్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి... తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, అంతేకానీ బెదిరింపులకు దిగడం సరికాదని అన్నారు.

Teluguone gnews banner