ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేరులం కాదు

 

ప్రభుత్వ బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడే ప్రసక్తే లేదని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేసారు. తమ సమ్మె న్యాయసమ్మతమే అని తెలిపారు. తాము ఈ విషయంపై న్యాయ సలహా తీసుకున్నామని, సమ్మె న్యాయబద్ధమేనని సలహా చెప్పారని అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చెప్పారు. సీఎం ప్రకటనలకు భయపడేది లేదని, సమ్మె చేస్తున్న వారిలో నలుగురిని కూడా డిస్మిస్ చేసే పరిస్థితి లేదని అన్నారు. జీతాలివ్వకపోతే దిగొస్తారనుకోవడం ప్రభుత్వ అమాయకత్వమే అవుతుందన్నారు. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అందరికీ తెలుసన్న ఆయన.. ప్రజలకు కోపం సర్కారు మీదే కానీ తమ మీద కాదన్నారు. 

ఉద్యమాలతో సీఎం అయ్యి, ఉద్యమాలను అణచివేసే సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన.. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు తీసివేయడానికి ఆయన ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేరులం కాదన్నారు. తమకు 50 వేల జీతమంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసీని ఇతర రాష్ట్రాల రవాణా వ్యవస్థతో పోల్చడం కాదు... ఏపీఎస్‌ఆర్టీసీతో పోల్చాలని సూచించారు. తమ భవిష్యత్ కార్యాచరణ బుధవారం ప్రకటిస్తామని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు.

Teluguone gnews banner