సగటున ప్రతి ఆర్టీసీ కార్మికుడికి 50వేల జీతం... ఇంకా పెంచమని ఎలా అడుగుతారు?
posted on Oct 7, 2019 @ 11:50AM
మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీనే లేదని.... ఇక, బీహార్, ఒడిషా, జమ్మూకశ్మర్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కేవలం నామమాత్రంగా బస్సులను నడుపుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోనే కర్నాటక తర్వాత అత్యధిక బస్సులను నడుపుతున్నది తెలంగాణ మాత్రమేనన్నారు. దాదాపు 11వేల బస్సుల్లో ప్రతిరోజూ సుమారు కోటి మంది ప్రయాణిస్తున్నారని, ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే, కార్మికులు ఇలా సమ్మెకు దిగడం సరికాదన్నారు. ఏటా 12వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుంటే ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే ఉన్నామని, పైగా హైదరాబాద్లో ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరిస్తోందని, అంతేకాకుండా సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు 50వేల రూపాయల జీతం అందుతుండగా, ఇంకా పెంచమని అడగడంలో అర్ధం లేదన్నారు కేసీఆర్. యూనియన్ల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదన్న కేసీఆర్.... ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లోనూ విలీనంచేసే ప్రసక్తే లేదన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న విపక్షాల ప్రతిపాదనను కేసీఆర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు అసలు ఆర్టీసీ విలీనంపై మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అంటూ ప్రశ్నించారు.