రంగు పడుద్ది... అన్ని పార్టీలది అదే పైత్యం
"ఏ పార్టీ తీరు చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని పార్టీలది అదే పైత్యం" అన్నట్టుంది ప్రస్తుత రాజకీయ పార్టీల పరిస్థితి. పేర్లు వేరు కానీ దాదాపు అన్ని పార్టీలది అదే తీరు. చివరికి ఓట్లేసి గెలిపించిన మనమే పెట్టాలి కన్నీరు.
ఆర్టీసీ బస్సులో సీటు కోసం కర్చీఫ్ వేస్తుంటాం. ఎందుకు? కాసేపు ఆ సీటులో కూర్చొని ప్రయాణం చేయాలని. మనకి తెలుసు ఆ సీటు శాశ్వతం కాదని. అయినా సీటు కోసం పోటీ పడతాం. కర్చీఫ్ వేసి సీటులో కూర్చొని ప్రయాణం చేస్తాం.. స్టాప్ రాగానే దిగిపోతాం. తర్వాత ఎవరో వచ్చి ఆ సీట్లో కూర్చుంటారు. అయినా ఆ కాసేపు కూర్చోవడం కోసం మనం కర్చీఫ్ వేయడం మానం, పక్కన వాళ్ళతో గొడవ పడటం మానం.
"ఆర్టీసీ బస్సులో సీటు కోసం కర్చీఫ్".. ఇలాంటి కాన్సెప్ట్ నే రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. అధికారం శాశ్వతం కాదని తెలిసినా తాము అధికారంలో ఉన్నంత కాలం.. తమ పార్టీ జెండా రంగులే రాష్ట్రమంతా కనిపించాలని రంగులతో నింపేస్తున్నారు. బస్సుల నుంచి భవనాల వరకు వేటిని వదలకుండా పార్టీ జెండా రంగులతో కప్పేస్తున్నారు. ఏ ఒక్క పార్టీనో కాదు.. అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీల తీరు ఇలాగే ఉంటోంది.
తెలుగు రాష్ట్రాలలో ఈ రంగుల పైత్యం ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ జెండా రంగు గులాబీ. ఇంకేముంది తెలంగాణ అంతా గులాబీ మయం. బస్సులు, భవనాలు, చివరికి గుళ్లకు కూడా ఈ మధ్య గులాబీ రంగు దర్శనమిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఏపీ సంగతి సరేసరి. అప్పుడు చంద్రబాబుది.. ఇప్పుడు వైఎస్ జగన్ ది ఇద్దరిది ఒకటే తీరు.
అన్నట్టు ఆఖరికి పుష్కారాల సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఈ రంగుల పిచ్చిని పక్కన పెట్టలేదు. నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ తీరాన అవతలి వైపు పుష్కర ఘాట్లకు పసుపు రంగు, ఇవతలి వైపు గులాబీ రంగు ఘాట్లు దర్శనమిచ్చాయి.
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చింది. గులాబీ రంగే కొనసాగుతోంది. కానీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా. అందుకే పసుపు రంగు పోయి వైసీపీ జెండా రంగులు దర్శనమిస్తున్నాయి. అసలే జగన్ మొదటి సారి సీఎం అయ్యారు. ఇంకేముంది రాష్ట్రాన్ని పార్టీ జెండా రంగులతో నింపేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, త్రాగునీటి బోర్లు, ఇతర భవనాలు, ఆఖరికి స్మశానాలు కూడా వేటిని వదలకుండా రంగులతో నింపేస్తున్నారు.
ఇంతటితో అయిపోలేదు.. సీఎం కూర్చునే కుర్చీల దగ్గర కూడా ఈ రంగుల గోలే. కేసీఆర్ కుర్చీలో గులాబీ టవల్, బాబు కుర్చీలో పసుపు టవల్, జగన్ కుర్చీలో తెలుపు టవల్ దర్శనమిస్తున్నాయి. ఇక సభలు ఏర్పాటు చేస్తే అవి కూడా పార్టీ రంగులతోనే నింపేస్తున్నారు. చుట్టూ కట్టే క్లాత్ నుంచి, డెకరేషన్ చేసే ఫ్లవర్స్ వరకు అన్నిట్లో పార్టీ జెండా రంగులు ఉండేలా చూసుకుంటున్నారు.
అసలు ఈ రంగుల వల్ల ఏంటి ప్రయోజనం?.. ప్రజాధనం వృధా తప్ప. అధికారంలోకి రాగానే రంగులతో నింపేస్తారు. మరో పార్టీ అధికారంలోకి రాగానే.. ఈ రంగులను ఆ రంగులు కప్పేస్తాయి. ఇలా భవనాల రంగులు మారడం తప్ప ప్రజల బ్రతుకులు మారడంలేదు. రంగులు వేసినంత మాత్రాన నాయకులు ప్రజలకు దగ్గర కారు. రంగులు వెలిసిపోయినట్టే ప్రజలు కూడా నాయకుల్ని మర్చిపోతారు. రంగులు వేయడం మానేసి భవిష్యత్తుకి బాటలు వేయండి. ప్రజలకు మంచి చేయండి. అప్పుడు మీరు రంగులు వేయకుండానే ప్రజలు మీ పార్టీకి అండగా ఉంటారు. మిమ్మల్ని, మీ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇది అన్ని రంగుల పార్టీలకు మేమిస్తున్న ఉచిత సలహా అనమాట.