women trafficking in telangana

నారాయణఖేడ్ ప్రాంతంలోని తండాలో అసలు ఏమి జరుగుతోంది?

  పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి అమ్మాయి రాత్రికి రాత్రే తల్లితండ్రులతో సహా మాయం అవ్వటం అనేది ఎవ్వరూ ఊహించని అనాగరిక గిరిజన తండాల్లో జరుగుతున్న అమానుష దందా ఇది. సంతలో పశువులను అమ్మినట్లుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా కాసులకు కక్కుర్తిపడి మానవ విలువల్ని మంటకలుపుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో అమాయక గిరిజన యువతులను అమ్మకానికి పెడుతున్న అమానుష దందా పై చేపట్టిన నిఘకు నిర్ఘాంతపోయే నిజాలు బయటకొస్తున్నాయి. నారాయణఖేడ్ ప్రాంతంలోని తండాల్లో నాలుగేళ్లుగా ఈ అమానుష దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు వెల్లడైంది.  అమాయక అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు కొందరు బద్మాష్ లు. డబ్బుల కోసం అమ్మాయిలను రాజస్థాన్ కు చెందిన దళారులను అమ్మేస్తున్నారు. ఈ అమానుష దందా వెనుక పెద్ద నెట్ వర్క్ ఉంది అంటున్నారు స్థానికులు. నారాయణఖేడ్ ప్రాంతంలోని కొన్ని గిరిజన తండాల్లో అమ్మాయిలూ అదృశ్యమవుతున్నారు. రాత్రికి రాత్రే అదృశ్యమవుతున్నారు. ఆ అమ్మాయిలతో పాటు రెండు రోజుల తరువాత తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అదృమవుతున్నారు. ఇదంతా ఎవరి చేస్తున్నారు ఎలా జరుగుతుందనే మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. కేవలం పధ్ధెనిమిది సంవత్సరాల నిండినటువంటి ప్రతి అమ్మాయినీ రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడున్న మధ్యవర్తులతో మాట్లాడి సుమారు పదిహేను లక్షలకు బేరం కుదుర్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు మాత్రం పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.అధికారులు వారి వద్దకు ఇలాంటి వ్యవహారాలు ఏమి తమ వద్దకు రాలేదని నిజంగా ఇలంటి విషయాలు జరిగితే కనుక తగిన చర్యలు తప్పక తీసుకుంటాం అని వెల్లడించారు.ఎదైతే జరుగుతుందో ఈ తండాలపైన వారికి ఒక ఎవైర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని,అలాగే పోలీసులతో పాటు ఉమెన్ వెల్ ఫేర్ సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతాము ఖచ్చితంగా ఈ దందాను అరికడతామంటూ ఎమ్మెల్యే చెప్తున్నారు.

At least 60 dead after fire on Pakistan passenger train

పాకిస్తాన్ రైలులో ఘోర ప్రమాదం, 60 మందికి పైగా మృతి

  పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు బోగీలు మంటల్లో చిక్కుకొని అరవై మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఘటన తీవ్రతను బట్టి మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. లాహోర్ నుంచి కరాచి వెళ్తున్న తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రహిమ్యార్ ఖాన్ సమీపం లోని లియాఖత్ పూర్ వద్దకు రాగానే మూడు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ఉదయం టిఫిన్ తయారీ కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెండు స్టవ్ లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. వంట కోసం సిద్ధంగా ఉంచుకున్న నూనెకు మంటలంటుకోవడంతో పరిస్థితి బీభత్సంగా మారిపోయింది. క్షణాల్లో మంటలు మూడు బోగీలను చుట్టుముట్టాయి. భయపడిపోయిన ప్రయాణికులు వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకేశారు. చనిపోయిన వారిలో అలా బయటికి దూకేసిన వారే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు, ఘటనలో కనీసం యాభై మంది దాకా తీవ్రంగా గాయ పడ్డారు. పాకిస్థాన్ లో రైలు ప్రమాదాలు సంభవించడం సర్వ సాధారణమైపోయింది, ఎప్పుడో బ్రిటిష్ పాలన కాలం నాటి రైలు వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. నిర్వహణ అస్తవ్యస్తం కారణంగా జరిగిన అనేక ప్రమాదాల్లో చాలా మంది ప్రయాణికులు చనిపోయారు. 2005 లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో నూట ముప్పై మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. పాకిస్థాన్ రైళ్లలో ప్రయాణికులు వంట చేసుకోవడానికి అనుమతి ఉంటుంది, అదే ఇప్పుడు ప్రయాణికులకు శాపంగా మారింది. వంట చేస్తున్న క్రమంలో మంటలు అంటుకుని పలువురి ప్రాణాలు తీసింది.

ACB raid on Sub Registrar office takes a new twist

అన్యాయాన్ని ఆపిన సీసీటీవీ ఫుటేజ్... 

  విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు తప్పటడుగు వేశారు. తమ మాట లెక్క చేయటం లేదని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ టి తారకేష్ ను అక్కడి నుంచి బదిలీ చేయించేందుకు వారు పన్నిన కుట్ర సీసీటీవీలో రికార్డ్ అవడంతో గుట్టురట్టయిది. ఈ నెల తొమ్మిదిన ఏసీబీ అధికారులు మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ రోజు రికార్డు రూమ్ లో డాక్యుమెంట్ రైటర్ల దగ్గర 1.05 లక్షల నగదు దొరికిందని విశాఖ ఏసీబీ డిఎస్పీ కె రంగరాజు ప్రకటించారు. తారకేశ్వర్ విధులను వదిలేసి మధ్యలో వెళ్లిపోతున్నారని తమ దగ్గర ఆధారాలున్నాయని కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ విషయాలన్నీ ఆ శాఖ ఉన్నతాధికారులకు పంపుతామని వారు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ రబీంద్రనాథ్ సెలవులో ఉండడంతో వారు ఊహించినట్టు జరగలేదు. దీంతో ఆయన రాగానే పదునాలుగవ తేదీన ఇద్దరు ఏసిబి అధికారులు డీఐజీ కార్యాలయానికి వెళ్లారు. తారకేష్ ను అక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. ఏసిబి అధికారులు ఎదురుగా కూర్చొని ఒత్తిడి చేయడంతో ఆయన తారకేష్ ను అప్పటికప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేశారు. తనకు జరిగిన అన్యాయం పై తారకేష్ నేరుగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు సుదీర్ఘ లేఖ రాశారు. ఏసిబి తనిఖీల రోజున కార్యాలయంలో సీసీ టీవీ ఫుటేజీని కూడా ఆ లేఖతో పంపించారు. దీంతో తారకేష్ ను బదిలీ చేయకూడదని డీఐజీ రవీంద్రనాథ్ ను మంత్రి ఆదేశించారు.అప్పటికే వార్తలు పత్రికల్లో వచ్చేశాయి. కానీ తారకేష్ ఆ కార్యాలయంలోనే ఇంకా పనిచేస్తుండటంతో ఏసీబీ అధికారులకు డాక్యుమెంట్ రైటర్ లకు మింగుడు పడడం లేదు. తారకేష్ దగ్గర భారీగా లంచం తీసుకొని బదిలీ ఆపేశారని కొంత మంది ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో మంత్రికి వాటా ఉందని ప్రచారం చేశారు. ఈ పంచాయతీ మొత్తం అమరావతికి చేరడంతో మంత్రి సీరియస్ అయ్యారు. డీఐజీ రవీంద్రనాథ్ కూడా ఏసీబీ అధికారులతో కుమ్మకైనట్లు భావించి ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆకస్మిక తనిఖీలకు వచ్చిన ఏసీబీ సీఐ గఫూర్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కార్యాలయంలోని సీసీ టీవీ కెమెరాలను ఆపేయించారు. అయితే అవి ట్వంటీ ఫోర్ భై సెవన్ రికార్డు కెమెరాలూ ఆపినా ఆగవు ఆ విషయం వారికి తెలియక రికార్డింగ్ అవ్వడం లేదనుకొని వారికి నచ్చినట్టు వ్యవహరించారు. సీఐ గఫూర్ బయటకు వెళ్లి అక్కడ డాక్యుమెంట్ రైటర్ నారాయణరావు దగ్గర డబ్బులు తీసుకువచ్చారు. రికార్డుల గదిలో నుంచి ఓ కానిస్టేబుల్ తీసుకొచ్చిన ఓ పుస్తకంలో ఆ డబ్బు పెట్టించారు. నారాయణరావు అవినీతి చలామని అవ్వట్లేదనే తారకేష్ పై ఇంత దారుణానికి పాల్పడ్డాడు నారాయణరావు.ఇక పై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పై అధికారులు అదేశించారు.

First Green Industrial Park Of India To Be Inaugurated In Telangana

'గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్' తో  కొత్త అధ్యాయానికి తెర లేపబోతున్న తెలంగాణ ప్రభుత్వం

  మరి కొన్ని గంటల్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. పారిశ్రామిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించటానికి అంతా సిద్ధం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి జిల్లాలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రారంభించనుంది. దీని ద్వారా రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. అంతేకాదు ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తోంది.  దేశంలో ఎక్కడా చిన్న పరిశ్రమలకు ప్రత్యేక పార్క్ లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న పంథాలో ఓ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తోంది. దీనికోసం హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పక్కన దండు మల్కాపురంలో కొండలను తొలిచి వందడుగుల అప్రోచ్ రోడ్డును నిర్మించారు. టీఫ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. పార్కుల అంతర్గత రోడ్లు, ఫుట్ పాత్లు ,డ్రైనేజీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రీన్ పార్క్ లో నాలుగు వందల కాలుష్యరహితమైన పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. ఎలక్ట్రోనిక్స్, వైమానిక, ఆహార శుద్ధి, డ్రిల్లింగ్ రక్షణ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులు తయారు కానున్నాయి. పార్క్ లో ఇరవై శాతం భూముల్లో హరితహారానికి కేటాయించారు. అలాగే పది వేల మంది కార్మికుల కోసం నూట ఇరవై ఎకరాల్లో అతిపెద్ద టౌన్ షిప్ ను నిర్మిస్తున్నారు. టీఎస్ఐఐసీ టిఫ్ సమన్వయంతో సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఈ గ్రీన్ పార్కు పనులను అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో ఏర్పాటవుతున్న ఈ గ్రీన్ పార్క్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి విడతగా పన్నెండు వందలు యాభై ఎకరాల్లో పనులు ప్రారంభించారు. మరో ఏడు వందల యాభై ఎకరాలు ప్రభుత్వం సేకరించనుంది. రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రీన్ పార్కు పనులను టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు ఎమ్మెల్సీ లు ఇంజనీర్ లు పరిశీలించారు. హైదరాబాద్ విజయవాడ హైవే పక్కనే పార్కు పైలాన్ ను ఏర్పాటు చేస్తున్నారు.  చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ గ్రీన్ పార్కును ఏర్పాటు చేస్తోందన్నారు బాలమల్లు.దండు మల్కాపురంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే తలమానికంగా ఉంటుంది అన్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. సిఎం కెసిఆర్ ఆర్థిక పారిశ్రామిక ప్రగతికి ఈ పార్క్ ముందుచూపు లాంటిది అని చెప్పారు. ఈ గ్రీన్ పార్కుతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చౌకగా స్థలం దొరుకుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో తమ కష్టాలు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.పారిశ్రామిక రంగాల్లో ఎదగాలనుకునే ఔత్సాహికులకు ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు కూడా ఈ పార్క్ దోహద పడుతుందనేది స్థానికుల వారి భావాలను వ్యక్తం చేశారు. మరి ఈ పార్క్ నిజంగానే వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపబోతోందో లేదో వేచి చూడాలి.  

Rising sea will sink Mumbai by 2050

2050 నాటికి ముంబై కనుమరుగు అవ్వనుందా?

  ఈ భూమి మీద మానవాళికి అణ్వాయుధాలు శత్రువు కాదు. పక్కనున్న పాకిస్తాను అంతరిక్షంలో ఉన్న ఏలియన్స్ తో ఎలాంటి ముప్పూ తెలియదు కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి త్వరలోనే తుడిచిపెట్టుకు పోయేలా కనిపిస్తోంది. తాజా పరిశోధనలు చేస్తున్న హెచ్చరికలు కొత్త భయాలకు కారణమవుతున్నాయి. గతంలో ఊహించిన దానికంటే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ తో మహా మహా నగరాలకు ముప్పు వాటిల్లనుందని చెబుతున్నాయి. ముంబై దేశ ఆర్ధిక రాజధాని, రెండు వేల యాభై తర్వాత ఈ నగరం కనిపించదు అంటోంది తాజా పరిశోధన. సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో రెండు వేల యాభై నాటికి ముంబయిలో చాలా భాగం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని చెబుతోంది.  న్యూజెర్సీకి చెందిన క్లైమేట్ సెంట్రల్ అని సైన్స్ ఆర్గనైజేషన్ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి న్యాచురల్ కమ్యునికేషన్స్ పేరుతో కథనం ప్రచురించింది. ఈ అధ్యయనం ప్రకారం సముద్ర మట్టాలు నానాటికి పెరుగుతుండటంతో రెండు వేల యాభై నాటికి నూట యాభై మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి హై టైడ్ లైన్ కిందకు కుంగే ప్రమాదముందని చెబుతోంది. ఇందులో మన ముంబై కూడా ఉంది. ముంబైలోని చాలా భాగం సముద్ర అలల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఈ అధ్యాయనం చెబుతోంది. కమర్షియల్ ప్రాంతాల్లో విస్తరించటం భవంతుల నిర్మాణాలే ఈ నగరానికి పెను ముప్పుగా చెబుతున్నారు. నిజానికి ఇప్పుడున్న ముంబై ప్రాంతమంతా ఒకప్పుడు దీపాల సమాహారం వాటన్నిటినీ కలిపి ముంబై నగరాన్ని నిర్మించారు. కానీ ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా విస్తరించాల్సిన నగరం ఇష్టారీతిన నిర్మాణాలతో ముప్పుకు దగ్గరగా వెళ్తుంది, రెండు వేల యాభై నాటికి ఇది పూర్తిగా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందంటున్నారు.  సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో రెండు వేల యాభై నాటికి తీర ప్రాంతాలు భూభాగంలోకి ఎలా చొచ్చుకుపోతాయి అనే అంశాలను ఈ అధ్యయనంలో పూర్తిగా వివరించారు. తాజా రీసెర్చ్ గత అంచనాలకు భిన్నంగా ఉండటం షాక్ కు గురి చేస్తున్నాయి. గతంలో ఇదే రెండు వేల యాభై లోపు ముంబై నగరం ఎలా ముంపుకు గురవుతుంది. తాజా అధ్యయనంలో పరిస్థితి ఎలా ఉందన్న దానిపై పూర్తిగా వివరించారు. అయితే ఇపుడు ముంపు శాతం గత అధ్యాయనం కంటే పెరగడమే ఆందోళనకు గురిచేస్తోంది. ముంబై మాత్రమే కాదు తీర ప్రాంతాల్లో ఉండే మహానగరాలకు ముప్పు తప్పదని ఈ రీసెర్చి చెపుతోంది.  ఇక దక్షిణ వియత్నాం అయితే పూర్తిగా రూపురేఖలు లేకుండా కనుమరుగయ్యే ప్రమాదముంది. అందుకే రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించాలంటున్న శాస్త్రవేత్తలు ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ అనేక అనర్థాలకు కారణమవుతుంది. చెట్లు నరికివేయడం కాలుష్యంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలతో నగరాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మహామహా నగరాలన్నీ సంద్రంలో కలిసిపోవడం ఖాయం అని సమాచారం. ప్రస్తుతం ఆర్ధిక కేంద్రాలుగా ఉన్న మహానగరాలు పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతాయి అని సమాచారం. షాంఘై, బ్యాంకాక్,బస్రాతో పాటు ప్రముఖ నగరాలన్నీ రెండు వేల యాభై తరవాత కనిపించే అవకాశం లేదంటున్నారు.ఇప్పటికైనా మేల్కోకపోతే వినాశనమే అని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

trs mlas opposing ministers visit in constituencies

తెలంగాణ మంత్రులు కేవలం వారి నియోజక వర్గానికే పరిమితమా?

  తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగి పూర్తిస్థాయి క్యాబినెట్ కొలువుదీరింది. అన్ని శాఖలకు మంత్రులొచ్చారు. తమ శాఖలకు సంబంధించిన పనులు చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. తమ శాఖలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా వీరు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గానికి అయినా వెళ్లి పర్యటించే అధికారము ఉంది. అయితే కొందరు మంత్రుల మాత్రం తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ మంత్రులకు ఏమైంది ఎందుకు అన్ని జిల్లాల్లో పర్యటించటం లేదు, ఏవైనా కారణాలున్నాయా అనే చర్చ జరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు వల్లే కొందరు మంత్రులు ఇతర నియోజక వర్గాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది.  మొన్న ఈ మధ్య ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ మంత్రి పక్కనే ఉన్న నియోజకవర్గానికి తరచూ వెళుతున్నారట. మంత్రి రాకను జీర్ణించుకోలేని ఆ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారట. తన కోపాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు గన్ మెన్లను వెనక్కి పంపించారట. అంతే కాకుండా పార్టీ నేతలకు అందుబాటులోకి రాకుండా అలకపాన్పు ఎక్కారట. దీంతో ఆ జిల్లా మంత్రి అటువైపు వెళ్లడం మానేశారు అని తెలుస్తోంది.  ఇక హైదరాబాద్ కు చెందిన మంత్రుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి తన కొడుకు, అల్లుడు భవిష్యత్ కోసం సిటీలోని నియోజక వర్గాల్లో జోరుగా టూర్లు వేస్తున్నారు. దీంతో లోకల్ ఎమ్మెల్యేలు మంత్రి గారి పర్యటనలకు బ్రేకులు వేశారట. దీంతో ఆ మంత్రి కూడా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆయన కూడా తన సర్కిల్ దాటడం లేదట.  సికింద్రాబాద్ మంత్రిగా పేరు పొందిన నేత కూడా వేరే జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు. కానీ సిటీలో మాత్రం వేరే నియోజక వర్గాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మాజీ మంత్రి మేయర్ తో వచ్చిన గ్యాప్ వల్లే ఆయన సిటీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ మంత్రి పరిస్థితి కూడా అలానే ఉంది. తన జిల్లా తన నియోజక వర్గం తప్ప ఎటూ వెళ్లట్లేదంట.  ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల, ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు, పురపాలికశాఖ మంత్రి కేటీఆర్ మినహా మిగతా మంత్రులెవరూ కూడా వేరే జిల్లాలో అడుగుపెట్టడానికి సాహసం చేయడం లేదట. సాధారణంగా మంత్రి హోదాలో రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే అధికారాలు మంత్రులకుంటాయి. కానీ ఎమ్మెల్యేల నుండి సహకారం లేకపోవటం తమ టూర్ లతో వారు అసంతృప్తికి గురి కావడంతో మనకు వచ్చిన తంటా ఎందుకులే అని కొందరు మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారట.

cc cameras in jagtial municipal office

కొత్త రూపం దాల్చిన జగిత్యాల...

  జగిత్యాల బల్దియాను పూర్తిగా ప్రక్షాళన చేశారు. పాలక వర్గం గడువు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలనలో నడుస్తున్న బల్దియాలలో ఉద్యోగులు, కార్మికులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సమయానికి రావడమే కాక ఫైల్ ను వెంటనే క్లియర్ చేస్తున్నారు. సాయంత్రం అవసరమైతే గంట ఎక్కువ సేపు ఉంటున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొన్నటి దాకా ఎక్కడి పనులు అక్కడే ఉండేవి. పనుల పరిష్కారం పట్ల అధికారులు పెద్దగా శ్రద్ధ చూపెట్టేవారు కాదు. కొంత మంది వీఐపీలు కాకపోయినా వాళ్లింట్లో మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి పని చేసేవారు. రోడ్లకు ఇరువైపులా చెత్త ఉండేది. మరోవైపు మున్సిపల్ అంటేనే పైరవీకారులు రాజ్యమేలారు.  ప్రత్యేకాధికారుల పాలనలో మున్సిపల్ సిబ్బంది పని తీరు మార్చుకున్నారు. సీసీ కెమెరాలు అమర్చిన తర్వాత ఎవరి పనివారు చేస్తున్నారు. సిబ్బంది పని వేళలను చూసేందుకు బయో మెట్రిక్ అమలులోకి తెచ్చారు. దీంతో సిబ్బందిలో మార్పు వచ్చింది. బల్దియా కార్యాలయంలో అమర్చిన సీసీ టీవీలను కలెక్టర్ కార్యాలయం క్యాంప్ ఆఫీసుతో పాటు ఇన్ చార్జ్ కమిషనర్ ఆర్డీఒ నరేందర్ మొబైల్ కు అనుసంధానం చేశారు. దీంతో వాళ్లు ఎక్కడున్న సీసీ టీవీ చూస్తూ బల్దియాపై ఓ కన్ను వేస్తున్నారు. అంతేకాదు వీఐపీ ఇళ్లల్లో పని చేస్తున్న అరవై మంది సిబ్బందిని వెనక్కి పిలిచారు. జగిత్యాల పురపాలక సంఘం యొక్క పదవీ కాలం ముగిసిన తరువాత గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకాధికారిగా ముఖ్యంగా శానిటేషన్ ని బాగుపరచాలి అనే నేపధ్యంలో పని చేశారంటూ మరియు డ్రెయిన్స్  కూడా ఎక్కువ పూడుకుపోవటం వల్ల అనే సమస్యలు వస్తాయి కాబట్టి శానిటేషన్ మీద దృష్టిపెట్టినట్లు కలక్టర్ వెల్లడించారు.జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో నడిచే దుకాణాలూ వాటికి వచ్చే ఆదాయం, హోర్డింగ్ ల ద్వారా వచ్చే ఆదాయంపై లెక్కలు తీశారు. వందకు పైగా దుకాణాల లెక్క లు లేవని తేలింది. వాటి పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు ఇది ఇలాగే ఉంటుందని అధికారులు అంటున్నారు.

cm jagan may consider Lakshmi Parvathi for apsrtc chairman post

ఆర్టీసీ రేసులో అంబటి, లక్ష్మీపార్వతి... మరి జగన్ మొగ్గు ఎవరి వైపో?

  ఎన్నికలకు ముందు పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపిస్తూ, చంద్రబాబుపై విరుచుకుపడిన వారందరికీ దాదాపు పదవులు కట్టబెట్టారు జగన్. పలువురికి పిలిచిమరీ పోస్టులిచ్చారు. అయితే, చంద్రబాబుపై ప్రత్యేక అస్త్రంగా ప్రయోగించిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి మాత్రం ఇంకా ఏ పదవీ ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎందుకంటే, చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శిస్తూ వైసీపీ వాయిస్ ను బలంగా వినిపించిన తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. అయితే, ఎన్నికల టైమ్ లో లక్ష్మీపార్వతి అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ, అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారట. అయితే, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదారు నెలలు కావొస్తున్నా, తనను అసలు పట్టించుకోవడం లేదని, కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబును తిట్టడానికి మాత్రం వాడుకున్నారని కినుక వహించారని తెలుస్తోంది.    అయితే, వైసీపీ స్థాపించిననాటి నుంచి వెంటనడిచిన లక్ష్మీపార్వతికి ఏదోఒక పదవి కట్టబెట్టాలని జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, లక్ష్మీపార్వతి కోసం ఒక పోస్టును సిద్ధంచేస్తున్నట్లు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ఏదోఒక కార్పొరేషన్ కు ఛైర్మన్ గా పంపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అయితే, కీలకమైన ఈ నామినేటెడ్ పోస్టు కోసం మరికొందరు పోటీపడుతున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు రేసులోకి వచ్చారట. మంత్రి పదవి దక్కకపోవడంతో కనీసం ఆర్టీసీ ఛైర్మన్ పదవైనా ఇవ్వాలని అంబటి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అంబటి రేసులోకి రావడంతో లక్ష్మీపార్వతికి ఇప్పట్లో పదవి దక్కేది అనుమానమేనంటున్నారు. కోడెలను ఓడించడమే కాకుండా, పార్టీకి బలమైన గొంతుగా పనిచేసిన అంబటికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశముందంటున్నారు. మరి, ఆర్టీసీ స్టీరింగ్ ఎవరికి దక్కుతుందో, ఛైర్మన్ గిరిని జగన్ ఎవరికి కట్టబెడతారో చూడాలి. అయితే, అంబటి, లక్ష్మీపార్వతిల్లో ఎవరో ఒకరికి ఆర్టీసీ పగ్గాలు దక్కుతాయో లేక మరొకరికి ఆఫర్ చేస్తారోనన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది.

dharmapuri arvind on top place in bjp website

బీజేపీలో ధర్మపురి అర్వింద్ రికార్డు... అప్పుడు కవితను ఓడించి... ఇప్పుడు ఇలా...

  ధర్మపురి అర్వింద్... ఒకప్పుడు ధర్మపురి శ్రీనివాస్....అదే డీఎస్ కొడుకుగా మాత్రమే కొందరికి తెలుసు... అది కూడా నిజామాబాద్ వరకే అర్వింద్ ఎవరో తెలిసేది... డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ చీఫ్ గా పనిచేసినా... ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కి సన్నిహితుడిగా మారినా... అర్వింద్ మాత్రం తన సొంత గుర్తింపు కోసం ప్రయత్నించారు. తండ్రి, సోదరుడికి భిన్నంగా బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ కు సొంతంగా బాటలు వేసుకున్నారు. అర్వింద్ బీజేపీలో చేరినప్పుడు ఓ అనామకుడే. తెలంగాణ ముఖ్యనేతలే అర్వింద్ ను పట్టించుకునేవారు కాదు. ఇక ఢిల్లీలో అయితే అర్వింద్ పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఢిల్లీ నేతలైతే అర్వింద్ ను ఓ పురుగును చూసినట్లు చూసేవారట. దాంతో, రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ అర్వింద్ కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత అర్వింద్ పేరు ఢిల్లీలో మారుమోగిపోయిందట. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడించిన యువనేతగా అర్వింద్ కి ఒక్కసారిగా గౌరవం పెరిగింది. ఎందుకంటే, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురిగానే కాకుండా, మంచి వాగ్దాటితో పార్లమెంట్ లో మాట్లాడే కవితకు ఢిల్లీలో మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి కవితను ఓడించి పార్లమెంట్ లో అడుగుపెట్టిన ధర్మపురి అర్వింద్ కు బీజేపీ అగ్ర నాయకత్వంలో గుర్తింపు లభించింది. ధర్మపురి అర్వింద్, ఇప్పుడు, మరో ఘనత సాధించారు. అత్యధిక యాక్టివ్ మెంబర్-షిప్ చేయించి ముఖ్యనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీలో అత్యధిక మెంబర్ షిప్ చేయిస్తే ముఖ్యనేతగా గుర్తించే ఆనవాయితీ ఉంది. అందుకే, బీజేపీలో ప్రతి ఒక్కరూ అత్యధిక మెంబర్ షిప్ చేయించేందుకు పోటీపడతారు. అది కూడా యాక్టివ్ మెంబర్ షిప్ చేయిస్తేనే... ముఖ్యమైన నేతగా గుర్తిస్తారు. ఆ కేటగిరిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సత్తా చాటారు. ఇప్పటివరకు 35వేలకు పైగా సభ్యత్వాలు చేయించి దూకుడు మీదున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్వింద్ సొంత ఐడీపై 35వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. దేశంలో ఏ బీజేపీ లీడరూ... ఈ రేంజ్‌లో మెంబర్‌షిప్స్‌ చేయించలేదని, ఇదొక రికార్డని, కమలనాథులు మాట్లాడుకుంటున్నారు. ధర్మపురి అర్వింద్... తన వ్యక్తిగత ఐడీపై ఈ స్థాయిలో యాక్టివ్ మెంబర్ షిప్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వెబ్ సైట్ లో ధర్మపురి అర్విందే టాప్ లో ఉన్నారు. బీజేపీలో చేరిననాటి నుంచి ఇప్పటివరకు పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా తూచా తప్పకుండా పాటిస్తారనే గుర్తింపు అర్వింద్ కి ఉంది. అంతేకాదు ఏ పని అప్పగించినా సక్సెస్ చేస్తారనే పేరుంది. తెలంగాణలో ఆయుష్మాన్ భవ పథకం అమలు కాకపోయినా... అమిత్ షా పిలుపు మేరకు అర్వింద్ తన సొంత ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అధిష్టానంతో శెభాష్ అనిపించుకున్నారట. ఇప్పుడు, యాక్టివ్ మెంబర్ షిప్ లో దేశంలోనే నెంబర్ వన్ పొజీషన్ దక్కించుకోవడంపై అర్వింద్ అనుచరులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి కవితను ఓడించినప్పుడు ఢిల్లీలో అర్వింద్ పేరు మారుమోగగా, ఇప్పుడు అత్యధిక యాక్టివ్ మెంబర్ షిప్ తో మరోసారి జాతీయ నాయకత్వం దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

CM KCR New Formula For TSRTC

ఆర్టీసీలో 50+30+20 ఫార్ములా... సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ అడుగులు

  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆగ్రహంతో రగిలిపోతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. వెయ్యి శాతం ఇప్పుడున్న ఆర్టీసీ ఉండబోదని ఇంతకుముందే చెప్పిన కేసీఆర్... ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఆర్టీసీని మూడు ముక్కలు చేయడంతోపాటు 50+30+20 ఫార్ములాను ముందుకు తెచ్చిన కేసీఆర్... దాన్ని అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. అందుకే ఆర్టీసీపై చర్చించేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు.    నవంబర్ ఒకటిన సమావేశంకాబోతున్న మంత్రివర్గం... ఆర్టీసీపై అత్యంత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు. అందుకు అనుగుణంగా కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అద్దె బస్సులను 30శాతానికి పెంచడం... అలాగే 20 శాతం రూట్లను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడంలాంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఆర్టీసీ కార్మికులు దిగిరాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. ఆర్టీసీ స్వరూపాన్నే సమూలంగా మార్చేయాలని యోచిస్తున్న కేసీఆర్‌.... సంస్థను మూడు ముక్కలు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంచడంతోపాటు కొన్ని రూట్లను ప్రైవేటుకుపరం చేయనున్నారు.

minister anil kumar yadav targets anam ramanarayana reddy

సింహపురిలో ఆనం వర్సెస్ అనిల్... వైసీపీలో కలకలం రేపుతోన్న ఆధిపత్య పోరు

  రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు... అప్పటివరకు చక్రం తిప్పినోళ్లు అనామకులుగా.... అనామకులు అకస్మాత్తుగా రాజులుగా అవతరించొచ్చు... ఇది ప్రపంచంలో ఎక్కడైనా... ఎప్పుడైనా జరిగేదే అయినా.... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇటీవల ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. దశాబ్దాలు తరబడి చక్రం తిప్పిన ఉద్ధండ రాజకీయ నాయకులు... ఇఫ్పుడు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నమొన్నటివరకు తమ దగ్గర పనిచేసివాళ్లే... ఇప్పుడు రాజులుగా మారి... శాసించే స్థాయికి చేరడంతో... ఏమీచేయలేక సైలెంటైపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా సింహపురి రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందట.  మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి నేతలెందరో... ఆనం కింద పనిచేసినవాళ్లే... కానీ ఇప్పుడు రోజులు మారాయి. అధికారం, ప్రాధాన్యతల్లో చాలా వ్యత్యాసం వచ్చింది. దాంతో ఆనం పరిస్థితి ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా తయారైంది. మరోవైపు జిల్లాలో ఎక్కడా ఆనం పేరు వినిపించకుండా మంత్రి అనిల్,  ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ ఆనం కుటుంబ పెత్తనముందో గుర్తించి... కట్టడికి ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా వీఆర్ విద్యాసంస్థల్లో ఆనం రామనారాయణరెడ్డి పెత్తనం లేకుండా చేసేందుకు మంత్రి అనిల్ చక్రం తిప్పారు. 114ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల విద్యాసౌధానికి యాభై ఏళ్లుగా ఆనం కుటుంబమే యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే, ఆనం ఫ్యామిలీ నుంచి ఆ పెత్తనాన్ని లాక్కునేందుకు మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వీఆర్ విద్యాసంస్థలను పరిశీలించిన అనిల్, కోటంరెడ్డిలు కొత్త యాజమాన్యం రాబోతోందంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు ఇకపై ఆనం పెత్తనాన్ని ఒప్పుకునేది లేదంటూ మాజీ పాలక వర్గాన్ని ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారు.  మొత్తానికి వీఆర్ విద్యాసంస్థల వేదికగా సింహపురి రాజకీయాలు ఇప్పుడు ఆనం వర్సెస్ అనిల్ గా మారాయనే చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పటికే కోటంరెడ్డి-కాకాని గొడవతో జిల్లాలో వైసీపీ పరువు పోయిందని, ఇప్పుడు ఆనం వర్సెస్ అనిల్ గా సాగుతోన్న ఆధిపత్య రాజకీయం ఎటువైపు దారి తీస్తాయోనని సింహపురి వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.

Resignation letter of party MLA from Gannavaram

చంద్రబాబులో మొదలైన సరి కొత్త టెన్షన్......

  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం బిజెపి రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరితో విందు రాజకీయం టిడిపి అధినేత చంద్రబాబులో టెన్షన్ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిందట. ఈ నేపధ్యం లోనే ప్రకాశం జిల్లాలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడటం ఇప్పుడు ఉత్కంఠకు తెరలేపింది. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజక వర్గాల్లో టిడిపి అభ్యర్ధులే గెలిచారు. చీరాలలో కరణం బలరాం, కొండేపిలో బాలవీరాంజనేయస్వామి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పరుచూరులో ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. అయితే వీరు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుక విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నిరసనలు తెలిపింది. కానీ ప్రకాశం జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. రాష్ట్రమంతా టిడిపి శ్రేణులు ఇసుక విధానంపై ఆందోళన చేస్తుంటే అదే సమయంలో కరణం బలరాం బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో భేటీ జరిపారు. కరణం బలరాంను బిజెపిలో చేరమని సుజనా ఎప్పట్నుంచో అడుగుతున్నారట. దాంతో వీరిద్దరి భేటీ పార్టీలో కలకలం రేపింది. ఈ విషయాలన్నింటినీ గమనించిన చంద్రబాబు చీరాల, పర్చూరు, కొండెపి ఎమ్మెల్యేలతో విడివిడిగా చాలా సేపు ఫోన్ లో మాట్లాడం జరిగింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడంతో చంద్రబాబులో మరింత టెన్షన్ పెరిగిపోయింది. అయితే రెండ్రోజుల క్రితం రాత్రి చంద్రబాబును గొట్టిపాటి విజయవాడలో నేరుగా కలిశారని తెలుస్తుంది. వాళ్లిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం అయితే బయటకు రాలేదు. వంశీ రాజీనామా ఎపిసోడ్ తో పార్టీలో ఉండేదెవరో వెళ్లిపోయేదెవరో అర్థం కాక చంద్రబాబులో బిపి పెరిగిపోతోంది అని సమాచారం. అందుకే అందరు ఎమ్మెల్యేలతో తరచుగా  మాట్లాడుతూ ఆరాలు తీస్తున్నారని సమాచారం. మొత్తానికీ ప్రతిపక్షంలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఉండేదెవరు ఊడెదెవరూ అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలుగు తమ్ముళ్లు వారి వైఖరిని వ్యక్తం చేస్తున్నారు.

TSRTC Strike In Telangana Enters 26th Day

రేపటి దీక్షను ప్రధాన లక్ష్యంగా చేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం.....

  ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సకల జనులు సమరభేరి బహిరంగ సభ ముగిసింది. ఉద్యమంలో భాగంగా రేపు ఒక్క రోజు దీక్షలో ఇరవై నాలుగు గంటల పాటు కార్మికులు దీక్షలో కూర్చోవాలని పిలిపునిచ్చారు. విలీనమై ప్రధాన ఎజెండాగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రధానమని కార్మికులు ఈ సభ ద్వారా తెలియచేసారు. పలువురు నేతలు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీలో సకల జనుల సమ్మెను మించి ఇప్పుడు కార్మికులు ఐక్యంగా పోరాడుతున్నారన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామరెడ్డి. సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు కార్మికులంతా ఐక్యంగా ముందుకు సాగాలని కార్మికులలో విభేదాలు తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు టిటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ. ఇరవై ఐదు రోజులుగా ఉన్న తమ ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేసిఆర్ కుట్రలు పన్నుతారని, ఏ కుట్రకు కూడా తాము తలవంచకుండా ఐకమత్యంగా ఉండాలి అని టిటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ తెలియజేశారు.ఆర్టీసీ కార్మకుల పట్ల కేసీఆర్ తండ్రిగా భావించి సమస్యలు పరిష్కరించాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత బి  హనుమంతరావు. కార్మికుల వెంటే కాంగ్రెస్ ఉంటోందని బీహెచ్ హామీ ఇచ్చారు. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న వారంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని వాపోయారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ. పేదలు ఎక్కువగా ఉపయోగించే సంస్థనే నాశనం చేసేందుకే సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది అన్నారు.

Heavy rains forecast for Telugu States in next 48 hours

మరో నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు...

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురిసింది, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, మరో నలభై ఎనిమిది గంటల్లో ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణాలో ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఒక మోస్తరులో వర్షాలు పడుతున్నాయి. వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు, మూడు రోజులకు తెరిపిచ్చిన తర్వాత మళ్లీ కురవటం మొదలు పెట్టాయి. కాకపోతే ఈ కరీఫ్ లో పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి, భారీ వరదలతో ఒంగోలు తడిసి ముద్దయ్యింది. చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

heavy rains in tamil nadu

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు...

  తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధురై, తిరునెల్వేలి, తిరువల్లూరు, తూత్తుక్కుడి, విరుదునగర్,తేని, రామనాథపురం, వెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎనిమిది జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తిరుత్తణిలో అత్యధికంగా పధ్ధెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు, మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.  తమిళనాడులో ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో గత పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అందులోనూ రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు దక్షిణ తమిళనాడు కోయంబత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా ఎగువన కేరళలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా డ్యామ్ లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి గేట్లన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితిలో కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైపోయాయి. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం ఇప్పటికే దాదాపు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతంతో దిండివనంతో పాటు తిరునల్వేలి, తిరువల్లూరు, తూత్తుక్కుడి,తేనె ప్రాంతాల్లో ఈ వర్షం కారణంగా నష్టం అనేది ఎక్కువుగా ఉంది. మరొక రెండు రోజుల పాటు కూడా అంటే నలభై ఎనిమిది గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా జలమయమైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది రానున్నటువంటి రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే కనుక మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సెలవులు రద్దు చేసి అందరూ కూడా విధుల్లో ఉండాలని ఆదేశించారు. విద్యా సంస్థలకి గడిచినటువటువంటి రెండు రోజులు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సెలవులు మరొక రెండు, మూడు రోజుల పాటు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దించారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జిల్లాలో ఆయా మండల కేంద్రాల్లో అందులోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

రోజుకో మలుపు తిరుగుతున్న రజిత హత్య కేసు...

  కీర్తి గత మూడు రోజులుగా వార్తలలో వినిపిస్తున్న పేరు. జన్మనిచ్చిన తల్లినే హత్య చేసింది. తాజాగా కీర్తి మరో ప్రియుడు బాల్ రెడ్డిని అదుపు లోకి తీసుకొని అత్యాచారం కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జనవరిలో కీర్తి పై బలవంతంగా అత్యాచారం చేశాడు బాల్ రెడ్డి. కీర్తి గర్భవతి కావడంతో మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శశి సహకారంతో అబార్షన్ చేయించాడు బాలిరెడ్డి. అయితే బాలిరెడ్డి, శశి మంచి మిత్రులని చెబుతున్నారు పోలీసులు. అబార్షన్ చేయించే సమయంలోనే శశి, కీర్తిని బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. అంతేకాదు నగ్న వీడియోలు తీసి హింసించాడు. కొంత కాలం తర్వాత కీర్తిని బాలిరెడ్డికిచ్చి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే కీర్తితో చనువుగా ఉంటూ వచ్చాడు శశి. దీంతో కీర్తిని మందలించింది రజిత. తల్లి వ్యవహారాన్ని శశికి చెప్పడంతో ఇద్దరూ కలిసి రజిత హత్యకు పథకం వేశారు. తమ ప్రేమ వ్యవహారంలో హెచ్చరించిన తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేయించింది కీర్తి.  కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతున్నాయి. ప్రియుడు శశితో కలిసి కీర్తి మద్యం సేవించిన మత్తులో తల్లిని చంపినట్లు ఒప్పుకుంది. తన తల్లి హత్యకు ప్రియుడు శిశే ప్రేరేపించాడని పోలీసుల విచారణలో తెలిపింది. తాజాగా కీర్తి ఇంట్లో మూడు బీరు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల పంతొమ్మిది న కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్ కు వెళ్లిన తల్లి రజిత ఇంటికి తిరిగి వచ్చే సరికి కీర్తి ప్రియుడు శశితో కలిసి ఉండటాన్ని చూసి ఇద్దరినీ మందలించింది. అయితే తమ ప్రేమకు అడ్డొస్తున్నదన్న రజితను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు స్కెచ్ వేశారు. ఇంటి బయట ఉన్న కారులో ప్లాన్ వేశారు. కీర్తిని ఇంటికి పంపిన శశి ఆ తర్వాత వచ్చాడు. లోపలున్న రజితను కీర్తి అరవకుండ దిండుతో ముఖంపై అదిమిపట్టగా శశి చున్నీతో గొంతు నులిమి చంపాడు.ఈ కేసు పై పూర్తి వివరాలను పోలీసులు దర్యప్తులో తేలాల్సి ఉంది.

బంగారం నిల్వలపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం...

  బంగారమంటే భారతీయులకు ప్రాణం. ప్రతి ఏటా భారత్ తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా దిగుమతి చేసుకున్న బంగారం బ్యాంకు లాకర్లలో మూలుగుతోంది. బంగారం దిగుమతి కోసం విలువైన విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే కొత్త గోల్డ్ పాలసీని తీసుకొస్తోంది కేంద్రం. జనం రహస్యంగా దాచుకున్న బంగారం లెక్కలు స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా దాచిన బంగారాన్ని పన్నులు చెల్లించేందుకు ప్రజలు అవకాశమిస్తారు. ప్రధాని కార్యాలయం ఆర్థికశాఖ ఈ పథకానికి తుది మెదుగులు దిద్దుతోంది. అంతేగాకుండా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీతో పాటు దేశంలోని పలు ఆలయాల దగ్గర టన్నుల కొద్దీ బంగారం నిల్వలు ఉన్నాయి. భక్తులు ప్రతి ఏటా తమ ఇష్టదైవానికి భారీగా బంగారం కానుకలిస్తున్నారు. బంగారాన్ని బ్యాంకుల్లో దాచడానికి టిటిడి బోర్డుతో పాటు ఇతర ఆలయ బోర్డులకు ప్రత్యేక అనుమతులు అవసరం. బ్యాంకుల్లో బంగారాన్ని డిపాజిట్ చేయడం వల్ల ఆలయాలకు పెద్దగా ఆదాయం రావడం లేదన్న వాదన కూడా ఉంది. ఇలా వృథాగా ఉన్న బంగారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది.  దేశ సంపదలో అక్రమంగా దాచుకున్న బంగారం విలువ ఎక్కువగా ఉంటుందని కేంద్రం ఓ అంచనాకు వచ్చింది. అందుకే దీనిపై పన్ను వేస్తే అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి లబ్ది చేకూరుతుందన్న ఆలోచనతో కేంద్ర ఉంది. అయితే ఈ స్కీం కింద ఓ పరిమితి వరకే ప్రజలు తమ దగ్గరున్న బంగారం లెక్కలను ప్రభుత్వానికి వెల్లడించే వీలుంటుంది. అయితే ప్రజలకు ఈ పథకంలో కేంద్రం ఓ వెసులుబాటు కూడా కల్పించే అవకాశాలున్నాయి. వివాహితుల దగ్గర ఉండే బంగారానికి ఓ లిమిట్ వరకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తారు. అంతేకాకుండా దేశంలో ఉన్న బంగారం నిల్వల కోసం కేంద్రం త్వరలో గోల్డ్ బోర్డును కూడా ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా ఇందులో సభ్యత్వం ఉంటుంది. ప్రజలు సులభంగా బంగారాన్ని ఈ బోర్డు నుంచి కొనుగోలు చేసే విధంగా విధి విధానాలకు రూపకల్పన చేస్తారు. బంగారం నిల్వల పై మోదీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఎంత వరకు ఫలించబోతోందో వేచి చూడాలి.

వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయం.. ఊహించని కొత్త మలుపులు!!

  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే సీఎం పదవి కోసం పట్టుబడుతున్న శివసేనకు బిజెపి నేతలు కొత్త ఆఫర్ ఇచ్చారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పదమూడు మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. సీఎం పదవితో పాటు ఇరవై ఆరు మంత్రి పదవులను బిజెపి తీసుకుంటోదని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నివాసంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ప్రతిపాదనలు తెచ్చారు. సీఎం పదవిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని బిజెపి నేతలు స్పష్టం చేశారు.  రేపు ఉద్ధవ్ థాక్రే నివాసంలో శివసేన ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్దవ్ థాక్రే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించాలని అనుకుంటోంది. శివసేన హ్యాండ్ ఇస్తే బీజేపీ మరొక ప్లాన్ కి కూడా సిద్ధం అయ్యింది. బీజేపీ టికెట్లు రాక రెబల్స్ గా పోటీ చేసిన పదిహెడు మంది స్వతంత్రులుగా విజయం సాధించారు. ఇప్పుడు వారందరినీ ఫడ్నవీసు మచ్చిక చేసుకుంటున్నారు. అదే సమయంలో నలభై ఐదు మంది శివసేన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బిజెపి ఎంపి సంజయ్ కాకడే ఓ బాంబు పేల్చారు.  కాగా కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు నిజంగానే తమ పార్టీ అధినేత పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన ఆదిత్య థాక్రే కోసం బీజేపీతో కయ్యం పెట్టుకోవటం వారు వ్యతిరేకిస్తున్నారని అందుకే అవసరమైతే జంప్ చెయ్యడానికి కూడా సిద్ధం అవుతారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అయితే శివసేన కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంటే కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతిస్తాయని వార్తలు కూడా ముంబైలో హల్ చల్ చేస్తున్నాయి.ఇక మహారాష్ట్రా రాజకీయాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి.

అధిష్టానం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య నలిగిపోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు...

  ఆర్టీసీ కార్మికుల సమ్మె అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కార్మికులను సమ్మె నుంచి విరమింపజేసి విధుల్లో చేర్చడం ఇబ్బందిగా మారింది. అటు కార్మికులను ఒప్పించ లేక ఇటు పార్టీ అధిష్టానం ఆదేశాలను కాదనలేక నేతలు సతమతమవుతున్నారు. డిపోల స్థాయిలో కొన్ని కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మంతనాలు జరిపిన ఎమ్మెల్యేలు హైకమాండ్ నుంచి కాల్స్ రావడంతో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ డిమాండ్ లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది జెఎసి. డిపోల ముందు నిరసనలు, ర్యాలీలు, మానవహారాలు, కలెక్టరేట్ల ముట్టడి, వంటా వార్పులతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణానూ మెరుగుపరిచామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కార్మికులు ఎవరైనా డ్యూటీలో చేరాలనుకుంటే డిపోలో అప్లికేషన్ పెట్టుకోవాలని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్. దీంతో కార్మికులు డ్యూటీలకు వస్తారని ప్రభుత్వం భావించింది. కానీ కార్మికులు నుంచి స్పందన రాలేదు. దీంతో కార్మికులతో సమ్మె విరమింపజేసి విధుల్లో చేర్పించే బాధ్యతను ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు సీఎం అప్పగించినట్లు తెలుస్తోంది. అధినేత సూచనలతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అయితే కార్మికులు సంఘాల నేతల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో అటు అధిష్టానం ఒత్తిడిని తట్టుకోలేక ఇటు కార్మికులను విధుల్లోకి చేర్పించలేక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. సీఎం చెప్పిన ఎమ్మెల్యేలు మంతనాలు జరిపినా ఇప్పటి వరకు రాష్ట్రం లోని ఏ డిపోలో కూడా కార్మికులు విధుల్లో చేరక పోవడం పై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా కార్మికులను విధుల్లో చేర్చాలని ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మాట్లాడితే రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారేమోనన్న భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. దీంతో కార్మికులతో ఫోన్ లో మాట్లాడేందుకు జంకుతున్నట్లు సమాచారం. కార్మిక సంఘాల నేతలను నేరుగా కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నా వారు అంగీకరించటం లేదని టాక్. ఆర్టీసీ సమ్మెతో తమ నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులున్నాయని కొందరు ఎమ్మెల్యేలు అనుచరుల దగ్గర చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేస్తుండటంతో తమను ఎక్కడ అడ్డుకుంటారోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల లాంటి అధికారిక కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు తమ జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పార్టీ అధిష్టానంతో విషయం చెప్పేందుకు జంకుతున్నట్లు చర్చ జరుగుతోంది.