ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కేసు... తాత్కాలిక సిబ్బందికి పువ్వాడ వార్నింగ్

సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తుంటే.... ప్రభుత్వం మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 55శాతం బస్సులను నడిపినట్లు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్‌... ఆ సంఖ్యను వందశాతానికి పెంచుతామన్నారు. డీఎస్పీ ఇన్‌‌‌ఛార్జ్‌గా ప్రతి డిపోలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటుచేసి బస్సులను నడుపుతామని పువ్వాడ తెలిపారు. ప్రతి బస్సులోనూ పాసులను కచ్చితంగా అనుమంతించాల్సిందేనన్న మంత్రి పువ్వాడ.... టికెట్ ధర కంటే అధికంగా వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాత్కాలిక సిబ్బందిని హెచ్చరించారు.

ప్రతి బస్సులోనూ టికెట్ ధరల పట్టిక పెడతామని, అందులో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా తాత్కాలిక సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికులు కూడా టికెట్ ధర కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని పువ్వాడ సూచించారు. కంట్రోల్ రూమ్ నెంబర్లను ప్రతి బస్సులోనూ పెడతామని, ఎవరైనా ఎక్కువ డబ్బులు అడిగితే, ఫిర్యాదు చేయ్యొచ్చని తెలిపారు. ఇక, దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా... అవసరమైన మేర బస్సులను నడుపుతామని పువ్వాడ తెలిపారు. 14నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్న నేపథ్యంలో... అన్ని డిపోల నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని సర్వీసులను యథావిధిగా నడుపుతామన్నారు. ప్రస్తుతం 5వేలకు పైగా బస్సులను నడుస్తున్నాయన్న మంత్రి పువ్వాడ అజయ్.... ఇవాళ్టి నుంచి మొత్తం బస్సులను రోడ్లపైకి తీసుకొస్తామన్నారు.

అయితే, 50శాతానికి పైగా బస్సులను నడుపుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా, రోడ్లపై మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాట్లు అరకొరగా ఉండటంతో... ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు... తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ రైళ్లను ఆశ్రయిస్తుండటంతో... ట్రైన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

Teluguone gnews banner