నీకంటే చిన్నవాడు చేశాడు... నువ్వెందుకు చేయలేవు... కేసీఆర్పై నిప్పులు చెరిగిన అఖిలపక్షం
posted on Oct 10, 2019 @ 2:07PM
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టంచేశారు. సమ్మె చేస్తోంది... కార్మికుల స్వలాభం కోసం కాదన్న అశ్వద్ధామరెడ్డి .. ప్రజల కోసం, సంస్థ కోసమేనని అన్నారు. అరెస్టులు చేసినా, జైళ్లలో పెట్టినా, పోరాటం ఆగదన్నారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్పై నేతలు నిప్పులు చెరిగారు. పది రోజుల్లోగా సమస్యకు పరిష్కారం చూపాలంటూ డెడ్లైన్ విధించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే... 19న తెలంగాణ బంద్కి పిలుపునిస్తామని అఖిలపక్షం హెచ్చరించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిప్పులు చెరిగారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ లేదన్న కోదండరాం... ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, టీఆర్ ఎస్ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతుంటే... ఎలా సెల్ఫ్ డిస్మిస్ అవుతారంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. నీకంటే చిన్నవాడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే... నువ్వెందుకు చేయవంటూ కేసీఆర్ను చాడ వెంకట్ రెడ్డి నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లనే అడిగారని, గొంతెమ్మ కోర్కెలు కోరలేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేస్తే... ఇక్కడ కేసీఆర్ ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. దసరా పండక్కి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా కేసీఆర్... ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఉసురుపోసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మొత్తానికి సర్కార్ మెట్టు దిగకపోవడం... కార్మికులు పట్టు వీడకపోవడంతో... ఆర్టీసీ సమ్మె... సకల జనుల పోరాటంగా మారుతోంది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి రాజకీయ పార్టీలు, ఉద్యోగ ప్రజాసంఘాలు మద్దతు పలకడంతో ... సమ్మె రోజురోజుకీ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది.