వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ జరుగునా లేదా?
posted on Oct 10, 2019 @ 11:10AM
వాల్తేరు డివిజన్ కోసం విశాఖలో పోరాటాలు ఉధృతం అవుతున్నాయి. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ డివిజన్ ను రద్దు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోన్ ప్రకటించినప్పట్నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వాల్తేరు డివిజన్ పునరుద్దరణ కోసం ఉద్యమ బాట పట్టాయి.ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించిన ఆంధ్ర ప్రజలు సంతోషంగా లేరు. అందులోనూ ఉత్తరాంధ్ర వాసులైతే తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఎంతో చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ప్రకటించటమే.వాల్తేరు డివిజన్ ను పునరుద్దరించాలని జోన్ ప్రకటించినప్పట్నుంచి డిమాండ్ లు ఎక్కువయ్యాయి. దీనిని గమనించిన కొన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ కోసం తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు ధర్నాలు చేస్తూ ప్రజాభిష్టం మేరకు పోరాటాలు చేస్తున్నాయి. తాము నిర్వహించే సమావేశాలకు పలు రాజకీయ పార్టీలను మేధావులను ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నాయి. వారి సలహాలు సూచనలు తీసుకుని పోరాటాలను ఉధృతం చేస్తున్నాయి.
వాల్తేరు డివిజన్ ను కొనసాగించాలని సీఐటీయూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో మిగిలిన రాజకీయ పార్టీ లలో కదలిక ఏర్పడింది. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటును గౌరవించకపోతే తాము వెనకబడిపోతామేమోనని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో రేపో మాపో ప్రధాన పార్టీలు కూడా ఉద్యమంలోకి వచ్చే అవకాశముంది. వాల్తేరు డివిజన్ లేకుండా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వడం ప్రజలనూ వంచించడమేనని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ రావు విమర్శించారు.చిత్రమేంటంటే ప్రత్యేక రైల్వే జోన్ కావాలని వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చెయ్యాలని గతంలో ఆందోళన చేసిన టిడిపి, వైసిపి ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. బిజెపి నేతలు మాత్రం ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చారు కదా వాల్తేరు డివిజన్ లేకపోతే ఏమవుతుంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కానీ వామపక్షా లు, ప్రజా సంఘాలు, కళాకారుడు మాత్రం వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చెయ్యా లని బలంగా కోరుకుంటున్నారు.ప్రత్యేక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర లో చిరకాల వాంఛ అని ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామ ని విభజన చట్టం లో కూడా చెప్పార ని నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆశతో వాల్తేరు డివిజన్ ను ఎత్తేసి రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించిందని విమర్శిస్తున్నారు.భారతదేశ చరిత్ర లోనే డివిజన్ ఎత్తేసి జోన్ ఇచ్చే ఘటనే లేదని గుర్తు చేస్తున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి వాల్తేరు డివిజన్ ను పునరుద్ధరణ చెయ్యాలని విశాఖ నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.ఇంతకు వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.