telangana revenue department bribes

రెవెన్యూ ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారా? కేసీఆర్ హెచ్చరికలు ఫలితమేనా ఇది?

తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులపై ఇటీవల ఒత్తిడి పెరిగింది. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని, రెవెన్యూ ఉద్యోగులు ప్రజలను, రైతులను పీక్కు తింటున్నారని, ఇక ఉపేక్షించేది లేదని, సమూల ప్రక్షాళన చేస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే పలుమార్లు హెచ్చరించడంతో... మొత్తం రెవెన్యూ యంత్రాంగమే తీవ్ర ఒత్తిడికి గురైంది. అసలు రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేస్తారన్న ప్రచారం సాగడంతో ఒకానొక టైమ్ లో ఆందోళన బాటపట్టేందుకు కూడా సిద్ధమయ్యారంటే వాళ్ల మానసిక పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు. అయితే, లంచం ఇవ్వనిదే రెవెన్యూ ఉద్యోగులు ఏ పనీ చేయరనే ఆరోపణల్లో నిజమున్నా... విధి నిర్వహణలో మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులపై పొలిటికల్ ప్రెజర్ ఎక్కువగానే ఉంటుంది.  నేరుగా ప్రజలతో సంబంధాలుండే డిపార్ట్ మెంట్ కావడంతో... అటు ప్రజాప్రతినిధులను, ఇటు జనాన్ని... ఇద్దరినీ మెప్పిస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత వీళ్లపై ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పదిమందికి జవాబుదారీగా ఉంటూ పనితీరుతో మెప్పించాల్సి ఉంటుంది. దాంతో రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. మరో కోణంలో ఆలోచిస్తే, రెవెన్యూ ఆఫీసుకు వచ్చేవాళ్లకు ఒక్కటే పని అయితే, ఆయా అధికారులకు మాత్రం పది రకాల పనులు ఉంటాయి. దాంతో ఒక్కోసారి ఆయా పనులు వాయిదా పడొచ్చు. ఆలస్యం కావొచ్చు. అలాగే, రాజకీయ ఒత్తిడులకు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పనులు చేయాల్సి రావొచ్చు. అలాగే, అందర్నీ మెప్పిస్తూ పనులు చక్కబెట్టడమంటే కత్తి మీద సామే. అయితే, రెవెన్యూ ఉద్యోగుల ధనదాహం, లంచగొండితనం, అవినీతి అక్రమాలపైనా అదే స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా తహశీల్దార్ విజయారెడ్డి పాశవిక హత్యపై రెవెన్యూ యంత్రాంగం భగ్గుమంటోంది. బంద్ కి పిలుపునిచ్చిన రెవెన్యూ ఉద్యోగులు... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు.

vijaya reddy murder mystery

విజయారెడ్డి మర్డర్ వెనుక అనేక అనుమానాలు... అసలు అక్కడుండే అటెండర్ ఏమైనట్లు?

అసలు ఆ అరగంట అక్కడేం జరిగిందో తెలియదు... దేనికోసం గొడవ పడ్డారో అసలే తెలియదు... ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణమేంటో కూడా తెలియదు... కానీ విజయారెడ్డి... నిందితుడు సురేష్ మధ్య మొదలైన మాటలు కాసేపట్లో మంటలుగా మారిపోయాయి. అందరూ చూస్తుండగా క్షణాల్లోనే విజయారెడ్డి ప్రాణాలు మంటల్లో కాలి ఆహుతైపోయాయి. మంటల తీవ్రతకు విజయారెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. ఒక్కసారిగా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో... తనను తాను కాపాడుకునేందుకు తహశీల్దార్ విజయారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. తన ఛాంబర్ నుంచి బయటికి పరుగులు తీశారు. కానీ తన ఛాంబర్ తలుపు దగ్గరే కుప్పకూలి...గిలగిలా కొట్టుకున్నారు. మంటలను తట్టుకోలేక కేకలు వేస్తూ అల్లాడిపోయారు. మిగతా ఉద్యోగులు... అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే విజయారెడ్డి మంటల్లో కాలిపోయారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన మహిళా అధికారిణి దారుణ హత్య... తెలంగాణవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అత్యంత పాశవికంగా తహశీల్దార్ ను మర్డర్ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక, విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు ఉద్యోగుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తహశీల్దార్ ఛాంబర్లోకి ఇతరులు ఎవరైనా వెళ్లాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడుంటే అటెండర్ ద్వారా తహశీల్దార్ కు సమాచారమిచ్చి... అనుమతి ఇస్తే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మరి, నిందితుడు సురేష్ ...రెగ్యులర్ గా తహశీల్దార్ కార్యాలయానికి వస్తాడో ఏమో తెలియదు కానీ... నేరుగా విజయారెడ్డి ఛాంబర్ లోకి వెళ్లడం... అరగంటపాటు వాగ్వాదానికి దిగడం... ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం చూస్తుంటే... అనుమానాలకు తావిస్తోంది.

revenue officer vijaya reddy

విజయారెడ్డి మర్డర్ ఎలా జరిగిందంటే... మినిట్ టు మినిట్... సీన్ టు సీన్...

పక్కా పథకం ప్రకారమే, తహశీల్దార్ విజయారెడ్డిని మర్డర్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు. ముందస్తు వ్యూహంతోనే రద్దీ తక్కువగా ఉండే మధ్యాహ్న సమయాన్ని ఎంచుకున్న దుండగుడు... ప్లాన్ ప్రకారం సంచిలో పెట్రోల్‌ను తెచ్చుకోవడమే కాకుండా, తహశీల్దార్‌ను మాటల్లో పెట్టి... సడన్‌గా అటాక్ చేశాడు. దాంతో క్షణాల్లో విజయారెడ్డి మంటల్లో కాలి సజీవదహనమైపోయారు. తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడు సురేష్‌... ఉదయం 11గంటల వరకు ఇంట్లోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటివరకు కుటుంబ సభ‌్యులతో కలిసి ఇంటి పనులు చేసిన సురేష్... ఆ తర్వాత బయటికెళ్లాడని చెబుతున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సురేష్‌కు ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని అంటున్నారు. అయితే, మధ్యాహ్నం పన్నెండున్నరకి అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయానికి సురేష్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, తహశీల్దార్ విజయారెడ్డి... మధ్యాహ్నం ఒంటి గంటకే భోజనం ముగించుకుని... తన ఛాంబర్‌లో ఒంటరిగా కూర్చున్నారు. అదే అదునుగా భావించిన సురేష్ ...సరిగ్గా ఒకటిన్నర సమయంలో విజయారెడ్డి ఛాంబర్లోకి ఎంటరైయ్యాడు. మాట్లాడే పని ఉందంటూ లోపలికి వచ్చిన సురేష్‌... వెంటనే విజయారెడ్డితో వాగ్వాదానికి దిగాడు. అయితే ముందస్తు ప్లాన్‌ ప్రకారం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను సడన్ గా బయటికి తీసిన సురేష్‌.... ఒక్కసారిగా విజయారెడ్డిపై పోసి నిప్పంటించాడు. అప్పుడు సమయం దాదాపు మధ్యాహ్నం 1:55 అవుతోంది. అయితే, ఒక్కసారి భగ్గుమన్న శబ్ధం రావడతో తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. గ్యాస్ సిలిండర్ పేలిందనుకుని ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అయితే, తన ఛాంబర్ ముందు విజయారెడ్డి మంటల్లో తగలబడిపోతుండటాన్ని గమనించిన కొందరు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే విజయారెడ్డి మంటల్లో కాలిపోయారు. పెట్రోల్ పోసి నిప్పటించిన ఐదారు నిమిషాల్లోనే విజయారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ఛాంబర్ తలుపు ముందు అరుపులు కేకలతో గిలగిలాకొట్టుకుంటూ తుది శ్వాస విడిచింది.

Reasons Behind AP CS LV Subramanyam Transfer

ఫైల్‌ను తిప్పి-పంపినందుకే తీసేశారు.. ఎల్వీ ఆకస్మిక బదిలీ వెనుక కారణాలివే..!

జగన్మోహన్‌రెడ్డి సర్కారు మరో అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించనివిధంగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేసింది. ఎల్వీను ఆకస్మికంగా ట్రాన్స్‌ఫర్ చేసిన జగన్ ప్రభుత్వం.... బాపట్ల హెచ్ఆర్డీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్వీని తక్షణమే రిలీవ్ కావాలన్న ప్రభుత్వం... సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్‌‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే, మరో 5నెలల సర్వీసు ఉండగానే, ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు అప్పటి సీఎస్‌ అనిల్‌చంద్ర పునేటాను తప్పించిన ఈసీ.... ఎల్వీకి బాధ్యతలు అప్పగించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం... ఎల్వీని సీఎస్‌‌గా కొనసాగించింది. సీబీఐ కేసుల్లో జగన్‌కి ఎల్వీకి లింకులున్నాయంటూ ఆరోపణలు విమర్శలు వచ్చినా... సీఎస్‌‌గా కొనసాగించారు. అలాంటిదిప్పుడు సడన్‌గా ఎల్వీపై బదిలీ వేటేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే, ఎల్వీపై బదిలీ వేటేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాషే కారణమని చెబుతున్నారు. ఎల్వీ, ప్రవీణ్ మధ్య తలెత్తిన విభేదాలు, ఆధిపత్య పోరే... ఆకస్మిక బదిలీకి కారణమని బ్యూరోక్రాట్స్‌ గుసగుసలాడుకుంటున్నారు. అయితే, ఎల్వీ బదిలీ వెనుక సీఎం జగన్ ఆగ్రహం ఉందని అంటున్నారు. తాను తీసుకునే నిర్ణయాలకు ఎస్...చెప్పకుండా ఫైల్స్ తిప్పిపంపడమే కారణమని చెబుతున్నారు. అసలు ఈ వివాదానికి వైఎస్సార్ లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డులే కారణంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాల స్థాయిలో వివిధ రంగాల్లోని నిపుణులకు వైఎస్సార్ అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించడంతో... ఆ ప్రతిపాదనల ఫైల్‌ను సీఎస్ ఆమోదం కోసం సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పంపారు. అయితే, అది ఆర్ధిక అంశంతో ముడిపడి ఉండటంతో... ఆర్ధికశాఖ కార్యదర్శికి పంపాల్సిందిగా ఆ ఫైల్‌ను ఎల్వీ తిప్పిపంపారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైందట. ఏదైనా ఫైల్ ను సీఎంవో నుంచి పంపారంటే... అది ముఖ్యమంత్రి పంపినట్లే. అలాంటి ఫైల్ ను  ఎల్వీ తిప్పిపంపడంతో... సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాషే... ప్రపోజల్స్ ను కేబినెట్ ముందుంచారు. అయితే, కేబినెట్ ముందుకెళ్లే ప్రతి ఫైల్ కూ సీఎస్ ఆమోదం కావాల్సి ఉండటంతో.... ప్రవీణ్ చర్యపై ఎల్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎస్ ఆమోదం లేకుండా ఫైల్ ను నేరుగా మంత్రివర్గం ముందుంచడం బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకమని, ఇది గ్రాస్ వైలేషన్ కిందకి వస్తుందంటూ ప్రవీణ్ ప్రకాష్‌కు ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నిబంధనల ఉల్లంఘనలపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్‌‌ను ఎల్వీ ఆదేశించారు. మరోవైపు, కేబినెట్‌ ముందుంచాల్సిన పలు ప్రపోజల్స్‌ విషయంలో జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తన ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఎల్వీ ఫైరయ్యారు. సీఎస్ ఆమోదించిన ఫైల్స్ ను సైతం మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లకుండా నిలిపివేయడంపై ప్రవీణ్ పై మండిపడ్డారు. అదే సమయంలో అక్టోబర్ 25న ప్రవీణ్ ప్రకాష్ పేరుతో విడుదలైన జీవో 28పైనా ఎల్వీ నిలదీశారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తక్షణం జీవోలుగా తీసుకురాకపోతే, ప్రధాన కార్యదర్శులకు సైతం షోకాజ్ నోటీసులిచ్చే అధికారం తనకు(జీఏడీ కార్యదర్శిగా) ఉందంటూ ప్రవీణ్ ప్రకాష్ జీవో ఇచ్చారు. అయితే, ఆ అధికారాలు తనవైతే, వాటిని నీవెలా అతిక్రమిస్తావంటూ ప్రవీణ్‌‌పై ఎల్వీ మండిపడ్డారు. ఇలా ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా కోల్డ్ వార్ జరుగుతుండగానే, సడన్‌‌గా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్‌ పేరుతో జీవో ఇవ్వడమే సంచలనంగా మారింది. మొత్తానికి ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ ఏపీలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. విపక్షాలు జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తుంటే.... ఐఏఎస్, ఐపీఎస్ లు మాత్రం ఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వైపు వేలెత్తి చూపుతున్నారు. ప్రవీణ్ ను వివరణ కోరినందుకు అసలు ఆ పోస్టులో లేకుండా చేశారంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఎల్వీపై ఆకస్మిక బదిలీ వేటేయడం... ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. అది కూడా, ఎల్వీ కంటే జూనియరైన ప్రవీణ్ ప్రకాష్ పేరిట ఉత్తర్వులివ్వడం... అధికార యంత్రాంగంలో తీవ్ర సంచలనంగా మారింది.

Reasons Behind AP CS LV Subramanyam Transfer

బీజేపీతో యుద్దానికి సిద్దమైన జగన్.. ఎల్వీ బదిలీ వెనుక మాస్టర్ ప్లాన్!!

  ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టడానికి సిద్ధపడ్డారా? బీజేపీతో యుద్ధం చేయడం తప్ప వేరే దారి లేదన్న నిర్ణయానికి జగన్ వచ్చారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఉన్నట్టుండి ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వేటు వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రతిపక్ష నేత జగన్ కి మద్దతుగా ఎన్నికల సమయంలో పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆరెస్సెస్ తో సత్సంబందాలున్నాయి. దీంతో బీజేపీ-వైసీపీ కలిసి తమని ఇబ్బంది పెడుతున్నాయని టీడీపీ ఆరోపించింది. టీడీపీ అలా ఆరోపణలు చేస్తుండగానే.. ఎన్నికలు ముగిసాయి. టీడీపీ ఘోర పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. వైసీపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక కూడా సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే కొనసాగించారు. అయితే ఇప్పుడు దాదాపు ఐదు నెలల తరువాత ఆయనను సీఎస్ గా తప్పించారు. అయితే దీనివెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీని ఢీ కొట్టడానికి జగన్ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆరెస్సెస్ తో ఉన్న సంబంధాలు కారణంగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంను తప్పించారని తెలుస్తోంది. ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా ఎల్వీ ఆరెస్సెస్ కు చేరవేస్తున్నారట. అటునుంచి బీజేపీకి చేరుతున్నాయట. అంతేకాదు ఆరెస్సెస్- బీజేపీ కలిసి జగన్ కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నాయన్న సమాచారం కూడా జగన్ కి అందిందట. ఇటీవల కొందరు ఆరెస్సెస్ వ్యక్తులు తమ అంతర్గత సంభాషణల్లో.. ఒక్క సంవత్సరంలో జగన్ మళ్లీ జైలుకి వెళ్తారని అంటున్నారట. అంతేకాదు జగన్ జైలుకి వెళ్తే.. ఎల్వీ పదవీకాలాన్ని పొడిగించి.. ఆయన ద్వారా ఏపీలో రాజకీయాలు నడుపుతామని చెప్తున్నారట. ఈ అంతర్గత సంభాషణలు ఆ నోటా ఈ నోటా పడి.. జగన్ వరకు చేరడంతో.. ముందు జాగ్రత్తగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు సీఎస్ గా ఎల్వీని తప్పిస్తే.. ఇక్కడి వ్యవహారాలు..  ఆరెస్సెస్- బీజేపీలకు చేరడం ఆగుతుంది. తరువాత కరెక్ట్ గా ప్లాన్ చేసి బీజేపీని ఢీ కొట్టాలని చూస్తున్నారట. మొత్తానికి ఎల్వీని తప్పించడం ద్వారా బీజేపీతో యుద్దానికి సిద్ధమని జగన్ పరోక్షంగా సంకేతాలు పంపినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

India can rely on sand imports till the time it is viable

నెల రోజుల్లో ఇసుక కొరత పరిష్కరిస్తాం :- వైఎస్ జగన్

  రాష్ట్రంలో ఇసుక కొరత ప్రభావం నేపథ్యంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఇసుక కొరత తాత్కాలిక సమస్య అన్నారు జగన్. వరదల కారణంగా 225 రీచ్ పని చేయాల్సి ఉండగా.. కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని అందుకే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. వరదల కారణంగానే ఇసుక తీయడం కష్టంగా ఉందన్నారు. నవంబర్ నెలాఖరు నాటికి సమస్య పూర్తిగా తీరుతుందన్నారు. గత ఐదేళ్లలో ఫ్రీ ఇసుక పేరుతో మాఫియా నడిపించారని ఇప్పుడు పారదర్శకంగా అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామన్నారు. వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని సీఎం వెల్లడించారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వటానికి వెంటనే ప్రత్యేక స్టాక్ యార్డు కూడా ఇస్తామన్నారు సీఎం జగన్.ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోన్న నేపథ్యంలో గత 90 రోజులుగా ఊహించని రీతిలో వరద పరిస్థితుల్లో సమీక్షించడం జరిగింది. ఏ ఏ ప్రాంతాల్లో ఇసుకని తీసే అవకాశాలు ఉన్నాయనే దాని పై అధికారులు ముఖ్యంగా చర్చించారు. డిమాండ్ కు తగ్గట్టుగా ఇసుకను అందుబాటులో ఉంచలేని పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.అన్ని నదుల్లో వరద ఉధృక్తి కారణంగా ఇసుక లభించట్లేదని  సీఎం చెప్పారు. అంతేకాక ప్రాధాన్యతా రంగాలకు ఏటా ప్రత్యేకంగా ఇసుక సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్య మంత్రి పేర్కొన్నారు.

Illegal liquor seized in andhra pradesh

తెలంగాణ మందుకి ఆంధ్రాలో ఫుల్ డిమాండ్!!

  ఆంధ్రాలో కొత్తగా పెట్టిన మద్యం పాలసీ వల్ల అక్రమంగా బెల్టు షాపులు నడిపే వారికి వరంగా మారింది. ఆంధ్రాలో 8 గంటలకే వైన్ షాపులు మూసివేయడం.. రేట్లు కూడా ఆకాశానికి అంటుతుండటంతో.. తెలంగాణ బోర్డర్ కి దగ్గర్లో ఉన్న ప్రాంతాల వారు తెలంగాణకు వచ్చి తాగి వెళ్లే పరిస్థితి నెలకొంది. తెలంగాణ మద్యం ఆంధ్రాలో ఫుల్ కిక్కెక్కిస్తోంది. తెలంగాణలో చీప్ గా దొరుకుతున్న లిక్కర్ ని ఆంధ్రాకు అడ్డదారిలో తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో పోలీసులు జరిపిన సోదాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఒక ఇంట్లో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన 20 బాక్సులను.. ఆంధ్రాకి చెందిన 2 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్న నటరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను గద్వాలలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి మహానంది పరిసరాల్లో అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు.  నటరాజ్ గతంలో గాజుల పల్లిలో వైన్ షాపు నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. అతని ఇంట్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపుగా రూ. 2 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు తెలిపారు. నటరాజ్ అనే వ్యక్తి లైసెన్సీగా గతంలో షాపు నిర్వహించాడు. అక్టోబర్ 31వ తేదీన తెలంగాణలో టెండర్స్ కు వెళ్లి అటు నుంచి వచ్చే సమయంలో గద్వాలకు సంబంధించిన ప్రాంతంలో మిగిలిన కొంత స్టాకుని  తీసుకొచ్చి గాజులపల్లిలోని తన స్వగృహం లోనే నిల్వ ఉంచాడని చెప్పారు. అలా ఉంచిన స్టాకుని దగ్గర్లో ఉన్న బెల్ట్ షాపులకీ అక్రమంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతోనే తనిఖీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. నటరాజ్ ఇంటి వద్ద నిఘా ఉంచిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అతను అక్రమంగా విక్రయిస్తున్న సమయంలోనే పట్టుకోవడం జరగిందని అధికారులు స్పష్టం చేశారు. 

YSRCP Leader Ambati Rambabu Slams Pawan Kalyan

పవన్ మళ్ళీ సినిమా వేషాలు వేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది: అంబటి

  భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం కోసం జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘మీ నైజం ఏంటి పవన్ కళ్యాణ్..అసలు మీరు ఏం పోరాటాలు చేశారు.. మేము పోరాటాలు చేయబట్టే తమపై కేసులున్నాయి..వాస్తవాలు ఏంటో గ్రహించాలి..సినిమాల్లో మళ్ళీ వేషాలు వేసుకొనే పరిస్థితి దగ్గరలోనే ఉంది’ అంటూ పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఏ మాత్రం స్పష్టత లేని, కన్ ఫ్యూజన్ రాజకీయాలను పవన్ చేస్తున్నాడు. అది ప్రజలు అర్థం చేసుకుని వైసీపీకి పట్టం కట్టారని చెప్పారు. వాస్తవ..అవాస్తవాలను న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని జగన్ గారి గురించి అలా మాట్లాడటం సబబు కాదని చెప్పారు. టీడీపీకి బీటీం..పవన్  టీడీపీకి దత్తపుత్రుడేనని మరోసారి స్పష్టం చేశారు. జగన్ అద్బుత పరిపాలన చేస్తే సినిమాలకు వెళ్లి..వేషాలు వేసుకుంటానని పవన్ నిన్న సభలో చెప్పిన విషయం గుర్తు చేస్తూ..అది దగ్గరలోనే ఉందన్నారు. అదే విధంగా బాబు కూడా హెరిటేజ్ కంపెనీ నడుపుకోవడం ఖాయమన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అంబటి వెల్లడించారు. ఆదివారం విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఆ సభలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు జనసేనాని. జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైందని.. జగన్ అంటే మ్యాన్ ఆఫ్ ఫ్రై డే అని..ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తాడంటూ విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ex minister motkupalli narasimhulu joins bjp

బీజేపీలో చేరిన టీడీపీ ఫైర్‌బ్రాండ్‌!!

  టీటీడీపీలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోత్కుపల్లి బీజేపీలో చేరడానికి ముందు.. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో చర్చించిన తరువాత బీజేపీలో చేరారు.  కొన్నాళ్లక్రితం టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మోత్కుపల్లి.. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీకి దూరం అయ్యాక మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. టీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసారని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ నుంచి సంకేతాలు రావడంతో చర్చలు ఫలించి బీజేపీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. మరి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి మోత్కుపల్లి చేరిక ఎలాంటి లాభం తెస్తుందో వేచి చూడాలి.  

MRO Vijaya Reddy burnt alive in hyderabad abdullapurmet

పట్టపగలు తహశీల్దారు సజీవ దహనం

  రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహశీల్దారుగా పని చేస్తున్న విజయారెడ్డి అనే మహిళను ఓ దుండగుడు సజీవ దహనం చేసాడు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు తహసీల్దార్ విజయపై పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ క్రమంలో తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దుండగుడు ఈ ఘటనకు పాల్పడిన అనంతరం తనపై కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ సిబ్బందిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.    తహసీల్దార్ కార్యాలయంలోకి దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు. విజయారెడ్డితో మాట్లాడాలంటూ నిందితుడు ఆమె చాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే తొలుత తహసీల్దార్ విజయారెడ్డి అటెండర్ అడ్డుకొన్నారు. మీటింగ్ పూర్తైన తర్వాత విజయారెడ్డి ఛాంబర్లోకి దుండగుడు వెళ్లినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆమె చాంబర్‌లోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోసి వెంటనే నిప్పంటించాడు. అయితే దుండగుడు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు..? విధుల్లో ఉన్న తహసీల్దార్‌పై ఎందుకు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం ఘటనా స్థలానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేరుకున్నారు.

reason behind ganta srinivasa rao not attends janasena long march

బాబు ఆదేశాలను బేఖాతర్ చేసిన గంటా.. జనసేన లాంగ్ మార్చ్ కు డుమ్మా

  జనసేన లాంగ్ మార్చ్ టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంగ్ మార్చ్ కు హాజరుకావాలని టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశించినప్పటికి రాకపోవటంతో ఆయన టీడీపీని వీడాలని గంటా డిసైడయ్యారనే పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఉన్న వ్యక్తిగత విబేధాలే కారణమని కొందరు వాటిని తోసిపుచ్చుతున్నారు.  విశాఖలో ఏ పార్టీ నుండి పోటీ చేసినా గెలుపు మాత్రం గంటాదే. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన గంటా ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచారు. అప్పట్నుంచీ గంటా ఏ పార్టీ లోకి వెళ్తారా అనే ఆసక్తి  రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓసారి వైసీపీ లో చేరుతారని.. మరోసారి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ గంటా మాత్రం తన మనసులో మాటను బయటపెట్టలేదు. అధినేత ఆదేశించినా లాంగ్ మార్చ్ కి హాజరు కాకపోవడంతో మరోసారి గంటా దారెటు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంటా పార్టీ మారతారా మారితే ఏ పార్టీ ఇదే అంశానికి సంబంధించి పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి. గత కొంతకాలంగా గంటాని చూసినట్లయితే ఒక ప్రణాళికతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు గానే చెప్పొచ్చు.  పవన్ కళ్యాణ్ స్వయంగా టీడీపీని కూడా  కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వనించారు. దానికి టీడీపీ స్పందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా అటు మాజీమంత్రులైన చింతకాయల అయ్యన్న పాత్రుడుతో పాటు గంటా శ్రీనివాసరావును, అచ్చెన్నాయుడుని పాల్గొవాలని ప్రత్యేకంగా ఆదేశించారు. అధినేత ఆదేశం సైతం బేఖాతర్ చేస్తూ ఆయన నిన్న కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు టిడిపిలో ఇటు పొలిటికల్ సర్కిల్ లోనూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది.నిన్న గంటా విశాఖలో అందుబాటు లోనే ఉన్నారు.. అయినా కావాలనే గైర్హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ తో కూడా గంటాకు చిన్న గ్యాప్ ఏర్పడింది. మెగాఫ్యామిలికీ..  చిరంజీవికి చాలా సన్నిహితమైన వ్యక్తి. ఈ మధ్యకాలంలో చిరంజీవి ఎక్కడికి వెళ్లినా సరే ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కాని పవన్ కల్యాణ్ తో మాత్రం చిన్నపాటి గ్యాప్ ఇప్పటికి ఉంది. ఈ నేపథ్యంలో అటు గ్యాప్ పరంగానే దూరంగా ఉన్నారనేది ఒక వాదనైతే ఇటు పార్టీ మారుతున్నందుకే ఆయన రాలేదనేది ఒక వాదన. జనసేన లాంగ్ మార్చ్ కు వస్తే తప్పుడు సంకేతాలు వచ్చే అవకాశాలున్నాయని కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న వాదన. ఈ వాదనలకు తెర పడాలంటే స్వయంగా గంటానే తన మనసులోని మాట బయట పెట్టాల్సి ఉంది.

tender system in kanaka durga temple for photography

దుర్గమ్మ దర్శనం మరింత ఖరీదు.. ఫోటో దిగాలన్నా అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే

  విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం మరింత ఖరీదు కానుంది. జేబు నిండా డబ్బులుంటేనే తప్ప భక్తులు అమ్మ వారిని దర్శించుకోలేరన్న వార్తలు  వినిపిస్తున్నాయి. భక్తుల జేబులను గుల్ల చేసే విధంగా దేవస్థానం అధికారులు నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మ వారిని దర్శించుకునేందుకు వెళ్లే సమయంలో భక్తులు తమ వెంట సెల్ ఫోన్ లు, కెమెరాలు తీసుకువెళ్లకూడదు అనే నిబంధన ఉంది. వాటిని సంబంధిత కౌంటర్ లలో భద్రపరుచుకోవాలి అంటే ఒక్కో వస్తువుకు ఐదు రూపాయలు చెల్లించాల్సి  ఉంటుంది. ఇవి కాకుండా ఇతర సామాన్లు కూడా భద్రపరుచుకోవాలి అంటే వాటికి కూడా రుసుము చెల్లించాల్సిందే. ఇందుకు సంబంధించిన టెండర్ లకు పిలవాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు ముచ్చటపడి దేవాలయ ప్రాంగణాల్లో గుర్తుగా ఫొటోలు దిగాలి అనుకోవడం మరియు సెల్ఫీ తీసుకోవాలి అంటే ఇక పై కుదరదనే చెప్పొచ్చు. కొండ పైనున్న చిన్న రాజగోపురం, మహామండపం, ఏడో అంతస్తు పై పెద్ద రాజగోపురం ఫొటో దిగేందుకు లైసెన్స్ పొందిన ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ లను ఆశ్రయించాలి. వారు చెప్పిందే రేటు, ఇచ్చిందే ఫొటో అన్నట్లు గా స్పాట్ ఫోటోలకు లైసెన్స్ హక్కు కల్పించనున్నారు. ఈ నెల(నవంబర్ 13న) సీల్డ్ టెండర్ లు తెరిచి అర్హులైన వారికి దేవస్థానం అధికారులు లైసెన్స్ లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన 16 నెలల కాలపరిమితితో టెండర్ లను ఆహ్వానించారు. గతంలో చెప్పుల స్టాండ్ లు, క్లాక్ రూములు, సెల్ ఫోన్ లు, కెమెరాలు వంటి వస్తువులను భద్రపరిచే కౌంటర్ లను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చేవారు. భక్తుల నుంచి అదనపు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..భక్తులే ఫ్రీగా సామన్లు భద్రపరుచుకునేందుకు అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భక్తులు తమ వస్తువుల భద్రపరుచుకునేందుకు ఫొటోలు తీసుకునేందుకు మళ్లీ రుసుము చెల్లించాలి అంటూ ప్రస్తుత ఈవో సురేష్ బాబు నిర్ణయించారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. దేవుడిని చూడటానికి డబ్బు చెల్లించాలి.. మా వస్తువులు మేము తెచ్చుకోకుండా ఉండాలంటే కూడా డబ్బు చెల్లించాలి.. దేవుడి దగ్గరికి వచ్చినందుకు గుర్తుగా ఒక ఫోటో దిగాలన్నా కూడా మీరు అడిగినంత డబ్బు చెల్లించాలి.. ఇవేం నిబంధనలు అంటూ భక్తులు మండిపడుతున్నారు.  

Delhi odd even scheme begins as air quality dips to 3 year low

ఢిల్లీ ఇన్ డేంజర్ జోన్... సరి-బేసి పద్దతిలో కాలుష్యాన్ని అరికట్టనున్న కేజ్రీవాల్

  ఢిల్లీ నగరం డేంజర్ జోన్ లో పడింది. వాయు కాలుష్య భూతం జనాల్ని మింగేందుకు సిద్ధంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హస్తిన లో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరడంతో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానానికి చేరింది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది .ఢిల్లీ తో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నేటి నుంచి ప్రభుత్వం సరి బేసి విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందుకోసం రెండు వందల ట్రాఫిక్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసింది. సరి బేసి విధానం పై ఢిల్లీ పౌరులకు అవగాహన కల్పించేందుకు 5000 మంది వాలంటీర్ లకు శిక్షణ ఇచ్చింది ప్రభుత్వం.  ఇవాళ్టి నుంచి 1,3, 5, 7,9 వంటి బేసి అంకెలతో ముగిసే వాహనాలను నవంబర్ 4, 6, 8,12, 14 తేదీల్లో రోడ్ల పైకి అనుమతించరు. అదే విధంగా 0, 2, 4, 6, 8 వంటి సరి సంఖ్య కలిగివున్న వాహనాలు కూడా నవంబర్ 5, 7, 9, 11, 13, 15 తేదీల్లో రోడ్ల పైకి అనుమతించబోమని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు.ఇక సరి బేసి విధానం ఈ నెల 17 తేదీతో ముగుస్తుంది. అప్పడు కూడా కాలుష్యం స్థాయి తీవ్రంగా ఉంటే సరి బేసి విధానాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల రిజిస్ర్టేషన్ నెంబర్ ఉన్న వాహనాలకు కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. బైకులను.. ఎలక్ట్రిక్ వాహనాలను..ఈ పరిమితుల నుంచి మినహాయించారు. అంబులెన్స్ లు , స్కూల్ వాహనాలు, వీఐపీ వాహనాలని కూడా మినహాయించారు. సరి బేసి విధానాన్ని ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.4000 జరిమాన విధించనున్నారు.  మరోవైపు ఈ విధానాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీధుల్లో కారులో వెళుతూ నిబంధనలని దిక్కరించారు రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్. ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం అనేక అత్యవసర నియంత్రణలు చేపట్టిందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రజలు సరి బేసి నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము ఎవ్వరినీ నిందించాలనుకోవడం లేదని.. రాజకీయాలు పక్కన పెట్టి ఈ కాలుష్య కోరల్లో నుండి బయటపడేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. ఇటు బాలీవుడ్ నటులు కూడా ఢిల్లీ కాలుష్యం పై తమ వైఖరిని  ప్రకటించారు. ముఖానికి ముసుగు ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నటి ప్రియాంకా చోప్రా. ఢిల్లీ గాలి కాలుష్యం పై ట్విట్టర్ లో ఆందోళన వ్యక్తం చేశారు నటుడు రిషి కపూర్.  ప్రస్తుతం ఢిల్లీ లోని వేర్వేరు ప్రాంతాల్లో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పైగానే నమోదవుతోంది. మాస్క్ లు లేకుండా బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి రావటానికి భౌగోళిక వాతావరణ పరిస్థితులకు తోడు మానవ తప్పిదాలు ఎక్కువగా కారణం అవుతున్నాయి. ఢిల్లీతో సహా కొన్ని ఉత్తరాది నగరాల్లో వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యాన్ని అమాంతం పెంచేస్తున్నాయి.కాన్పూర్ ఐఐటీ చేసిన అధ్యయనం ప్రకారం ఢిల్లీలో విడుదలయ్యే కాలుష్యంలో అత్యధిక వాటా వాహనాలదే అని తేల్చింది. వాహనాల రాకపోకల కారణంగా రోడ్ల మీద నుంచి వాతావరణం లోకి చేరే దుమ్ము ధూళితో 36శాతం.. వాహనాల కారణంగా 25 శాతం కాలుష్యం ఏర్పడుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వంట గదుల నుంచి విడుదలయ్యే కాలుష్యం వాటా 22 శాతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో భారీ పరిశ్రమల కారణంగా మరో 22 శాతం కాలుష్యం విడుదలవుతోందనే స్పష్టం చేసింది.

5 year old girl died after fell into a 50 feet deep borewell

సుజిత్ మరణం మరవకముందే.. బోరు బావిలో పడి మరో చిన్నారి మృతి

  దేశంలో టెక్నాలజీ పెరుగుతూనే ఉంది. కూర్చున్న చోటు నుంచే ప్రపంచ నలుమూలల్లో ఏ పనైనా చేయగలిగే సామర్ధ్యం ఉంది. కానీ నీటి కోసం తవ్విన బోరు బావిని పూడ్చలేరు.. తెలిసి తెలియక ఆడుకుంటూ అందులో పడిన చిన్నారులను కాపడలేరు. బోరు బావిలో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తమిళనాడులో చిన్నారి సుజిత్ విషాద గాధను మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. హర్యాణ , కర్నాల్ జిల్లాలో శివాని అని ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయింది. హరిసింగ్ పురా గ్రామానికి చెందిన ఈ చిన్నారి సాయంత్రం తమ పొలంలో ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయింది. కొంతసేపటికి తల్లిదండ్రులు బోరు బావిలో చిన్నారి పడినట్టుగా గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులను.. అధికారులను.. ఆశ్రయించారు. చిన్నారి 60 అడుగుల లోతులో ఉన్నట్టుగా గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. శివానిని విజయవంతంగా బయటకు తీశారు.. కానీ ఆసుపత్రికి తరలించేలోపే శివాని ప్రాణాలు కోల్పోయింది. ఐదేళ్ల చిన్నారిని ప్రాణం లేకుండా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు చెందారు. ఇండియా నుంచి అమెరికాకి సెకన్లలో ఫోన్.. మెసేజ్.. చేయగలిగే టెక్నాలజీని కనుగొన్నారే కానీ కళ్లముందు 60 అడుగుల లోతులో ఉన్న చిన్నారి ప్రాణాలను సురక్షితంగా కాపాడే టెక్నాలజీని ఎప్పుడు కనిపెడతారో అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Priyanka Gandhi Phone Hacked Through WhatsApp Spyware

ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్.. బీజేపీ పై డౌట్!!

  ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారంటూ ఉండరు. మనం చేసే ప్రతి పనికి ఫోన్ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాట్సాప్..ఫేస్బుక్..ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియా లొనే సగం జీవితం గడిపేస్తున్నాము. ఇంతకు ముందు ఇంట్లో చొరబడి దొంగలు దోచుకున్నారు అనేవారు.. ఇప్పుడు ఎవరో ఫోన్ హ్యాకింగ్ చేసి నా సమాచారం దోచుకున్నారని అంటున్నారు. సామాన్యుల ఫోన్ లే హ్యాకింగ్ కి గురవుతుంటే..బడా బాబులు.. ముఖ్యనేతల మొబైలను వదులుతారా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాకింగ్ కు గురైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే అది నిజమేనేమో అని సందేహం కలుగుతుంది.  ఇజ్రాయిల్ కు చెందిన పెగాసన్ స్పైవేర్ సంస్థ కొందరు ఫోన్ లోని వాట్సాప్ లోకి చొరబడింది అన్న వార్తల నడుమ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఇప్పటి వరకూ స్పైవేర్ ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్ల లోకి చొరబడిందని.. అందులో ప్రియాంక గాంధీ కూడా ఉన్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ కు గురైన వారందరికీ స్పైవేర్ సంస్థ ఒక సందేశం పంపించిందని..అదే సందేశం ప్రియాంక గాంధీకి కూడా పంపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ ఫోన్ లు కూడా హ్యాకింగ్ కి గురైనట్లు కాంగ్రెస్ చెబుతోంది. ఇది బీజేపీ పనేనని ప్రభుత్వమే హ్యాకింగ్ చేయించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. స్పైవేర్ సంస్థ వాట్సాప్ లోకి చొరబడినట్లు స్వయంగా సంస్థనే సోషల్ మీడియాలో వెల్లడించింది. నాయకులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉద్యమ నేతలకు ముప్పు ఉందని.. వీరి ఫోన్లోని సమాచారం ఇతర దేశాలకు చేరే ప్రమాదముందని వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపధ్యం లోనే స్పైవేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమపై నిఘా పెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

అయోధ్య కేసులో తుది తీర్పు... యూపీ , మధ్యప్రదేశ్ లో హై అలర్ట్

  అయోధ్య తీర్పు వెల్లడికానున్న నేపథ్యంలో దేశం అంతటా అప్రమత్తమవుతున్నారు. యూపీ సీఎం ఆదిత్య నాథ్ తన మంత్రులను అలర్ట్ చేశారు. తీర్పు రానున్న కారణాన ఎవ్వరు నోరు జారవద్దని ఆదేశించారు. యూపీ ఒక్కటే కాకుండా అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పోలీసులకు సెలవులను రద్దు చేసింది. వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం మరికొద్దిరోజుల్లో తుది తీర్పు ప్రకటించనుంది. ఎన్నో ఏళ్లు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత వచ్చే ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. దేశంలో అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్పు వచ్చినా దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  అలర్ట్ అవుతున్నాయి. తీర్పు వచ్చే వరకు నోటికి పని చెప్పకుండా ఉండమని తన మంత్రులకు.. సహచరులకు.. యూపీ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ కాస్త గట్టి గానే హెచ్చరించారని తెలుస్తుంది. సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించక ముందే అధికార ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నట్లు అర్థం వచ్చేలా ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని మంత్రులకు యోగి సూచించారు. ఈ విషయంలో బిజెపి అధిష్టానం కూడా హెచ్చరికలు జారీ చేస్తూ.. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా వేడుకలూ చేసుకోకూడదనే నిబంధన విధించింది. తీర్పు తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. మిలాద్ ఉన్ నబి, గురునానక్ జయంతి లాంటి పర్వదినాల్లో అయోధ్య కేసు తీర్పు వెలువడనుంది. దీంతో శాంతి భద్రతలను దృష్టి లో పెట్టుకొని నవంబరు 1 నుంచి పోలీస్ అధికారులు సిబ్బంది ఎలాంటి సెలవులు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ  ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు పోలీసులు సెలవు పెట్టకూడదని అందులో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకోవాల్సి వస్తే సీనియర్ల అనుమతి తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చరిత్రాత్మక నిర్ణయం కావడంతో దేశంలోని అందరి కళ్ళు అయోధ్య తీర్పు పైనే ఉన్నాయి.

స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకి వెళ్ళారా విజయసాయిరెడ్డి గారు: పవన్

  ఆదివారం జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై  విరుచుకపడ్డారు. టీడీపీకి టీం బి..టీడీపీకి దత్తపుత్రుడు..డీఎన్ఏ..అంటూ తన గురుంచి ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేసే హక్కు వైసీపీ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారన్నారు. ఎందరో మహనీయులు అంబేద్కర్..కాన్షీరాం..లాంటి వారే పరాజయం చెందారని వైసీపీ నేతలకు గుర్తు చేశారు. దెబ్బ తిన్నా మళ్లీ పైకి లేస్తా అన్నారు.  వ్యక్తిగతంగా తాను అందరికి చాలా గౌరవం ఇస్తానని..2004లోనే నా జోలికి రావొద్దని బొత్సకి కబురు పంపించానని తెలిపారు. విజయసాయిరెడ్డి  స్థిమితం లేనట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారని.. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని..జీవితంలో చాలాసార్లు దెబ్బలు తిన్నానని పవన్ స్పష్టంగా చేసారు. ఎన్నికల్లో నిలబడలేకుండా..దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులనే రాజ్యసభకు పంపిస్తారు కానీ..సూట్ కేసుల కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా విమర్శలు చేస్తుంటే..సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు సంవత్సరాల జైలులో ఉన్న వ్యక్తి విమర్శలు చేస్తారా ? అని ప్రశ్నించారు. తనకు భయం లేదని..ఇంటి ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందన్నారు. అయినా విజయసాయిరెడ్డి ఏదో స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకి వెళ్లినట్లు నీతులు మాట్లాడుతున్నారని పవన్ సెటైర్లు వేశారు.

పంచాయతీరాజ్ శాఖలో భారీ అవినీతి :- సీఎం సార్ మీరే దిక్కు అంటున్న కాంట్రాక్టర్లు

  రాజ్యం బాగుండాలంటే రాజు ఒక్కడే బాగుంటే సరిపోదు కదా.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత రివర్స్ టెండరింగ్ అంటూ ఆయన నిధులను ఆదా చేస్తుంటే శాఖాధికారులు మాత్రం స్వాహా చెయ్యడానికి చూస్తున్నారు.గ్రామాల్లోని రోడ్లు..మౌలిక వసతులలో పెను మార్పులు తీసుకురావడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొదలైంది. అలాంటి ప్రాజెక్టుకు అవినీతి మరక అంటిస్తున్నారు. టెండర్ లు పూర్తయి ఒప్పందం చేసుకున్న పనులను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఏపీలోని పట్టణాలను.. నియోజకవర్గాలను.. కలుపే రోడ్లను అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అధికారుల సుదీర్ఘ కసరత్తు తరువాత వందల కిలోమీటర్లలో రోడ్లు నిర్మించి ఈ ప్రాజెక్టుకు బ్యాంకు నుంచి రుణం పొందగలిగారు. ఏపీ రూరల్ రీస్ట్రచరింగ్ ప్రాజెక్టు పేరిట మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు కు ఏషియన్ బ్యాంక్ రుణం ఇవ్వటానికి ముందుకు వచ్చింది. దీంతో అధికారులు 55 ప్యాకేజీల కింద రెండు మూడు నియోజికవర్గాల రోడ్లను కలిపి టెండర్లకు పిలిచారు. టెండర్ లు దక్కించుకున్న కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. కొందరు పనులు కూడా మొదలు పెట్టారు. అయితే పంచాయతీ రాజ్ శాఖలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై అవినీతి నీడలు కమ్ముకొంటున్నాయి. టెండర్ లు అగ్రిమెంట్ పూర్తయిన పనులను నిలిపేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కోట్లకు సంభందించిన పనులు కావడంతో దీని పై పంచాయతీ రాజ్ శాఖలోని పెద్దలకు కన్నుపడింది. నిబంధనల ప్రకారం ఆ టెండర్లను రద్దు చేయటం సాధ్యం కాకపోవడంతో ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారితో కొత్త పంచాయితీ మొదలుపెట్టారనే వాదన వినిపిస్తుంది. తాము సూచించిన వారి పేరుతో ఎస్ యూ ఖాతా తెరవాలని ఓ ఉన్నతాధికారి ఒత్తడి తెస్తున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ లు వెళ్లి జిల్లా మంత్రులను.. ముఖ్య నాయకులను.. కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓ జిల్లా మంత్రి స్వయంగా దీని పై పంచాయతీ రాజ్ శాఖ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఆ ఉన్నతాధికారి ఒత్తిళ్లు ఆగలేదని సమాచారం. ఒప్పందాలు జరిగిన సమయంలో తాము కొంత ఖర్చు పెట్టుకున్నామని.. ఇప్పుడు కొత్త గా ఇబ్బందులు సృష్టిస్తే పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్ లు వాపోతున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా జరిగితే మండల.. నియోజకవర్గ స్థాయిలో అనూహ్య మార్పులు వస్తాయి. మౌలిక సదుపాయాలు పెరిగి  ఊర్ల రూపురేఖలు మారిపోతాయి. అయితే స్వయంగా ఏషియన్ బ్యాంక్ నిధులు ఇచ్చిన ఇలాంటి ప్రాజెక్టుకు అవినీతి లెక్కలతో అడ్డు తగలడంపై పెద్ద చర్చే జరుగుతుంది. పనులు రద్దు అయితే ప్రాజెక్టుకు ఆర్థిక కష్టాలు తప్పవని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఎలాగైనా ఈ సమస్య ను సీఎం దృష్టి కి తీసుకెళ్లి కొత్తగా మొదలైన అకౌంట్ వివాదానికి ముగింపు పలకాలని కాంట్రాక్టర్ లు భావిస్తున్నారు.    

సమ్మె ఆగదు.. ఉద్యోగాల్లో తిరిగి చేరేది లేదు.. :- ఆర్టీసీ జేఏసీ 

  సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపకుండా విధుల్లోకి వచ్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. ఉద్యోగాలు తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని.. అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తేనే మీరు చెప్పినట్లు యూనియన్లు రద్దు చేసుకుంటామన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలచి.. లేబర్ యాక్ట్ ప్రకారం చర్చలు జరిపితే మంచిదన్నారు. కేసీఆర్  ఇచ్చే వార్నింగ్ లకు భయపడి కార్మికులెవరూ తిరిగి విధుల్లో చేరే ఆలోచనకు రావొద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. పోరాటం మొదలు పెట్టాం..ధైర్యంగా ముందు వెళదామని.. ఆత్మద్రోహం చేసుకుని విధుల్లోకి చేర వలసిన అవసరం లేదని చెప్పారు. నిరుద్యోగుల విజ్ఞప్తితో నవంబర్ 5న చేయాలనుకున్న సడక్ బంద్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలతో సమాణికులని చెప్పినందుకు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు జేఏసీ నేతలు. నవంబర్ 5 అర్థరాత్రి లోగా ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా 5వేల బస్సులు ప్రైవేట్ కు ఇస్తే.. చివరకు 5వేల బస్సులు మాత్రమే మిగులుతాయని జోస్యం చెప్పారు.కేసీఆర్ చెప్పిన విధంగా చూస్తే 5వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరం అవుతారని.. మిగతా 23వేల మంది కార్మికులను ఏం చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అశ్వత్థామరెడ్డి. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వం కోరినట్లు యూనియన్లను వైండప్ చేస్తామని తెలియజేసారు. కార్మికులను భయపెట్టేలా సీఎం మాట్లాడారని జేఏసీ నేతలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం(నవంబర్ 3,2019) టీఎంయూ కార్యాలయంలో సమావేశం అయ్యారు ఆర్టీసీ జేఏసీ నేతలు. భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్  చేసిన కామెంట్స్ పై చర్చించారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోందని జేఏసీ నేతలు ఆరోపించారు. నవంబర్ 4 నుండి డిపో మేనేజర్లు సమ్మెకు మద్దతివ్వాలని జేఏసీ నేతలు కోరారు.