ఢిల్లీ ఇన్ డేంజర్ జోన్... సరి-బేసి పద్దతిలో కాలుష్యాన్ని అరికట్టనున్న కేజ్రీవాల్
ఢిల్లీ నగరం డేంజర్ జోన్ లో పడింది. వాయు కాలుష్య భూతం జనాల్ని మింగేందుకు సిద్ధంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హస్తిన లో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరడంతో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానానికి చేరింది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది .ఢిల్లీ తో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నేటి నుంచి ప్రభుత్వం సరి బేసి విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందుకోసం రెండు వందల ట్రాఫిక్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసింది. సరి బేసి విధానం పై ఢిల్లీ పౌరులకు అవగాహన కల్పించేందుకు 5000 మంది వాలంటీర్ లకు శిక్షణ ఇచ్చింది ప్రభుత్వం.
ఇవాళ్టి నుంచి 1,3, 5, 7,9 వంటి బేసి అంకెలతో ముగిసే వాహనాలను నవంబర్ 4, 6, 8,12, 14 తేదీల్లో రోడ్ల పైకి అనుమతించరు. అదే విధంగా 0, 2, 4, 6, 8 వంటి సరి సంఖ్య కలిగివున్న వాహనాలు కూడా నవంబర్ 5, 7, 9, 11, 13, 15 తేదీల్లో రోడ్ల పైకి అనుమతించబోమని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు.ఇక సరి బేసి విధానం ఈ నెల 17 తేదీతో ముగుస్తుంది. అప్పడు కూడా కాలుష్యం స్థాయి తీవ్రంగా ఉంటే సరి బేసి విధానాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల రిజిస్ర్టేషన్ నెంబర్ ఉన్న వాహనాలకు కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. బైకులను.. ఎలక్ట్రిక్ వాహనాలను..ఈ పరిమితుల నుంచి మినహాయించారు. అంబులెన్స్ లు , స్కూల్ వాహనాలు, వీఐపీ వాహనాలని కూడా మినహాయించారు. సరి బేసి విధానాన్ని ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.4000 జరిమాన విధించనున్నారు.
మరోవైపు ఈ విధానాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీధుల్లో కారులో వెళుతూ నిబంధనలని దిక్కరించారు రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్. ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం అనేక అత్యవసర నియంత్రణలు చేపట్టిందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రజలు సరి బేసి నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము ఎవ్వరినీ నిందించాలనుకోవడం లేదని.. రాజకీయాలు పక్కన పెట్టి ఈ కాలుష్య కోరల్లో నుండి బయటపడేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. ఇటు బాలీవుడ్ నటులు కూడా ఢిల్లీ కాలుష్యం పై తమ వైఖరిని ప్రకటించారు. ముఖానికి ముసుగు ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నటి ప్రియాంకా చోప్రా. ఢిల్లీ గాలి కాలుష్యం పై ట్విట్టర్ లో ఆందోళన వ్యక్తం చేశారు నటుడు రిషి కపూర్.
ప్రస్తుతం ఢిల్లీ లోని వేర్వేరు ప్రాంతాల్లో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పైగానే నమోదవుతోంది. మాస్క్ లు లేకుండా బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి రావటానికి భౌగోళిక వాతావరణ పరిస్థితులకు తోడు మానవ తప్పిదాలు ఎక్కువగా కారణం అవుతున్నాయి. ఢిల్లీతో సహా కొన్ని ఉత్తరాది నగరాల్లో వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యాన్ని అమాంతం పెంచేస్తున్నాయి.కాన్పూర్ ఐఐటీ చేసిన అధ్యయనం ప్రకారం ఢిల్లీలో విడుదలయ్యే కాలుష్యంలో అత్యధిక వాటా వాహనాలదే అని తేల్చింది. వాహనాల రాకపోకల కారణంగా రోడ్ల మీద నుంచి వాతావరణం లోకి చేరే దుమ్ము ధూళితో 36శాతం.. వాహనాల కారణంగా 25 శాతం కాలుష్యం ఏర్పడుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వంట గదుల నుంచి విడుదలయ్యే కాలుష్యం వాటా 22 శాతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో భారీ పరిశ్రమల కారణంగా మరో 22 శాతం కాలుష్యం విడుదలవుతోందనే స్పష్టం చేసింది.