మద్దతు ఉపసంహరించుకుంటాం... కేసీఆర్ కి సీపీఐ వార్నింగ్
posted on Oct 10, 2019 @ 2:50PM
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్కు సీపీఐ వార్నింగ్ ఇచ్చింది. టీఆర్ఎస్కి మద్దతు ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేయడంతో ... హుజూర్నగర్లో టీఆర్ఎస్కు మద్దతుపై పునరాలోచిస్తామని సీపీఐ ప్రకటించింది. ఆర్టీసీ కార్మిక జేఏసీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న చాడ వెంకట్ రెడ్డి... ఆర్టీసీ కార్మికులకు సీపీఐ అండగా ఉంటుందని ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నికపై పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తమ్ కు షాకిచ్చి, ఎలాగైనాసరే హుజూర్ నగర్ లో గులాబీ జెండా పాతాలని కంకణం కట్టుకున్న టీఆర్ఎస్ ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే సీపీఐ మద్దతు తీసుకుంది. సీపీఐ కూడా అధికార పార్టీ అడిగేసరికి ఓకే చెప్పింది. అయితే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో... టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచిస్తామంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటన చేశారు.
అసలే, హుజూర్ నగర్ లో పార్టీ పరిస్థితి బాగాలేదని సర్వేలు చెబుతున్నాయి. మండలాలు, గ్రామాలు, వార్డులు వారీగా నేతలను రంగంలోకి దింపి ప్రజలను కలుస్తున్నా, గెలుపు అవకాశాల్లేవని కేసీఆర్ సర్వేల్లోనూ, ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ లోనూ తేలింది. ఇక, ఇప్పుడు ఒకవైపు ఆర్టీసీ సమ్మె ప్రభావం... మరోవైపు అంతోఇంతో బలమున్న సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ హెచ్చరించడంతో, టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరి సీపీఐ హెచ్చరికపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.