cm jagan may consider Lakshmi Parvathi for apsrtc chairman post

ఆర్టీసీ రేసులో అంబటి, లక్ష్మీపార్వతి... మరి జగన్ మొగ్గు ఎవరి వైపో?

  ఎన్నికలకు ముందు పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపిస్తూ, చంద్రబాబుపై విరుచుకుపడిన వారందరికీ దాదాపు పదవులు కట్టబెట్టారు జగన్. పలువురికి పిలిచిమరీ పోస్టులిచ్చారు. అయితే, చంద్రబాబుపై ప్రత్యేక అస్త్రంగా ప్రయోగించిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి మాత్రం ఇంకా ఏ పదవీ ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎందుకంటే, చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శిస్తూ వైసీపీ వాయిస్ ను బలంగా వినిపించిన తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. అయితే, ఎన్నికల టైమ్ లో లక్ష్మీపార్వతి అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ, అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారట. అయితే, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదారు నెలలు కావొస్తున్నా, తనను అసలు పట్టించుకోవడం లేదని, కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబును తిట్టడానికి మాత్రం వాడుకున్నారని కినుక వహించారని తెలుస్తోంది.    అయితే, వైసీపీ స్థాపించిననాటి నుంచి వెంటనడిచిన లక్ష్మీపార్వతికి ఏదోఒక పదవి కట్టబెట్టాలని జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, లక్ష్మీపార్వతి కోసం ఒక పోస్టును సిద్ధంచేస్తున్నట్లు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ఏదోఒక కార్పొరేషన్ కు ఛైర్మన్ గా పంపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అయితే, కీలకమైన ఈ నామినేటెడ్ పోస్టు కోసం మరికొందరు పోటీపడుతున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు రేసులోకి వచ్చారట. మంత్రి పదవి దక్కకపోవడంతో కనీసం ఆర్టీసీ ఛైర్మన్ పదవైనా ఇవ్వాలని అంబటి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అంబటి రేసులోకి రావడంతో లక్ష్మీపార్వతికి ఇప్పట్లో పదవి దక్కేది అనుమానమేనంటున్నారు. కోడెలను ఓడించడమే కాకుండా, పార్టీకి బలమైన గొంతుగా పనిచేసిన అంబటికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశముందంటున్నారు. మరి, ఆర్టీసీ స్టీరింగ్ ఎవరికి దక్కుతుందో, ఛైర్మన్ గిరిని జగన్ ఎవరికి కట్టబెడతారో చూడాలి. అయితే, అంబటి, లక్ష్మీపార్వతిల్లో ఎవరో ఒకరికి ఆర్టీసీ పగ్గాలు దక్కుతాయో లేక మరొకరికి ఆఫర్ చేస్తారోనన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది.

dharmapuri arvind on top place in bjp website

బీజేపీలో ధర్మపురి అర్వింద్ రికార్డు... అప్పుడు కవితను ఓడించి... ఇప్పుడు ఇలా...

  ధర్మపురి అర్వింద్... ఒకప్పుడు ధర్మపురి శ్రీనివాస్....అదే డీఎస్ కొడుకుగా మాత్రమే కొందరికి తెలుసు... అది కూడా నిజామాబాద్ వరకే అర్వింద్ ఎవరో తెలిసేది... డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ చీఫ్ గా పనిచేసినా... ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కి సన్నిహితుడిగా మారినా... అర్వింద్ మాత్రం తన సొంత గుర్తింపు కోసం ప్రయత్నించారు. తండ్రి, సోదరుడికి భిన్నంగా బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ కు సొంతంగా బాటలు వేసుకున్నారు. అర్వింద్ బీజేపీలో చేరినప్పుడు ఓ అనామకుడే. తెలంగాణ ముఖ్యనేతలే అర్వింద్ ను పట్టించుకునేవారు కాదు. ఇక ఢిల్లీలో అయితే అర్వింద్ పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఢిల్లీ నేతలైతే అర్వింద్ ను ఓ పురుగును చూసినట్లు చూసేవారట. దాంతో, రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ అర్వింద్ కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత అర్వింద్ పేరు ఢిల్లీలో మారుమోగిపోయిందట. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడించిన యువనేతగా అర్వింద్ కి ఒక్కసారిగా గౌరవం పెరిగింది. ఎందుకంటే, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురిగానే కాకుండా, మంచి వాగ్దాటితో పార్లమెంట్ లో మాట్లాడే కవితకు ఢిల్లీలో మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి కవితను ఓడించి పార్లమెంట్ లో అడుగుపెట్టిన ధర్మపురి అర్వింద్ కు బీజేపీ అగ్ర నాయకత్వంలో గుర్తింపు లభించింది. ధర్మపురి అర్వింద్, ఇప్పుడు, మరో ఘనత సాధించారు. అత్యధిక యాక్టివ్ మెంబర్-షిప్ చేయించి ముఖ్యనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీలో అత్యధిక మెంబర్ షిప్ చేయిస్తే ముఖ్యనేతగా గుర్తించే ఆనవాయితీ ఉంది. అందుకే, బీజేపీలో ప్రతి ఒక్కరూ అత్యధిక మెంబర్ షిప్ చేయించేందుకు పోటీపడతారు. అది కూడా యాక్టివ్ మెంబర్ షిప్ చేయిస్తేనే... ముఖ్యమైన నేతగా గుర్తిస్తారు. ఆ కేటగిరిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సత్తా చాటారు. ఇప్పటివరకు 35వేలకు పైగా సభ్యత్వాలు చేయించి దూకుడు మీదున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్వింద్ సొంత ఐడీపై 35వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. దేశంలో ఏ బీజేపీ లీడరూ... ఈ రేంజ్‌లో మెంబర్‌షిప్స్‌ చేయించలేదని, ఇదొక రికార్డని, కమలనాథులు మాట్లాడుకుంటున్నారు. ధర్మపురి అర్వింద్... తన వ్యక్తిగత ఐడీపై ఈ స్థాయిలో యాక్టివ్ మెంబర్ షిప్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వెబ్ సైట్ లో ధర్మపురి అర్విందే టాప్ లో ఉన్నారు. బీజేపీలో చేరిననాటి నుంచి ఇప్పటివరకు పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా తూచా తప్పకుండా పాటిస్తారనే గుర్తింపు అర్వింద్ కి ఉంది. అంతేకాదు ఏ పని అప్పగించినా సక్సెస్ చేస్తారనే పేరుంది. తెలంగాణలో ఆయుష్మాన్ భవ పథకం అమలు కాకపోయినా... అమిత్ షా పిలుపు మేరకు అర్వింద్ తన సొంత ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అధిష్టానంతో శెభాష్ అనిపించుకున్నారట. ఇప్పుడు, యాక్టివ్ మెంబర్ షిప్ లో దేశంలోనే నెంబర్ వన్ పొజీషన్ దక్కించుకోవడంపై అర్వింద్ అనుచరులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి కవితను ఓడించినప్పుడు ఢిల్లీలో అర్వింద్ పేరు మారుమోగగా, ఇప్పుడు అత్యధిక యాక్టివ్ మెంబర్ షిప్ తో మరోసారి జాతీయ నాయకత్వం దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

CM KCR New Formula For TSRTC

ఆర్టీసీలో 50+30+20 ఫార్ములా... సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ అడుగులు

  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆగ్రహంతో రగిలిపోతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. వెయ్యి శాతం ఇప్పుడున్న ఆర్టీసీ ఉండబోదని ఇంతకుముందే చెప్పిన కేసీఆర్... ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఆర్టీసీని మూడు ముక్కలు చేయడంతోపాటు 50+30+20 ఫార్ములాను ముందుకు తెచ్చిన కేసీఆర్... దాన్ని అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. అందుకే ఆర్టీసీపై చర్చించేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు.    నవంబర్ ఒకటిన సమావేశంకాబోతున్న మంత్రివర్గం... ఆర్టీసీపై అత్యంత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు. అందుకు అనుగుణంగా కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అద్దె బస్సులను 30శాతానికి పెంచడం... అలాగే 20 శాతం రూట్లను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడంలాంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఆర్టీసీ కార్మికులు దిగిరాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. ఆర్టీసీ స్వరూపాన్నే సమూలంగా మార్చేయాలని యోచిస్తున్న కేసీఆర్‌.... సంస్థను మూడు ముక్కలు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంచడంతోపాటు కొన్ని రూట్లను ప్రైవేటుకుపరం చేయనున్నారు.

minister anil kumar yadav targets anam ramanarayana reddy

సింహపురిలో ఆనం వర్సెస్ అనిల్... వైసీపీలో కలకలం రేపుతోన్న ఆధిపత్య పోరు

  రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు... అప్పటివరకు చక్రం తిప్పినోళ్లు అనామకులుగా.... అనామకులు అకస్మాత్తుగా రాజులుగా అవతరించొచ్చు... ఇది ప్రపంచంలో ఎక్కడైనా... ఎప్పుడైనా జరిగేదే అయినా.... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇటీవల ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. దశాబ్దాలు తరబడి చక్రం తిప్పిన ఉద్ధండ రాజకీయ నాయకులు... ఇఫ్పుడు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నమొన్నటివరకు తమ దగ్గర పనిచేసివాళ్లే... ఇప్పుడు రాజులుగా మారి... శాసించే స్థాయికి చేరడంతో... ఏమీచేయలేక సైలెంటైపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా సింహపురి రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందట.  మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి నేతలెందరో... ఆనం కింద పనిచేసినవాళ్లే... కానీ ఇప్పుడు రోజులు మారాయి. అధికారం, ప్రాధాన్యతల్లో చాలా వ్యత్యాసం వచ్చింది. దాంతో ఆనం పరిస్థితి ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా తయారైంది. మరోవైపు జిల్లాలో ఎక్కడా ఆనం పేరు వినిపించకుండా మంత్రి అనిల్,  ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ ఆనం కుటుంబ పెత్తనముందో గుర్తించి... కట్టడికి ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా వీఆర్ విద్యాసంస్థల్లో ఆనం రామనారాయణరెడ్డి పెత్తనం లేకుండా చేసేందుకు మంత్రి అనిల్ చక్రం తిప్పారు. 114ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల విద్యాసౌధానికి యాభై ఏళ్లుగా ఆనం కుటుంబమే యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే, ఆనం ఫ్యామిలీ నుంచి ఆ పెత్తనాన్ని లాక్కునేందుకు మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వీఆర్ విద్యాసంస్థలను పరిశీలించిన అనిల్, కోటంరెడ్డిలు కొత్త యాజమాన్యం రాబోతోందంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు ఇకపై ఆనం పెత్తనాన్ని ఒప్పుకునేది లేదంటూ మాజీ పాలక వర్గాన్ని ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారు.  మొత్తానికి వీఆర్ విద్యాసంస్థల వేదికగా సింహపురి రాజకీయాలు ఇప్పుడు ఆనం వర్సెస్ అనిల్ గా మారాయనే చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పటికే కోటంరెడ్డి-కాకాని గొడవతో జిల్లాలో వైసీపీ పరువు పోయిందని, ఇప్పుడు ఆనం వర్సెస్ అనిల్ గా సాగుతోన్న ఆధిపత్య రాజకీయం ఎటువైపు దారి తీస్తాయోనని సింహపురి వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.

Resignation letter of party MLA from Gannavaram

చంద్రబాబులో మొదలైన సరి కొత్త టెన్షన్......

  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం బిజెపి రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరితో విందు రాజకీయం టిడిపి అధినేత చంద్రబాబులో టెన్షన్ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిందట. ఈ నేపధ్యం లోనే ప్రకాశం జిల్లాలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడటం ఇప్పుడు ఉత్కంఠకు తెరలేపింది. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజక వర్గాల్లో టిడిపి అభ్యర్ధులే గెలిచారు. చీరాలలో కరణం బలరాం, కొండేపిలో బాలవీరాంజనేయస్వామి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పరుచూరులో ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. అయితే వీరు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుక విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నిరసనలు తెలిపింది. కానీ ప్రకాశం జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. రాష్ట్రమంతా టిడిపి శ్రేణులు ఇసుక విధానంపై ఆందోళన చేస్తుంటే అదే సమయంలో కరణం బలరాం బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో భేటీ జరిపారు. కరణం బలరాంను బిజెపిలో చేరమని సుజనా ఎప్పట్నుంచో అడుగుతున్నారట. దాంతో వీరిద్దరి భేటీ పార్టీలో కలకలం రేపింది. ఈ విషయాలన్నింటినీ గమనించిన చంద్రబాబు చీరాల, పర్చూరు, కొండెపి ఎమ్మెల్యేలతో విడివిడిగా చాలా సేపు ఫోన్ లో మాట్లాడం జరిగింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడంతో చంద్రబాబులో మరింత టెన్షన్ పెరిగిపోయింది. అయితే రెండ్రోజుల క్రితం రాత్రి చంద్రబాబును గొట్టిపాటి విజయవాడలో నేరుగా కలిశారని తెలుస్తుంది. వాళ్లిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం అయితే బయటకు రాలేదు. వంశీ రాజీనామా ఎపిసోడ్ తో పార్టీలో ఉండేదెవరో వెళ్లిపోయేదెవరో అర్థం కాక చంద్రబాబులో బిపి పెరిగిపోతోంది అని సమాచారం. అందుకే అందరు ఎమ్మెల్యేలతో తరచుగా  మాట్లాడుతూ ఆరాలు తీస్తున్నారని సమాచారం. మొత్తానికీ ప్రతిపక్షంలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఉండేదెవరు ఊడెదెవరూ అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలుగు తమ్ముళ్లు వారి వైఖరిని వ్యక్తం చేస్తున్నారు.

TSRTC Strike In Telangana Enters 26th Day

రేపటి దీక్షను ప్రధాన లక్ష్యంగా చేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం.....

  ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సకల జనులు సమరభేరి బహిరంగ సభ ముగిసింది. ఉద్యమంలో భాగంగా రేపు ఒక్క రోజు దీక్షలో ఇరవై నాలుగు గంటల పాటు కార్మికులు దీక్షలో కూర్చోవాలని పిలిపునిచ్చారు. విలీనమై ప్రధాన ఎజెండాగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రధానమని కార్మికులు ఈ సభ ద్వారా తెలియచేసారు. పలువురు నేతలు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీలో సకల జనుల సమ్మెను మించి ఇప్పుడు కార్మికులు ఐక్యంగా పోరాడుతున్నారన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామరెడ్డి. సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు కార్మికులంతా ఐక్యంగా ముందుకు సాగాలని కార్మికులలో విభేదాలు తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు టిటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ. ఇరవై ఐదు రోజులుగా ఉన్న తమ ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేసిఆర్ కుట్రలు పన్నుతారని, ఏ కుట్రకు కూడా తాము తలవంచకుండా ఐకమత్యంగా ఉండాలి అని టిటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ తెలియజేశారు.ఆర్టీసీ కార్మకుల పట్ల కేసీఆర్ తండ్రిగా భావించి సమస్యలు పరిష్కరించాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత బి  హనుమంతరావు. కార్మికుల వెంటే కాంగ్రెస్ ఉంటోందని బీహెచ్ హామీ ఇచ్చారు. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న వారంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని వాపోయారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ. పేదలు ఎక్కువగా ఉపయోగించే సంస్థనే నాశనం చేసేందుకే సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది అన్నారు.

Heavy rains forecast for Telugu States in next 48 hours

మరో నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు...

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒంగోలులో భారీ వర్షం కురిసింది, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, మరో నలభై ఎనిమిది గంటల్లో ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణాలో ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఒక మోస్తరులో వర్షాలు పడుతున్నాయి. వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు, మూడు రోజులకు తెరిపిచ్చిన తర్వాత మళ్లీ కురవటం మొదలు పెట్టాయి. కాకపోతే ఈ కరీఫ్ లో పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి, భారీ వరదలతో ఒంగోలు తడిసి ముద్దయ్యింది. చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

heavy rains in tamil nadu

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు...

  తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధురై, తిరునెల్వేలి, తిరువల్లూరు, తూత్తుక్కుడి, విరుదునగర్,తేని, రామనాథపురం, వెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎనిమిది జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తిరుత్తణిలో అత్యధికంగా పధ్ధెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు, మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.  తమిళనాడులో ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో గత పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అందులోనూ రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు దక్షిణ తమిళనాడు కోయంబత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా ఎగువన కేరళలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా డ్యామ్ లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి గేట్లన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితిలో కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైపోయాయి. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం ఇప్పటికే దాదాపు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతంతో దిండివనంతో పాటు తిరునల్వేలి, తిరువల్లూరు, తూత్తుక్కుడి,తేనె ప్రాంతాల్లో ఈ వర్షం కారణంగా నష్టం అనేది ఎక్కువుగా ఉంది. మరొక రెండు రోజుల పాటు కూడా అంటే నలభై ఎనిమిది గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా జలమయమైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది రానున్నటువంటి రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే కనుక మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సెలవులు రద్దు చేసి అందరూ కూడా విధుల్లో ఉండాలని ఆదేశించారు. విద్యా సంస్థలకి గడిచినటువటువంటి రెండు రోజులు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సెలవులు మరొక రెండు, మూడు రోజుల పాటు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దించారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జిల్లాలో ఆయా మండల కేంద్రాల్లో అందులోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Another twist in Keerthi murdered her mother rajitha

రోజుకో మలుపు తిరుగుతున్న రజిత హత్య కేసు...

  కీర్తి గత మూడు రోజులుగా వార్తలలో వినిపిస్తున్న పేరు. జన్మనిచ్చిన తల్లినే హత్య చేసింది. తాజాగా కీర్తి మరో ప్రియుడు బాల్ రెడ్డిని అదుపు లోకి తీసుకొని అత్యాచారం కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జనవరిలో కీర్తి పై బలవంతంగా అత్యాచారం చేశాడు బాల్ రెడ్డి. కీర్తి గర్భవతి కావడంతో మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శశి సహకారంతో అబార్షన్ చేయించాడు బాలిరెడ్డి. అయితే బాలిరెడ్డి, శశి మంచి మిత్రులని చెబుతున్నారు పోలీసులు. అబార్షన్ చేయించే సమయంలోనే శశి, కీర్తిని బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. అంతేకాదు నగ్న వీడియోలు తీసి హింసించాడు. కొంత కాలం తర్వాత కీర్తిని బాలిరెడ్డికిచ్చి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే కీర్తితో చనువుగా ఉంటూ వచ్చాడు శశి. దీంతో కీర్తిని మందలించింది రజిత. తల్లి వ్యవహారాన్ని శశికి చెప్పడంతో ఇద్దరూ కలిసి రజిత హత్యకు పథకం వేశారు. తమ ప్రేమ వ్యవహారంలో హెచ్చరించిన తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేయించింది కీర్తి.  కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతున్నాయి. ప్రియుడు శశితో కలిసి కీర్తి మద్యం సేవించిన మత్తులో తల్లిని చంపినట్లు ఒప్పుకుంది. తన తల్లి హత్యకు ప్రియుడు శిశే ప్రేరేపించాడని పోలీసుల విచారణలో తెలిపింది. తాజాగా కీర్తి ఇంట్లో మూడు బీరు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల పంతొమ్మిది న కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్ కు వెళ్లిన తల్లి రజిత ఇంటికి తిరిగి వచ్చే సరికి కీర్తి ప్రియుడు శశితో కలిసి ఉండటాన్ని చూసి ఇద్దరినీ మందలించింది. అయితే తమ ప్రేమకు అడ్డొస్తున్నదన్న రజితను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు స్కెచ్ వేశారు. ఇంటి బయట ఉన్న కారులో ప్లాన్ వేశారు. కీర్తిని ఇంటికి పంపిన శశి ఆ తర్వాత వచ్చాడు. లోపలున్న రజితను కీర్తి అరవకుండ దిండుతో ముఖంపై అదిమిపట్టగా శశి చున్నీతో గొంతు నులిమి చంపాడు.ఈ కేసు పై పూర్తి వివరాలను పోలీసులు దర్యప్తులో తేలాల్సి ఉంది.

Unaccounted Gold Above a Threshold May Attract Heavy Tax

బంగారం నిల్వలపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం...

  బంగారమంటే భారతీయులకు ప్రాణం. ప్రతి ఏటా భారత్ తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా దిగుమతి చేసుకున్న బంగారం బ్యాంకు లాకర్లలో మూలుగుతోంది. బంగారం దిగుమతి కోసం విలువైన విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే కొత్త గోల్డ్ పాలసీని తీసుకొస్తోంది కేంద్రం. జనం రహస్యంగా దాచుకున్న బంగారం లెక్కలు స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా దాచిన బంగారాన్ని పన్నులు చెల్లించేందుకు ప్రజలు అవకాశమిస్తారు. ప్రధాని కార్యాలయం ఆర్థికశాఖ ఈ పథకానికి తుది మెదుగులు దిద్దుతోంది. అంతేగాకుండా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీతో పాటు దేశంలోని పలు ఆలయాల దగ్గర టన్నుల కొద్దీ బంగారం నిల్వలు ఉన్నాయి. భక్తులు ప్రతి ఏటా తమ ఇష్టదైవానికి భారీగా బంగారం కానుకలిస్తున్నారు. బంగారాన్ని బ్యాంకుల్లో దాచడానికి టిటిడి బోర్డుతో పాటు ఇతర ఆలయ బోర్డులకు ప్రత్యేక అనుమతులు అవసరం. బ్యాంకుల్లో బంగారాన్ని డిపాజిట్ చేయడం వల్ల ఆలయాలకు పెద్దగా ఆదాయం రావడం లేదన్న వాదన కూడా ఉంది. ఇలా వృథాగా ఉన్న బంగారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది.  దేశ సంపదలో అక్రమంగా దాచుకున్న బంగారం విలువ ఎక్కువగా ఉంటుందని కేంద్రం ఓ అంచనాకు వచ్చింది. అందుకే దీనిపై పన్ను వేస్తే అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి లబ్ది చేకూరుతుందన్న ఆలోచనతో కేంద్ర ఉంది. అయితే ఈ స్కీం కింద ఓ పరిమితి వరకే ప్రజలు తమ దగ్గరున్న బంగారం లెక్కలను ప్రభుత్వానికి వెల్లడించే వీలుంటుంది. అయితే ప్రజలకు ఈ పథకంలో కేంద్రం ఓ వెసులుబాటు కూడా కల్పించే అవకాశాలున్నాయి. వివాహితుల దగ్గర ఉండే బంగారానికి ఓ లిమిట్ వరకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తారు. అంతేకాకుండా దేశంలో ఉన్న బంగారం నిల్వల కోసం కేంద్రం త్వరలో గోల్డ్ బోర్డును కూడా ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా ఇందులో సభ్యత్వం ఉంటుంది. ప్రజలు సులభంగా బంగారాన్ని ఈ బోర్డు నుంచి కొనుగోలు చేసే విధంగా విధి విధానాలకు రూపకల్పన చేస్తారు. బంగారం నిల్వల పై మోదీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఎంత వరకు ఫలించబోతోందో వేచి చూడాలి.

bjp offered deputy cm to shiv sena

వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయం.. ఊహించని కొత్త మలుపులు!!

  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే సీఎం పదవి కోసం పట్టుబడుతున్న శివసేనకు బిజెపి నేతలు కొత్త ఆఫర్ ఇచ్చారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పదమూడు మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. సీఎం పదవితో పాటు ఇరవై ఆరు మంత్రి పదవులను బిజెపి తీసుకుంటోదని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నివాసంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ప్రతిపాదనలు తెచ్చారు. సీఎం పదవిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని బిజెపి నేతలు స్పష్టం చేశారు.  రేపు ఉద్ధవ్ థాక్రే నివాసంలో శివసేన ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్దవ్ థాక్రే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించాలని అనుకుంటోంది. శివసేన హ్యాండ్ ఇస్తే బీజేపీ మరొక ప్లాన్ కి కూడా సిద్ధం అయ్యింది. బీజేపీ టికెట్లు రాక రెబల్స్ గా పోటీ చేసిన పదిహెడు మంది స్వతంత్రులుగా విజయం సాధించారు. ఇప్పుడు వారందరినీ ఫడ్నవీసు మచ్చిక చేసుకుంటున్నారు. అదే సమయంలో నలభై ఐదు మంది శివసేన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బిజెపి ఎంపి సంజయ్ కాకడే ఓ బాంబు పేల్చారు.  కాగా కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు నిజంగానే తమ పార్టీ అధినేత పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన ఆదిత్య థాక్రే కోసం బీజేపీతో కయ్యం పెట్టుకోవటం వారు వ్యతిరేకిస్తున్నారని అందుకే అవసరమైతే జంప్ చెయ్యడానికి కూడా సిద్ధం అవుతారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అయితే శివసేన కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంటే కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతిస్తాయని వార్తలు కూడా ముంబైలో హల్ చల్ చేస్తున్నాయి.ఇక మహారాష్ట్రా రాజకీయాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి.

trs leaders in trouble with rtc strike

అధిష్టానం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య నలిగిపోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు...

  ఆర్టీసీ కార్మికుల సమ్మె అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కార్మికులను సమ్మె నుంచి విరమింపజేసి విధుల్లో చేర్చడం ఇబ్బందిగా మారింది. అటు కార్మికులను ఒప్పించ లేక ఇటు పార్టీ అధిష్టానం ఆదేశాలను కాదనలేక నేతలు సతమతమవుతున్నారు. డిపోల స్థాయిలో కొన్ని కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మంతనాలు జరిపిన ఎమ్మెల్యేలు హైకమాండ్ నుంచి కాల్స్ రావడంతో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ డిమాండ్ లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది జెఎసి. డిపోల ముందు నిరసనలు, ర్యాలీలు, మానవహారాలు, కలెక్టరేట్ల ముట్టడి, వంటా వార్పులతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణానూ మెరుగుపరిచామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కార్మికులు ఎవరైనా డ్యూటీలో చేరాలనుకుంటే డిపోలో అప్లికేషన్ పెట్టుకోవాలని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్. దీంతో కార్మికులు డ్యూటీలకు వస్తారని ప్రభుత్వం భావించింది. కానీ కార్మికులు నుంచి స్పందన రాలేదు. దీంతో కార్మికులతో సమ్మె విరమింపజేసి విధుల్లో చేర్పించే బాధ్యతను ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు సీఎం అప్పగించినట్లు తెలుస్తోంది. అధినేత సూచనలతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అయితే కార్మికులు సంఘాల నేతల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో అటు అధిష్టానం ఒత్తిడిని తట్టుకోలేక ఇటు కార్మికులను విధుల్లోకి చేర్పించలేక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. సీఎం చెప్పిన ఎమ్మెల్యేలు మంతనాలు జరిపినా ఇప్పటి వరకు రాష్ట్రం లోని ఏ డిపోలో కూడా కార్మికులు విధుల్లో చేరక పోవడం పై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా కార్మికులను విధుల్లో చేర్చాలని ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాల నేతలతో ఫోన్ లో మాట్లాడితే రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారేమోనన్న భయం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. దీంతో కార్మికులతో ఫోన్ లో మాట్లాడేందుకు జంకుతున్నట్లు సమాచారం. కార్మిక సంఘాల నేతలను నేరుగా కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నా వారు అంగీకరించటం లేదని టాక్. ఆర్టీసీ సమ్మెతో తమ నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులున్నాయని కొందరు ఎమ్మెల్యేలు అనుచరుల దగ్గర చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేస్తుండటంతో తమను ఎక్కడ అడ్డుకుంటారోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల లాంటి అధికారిక కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు తమ జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పార్టీ అధిష్టానంతో విషయం చెప్పేందుకు జంకుతున్నట్లు చర్చ జరుగుతోంది.

internal clashes between ycp leaders in undi constituency

వేడెక్కిన 'ఉండి' వైసీపీ రాజకీయం.. ఏం జరుగుతోంది?

  అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది. పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.

internal clashes between ministers and mlas in trs

ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అవుతున్న మంత్రులు...

  వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రులు, రాష్ట్రానికి మంత్రులైనా వాళ్ల నియోజకవర్గాలు దాటి బయట కాలు పెట్టలేకపోతున్నారు. పక్క నియోజక వర్గాల్లో కూడా మంత్రులు తమ ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల రాకను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆధిపత్య పోరుతోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్యాప్ కు కారణంగా తెలుస్తోంది. నియోజక వర్గాల్లో మంత్రుల జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమ నియోజక వర్గాలకు మంత్రులు రావటాన్ని ఇష్టపడని కొంత మంది శంకుస్థాపనను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రికి పొసగడం లేదని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వాళ్లు మంత్రి వస్తే ఎలాంటి హడావుడి చేయొద్దని కార్యకర్తలు అనుచరులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సొంత నియోజక వర్గాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో హల్ చల్ చేసే మంత్రి తలసానికి ఇప్పటికే ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనయుడు ఓటమికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని చర్చ అప్పట్లో జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. వారు కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అటు ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత చెడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో మంత్రులు నియోజకవర్గాలకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అటు వైపు కూడా చూడడం లేదని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు ఎమ్మెల్యేలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితులపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

ttd takes key decision on prasadam

శ్రీవారి ప్రసాదాలను సామాన్యులకు మరింత చేరువయ్యేలా చేస్తున్న టిటిడి...

  తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న కొలువుదీరిన పవిత్ర పుణ్య క్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు శ్రీనివాసుని దర్శనానికి తిరుమలకు వస్తూ ఉంటారు. వెంకన్నకు మొక్కులు చెల్లించుకుని స్వామి వారి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలను సామాన్యులకు మరింత చేరువ చేయాలని నిర్ణయించింది టిటిడి. సిఫార్సు లేఖలపై మాత్రమే ఇచ్చే పెద్దలడ్డు, వడలను సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది టీటీడీ. నిత్య కల్యాణం, పచ్చతోరణం తిరుమల తిరుపతిలో ఇలా ప్రతి రోజూ జనసందోహమే. ఇక ప్రత్యేక పర్వదినాల్లో కొండకు వచ్చే భక్తుల సంఖ్య కోట్లల్లోనే ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వెంకన్నను దర్శించుకోవటం ఒకెత్తయితే స్వామి వారి ప్రసాదాలను దక్కించుకోవడం మరో ఎత్తు. సామాన్య భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంతో పాటు ఇంకా తెలియని ఎన్నో రకాల ప్రసాదాలను శ్రీవారికి రోజు వారీగా సేవలను బట్టి నివేదిస్తారు అర్చకులు. రోజూ రకరకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు, తర్వాత వాటిలో కొన్నింటిని మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. పూర్వం కేవలం మట్టి కుండలలో మాత్రమే శ్రీనివాసుడి ప్రసాదాలు వండేవారు. కాలక్రమంలో వాటి స్థానంలో ఇత్తడి గంగాళాలు వచ్చాయి, తిరుమల శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణ ఆవరణకు ఎదురుగా ఉన్నదే స్వామి వారి ప్రధాన వంటశాల. విమాన ప్రదక్షిణలో స్వామి వారి గర్భాలయానికి సరిగ్గా ఆగ్నేయ మూలకు శాస్త్రోక్తంగా మూడడుగుల రాతి అధిష్టానంపై అరవై ఒక్క అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పుతో విశాలమైన ఎత్తైన రాతి స్తంభాలతో వంటశాలను నిర్మించారు. అత్యంత ప్రాచీనకాలం నుంచి ఇదొక్కటే వంటశాల, శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాలు, పిండి వంటకాలు ఇలా అన్నీ ఈ వంటశాలలోనే తయారు చేసేవారు. భక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో విమాన ప్రదక్షిణంలోని ప్రాచీన వంటశాలను ప్రస్తుతం ప్రధానంగా ఉన్న ప్రసాదాలకు కూడా వాడుతున్నారు. ఇక పిండి వంటలైన లడ్డూ, వడ, అప్పం, దోసె, పోలి, సుఖియా, మురుకు, జిలేబి తదితర వాటి తయారీకి వెండి వాకిలి బయట సంపంగి ప్రదక్షిణంలో ఉత్తరం వైపు ఉన్న మండపాలను వంటశాలగా మార్చి వాడుతున్నారు. శ్రీవారి ప్రసాదాలు ప్రధానంగా చెప్పుకునేది లడ్డు ఇందులో రెండు రకాల లడ్డూలున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే నూట డెబ్బై ఐదు గ్రాముల లడ్డూ ఒకటి కాగా మరొకటి కల్యాణం లడ్డు ఇది వీఐపీలకు మాత్రమే ఇస్తారు. ఇక ఈ పెద్ద లడ్డూ ధర ఒకటే రెండు వందలు, వడ వంద రూపాయలు శ్రీ వారి సేవలలో దర్శించుకునే భక్తులతో పాటు సిఫార్సు లేఖలపై వచ్చే వారికి మాత్రమే వీటిని ఇస్తుంది టీటీడీ. అయితే ఈ పద్ధతిలో మార్పులు చేయాలని నిర్ణయించింది టీటీడీ. పెద్ద లడ్డూ, వడలు ఉత్పత్తి పెంచి సామాన్య భక్తులకు కూడా వీటిని అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం ఆలయం లోపల తూర్పు వైపున ఉన్న భగపడి అరలో పెద్దలడ్డూ, వడలు ఇస్తుంటారు. త్వరలో ఆలయం బయట పెద్దలడ్డూ వడలు విక్రయించాలని భావిస్తోంది టీటీడీ. భక్తుల రద్దీని బట్టి కల్యాణం లడ్డూలు వడలను తయారు చేయిస్తామంటున్నారు అధికారులు. లడ్డూల ఉత్పత్తి పెంచటానికి బోర్డును విస్తరించనుంది టీటీడీ. ఇప్పుడున్న ప్రాంతాన్ని మరింత పెంచుతాం అంటున్నారు అధికారులు.

ప్రభుత్వంపై సమర శంఖం పూరించనున్న ఆర్టీసి కార్మికులు...

  ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాల్టి సకల జనుల సమరభేరి సభతో తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించింది. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళికను రూపొందించింది, ప్రభుత్వంపై తమ పోరును ప్రత్యక్షంగా చాటుకోవాలని సర్కార్ తో అమీ తుమీకి సిద్ధమైంది ఆర్టీసీ జేఏసీ. ఇందు కోసం పోలీసులు సభకు అనుమతి లేదంటూ అడ్డంకులు సూచించినప్పటికీ కోర్టుకు వెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకుంది. కార్మిక జేఏసీ తలపెట్టిన బహిరంగ సభకు అన్ని పక్షాలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నిన్నటి వరకూ డిమాండ్ల పరిష్కారం కోసం వేర్వేరు తరహాలో నిరసన చేపట్టిన కార్మికులు ఇవాళ బహిరంగ సభ ద్వారా తమ స్వరాన్ని పెంచి ప్రభుత్వ ధోరణిని ప్రజలకు తెలియజెప్పాలని భావించారు. అయితే అనుకున్నట్లుగానే ఈ సభను సరూర్ నగర్ మైదానంలో భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్నారు జేఏసి నాయకులు. సభకు ఉద్యోగ విద్యార్థి జేఏసీతో పాటు లక్షలాది మందితో భారీగా నిర్వహించాలని నిర్ణయించారు. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేస్తున్నారు, సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో సభ ద్వారానే తమ సత్తా చాటాలని అనుకున్నారు. కానీ హై కోర్టు సూచనలతో ప్లాన్ అంతా తారు మారైంది. సభావేదిక సరూర్ నగర్ మైదానం నుంచి ఇండోర్ స్టేడియానికి మారింది, దీంతో ఆర్టీసీ జేఏసీ అప్పటి వరకూ వేసుకున్న అంఛనాలు పూర్తిగా మారిపోయాయి. కేవలం ఐదు వేల మంది పట్టే సామర్థ్యం కలిగిన స్టేడియంలో సభను ఏర్పాటు చేసుకోమనడంతో అంతర్మధనంలో పడ్డారు జేఏసీ నేతలు. అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలో సభ నిర్వహించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది. ఆర్టీసీ బకాయిలపై హై కోర్టు వ్యాఖ్యలు కార్మికుల ఉత్సాహం పెంచినప్పటికీ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించుకునేందుకు కుదరకపోవడంతో ఒకింత నైరాశ్యానికి లోనైనట్లుగా తెలుస్తోంది. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జేఏసీ చూస్తోంది. ఈ సభకు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారు, ఈ సభ నుంచే తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు ఆర్టీసీ కార్మికులు. సభకు పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ.. వైఎస్ కూడా ఇలా చేయలేదంటూ రేవంత్ పై ఫైర్!!

  తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. హుజూర్ నగర్ లో పార్టీ ఓటమిపై చర్చకు జరగగా  ఓటమికి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. ఇక పార్టీలో రేవంత్ దూకుడుపై సీనియర్ నేత వీహెచ్ ఇండైరెక్ట్ గా అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో కట్టు దాటిన వారి పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇచ్చేందుకు కోర్ కమిటీ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం గాంధీ భవనలో జరిగింది. కోర్ కమిటీ ఎజెండా అంశాలు ఆర్టీసీ కార్మికుల సమ్మె, మున్సిపల్ ఎన్నికలు అయినప్పటికీ మరి కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. సమావేశం ప్రారంభమవ్వగానే హుజూర్ నగర్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో కోర్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కు అండగా నిలిచినట్లు సమాచారం. నేతలెవ్వరూ ప్రకటించకుండానే ఓటమికి బాధ్యత తనదే అని ఉత్తమ్ తెలివిగా ప్రకటించారని మరో నేతకు నిలదీసే అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పార్టీలో క్రమశిక్షణపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం, కొంతమంది నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారట. ప్రగతి భవన్ ముట్టడి విషయంలో ముగ్గురు నేతలే నిర్ణయం తీసుకున్నారని గతంలోనే బాహాటం గానే విమర్శించిన వీహెచ్ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా క్రమశిక్షణ పేరుతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. వైయస్ కూడా ఎప్పుడూ సీఎం కాకముందు తన కార్యకర్తలతో సీఎం అనిపించలేదని కానీ పార్టీలో ఒక నేత సభలు సమావేశాల సమయంలో సీఎం అని తన కార్యకర్తలతో అనిపించుకుంటారని ఇది మంచి పద్ధతి కాదని నేత పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శించారని సమాచారం. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని సూచించారట. కుంతియా సైతం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు చెబుతున్నారు. ఇక కోర్ కమిటీ ఎజెండా ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్ ఏం చేయాలనే దానిపై నేతలు చర్చించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే మైనారిటీలకు, బీసీలకు యాభై శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ బాధ్యతలను నియోజక వర్గ ఇన్ చార్జిలకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఇక నియోజక వర్గ ఇన్ చార్జిలు లేని చోట వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తూ వారి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక కోర్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మోదీ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోందంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరు వల్లభ్ పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కేంద్ర వైఫల్యాలపై పోరు బాట పట్టాలని తీర్మానించారు. అందులో భాగంగా నవంబర్ ఐదున అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నవంబర్ పదిహేను న గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాద యాత్ర నిర్వహించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆర్టీసీ జేఏసీ తల పెట్టిన సభకు కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని కోర్ కమిటీ పిలుపు నిచ్చింది. సభకు పార్టీ పక్షాన నేతలు హాజరు కావాలని నిర్ణయించారు. మొత్తంగా కోర్ కమిటీ సమావేశం వాడి వేడిగానే జరిగినట్లు తెలుస్తోంది.

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఈయూ ఎంపీల బృందం

  జమ్ము కశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ ఎంపీలు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. స్థానికులు అధికారులతో పలు అంశాలపై చర్చించారు ఈయూ ప్రతి నిధి బృందం సభ్యులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో తొలిసారి విదేశీ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. బుధవారం కూడా కాశ్మీర్ లో ఈయూ బృందం పర్యటన కొనసాగనుంది. శ్రీనగర్ లోని చారిత్రక దాల్ లేక్ ను యూరోపియన్ల బృందం సందర్శించింది. దాల్ సరస్సు అందాలను చూసి ముగ్ధులయ్యారు యూరోపియన్లు. బోట్లలో కూడా వాళ్లు విహరించారు, స్థానిక వ్యాపారులతో కూడా బృందం పలు అంశాల పై చర్చించింది. శ్రీనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయన్న అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకు ఈయూ బృందం పర్యటనకు అనుమతి నిచ్చినట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. ఆర్మీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కూడా ఈయూ బృందం భేటీ అయ్యింది. కశ్మీర్ లో పాకిస్థాన్ చొరబాట్లను ఎలా ప్రోత్సహిస్తుందో, కుట్రలు చేస్తుందో కళ్ళకు కట్టినట్లు ఈయూ బృందానికి వివరించారు ఆర్మీ అధికారులు. అయితే ఈయూ ఎంపీల బృందం కశ్మీర్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ తో సహా విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్ష ఎంపీలు శ్రీనగర్ లో అడుగు పెట్టగానే అరెస్టు చేసిన కేంద్రం ఈయూ ఎంపీ బృందానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కశ్మీర్ లో విదేశీ ఎంపీలకు అనుమతులు ఇచ్చి తమను అడ్డుకోవడంపై పార్లమెంటులో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి. రైట్ వింగ్ ఎంపీలకు ఎలా అనుమతిస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈయూ బృందం ఇప్పటికే ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఈయూ బృందానికి కేంద్రం వివరించింది. అంత వరకూ కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ల కోసం టీఆర్ఎస్ నేతల వేట...

  గులాబీ పార్టీ లో జోరు పెరిగి టిక్కెట్ల వేట మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు వారి నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వార్డ్ మెంబర్ నుంచి మేయర్ కుర్చీ దాకా ఎవరి లాబీయింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు బంపర్ మెజార్టీ రావడంతో మునిసిపాలిటీల్లో కూడా గులాబీ జెండాదే హవా అనే అంచనా అందరిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సమయం ముంచుకొచ్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ తో నవంబరు నెలాఖరు కల్లా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. దీంతో గులాబిదళంలో టిక్కెట్ల కోసం వేట మొదలైంది.  మున్సిపాటీలో వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొదలు మేయర్ కుర్చీ కోసం ఎదురు చూస్తున్న వారంతా వారి సీనియర్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు షురూ చేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు మొదలైంది. దీంతో మున్సిపాల్టీల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమనే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో పార్టీ టికెట్ దొరికితే చాలు పదవి వచ్చినట్లే అని భావిస్తున్న నేతలంతా పైరవీలు మొదలు పెట్టారు. ఒక్కో వార్డ్ నుంఛి దాదాపు డజను మందికి పైగా టీఆర్ఎస్ స్థానిక నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆశావహులంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతల అనుచరులే కావటంతో వచ్చిన దరఖాస్తులనూ ఫిల్టర్ చేస్తున్నారు. అయితే నూతన మున్సిపల్ యాక్టుపై అవగాహన ఉండి ప్రజల కోసం కష్టపడే వారికి ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెబుతున్నారు ఎమ్మెల్యేలు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్ లతో సహా అన్నింటికీ అన్నీ టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని విశ్వాసముంది. చాలా ఉత్సాహం తో ప్రజలందరూ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరు కూడా ఎదురు చుస్తునారు.  ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నాయకుల నియోజక వర్గాల్లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ పాత నేతలు కొత్త నేతల మధ్య టికెట్ ల కోసం పోటీ పెరిగిపోయింది. టికెట్ దొరికితే చాలు గెలుపు పక్కా అనే ధీమాతో ఉన్నారు. దీంతో తమ నాయకులపై ఒత్తిడి పెంచి ఎలాగైనా టికెట్లనూ దక్కించుకోవాలని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించాకే టికెట్లు దక్కుతాయి అని చెబుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కొత్తవి పాతవి కలుపుకొని వందకు పైగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే కొత్త మున్సిపల్ చట్టం పై అవగాహన ఉన్నవాళ్లు పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్లకు మాత్రమే టికెట్లు దక్కుతాయని అధిష్టానం సంకేతాలిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరికి టికెట్లు దొరుకుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.