ఆంక్షల మధ్య 15 నిమిషాల కవరేజ్

ఇంత గోప్యత ఎందుకో.. తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత కు ఎట్టకేలకు మీడియాని తీసుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. మీడియా ని తీసుకెళ్లడానికి అభ్యంతరం ఏమిటి అని పదేపదే రాష్ట్ర హైకోర్టు  ప్రశ్నించింది. యుద్ధ సమయాలలో కూడా మీడియాను అనుమతిస్తారు. అలాంటిది సచివాలయం కూల్చివేత ప్రాంతానికి అడ్డుచెప్పడం ఎందుకని,  గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అని హైకోర్టు ప్రశ్నించిన తర్వాత అదరాబాదరగా మీడియాను కూల్చివేత ప్రాంతానికి తీసుకువెళ్లారు. కోవిద్ నియమాలు పాటించకుండా రిపోర్టర్స్, కెమెరామెన్లను వేరువేరు వాహనాల్లో తీసుకువెళ్లారు.  ఇప్పటికే 90శాతం కూల్చివేత పూర్తయింది. సైఫాబాద్ ప్యాలెస్ గా పిలువబడే జీ బ్లాక్ కూల్చేశారు. ఎ,బి,సి,డి, జి, హెచ్, ఎల్ బ్లాక్ల్ లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. పాక్షికంగా కూల్చివేయబడిన  జె, కె బ్లాక్ లు  మరో రెండురోజుల్లో పూర్తిగా నేలమట్టం అవుతాయి. సైఫాబాద్ ప్యాలెస్ గా కూడా పిలువబడే జిబ్లాక్ కూల్చొద్దు అని చారిత్రక కట్టడంగా దాన్ని మార్చాలని విపక్షాలు, చారిత్రక పరిశోధకులు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం 15 నిమిషాల్లో మాత్రమే వీడియోలైనా, ఫొటోలు తీసుకోవాలంటూ ఆంక్షలు విధించారు. మీడియా వారికి రెట్టింపు సంఖ్యలో ఉన్న పోలీసులు అడుగడుగున ఉంటూ వారు నిర్దేశించిన ప్రాంతంలోనే తిరిగేలా చర్యలు తీసుకున్నారు. తూతూమంత్రంగా  కఠినమైన ఆంక్షల మధ్య  కవరేజ్ కు అనుమతి ఇచ్చారు. ప్రజా ధనంతో ప్రజల పరిపాలన కోసం కట్టిన భవనాలను కూల్చివేస్తూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం భావిస్తుందేమో అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

గోమూత్రం తో కరోనాకు మందు.. ఐసిఎంఆర్ కోర్టులో బంతి

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒక పక్క వ్యాక్సిన్ సిద్ధం చేయడానికి శాస్త్రవేత్తలు కాలంతో పాటు పరుగులు పెడుతుంటే మరో పక్క ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సరైన మందు కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేరళలో కరోనా కు విరుగుడుగా గోమూత్రంతో మందులు తయారుచేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన కేసు కేరళ హైకోర్టుకు చేరింది. దీనిపై కేరళ హైకోర్టు స్పందిస్తూ ఈ మందుపై తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)ని ఆదేశించింది.  ఈ కేసు వివరాల్లోకి వెళితే కరోనా ట్రీట్‌మెంట్‌కి తాము గోమూత్రం తో తయారుచేసిన ఆయుర్వేద మందును వాడేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కోజికోడ్ జిల్లా తిరువంబడికి చెందిన వెల్నెస్ కన్సల్టెంట్, సోషల్ వర్కర్ సన్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. కొన్నిఆమోదం పొందిన ఆయుర్వేద మందులతో పాటు గోమూత్రం కలిపి తాము తయారుచేసిన ఔషధం అటు కరోనా అంతు చూడడమే కాక ఈ వైరస్ వ్యాప్తిని కూడా అరికడుతుందని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. అంతే కాకుండా "ఈ మందు కరోనా పీడితులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని దీంతో కరోనా వైరస్‌తో పోరాడేలా చేస్తుందని" కోర్టులో వేసిన పిటిషన్‌లో తెలిపారు. పిటిషనర్ తరపున లాయర్ నందకుమార్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ తమ మందుకు అనుమతి ఇవ్వాలని ఐసిఎంఆర్ ను అభ్యర్ధించగా ఇంతవరకూ స్పందించలేదని కోర్టుకు తెలిపారు. గోమూత్రం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అందుకే దాన్ని ఆయుర్వేద మందుల తయారీలో వాడతారని అయన కోర్టులో వివరించారు. ఇంకా ఈ మందులో హిమాలయాలలో దొరికే బెర్రీ మూలికతో పాటు మరి కొన్ని వనమూలికలు, గోమూత్రాన్ని కలిపి మందుగా తయారుచేశామని అయన కోర్టుకు తెలిపారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో కూడా వివరించారని అయన కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా మెడికల్ ప్రాక్టీషనర్ అధ్వర్యంలోనే ఈ మందును తయారుచేసినట్లు అయన కోర్టుకు వివరించారు. ఇప్పటికే కొన్ని అల్లోపతి మందులను కరోనా పేషెంట్లకు వాడేందుకు అధికారుల అనుమతులు లభించిన నేపథ్యంలో తమ ఆయుర్వేద మందుకు అనుమతి ఎందుకు ఇవ్వరన్నది పిటిషనర్ వాదన. దీంతో ఇపుడు బంతి ఐసిఎంఆర్ కోర్టుకు చేరింది. మరి దీనిపై ఐసిఎంఆర్ ఏ విధంగా స్పందిసుందో వేచి చూడాలి.

బోసిపోతున్న ఐటీ కారిడార్స్.. ఇంటిదారి పడుతున్న ఉద్యోగులు

వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రాధాన్యత ఇస్తున్న ఐటి కంపెనీలు ఇంటిదారి పడుతున్న ఉద్యోగులు బోసిపోతున్న ఐటీ కారిడార్స్ పట్నం నుంచి పల్లెలకు పయనం గ్రామాల్లో పెరుగుతున్న ఆదాయం కోవిద్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అలజడి నుంచి బయటపడి పూర్తిగా కోలుకోవాలంటే మరో ఏడాది తప్పదని అనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి లక్షలాది మందిని సోకి ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రత కోసం వర్క ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు బోర్డ్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దీంతో గూగుల్ సంస్థలో పనిచేస్తున్న రెండు లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుంది. సెర్చ్ ఇంజన్ సంస్థ ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ కూడా తమ ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి 8 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించారు. యాపిల్, ఫేస్బుక్ ,ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, క్వాల్ కామ్, ఐబిఎం, కాగ్నిజెంట్, టిసిఎల్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. కార్పోరేట్ ఐటి సంస్థలు ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే కేంద్రప్రభుత్వం లోని కొన్నిశాఖల్లోనూ ఏడాదిలో 15రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. డిజిటల్ సదుపాయంలో పనిచేసే 75 విభాగాల్లో ఈ మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నారు.           రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించినా కంట్రోల్ కాని కరోనాతో స్కూల్స్, సినిమా హాల్స్, క్లబులు, పబులు, పార్క్లు, జిమ్ లు, హాస్టల్స్ అన్నీ మూతపడటం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో లక్షలాది మంది ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. ఐటి కంపెనీలు ఎక్కువగా ఉండే నగరాల నుంచి గ్రామాలకు పయనమవుతున్నారు. కేవలం హైదరాబాద్ లోనే సుమారు ఆరు లక్షల మంది ఐటి సంస్థల్లో పనిచేస్తారని అంచనా. వీరితో అత్యధిక శాతం మంది ఇక్కడి ఖర్చుల భరించలేక, వీకెండ్ లో రీప్రెష్ మెంట్ సదుపాయాలు లేక ఊర్లకు వెళ్ళిపోయారు. ఇక ఇతర రంగాల్లో పనిచేసేవారు కూడా సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. దాంతో హైదరాబాద్ రోడ్లు, మాల్స్ బోసిపోయాయి. మార్కెట్ లో కొనుగోలు తగ్గుముఖం పట్టాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అద్దె ఇంటి యజమానులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా భారీగా ఆదాయం పడిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లాక్ టాప్ భుజానికి తగిలించుకుని.. సామాన్లు సర్దుకుని ఇండ్లు ఖాళీ చేసి పోతున్నారు. దాంతో నగరంలో వీధికి నాలుగు టూలేట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు లేక, ఆదాయం వచ్చే మార్గాలు లేక నగరంలో షాపులు, కూరగాయల దుకాణాలు బోసిపోతుంటే పల్లెల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు ఇంటికి దూరంగా ఉన్న వారంతా గ్రామాలకు చేరుకోవడంతో నిత్యావసరాల, కూరగాయల వినియోగం పెరిగింది. గతం కన్నా రెట్టింపు స్థాయిలో నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారని దుకాణదారులు అంటున్నారు. మరో ఆరునెలల పాటు ఇలాగే కొనసాగితే గ్రామాల ఆర్థికఆదాయం నాలుగింతలు అవుతుందని అంచనా వేస్తున్నారు. స్మార్ట్ సిటీలు అంటూ పట్టణాలకు వలసలను ప్రోత్సహించి ట్రాఫిక్, పోల్యుషన్ పెంచిన ప్రభుత్వాలు గ్రామాల ఆర్థిక ప్రగతిని మరచిపోయాయి. కరోనా నేర్పిన పాఠాలతో స్మార్ట్ విలేజ్ ల కాన్సెఫ్ట్ తీసుకుని గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెడితే  పట్టణాలకు వలసలు తగ్గుతాయి.

తెలంగాణలో మరో సర్కార్ దవాఖాన సూపరింటెండెంట్ రాజీనామా

కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ లోని ఎంజిఎం ఆసుప‌త్రి సూప‌రిండెంట్ శ్రీ‌నివాసరావు కూడా రాజీనామా చేశారు. ఒక పక్క క‌రోనా వార్డుల్లో స‌రైన చికిత్స‌లు అందటం లేదని ఆక్సిజ‌న్ లేక రోగులు మ‌ర‌ణిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇలా సూపరింటెండెంట్ ల వరుస రాజీనామాలు కలవర పెడుతున్నాయి. ఒక పక్క వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ త్వరలో వ‌రంగ‌ల్ ఆసుప‌త్రి, క‌రోనా వైద్యంపై స‌మీక్ష‌కు రానున్న నేప‌థ్యంలో సూప‌రిండెంట్ రాజీనామా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాల కొరత గురించి ప్ర‌భుత్వానికి కూడా తెలుస‌ని, అయితే జిల్లాల్లో జ‌రుగుతున్న పొర‌పాట్ల‌కు త‌మ‌ను బాధ్యుల‌ను చేస్తున్నార‌న్న ఆవేద‌న‌లో ప‌లువురు అధికారులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న క‌రోనా తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలోనే ఉండి అన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు నుండి చెప్తుండ‌టంతో పాటు అన్ని వైపులా నుండి వస్తున్న ఒత్తిడిని త‌ట్టుకోలేకే రాజీనామాల బాట ప‌ట్టిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

ప్రళయం రాబోతోంది.. జగన్ సర్కార్ కి మోత్కుపల్లి హెచ్చరిక

టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి బీజేపీలో చేరిన తెలంగాణకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఏపీలోని జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలో దళితులపై అమానుషమైన దాడులు జరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైసీపీ నేతలు చేస్తున్న అరాచకమని ప్రత్యక్షంగా తెలుస్తోందని అన్నారు.  దళిత డాక్టర్ ను వేధించారు, కనీసం రిగ్రెట్ లేదు, నడిరోడ్డు మీద గుండు గీశారు. ఆయనకు ఏం న్యాయం చేసింది ప్రభుత్వం? అని ప్రశ్నించారు. మరో దళిత డాక్టర్ అనితారాణిని దారుణంగా వేధించారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలే అందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు. మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడిని దారుణంగా కొడితే ఆ యువకుడు దెబ్బలతో ఆస్పత్రి పాలై ప్రాణాలు వదిలాడని అన్నారు. దళిత ఆడపిల్లను గ్యాంగ్ రేపి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువకుడు వరప్రసాద్ వైసీపీ నేతల ఇసుక అక్రమ తరలింపును ప్రశ్నిస్తే గుండుగీయించారని మండిపడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు మీద చర్యలు తీసుకుంటారా? వైసీపీ నేతలను, స్థానిక ఎమ్మెల్యేని వదిలేస్తారా? ఎంత అన్యాయం ఇది అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా దళితులు మౌనంగా ఉన్నారంటే ప్రళయం రాబోతోందని అర్థం చేసుకోవాలని మోత్కుపల్లి హెచ్చరించారు.  జగన్ ను గెలిపించమని కోరానని గుర్తుచేసారు. దళితులు అయిన మాలమాదిగలు ముందుండి జగన్ కి ఓట్లేసి గెలిపించారు. కానీ జగన్ అలాంటి వారిని అణచివేస్తున్నారు. ఓట్లేసే దాకా ఒక ధోరణి, గెలిచాక ఇంకో ధోరణి అవలంభిస్తారా? అని ప్రశ్నించారు. వీటన్నింటి మీద విచారం వ్యక్తంచేసి, విచారణ జరిపించి బాధ్యులైన వారిని శిక్షిస్తేనే బాధితులకు న్యాయం జరిగినట్లు. లేకపోతే భవిష్యత్తులో జగన్ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని మోత్కుపల్లి హెచ్చరించారు. కాగా, 2019 ఎన్నికలకు ముందు జగన్ ని గెలిపించాలని ఏపీ ప్రజలను మోత్కుపల్లి కోరిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని, ఆయన ఓడిపోయి జగన్ గెలవాలని తిరుపతి వెళ్లి మరీ వెంకన్నకి మొక్కారు. మోత్కుపల్లి కోరుకున్నట్టుగానే ఏపీలో జగన్ సీఎం అయ్యారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని బాధపడుతున్నారు. ఒకప్పుడు జగన్ గెలవాలని బలంగా కోరుకున్న వ్యక్తే.. ఇప్పుడు జగన్ పాలనపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు గా ఉన్న కన్నా లక్ష్మి నారాయణ ను తప్పించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజును పార్టీ అధిష్టానం కొత్త అధ్యక్షుడు గా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో అయన పేర్కొన్నారు. ఏపీ బీజేపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న సోము వీర్రాజు తూర్పు గోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన వారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి గా యువకులైన విష్ణు వర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి సోము వీర్రాజు వైపు మొగ్గినట్లుగా సమాచారం. ఇది ఇలా ఉండగా 2014 అక్టోబర్ లో అమిత్ షా సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. ఐతే 2018 మే నెలలో ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా నియమించారు. ఐతే కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ సవరణ బిల్లుల విషయంలో గవర్నర్ కు లేఖ రాయడంపై బీజేపీ కేంద్ర నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సోము వీర్రాజును బీజేపీ ఏపీ చీఫ్ గా నియమనిచడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ట్రాక్టర్ సాయం పొందిన రైతు రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు?

చిత్తూరు జిల్లాకు చెందిన వీరదల్లు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి పొలం దున్నడం చూసి చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్‌ను కొనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పూటకో మలుపు తిరుగుతోంది. నాగేశ్వరరావు రైతు కాదని, స్థానికంగా అంతో ఇంతో పేరుందని, 2009 లో లోక్ సత్తా తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారని.. అలాంటి వ్యక్తిని పేద రైతుగా చిత్రీకరించారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పలువురు పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై నాగేశ్వరరావు స్పందించారు. తమపై తప్పుడు ప్రచారం చేసి రోడ్డు పాలు చేయొద్దని వేడుకున్నారు. తన నిజ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే మహల్రాజపురానికి రావాలని అన్నారు. తన కూతుళ్లను చంద్రబాబు చదివిస్తానని చెప్పడంతో తమపై బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని తెలిపారు. తన పేదరికాన్ని గుర్తించి ఎక్కడో ముంబైలో ఉన్న ఆ మహానుభావుడు ట్రాక్టర్‌ ను గిఫ్ట్‌గా ఇస్తే ఇలా దుష్ప్రచారం చేయడమేంటని వాపోయారు. దుష్ప్రచారం చేసే వాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. "నేను దళితుడిని, మానవ హక్కుల కార్యకర్తని. 2009 ఎన్నికల్లో లోక్‌సత్తా తరపున పోటీ చేశాను. కానీ, ఆ ఎన్నికల్లో అసలు అభ్యర్థిని నేను కాదు. స్థానికంగా ఉండే మరో వ్యక్తికి పార్టీ టికెట్ వచ్చింది. ఆయన దగ్గర నెలకు 6వేల జీతంతో నేను పనిచేసే వాడిని. అసలు అభ్యర్థిగా ఆయనే నామినేషన్ వేశాడు. కానీ ఎన్నికల్లో పార్టీకి పెద్దగా ఓట్లు పడవని ఆయనకు అర్థమైంది. దీంతో, డమ్మీ అభ్యర్థినైన నాకు ప్రచారం ఖర్చులకు 50వేలు డబ్బులిచ్చి, పోటీకి నిలబెట్టాడు.'' అన్నారు.

ఈ మేక ధర లక్ష పైనే

మార్కెట్ లో అజ్మీర్ రకం మేకలు బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు వేలసంఖ్యలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల తలలు తెగిపడాల్సిందే. ప్రతి ఏటా హైదరాబాద్ నగరానికి బక్రీద్ సందర్బంగా వేల సంఖ్యలోనే మేకలు, గొర్రెలు , పొట్టేళ్ళు వస్తాయి. ఏడాది పాటు పెంచిన తమ మేకలను, గొర్రెలను అమ్ముకోవడానికి పట్టణం దారి పడతారు. అయితే ఇన్ని రోజుల సంగతి వేరు ఈ ఏడాది సంగతి వేరు. కరోనా కారణంగా అన్ని పండుగలు ఇంటికే పరిమితం అయ్యాయి. బంధు మిత్రులతో చేసుకునే బక్రీదు కూడా ఎలాంటి విందు లేకుండానే గడిచిపోతుందేమో అన్న దిగులు చాలామందిలో ఉంది. అయితే కొంతమంది ఆధునిక పద్ధతిలో ఆన్ లైన్ లో మేకలను, గొర్రెలను అమ్ముతున్నారు. ఢిల్లీ, ముంబాయి లాంటి పెద్ద నగరాల్లో ఆన్ లైన్ లో అమ్మకాలు బాగానే ఉన్నాయట.  బక్రీద్ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న అజ్మీర్ రకం మేక ల రేటు లక్ష రూపాయల వరకు పలుకుతుంది. వీటిని ప్రత్యేకంగా బక్రీద్ కోసమే తెప్పించారు. అమ్మో అన్ని డబ్బులా అనకండి. దాదాపు వందల కిలోల బరువు ఉండే ఈ మేకలకు మంచి డిమాండే ఉందని అమ్మకందారులు అంటున్నారు. రసాయనాలు కలవని బలమైన ఆహారం ఇవ్వడం వల్లనే ఈ మేకలు బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నాయని  అంటున్నారు. ఆర్గానిక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు ఈ ఆర్గానిక్  మేకలను కూడా ఎక్కువగా కొంటున్నారట.

డ్రాగన్ కంట్రీ ఎత్తులకు కౌటిల్యతో చెక్

భారత్ చైనా సరిహద్దుల వెంట మోహరిస్తున్న చైనా సైన్యం కదలికలను మన దేశానికి చెందిన నిఘా ఉపగ్రహాం ఎమిశాట్ పసికట్టింది. జమ్ము సరిహద్దుల్లో ఒకవైపు సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూనే మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో సైనిక దళాలను మోహరిస్తున్న డ్రాగన్ కంట్రీ కుటిల యత్నాలను భారతీయ నిఘా ఉపగ్రహాం గుర్తించింది.  భారత రక్షణ నివేదిక 2013-14లలో ప్రాజెక్టు కౌటిల్య గురించి వివరించారు. దేశ సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు గత సంవత్సరం ఏప్రిల్ 10 పీఎస్ఎల్వీ - సీ 45 రాకెట్ ద్వారా భారత ఉపరితల కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెట్టారు. భూమి ఉపరితలం నుండి 749 కిలోమీటర్ల కక్ష్యలో తిరిగే ఈ చిన్న ఉపగ్రహాన్ని ఇస్రో, డీఆర్‌డీవోలు సంయుక్తంగా తయారు చేశాయి. 436 కేజీల బరువు ఉండే అత్యంత శ‌క్తివంత‌మైన ఎమిశాట్ ఈ ఉప‌గ్ర‌హాం మనదేశ తొలి ఎల‌క్ట్రానిక్ నిఘా ఉప‌గ‌్రహాం. ఇందులో ఉన్న ఎలక్ట్రానిక్ ఇంటెలిజనెన్స్ ప్యాకేజ్ కౌటిల్యను డీఆర్ డివో ఆపరేట్ చేస్తుంది. దేశ సరిహద్దుల వెంట నిఘా పెంచుతూ సరిహద్దుల్లోని శత్రుదేశాల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి సైనిక ద‌ళాల‌కు అందించేలా దీన్ని డిజైన్ చేశారు. తాజాగా చైనా, పాకిస్తాన్ లతో ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఎమిశాట్ సేకరించే ఆధారాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. టిబెట్ స‌మీపంలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దులో చైనా సైనిక ద‌ళాల కదలికలు ఉన్నాయన్న అనుమానాలను కౌటిల్య తన నిఘా వ్యవస్థతో నిజమని గుర్తించింది. సైనిక దళాల ఉనికిని కౌటిల్య ట్రాక్ చేసింది. డ్రాగన్ కంట్రీ చడీచప్పుడు కాకుండా దేశ సరిహద్దులను సమీపిస్తుంది అన్న సమాచారాన్ని సైనిక దళాలకు అందించింది.  స‌రిహ‌ద్దుల్లో శ‌త్రు దేశాల రాడార్ల వ్యవస్థను పసి గట్టి సరిహద్దుల్లో కదలికలను గురించిన వివరాలను కూడా ఇది చెప్ప‌గ‌ల‌దు.

జగన్ సర్కార్ కి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.  2009లో చిత్తూరులో అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు 483 ఎకరాలను వైఎస్సార్ ప్రభుత్వం కేటాయించింది. అయితే, వైఎస్సార్ హయాంలో కేటాయించిన 483 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు ఇటీవల జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ అమర్‌రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు.. జీవో అమలుపై స్టే ఇచ్చింది.

మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్‌ మృతి

మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్.. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఓం ప్రకాశ్ మృతిని జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ ధృవీకరించారు. ఓంప్రకాశ్‌ మూత్రపిండాలు చెడిపోవడంతో డయాలసిస్‌ చేయించేవారు. శుక్రవారం కూడా కేజీహెచ్‌లోనే డయాలసిస్‌ జరిగిందని జైలు సూపరింటెండెంట్‌ వివరణ ఇచ్చారు. కాగా, టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శ్రీనును ఓం ప్రకాశ్ జైలులో హత్య చేశాడు. తనను డిస్ట్రబ్ చేస్తున్నాడనే నెపంతో తలపై డంబుల్‌ తో కొట్టి చంపేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఓం ప్రకాశ్‌ కు జీవిత ఖైదు విధించింది. అప్పటించి ఓం ప్రకాశ్ విశాఖ సెంట్రలో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మృతి చెందాడు.

చిరంజీవి కంటే సీఎం జగన్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు

కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం జగన్‌ కు వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కొన్ని కీలక సూచనలు చేశారు. మాస్కు పెట్టుకోవాలంటూ సినీనటుడు చిరంజీవి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న సీఎం జగన్ ఓ మంచి కార్యక్రమం చేపడితే బాగుణ్ణు అని అభిప్రాయపడ్డారు. చిరంజీవి కంటే సీఎం జగన్ కే ఎక్కువమంది అభిమానులు ఉన్నారని, జగన్ కూడా వైరస్ పై పోరాటంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. అలాగే ఇప్పుడు జగనన్న పేరుతో ఈ కరోనా వైరస్‌పై పోరాటం చేయాలన్నారు. దీనికి 'జగనన్న కరోనా కేర్' లేదా 'జగనన్న కరోనా వార్' అని పేరు పెడితే బాగుంటుందన్నారు. జగనన్న పేరు కచ్చితంగా ఉంటేనే ప్రజల్లో, అధికారుల్లో సీరియస్ నెస్ ఉంటుందని, అధికారులు చురుగ్గా పనిచేస్తారని పేర్కొన్నారు. చెత్త వేసే మున్సిపాలిటి బండిలో కరోనా బాధితుడిని తీసుకు వెళ్లడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తన సొంతూళ్లో జరిగిన ఈ ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నానని, తనను క్షమించాలని జనాన్ని కోరారు. సీఎం జగన్ వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రారంభించారని, కానీ అవి అవసరానికి ఉపయోగపడలేదన్నారు. ప్రారంభించిన అంబులెన్సులు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళుతుందని భావిస్తున్నట్టు రఘురామకృష్ణరాజు తెలిపారు.

దూసుకువస్తున్న రాఫెల్

భారత్ ఆధునిక అంబులపొదిలో ప్రపంచంలోనే అతిశక్తి వంతమైన యుద్ధవిమానాలుగా భావించే రాఫెల్ యుద్ధవిమానాలు చేరే సమయం అతి సమీపంలోనే ఉందని భారత వైమానిక దళం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. భారత్ చైనా, భారత్ పాకిస్తాస్ సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకుంటున్న వేళ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధవిమానాలు గగనతలంలోకి ఎగిసి భారత్ దిశగా పయనిస్తున్నాయి. 7364 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరో రెండు రోజుల్లో భారత్ ను చేరుతాయి. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. వీటిలో ఐదు యుద్ధ విమానాలు ఈ రోజు ఫ్రాన్స్‌  మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయ్యాయి. మార్గ మధ్యంలో అబుదాబి సమీపంలోని అల్దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఫ్యూయల్ ఫిల్ చేసుకుని తిరిగి బయలుదేరి  ఈ నెల 29న హర్యానాలోని అంబాలా వద్ద ఉన్న ఎయిర్ బేస్ కు చేరుకుంటాయి. తొలిదశలో ఐదు యుద్ధ విమానాలు రాగా మిగతా 31 విమానాలు 2021 చివరి నాటికి భారత వైమానికదళంలో చేరుతాయి. ఇందులో 28 యుద్ద విమానాలకు సింగిల్ సీటు ఉంటే మిగతా 8 విమానాలకు డబుల్ సీటు సదుపాయం ఉంటుంది. ఫ్రాన్స్ లోని డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఈ యుద్ధవిమానం ఇంజన్లు అత్యంత శక్తివంతమైనవి. గంటకు 1912 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఇది మిసైల్స్ ను తీసుకుపోగల సామర్ధ్యంతో ఉంటే ఈ మల్టీ రోల్ ఫైటర్ భూ, గగన తలాల్లో దాడి చేయగల శక్తివంతమైన యుద్ధవిమానం ఇది. అత్యంత శక్తివంతమైన ఈ యుద్ధ విమానాలను నడిపేందుకు పైలట్లకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే భారత వైమానికదళంలోని 12మంది పైలట్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మరో 28మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

మీ అమ్మ హాఫ్ తాగితే నేను క్వార్టర్ తాగుతా.. వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు

ఇటీవల సోషల్ మీడియాలో కొందరు హద్దు మీరి వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. తమకిష్టంలేని రాజకీయ నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన, ముఖ్యంగా ఆడవారిపైన కొందరు నోరు పారేసుకుంటూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తికి టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తమ్ముడూ అంటూనే చురకలు అంటించారు. ఏపీలో తొమ్మిది గంటల వరకు మద్యం అమ్మడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వంగలపూడి అనిత.. జగన్ సర్కార్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. "తొమ్మిది గంటల వరకు మద్యం అమ్మకాలు తప్పని ఎలా అంటారు?. మద్యంలో ఉండేది ఏంటి? ఆల్కహాల్. కరోనా జాగ్రత్తలో వాడే శానిటైజర్ లో ఉండేది ఏంటి? ఆల్కహాల్. కరోనా జాగ్రత్త కోసం తొమ్మిది గంటల వరకు మా సీఎం కష్టపడితే తప్పా?. రాత్రి 9 నుంచి ఉదయం 10 వరకు మద్యపాన నిషేధం కూడా చేస్తున్నారు. హ్యాట్సాఫ్ సీఎం." అంటూ అనిత ట్వీట్ చేశారు. అనిత ట్వీట్ పై స్పందించిన కర్ణ అనే యువకుడు.. "ఆంటీకి అలవాటు ఉన్నట్టుండి. మంచిగా ఎక్స్ ప్లైన్ ఇస్తుంది ఆల్కహాల్ గురుంచి. ఎంత రోజు ఒక క్వార్టర్ వేస్తావా." అంటూ దారుణ వ్యాఖ్యలు చేశాడు.  ఆ యువకుడి వ్యాఖ్యలకి అనిత కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. "అవును తమ్ముడు, మీ అమ్మగారు, నేను కలిసే తాగుతామ్. మీ అమ్మ హాఫ్ తాగితే నేను క్వార్టర్ తాగుతా. నా కడుపున సంస్కారం లేని వెధవ పుట్టాడమ్మా అని ప్రతిరోజు ఏడుస్తారు. సన్నాసి ఏమి భాషరా అది.. ఇలానే పెంచారా నిన్ను మీ ఇంట్లో..." అంటూ అనిత విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఆడవారి గురించి పిచ్చిపిచ్చిగా వ్యాఖ్యలు చేసే వారికి.. ఇలానే సమాధానం చెప్పాలంటూ వంగలపూడి అనితపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏపీలో ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు.. ధర ఎంతంటే?

ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షల నిర్వహణపై  ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్‌ యాంటీజెన్ పరీక్షలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు రూ.750 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ విధానంలో చేసే పరీక్షకు రూ.2,800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్‌ లాగిన్‌ లో కూడా పరీక్షల ఫలితాల డేటాను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు అస్పత్రులు, ల్యాబ్‌ల్లో జరిగే పరీక్షలు, ధరలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.

ట్రాక్టర్ సాయం పొందిన రైతు 2009 లో ఎమ్మెల్యే గా పోటీ చేశాడు!

చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని మహల్ రాజు పల్లెకు చెందిన ఓ రైతు కుటుంబానికి సోనూ సూద్ ట్రాక్టర్ సాయం చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు ఆడపిల్లలు ఎద్దులకు బదులుగా నాగలి లాగుతూ పొలం దున్నుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది చూసి చలించిపోయిన సోనూ సూద్.. 24గంటల్లోనే వారికి ట్రాక్టర్ అందించారు. దీంతో, లీడర్ల నుంచి సామాన్యల వరకు అందరూ సోనూ సూద్ ని ప్రశంసిస్తున్నారు. అయితే, ఇప్పుడీ వ్యవహారంలో అనూహ్య ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ సాయం పొందిన వీరదల్లు నాగేశ్వరరావు కుటుంబం ఏటా వ్యవసాయం చేసే కుటుంబం కాదని తెలుస్తోంది. సమీప పట్టణంలో నివాసం ఉంటూ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఉపశమనం కోసం ఊరికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమకున్న పొలంలో వ్యవసాయం మొదలుపెట్టారు. పొలం దున్నడానికి ఎడ్లు లేకపోవడం గానీ, ఆర్థిక సమస్యలుండి గానీ అలా చేయలేదని, కేవలం కొత్త అనుభూతి కోసమే ఇలాంటి పని చేశారని ఆ ఊరి వాసులు చెబుతున్నారు. అయితే, ఊహించని రీతిలో మలుపు తీసుకుని ఇది సంచలనంగా మారిందని అంటున్నారు. వీరదల్లు నాగేశ్వరరావు అనే ఆయన వ్యవసాయం చేసే వ్యక్తి కాదని.. ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, స్థానికంగా అంతో ఇంతో పేరున్న వ్యక్తని సమాచారం. వీరదల్లు నాగేశ్వర రావు గతంలో 2009 ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ తరపున మదనపల్లి బరిలో దిగారు. పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసారు. అలాంటి వ్యక్తిని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రైతుగా ఎందుకు చిత్రీకరించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోనూ సూద్ లాక్ డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎందరికో సాయం చేస్తున్నారు. అదే క్రమంలో ఈ వార్తకి కూడా చలించిపోయి సాయం చేశారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగులోకి రావడంతో.. సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం చేసిన వారిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సాయాన్ని అర్హులకి చెందేలా చూడాలని సామాన్యులు కోరుతున్నారు. మరోవైపు, నాగేశ్వర రావు కుటుంబం కూడా తాము ఇలా జరుగుతుందని ఊహించలేదని, ఆ ట్రాక్టర్ ని పంచాయతీకి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

మనస్సున్న మహారాజు

కష్టంలో ఆదుకునేవాడు దేవుడైతే అతను నిజంగా వేలాది మందికి దేవుడే అడగకుండా సహాయం చేసేవాడు ఆపద్భాందవుడైతే వాస్తవంగా ఎన్నో కుటుంబాలకు ఆయన ఆపద్భాందవుడే సోషల్ మీడియాలో వచ్చే సమస్యలకు స్పందించి తనకు తానుగా సహాయం అందించేవాడు ఎవరూ అంటే మాత్రం సోనూ సూద్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసే సహాయానికి మరెవ్వరూ సాటిరారు. పది రూపాయల సహాయం చేయాలంటేనే నాకేంటీ అంటూ వందసార్లు ఆలోచించే ఈ కాలంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న మనస్సున్న మహారాజు.. సోనూ సూద్. కరోనా లాక్ డౌన్ సమయంలో వందలాది మందికి అండగా నిలిచిన సోనూ సూద్ మరోసారి వార్తల్లోకి వ్యక్తిగా నిలిచారు. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటూ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు.  ఎన్నో సేవాకార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆయన  తాజాగా చిత్తూరు జిల్లాలోని చిన్నరైతుకు ట్రాక్టర్ అందింది తన దాతృత్వాన్ని మరోసారి  చాటుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు ఆడపిల్లలు ఎద్దులకు బదులుగా నాగలి లాగుతూ పొలం దున్నడం చూసి 24గంటల్లోనే వారికి ట్రాక్టర్ అందించారు. లీడర్ల నుంచి సామాన్యల వరకు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమాల్లో ప్రజల కష్టాలను తీర్చడానికి హీరో వస్తాడు. రెండున్నర గంటల సినిమాతో లక్షలాది ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాడు. మరి సినిమాలో విలన్ ను చూస్తే ప్రేక్షకుల్లో చులకనభావం. కానీ, సినిమాలో పాత్ర వేరు నిజజీవితం వేరు అన్నది నిరూపించారు సోనూ సూద్. వెండితెరపై విలన్ పాత్రలు వేసినా.. నిజజీవితంలో మాత్రం హీరోయిజంతో మానవత్వం చాటుకుని హీరో అయ్యారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా  ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో ఉన్న సోనూ సూద్ తనూ చేస్తున్న సేవకార్యక్రమాలతో శతాబ్దాలకు సరిపడ  ప్రేమాభిమానాలను, పేరు ప్రఖ్యాతులు  సాధించారు.  ఇటీవల  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బి)  సంస్థ లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్రజలకు సేవ‌లు  అందించిన  ప్రముఖుల  గురించి ఒక సర్వే నిర్వహించింది .ఇందులో బాలీవుడ్ నటుడు సోను సూద్  జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో అక్షయ్ కుమార్ , మూడోస్థానంలో అమితాబ్ బచ్చన్ ఉన్నారు.నటనతోనే కాదు మానవత్వంతోనూ ప్రజల మనసులు గెలవవచ్చని నిరూపించారు. నిన్ను వదల బొమ్మాళి అంటూ అరంధతి సినిమాలో అద్భుత నటనతో ఉత్తమ విలన్  గా నంది అవార్డు అందున్న సోనూ సూద్  ఈ సేవా కార్యక్రమాలు వదలను అంటూ ఎందరో మనసులను గెలుచుకున్నారు. కరోనా సమయంలో వలస కార్మికుల కోసం ఆయన చేసిన సేవాకార్యక్రమాలు ఎవరూ చేయలేదు. వలస కార్మికులపై ఇంత ప్రేమ ఎందుకు అని ఎవరైనా అడిగితే నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే అంటారు. ముంబయికి వలస వచ్చిన నన్ను ఇంతవాడిని చేసిన ప్రజలకు చేస్తున్నది కొంతే అంటూ తన గొప్ప మనసు చాటుకుంటారు. కరోనా మహమ్మారిపై  దేశవ్యాప్తంగా జరిగిన సేవాకార్యక్రమాల్లో సినీనటులు, ఎన్జీవోలు, సంస్ఖలు ఎందరో తమ వంతు సాయం చేశారు. అయితే సోనూ సూద్ ప్రత్యేకత ఎంతో ఉంది. కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు వరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి ముంబయిలోని తన  హోటల్ ఇచ్చారు. లాక్ డౌన్ తో పనులు లేక పస్తులు ఉంటున్న మురికివాడల్లోని ప్రజలకు నిత్యం ఆహారం అందించారు. అంతేకాదు  దేశం నలుమూలల్లో చిక్కుకున్న వలసకూలీలు తమ సొంత గూటికి చేరుకోవడానికి వందలాది కిలోమీటర్ల కాలినడక చూసి చలించి వారి కోసం ప్రత్యేకంగా రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తన సొంత ఖర్చులతో వందలాది మందిని సొంతఊరికి చేరుకునేలా చేశారు. వారందరి మనసులో దేవుడయ్యారు.బతుకుదెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చి కాయకష్టం చేసుకుని బతుకుఈడ్చే వలస కార్మికులంటే అందరికే అలుసే. కానీ చివరి వలస కార్మికుడిని ఇంటికి పంపించేవరకు బాధ్యత తీసుకుంటాను అంటూ ఆయన ప్రకటించడం చూసి ఎందరో స్పందించారు. శభాష్ సోనూ అంటూ అభినందించారు. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటుచేసిన ఘనత ఆయనదే. కేరళలోని ఎర్నాకుళంలో కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేసే 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి సొంతఇంటికి చేరేవరకు సహాయం చేశారు.  అంతేకాదు విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశం తీసుకువచ్చేందుకు శాయశక్తులు ప్రయత్నాలు చేశారు. కిర్గిస్తాన్‌ రాజధాని బిష్‌కేక్‌లోని మెడికల్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కరోనా కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. విషయం సోనూ సూద్ దృష్టికి రావడంతో అక్కడి ప్రభుత్వం తో మాట్లాడి ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థులను భారత్ కు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.  సోనూసూద్ సాయంతో తెలుగు విద్యార్థులు తమతమ ఇండ్లకు చేరుకున్నారు. తెలుగు విద్యార్థులకు తిరిగి  స్వదేశానికి తీసుకొచ్చి మరోసారి  మనసున్న మహారాజుగా ప్రశంసలు అందుకున్నారు. వలస కార్మికులను ఇండ్లకు చేర్చడంతోనే తన బాధ్యత తీరిందనుకోలేదు. ఇంటికి చేరుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నంలో బిజీగా మారారు సోనూసూద్. దాదాపు నాలుగువందల కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించే పనిలో నిమగ్నమయ్యారు. వివిధ రాష్ట్రాల అధికారులతో మాట్లాడి చనిపోయిన వారి వివరాలను సేకరించారు. ఉపాధి కోల్పోయి.. ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న పేద కుటుంబాల్లో పెద్దకొడుకుగా అండగా నిలుస్తున్నాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా యాప్ ఏర్పాటుచేసి వారికి ఉద్యోగావకాశాలు కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సోనూ సూద్.   'ప్రవాసీ రోజ్‌గార్' పేరుతో రూపొందించిన ఈ  ఉచిత ఆన్లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాల కల్పనలో సహకారం అందించనున్నారు. దాదాపు 500 ప్రసిద్ధ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను  కల్పిస్తారు. దేశంలోని ప్రధాన నగరాల్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలంటే కావల్సింది అధికారం కాదు ఆదుకునే గుణం కష్టాల్లో ఉన్నవారిని అక్కున చేర్చుకోవాలంటే కావల్సింది డబ్బు మాత్రమే కాదు మీకు నేనున్నాను అని చెప్పే ధైర్యం మంచి గుణం, అంతులేని ధైర్యం ఉన్న సోనూ సూద్ నిజంగా రియల్ హీరో... కాదని ఎవరైనా అనగలరా..