విశాఖ గెస్ట్ హౌస్ పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు.. డైలీ బేసిస్ లో వైసిపికి షాకులిస్తున్న రఘురామ
posted on Aug 28, 2020 @ 6:06PM
విశాఖలోని కాపులుప్పాడ లో ఎపి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ గెస్ట్ హౌస్ పై వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర పర్యాటక శాఖమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు వద్దని చెప్పినా లెక్క చేయకుండా 30 ఎకరాల గ్రేహౌండ్స్ భూమిని గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కలెక్టర్ కు అప్పగించడం కోర్టులను అపహాస్యం చేయడం కాదా అని అయన ప్రశ్నించారు. ఆవ భూములపై హైకోర్టు విచారణను తాను స్వాగతిస్తున్నానన్నారు. అవినీతి చోటుచేసుకున్న ఆవ భూముల కేసును సీబీఐ విచారణ చేస్తుందని కూడా ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ తన పారదర్శకత నిరూపించుకోవాలని అయన అన్నారు. ఈ సందర్బంగా మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా సూపర్ అని.. సీఎం జగన్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తణుకు, ఆచంటలో జరిగిన అవినీతితో జరిగిన రూ.500 కోట్ల నష్టానికి బాధ్యులెవరని సీఎంను తాను ప్రశ్నిస్తున్నానని రఘురామరాజు అన్నారు.
తాజాగా అంబటి కృష్ణారెడ్డికి కేబినెట్ హోదా కల్పించారని అయితే కులాన్ని బట్టి పోస్టు కాకుండా.. అర్హతలను బట్టి పోస్టులు ఉండాలని అయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా పోస్టింగులు ఇచ్చి జగన్ తన పేరు చెడకొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం జగన్ తన సలహాదారులను తగ్గిస్తే మంచిదని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా రఘురామరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఇలాగే కొనసాగితే బిల్డర్లు ఆత్మహత్య చేసుకోవడమేనని, భవన కార్మికులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. "పెయిడ్ ఆర్టికల్స్ నిజం కావు, అలాగే మన పేపర్లో వచ్చేవన్నీకూడా నిజం కావు, అయితే మీరు అన్ని సమస్యలను పరిష్కరించగలరన్న నమ్మకముందని" రఘురామ రాజు వ్యాఖ్యానించారు.
నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు ఢిల్లీలో ఉండి ఇలా డైలీ ఎదో ఒక అంశం తీసుకుని వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండటంతో అటు అధికారపక్షం ఎం చేయాలో తెలీక తలపట్టుకుంటుంటే మరో పక్క ప్రతిపక్షాలకు కూడా పెద్దగా పని లేకుండా పోతోంది.