బండి సంజయ్ ని చంపాలని చూశారు! రేవంత్ రెడ్డి సంచలనం
posted on Oct 27, 2020 @ 6:36PM
సిద్దిపేటలో పోలీసుల సోదాలు, బీజేపీ ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. బీజేపీకి తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదన్నారు. టీఆర్ఎస్ తన బుట్టలోనిదే అని భావించిన బీజేపీకి దెబ్బ తగిలాకే అసలు విషయం తెలిసినట్టుందన్నారు. సీఎం కేసీఆర్ కు బీజేపీలో అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపైనా హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. కేంద్రమంత్రిగా కలెక్టర్, సీపీని పిలిచి సమీక్షించే అధికారం ఉన్నా కిషన్రెడ్డి ఆ పనిచేయలేదని విమర్శించారు. ఘటనపై విచారణకు కిషన్రెడ్డి ఎందుకు అదేశించలేదన్నారు. టీఆర్ఎస్తో కిషన్రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
ఏపీ ఎంపీ రఘురామరాజుకు సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం.. తమ సొంత ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. సంజయ్ను మొదటిసారి కొట్టినప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోలేదు కాబట్టే.. చంపేందుకు మళ్లీ ప్రయత్నం చేశారన్నారు. రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు ఉంటే ఐటీ అధికారులు సోదాలు చేయాలని... అంతేకానీ పోలీసులు పోదాలు చేయడమేంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.