జగన్ సర్కార్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్.. 

ఏపీలో స్థానిక ఎన్నికలు జరిపే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ తాజాగా పతాక స్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేసింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఎన్నికల సంఘం పేర్కొంది .   వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఏపీ సర్కార్ తెగేసి చెబుతోంది. ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బందిని, పోలీసులను ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సిన్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బంది కల్గిస్తోందని ఏపీ ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ శుక్రవారం నాడు ఏపీ ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.

టీడీపీ ఒక పిలుపునిస్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు! 

ఏలూరులో వింత వ్యాధికి కారణమేమిటో కూడా చెప్పలేని అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం వైసీపీది అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రులు నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని... లేకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. టీడీపీ ఒక పిలుపునిస్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు అచ్చెమన్నాయుడు. జగన్ ను ఒక వింత ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. జగన్ సర్కార్ తప్పుల చిట్టాను ప్రజలు రాసుకుంటున్నారని.. అవకాశం వచ్చినప్పుడు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అచ్చెన్న చెప్పారు.  పన్నుల పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. జుట్టు మీద తప్ప మిగిలిన అన్నింటి మీద పన్నులు వేశారని విమర్శించారు. విజయవాడలో ప్రభుత్వం  నిర్వహించిన బీసీ సంక్రాంతి సభపైనా అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.ఎన్నికలు పెడితే కరోనా వస్తుందని జగన్ చెపుతున్నారని... వేల మందితో మీటింగ్ పెడితే కరోనా రాదా? అని ప్రశ్నించారు. బీసీలకు తెలుగు దేశం పార్టీ ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? అనే విషయంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ధరణి పోర్టల్ పై ఏం చేద్దాం?  శనివారం కేసీఆర్ హై లెవల్ మీటింగ్ 

ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. ప్రభుత్వ నిర్ణయాలతో పోర్టల్  లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్కార్ విధానాలపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు కు వెళ్లడమా ? లేదంటే కొత్త విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖల నిపుణులతో చర్చించి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.    వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై గురువారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్‌, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని హామీ ఇచ్చిన సర్కారు.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడింది.  స్వచ్ఛందం అంటూనే.. ఆధార్‌ తీసుకోవడమంటే కోర్టుకు ఇచ్చిన హామీని విస్మరించడమేనని ప్రభుత్వానికి తెలియదా? అని నిలదీసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్‌ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్‌ కాలమ్‌ తొలగించే వరకు స్లాట్‌ బుకింగ్‌ను నిలిపివేయాలని సూచించింది. పీటీఐఎన్‌ జారీ చేయడాన్ని కూడా నిలిపివేయాలని తెలిపింది. కులం, కుటుంబసభ్యుల వివరాలు కూడా తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

మీకు అంత నమ్మకముంటే జగన్, కేసీఆర్ లాగా చేసి చూపించండి.. బాబుకు సజ్జల కౌంటర్ 

రాజధాని అమరావతి ఉద్యమం మొదలై 365 రోజులు పూర్తైన సందర్భంగా దానికి మద్దతుగా నిన్న నిర్వహించిన జనరణభేరిలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌కు ఓ సవాలు విసిరిన సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా ఉంచాలని, లేదంటే మూడు రాజధానుల అంశంపై రెఫరెండం నిర్వహించాలని, దీనికి సీఎం జగన్‌ సిద్ధమేనా? అని నిన్న చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవేళ ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా వస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని అయన సవాల్‌ విసిరారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ బాబుకు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.   "రెఫరెండానికి రెడీనా అని చంద్రబాబుగారు అడుగుతున్నారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు గతంలో ఏం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏం చేశారో మనకు తెలిసిందే.. వారి తో ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల ముందుకు వెళ్లారు. వైఎస్ జగన్ ‌గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెబుతోన్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా?" అని సజ్జల చంద్రబాబుకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

తల్లి అంత్యక్రియలకు పర్మీషన్ ఇవ్వలేదని బాస్ పై కత్తితో దాడి

మా అమ్మ చనిపోయింది. అంత్యక్రియలకు వెళ్లేందుకు పర్మీషన్ ఇవ్వండంటూ ఓ ఉద్యోగి కోరగా బాస్ నిరాకరించాడు. దీంతో కోపోద్రికుడైన ఆ ఉద్యోగి కత్తితో బాస్‌ ని 11 సార్లు పొడిచాడు. ఈ ఘటన దుబాయ్ లో జరిగినప్పటికీ.. అక్కడ ఉద్యోగి, బాస్ ఇద్దరూ భారతీయులు కావడం గమనార్హం.   భారత్‌ కు చెందిన 25 ఏళ్ల యువకుడు కుటుంబాన్ని పోషించేందుకు ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు దుబాయ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో యువకుడికి తన తల్లి ఆనారోగ్యం కారణంగా చనిపోయిందని బంధువులు సమాచారం ఇచ్చారు. దీంతో తన తల్లి అంత్యక్రియలు చేసేందుకు భారత్‌ కి వెళ్లేందుకు పర్మీషన్ కావాలంటూ భారత్ కు చెందిన బాస్‌ ను రిక్వెస్ట్ చేశాడు. అందుకు బాస్.. నా చేతిలో ఏం లేదు.. అంతా కంపెనీయే చూసుకుంటుందని సున్నితంగా తిరస్కరించాడు.   అంతేకాదు 22 మంది ఉద్యోగుల్ని భారత్‌ కు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని, వారి లిస్ట్ తయారు చేసి ఇవ్వాలని సదరు కంపెనీ యాజమాన్యం బాస్‌ ను ఆదేశించింది. బాస్ ఓ లిస్ట్ తయారు చేసి యాజమాన్యానికి ఇచ్చాడు. ఆ లిస్ట్ లో తానుకూడా ఉంటానని బాధితుడు అనుకున్నాడు. కానీ లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో బాస్ తో గొడవపెట్టుకున్నాడు. తన చేతిలో ఏమీ లేదని, అంతా కంపెనీయే చూసుకుంటుందని బాస్ మళ్లీ చెప్పడంతో కోపోద్రికుడైన ఉద్యోగి.. బాస్ ను కత్తితో 11 పోట్లు పోడిచాడు. అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం బాస్ ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అదృష్టం బాగుండి బాస్  ప్రాణాలతో భయటపడ్డాడు. కాగా, బాస్ పై కత్తితో దాడి చేసిన ఉద్యోగిపై కేసు నమోదైంది. జనవరి 10న దుబాయ్ కోర్ట్ కేసును విచారించనుంది.

ముళ్లతీగలతో 2 వేల కిలోమీటర్ల గోడ! చైనా మరో వివాదాస్పద నిర్మాణం

సంచనాలకు మారుపేరుగా నిలిచే చైనా ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్మాణం చేపట్టింది. మయాన్మార్‌తో సరిహద్దు వెంబడి అత్యంత పొడవైన గోడను  నిర్మిస్తోంది.  తాజాగా వెలుగు చూసిన ముళ్లతీగలతో ఏర్పాటు చేస్తున్న ఈ గోడ ఏకంగా 2 వేల కిలోమీటర్ల పొడవు ఉంటుందని సమాచారం. మయాన్మార్ మీడియా వార్తల ప్రకరాం.. డిసెంబర్‌లో ఈ ముళ్లగొడ ఏర్పాటు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. చైనా కమ్యునిష్టు సర్కార్ చేపట్టిన ఈ నిర్మాణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మయాన్మార్‌ నుంచి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమచొరబాటు దారుల్ని అడ్డుకోవడం కోసమే ముళ్ల తీగలతో గోడ నిర్మిస్తున్నామని చైనా చెబుతోంది.  కాని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మత్రం చైనా వాదనను కొట్టిపారేస్తున్నారు. చైనాలోని ప్రభుత్వవ్యతిరేకులు, తిరుగుబాటు దారులు దేశసరిహద్దు దాటకుండా ఉండేందుకే  ఈ చర్యకు పూనుకుందని  చెబుతున్నారు.  మయన్మార్ సరిహద్దులో చైనా నిర్మిస్తున్న గోడపై అమెరికా ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా కారణంగా రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.  మయాన్మార్ కూడా చైనా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ అధికారులు చైనా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య 1961లో కుదిరిన సరిహద్దు ఒప్పందం గురించి లేఖలో ప్రస్తావించారు. అప్పటి  ఒప్పందం ప్రకారం సరిహద్దు రేఖ వెంబడి ఇరు వైపులా 10 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదని,   చైనా  ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గోడ నిర్మిస్తుందని మయమ్నార్ ఆర్మీ అధికారులు లేఖలో స్పష్టం చేశారు.

సీనియర్ అధికారులపై నిఘా! సీఎస్ పై తిరుగుబాటు మొదలైందా? 

తెలంగాణ సచివాలయంలో కోల్డ్ వార్ నడుస్తోందా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సీనియర్ అధికారులు ఢీ అంటే ఢీ అంటున్నారా? ఐఏఎస్ ల మధ్య కొట్లాటతో పాలన పడకేసిందా? తెలంగాణ సచివాలయంలో జరుగుతున్న పరిణామాలతో అందరికి ఇవే అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రం సచివాలయం. అలాంటి సచివాలయంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోందని చెబుతున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ కు సీనియర్ ఐఏఎస్ లకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.  సీఎం కేసీఆర్ సచివాలయం రాక పోవడంతో సీఎస్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం తరహాలోనే సీఎస్ సచివాలయంలో సమాంతర వ్యవస్థను సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది నచ్చని కొందరు అధికారులు ఆయన్ను ప్రశ్నించారని, దీంతో విభేదాలు పెరిగిపోయాయని తెలుస్తోంది.    సీనియర్లు అధికారులు తనకు సహకరించకపోవడంతో వారిపై సీఎస్ సోమేష్ కుమార్ నిఘా పెట్టారనే చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారుల  కదలికలను పసిగట్టే బాధ్యత తనకు అనుకూలంగా ఉండే అధికారులకు సీఎస్  అప్పగించారని సమాచారం. ఈ విషయం తెలిసి  ఇప్పుడు సచివాలయంలో చాలా మంది అధికారులు ప్రైవేట్​ అంశాలను కూడా ఫోన్లలో మాట్లాడుకోవడం లేదని చెబుతున్నారు. నిఘా ఉందని తెలియడంతో ఉన్నతాధికారులు సీఎస్​ తో బహిరంగంగానే వివాదాలకు దిగుతున్నారట. సచివాలయంలో ప్రస్తుతం అందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. సీఎస్​ కాకముందు తాము చూసిన సోమేశ్​ కుమార్​కు, ఇప్పటి సోమేశ్ కుమార్‌కు చాలా వ్యత్యాసం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట అధికారులు.    సీఎస్ సోమేష్ కుమార్ తీరుపై పై చాలా మంది ఐఏఎస్ అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. చిన్న చిన్న అంశాలు, సాధారణ, పరిపాలనా విషయాలలోనూ ఆయన​ జోక్యం పెరిగిపోయిందని  గతంలో కొందరు అధికారులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్లు కూడా సీఎస్​పై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొందరు ఐఏఎస్​ల వ్యవహారంలో సీఎస్​ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. రిజిస్ట్రేషన్ల​ శాఖలో సీఎస్​పై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని తెలుస్తోంది. ఆ శాఖలోని చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు మండిపడుతున్నారు. తమ శాఖను సీఎం ముందు పని లేని విభాగంగా మార్చేందుకు సీఎస్​ ప్రయత్నాలు చేశారనే కోపం వారిలో ఉంది. సీఎస్​ నివేదిక ఆధారంగానే సీఎం కూడా రిజిస్ట్రేషన్​ శాఖను పూర్తిగా రెవెన్యూలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని వాళ్లు భావిస్తున్నారట.    నిజానికి సోమేశ్ ఏపీ కేడర్ అయినప్పటికీ  ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కన్నా సీనియర్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా నమ్మకంతో సీఎస్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు కేసీఆర్. సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కలిసి రాలేదు. ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి, ఎల్​ఆర్​ఎస్​ వంటి స్కీంలు జనాగ్రహానికి కారణమయ్యాయి. ఈ రెండు పథకాల ప్రతిపాదనలు సోమేష్ కుమార్ తెచ్చినవే.  జీహెచ్​ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీ ఓటమికి ఇది కూడా కారణమంటూ సీఎం కేసీఆర్​కు నివేదిక అందిందని, సీఎస్ ను కేసీఆర్ సీరియస్​గా మందలించినట్లు ప్రచారం జరిగింది. సీఎస్ ను మార్చతారని కూడా చర్చ జరిగింది.  అయితే తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గమే ఇలాంటి ప్రచారం చేసిందని సోమేష్ కుమార్ భావిస్తున్నారని చెబుతున్నారు.

కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే గ్రేటర్ మేయర్ ఎంపిక ఆలస్యం! 

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జీహెచ్ంసీ మేయర్ సీటు కోసం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే మేయర్ ఎంపికను అధికార పార్చీ ఆలస్యం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. తమ కార్పొరేటర్ల జోలికి వస్తే వంద మంది ఎమ్మెల్యేలను లాగుతామని హెచ్చరించారు. హైదరాబాద్ ఓల్ట్ సిటీ సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ వియుక్త హైదరాబాద్‌ను సాధిస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై కేసీఆర్‌ను ఒవైసీ ఎందుకు అడగడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.  చార్మినార్  భాగ్యలక్ష్మీ అమ్మవారిని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవినీతికి పాల్పడనని.. అభివృద్ధికి తోడ్పడుతానని బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు సంజయ్. ఈ సందర్భంగా మట్లాడిన సంజయ్..  హైదరాబాద్ నగర అభివృద్ధికి బీజేపీ తప్పకుండా సహకరిస్తుందని చెప్పారు. కేంద్ర నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ చేతగానితనం వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు బండి  సంజయ్.

25 వేల కోట్ల రుణాలు.. మూడు రాజధానుల పుణ్యమా రోడ్డున పడే పరిస్థితి!!

ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. అన్ని సదుపాయాలు ఉండి, అన్నిటికి అనువైన మంచి రాజధాని ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వచ్చి ఆదాయం పెరుగుతుంది. దాంతో రాజధానితో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆ ముందుచూపుతోనే రాష్ట్ర విభజన తరువాత అప్పటి ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రానికి కేంద్ర బిందువు, అన్ని వనరులు కలిగిన అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసింది. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చి దిద్దాలని భావించింది. రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎందరో రైతులు వేల ఎకరాల భూములను త్యాగం చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు, యూనివర్సిటీలు అమరావతి వైపు చూశాయి. అంతేకాదు, ఏపీలోని ఎందరో ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ రాష్ట్రం, తమ రాజధాని అన్న భావనతో బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు తీసుకొని పెట్టుబడులు పెట్టారు. రైతుల త్యాగం, ఔత్సాహిక వ్యాపారవేత్తల నమ్మకంతో కొన్నేళ్లలోనే అమరావతి విశ్వనగరంగా మారుతుందని.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని భావించారంతా. కానీ, ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్క నిర్ణయం.. అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలోకి నెట్టేసింది. అదే ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం.   మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. వచ్చిన కంపెనీలు తరలి వెళ్లిపోతున్నాయి.. కొత్త పెట్టుబడులు రావట్లేదు. ఆదాయం లేదు.. అప్పులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర పరిస్థితి ఏంటా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమ రాష్ట్రం, తమ రాజధాని అన్న భావనతో వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఎందరికో ఉపాధి కల్పిద్దామని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావించిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. తమ జీవితాన్ని నరకంలో పడేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఎందరో తమ ఆస్తులను తనఖా పెట్టి మరీ పెట్టుబడులు పెట్టారు. ఆస్తులు తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 25 వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే, మూడు రాజధానుల నిర్ణయంతో ఇప్పుడు అమరావతి భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. నిర్మాణాలు ఆగిపోయాయి.. ఇప్పటికే సగం పెట్టుబడులు పెట్టి ఉండంతో.. వెనక్కి రాలేని, ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల భారం పెరుగుతోంది. ఆ విధంగా రాజధాని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలనుకున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పుణ్యమా అని రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

మనదేశంలో కరోనాకు తోడు మరో ప్రాణాంతక వ్యాధి.. ఇప్పటికే పలువురి మృతి.. 

కరోనా తో సతమతమవుతున్న భారత్ ను తాజాగా మరో ముప్పు వణికిస్తోంది. గుజరాత్‌లో తాజాగా మరో ప్రాణాంతక వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. మ్యూకార్ మైకోసిస్ (Mucormycosis) అనే అరుదైన ఫంగస్ వ్యాధి.. అహ్మదాబాద్‌లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌లో 44 మంది ఈ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 9 మంది చికిత్స పొందుతూ ఇప్పటికే మరణించారు. కరోనా బాధితుల్లో కనిపిస్తున్న ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వారి కంటిచూపుతో పాటు ప్రాణాలను కూడా హరించి వేస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం లో అహ్మదాబాద్‌తో పాటు పలు నగరాల్లో మ్యూకార్ మైకోసిస్ వ్యాధి బాధితులు ఆస్పత్రుల్లో చేరుతుండడంతో ఇపుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.   మ్యూకార్ మైకోసిస్ అనేది చాలా తీవ్రమైన, అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. మ్యుకోర్మిసెట్స్ (mucormycetes) అనే ఒకరకమైన ఫంగస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎలాంటి వాతావరణంలోనైనా సంక్రమిస్తుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ముక్కులో ఇన్‌ఫెక్షన్ తో ఈ వ్యాధి మొదలవుతుంది. అక్కడి నుంచి ఇది కళ్లకు వ్యాపిస్తుంది. ప్రారంభ దశలోనే కనుక ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. ఒకవేళ ఈ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైనా.. లేక ట్రీట్‌మెంట్ తీసుకోకుండా అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాలుపోయే ప్రమాదముంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ఈ మ్యూకార్ మైకోసిస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కరోనా సోకని వారిలో "మ్యూకార్ మైకోసిస్" వ్యాప్తి చెందడానికి 15 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుందని, అయితే కరోనా రోగులకు మాత్రం ఇది 2 నుంచి 3 రోజుల్లోనే సోకుతోందని నిపుణులు తెలియచేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం 12 మ్యుకోర్మికోసిస్ కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ పలువురు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఇది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   ఈ వ్యాధి నుండి కాపాడుకోవడం ఎలా.. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. ముక్కును, కంటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ చేతులతో తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ముక్కు, గొంతు, కళ్లు భాగాల్లో వాపు కనిపిస్తే వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే కనుక తేలికగా దీని నుండి బయటపడవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కనుక ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి మనల్ని మనం కాపాడుకుందాం.

కొత్త వ్యవసాయ చట్టాల కాపీలను అసెంబ్లీ సాక్షిగా చించేసిన సీఎం..  

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల పై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతులు 21 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఈ వివాదస్పద వ్యవసాయ చట్టాల కాపీని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలలో చించేశారు. ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో భాగంగా.. ఈ చట్టాలపై కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారవకండి’’ అంటూ మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను అడ్డంగా చించేశారు. దీంతో సభలో ఉన్న సభ్యులంతా బల్లలు చరుస్తూ కేజ్రీవాల్‌కు తమ సంఘీభావం తెలిపారు.   ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ సాక్షిగా ఈ మూడు వ్యవసాయ చట్టాలను చించేస్తున్నాను. ఇదే సమయంలో నేను కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుండి ఒక విజ్ణప్తి చేస్తున్నాను. మీరు తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి. బ్రిటిషర్ల కంటే కూడా దారుణంగా తయారవ్వొద్దు. కరోనా.. లాక్‌డౌన్ సమయం‌లో కొంపలు మునిగినట్లు ఈ చట్టాలను ఆమోదింపజేసేంత అవసరం ఇపుడు ఏమొచ్చింది?’’ అని అసెంబ్లీలో కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశించారు. అంతేకాకుండా ‘‘రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ చట్టాల గురించి వివరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒకపక్క చెబుతోంది. భూములు తీసుకోవడం లేదు కదా.. ఈ చట్టాల వల్ల రైతులు లాభపడతారని యూపీ సీఎం అంటున్నారు. ఇది నిజంగా ప్రయోజనం చేకూర్చేది అయితే మరి రైతులు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? కొంత మంది బీజేపీ నేతలు అయితే ఏకంగా రైతులను దేశద్రోహులు అంటున్నారు. చాలా మంది మాజీ ఆర్మీ ఉద్యోగులు, గాయకులు, సెలబ్రిటీలు, డాక్లర్లు రైతులకు మద్దతు ఇస్తున్నారు. మరి వీళ్లు కూడా దేశద్రోహులేనా? జాగ్రత్త.. ఈ వ్యవహారం పై కేంద్రం వైఖరితో ప్రతి రైతు ఒక భగత్‌సింగ్‌లా తయారవుతున్నారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  

ఉస్మానియా క్యాంపస్ లో అలజడి! కేసీఆర్ సర్కార్ పై ఇక తిరుగుబాటే? 

ఉస్మానియా యూనివర్శిటి.. ఈ పేరే ఓ వైబ్రేషన్.. పోరాటాల  గడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధాన మెట్టు. ఉస్మానియా సమర నినాదమే తెలంగాణలో పార్టీలకతీతంగా నేతలను ఏకం చేసింది. ఉస్మానియా విద్యార్థుల వీర గర్జనే ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. దశాబ్దాలప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసింది. ఉస్మానియా యూనివర్శిటి లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదంటే అతిశయోక్తి కాదు.  సిద్ధిపేట నుంచి  ఆమరణ దీక్ష కోసం కరీంనగర్ వెళుతున్న కేసీఆర్ ను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు  ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడే నిమ్మరసం తాగి దీక్ష విరమించారు కేసీఆర్. అయితే కేసీఆర్ తీరుపై ఉస్మానియా భగ్గుమనడంతో ఆయన  మాట మార్చారు. మళ్లీ దీక్ష కొనసాగించారు. అప్పుడు ఉస్మానియా విద్యార్థులు ఎదురు తిరగకపోతే కేసీఆర్ దీక్ష చేసే వారే కాదని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఉండేది కాదని చెబుతారు.   విద్యార్థి ఉద్యమ కేంద్రంగా  అంతర్జాతీయంగా పేరున్న ఉస్మానియా యూనివర్శిటీలో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది. ప్రశ్నించే ప్రాంతంగా పేరున్న క్యాంపస్ లో ఇప్పుడు ప్రశ్నించడమే పాపంగా మారింది. విద్యార్థుల  త్యాగాలతో సిద్దించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎలగబడుతున్న టీఆర్ఎస్ పార్టీ.. ఉస్మానియా వర్శిటిలో నిర్బంధం అమలు చేస్తోంది. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తోంది. సమైక్య రాష్ట్రంలోనూ ఉస్మానియా క్యాంపస్ లో  స్వేచ్చగా తిరిగిన విద్యార్థులు... తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భయంభయంగా కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో అధికార పార్టీ నేత అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి సురేష్ యాదవ్ అనే విద్యార్థి నాయకుడిపై దాడి జరగడంకలకలం రేపుతోంది. . టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఛానల్ డిబేట్‌లో మాట్లాడినందుకే అతనిపై దాడి చేశారని చెబుతున్నారు.  టీఆర్ఎస్ నేత , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.    ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం రాత్రి 11:30లకు తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ నేత సురేష్ యాదవ్ రాత్రి భోజనం చేసి రూమ్‌లో పడుకునే సమయంలో సుమారు 20 మంది మారణాయుధాలతో అతనిపై దాడిచేశారు. వారి నుంచి తప్పించుకున్న సురేష్ యాదవ్.. ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను కొట్టడానికి 20 మంది రావడంతో  రూమ్ నుంచి బయటకు వచ్చి రీసెర్చ్ సెంటర్ వద్ద చెట్లల్లో దాక్కున్నానని సురేష్ యాదవ్ చెప్పారు. విద్యార్ధి సమస్యలపై ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని.. మా బాల్కసుమన్ అన్ననే కాదు.. టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే నిన్నే కాదు ఎవరినైనా చంపుతాం అనుకుంటూ  రూమ్‌లోకి బీర్ సీసాలు విసురుకుంటూ వెళ్లిపోయారని తెలిపారు. వారంతా వెళ్లిపోయిన తర్వాత ఉస్మానియా క్యాంపస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారిపై ఫిర్యాదు చేశానని, తనకు ఎమ్మెల్యే బాల్క సుమన్ నుంచి ప్రాణ హాని ఉందని సురేష్ యాదవ్ వాపోయారు. తనపై దాడి చేసిన దుండగులను తక్షణమే  అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని  సురేష్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.    విద్యార్థి నేత సురేష్ యాదవ్‌పై జరిగిన దాడి ఉస్మానియా యూనివర్శిటీలో ప్రకంపనలు రేపుతోంది. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ కొంత కాలంగా సురేష్ యాదవ్ పోరాడుతున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వివిధ న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న చర్చా కార్యాక్రమాల్లో పాల్గొంటూ కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు. ఇదే అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారిందంటున్నారు. ప్రశ్నించే గొంతుకను నులిమివేయాలని ఉద్దేశ్యంతోనే అతనిపై దాడి చేశారని ఓయూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉస్మానియా విద్యార్థి నేతగానే ఎదిగారు బాల్క సుమన్. ఉస్మానియా విద్యార్థుల మద్దతుతోనే ఆయన తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచారు. బాల్క సుమన్ కు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు వచ్చాయంటే అది ఉస్మానియా యూనివర్శిటీ పెట్టిన బిక్షేనని విద్యార్ఖులు చెబుతున్నారు. అలాంటిది ఉద్యమ నేతగా ఎదిగి రాజకీయ పదవులు అనుభవిస్తున్న బాల్క సుమన్ ... విద్యార్థి నేతపై దాడి చేయించడంపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ యాదవ్ పై దాడి చేసిన దుంగులను వెంటనే శిక్షించాలని, ఎమ్మెల్యే బాల్క సుమన్ పైనా కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.    విద్యార్థి నాయకుడు సురేష్ యాదవ్ పై జరిగిన దాడిని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు క్యాంపస్ కు వెళ్లి  బాధిత విద్యార్థిని పరామర్శించారు. టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాదిగ కూడా దాడిని ఖండించారు. కేసీఆర్ సర్కార్ అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై సురేష్ యాదవ్ మొదటి నుంచి పోరాడుతున్నారని చెప్పారు. ఇది జీర్ణించుకోలేని టీఆర్ఎస్ తొత్తులు కొందరు సురేష్ యాదవ్‌పై దాడి చేశారని ఆరోపించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాబందుల రాజ్యంలో ఉన్నమా అని కృష్ణ మాదిగ ప్రశ్నించారు. తక్షణమే బాల్కసుమన్ అనుచరులను అరెస్టు చేయాలి అని ఆయన డిమాండు చేశారు.    విద్యార్థి నేత, ప్రశ్నించే గొంతుకగా మారిన సురేష్ యాదవ్ పై జరిగిన దాడితో ఉస్మానియా యూనివర్శిటి నివురు గప్పిన నిప్పులా మారింది. దాడికి పాల్పడిన అధికార పార్టీ నేత అనుచరులను అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓయూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో క్యాంపస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కేసీఆర్ సర్కార్ పై ఓయూ విద్యార్థులు తిరుగుబాటుకు సిద్దమవుతున్నారనే సమాచారం వస్తోంది. దీంతో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంతో దద్దరిల్లిన ఉస్మానియా గడ్డ.. కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి వేదిక కానుందని తెలుస్తోంది. క్యాంపస్ లో తాజాగా జరుగుతున్న ఘటనలతో ఓయూ విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదంటున్నారు ఓయూ స్టూడెంట్స్.

అలా చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్‌ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు. రాజధాని అమరావతి రక్షణకై రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా 'జనరణభేరి' పేరిట భారీ బహిరంగ సభను అమరావతి జేఏసీ నిర్వహించింది. ఈ సభకు హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతులు, మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అన్నారని, ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్ అని మండిపడ్డారు. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.    ‘‘ఒక కులంలో పుట్టడం నా తప్పా?. కులం చూసి హైదరాబాద్‌, విశాఖను అభివృద్ధి చేయలేదు. నా దగ్గర జగన్ తెలివి తేటలు పనిచేయవు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి అంటే ఈ సీఎంకు ఎందుకింత కోపమో అర్థం కావట్లేదు. ఇవాళ రాజధాని రైతుల కోసం వైసీపీ తప్ప రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వచ్చాయి. ఊరందరిదీ ఒకదారి అయితే ఈ ముఖ్యమంత్రిది మరోదారి. ఇంతకంటే వితండవాదం మరొకటి ఉంటుందా? అని విమర్శించారు. 10 వేల కోట్లు అమరావతిలో ఖర్చు చేస్తే శ్మశానం అంటారా? అని ప్రశ్నించారు. ఎడారి, శ్మశానం అనడానికి మీకు బుద్ధుందా అని మండిపడ్డారు.   రాష్ట్రమంతా నీతోనే ఉందని చెప్పుకుంటున్నావు కదా.. మరి రిఫరెండంకు వెళదామా? అని చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. మీరు ప్రజల ముందుకు వెళ్లి మూడు రాజధానులు కావాలా అని అడగండి.. ప్రజలు గనుక మూడు రాజధానులు కావాలి అని ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు అన్నారు.

విశాఖలో ఆ వైసీపీ నేత చెప్పిందే వేదం! తిరగబడేందుకు సొంత పార్టీ నేతల వ్యూహం 

అనుకున్నదొకటి.. అయిందొక్కటి బొల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా. ఈ పాట అంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోతోంది. ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రతిపాదించింది జగన్ పార్టీ. ఈ విషయం ఇంకా తేలనప్పటికి.. పరిపాలనా రాజధానిగా ప్రకటించినందున ఉత్తరాంధ్రలో తమకు తిరుగే ఉండదని, వైజాగ్ జనమంతా  జగన్ కే జై కొడతారని వైసీపీ భావించింది. కాని ఇప్పుడక్కడ సీన్ రివర్స్ గా మారింది. వైసీపీ పేరు చెబితేనే విశాఖ వాసులు భగ్గుమంటున్నారు. రాజకీయాల కోసం నగరాన్ని నాశనం చేశారని మండిపడుతున్నారు. విశాఖ జనాల్లోనే కాదు వైసీపీ నేతల నుంచి కూడా ఇదే అభిప్రాయం వస్తోంది. విశాఖను తన అడ్డాగా చెప్పుకుంటున్న ఓ వైసీపీ ముఖ్య నేత మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఫ్యాన్ పార్టీ నేతలు ఫైరవుతున్నారు.   సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే సదరు నేత విశాఖలోనే తన రాజకీయమంతా చేస్తున్నారు. విశాఖ పాలనా యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పిట్లో ఉంచుకున్నారని చెబుతున్నారు. సీఎంకు దగ్గరి వ్యక్తి కావడంతో అధికారులు కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారట. దీంతో విశాఖలో సదరు నేత చెప్పిందే వేదంగా తయారైందట. ఆ నేత దూకుడుతో జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు జీరోలుగా మిగిలిపోయారనే ప్రచారం జరుగుతోంది. సదరు నేతకు చెప్పకుండా చిన్న కార్యక్రమం కూడా విశాఖలో జరగడం లేదంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో  ఊహించుకోవచ్చు. ఆ నేత తీరుతో విసిగిపోయిన విశాఖ వైసీపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. అయినా ఆ నేత తన తీరు మార్చుకోవడం లేదట.    సదరు నేత తీరుతో విసిగిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు గత నవంబర్ లో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో అతన్ని టార్గెట్ చేశారు. సదరు నేత చేసిన రాజకీయ నేతల అవినీతి' వ్యాఖ్యలపై  ఒక ఎమ్మెల్యే ఓ రేంజ్ లో పైర్ కావడంతో సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అవాక్కయ్యారు. వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విశాఖ వైసీపీ పరిణామాలపై సీఎం జగన్ కూడా సీరియస్ అయ్యారు. ఆ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి తో చర్చించిన సీఎం జగన్.. వైసీపీ లీడర్లను తాడేపల్లికి పిలిపించుకుని మందలించారు.  నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదంటూ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. గొడవలు పక్కకు పెట్టి పార్టీ అభివృద్ధికి పాటుపడాలంటూ క్లాస్ పికారు.    అయితే సీఎం జగన్ క్లాస్ పీకినా సదరు నేత తీరు మారలేదట. మళ్లీ ఎప్పటిలానే విశాఖలో తన పెత్తనం సాగిస్తున్నారట. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ మంత్రి ఒకరు విశాఖ వెళ్లగా.. జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులంతా సదరు నేతపై ఆయనకు ఫిర్యాదు చేశారట. అతనితో తామే ఏగలేకపోతున్నామని, కంట్రోల్ చేయకపోతే విశాఖలో పార్టీకి భవిష్యతే ఉండదని చెప్పారట. అన్ని పనులు అతను చెప్పినట్లే జరిగితే ఇక మేమెందుకని కొందరు నేతలు ఆ సీనియర్ మంత్రి దగ్గర అసహనం వ్యక్తం చేశారట. జిల్లాకు చెందిన మంత్రులు కూడా తామ ఉత్సవ విగ్రహాలుగా మిగిలాం తప్ప ఏం చేయలేకపోతున్నామని బాధపడ్డారట. సీఎంకు దగ్గరి వ్యక్తి కావడంతో తాను ఏం చేయలేనంటూ ఆ సీనియర్ మంత్రి వారి దగ్గర చేతులెత్తేశారట.    విశాఖ ఎయిర్ పోర్టును మూసేయాలని కేంద్రానికి సదరు నేత రాసిన లేఖ కూడా కలకలం రేపింది. అత్యంత రహస్యంగా ఉంచిన ఆ లేఖ.. కేంద్ర మంత్రి ద్వారానే వెలుగులోకి  రావడంతో విశాఖ వాసులు షాకయ్యారు. నవంబర్ లో   కేంద్ర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరిని కలిశారు సదరు నేత. బోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే.. విశాఖ ఎయిర్ పోర్టు 30 ఏళ్ల పాటు మూసేయమని కోరారు. అలా అయితేనే దూరంగా కడుతున్న బోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత వరకూ భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపనే జరగలేదు. అప్పుడే  విశాఖ ఎయిర్ పోర్టు మూత గురించి.. విజయసాయిరెడ్డి విజ్ఞాపనా పత్రాలు ఇవ్వడం కలకలం రేపింది. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని గత ప్రభుత్వం అనుకుంది. జీఎంఆర్ సంస్థకు అప్పగించింది. అయితే అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది.  అధికారంలోకి రాగానే కాంట్రాక్టును రద్దు చేసింది. కొద్ది రోజులు సైలెంట్‌గా ఉండి… గతంలో కేటాయించిన భూమిలో ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకుని మళ్లీ ఆ జీఎమ్మార్ సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించింది. ఇప్పుడున్న విశాఖ ఎయిర్ పోర్టు మూసేసి.. ఒక్క భోగాపురం మాత్రమే రన్ చేసేలా.. చూస్తామన్న హామీని జీఎమ్మాప్ సంస్థ ఏపీ సర్కార్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.     విశాఖపట్నం ఎయిర్ పోర్టు ప్రజల సెంటిమెంట్. మెట్రోపాలిటన్ నగరంగా ఎదుగుతున్న విశాఖకు ఆ ఎయిర్‌పోర్టు ఓ బ్రాండ్‌గా ఉంది. దాన్ని ప్రజలు తమ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అలాంటి ఎయిర్‌పోర్టును మూసివేయాలని విజయసాయిరెడ్డి లేఖ రాయడం విశాఖ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా కనిపించింది. దీంతో సాధారణ ప్రజల్లోనూ విజయసాయి లేఖపై వ్యతిరేకత వచ్చింది. అసలు విశాఖ ఎయిర్‌పోర్టుపై అంత జబర్దస్తీగా లేఖ రాయడానికి విజయసాయి ఎవరన్న మౌలికమైన ప్రశ్న ప్రధానంగా వినిపించింది. విశాఖ ఎయిర్ పోర్టుకు విజయసాయికి సంబంధం ఏమిటనే మౌలికమైన ప్రశ్నలు విశాఖ వాసుల నుంచి వచ్చాయి. విశాఖకు.. విజయసాయికి సంబంధం ఏమిటని రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నించాయి. ఇలా వరుస వివాదాలకు కారాణమవుతున్న సదరు నేతపై విశాఖ వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. మరోసారి సీఎం జగన్ కు ఫిర్యాదు చేసి అతనితో తాడోపేడా తేల్చుకోవాలని కూడా కొందరు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.వైసీపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన రాజకీయ అనలిస్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సదరు నేత తీరు మార్చుకోకపోతే పరిపాలనా రాజధానిగా ప్రకటించినా కూడా విశాఖలో వైసీపీకి కష్టాలు ఉంటాయనే చెబుతున్నారు.

"ఈ చిల్లు కుండను దింపేద్దాం.." జగన్ పై ఏపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. 

అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా ఈరోజు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాయపూడిలో "జనభేరీ" పేరుతొ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ ఏపీకి ఒకటే రాజధాని అని, అది అమరావతేనని అయన స్పష్టం చేశారు. మనసా వాచా కర్మణా, త్రికరణశుద్ధిగా అమరావతి రాజధానిగా ఉండాలని తాము విశ్వసిస్తున్నామని, చివరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని సత్యమూర్తి హామీ ఇచ్చారు.   సత్యమూర్తి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. "ఈ ఉద్యమాన్ని 365 రోజులుగా నిరాటంకంగా సాగిస్తున్న సోదర సోదరీమణులకు, వారి పోరాట పటిమకు బీజేపీ తరపున సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. ఈ ఉద్యమానికి బీజేపీ తరపున మద్దతు తెలపడానికి బీజేపీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చా.. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? పాదయాత్ర చేస్తూ రోడ్డుమీద ఉన్నారు. అపుడు మనం అందరం ఇళ్లలో ఉన్నాం. అయితే ఈ రోజు ఆయన్ను గెలిపించిన తర్వాత ఆయన మనందరినీ రోడ్డుమీద పడేశారు. ఆయన మాత్రం హాయిగా ఏసీ గదుల్లో ఉన్నారు. ఇలా ప్రజలను రోడ్డుమీద పడేసిన సీఎం జగన్‌కు గుణపాఠం నేర్పాల్సిందే. ఈ రోజు మనం విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక చిల్లుకుండను మనం నెత్తిమీద పెట్టుకున్నాం. మనం అలాంటి కుండను నెత్తిన పెట్టుకొని బాధపడి లాభం లేదు. మన కన్నీరు కూడా ఎవరికీ కనిపించదు సరికదా.. మనం ఏడుస్తున్నామని కనీసం సానుభూతి ప్రకటించే స్థితిలో కూడా ఎవరూ లేరు. కాబట్టి ఈ చిల్లుకుండను ఎంత త్వరగా దించుకుంటే మనకు అంత మంచిది. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. మన జెండాలు వేరైనా... అజెండా మాత్రం ఒక్కటే. ఏపీకి అమరావతి ఒకటే రాజధానిగా ఉంటుంది. ఈ నినాదంతోనే బీజేపీ ముందుకు సాగుతుంది. అమరావతి ఉద్యమానికి మేము పూర్తి మద్దతిస్తాం. త్రికరణ శుద్ధిగా అమరావతి ఉద్యమం వెంట ఉంటాం.’’ అని బీజేపీ ప్రతినిధి వామరాజు సత్యమూర్తి పేర్కొన్నారు.

త్వరలో రాజ్యసభకు జస్టిస్ చలమేశ్వర్? ఢిల్లీలో పట్టు కోసం జగన్ ప్లాన్! 

చంద్రబాబు టార్గెట్ గా దూకుడు పెంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపనున్నారని సమాచారం. ఏపీకి సంబంధించి వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకదానికి వైసీపీ అభ్యర్థిగా జస్టిస్ చలమేశ్వర్ ను ఇప్పటికే జగన్ ఖరారు చేశారని తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లేందుకు జస్టిస్ చలమేశ్వర్ కుడా అంగీకరించారని చెబుతున్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కు కీలక బాధ్యతలు ఇవ్వాలనుకోవం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంటుందని, ఢిల్లీ స్థాయిలో తనకు ఇబ్బంది లేకుండా చూసేందుకే జగన్ ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.     ఇటీవలే జస్టిస్ చలమేశ్వర్ కుమారుడికి వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. జాస్తి నాగభూషణ్‌ను అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుబ్రమణ్యం శ్రీరామ్ అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సేవలు అందిస్తున్నారు. అయినా జాస్తి నాగభూషన్ ను కూడా రెండో అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది జగన్ సర్కార్. ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరును ఆక్షేపిస్తూ సీఎం జగన్ సీజేఐకి ఎనిమిది పేజీల లేఖ రాయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రిని కలిసి జగన్ పలు నివేదికలు కూడా సమర్పించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు ఢిల్లీకి వెళ్లినవారిలో జాస్తి నాగభూషణ్‌ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుమారుడు కావడంతో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అందరూ అనుకున్నారు. ఇప్పుడు నాగభూషణ్‌ను అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా నియమించడంతో జగన్ బలమైన వ్యూహంలో ఉన్నారని భావిస్తున్నారు.    ఏపీ హైకోర్టు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ తీరుపై సీజేఐకి రాసిన లేఖలో జస్టిస్ చలమేశ్వర్, మాజీ ఏజీ దమ్మాలపాటి పేర్లు కూడా ప్రస్తావించారు జగన్. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జడ్జిలుగా ఉన్నవారి నియామకాలు, గతంలో దమ్మలపాటికి అనుకూలంగా వెలువడిన ఉత్తర్వులను ప్రముఖంగా పేర్కొన్నారు. గతంలో జస్టిస్ రమణ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు.. న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌ కు అనుకూలంగా పలు ఉత్తర్వులు ఇచ్చారని, గతంలో ఓ ఐదుగురు జడ్జిల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్‌ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం.. అప్పటి సీఎం చంద్రబాబు అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని.. ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ స్వయంగా చెప్పారని కూడా సీఎం జగన్ లేఖలో పేర్కొనడం సంచలనం రేపింది. దీంతో సుప్రీంకోర్టు సీజేఐకి జగన్ రాసిన లేఖ వెనక జస్టిస్ చలమేశ్వర్ ప్రమేయం ఉందనే చర్చ జరిగింది. జగన్ తో పాటు ఢిల్లీకి వెళ్లిన వారిలో జస్టిస్ నాగభూషణం కూడా ఉండటంతో ఈ వాదనకు అప్పుడు బలం చేకూరింది.    ఏపీ సీఎం జగన్ తో జస్టిస్ చలమేశ్వర్ కుటుంబానికి చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి.  చంద్రబాబుతో విభేదాలున్న జస్టిస్ చలమేశ్వర్.. ఆయనకు వ్యతిరేకంగా జగన్ కు దగ్గరయ్యారని చెబుతారు. జస్టిస్ చలమేశ్వర్ తో పాటు ఆయన కుమారుడు జగన్ కు కీలక సమయాల్లో అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుసార్లు ఆయనను కలిశారు జస్టిస్ చలమేశ్వర్. 2019 జూన్‌ 11న విజయవాడలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు చలమేశ్వర్‌  పాల్గొన్నారు. ఈ ఏడాది  జనవరి 30న సుప్రీంకోర్టు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. ఈ సందర్భంగా చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సత్కరించారు సీఎం జగన్.    జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు నందమూరి కుటుంబంతో చాలా దగ్గరి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లీగల్ వ్యవహారాలన్ని జస్టిస్ చలమేశ్వరే చూసేవారట. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సమయంలో జాస్తి చలమేశ్వర్ స్వయంగా హరికృష్ణ పాడె మోశారు.  అంత దగ్గరి అనుబంధం వారికి ఉంది. అయితే చంద్రబాబుతో మాత్రం మొదటి నుంచి జస్టిస్ చలమేశ్వర్ కు సఖ్యత లేదని చెబుతారు. జస్టిస్ రమణకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో జస్టిస్ చలమేశ్వర్ ఆయనకు దూరమయ్యారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయ వ్యవస్థలో బలంగా ఉన్న చంద్రబాబును దెబ్బ కొట్టడానికి జస్టిస్ చలమేశ్వర్ ను అస్త్రంగా జగన్ వాడుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడికి జగన్ కీలక బాధ్యతలు ఇవ్వడమే చర్చనీయాంశం కాగా.. త్వరలో జస్టిస్ చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపిస్తున్నారనే విషయం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

డీజీపీ సూచనను ఫాలో అవ్వండి.. టీడీపీ కేడర్ కు బాబు అదిరిపోయే ఐడియా.. 

ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలిచాలని సీఎం జగన్ ప్రకటించడంతో అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై ఈరోజుకు ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సంఘం ఈరోజు రాయపూడిలో "జనభేరి" పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. దీనికి పలు ప్రతిపక్షాల నేతలు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశానికి రావడానికి సిద్దమైన టీడీపీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ కేడర్ కు అదిరిపోయే సూపర్ ఐడియా ఇచ్చారు. పోలీసులు ఒక కేసు పెడితే మీరు రెండు ప్రయివేట్ కేసులు పెట్టండి. ఒకవేళ పోలీసులు కేసులు తీసుకోకపొతే టెక్నాలజీ వాడుకోవాలని.. డిజిపి గౌతమ్ సవాంగ్ గతంలో చేసిన సూచనను ఫాలో అవ్వాలని వారికి సూచించారు. పోలీసులు కనుక నేరుగా ఫిర్యాదులు తీసుకోకపోతే ఆన్ లైన్ లో కేసులు రిజిష్టర్ చేయాలని చంద్రబాబు తన పార్టీ నాయకులాలకు,కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రస్తుత పరిష్టితులలో పోలీసులు కాళ్లబేరానికి రావాలంటే ప్రైవేట్ కేసులు ఒక్కటే మార్గమని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. తప్పుడు కేసులకు కాలం చెల్లిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని డిజీపీ పదేపదే ఊదరగొడుతున్నారని మనం కూడా అయన సలహాను ఫాలో అవుదామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సోనూసూద్ కు అరుదైన పద్మ అవార్డ్ ! ముంబై కార్పెంటర్ సేవా పురస్కారం 

బాలీవుడ్ నటుడు, సామాజిక సేవలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న  సోనూసూద్ కు మరో అరుదైన అవార్డు దక్కింది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు ఆయనకు  పద్మ అవార్డు లభించింది. అయితే ఈ పద్మ అవార్డు భారత సర్కార్ ఇచ్చింది కాదు.  ముంబైకు చెందిన ఓ కార్పెంటర్ బహూకరించింది.  ఇంద్రోజిర రమెష్ అనే వ్యక్తి ముంబై మహానగరంలో ఓ కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అతడు తన జీవితాన్ని కష్టాలతోనే గడిపాడు. చివరకు చెక్క పనిలో స్థిరపడ్డాడు. తనకు కూడా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించాలని ఉన్నా తన ఆర్థిక పరిస్థితి సహకరించదు. అందుకే దేశంలో ఎవరైన ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే వారి ప్రతిమను తయారు చేసి వారికి అందిస్తాడు. దానికి అతడు పద్మ సేవ అనే పేరును పెట్టుకున్నాడు.  ముంబై కార్పెంటర్ ఇచ్చే ఈ పద్మ అవార్డును ఇప్పటివరకు కొద్ది మంది మాత్రమే అందుకున్నారు.   నేను సైతం అంటూ ఎందరికో అండగా నిలిచిన మంచు లక్ష్మీ, దాదాపు 220 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్, తాను బిచ్చమెత్తగా వచ్చిన రూ.3లక్షలను సమాజసేవలో ఖర్చు చేసిన కామరాజులు ఈ సత్కారాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు సోనూ సూద్‌ను ఈ అవార్డుతో రమేష్ సత్కరించాడు. గతంలో  సోనూకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ప్రపంచంలోని టాప్ 50 ఆసియా తారల సరసన సోనూ కూడా ఉన్నాడు.  సోనూ సూద్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లలేదు. రీల్‌లో విలన్‌గా చేసే సోనూ నిజ జీవితంలో ప్రజల పాలిట హీరోగా మారాడు. కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులను తమతమ ఇళ్లకు చేర్చడంలో సోనూ ప్రధాన పాత్ర పోషించాడు. దేశంలో ఎక్కడి వారైనా సమస్యలతో పోరాడుతుంటే వారికి సోనూ తన వంతు సహాయం అందించి అండగా నిలిచాడు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆపన్నులకు సాయం చేయడానికి సోను సూద్ ముంబైలోని తన ఆస్తులను తాకట్టు పెట్టారని వార్తలు వచ్చాయి. అతని ఉదారత గురించి లోకం కోడై కూసింది. ఇంత చేసినా ఏ ప్రభుత్వం కూడా  సోనుసూద్ కు ఎటువంటి సత్కారాలు చేయలేదు. అయితే ఇప్పుడు లభించిన ఆ అవార్డును  సోనూ సూద్ కు అరుదైన గౌరవంగానే చెప్పుకోవాలి.

ఆన్‌లైన్ అప్పుకు మరొకరు బలి! సిద్దిపేట జిల్లాలో  ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ 

ఆన్ లైన్ రుణం ఓ యువతి ప్రాణం తీసుకుంది. రుణం ఇచ్చిన సంస్థ వేధింపులు భరించలేక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో ఈ విషాద ఘటన జరిగింది. వ్యాపారంలో నష్టపోయిన తండ్రి కష్టాలు చూడలేక ఆన్‌లైన్ యాప్‌లో రుణం తీసుకున్న ఓ యువతి గడువులోగా అప్పును తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో రుణ సంస్థ నుంచి వేధింపులు, ఒత్తిడి ఎక్కువయ్యాయి. తట్టుకోలేకపోయిన ఆమె పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది.  పోలీసుల వివరాల ప్రకారం రాజగోపాలపేట చెందిన  24 ఏండ్ల కిర్ని మౌనిక  ఏఈవోగా పనిచేస్తోంది. ప్రస్తుతం వీరి కుటుంబం సిద్ధపేటలో ఉంటోంది. మౌనిక తండ్రి భూపాణి వ్యాపార ప్రయత్నాల్లో డబ్బులు నష్టపోయారు. దీంతో కుటుంబ అవసరాల కోసం ‘స్నాప్ ఇట్ లోన్’ యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ. 3 లక్షల రుణం తీసుకుంది. అయితే, గడువు తీరినా ఆమె తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో యాప్ నిర్వాహకులు మౌనికపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతటితో ఆగక ఆమె ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ మౌనికను రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించారు. రుణ సంస్థ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.  పురుగుల మందు తాగి ఇంట్లో పడిపోయిన మౌనికను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మౌనిక మృతి చెందింది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అప్పు కోసం వేధించిన రుణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.