సోనూసూద్ కు అరుదైన పద్మ అవార్డ్ ! ముంబై కార్పెంటర్ సేవా పురస్కారం
posted on Dec 17, 2020 @ 11:14AM
బాలీవుడ్ నటుడు, సామాజిక సేవలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూసూద్ కు మరో అరుదైన అవార్డు దక్కింది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు ఆయనకు పద్మ అవార్డు లభించింది. అయితే ఈ పద్మ అవార్డు భారత సర్కార్ ఇచ్చింది కాదు. ముంబైకు చెందిన ఓ కార్పెంటర్ బహూకరించింది. ఇంద్రోజిర రమెష్ అనే వ్యక్తి ముంబై మహానగరంలో ఓ కార్పెంటర్గా పనిచేస్తుంటాడు. అతడు తన జీవితాన్ని కష్టాలతోనే గడిపాడు. చివరకు చెక్క పనిలో స్థిరపడ్డాడు. తనకు కూడా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించాలని ఉన్నా తన ఆర్థిక పరిస్థితి సహకరించదు. అందుకే దేశంలో ఎవరైన ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే వారి ప్రతిమను తయారు చేసి వారికి అందిస్తాడు. దానికి అతడు పద్మ సేవ అనే పేరును పెట్టుకున్నాడు.
ముంబై కార్పెంటర్ ఇచ్చే ఈ పద్మ అవార్డును ఇప్పటివరకు కొద్ది మంది మాత్రమే అందుకున్నారు. నేను సైతం అంటూ ఎందరికో అండగా నిలిచిన మంచు లక్ష్మీ, దాదాపు 220 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్, తాను బిచ్చమెత్తగా వచ్చిన రూ.3లక్షలను సమాజసేవలో ఖర్చు చేసిన కామరాజులు ఈ సత్కారాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు సోనూ సూద్ను ఈ అవార్డుతో రమేష్ సత్కరించాడు. గతంలో సోనూకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ప్రపంచంలోని టాప్ 50 ఆసియా తారల సరసన సోనూ కూడా ఉన్నాడు.
సోనూ సూద్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లలేదు. రీల్లో విలన్గా చేసే సోనూ నిజ జీవితంలో ప్రజల పాలిట హీరోగా మారాడు. కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులను తమతమ ఇళ్లకు చేర్చడంలో సోనూ ప్రధాన పాత్ర పోషించాడు. దేశంలో ఎక్కడి వారైనా సమస్యలతో పోరాడుతుంటే వారికి సోనూ తన వంతు సహాయం అందించి అండగా నిలిచాడు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆపన్నులకు సాయం చేయడానికి సోను సూద్ ముంబైలోని తన ఆస్తులను తాకట్టు పెట్టారని వార్తలు వచ్చాయి. అతని ఉదారత గురించి లోకం కోడై కూసింది. ఇంత చేసినా ఏ ప్రభుత్వం కూడా సోనుసూద్ కు ఎటువంటి సత్కారాలు చేయలేదు. అయితే ఇప్పుడు లభించిన ఆ అవార్డును సోనూ సూద్ కు అరుదైన గౌరవంగానే చెప్పుకోవాలి.