తిరుమల కొండపై సిగరెట్ తాగిన వైసీపీ కార్యకర్త! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బరి తెగిస్తున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు తిరుమలకు సిగరెట్లు తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజంపేట వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే  అమర్‌నాథ్ రెడ్డి కాలినడకన అన్నమయ్య మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు.  అయితే ఆయన అనుచరులు కొంతమంది కారులో అలిపిరి రోడ్డు మార్గం మీదుగా నిషేధిత వస్తువు అయిన సిగరెట్లతో తిరుమలకు చేరుకున్నారు. వారి వాహనాలను అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది నామమాత్రంగా తనిఖీలు చేసి వదిలి పెట్టినట్లుగా సమాచారం. ఇక పార్వేటి మండపం సమీపంలో అమర్‌నాథ్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై సిగరెట్ తాగుతూ కనిపించాడు. వైసీపీ కార్యకర్తలు పార్వేటి మండలం సమీపంలో సిగరెట్ తాగుతున్నా  టీటీడీ భద్రతా సిబ్బంది  పట్టించుకోలేదు. తిరుమల పరిసరాల్లో గుట్కాలు, పొగాకు వాడకంపై నిషేధం ఉంది. అయినా వైసీపీ నేతలు వెంకన్న క్షేత్రానికి సిగరెట్లు తీసుకురావడంపై భక్తులు మండిపడుతున్నారు. అమర్‌నాథ్ రెడ్డి కాలినడక యాత్రలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరా వినియోగించడం వివాదాస్పదమైంది. తిరుమలలో భద్రత కారణంగానూ, అలాగే స్థల పవిత్రత దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆ నిబంధనలలో ఒకటి డ్రోన్ కెమెరాల వాడకం పై  నిషేధం ఉంది. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు తమ పాదయాత్ర చిత్రీకరణకు డ్రోన్ కెమెరాను వాడడం తీవ్ర దూమారం రేపింది. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 18 ఏళ్లుగా కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ద్వారా కాలిబాటన తిరుమలకు చేరుకుంటున్నారు. ఈసారి కూడా ఆయన అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారా వందలాదిమందితో కలిసి కాలినడకన తిరుమల పాపవినాశనం రోడ్డు పార్వేటి మండపం వద్దకు చేరుకున్నారు. అయితే ఈ పాదయాత్రను చిత్రీకరించేందుకు అమర్నాథ్ రెడ్డి మద్దతుదారులు కొందరు డ్రోన్ కెమెరాను వినియోగించారు.   రెండు రోజులుగా తిరుమలపై కొండపై జరుగుతున్న ఘటనలతో టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం బట్టబయలైంది. అధికారపార్టీ నాయకులు కావడంతో అటు టీటీడీ విజిలెన్స్ కానీ, ఇటు పోలీసులు కానీ అభ్యంతరం చెప్పలేకపోవడంతోనే ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. భద్రత పేరుతో సామాన్యు భక్తులను నానా ఇబ్బందులకు గురిచేసే భద్రతా సిబ్బంది.. అధికారపార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా! తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు

తెలంగాణలో మరో ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా సోకింది. గత రెండు రోజుల నుంచి నీరసంగా ఉండడంతో ఆయన  కరోనా పరీక్షలు చేయించుకున్నారు.  తన రిపోర్టులో పాజిటివ్‌గా తేలిందని ప్రకాష్ గౌడ్  చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తాను ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్నానని, కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయొద్దని తెలిపారు. తనను కలవటానికి కూడా ప్రయత్నాలు చేయవద్దని కోరారు ప్రకాష్ గౌడ్.  దేవుడి ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని, మళ్లీ ప్రజల ముందుకు వస్తానని చెప్పారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.  మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో  తెలంగాణలో మొత్తం పాజిటివ్ సంఖ్య 2,82,982కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,74,833కు పెరిగాయి. కరోనాతో మంగళవారం మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 1522కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,627 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 4,467 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

కుమ్ములాటల్లో తెలంగాణ కమలం !  ఎంపీ కామెంట్లతో కలకలం 

ఆలు లేదు చూలు లేదు.. కాని కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లుగా తయారైంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. రాష్ట్రంలో  బీజేపీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కమలం పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. అదే జోష్ తో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. పార్టీలోకి వలసలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ నేతలు మాత్రం గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. అత్మ విశ్వాసమే, అతి విశ్వాసమో తెలియుదు కాని..  కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ కమలంలో  కాక రేపుతున్నారు. పార్టీ లైన్ తప్పి మరీ తమ ఇష్టమెచ్చిన ప్రకటనలు చేస్తున్నారు. తమకు అధికారం ఖాయమని చెప్పడమే కాదు.. పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారో కూడా చెప్పేస్తున్నారు కొందరు నేతలు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫలానే వ్యక్తే సీఎం అవుతారనే ప్రకటనలు ప్రాంతీయ పార్టీ నేతల నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడే సుప్రీమ్ కాబట్టి.. ఇలాంటి స్టేట్ మెంట్లతో ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండదు. నాయకులకు కొంత స్వేచ్ఛ ఎక్కువుండే కాంగ్రెస్ పార్టీలోనూ ఇలాంటి కామెంట్లు కామనే. కాని అత్యంత క్రమశిక్షణ గల సంస్థగా పేరున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలంతో పని చేసే భారతీయ జనతా పార్టీలో అలాంటి పరిస్థితులు ఉండవు. ఎన్నికలు పూర్తై పలితాలు వచ్చాక.. పార్టీ హైకమాండ్ ముఖ్యంగా ఆరెస్సెస్ ఆశీస్సులు ఉన్నవారికే పదవులు వస్తుంటాయి. ఇది ఇప్పటివరకు జరుగుతున్నది.. రాబోయే కాలంలో జరగబోయేది కూడా. కాని తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇందుకు విరుద్దంగా ప్రకటనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపైనే సంచలన ప్రకటన చేశారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం కేంద్రమంత్రిగాఉన్న కిషన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. ఎంపీ సోయం బాపురావు చేసిన సీఎం ప్రకటన ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో కలకలం రేపుతోంది.   వరుస విజయాలతో దూకుడు మీదున్న తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కమలం గూటికి చేరేందుకు క్యూడుతున్నారు. అయితే తెలంగాణ బీజేపీకి వలసలతో పాటు వర్గపోరు పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుందన్న ప్రచారం ఉంది. సంజయ్ కి పార్టీ పగ్గాలు వచ్చే వరకు తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డిదే హవా. బండి వచ్చాక పార్టీలో ఆయన  ప్రాధాన్యత తగ్గిందంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంజయ్ దూకుడే పార్టీకి ప్లస్ అయిందనే భావన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో రోజు రోజుకు సంజయ్ గ్రాఫ్ పెరిగిపోతుండగా.. పార్టీలో కిషన్ రెడ్డి నామమాత్రంగా మారిపోతున్నారు. ఇది గ్రహించిన కిషన్ రెడ్డి కూడా దూకుడు పెంచారని చెబుతున్నారు. అందులో భాగంగానే సోయం బాపురావు  ముఖ్యమంత్రి పోస్టుపై ప్రకటన చేశారనే చర్చ బీజేపీ కార్యాలయంలో జరుగుతోంది. కిషన్ రెడ్డి చొరవతో బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీ అయ్యారు సోయం. అందుకే కిషన్ రెడ్డిని లైవ్ లో ఉంచే లక్ష్యంతోనే ఆయన ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు.  తెలంగాణ బీజేపీలో  నేతల మధ్య ఆధిపత్య పోరే  కాదు.. క్యాస్ట్ కుమ్ములాటలు తీవ్రమయ్యాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ పార్టీకి రాజీనామా చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పాలమూరు జిల్లా బీజేపీలో ప్రస్తుతం మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పినట్లే జరుగుతుందట. బీసీ నేతలను వాళ్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బండి సంజయ్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో అది బహిర్గతమైందని తెలుస్తోంది. తనను పట్టించుకోలేదనే మనస్తాపంతోనే.. బండి సంజయ్ జిల్లాలో ఉండగానే రాజీనామా చేసిన బీజేపీలో అలజడి రేపారు ఎర్ర శేఖర్. సంజయ్ బుజ్జగించడంతో ఆయన తిరిగి మనసు మార్చుకున్నా.. బీసీ, రెడ్డి నేతల మధ్య బీజేపీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయన్నది  ఆ ఘటనతో బయటపడినట్లైంది.  గ్రేటర్ హైదరాబాద్ లోని తార్నాకలో రెండు వర్గాలు నడిరోడ్డుపైనే కొట్టుకోవడం కమలం పార్టీలో వర్గపోరుకు అద్దం పట్టింది. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లానే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీజేపీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉందంటున్నారు. పాత నేతలు, కొత్త నేతలకు పొసగడం లేదట. సామాజిక వర్గాల వారీగా నేతలు గ్రూపులు కడుతున్నారని తెలుస్తోంది. వరుస విజయాలతో పార్టీ నేతల్లో కనిపిస్తున్న ఆత్మ విశ్వాసం, భారీగా వచ్చి చేరుతున్న వలస నేతలతో తమకు ప్రయోజనం ఉంటుందో లేక వర్గ విభేదాలతో అసలుకే మోసం వస్తుందో తెలియడం లేదని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే .. ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి గురించి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన ప్రకటనపై  పార్టీ పెద్దలు ఆరా తీసినట్లు చెబుతున్నారు. సోయం వ్యాఖ్యలపై బండి సంజయ్ వర్గం గరంగరంగా ఉందని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీని.. పార్టీలో జరుగుతున్న ఘటనలు పరేషాన్ చేస్తున్నాయని తెలుస్తోంది.   

యూకే నుండి భారత్ వచ్చిన వారిలో 18 మందికి పాజిటివ్.. ఈ వైరస్ కొత్తదో... పాతదో..?

బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ తో సహా పలు దేశాలు బ్రిటన్ తో విమాన సంబంధాలను కూడా రద్దు చేసాయి. అయితే ఇప్పటికే వచ్చిన, వస్తున్న వారికి దేశంలోని పలు విమానాశ్రయాల్లో చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో వైరస్‌ నిర్ధారణ అవుతోంది. నిన్న మంగళవారం నాడు పలుచోట్ల చేసిన టెస్టులలో 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు ఈ నెల 11, 13 తేదీలలో యూకే నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరికి కూడా పాజిటివ్‌ గా తేలింది. ఈ ఇద్దరితో కలుపుకుని మంగళవారం వరకు మొత్తం 18 మందికి వైరస్‌ సోకినట్లయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టులో వీరికి పాజిటివ్‌ రావడంతో గచ్చిబౌలిలోని టిమ్స్‌లో ఉంచి చికిత్స అందిస్తునట్లు సమాచారం. అయితే వీరికి సోకింది కొత్త స్ట్రెయినా? లేక పాత రకందేనా? అన్నది తేలాల్సి ఉంది.   ఇది ఇలా ఉండగా బ్రిటన్ నుంచి వచ్చేవారు కొత్త కరోనా వైరస్ బారినపడినట్టయితే, వారిని టిమ్స్‌లో చేర్చి, వారితో కాంట్రాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు మాత్రం అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్ సహా వివిధ దేశాల నుంచి తెలంగాణకు మూడువేల మందికిపైగా వచ్చినట్టు కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది. దీంతో వీరిలో ముందుగా వచ్చిన 1500 మందిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు మరో 1500 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మరోపక్క కేంద్రం కొత్త స్ట్రెయిన్‌ విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రధానంగా కొత్త స్ట్రెయిన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి వెంటనే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌ వస్తే వారి నమూనాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని కోరింది. వాటిని జీనోమ్‌ సీక్వెన్సీ ల్యాబ్‌లకు పంపాలని ఆదేశించింది. ఆ నమూనాల్లో వైరస్‌ తీవ్రత ఎలా ఉందో పరీక్షించేందుకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని మంగళవారం ఆదేశాలిచ్చింది. కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్‌ మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమాన ప్రయాణికులందరికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు .  నిన్న ఎయిరిండియా విమానంలో లండన్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికుల్లో 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ఏడుగురు ప్రయాణికులు. మరొకరు విమాన సిబ్బంది ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేసిన పరీక్షల్లో ఐదుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇదే విమానంలో ఢిల్లీ ద్వారా చెన్నై వెళ్లిన ప్రయాణికుడికి అక్కడ చేసిన పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మరోవైపు, 222 మంది ప్రయాణికులతో యూకే నుంచి కోల్‌కతాకు వచ్చిన విమానంలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది.  కొత్త స్ట్రెయిన్ తో పిల్లలకు ముప్పు ఎక్కువ.. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కరోనా ముప్పు పిల్లలకు తక్కువే. దీనికి కారణం వైరస్‌ ప్రవేశించే ఎస్2 రిసెప్టర్లు చిన్నారుల్లో తక్కువగా ఉండటమే. కానీ, కొత్తగా రూపాంతరం చెందిన వైరస్ ఏస్‌2 రిసెప్టర్ల ను ఛేదించి చొచ్చుకెళ్తోంది. దీంతో పిల్లలకు కూడా ఇది చాలా సులభంగా సోకుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. డ్రోన్ కెమెరాలతో వైసీపీ నేతల హల్చల్ 

తిరుమలలో భద్రత కారణంగానూ, అలాగే స్థల పవిత్రత దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆ నిబంధనలలో ఒకటి డ్రోన్ కెమెరాల వాడకం పై ఉన్న నిషేధం. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు తమ పాదయాత్ర చిత్రీకరణకు డ్రోన్ కెమెరాను వాడడం తాజాగా తీవ్ర దూమారం రేపుతోంది. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 18 ఏళ్లుగా కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ద్వారా కాలిబాటన తిరుమలకు చేరుకుంటున్నారు. తాజాగా అయన మూడు రోజుల క్రితం అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారా వందలాదిమందితో కలిసి కాలినడకన తిరుమల పాపవినాశనం రోడ్డు పార్వేటి మండపం వద్దకు చేరుకున్నారు. అయితే ఈ పాదయాత్రను చిత్రీకరించేందుకు అమర్నాథ్ రెడ్డి మద్దతుదారులు కొందరు డ్రోన్ కెమెరాను వినియోగించారు. అయితే ఈ పాదయాత్ర కార్యక్రమంలో అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్.. మున్సిపల్ శాఖకు శ్రీలక్ష్మి

ఆంధ్రప్రదేశ్  కొత్త  ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం అయ్యారు. ఈనెల 31వ తేదీన ప్రస్తత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుంది. దాంతో అదే రోజున ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీత నియామకం అయ్యారు. ఇక సీఎస్‌గా పదవీ విరమణ పొందనున్న నీలం సాహ్నీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆదిత్యనాథ్‌ దాస్‌. నిజానికి  నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, ఆ తర్వాతి స్థానాలలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉన్నారు. వీరిలో అజయ్‌ సాహ్ని, సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్‌ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారు. మరో ఐఏఎస్ అధికారి సతీష్‌ చంద్ర మాజీ సీఎం చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. ఆయనను సీఎస్‌ గా చేయడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. సీసీఎల్ఏ బాధ్యతలు చూస్తున్న నీరబ్ ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే  నీరబ్‌కు 2024 జూన్‌ వరకూ పదవీకాలం ఉంది. అంత ఎక్కువ కాలం ఒకరినే సీఎస్ గా కొనసాగించడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆదిత్యనాథ్‌ వైపే మొగ్గుచూపారని చెబుతున్నారు. అంతేకాదు జగన్ కు మొదటి నుంచి ఆధిత్యనాథ్ నమ్మకస్తుడిగా ఉన్నారు. అందుకే జగన్ కూడా  ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.  ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన మైనింగ్ స్కాంలో అరెస్టై జైలుకు వెళ్లిన సీనియర్ ఐఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకువచ్చిన జగన్... ఆమెకు కీలకమైన మున్సిపల్ శాఖ అప్పగించారు. అత్యంత కీలకమైన  అమరావతి, మూడు రాజధానులపై వివాదం జరుగుతున్న సమయంలో.. ఆ వ్యవహారాలు చూసే మున్సిపల్ శాఖ సెక్రటరిగా శ్రీలక్ష్మి నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు. గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు.  ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ కు అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో ఆమె జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలులో ఆమె ఆరోగ్యం క్షిణించడం ఆ తర్వాత కోలుకోవడం జరిగాయి.  తెలంగాణ కేడర్ లో ఉన్న శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకురావడం కోసం సీఎం జగన్  కేంద్రం దగ్గర లాబీయింగ్ చేశారు. .అయితే కేంద్రం ఆమెను డిప్యుటేషన్‌పై ఏపీకి పెంపేందుకు నిరాకరించింది. సెక్రటరీ స్ధాయి అధికారుల డిప్యుటేషన్ కుదరదని చెప్పేసింది.  సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో  ఏడాదిన్నర కాలంగా ఆమె తెలంగాణ క్యాడర్‌లోనే పనిచేయాల్సి వచ్చింది. చివరకు క్యాట్ ను ఆశ్రయించి అనుకున్నది సాధించారు శ్రీలక్ష్మి. క్యాట్ అదేశాలతో ఆమె ఏపీకి బదిలీ అయ్యారు. వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకే జగన్ కీలక పోస్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి.   సీనియర్లను కాదని కొందరు జూనియర్లకు కీలక పోస్టులు కట్టబెట్టారనే విమర్శలు వచ్చాయి.    

ఆరుగురు యూకే ప్రయాణికులకు కరోనా? ఇండియాకు  కొత్త వైరస్ వచ్చేసిందా? 

యునైటెడ్ కింగ్ డమ్ ను వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ ఇండియాను హడలెత్తిస్తోంది. యూకే నుంచి సోమవారం రాత్రి ఇండియాకు వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. వీరికి రూపాంతరం చెందిన వైరస్ సోకిందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. యూకే నుంచి ఎయిర్ ఇండియా విమానం సోమవారం రాత్రి 10.40గంటలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ ఆరుగురు ప్రయాణికుల్లో ఒకరు చెన్నైకి కనెక్టింగ్ విమానం ద్వారా వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ విమానంలో క్రూ సిబ్బందితో సహా మొత్తం 266 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి సోకింది కొత్త వైరస్ అనే విషయమై ఇంకా స్పష్టత లేదని ప్రభుత్వ అధికారి అవనీశ్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాప్ పంపించామని.. పరీక్షల ఫలితాలు వచ్చాకే కరోనా సోకింది లేనిది తెలుస్తుందని చెప్పారు.       యూకే నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా నిర్దారణ కావడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారత్‌కు వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. యూకేలో రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా ఆ దేశం నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి యూకే నుంచి వచ్చే అన్నిరకాల విమానాల రాకపోకలపై భారత్ కూడా నిషేధం విధించింది. ఈ నిషేధ డిసెంబర్ 31వరకు అమలులో ఉంది. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

కేసీఆర్, జగన్ బీజేపీ మిత్రులేనా ? మమత అందుకే పిలవడం లేదా? 

ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్న నేతకు దిక్కు లేకుండా పోయిందా?ఏపీ,  తెలంగాణ ముఖ్యమంత్రులను ప్రాంతీయ పార్టీల నేతలెవరు నమ్మడం లేదా? జగన్, కేసీఆర్ ను కమలం పార్టీ మనిషిగానే చూస్తున్నారా?.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో ఇదే నిజమేనని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో త్వరలో సమావేశం కాబోతున్నారు. కోల్ కతాలో జరగనున్న ఈ సమావేశానికి పలు పార్టీ నేతలను మమత ఆహ్వానించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఆహ్వానించారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి మాత్రం కోల్ కతా ఆహ్వానం రాలేదు. మమతా బెనర్జీ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నేతలకు ఆహ్వానం రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను మమత ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది.  ప్రస్తుతం బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య యుద్దమే నడుస్తోంది. బెంగాల్ లో పనిచేస్తున్న ఐపీఎస్ లను రాష్ట్ర సర్కార్ తో సంబంధం లేకుండా కేంద్రం బదిలీ చేయడంపై మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంలో డీఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపేష్ భగల్, అశోక్ గెహ్లాట్‌ మమతకు మద్దతుగా నిలిచారు. కేసీఆర్ మాత్రం స్పందించలేదు. అటు జగన్ కూడా మాట్లాడలేదు.  బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై మోడీ, అమిత్ షా లాంటి వారు నిప్పులు చెరుగుతుంటే ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతకు అండగా నిలిచారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం మద్దతుగా నిలవలేదు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మమతను కలిసిన కేసీఆర్.. బీజేపీపై యుద్దం చేస్తానన్న కేసీఆర్.. బీజేపీతో చిక్కులు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి బాసటగా నిలవకపోవడం ఇతర ప్రాంతీయ పార్టీ నేతలను విస్మయపరిచిందని చెబుతున్నారు. కేసీఆర్ కేంద్రంపై ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన్ను బీజేపీ సపోర్టర్ గానే చూస్తున్నారట ప్రాంతీయ పార్టీల నేతలు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన కూడా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకే బీజేపీ డైరెక్షన్ లో వచ్చిందేనని కొందరు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే కేసీఆర్ ను తన సమావేశానికి మమత బెనర్జీ పిలవలేదని తెలుస్తోంది. రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పుడూ ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.  బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెడతానని పలు సార్లు ప్రకటించారు గులాబీ బాస్. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంత వర్కవుట్  కూడా చేశారు. భువనేశ్వర్ వెళ్లి నవీన్ పట్నాయక్, చెన్నైలో స్టాలిన్ ను కలిశారు కేసీఆర్. బెంగళూరులో కుమారస్వామి, లక్నోలో మాయావతిని కలిసి చర్చించారు. కోల్ కతా వెళ్లి మమతా బెనర్జీతోనూ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపారు కేసీఆర్. శరద్ పవార్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తోనూ సంప్రదింపులు జరిపానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హడావుడి చూసిన వారంతా ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెట్టడం ఖాయమనుకున్నారు. కాని లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడంతో  గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన తెరపైకి తీసుకొచ్చారు కేసీఆర్. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎయిరిండియా, బొగ్గు గనులు వంటివి ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇంకా చెప్పాలంటే మోడీ ప్రభుత్వంపై ఒక యుద్ధమే ప్రకటించారు గులాబీ బాస్. అయితే  గ్రేటర్ ఎన్నికల తర్వాత మళ్లీ మెత్తబడ్డారు కేసీఆర్. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఆ సమయంలో రైతు సమస్యలను ప్రస్తావించలేదని సమాచారం .  కేసీఆర్ తీరు, ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియకపోవడంతో ప్రాంతీయ పార్టీ నేతలెవరు ఆయనను నమ్మడం లేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ముందు నుంచి బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో సమర్ధించింది వైసీపీ. జగన్ కూడా ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చారు. దీంతో జగన్ ను కూడా బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు నమ్మడం లేదని తెలుస్తోంది. అందుకే వీరిద్దరిని మమతా బెనర్జీ సమావేశానికి ఆహ్వానించలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మమతా బెనర్జీ సమావేశానికి కేసీఆర్ కు ఆహ్వానం రాకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశర్ రెడ్డి కూడా  హాట్ కామెంట్స్ చేశారు. మమతతో పాటు, శరద్ పవార్, స్టాలిన్, నవీన్ పట్నాయక్‌లు కేసీఆర్‌ను నమ్మడం లేదని చెప్పారు.  బీజేపీ మరియు టీఆర్ఎస్‌లు రెండు రహస్య ఒప్పందంపై పయనిస్తూ ప్రజలను పిచ్చివారిని చేస్తున్నాని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడ్డారేమో అందుకే ఢిల్లీ వెళ్లి రాజీ చేసుకున్నారని కొండా ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎందుకు ఉన్నఫలంగా స్టాండ్ మార్చుకుంటున్నారని కొండా విశ్వేశర్ రెడ్డి ప్రశ్నించారు.

అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు జగనేనన్న వైసీపీ ఎమ్మెల్యే! 

'అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే... అది జగన్ మాత్రమే' . ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత  కాదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు...   సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాటలకు అక్కడున్న వైసీపీ నేతలంతా చప్పట్లు కొట్టారు. అయితే అసలు విషయం గ్రహించి తర్వాత అంతా నాలుక కరుచుకున్నారు. ఎందుకంటే జగన్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే  కడుబండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసినవి.  జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నీతివంతమైన పాలన అనబోయి పొరపాటున అవినీతి పాలన అని అనేశారట. ఎమ్మెల్యే ఏం మాట్లాడారో గమనించకుండానే పక్కనున్న నేతలు, వైసీపీ కార్యకర్తలు చప్పట్లు కొట్టడం ఇక్కడ మరో విశేషం.  రాజకీయ నాయకులు ప్రసంగించేటప్పుడు ఒక్కోసారి పొరపాటున చేసే వ్యాఖ్యలు వారిని ఎంతో ఇబ్బందిలోకి నెడుతుంటాయి. చిన్న స్థాయి నేతలే కాదు పెద్దపెద్ద నాయకులు కూడా మాటల మధ్యలో నాలుక జారుతూ కష్టాల్లో పడుతుంటారు. ఆ తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.. సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే నిజమే మాట్లారంటూ టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. 

జీసస్ కావాలా? ఏడుకొండలవాడు కావాలా? తేల్చుకోండి.. వైసీపీ ఎమ్మెల్యేకు బీజేపీ సూటి ప్రశ్న

పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అయన తన పేరును క్రిస్మస్ వేడుకల పోస్టర్లలో వేయించుకోవడాన్ని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి తప్పు పట్టారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న పార్థసారధి ఇలాంటి పని చేయడం దారుణమని విమర్శించారు. ఈరోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ " ఏసు కావాలా? వెంకన్న కావాలా? అనేది టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నపార్థసారథి తేల్చుకోవాలన్నారు. ఆయన కనుక క్రిస్మస్ వేడుకలకు హాజరై.. తిరుమల పాలకమండలికి వస్తే తాము అడుగు పెట్టనీయమని భాను ప్రకాష్ హెచ్చరించారు. అవసరమైతే దాడులు చేసైనా ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.   గతంలో తాము చాలా పోరాటాలు చేశామని, ఎంతటి తీవ్రమైన కార్యక్రమానికైనా వెనుకాడబోమని భానుప్రకాశ్‌ రెడ్డి అన్నారు. ఆర్.ఎస్.ఎస్ స్టిక్కర్‌ ఉన్న కారును అలిపిరి వద్ద ఆపి పోలీసులు స్టిక్కర్ ను తొలగించారని, ఇది చాలా తప్పని అన్నారు. ఇలాంటివి ఘటనలు మళ్లీ జరిగితే బాగుండదన్నారు. ఇదే సమయంలో టీటీడీలో పని చేసే ఉన్నతాధికారులు కూడా క్రిస్మస్ సందర్భంగా వారి ఇంటి ముందు స్టార్లు పెట్టడాన్ని అయన తప్పు పట్టారు. ఇలాంటి విషయాలపై టీటీడీ నిఘా పెట్టి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని ఇతర ప్రభుత్వశాఖలకు బదిలీ చేయాలని భానుప్రకాశ్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

కొత్త కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్.. రెండు రోజుల్లో 6 లక్షల కోట్లు ఢమాల్  

బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ బయటపడడంతో ప్రపంచం మొత్తం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనకు తెలిసిన కరోనా తీరుకు ఈ కొత్త రకం భిన్నంగా ఉండటమేకాదు.. 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దీంతో.. చాలా దేశాలు భయానికి గురై.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నిన్నటి అమెరికా, యూరప్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో, ఈరోజు ఆసియా మార్కెట్లు కూడా అదే బాట పట్టాయి. దీని ప్రభావం తాజాగా భారత్ స్టాక్ మార్కెట్ పై కూడా పడింది.   నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. ఈరోజు ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయి 0.60 శాతం నష్టంతో 45,240 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. దీంతో రెండు సెషన్ల వ్యవధిలోనే స్టాక్ మదుపరులు దాదాపు రూ. 6 లక్షల కోట్లను నష్టపోయినట్లయింది. ఇక ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే, 0.76 శాతం పడిపోయి 13,220 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

పుట్టినరోజే అబద్దాలా?.. జగన్ పథకం గుట్టు బయటపెట్టిన బీజేపీ!

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే  కోసం 'వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష' పేరుతో సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద సర్వేరాయి పాతి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మర్చి ప్రచారం చేసుకుంటున్నారని.. సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినా.. ఆయనలో ఇప్పటికీ కాంగ్రెస్ సంస్కృతి, భావజాలమే ఉందని విమర్శించారు. పుట్టినరోజు నాడు కూడా జగన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.    ప్రజల స్థలాను రక్షించడం కోసం, భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం 'స్వామిత్వ'ను ప్రవేశపెడితే.. దానికి 'వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష' అని పేరు మార్చి ప్రారంభోత్సవం చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. పేర్లు మార్చి ప్రజలను ఎన్నాళ్ళు ఏమార్చగలరని నిలదీశారు. పథకానికి కనీసం ప్రధాని మోదీ ఫొటోను కూడా పెట్టరా? అని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు జగన్ సొంత పేరుని పెట్టుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గత ఆరేళ్ల పాలనలో ప్రధాని మోదీ వేలాది సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని.. కానీ, ఏ ఒక్క పథకానికి సొంత పేరును పెట్టుకోలేదని.. ప్రధానిని చూసి జగన్ నేర్చుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి హితవు పలికారు.

సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్ 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాలు వచ్చాయని సంతోషించేలోగానే  కొత్త రూపంలో కరోనా దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. దక్షిణ లండన్‌లో గత అక్టోబర్‌లో బయటపడిన ఈ కొత్త కరోనా వైరస్..  డిసెంబర్‌ నాటికి వేగంగా వ్యాపిస్తోంది. యూరప్‌లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్‌ జాడలు కనిపిస్తున్నాయి.   బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోయాయి. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన 33,364 కేసులు నమోదయ్యాయి.  గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వేరియంట్‌ వైరస్‌ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు.కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్‌ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు.  దక్షిణ లండన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్‌ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త   చర్యలు పాటించకపోతే కరోనా వైరస్‌ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ  డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్‌లోనూ ఈ కొత్త వైరస్‌ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని ప్పారు. గుండెజబ్బులతో పాటు మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని రాకేష్ మిశ్రా.  కొత్త వైరస్‌ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే భారత్‌లో చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు వైరస్‌లోని పలు భాగాలపై ఏక కాలంలో దాడి చేస్తాయని, అందువల్ల వైరస్‌లో జన్యుమార్పులు జరిగినా టీకా సామర్థ్యంలో తేడా ఉండదని వివరించారు.

విశాఖ మరో ఏలూరు కానుందా?..

ఏలూరు వాసులను ఇటీవల అంతుచిక్కని వ్యాధి వణికించిన సంగతి తెలిసిందే. కళ్లు తిరిగి పడిపోవడం, నోటి నుంచి నురగ, తలపోటు తదితర లక్షణాలతో 600 మందికి పైగా ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అయితే, నీటి కాలుష్యమే ఈ వింత వ్యాధికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, నీటి కాలుష్యాన్ని నివారించకపోతే ఏలూరులో ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లుగా.. విశాఖలోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందన్న ఆందోళన కనిపిస్తోంది.   ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తరువాత విశాఖ వాసుల్లో భయం మొదలైంది. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చేసిన అధ్యయనం ప్రకారం నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్న నగరాల్లో విశాఖ ఒకటి. మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) ద్వారా సరఫరా అవుతున్న నీరు అనేక చోట్ల కలుషితమవుతోందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. విశాఖలో పారిశ్రామిక కాలుష్యం, నీటి సరఫరా లైన్లు డ్రైనేజీల మధ్య ఉండటం, వ్యర్థాలు రిజర్వాయర్లలోకి వదలడం వల్ల నీరు కలుషితమవుతోంది.   ముఖ్యంగా మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం విశాఖవాసులను ఆందోళన కలిగిస్తోంది. విశాఖ వాసుల నీటి అవసరాలకు ఏలేరు, మేఘాద్రి గెడ్డ, ముడసరలోవ, రైవాడ, తాటిపూడి, గంభీరం రిజర్వాయర్లే ఆధారం. అయితే, మేఘాద్రి గెడ్డ రిజర్వాయరులో వ్యర్థాలు చేరుతున్నాయి. పెందుర్తి, సబ్బవరం, నవర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలతో కూడిన నీరే ఎక్కువ శాతం ఈ రిజర్వాయర్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం కలవరపెడుతోంది.    మరోవైపు భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరూ ఇందులోకే తెచ్చి ఇతర రిజర్వాయర్లకు తీసుకెళ్లే ప్రణాళికా నడుస్తోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిండంతో నగర విస్తరణ జరిగే అవకాశముంది. దీంతో, భవిష్యత్తు అవసరాల కోసం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా, పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖకు తరలించి.. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న కాలుష్యం నగరవాసులను కలవరపెడుతోంది. ఇప్పటికైనా, సరైన చర్యలు చేపట్టకపోతే విశాఖ మరో ఏలూరు అయ్యే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పాపం.. అడ్డంగా బుక్కయిన మంత్రిగారు.. 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కరప మండలం, గొర్రిపూడిలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆలయంలో జరిగిన వేడుకలు తాజాగా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఆ వేడుకలలో భక్తి కార్యక్రమాలు కాకుండా రికార్డింగ్ డాన్సులు జరగడం.. ఇదే సమయంలో ఈ వేడుకలకు ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు హాజరవ్వడం ఇపుడు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. సాక్షాత్తు మంత్రి గారి సాక్షిగా భక్తి కార్యక్రమాలు జరగవలసిన చోట ఈ రికార్డింగ్ డాన్సులేంటి అంటూ భక్తులు మండి పడుతున్నారు. అయినా మంత్రి గారైనా దీనిని ఆపకుండా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడంతో ఈ మొత్తం వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.   మరోపక్క "ఆలయాలలో దేవుని దర్శనాలకు, పండగలకు, పంచాయితీ ఎన్నికలు జరపడానికి కోవిడ్ నిబంధనలు అడ్డు వస్తాయి కానీ ఇలాంటి రికార్డ్ డాన్సులకు మాత్రం కోవిడ్ నిబంధనలు అడ్డురావా…? అసలు ఇలాంటివి నియంత్రించాల్సిన పోలీసులే గుడ్లు అప్పచెప్పి చూస్తూ ఉండడం పోలీసు వ్యవస్థ ఈ జగన్ పాలనలో నిర్వీర్యమైపోయింది అనడానికి నిదర్శనం." అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనిపై మరి మంత్రి కన్నబాబు గారు ఏవిధముగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం గాంధేయవాది వావిలాల గోపాల కృష్ణయ్య స్మ్రుతి వనం వద్ద రికార్డింగ్ డాన్సులతో చెడ్డపేరు తెచ్చుకున్న వైసీపీ శ్రేణులు తాజాగా మంత్రిగారి సమక్షంలో ఆలయం వద్ద జరిగిన వేడుకలలో రికార్డింగ్ డాన్సుల పర్వం రిపీట్ అవడంతో వైసీపీ పరువు గంగపాలవుతోందని కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ పార్టీ ఆఫీసులో సీఎం జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ .. 

నిన్న ఏపీ సీఎం జగన్ బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అటు పార్టీ ముఖ్య నేతల నుండి ఇటు గల్లీ నేతల వరకు అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించారు. అయితే నిన్న నెల్లూరు టీడీపీ ఆఫీసులో కూడా సీఎం జగన్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అదేంటి జగన్ బర్త్ డేను టీడీపీ ఆఫీసులో నిర్వహించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?. ఇసుకతో తయారు చేసిన కేక్ ను కట్ చేసి వినూత్న రీతిలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌కు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ వారు ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా సీఎం జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ శ్రేణులు ఎందుకు చేస్తున్నాయో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఏకంగా మూడు సార్లు ఇసుక విధానాన్ని మార్చారని ఆరోపించారు. ప్రతీసారి వెయ్యి రూపాయలు పెంచుతూ పోతున్నారని, ప్రస్తుతం యూనిట్ ఇసుక ధర రూ. 6500 కు చేరిందన్నారు. ఒకపక్క మండుతున్న పెట్రోల్, డీజిల్‌ రేట్లతో సమానంగా ఇసుక రేటు కూడా పెరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సరైన ఇసుక విధానం లేకపోవడం వల్ల ఏపీలో దీనిపై ఆధారపడిన కోటి మంది ఉపాధి కోల్పోయారని వారు విమర్శించారు.

దిశ వాహనాలకు వైసీపీ రంగులు! గుంటూరు పోలీసుల అత్యుత్సాహం

కోర్టులు చివాట్లు పెట్టినా.. ప్రజలు ఛీదరించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి రంగుల పిచ్చి పోవడం లేదు. వైసీపీ నేతలే కాదు ప్రభుత్వ అధికారులది అదే తీరు. ఎవరేం అనుకుంటే మాకేందన్నట్లుగా అవే తప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మన్ననలు పొందాలనే ఆశతోనే ఏమో.. పోలీస్‌ వాహనాలకూ వైసీపీ రంగులేశారు. దిశ వాహనాలకే కాకుండా, గతంలో కేంద్ర ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో  ప్రతి స్టేషన్‌కూ మహిళా ఎస్‌ఐలకు కేటాయించిన బైక్‌లకూ  వైసీపీ స్టిక్కర్లు అంటించి దిశ పేరుతో ప్రారంభించారు.గుంటూరులోని పోలీస్‌ కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ వాహనాలను జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. పాతవి కావడంతో రెండు వాహనాలు మొరాయించాయి గతంలోనూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు.  ఏకంగా  మహిళల రక్షణ కోసం అంటూ ప్రారంభించిన దిశ యాప్‌కు  వైసీపీ రంగులే వేశారు. అది వివాదం కావడంతో తిరిగి తొలగించారు. గతంలో రంగుల విషయంలో పెద్ద  వివాదం జరిగినా.. గుంటూరు పోలీసులు దిశ వాహనాలకు వైసీపీ రంగులేయడం వివాదాస్పదమవుతోంది. సీఎం పుట్టిన రోజు కానుక అన్నట్లుగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు కోట్ల రూపాయలు వెచ్చించి వైసీపీ రంగులేయడం..  కోర్టులు తప్పు పట్టడం జరిగింది. కోర్టు చివాట్లు పెట్టడంతో  ఆయా రంగులను మార్చేశారు. అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ‘దిశ’ స్టేషన్‌లకు కూడా వైసీపీ రంగులు వేయగా కోర్టు ఆదేశాలతో వాటిని కూడా మార్చారు. 

బెంగాల్ లో బీజేపీకి 10 సీట్ల లోపే! రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే సవాల్ 

దేశ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే బెంగాల్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తహతహలాడుతుండగా.. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తనదైన  శైలిలో బెంగాల్ రాజకీయాలను మలుపు తిప్పుతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కమలనాధుల ఆకర్ష్ మంత్రానికి టీఎంసీ షేకవుతోంది.  ఇటీవలే 8 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. టీఎంసీలో కీలక నేతగా ఉన్న సేవెందు అధికారి కూడా బీజేపీలో చేరారు. ఎన్నికల నాటికి బెంగాల్ లో మరిన్ని సంచలనాలు ఉంటాయని, టీఎంసీలో మమత ఒక్కరే మిగిలిపోతారని కామెంట్ చేశారు అమిత్ షా. బీజేపీ నేతల తీరుపై టీఎంసీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.   బెంగాల్ లో బీజేపీ దూకుడుగా ఉండగా... ఆ పార్టీని టార్గెట్ చేస్తూ  సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఎన్ని ఎత్తులు వేసినా బెంగాల్ లో బీజేపీ పది సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మళ్లీ మమతా బెనర్జీనే విజయం సాధిస్తారని చెప్పారు. అంతేకాదు బెంగాల్‌లో బీజేపీకి డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు పీకే.  2014 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు బెంగాల్ తో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

రైతుల కష్టాలు తెలిసిన పాలకులెక్కడ!  అన్నదాత  వెతలు తీరేదెన్నడు?  

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశమంతా చర్చిస్తోంది. కొత్త చట్టాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉన్నాయని ఆరోపిస్తున్న రైతులు దేశ రాజధానిపై  దండెత్తారు. ఢిల్లీలోకి అనుమతించకపోవడంతో సరిహద్దుల్లోనే ఆందోళన చేస్తున్నారు. నాలుగు వారాలుగా అక్కడే ఉన్నారు అన్నదాతలు. కేంద్రం బిల్లులపై వెనక్కి తగ్గే వరకు కదిలేది లేదని కర్షకులు ఖరాకండిగా చెప్పేస్తున్నారు. మోడీ సర్కార్ మాత్రం కొత్త సాగు చట్టాలు చరిత్రాత్మకం అంటోంది. 21వ శతాబ్దపు భారతదేశ అవసరమని, అన్నదాతల  ఆర్థిక స్థితి గతులను మార్చివేస్తుందని బీజేపీ నేతలు గొప్పగా చెబుతున్నారు. అయితే అసలు రైతుల అసలు సమస్యలేంటీ.. అన్నదాతలు ఏం కోరుకుంటున్నారు... రైతు రాజు ఎలా అవుతారు.. వ్యవసాయాన్ని పండగ చేయాలంటే ఏం చేయాలి.. అన్న అంశాలు మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. రాజకీయ కోణంలోనే అధికార, విపక్షాలు ప్రకటనలు చేస్తూ ప్రధాన సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యను మరింత జటిలం చేయాలనే చూస్తున్నారు కాని.. అన్నదాతల కోసం ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదు మన ఘనాపాటి నేతలు.  గత ప్రభుత్వాలు తెచ్చిన చట్టాల్లో గాని.. ఇప్పుడొచ్చిన కొత్త బిల్లుల్లో కాని రైతుల కన్నీటి కష్టాల గురించి ఆలోచించిన దాఖలాలేవి కనిపించడం లేదు. ఆధునిక పద్దతులంటూ, గ్లోబలైజేషన్ పేరుతో కొత్త చట్టాలను తెరపైకి తెస్తున్నారు. గ్రామీణ రైతులకు సాంకేతిక  పరిజ్ఞానం ఉందా లేదా అన్న అలోచన చేయకుండానే... ఆన్ లైన్ మార్కెట్ అంటూ ఊదరగొడుతున్నారు. ఎప్పటికప్పుడు పండించిన పంటను అమ్ముకుని..  ఆ కాలానికి జీవితం గడిపే సామాన్య రైతులకు.. ఈ టెక్నాలజీలు, ఆన్ లైన్ మార్కెట్లు ఎలా ఉపయోగపడతాయన్న కనీస ఆలోచన కూడా చేయడం లేదు చట్టాలు తయారు చేసే మన సివిల్ సర్వెంట్లు. ఏసీ రూముల్లో కూర్చుని బిల్లులు రూపొందించే  ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లకు క్షేత్రస్థాయిలో  రైతులకు ఉండే బాధలు, వెతలు, అవసరాలు ఎలా తెలుస్తాయన్న ప్రశ్న సామాజిక వేత్తలు, సామాన్య జనాల నుంచి వస్తోంది. పల్లెల్లో పర్యటించి, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, పొలాల్లో తిరిగి..  కష్టపడి పంటలు పండిస్తున్న కర్షకులను కలిసి మాట్లాడితేనే అసలు సమస్యేంటో తెలుస్తుందని చెబుతున్నారు. రైతుల జీవితాలను బాగు చేయాలంటే ఏం చేయాలే వారికి అవగాహన వస్తుందంటున్నారు.  నిజానికి రైతులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలేం కాదు. వాళ్లు అడుగుతున్నదల్లా.. పంటకు ముందు పెట్టుబడి సాయం. పంట చేతికివచ్చాకా దానికి గిట్టుబాటు ధర. ఈ రెండు కల్పిస్తే చాలు తమకు ప్రభుత్వాలు కొత్తగా చేయాల్సిందేమి లేదని చెబుతున్నారు. ఈ రెండు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత కూడా.  కాని వీటిని ఏనాడు పట్టించుకోలేదు పాలకులు. మన దేశంలో ఉన్న రైతుల్లో దాదాపు 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఏ కాలానికి ఆ కాలం పంటలు సాగు చేసి అమ్ముకుని కాలం వెళ్లదీసేవారే. వ్యవసాయ రైతుకు మొదటి నుంచే కష్టాలుంటాయి. విత్తనాల కోసం అప్పు తేవాల్సిందే. ఎరువుల కోసం .. కూలలకు ఇవ్వడానికి రుణమే గతి. ఇంత చేసి...ఎంతో కష్టపడి పంట పండిస్తే.. అక్కడ గిట్టుబాట ధర రాదు. అప్పటివరకు మంచిగానే ఉండే పంట రేటు.. రైతు పంట చేతికొచ్చే సమయానికి టపీమని పడిపోతుంది. కాదు కాదు  దళారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై అలా పతనం చేస్తారు. దీంతో చేసిన అప్పులు తీర్చడం కోసం వాళ్లిచ్చిన రేటుకే పంటను అమ్మేస్తుంటారు రైతులు. పంట వ్యాపారుల దగ్గరకు రాగానే మళ్లీ రేట్లు కొండెక్కుతాయి. తాము ఉత్పత్తి చేసే  ఏ వస్తువుకైనా ఉత్పత్తి దారుడే రేటు నిర్ణయిస్తారు. ఒక్క రైతుకు మాత్రమే ఆ అవకాశం లేదు. కష్టపడి రైతు పంట పండిస్తే.. దాని ధర మాత్రం దళారీ నిర్ణయిస్తాడు. రైతులకు ఏనాడు గిట్టుబాట ధర రాదు. కాని రైతు పండించిన ఆ పంటకు మాత్రం మార్కెట్ లో రేటు భారీగా ఉంటుంది. మాల్స్ లో అయితే మరీ ప్రియం. ఇలాంటి దుర్భర వ్యవస్థను బాగు చేయకుండా.. ఇలాంటి  కొత్త చట్టాలతో రైతులకు ప్రయోజనం ఏంటన్నది పాలకులకే తెలియాలి.     రైతులకు గిట్టుబాట ధరే పెద్ద సమస్యగా ఉంటే.. ప్రకృతి కూడా వాళ్లపైనే ప్రతాపం చూపిస్తుంది. కరువొచ్చినా మొదటగా కుదేలయ్యేది అన్నదాతే.  కుండపోతగా వర్షం కురిసినా నిండా మునిగేదే కర్షకుడే. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి మాత్రం ఏ చట్టాలు ఉపయోగపడవు. విపత్తుల సమయంలో ఏం చేసి అన్నదాతలను నిలబెట్టగలమన్న ఆలోచనే చేయరు పాలకులు. రైతులకు కావాల్సిన కనీస చర్యలు తీసుకోరు కాని.. ఎన్నికలు వచ్చాయంటే చాలు రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, జీవన ప్రమాణాలు మార్చేస్తామని గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తుంటారు. దేశానికి తిండి పెట్టే అన్నదాతలను బిక్షగాళ్లుగా మారుస్తున్నారు పాలకులు. అది చేస్తాం ఇది చేస్తామంటూ వారిని ఆశల పల్లకీలో ఊరేగిస్తూ.. చివరికి అప్పుల పాలు చేసి... వాళ్లను ఆత్మహత్యలకు పురికొల్పుతున్నారు. రాజకీయ నేతల వైఫల్యాలు, కుట్రల వల్లే దశాబ్దాలు గడుతున్నా అన్నదాతల జీవితాలు మారడం లేదని మేధావులు, వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని కొత్త బిల్లులలో చెప్పారు. కాని  రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరేచోటుకు తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమేనా?  అని ప్రశ్న వస్తోంది. ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్ళి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానమంటున్నారు. కార్పొరేట్‌ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు తలుపులు బార్లా తెరువడానికి ఉపయోగపడేలా  బిల్లు ఉందంటున్నారు వ్యవసాయ నిపుణులు.  కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవి..  కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదు. అవన్ని ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.  నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే కనుక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.    కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ఉన్న ఆహార ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేయడం చాలా ప్రమాదకరమంటున్నారు. సాధారణంగా పంటలు కోతకు వచ్చే సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి భద్రపరచుకుంటారు. ఆ తర్వాత ధరలను పెరిగిన తర్వాత అమ్ముకుంటారు. ఎప్పుడు ఎక్కువ రేట్లు ఉంటే అప్పుడు అమ్ముకోవడం వలన మిగిలిన సమయంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం. అయితే సంస్థలతో చేసుకునే ఒప్పందాల్లో ఏముందో రైతులు ఎంతవరకు అవగాహన చేసుకుంటారన్నది ప్రశ్నార్దకమే.  ఈ ఒప్పందాలు నేరుగా రైతు, సంస్థ మధ్య జరుగుతాయి. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మార్కెట్ కమిటీలు కానీ ఏమీ ఉండవు. దీంతో రైతు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఇక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పేరుతో పాన్ కార్డ్ ఉన్న ఎవరైనా ఈ-వర్తకం చేసుకోవచ్చన్నది వినడానికి బాగానే ఉన్నా.. ఎంత శాతం మంది రైతులకు అలాంటి సాంకేతిక అవగాహన ఉంటుందన్న ప్రశ్న వినిపిస్తుంది. దీనికంటే ఇప్పటికే ఉన్న ఈ-నామ్ వ్యవస్థను మెరుగుపరిచి రైతులకు మేలు కలిగేలా చేయాలని సూచిస్తున్నారు.   ఇప్పటికైనా ప్రభుత్వాలు, పార్టీలు మేల్కొని, రాజకీయ ప్రయోజనాల కోణంలో కాకుండా నిజంగా అన్నదాతలు ఏం చేస్తే బాగుపడతారే అలోచించి.. ఆ దిశగా చట్టాలు చేస్తే మంచిది.. ఆ దిశగా పాలకులు అడుగులు వేయాలని మనం కోరుకుందాం... జై కిసాన్..