టబ్‌ లో జలకాలాడిన పులి

ఏ? మనుషులకేనా శరీరం ఉంది, వాళ్ళేనా స్నానం చేసేది?.. మాకు శరీరం ఉంది, మేమూ స్నానం చేస్తాం.. ఓ టబ్ లో గోరు వెచ్చని నీళ్ళు పెట్టించండి అంటుంది పులి.  సాధారణంగా పులులు సరస్సులు, కొలనుల్లో జలకాలాడడం చూస్తుంటాం. కానీ ఓ పులి మాత్రం చిన్న పిల్లోడిలాగా టబ్‌ లో దిగి స్నానం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.  ఈ వీడియో కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్‌ లోగల కాఫీతోటలో చిక్కింది. ఈ వీడియోలో పులి మొదట టబ్‌ వద్దకు వస్తుంది. టబ్‌ చుట్టూ తిరుగుతూ.. ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా పరిశీలించి.. అనంతరం అందులోకి దిగి జలకాలాట ప్రారంభిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ.. టబ్ లో నీటితో పాటు ఆ పక్కనే షోపు లేదా షాంపూ ఉంచితే పులి ఇంకా హప్యీగా ఫీల్ అయ్యేదేమో.!  

జగన్‌ రెడ్డిది ఫాసిస్ట్‌ పాలన! నేరగాళ్ల రాజ్యం తెచ్చారన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్‌ అండతో వైసీపీ  ఫాసిస్ట్‌ మూకలు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. ఏ నేరానికి పాల్పడినా ఎవరేం చేయరనే ధీమాతో నిందితులంతా పేట్రేగిపోతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్‌ ఆఫ్‌ లాకు గండికొట్టారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో అశాంతి, అభద్రత నెలకొందని, ఎక్కడా శాంతిభద్రతలు లేకుండా నేరగాళ్ల రాజ్యం తెచ్చారని చంద్రబాబు విమర్శించారు.   చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు చేసిన దాడిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలను గాయపర్చడం, వారి వాహనాలను ధ్వంసం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బి.కొత్తకోటలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నాయకులపై దాడి చేయడం దారుణమన్నారు చంద్రబాబు. జగన్‌ మోహన్‌ రెడ్డి ఫాసిస్ట్‌ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని టీడీపీ అధినేత ధ్వజమెత్తారు.      ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బడుగు, బలహీనవర్గాలపై దాడులు జరగని రోజే లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి రోజూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దమనకాండ యథేచ్ఛగా కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో నేరగాళ్ల అరాచకాలను నియంత్రించే వ్యవస్థే లేకుండా పోయిందన్నారు. జగన్‌ రెడ్డి సీఎం అయ్యాక పోలీసు వ్యవస్థ నీరు గారి పోయిందని... రాష్ట్రంలోని పేదలు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు విరుచుకుపడ్డారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని  చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్టులు! రేవంత్ కు పీసీసీ పగ్గాలు రాకుండా కుట్రలా? 

తెలంగాణలో తీవ్ర సంచలనం స్పష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఓ వైపు ఏసీబీ కోర్టులో దర్యాప్తు వేగంగా సాగుతుండగానే.. మరోవైపు ఈ కేసులోనే  ఏ4  నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి తో తనకు ప్రాణ హాని ఉందంటూ మత్తయ్య తెలంగాణ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఓటుకు నోటు కేసులో అప్రూవర్ గా మారినందున తనను హత్య చేయాలని ప్లాన్ చేశారని అతను ఆరోపించారు. తనకు ఇప్పటికే ఈడీ నోటీసులు వచ్చాయన్న మత్తయ్య.. కేసు విచారణ పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని హెచ్చార్సీని వేడుకున్నారు.    మత్తయ్య చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణతో పాటు ఏపీలోనూ చర్చనీయాంశంగా మారాయి.. మత్తయ్య ఆరోపణల వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. రేపో మాపో ఆయన నియామకంపై ఏఐసీసీ నుంచి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేరూసలేం మత్తయ్యను తెరపైకి  తెచ్చారనే వాదనలు  వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని., దీని వెనక టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ నేతకు పీసీసీ పగ్గాలు వస్తే ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడతారనే భయంతోనే మత్తయ్యతో అధికార పార్టీ కుట్రలు చేస్తుందని రేవంత్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. ఇంతకాలం సైలెంటుగా ఉన్న మత్తయ్య.. ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ రాకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది.    తెలంగాణలో కీలకంగా మారిన ఓటుకు నోటు కేసులో ప్రస్తతం ఏసీబీ కోర్టులో వేగంగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి సండ్రను తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు ఆయన వేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను ఈనెల 8న ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు విచారణకు ఎంపీ రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహా హాజరుకాకపోవడంపై సీరియస్ గా స్పందించింది. ఈనెల 15న కచ్చితంగా హాజరుకావాలని ఏసీబీ కోర్టు వారిని ఆదేశించింది. హాజరు మినహాయింపు పిటిషన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో ఓటుకు నోటు కేసులో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ సమయంలోనే ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జేరూసలేం మత్తయ్య చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.     2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహ, జేరూసలేం మత్తయ్యలపై ఏసీపీ కేసు నమోదైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను 50 లక్షల రూపాయల నగదును రేవంత్ రెడ్డి ఇస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఈ బేరసారాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు స్టీఫెన్ సన్ తో  అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు మాట్లాడినట్లుగా ఉన్న ఆడియోలు కూడా వెలుగు చూశాయి. ఈ కేసులోనే  రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు.

ఆర్టీసీ బస్సులో తాగుబోతుల వీరంగం.. డ్రైవర్, కండక్టర్ ఏం చేశారంటే...

తాగి బస్సు నడపడం నేరం కానీ.. బస్సులో తాగి హంగామా చేయడం నేరం కాదు అనుకున్నారో ఏమో... ఐదుగురు తాగుబోతులు ఆర్టీసీ బస్సులో వీరంగం సృష్టించారు. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. గత రాత్రి మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ కు వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఐదుగురు యువకులు ఎక్కారు. వారు బస్సులోనే బీరు తాగుతూ నానా హంగామా సృష్టించారు. మహిళలు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. వీరి చేష్టలతో విసిగిపోయిన ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును మార్గ మధ్యలో తాండురు వద్ద నిలిపి 100 కు డయల్ చేశారు. దీంతో తాండూరు సీఐ పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు. అనంతరం పోకిరీలను స్టేషన్ కు తరలించారు. ఈ ఐదుగురు యువకులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

గంటల వ్యవధిలోనే 9 మంది శిశువులు మృతి

రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే 9 మంది శిశువులు మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఏడాది క్రితం ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. తాజాగా ఇదే రీతిన శిశువులు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది.   బుధవారం రాత్రి జేకే లోన్ ఆస్పత్రిలో ఐదుగురు శిశువులు మరణించగా, గురువారం మరో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన చిన్నారులంతా 1-4 రోజుల వయస్సులోపు వారే అని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.   ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ దులారా మాట్లాడుతూ.. చిన్నారుల మరణాలు సాధారణమైనవేనని తెలిపారు. కాగా, కోటా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆరోగ్య మంత్రికి పంపిన నివేదిక ప్రకారం, పుట్టుకతోనే వైఫల్యాలు రావడంతో ముగ్గురు శిశువులను జేకే లోన్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా మరణించారు. మిగతా శిశువులవి ఆకస్మిక మరణాలు అని నివేదికలో తెలిపారు.

గాంధేయవాది స్మృతి వనంలో వైసీపీ నేతల మందు పార్టీ.. రికార్డింగ్ డ్యాన్సులు

ఏపీలో వైసీపీ నేతల నిర్వాకంతో సీఎం జగన్ తల బొప్పి కట్టేలా ఉంది. తొమ్మిదేళ్లకు పైగా ప్రతిపక్షంలో ఉండి పోరాడి.. బంపర్ మెజారిటీతో ఏపీలో అధికారం చేపట్టిన సీఎం జగన్ ప్రశాంతంగా పరిపాలన పై దృష్టి పెట్టకుండా సొంత పార్టీ నాయకులు తమ ప్రవర్తనతో ప్రతి రోజు కొత్త తలనొప్పులు తీసుకు వస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది అయిన వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతి వనంలో వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్ జన్మదిన వేడుకలను ఎలాంటి అనుమతి లేకుండానే నిర్వహించారు. దీనికోసం లౌడ్ స్పీకర్లు పెట్టి మద్యం మత్తులో సినిమా పాటలకు స్టెప్పులేశారు. మరోపక్క అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ మహనీయుడి సమాధి వద్దే మందుకొడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు.   అయితే నిబంధనల ప్రకారం స్మృతివనంలోకి రాత్రి 7గంటలు దాటితే ఎవర్నీ అనుమతించరు. అలాంటిది ఏకంగా రాత్రి 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ ఎన్నికల పోటీలో అభ్యర్థులుగా ఉన్నవారు అమ్మాయిలతో కలిసి చిందులు వేశారు. వైసీపీ నేతల ఈ తాజా నిర్వాకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆ ఘటన పై విచారణకు ఆదేశించారు. ఎంత అధికారంలో ఉంటే మాత్రం ఒక మహనీయుడి సమాధి వద్ద ఇలా అవమానించేలా ప్రవర్తిస్తారా అని మరోపక్క స్థానికులు మండిపడుతున్నారు.   గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని వావిలాల స్మృతివనాన్ని గత టీడీపీ ప్రభుత్వం రూ.10 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దింది. స్థానికులు ఎంతో పవిత్రస్థలంగా భావించే స్మృతి వనంలో ఈ విధంగా మందుపార్టీలు చేసుకోవడంపై వివిధ పార్టీల స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఇక్కడ నిరసలను చేపట్టారు. మరోపక్క ఈ ఘటన తరువాత టీడీపీ ఆధ్వర్యంలో స్మృతివనాన్ని పసుపునీటితో శుద్ధి చేశారు.   ఇటువంటి పార్టీలు వేరే ఎక్కడైనా జరిగి న్యూసెన్స్ జరిగితే పరిస్థితి వేరుకానీ.. గాంధీ స్పూర్తితో మద్యనిషేధం అమలు చేస్తున్నామంటున్న వైసీపీ నేతలు.. అదే మద్యనిషేధం కోసం ఉద్యమించిన గాంధేయవాది వావిలాల గోపాల కృష్ణయ్య సమాధినే మందు పార్టీలు, రికార్డింగ్ డాన్సులకు వేదికగా చేయడాన్ని జనం తప్పుబడుతున్నారు.

దేశంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందా అని జగన్ సర్కార్ ను ప్రశ్నించిన హైకోర్టు

జగన్ సర్కార్ మిషన్ బిల్డ్ ఏపీ పేరుతొ నిధుల కోసం విశాఖ, గుంటూరు నగరాల్లో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై సామజిక కార్యకర్త తోట సురేష్ తో పాటు మరి కొందరు పిల్ దాఖలు చేయగా.. కొంత కాలంగా హై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనల సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం దేశంలో ఏమైనా ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందా.. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుని నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతోపాటు కరోనా కాలంలో అత్యధిక ధరకు మద్యం కొనుగోలు చేసి రాష్ట్ర సంక్షేమం కోసం పాటు పడుతున్న మందుబాబులకు ప్రభుత్వం కృతఙ్ఞతలు తెలపాలని వ్యంగ్యంగా పేర్కొంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రభుత్వం తరుఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపై స్పందించిన ధర్మాసనం మీరు ఎంత బాగా చేస్తున్నారో అందరికి తెలుసనీ పేర్కొంది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది.

అమీర్‌పేటలో ఘోర ప్రమాదం.. మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో తల ఇరుక్కుని...

హైదరాబాద్ లోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి మెట్రో స్టేషన్‌ రైలింగ్‌కు ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడు. మరొక యువకుడుకి తీవ్ర గాయాలయ్యాయి.    కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీష్ (24), అతని స్నేహితుడు రవితేజతో కలిసి ద్విచక్రవాహనంపై వేగంగా ఖైరతాబాద్ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు వెళుతున్నారు. అమీర్‌పేట చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి మెట్రో స్టేషన్‌ రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో గిరీష్ తల మెట్రో స్టేషన్‌ రైలింగ్‌ లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు.    ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ రవితేజని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గ్యాస్ కట్టర్‌తో ఇనుపకడ్డీలను తొలగించి, గిరీష్ మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సోనియా స్థానంలో యూపీఏ చైర్మెన్ గా శరద్ పవార్! 

యూపీఏ కూటమికి కొత్త సారథి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ పదవి నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరలో ఈ బాధ్యత నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. రైతుల ఆందోళన సందర్భంగా ఇటీవల నేతలతో సంప్రదిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఈ పదవిలో కొనసాగే విషయంలో తన విముఖత ప్రదర్శించారని సమాచారం. తన స్థానంలో మరో నేతను ఎన్నుకోవాల్సిందిగా ఆమె సూచించారని చెబుతున్నారు. దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నాయకత్వం   యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌కు వహించబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. యూపీఏ అధ్యక్ష పదవికి పవార్ అయితేనే పవర్‌ఫుల్‌గా ఉంటుందనే అభిప్రాయాలు బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల నుంచి వ్యక్తమవుతున్నాయట.    ప్రస్తుతం యూపీఏ కూటమి దాదాపు పతనావస్థలో ఉంది. సొంత పార్టీనే నిలబెట్టలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపధ్యంలో యూపీఏకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి శరద్ పవార్ కు బాధ్యతలు అప్పగించాలని మిగితా విపక్ష పార్టీలన్ని భావిస్తున్నాయట. యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్ నియమితులైతే మహదానందమని శివసేన ప్రకటించింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిందని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్ బాధ్యతలు స్వీకరిస్తే శివసేన మద్దతు ఇస్తుందని కూడా సంజయ్ రౌత్ ప్రకటించారు.   మరోవైపు ఎన్సీపీ మాత్రం అలాంటి ప్రస్తావన ఏమి లేదని చెబుతోంది. యూపీఏలో ఉన్న మిత్ర పార్టీలతో ఇలాంటి చర్చలు ఏవీ జరగలేదని, ఇలాంటి ప్రతిపాదనలు తమ వరకు రాలేదని ఎన్సీపీ నేత మహేష్ తపసీ అన్నారు.  యూపీఏ చైర్‌పర్సన్‌గా శరద్ పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని  చెప్పారు  రైతులు చేస్తున్న ఆందోళన నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకు కొన్ని మీడియా సంస్థలు  పుకార్లు పుట్టిస్తున్నాయని మహేష్ చెప్పారు.

కారు, కాంగ్రెస్ పార్టీలు కలిస్తే రేవంత్ టీమ్ దారెటు! తెలంగాణలో ఏం జరగబోతోంది? 

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇంతకాలంగా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బలంగా ఉండటంతో పాటు తెలంగాణలోనూ బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీని ఢీ కొట్టేందుకు కారు, హస్తం పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఇటీవల రైతులు నిర్వహించిన భారత్ బంద్ లో ఈ రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొనడం ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేయాల్సి వస్తే.. కాంగ్రెస్ పైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది ఇప్పుడు అసక్తిగా మారింది.   టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేయడానికి ఎంపీ రేవంత్ రెడ్డి అంగీకరించే ప్రసక్తే ఉండదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు, గత అరేండ్లుగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ నుంచి తనకు సరైన సహకారం లేకున్నా ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనపై అక్రమ కేసులు పెట్టినా, తన మనుషులను అధికార పార్టీ నేతలు వేధించినా వెనక్కి తగ్గలేదు ఫైర్ బ్రాండ్ లీడర్. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై చేస్తున్న పోరాటం వల్లే ఆయనకు జనాల్లో క్రేజ్ వచ్చిందనే చర్చ ఉంది. రేవంత్ రెడ్డి పంచ్ ప్రసంగాల వల్లే  టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని చెబుతారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం ఆయన్ను జనాల్లో హీరోగా నిలిపిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు డివిజన్లు ఆయన పార్లమెంట్ పరిధిలోనివే. కాంగ్రెస్ సాధించిన ఆరు శాతం ఓట్లలో సింహభాగం మాల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలో వచ్చినవే.    కేసీఆర్ సర్కార్ పై ఇంత తీవ్ర స్థాయిలో పోరాడిన రేవంత్ రెడ్డి.. ఆ పార్టీతో కలిసి పని చేయడం అసాధ్యమనే అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి కూడా వస్తోంది. ఒక వేళ పార్టీ హైకమాండ్ టీఆర్ఎస్ తో కలిసి పోవాలనే నిర్ణయం తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి తీవ్ర నిర్ణయాలే తీసుకోవచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి కోసం బీజేపీ ఎప్పటి నుంచో కాచుకుని కూర్చుంది. అయితే బీజేపీలోకి వెళితే రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఉండదని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అంతేకాదు బీజేపీలో ముఖ్యమంత్రి పదవి రేసులో కూడా రేవంత్ రెడ్డి ఉండరు. దీంతో సొంత పార్టీ అయితేనే రేవంత్ రెడ్డికి సూటవుతుందనే చర్చ జరుగుతోంది. తన వాగ్దాటి. పోరాట పటిమతో ఇప్పటికే లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న రేవంత్ రెడ్డికి ప్రజా క్షేత్రంలోనూ ఊహించని సపోర్ట్ లభిస్తుందని ఆయన టీమ్ చెబుతోంది.    రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడితే మాత్రం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ లోని మెజార్టీ నేతలు రేవంత్ వెంట నడిచే అవకాశం ఉంది. టీడీపీ నుంచి తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు మిగితా నేతలంతా రేవంత్ వెంటే ఉంటారు. కాంగ్రెస్ లోని యువ నేతలు కూడా ఫైర్ బ్రాండ్ బాటే పడతారని తెలుస్తోంది. నగరానికి చెందిన యువ నేత ఫిరోజ్ ఖాన్ ఇటీవలే దీనిపై ప్రకటన కూడా చేశారు. రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఉంటుదని, లేదంటే దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఫిరోజ్ ఖాన్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా కొందరు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో కలిసి పని చేయాల్సి వస్తే మాత్రం తెలంగాణలో అనూహ్య మార్పులు ఖాయమనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. రేవంత్ రెడ్డిని దూరం చేసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలానే మారుతుందనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది.

అలిగి వెళ్లిపోయిన మంత్రి అవంతి!!

రాష్ట్ర మంత్రి అంటే సవాలక్ష పనులు ఉంటాయి. ఎన్ని పనులు చూసుకోవాలి, ఎన్ని కార్యక్రమాలకు హాజరు కావాలి. ఇవన్నీ ఆలోచించకుండా.. మనం మంత్రిని కార్యక్రమానికి పిలిచాం, మనం చెప్పిన టైంకి ఆయన రాలేదు కాబట్టి.. మనమే కార్యక్రమాన్ని పుర్తి చేద్దాం అనుకుంటే ఎలా?.. మంత్రికి ఎంత అవమానం?.. తాజాగా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి అలాంటి అనుభవమే ఎదురైంది.   వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన పూదోటను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిన సింహాచలం దేవస్థానం పాలక మండలి గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్ ను ఆహ్వానించింది. కార్యక్రమం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమవుతుందని సమాచారం ఇచ్చింది. అయితే మరో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉదయం 10.10 గంటలకు పూదోటకు చేరుకున్నారు. అప్పటికే విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు పూదోటలో మొక్కలు నాటి వెళ్లిపోయారు.    అనంతరం అక్కడకు చేరుకున్న మంత్రికి పాలక మండలి సభ్యులు పూర్ణకుంభం, సన్నాయి వాయిద్యాలతో ఆహ్వానం పలకబోయారు. ఈ సందర్భంలో మంత్రి మిగిలిన అతిథుల గురించి వాకబు చేశారు. వారు ఉదయాన్నే చేరుకోవడంతో మొక్కలు నాటించేశామని బదులివ్వడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 'కార్యక్రమానికి ఆహ్వానించినవారు.. నేను వచ్చే వరకు ఆగలేరా?.. మీరే కార్యక్రమం చేసేసుకుంటే ఇంకెందుకు నన్ను పిలవడం..' అని మండిపడ్డారు. తాను వచ్చేంత వరకు ఆగి వుంటే బాగుండేదని, కనీసం ప్రొటోకాల్‌ పాటించకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వీడియో కాన్ఫరెన్స్‌ ఉందని, మరో కార్యక్రమానికి కూడా వెళ్లాల్సి వుందంటూ, వారి మర్యాదలను స్వీకరించకుండా, కారు దిగకుండానే మంత్రి అవంతి తిరిగి వెళ్లిపోయారు.

తెలంగాణ రైతు బ్యాంకు ఖాతాలో రూ. 473 కోట్లు

సాధారణంగా రైతులకు బ్యాంకుల్లో అప్పులు ఉండటం తప్ప.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉండటం చాలా అరుదు. ఎప్పుడో పంట అమ్మినప్పుడు వేలల్లోనో, మహా అయితే లక్షల్లోనే ఖాతాలో డబ్బులు పడతాయి. కానీ, ఒక సాధారణ రైతు ఖాతాలో వందల కోట్లు డబ్బులు ఉండటం ఎప్పుడైనా చూసారా?.. షాకింగ్ గా ఉందా?.. విన్న మనకే కాదు, తన ఖాతాలో వందల కోట్లు డబ్బులు ఉండటం చూసిన ఆ రైతు కూడా మనకంటే వంద రెట్లు ఎక్కువ షాక్ అయ్యాడు.   వివరాల్లోకి వెళితే, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అతను బుధవారం నాడు సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ కు ఓ పని నిమిత్తం వెళ్లి, తన అవసరార్థం డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అయితే, ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బు రాకపోవడంతో, బ్యాలెన్స్ చూసుకోగా, ఖాతాలో ఏకంగా రూ. 473,13,30,000 ఉన్నట్టు చూపించింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్‌ ఏమైనా వచ్చిందేమోనని.. వెంటనే అతను, పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చెక్ చేసుకున్నా, అంతే బ్యాలెన్స్ ఉన్నట్టు చూపింది.    ఇన్ని డబ్బులు తన ఖాతాలో ఎందుకు ఉన్నాయో, ఏటీఎం నుంచి డబ్బులు ఎందుకు రావడం లేదో కనుక్కునేందుకు తన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లగా, సదరు రైతు ఖాతా ఫ్రీజ్ అయిందని అధికారులు వెల్లడించారు. ఏటీఎం రిసిప్ట్‌ లో భారీ మొత్తంలో బ్యాలెన్స్‌ చూపిస్తోందని చెప్పగా.. అతని ఖాతాలో కేవలం రూ. 4 వేలు మాత్రమే ఉన్నాయని సమాధానం ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి ఏమీ అర్థంకాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. కాగా, అతని ఖాతాలో వందల కోట్ల డబ్బు జమైందన్న విషయం రెండు రోజులుగా తుర్కపల్లి మండల ప్రాంత గ్రామాల్లో చర్చనీయాంశమైంది.

మొన్న అత్త.. నిన్న అల్లుడు దౌర్జన్యం...

ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. టోల్ గేట్ సిబ్బందిపై దేవళ్ల రేవతి వీరంగం సృష్టించి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె టోల్ ప్లాజా ఘటన పై వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే తాజాగా మరో వివాదం వెలుగుచూసింది. తాజాగా రేవతి మేనల్లుడు వడియరాజు వైద్య సిబ్బందిపై దాడి చేశాడంటూ సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. దాచేపల్లిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం లో ట్రీట్ మెంట్ తీసుకుని బిల్లు కట్టకుండా సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తన చికిత్సకు బిల్లు ఇంత అయిందా అని నర్సింగ్ హోం సిబ్బంది పై విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో తాను వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి మేనల్లుడిని అంటూ బెదిరించాడు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఆస్పత్రి వర్గాలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రేవతిపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

బీజేపీ కమలం గుర్తును వెనక్కు తీసుకోవాలని దాఖలైన పిల్

ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల చిహ్నం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన దేశంలో ఎన్నికల సమయంలో అభ్యర్థి ఎవరనే దానికంటే ఆ పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల చిహ్నాన్ని గుర్తు పెట్టుకుని మరీ సామాన్య జనం ఓటు వేస్తారు. ఎవరికైనా బీజేపీ అంటే కమలం, కాంగ్రెస్ అంటే హస్తం, టీఆర్ఎస్ అనగానే కారు, వైసీపీ అంటే ఫ్యాన్, టీడీపీ అంటే సైకిల్ చిహ్నాలు గుర్తుకు వస్తాయి. అయితే తాజాగా బీజేపీకి కేటాయించిన ఎన్నికల చిహ్నం కమలాన్ని వెనక్కు తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన కాళీ శంకర్ గతంలో ఇదే విషయం పై ఈసీని ఆశ్రయించారు. బీజేపీకి కేటాయించిన కమలం గుర్తు మనదేశ జాతీయ పుష్పమని, దీంతో అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలోనూ ఈ గుర్తు కనిపిస్తుందని, కాబట్టి ఈ ఎన్నికల గుర్తును వాడేందుకు ఏ పార్టీకి అనుమతి ఇవ్వొద్దని అయన కోరారు. దీంతో ఈ గుర్తు కలిగిన పార్టీకి అయాచితంగా లబ్ధి చేకూరుతుందని అయన ఆరోపించారు. అయితే, ఆయన చేసిన విజ్ఞప్తిని ఈసీ గతేడాది ఏప్రిల్ లోనే తిరస్కరించింది.   దీంతో ఈ విషయం పై ఆయన తాజాగా అలహాబాద్ హైకోర్టు లో పిల్ దాఖలు చేసారు. అంతేగాకుండా వివిధ రాజకీయ పార్టీలకు కేటాయించే గుర్తులను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకునేలా పరిమితం చేయాలని, వాటిని తమ పార్టీ లోగోలుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వవద్దని అయన తన పిల్ లో కోరారు. పార్టీలు తమ గుర్తులను నిత్యం వాడుకునేందుకు అనుమతి ఇస్తే, ఏ పార్టీతోనూ సంబంధంలేని ఇండిపెండెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈసీని ఆదేశించాలని అయన తన పిల్ లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు.   దీని పై స్పందించిన చీఫ్ జస్టిస్ గోవింద్ మాధుర్, జస్టిస్ పీయూష్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం.. పిల్ లో పేర్కొన్న అంశాలపై తన స్పందనను తెలియజేయాల్సిందిగా ఈసీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం పై తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అలాగే, ఈ పిల్ లో ఇతర రాజకీయ పార్టీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలంటూ కాళీ శంకర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అయితే ఈ పిల్‌పై తమ స్పందనను తెలియజేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.

'ఢిల్లీ మే దోస్తీ'కోసమేనా! కేసీఆర్ టూర్ పై ఠాగూర్ సెటైర్ 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజధానిలో నిర్మించ తలపెట్టిన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపనకే కేసీఆర్ వెళుతున్నారని చెబుతున్నా.. ఆయన షెడ్యూల్ పై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన పర్యటనలో ప్రధాని నరేంద్ర  మోడీని కేసీఆర్ కలవబోతున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  బీజేపీతో సయోధ్య కోసమే టీఆర్ఎస్ అధినేత హడావుడిగా హస్తినకు వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీతో టీఆర్ఎస్ కు గ్యాప్ పెరిగింది. టీఆర్ఎస్ సర్కార్, గులాబీ నేతలపై కేంద్రం నిఘా పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రంతో కయ్యం మంచిది కాదని భావిస్తున్న కేసీఆర్.. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి వెళుతున్నారని చెబుతున్నారు.    సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రం సంధించారు. ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులను కలవడానికి వెళుతున్నారా లేక  ‘ఢిల్లీ మే దోస్తీ’ కార్యక్రమంలో భాగంగా వెళుతున్నారా అని ప్రశ్నించారు. అలా అయితే రైతులకు మద్దతు కేవలం నోటి మాటేనా అని మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. సీపీఐ జాతీయ నేత నారాయణ కూడా కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై హాట్ కామెంట్స్ చేశారు. మోడీతో ఫ్రెండ్ షిప్ కోసమే వెళుతున్నారని, రాష్ట్ర సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.    కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. 16 రోజులుగా వారు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనకు కేసీఆర్ కూడా మద్దతు ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు నష్టమని ఆరోపించారు. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ లోనూ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చిన కేసీఆర్.. ఢిల్లీ పర్యటనలో వారిని కలిసి మద్దతు తెలుపుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేసీఆర్ షెడ్యూల్ లో రైతులతో సమావేశం లేకపోవడం వివాదంగా మారుతోంది. ఇదే విషయాన్ని కోడ్ చేస్తూ విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో దోస్తీ కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నారు.

మహోన్నత నేత 'కిసాన్' గొర్రెపాటి వెంకటసుబ్బయ్య! ఘంటసాలలో ప్రముఖుల నివాళులు

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడిగా పేరు పొందిన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 50 వర్ధంతిని ఘంటసాలలో నిర్వహించారు. సత్రం సెంటర్ లో వున్న కిసాన్ వెంకటసుబ్బయ్య గారి విగ్రహం వద్ద జాతీయ కాంగ్రెస్ కండువాలు , పూలమాల తో నివాళులు అర్పించారు. తర్వాత గ్రామపంచాయతీ వద్ద వున్న కిసాన్ వెంకటసుబ్బయ్య , ఆచార్య ఎన్జీ  రంగా విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గొర్రెపాటి వెంకటసుబ్బయ్య సేవలను స్మరించుకున్నారు నేతలు. దేశం కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం  నిస్వార్ధ కృషి చేసి ' కిసాన్ ' బిరుదు తో ప్రజల హృదయాలలో వెంకట సుబ్బయ్య ధన్యజీవిగా నిలిచిపోయారని పలువురు వక్తలు కొనియాడారు.     కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గాంధిజీ పిలుపుతో దేశ స్వాతంత్ర పోరాటంలోకి దిగారు. తన 20వ ఏటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1920 లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వెయ్యకుండా ఖాళీ పెట్టెలు పంపిన ఘన చరిత్ర ఘంటసాల గ్రామానిది. దేశంలోనే సంచలనంగా మారిన ఈ ఘటనలో తన సహాధ్యాయులు  గొట్టిపాటి బ్రహ్మయ్య, పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్యలతో కలిసి ప్రధాన పాత్ర పోషించారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. మహాత్మా గాంధీ ఘంటసాలలో పర్యటించినపుడు ఖద్దరు నిధికి విరాళాలు పోగుచేసి ఆయన మన్ననలు అందుకున్నారు.1929 లో బ్రిటిషు వారికి నల్ల జెండాలు చూపించి నిరసన తెలిపినందుకు అప్పటి ప్రభుత్వం గొర్రెపాటి వెంకటసుబ్బయ్యని  జైలు లో పెట్టింది. 1939 లో స్వగ్రామంలో జాతీయ జండా ఎగరేసినందుకు ఆయన లాఠీ దెబ్బలు తిన్నారు. 1946 లో అప్పటి బ్రిటిష్ అధికారి రోలాండ్ తో చర్చలు జరిపి పొగాకు రైతులపై విధించిన ఎక్సయిజ్ సుంకాన్ని సడలించటానికి కృషి చేశారు.గొర్రెపాటి వెంకటసుబ్బయ్య సతీమణి సరస్వతమ్మ కూడా భర్తకి తోడుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.    నిర్బంధంగా రైతుల భూముల్ని ప్రభుత్వం ఆక్రమించటానికి వ్యతిరేకంగా గళమెత్తారు వెంకట సుబ్బయ్య. రైతాంగ ఉద్యమ నాయకులుగా  తీవ్ర స్థాయి లో ప్రభుత్వంపై పోరాటం చేశారు. కొల్లేరు , రొంపేరు,తమ్మిలేరు భూములని రైతు కూలీలకు ఇప్పించటానికి గట్టిగా పోరాడారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. రైతుల కోసం  చేసిన కృషికి గుర్తుగా రైతులందరి చేత 'కిసాన్ ' వెంకటసుబ్బయ్య అని ఆప్యాయంగా పిలిపించుకున్నారు. జాతీయ నేత రాజాజీతో ఆయనకి ఎంతో అనుబంధం ఉండేది. ఆ చొరవతోనే రైతులకి అవసరమైన ఎన్నో ప్రయోజనాల్ని సాధించారు. ఒక దశలో రైతులకి న్యాయం చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ని వీడటానికి కూడా సిద్ధపడ్డారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య.  కిసాన్ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య దంపతులిద్దరూ నిరాడంబరంగా నిస్వార్ధంగా ప్రజలకి సేవ చేశారు. అనునిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడేవారు. ఎవరైనా తాము గురువుగా భావించేవారి ఆత్మకథలని వ్రాస్తారు. కానీ తన శిష్యుడైన వెంకట సుబ్బయ్య గారి గురించి ఆయన గురువైన ఆచార్య ఎన్ జి రంగా  "మన కిసాన్ వెంకట సుబ్బయ్య" అనే పుస్తకం రాయడం మరో విశేషం. దీనిని బట్టి వెంకట సుబ్బయ్య గారి నిబద్ధతని అర్ధం చేసుకోవచ్చు.    1949 నుండి 1952 వరకు కృష్ణా జిల్లా బోర్డు ఉపాధ్యక్షులుగా పనిచేశారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. ఆంధ్ర రాష్ట్ర రైతు సమ్మేళన అధ్యక్షుడిగా 1943 నుండి 1970 వరకూ కొనసాగారు. 1959లో రాజాజీ నెలకొల్పిన స్వతంత్ర పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రధమ అధ్యక్షుడిగా పనిచేశారు. గాంధీ స్మారకనిధి సభ్యులుగా పనిచేసారు. ఆచార్య ఎన్ జి రంగా గారికి ప్రియ శిష్యుడిగా, సన్నిహిత సహచరులుగా మెలిగారు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య  నెలకొల్పిన రంగా ట్రస్ట్ లో 1957 నుండి 1970 వరకు సభ్యులుగా ఉన్నారు. 1965 నుండి 1970లో అయన చనిపోయే వరకూ వాహినీ పత్రిక సంపాదకులుగా వ్యవహరించారు.    'కిసాన్ ' వెంకటసుబ్బయ్య గారి మనుమడు, కృష్ణాజిల్లాపరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో పలువురిని సన్మానించారు.  భౌద్ధ గురువు పూజ్య బంతేజా , ఆచార్య NG రంగా వ్యవసాయ పరిశోధన కో ఆర్డినేటర్ కే నాగేంద్రం , కేవీకే కో ఆర్డినేటర్ ఝాన్సీ ద్వారా  కిసాన్ వెంకట సుబ్బయ్య , ఆచార్య NG రంగా ల అనుచరులు  గొర్రెపాటి లీలాకృష్ణయ్య,  గొర్రెపాటి చంద్రశేఖర రావు, అయినపూడి చంద్రశేఖర రావు, గుత్తికొండ సీతా రామాంజనేయులను ఘనంగా సన్మానించారు. ఘంటసాల స్వాతంత్ర సమరయోధుల వారసులు గొర్రెపాటి గోపాలకృష్ణ, ఆకురాతి వేణు గోపాలరావు, వేమూరి గోపాలకృష్ణ , వేమూరి పట్టవర్ధన్ గార్లను కూడా సన్మానించారు.

ఏపీ అడిషనల్ అడ్వకేట్‌ జనరల్‌ గా జాస్తి చలమేశ్వర్ కుమారుడు..

ఏపీలోని జగన్ ప్రభుత్వం జాస్తి నాగభూషణం ను ఏపీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌గా నియమించింది. ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కుమారుడు. అయితే నాగభూషణం చాల కాలంగా జగన్ లీగల్ టీంలో ఒక మెంబర్ గా పని చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం జగన్ ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సమయంలో ఆ బృందంలో నాగభూషణ్ కూడా ఉండడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.   సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన తర్వాత జాస్తి చలమేశ్వర్ కొన్ని నెలల క్రితం.. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలుతో కలిసి సీఎం జగన్ తో భేటీ కావడం జరిగింది. ఆ భేటీ తర్వాత సీఎం జగన్ కోర్టులపై చేస్తున్న పోరాటంలో ఆయన జగన్ బృందానికి సహకరిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ.. సీజేఐకి రాసిన లేఖలోనూ… జాస్తి చలమేశ్వర్ సహకారం ఉందన్న ప్రచారం అప్పట్లో జరిగింది.   ఈ నేపథ్యంలో జాస్తి చలమేశ్వర్ కుమారుడికి ప్రభుత్వ పదవి ఇవ్వడం.. ఇపుడు ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. అయితే జాస్తి నాగభూషణం న్యాయవాది అయినప్పటికీ పెద్దగా పేరు ప్రఖ్యాతులు పొందలేదు... అయనకు పెద్ద పెద్ద కేసులు వాదించిన అనుభవం కూడా లేదని తెలుస్తోంది. అంతేకాకుండా బయటి ప్రపంచానికి అయన జాస్తి చలమేశ్వర్ కుమారుడిగానే పరిచయం. అయినా ఆయనను నేరుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమించడం ఇపుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది.

ఆత్మనిర్భర్ భారత్ ప్రతీకగా పార్లమెంట్ భవనం! ప్రజలకు గర్వ కారణమని ప్రధాని సందేశం 

ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత సహజ మూలాల్లోనే ప్రజాస్వామ్య ఛాయలు ఉన్నాయని, భారతదేశ తత్వచింతన అంతా ప్రజాస్వామ్యం ఆధారంగానే సాగిందన్నారు. దేశంలో ప్రతి ఎన్నికకు ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోండటమే ప్రజాస్వామ్య వ్యవస్థపై దేశ ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు మోడీ. ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాకు భూమి పూజ చేసిన తర్వాత  ప్రధాని నరేంద్ర మోడీ  వర్చువల్ విధానంలో ప్రసంగించారు.  కొత్త పొర్లమెంటు భవనం ఎన్నో విశిష్టతలతో రూపుదిద్దుకోబోతోందని చెప్పారు. పార్లమెంటు పనితీరు మెరుగుదలకు అన్ని హంగులు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.    ప్రస్తుత పార్లమెంటు భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశం చేసిందన్నారు మోడీ.  కొత్తగా  నిర్మిస్తున్న పార్లమెంటు భవనం ఆత్మనిర్భర్ భారత్ కు దిశానిర్దేశం చేయనుందని చెప్పారు. పాత భవనానికి వందేళ్లు పూర్తవుతున్న వేళ కొత్త భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. నూతన పార్లమెంటు భవనం దేశప్రజలందరికీ గర్వకారణమన్నారు ప్రధాని. పార్లమెంటు నూతన భవనం కూడా ఒక దేవాలయమేనని, ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ట చేయాల్సింది రాబోయే తరం ప్రజాప్రతినిధులేనని అభిప్రాయపాడ్డారు. దేశ ప్రజలందరి జీవనాన్ని మెరుగుపరిచే తసోస్థలిగా నూతన పార్లమెంటు భవనం నిలవాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.   పార్లమెంట్ కొత్త  భవనం స్వాతంత్ర్య భారతంలో రూపుదిద్దుకుంటోందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో కీలక మైలురాయి అని ప్రధాని మోడీ వివరించారు. మాగ్నా కార్టా కంటే ముందే భారత్ లో హక్కుల కోసం ప్రయత్నాలు జరిగాయని ప్రస్తావించారు. మాగ్నా కార్టా కంటే ముందే బసవేశ్వరుడు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పారని వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరిగాయని, 10వ శతాబ్దంలోనే తమిళనాడులో పంచాయతీ వ్యవస్థ గురించి వివరించారని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉందని, రుగ్వేదంలోనూ ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావన ఉందని ప్రధాని వివరించారు.

పరిటాల రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు! వైసీపీ ఎంపీకి సునీత స్ట్రాంగ్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, దివంగత పరిటాల రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విరుచుకుపడ్డారు పరిటాల సునీత. రవి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ చరిత్ర ఏమిటో మాకు తెలుసని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ మాదిరి రోడ్డెక్కి మాట్లాడి, విలువను తగ్గించుకోలేమని చెప్పారు. ఇంకోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని సునిత వార్నింగ్ ఇచ్చారు. రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఎస్సీలు, ఎస్టీలు సంతోషంగా ఉన్నారన్నారు పరిటాల సునిత.    దివంగత నేత పరిటాల రవిని ఉద్దేశించి బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. పరిటాల రవి ఫ్యాక్షనిజం, నక్సలిజం పేరుతో ఎంతోమంది తలలను నరికారని ఆయన కామెంట్ చేశారు. చంద్రబాబు అండతో రవి దుర్మార్గాలు చేశారని మాధవ్ ఆరోపించారు. రాప్తాడు ప్రాంతంలోని పొలాలు నీళ్లు లేక ఎండిపోతుంటే... రవి ఆ పొలాలను రక్తంతో తడిపారన్నారు వైసీపీ ఎంపీ. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు  భగ్గుమంటున్నారు.